పాత నిబంధన

రచయిత: కె విద్యా సాగర్

గ్ర‌ంథపరిచయం;,1:1, 1:2, 1:3 , 1:4 , 1:5 , 1:6-8 , 1:9-10 , 1:11-13 , 1:14-19 , 1:20-23 , 1:24-25 , 1:26 , 1:27 , 1:28 , 1:29-31

గ్ర‌ంథపరిచయం;

ఆదికాండము మొదటి అధ్యాయం మొదటి వచనంలోని హీబ్రూపదమైన בְּרֵאשִׁית (bereshit) కు ఆది లేదా ప్రారంభం అనే అర్థం వస్తుంది. ఆ పదం ఆధారంగానే ఈ గ్రంథానికి ఆదికాండము అనే పేరు వచ్చింది, కాండము అనగా గ్రంథం అని అర్థం. ఈవిధంగా ఈ గ్రంథంలో అన్నిటి ప్రారంభాన్నీ మనం చూడగలుతాం. భూమ్యాకాశముల ప్రారంభం (1:1), జీవం యొక్క ప్రారంభం (1:20), మానవుడి యొక్క ప్రారంభం (1:26), ఆరాధన, దేవునితో సహవాసం యొక్క ప్రారంభం (2:19), వివాహం యొక్క ప్రారంభం (2:21), మానవుడి పతన, మరణాలు ప్రారంభం (3:17). వివిధ వృత్తులయొక్క ప్రారంభం (4:2, 21), భాషల యొక్క ప్రారంభం (11:8), ‌అబ్రాహాము సంతానం ద్వారా ఈలోకంలో మెస్సీయ జన్మించాలనే ప్రవచనం యొక్క ప్రారంభం (12:3), ఇలా ఈ గ్రంథంలో అనేకమైన ప్రారంభాలు మనకు కనిపిస్తుంటాయి.

ప్రాచీన యూదుల మరియు యేసుక్రీస్తు, అపోస్తలుల అంగీకారం ప్రకారం ఆదికాండము, నిర్గమకాండము, లేవీకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండాలను మోషే పరిశుద్ధాత్మ ప్రేరణతో రచించాడు (మార్కు 12:26, యోహాను 1:17, 5:46, 7:19, 7:23, ఆపో.కార్యములు 7:37,38, 13:39, 15:1, 28:23). వీటిని యూదులు తోరా అని పిలుస్తారు. ఈ పుస్తకాలను గురించి కొన్ని సందర్భాలలో, ధర్మశాస్త్రం, మోషే ధర్మశాస్త్రం, మోషే అని కూడా రాయబడింది (2 కొరింథీ 3:16 English version, అపో.కార్యములు 21:21, 24:14, లూకా 24:44).

ఆదికాండము

అధ్యాయం 1

వచన వ్యాఖ్యానం

ఆదికాండము 1:1
ఆదియందు దేవుడు భూమ్యాకాశములను సృష్టించెను.

బైబిల్ గ్రంథం ప్రారంభ వచనంలోనే దేవుడు ఉన్నాడనీ, ఆయన ఈ సమస్త సృష్టినీ తన ప్రణాళిక చొప్పున క్రమబద్ధంగా సృష్టించాడనీ తెలుపబడింది. ఈ వాక్యభాగం పైన ఎన్నో సిద్ధాంతాలు ఆధారపడి ఉన్నాయి.

1) ఆదియందు దేవుడు ఉన్నాడు; కాబట్టి దేవుడు లేడనే నాస్తిక మతానికి ఇక్కడ స్థానంలేదు. దేవుడు ఉన్నాడు.

2) ఆదియందు దేవుడు ఉన్నాడు; కాబట్టి అనేక దైవాలను నమ్మే బహుదేవతారాధన మతాలకు ఇక్కడ స్థానం లేదు. దేవుడు ఒక్కడే.

3) ఆదియందు దేవుడు సృజించాడు; కాబట్టి అన్నిటికీ అదృష్టమే ప్రధానం అనే కర్మసిద్ధాంతాన్ని నమ్మడానికి వీలు లేదు, దేవుని చిత్తప్రకారమే అంతా జరుగుతుంది.

4) దేవుడు భూమ్యాకాశాలను సృష్టించాడు; కాబట్టి దేవుడు వేరు, జగత్తు వేరు. సర్వం ఈశ్వరుడే అని చెప్పే, సర్వేశ్వరవాదానికి ఇక్కడ స్థానం లేదు.
దేవుడు ఆత్మ (యోహాను 4:24) ఈ సమస్త సృష్టి దేవుని చేత సృష్టించబడిన పదార్థం మాత్రమే. అందుకే బైబిల్ గ్రంథం సృష్టిలో దేనికైనా దేవుడు అనే హోదాను ఆపాదించి దానిని పూజిస్తే పాపం అని చెబుతుంది.

నిర్గమకాండము 20:3,4
నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశమందేగాని క్రింది భూమియందేగాని భూమిక్రింద నీళ్లయందేగాని యుండు దేని రూపమునయినను విగ్రహమునయినను నీవు చేసికొనకూడదు; వాటికి సాగిలపడకూడదు వాటిని పూజింపకూడదు.

5) దేవుడు భూమ్యాకాశాలను సృష్టించాడు; కాబట్టి భూమ్యాకాశాలు నిత్యమైనవి కావు, సమస్త సృష్టి దేవుని చిత్తానికీ, ఆజ్ఞకు లోబడి పనిచేస్తుంది. దేవుడు మాత్రమే తనకు తానుగా ఉనికిని కలిగి ఉంటాడు.

బైబిల్ గ్రంథంలోని ఈ ప్రారంభవచనం దేవుడు సృష్టిని చేసాడని చెప్పడం మాత్రమే కాదు, ఆ సృష్టిని ఎప్పుడు చేసాడో కూడా తెలియచేస్తుంది. "ఆదియందు" అన్నపుడు దేవుడు కాలాన్ని ఉనికిలోనికి తీసుకునివచ్చిన వెంటనే ఈ సమస్త సృష్టిని కూడా క్రమబద్ధంగా సృష్టించడం ప్రారంభించాడు.

అదేవిధంగా, బైబిల్ గ్రంథంలోని ఈ ప్రారంభ వచనంలోనే మనకు దేవుని యొక్క గుణలక్షణాలు అర్థమౌతున్నాయి. మిగిలిన లేఖనాలన్నీ వాటికి ముక్తకంఠంతో సాక్ష్యమిస్తున్నాయి. వాటిలో కొన్నిటిని మనం పరిశీలిద్దాం.

1) దేవుడు సృష్టికర్త; సృష్టిలో ఉన్న సమస్తాన్ని ఆయనే కలిగించాడు ఆయన లేకుండా ఏదీ కలుగలేదు.

1కోరింథీయులకు 8: 6
మనకు ఒక్కడే దేవుడున్నాడు. ఆయన తండ్రి; ఆయననుండి సమస్తమును కలిగెను.

హెబ్రీయులకు 11: 3
ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవనియు, అందునుబట్టి దృశ్యమైనది కనబడెడు పదార్థములచే నిర్మింపబడలేదనియు విశ్వాసముచేత గ్రహించుకొనుచున్నాము.

2) దేవుడు సార్వభౌముడు; ఈ సమస్త సృష్టినీ సృష్టించిన దేవుడు దానిని సృష్టించకుండా కూడా ఉండగలడు. అయినప్పటికీ తన నిర్ణయం చొప్పున ఈ సమస్తాన్నీ కేవలం తన మహిమకోసం సృష్టించాడు.

కీర్తనలు 19:1
ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి అంతరిక్షము ఆయన చేతిపనిని ప్రచురపరచుచున్నది.

ఎఫెసీయులకు 1: 12
ఆయన తన చిత్తాను సారముగా చేసిన నిర్ణయము చొప్పున సమస్త కార్యములను జరిగించుచున్నాడు.

3) దేవుడు కాలాతీతునిగా ఉనికి కలిగి ఉన్నవాడు; కాలాన్ని ఆయనే కలిగించడం ద్వారా ఆయన కాలానికి ముందు నుండీ ఉనికిలో ఉన్నవాడని మనకు అర్థమౌతుంది. కనుకనే బైబిల్ గ్రంథంలో ఈ దేవుడు యెహోవా అనే పేరుతో పరిచయం చేయబడ్డాడు. యెహోవా అనే పేరుకు ఉన్నవాడని అర్థం.

4) దేవుడు సృష్టికి వేరుగా ఉన్నవాడు; సమస్త సృష్టినీ ఆయనే సృష్టించడం వల్ల ఆయన సృష్టికి వేరుగా ప్రత్యేకంగా ఉనికిని‌ కలిగి ఉన్నవాడని మనకు అర్థం ఔతుంది. సాధారణంగా నాస్తికులు సంధించే ఒక ప్రశ్నను ఆలోచిస్తే హాస్యంగా అనిపిస్తుంది. సర్వజగత్తును సృష్టించిన సృష్టికర్త సర్వజగత్తుకు వేరై ప్రత్యేకంగా ఉంటాడని కనీస అవగాహన కలిగిన ఎవరైనా గ్రహించగలరు. కానీ నాస్తికులు ఆ దేవుణ్ణి ఈ సృష్టిలో ఏదో ఒక చోట చూపించమని అడుగుతుంటారు. వారి ప్రశ్నలోనే వారికున్న‌ తర్కలోపం మనకు అర్థం ఔతుంది. అందుకే కీర్తనలు 53:1లో దేవుడు లేడనేవాడు బుద్దిహీనుడని రాయబడింది. ఏదైనా ఒక చిత్రాన్ని గీసిన వ్యక్తి తాను గీసిన చిత్రానికి వేరుగా ఉంటాడు. ఆ చిత్రంలో ఆ వ్యక్తిని చూపించడం అసాధ్యం. అయినప్పటికీ ఆ గీయబడిన చిత్రాన్ని మనం పరిశీలించినపుడు ఆ వ్యక్తి యొక్క లక్షణాలను, దానిని‌ గీయడం వెనుక ఉన్న ఉద్దేశాన్ని గుర్తించవచ్చు‌. అలాగే సమస్తాన్ని‌ సృష్టించిన దేవుణ్ణి మనం ఈ సృష్టిలో చూపించలేము కానీ, ఆయన చేత సృష్టించబడిన ఈ సృష్టిని మనం పరిశీలించినపుడు ఆయన యొక్క లక్షణాలను గుర్తించవచ్చు.

రోమీయులకు 1:20
ఆయన అదృశ్య లక్షణములు, అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును, జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నవి గనుక వారు నిరుత్తరులైయున్నారు.

5) దేవుడు సర్వశక్తిమంతుడు; ఆయన సృష్టించిన వాటిలో ఆయనను అధిగమించే శక్తి దేనికీ ఉండదు కనుక ఆయన సర్వశక్తిమంతుడు.

నిర్గమకాండము 6:3
నేను సర్వశక్తిగల దేవుడను.

6) దేవుడు సర్వజ్ఞాని: ఆయన సృష్టించినవాటిలో ఆయనకు తెలియనిది ఏదీ ఆయన సృష్టించలేడు కనుక ఆయన సర్వజ్ఞాని.

కీర్తనలు 147:5
మన ప్రభువు గొప్పవాడు ఆయన అధిక శక్తిగలవాడు ఆయన జ్ఞానమునకు మితిలేదు.

యిర్మియా 10: 12
ఆయన తన బలముచేత భూమిని సృష్టించెను, తన జ్ఞానముచేత ప్రపంచమును స్థాపించెను, తన ప్రజ్ఞచేత ఆకాశమును విశాలపరచెను.

7) దేవుడు సర్వవ్యాపి; సమస్తాన్ని ఆయనే సృష్టించి నిర్వహించడం వల్ల ఆయనకు ఆయన సృష్టిలో కనిపించనిది, ఆయన ప్రవేశించలేనిది ఏదీ లేదు.

కీర్తనలు 139:7-10
నీ ఆత్మయొద్ద నుండి నేనెక్కడికి పోవుదును? నీ సన్నిధి నుండి నేనెక్కడికి పారిపోవుదును? నేను ఆకాశమునకెక్కినను నీవు అక్కడను ఉన్నావు నేను పాతాళమందు పండుకొనినను నీవు అక్కడను ఉన్నావు. నేను వేకువ రెక్కలు కట్టుకొని సముద్ర దిగంతములలో నివసించినను అక్కడను నీ చేయి నన్ను నడిపించును నీ కుడిచేయి నన్ను పట్టుకొనును.

హెబ్రీయులకు 4:13
మరియు ఆయన దృష్టికి కనబడని సృష్ఠము ఏదియు లేదు.

దేవుడు సర్వవ్యాపి అనంటే సర్వాంతర్యామి అని అర్థం కాదు. దేవుడు సర్వాంతర్యామి అయితే ఈ సృష్టిలోని ప్రతీవస్తువులోనూ ఆయన భాగంగా ఉన్నాడని‌‌ అర్థం. కానీ బైబిల్ దేవుడు ఈ సృష్టికి వేరుగా ఉన్నాడని మనం చూసాం, అయినప్పటికీ ఆయన ఈ సృష్టిలో తన సన్నిధిని ప్రకాశింపచేసాడు, అవసరమైనపుడు ఆ సన్నిధిని ఆ ప్రదేశం నుంచి ఉపసంహరించుకున్నాడు కూడా.

నిర్గమకాండము 40:34
అప్పుడు మేఘము ప్రత్యక్షపు గుడారమును కమ్మగా యెహోవా తేజస్సు మందిరమును నింపెను.

1సమూయేలు 4:21
దేవుని మందసము పట్టబడినదను సంగతిని, తన మామయు పెనిమిటియు చనిపోయిన సంగతిని తెలిసికొని ప్రభావము ఇశ్రాయేలీయులలో నుండి పోయెనని చెప్పి తన బిడ్డకు ఈకాబోదు అను పేరు పెట్టెను.

8) దేవుడు సర్వసమృద్ధి గలవాడు; దేవుడు ఈ సృష్టిని చెయ్యకముందు కూడా దేవునిగానే ఉన్నాడు కాబట్టి, ఆయన ఈ సృష్టిని చేసింది‌ ఈ సృష్టిపై ఆధారపడడానికో, లేక దీనిద్వారా తనకు లేని మహిమను పొందుకోవడానికో కానేకాదు. తనకున్న మహిమను కనపరచడానికే ఆయన ఈ సృష్టిని చేసాడు. సృష్టించబడిన ప్రతీవస్తువూ ఆయన మహిమను కనపరుస్తుంది.

కీర్తనల గ్రంథము 19:1
ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి అంతరిక్షము ఆయన చేతిపనిని ప్రచురపరచుచున్నది.

యోబు 26: 14
ఇవి ఆయన కార్యములలో స్వల్పములు.ఆయనను గూర్చి మనకు వినబడుచున్నది మిక్కిలి మెల్లనైన గుసగుస శబ్దముపాటిదే గదా. గర్జనలుచేయు ఆయన మహాబలము ఎంతైనది గ్రహింప గలవాడెవడు?

ఆదికాండము 1:2
భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను; చీకటి అగాధ జలము పైన కమ్మియుండెను; దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను.

మొదటి వచనంలో దేవుడు భూమ్యాకాశాలను సృజించినట్టు రాయబడితే ఈ రెండవ వచనంలో ఆ భూమి నిరాకారంగానూ, శూన్యంగానూ ఉన్నట్టు, చీకటి అగాధజలాలపైన కమ్మియున్నట్టు రాయబడింది. దీనిపై కొందరు బైబిల్ పండితులు యెషయా 45:18 లోని "ఆయన భూమిని కలుగజేసి దాని సిద్ధపరచి స్థిరపరచెను. నిరాకారముగానుండునట్లు ఆయన దాని సృజింప లేదు నివాసస్థలమగునట్లుగా దాని సృజించెను" అనే మాటలనూ మరియు యిర్మియా 4:23 లోని "నేను భూమిని చూడగా అది నిరాకారముగానూ శూన్యముగానూ ఉండెను, ఆకాశము తట్టు చూడగా అక్కడ వెలుగు లేకపోయెను" అనే మాటలను కూడా ఆధారం చేసుకుని ప్రారంభంలో దేవుడు ఈ భుమ్యాకాశాలను నివాసయోగ్యంగా‌ సృష్టించినపుడు, పరలోకంలో దేవునిపైన తిరుగుబాటు చేసిన కేరూబు కారణంగా (పడద్రోయబడడం వల్ల) ఈ భూమి శూన్యంగా నిరాకారంగా మారిందని చెబుతుంటారు (యెహెజ్కేలు 28:13-16, ప్రకటన 12:7-9). ఆ వాదన ప్రకారం మొదటి వచనానికీ రెండవ వచనానికీ మధ్య కొన్ని కోట్లసంవత్సరాలు గడచింది. అపవాది కారణంగా పాడైపోయిన భూమినే దేవుడు మరలా ఈ రెండవ వచనం నుండి బాగుచేస్తున్నాడు, దీనినే "గ్యాప్ థియరీ" అంటారు.

అయితే మేము ఈ థియరీతో విభేదించడానికి గల కారణాలను గమనిద్దాం. అవేంటంటే,

1) మొదటి దినాన దేవుడు భూమిని సృష్టించాడు కానీ అది ఇంకా నివాసయోగ్యంగా చేయబడలేదు. ఆ పనినే దేవుడు క్రమంగా ఆరు దినాల్లో చేస్తూ వచ్చాడు. భూమిని నివాసయోగ్యంగా తీర్చిదిద్దాడు. ఒక కుమ్మరి ఒక మట్టి ముద్దను తీసుకుని ఒక అందమైన ఆకారంలోకి మలచి, దానిని ఎలా రూపుదిద్దుతాడో, అలాగే దేవుడు ఈ భూమిని అందంగా రూపుదిద్దాడు.

2) గ్యాప్ థియరీని నమ్మేవారు చూపించే యెషయా గ్రంథంలోని మాటలు, యిర్మియాలోని మాటలు సందర్భానుసారంగా మనం అర్థం చేసుకుంటే అవి ఎంతమాత్రమూ ఆ థియరీకి అనుకూలంగా లేవు.

(A) ఆరుదినాల్లో నివాసయోగ్యంగా సృష్టించబడిన భూమి గురించి యెషయా గ్రంథంలో రాయబడింది. మొదటివచనంలో సృష్టించబడిన భూమి గురించి కానే కాదు. ఎందుకంటే ఆ సందర్భంలో నరులు కూడా ఉన్నారు చూడండి. గేప్ థియరీ ప్రకారం దేవుడు మొదటివచనంలో సృష్టించిన భూమిలో నరులు లేరు కదా!.

యెషయా గ్రంథము 45:11,12
ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడగు సృష్టికర్తయైన యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు రాగలవాటినిగూర్చి నన్నడుగుదురా? నా కుమారులను గూర్చియు నా హస్తకార్యములను గూర్చియు నాకే ఆజ్ఞాపింతురా? భూమిని కలుగజేసినవాడను నేనే దానిమీదనున్న నరులను నేనే సృజించితిని నా చేతులు ఆకాశములను విశాలపరచెను వాటి సర్వసమూహమునకు నేను ఆజ్ఞ ఇచ్చితిని.

(B) ఇక యిర్మియా గ్రంథంలోని మాటలు ఇశ్రాయేలు దేశానికి రాబోతున్న కీడు గురించి అలంకారంగా చెప్పబడిన మాటలు ఆ సందర్భం చూడండి.

యిర్మీయా 4:20-27
కీడు వెంట కీడు వచ్చుచున్నది, దేశమంతయు దోచుకొనబడుచున్నది, నా గుడారములును హఠాత్తుగాను నిమిషములో నా డేరా తెరలును దోచు కొనబడియున్నవి. నేను ఎన్నాళ్లు ధ్వజమును చూచు చుండవలెను బూరధ్వని నేనెన్నాళ్లు వినుచుండవలెను? నా జనులు అవివేకులు వారు నన్నెరుగరు, వారు మూఢు లైన పిల్లలు వారికి తెలివిలేదు, కీడుచేయుటకు వారికి తెలియును గాని మేలు చేయుటకు వారికి బుద్ది చాలదు. నేను భూమిని చూడగా అది నిరాకారముగాను శూన్యముగాను ఉండెను; ఆకాశముతట్టు చూడగా అచ్చట వెలుగులేకపోయెను. పర్వతములను చూడగా అవి కంపించుచున్నవి కొండలన్నియు కదులుచున్నవి. నేను చూడగా నరుడొకడును లేకపోయెను, ఆకాశపక్షు లన్నియు ఎగిరిపోయియుండెను. నేను చూచుచుండగా ఫలవంతమైన భూమి యెడారి ఆయెను, అందులోని పట్టణములన్నియు యెహోవా కోపాగ్నికి నిలువలేక ఆయన యెదుట నుండకుండ పడగొట్టబడియుండెను. యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడుఈదేశమంతయు పాడగును గాని నిశ్శేషముగా దాని నాశనము చేయను.

"భూమి నిరాకారముగానూ, శూన్యముగానూ ఉండెను, చీకటి అగాధజలములపై కమ్మియుండెను"

ఆదియందు దేవుడు భూమ్యాకాశములను సృష్టించాడు అన్నపుడే ఈ సృష్టిలో ఏదైనా ఉనికిలోకి వచ్చింది. చీకటి‌కూడా అప్పుడే సృష్టించబడింది. అయితే కొందరు దేవుడు వెలుగును సృష్టించినట్టు రాయబడింది కానీ, చీకటిని సృష్టించాడని రాయబడలేదు కాబట్టి చీకటి ముందునుండే ఉనికిలో ఉందని అభిప్రాయపడుతుంటారు. కానీ, దేవుడు చీకటిని సృష్టించనప్పటికీ అది సృష్టిలో ఉన్నట్టైతే ఆ చీకటి self existent (స్వయం ఉనికి) అని ఒప్పుకోవలసి వస్తుంది. అది అసాధ్యం ఎందుకంటే, దేవుడు మాత్రమే తనకు తానుగా ఉనికి కలిగియున్నవాడు. కాబట్టి ఈ సృష్టిలో ఉన్నట్టుగా రెండవ వచనంలో రాయబడిన ప్రతీదీ ఆయన చేత మొదటివచనంలో సృష్టించబడిందే. ఆయన ఈ సృష్టిని చెయ్యకముందు ఏదీ కూడా (అగాధజలాలైనా, చీకటైనా) ఉనికిలో లేదు‌ (సామెతలు 8:24). దీనిని పరిమితమైన మనం అర్థం చేసుకోవడం కొంచెం కష్టంగా ఉన్నప్పటికీ ఇదే సత్యం, తర్కబద్దంకూడా. బైబిల్ లో కొన్నిసార్లు పాపాన్ని చీకటితో పోల్చినప్పటికీ చీకటిలో మనకేమీ కనిపించదు కాబట్టి, చీకటిలో ప్రయాణిస్తే పడిపోయే అవకాశం ఉంది కాబట్టి అలా అలంకారంగా పోల్చబడిందే తప్ప మనం రాత్రివేళ చూస్తున్న చీకటి నిజంగా చెడ్డదనే ఉద్దేశంతో కాదు. ఒకవేళ చీకటే చెడ్దదైతే, దేవుడు దానిని ఎందుకని సృష్టించాడు? లేక రోజులో సగం అదే ఉండేలా ఎందుకు నియమించాడు? ప్రాముఖ్యంగా 31వ వచనంలో ఆయనచేసింది యావత్తూ మంచిదిగా ఉండెను అన్నపుడు ఆ ఆరుదినాలలోనూ వెలుగుతో పాటు చీకటి కూడా ఉంది. దాని ప్రకారం చీకటి కూడా మంచిదే. చీకటే లేకపోతే మనిషి తన‌పని ముగించుకుని ఎలా నిద్రపోగలడు? ఒకవేళ కొందరు భావిస్తున్నట్టు ఈ రెండవ వచనంలోని భూమిపై ఉన్న చీకటి కానీ, అగాధజాలాలు కానీ అపవాది కారణంగా వచ్చిన దైవశాప పర్యవసానాలే అయితే ఆయన ఆరు దినాల్లో సృష్టిని చేస్తున్నపుడు వాటిని తప్పకుండా తొలగించియుండేవాడు.

ఇక భూమి నిరాకారంగా, శూన్యంగా ఉన్నదంటే దానికి ఎటువంటి ఆకారమూ లేదని అర్థం కాదు. ఎందుకంటే, ఆయన మొదటివచనంలోనే భూమిని సృష్టించాడు. కానీ, ఆ భూమి దేవుడు ఆశించినట్టుగా నివాసయోగ్యంగా (పరిపూర్ణ ఆకారంలో) అప్పటికి ఇంకా మరల్చబడలేదు కాబట్టి, దానిని గ్రంథకర్త నిరాకారంగా ఉందని, ఆ భూమిపై ఎటువంటి జీవరాశులు కానీ, వృక్షాలు కానీ లేవు కాబట్టి శూన్యంగా కూడా ఉందని పేర్కొన్నాడు. ఐతే కొందరు దేవుడు తలచుకుంటే ఒక్క క్షణంలో ఈ భూమిని నివాసయోగ్యంగా చేయగలడు కదా, అలాంటపుడు మొదటిగా దానిని నిరాకారంగా శూన్యంగా ఎందుకు చేసాడని ప్రశ్నిస్తుంటారు. కానీ, ఆయన ఒక్క క్షణంలో ఈ సృష్టిని చేయశక్తిగలవాడు అయినప్పటికీ ఆయన దానిని అలానే చెయ్యాలా లేక ఎక్కువ సమయంలో చెయ్యాలా అనేది పూర్తిగా ఆయన ఇష్టం. ఒకవేళ ఇదే ప్రశ్నను మనం పరిగణలోకి తీసుకుంటే, యేసుక్రీస్తు ప్రభువు ఎంతోమందిని తన వాక్కుచేత వెంటనే స్వస్థపరిచాడు, కానీ ఒక గ్రుడ్డివాడి విషయంలో వాడి కళ్ళపై బురదరాసి ఒక కోనేటికి వెళ్ళి కడుక్కోమన్నాడు (యోహాను 9:6,7). అంటే ఇక్కడ యేసుక్రీస్తు వాడిని వెంటనే స్వస్థపరచలేకనే అంత సమయం తీసుకున్నాడని అనుకోవాలా? లేదు కదా!. ఈ భూమి విషయంలో కూడా మనం అలానే ఆలోచించాలి. నామట్టుకు నేను ఆయన ఈ భూమిని ఆరుదినాల సమయంలోనే ఎందుకు చేయవలసి వచ్చింది అనేదానికి, ఆరు దినాలు పని చేసి ఏడవ దినాన విశ్రాంతి తీసుకోవాలనే దానిని మనకు నేర్పించడానికే అని భావిస్తాను.

నిర్గమకాండము 20: 11
ఆరు దినములలో యెహోవా ఆకాశమును భూమియు సముద్రమును వాటిలోని సమస్తమును సృజించి, యేడవ దినమున విశ్ర మించెను; అందుచేత యెహోవా విశ్రాంతిదినమును ఆశీర్వదించి దాని పరిశుద్ధపరచెను.

"దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను".

బైబిల్ గ్రంథం దేవుడు ఒకడే అని ఖచ్చితంగా చెబుతూ ఆ దేవుడు అనే హోదాను ముగ్గురు వ్యక్తులకు సమానంగా ఆపాదిస్తుంది. వారే తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు. ఒకే దేవుడు ముగ్గురు వ్యక్తులుగా నిత్యత్వంలో తన ఉనికిని చాటుకున్నట్టుగా బయలుపరచబడిన ఈ లేఖనసారాంశానికే క్రైస్తవ సంఘం ‘త్రిత్వం’ అని నామకరణం చేసింది. దీనిగురించి మరింత వివరంగా తెలుసుకునేందుకు ఈ లింక్ ద్వారా సూచించబడిన వ్యాసం చదవండి.

త్రిత్వ సిద్ధాంత నిరూపణ

ఈ రెండవ వచనంలో త్రిత్వంలో మూడవ వ్యక్తియైన పరిశుద్ధాత్ముడు దేవునితో కలసి సృష్టిని చేయడంలో పనిచేస్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది.
"అల్లాడుచుండెను" అన్నప్పుడు దేవుడు చేస్తున్న సృష్టిని ఆయన భద్రపరుస్తున్నాడని/క్రమంలోకి తీసుకువస్తున్నాడని మనం అర్థం చేసుకోవాలి ఉదాహరణకు ఈ వచనం చూడండి.

ద్వితియోపదేశకాండము 32: 11
పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లలపైని "అల్లాడుచు" రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయునట్లు యెహోవా వానిని నడిపించెను.

ఒకవేళ ఇక్కడ చెప్పబడుతున్న దేవునిఆత్మ మరియు పరిశుద్ధాత్ముడు ఒక్కరేనా అనే సందేహం కలిగితే ఈ లేఖన భాగాలను పరిశీలించండి.

మత్తయి 3:16
యేసు బాప్తిస్మము పొందిన వెంటనే నీళ్లలోనుండి ఒడ్డునకు వచ్చెను; ఇదిగో ఆకాశము తెరవబడెను, దేవుని ఆత్మ పావురమువలె దిగి తనమీదికి వచ్చుట చూచెను.

ఈ వచనంలో యేసుక్రీస్తు బాప్తీస్మము పొందగానే దేవుని ఆత్మ ఆయన పైకి ‌వచ్చినట్టుగా రాయబడింది. దీనికి సంబంధించిన మరో వచనాన్ని కూడా చూద్దాం.

మార్కు 1:9,10
ఆ దినములలో యేసు గలిలయలోని నజరేతునుండి వచ్చి యొర్దానులో యోహాను చేత బాప్తిస్మము పొందెను. వెంటనే ఆయన నీళ్లలోనుండి ఒడ్డునకు వచ్చుచుండగా ఆకాశము చీల్చబడుటయు, పరిశుద్ధాత్మ పావురమువలె తనమీదికి దిగివచ్చుటయు చూచెను.

బాప్తీస్మం సమయంలో యేసుక్రీస్తు పైకి వచ్చిన దేవుని‌ ఆత్మ, పరిశుద్ధాత్ముడే అని ఈ వచనంలో మనకు స్పష్టం చెయ్యబడింది. బైబిల్ గ్రంథంలో త్రిత్వంలో మూడవ వ్యక్తియైన పరిశుద్ధాత్ముడు దేవునిఆత్మగానే కాకుండా, ప్రభువగు యెహోవా ఆత్మ, క్రీస్తు ఆత్మ, ఆదరణకర్త, సత్యస్వరూపియగు ఆత్మ, కృపకు మూలమగు ఆత్మ, యెహోవా ఆత్మ, యేసు ఆత్మ, ఇలాంటి నామములతో సంబోధించబడడం మనం చూస్తాం. ఈ అన్ని సందర్భాలలోనూ రాయబడింది త్రిత్వంలో మూడవ వ్యక్తియైన పరిశుద్ధాత్ముని గురించే అని మనం అర్థం చేసుకోవాలి.

ఈవిధంగా త్రిత్వంలో మూడవ వ్యక్తి అయిన పరిశుద్ధాత్ముడు దేవునితో కలసి సృష్టిని చేసాడు. పరిశుద్ధాత్ముడే కాదు త్రిత్వంలో రెండవ వ్యక్తి అయిన యేసుక్రీస్తు ప్రభువు కూడా దేవునితో కలసి సృష్టిని చేయడంలో సమానంగా పనిచేసారు. సృష్టి చేయబడిందే ఆయన మూలంగా అని బైబిల్ ఖచ్చితంగా తెలియచేస్తుంది.

యోహాను 1:3
కలిగియున్నదేదియు ఆయన (క్రీస్తు) లేకుండ కలుగలేదు.

కొలొస్సయులకు 1:15-17
ఆయన(క్రీస్తు) అదృశ్యదేవుని స్వరూపియై సర్వసృష్టికి ఆదిసంభూతుడైయున్నాడు. ఏలయనగా ఆకాశమందున్నవియు భూమియందున్నవియు, దృశ్యమైనవిగాని, అదృశ్యమైనవిగాని, అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను, సర్వమును ఆయనయందు సృజింపబడెను, సర్వమును ఆయన ద్వారాను ఆయననుబట్టియు సృజింపబడెను. ఆయన అన్నిటికంటె ముందుగా ఉన్నవాడు; ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు.

అదేవిధంగా, దేవుడు ఈ భూమిని సృష్టిస్తున్నపుడు దేవదూతలు కూడా ఆయనతో ఉన్నట్టు మనకు లేఖనాలు తెలియచేస్తున్నాయి.

యోబు 38:7
ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు దేవదూతలందరును ఆనందించి జయధ్వనులు చేసి నప్పుడు దాని మూలరాతిని వేసినవాడెవడు?

ఐతే దేవదూతలు దేవునివలే నిత్యులు కాదు, వారు కూడా ఆయన సృష్టిలో భాగమే.

కీర్తనల గ్రంథము 148:1-5
యెహోవాను స్తుతించుడి. ఆకాశవాసులారా, యెహోవాను స్తుతించుడి ఉన్నతస్థలముల నివాసులారా, ఆయనను స్తుతించుడి ఆయన దూతలారా, మీరందరు ఆయనను స్తుతించుడి ఆయన సైన్యములారా, మీరందరు ఆయనను స్తుతించుడి యెహోవా ఆజ్ఞ ఇయ్యగా అవి పుట్టెను అవి యెహోవా నామమును స్తుతించును గాక.

కానీ, యోబుగ్రంథంలోని మాటల ప్రకారం ఆయన భూమిని సృష్టిస్తున్నప్పటికే వారున్నారు కాబట్టి, వారి సృష్టి ఈ భూమికంటే ముందుగానే జరిగింది (బహుశా కొంతసేపటి క్రితం).

ఆదికాండము ‌1:3
దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను.

ఈ వచనంలో దేవుడు తన వాక్కుతో వెలుగును సృష్టించినట్టు మనం చూస్తాం. క్రైస్తవ్యంలో కొందరు ఈ వచనాలను వేరు వేరు విధాలుగా అపార్థం చేసుకున్నారు; అవేంటో మొదటిగా చూద్దాం.

యోహాను 1:4
ఆయనలో జీవముండెను; ఆ జీవము మనుష్యులకు వెలుగైయుండెను.

యేసుక్రీస్తు గురించి రాయబడిన ఈ మాటలను కొందరు ఆధారంగా చేసుకుని ఆదికాండం 1:3లో దేవుడు కలిగించిన వెలుగు యేసుక్రీస్తు ప్రభువే అని, ఆయన ద్వారా సృష్టికి వెలుగునివ్వడానికి ముందుగా ఆయన్ని కలిగించాడని చెబుతుంటారు.
ఇది పూర్తిగా అసంబద్ధం.

యోహాను 1: 3
కలిగియున్నదేదియు ఆయన లేకుండ కలుగలేదు.

ఈ వచనం ప్రకారం కలిగియున్నదేదీ యేసుక్రీస్తు లేకుండా కలుగలేదు‌, అలాంటప్పుడు దేవుడు వెలుగును చేయడానికి ముందు భూమ్యాకాశములు ఎలా‌ కలిగాయి? కలిగియున్నదేదీ ఆయనలేకుండా కలగనప్పుడు ఆయన లేకుండా ఆయనెలా కలిగాడు. యేసుక్రీస్తు ఒకానొక సమయంలో దేవుని చేత కలిగింపబడినవాడు కాదు, దేవునితోపాటుగా నిత్యత్వంలో ఉనికి కలిగి ఉన్నవాడు. దీనిగురించి మరింత‌ వివరంగా తెలుసుకోడానికి ఈ లింక్ ద్వారా సూచించబడిన వ్యాసం చదవండి.

యేసుక్రీస్తు నిత్యుడు కాదా? పరలోకంలో పుట్టినవాడా?

కొందరైతే బైబిల్‌లోని మిగిలిన సందర్భాలలో ఆత్మసంబంధమైన రక్షణను సూచిస్తూ ప్రస్తావించిన వెలుగు, ఆదికాండం 1:3లో చెప్పబడిన వెలుగు ఒకటే అని పొరపడుతుంటారు. ఆదికాండం 1:3లో చెప్పబడిన వెలుగు ప్రకృతిసంబంధమైన వెలుగు. మనం ప్రతీరోజూ ఉదయం నుండి రాత్రి అయ్యేవరకూ అనుభవిస్తున్నటువంటి వెలుగు. యోహాను 1:4లో చెప్పబడుతున్న యేసుక్రీస్తు ద్వారా కలుగుతున్న వెలుగు ఆత్మసంబంధమైన వెలుగు,
ఇవి రెండూ ఒకటి కాదు.

ఆదికాండము 1:4
వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను; దేవుడు వెలుగును చీకటిని వేరుపరచెను.

ఈ వచనంలో దేవుడు సృష్టించిన వెలుగు మంచిగా ఉన్నట్టు మనం చూస్తాం. సృష్టింపబడింది ఏదైనా అది సృష్టికర్త ఉనికిని చాటేలా ఉంటుంది. సృష్టికర్త తనలో లేనిదేదీ సృష్టిలో చొప్పించలేడు.

"వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను"

కేవలం వెలుగు మాత్రమే కాదు కానీ దేవుడు చేసిన ప్రతీదీ ప్రారంభంలో మంచిగానే ఉంది (అదికాండము 1:31). దేవుడు మంచివాడు కనుక ఆయన చేసే ప్రతీదీ మంచిగానే ఉంటుంది.

యిర్మియా 33: 11
యెహోవా మంచివాడు, ఆయన కృప నిరంతరముండును.

కీర్తనలు 92: 14
నాకు ఆశ్రయ దుర్గమైన యెహోవా యథార్థవంతుడనియు ఆయనయందు ఏ చెడుతనమును లేదనియు ప్రసిద్ధి చేయుటకై-

1యోహాను 1: 5
మేమాయన వలన విని మీకు ప్రకటించు వర్తమానమేమనగా దేవుడు వెలుగైయున్నాడు; ఆయనయందు చీకటి ఎంతమాత్రమును లేదు.

ఈ విధంగా మంచివాడైన దేవుడు సృష్టించిన సమస్తమూ ఆదాము హవ్వలు పాపం చేసేవరకూ మంచిగానే ఉంది. తరువాత వారి పాపపు పర్యవసానంగానే ఈ లోకంలోకి సమస్తమైన చెడూ ప్రవేశించింది. ఇక్కడ మీకు దేవుడు సృష్టించిన సమస్తమూ మంచిగానే ఉంటే ఆదాము హవ్వలు పాపం చేసేవరకూ లోకంలో ఏ చెడూ లేకపోతే ఆ తరువాతకూడా చెడు ఎలా సృష్టించబడిందనే సందేహం రావొచ్చు. లోకంలో చెడును ఎవరూ సృష్టించలేదు. దేవుని సృష్టిలో మంచికి పోటీగా ఉన్న చెడును కూడా ఎవరైనా సృష్టించినట్టైతే దేవునితో పాటుగా మరో సృష్టికర్త కూడా ఉన్నాడని మనం ఒప్పుకోవాలి.

మరి చెడు ఈ లోకంలో‌ ఎలా ప్రవేశించిందో చూద్దాం. మనం ఇనుముతో ఏదైన ఒక ఉపకరణాన్ని సృష్టిస్తాము కానీ తుప్పును సృష్టించము. ఇనుము తన స్వభావాన్ని కోల్పోయి తుప్పుగా మారుతుంది. అలాగే దేవుడు సమస్తాన్ని మంచిగా సృష్టించాడు కానీ ఆదాము హవ్వల పాపపు ఫలితంగా సృష్టిలోని మంచి తన స్వభావాన్ని కోల్పోయి చెడుగ మారింది. దీనికి కారణం ఆదిదంపతులు, వారిని ప్రేరేపించిన సాతానుడే.

"దేవుడు వెలుగును చీకటిని వేరుపరచెను"

ఈ సందర్భంలో దేవుడు వెలుగును సృష్టించడానికి ముందు ఉన్న చీకటినీ తరువాత సృష్టించబడిన వెలుగునూ వాటివాటి సమయంలో భూమిపై ప్రసరించేలా వేరుచేసినట్టు మనం చూస్తాం. ఇదంతా సమస్త సృష్టిలో జరుగుతున్నది కాకుండా, నరులకు నివాసయోగ్యంగా తీర్చిదిద్దబడుతున్న భూమిపై మాత్రమే జరుగుతున్న కార్యం. కొందరు దేవుడు వెలుగు చీకట్లను ఏవిధంగా వేరుపరిచాడని ప్రశ్నిస్తుంటారు. ఇది మనుషులు ఎప్పటికీ తెలుసుకోలేరని స్వయంగా దేవుడే సవాల్ విసురుతున్నాడు.

యోబు గ్రంథము 38:19-24
వెలుగు నివసించు చోటునకు పోవు మార్గమేది? చీకటి అనుదాని ఉనికిపట్టు ఏది? దాని సరిహద్దునకు నీవు వెలుగును కొనిపోవుదువా? దాని గృహమునకు పోవు త్రోవలను నీవెరుగుదువా? ఇదంతయు నీకు తెలిసియున్నది గదా. వెలుగు విభాగింపబడు చోటికి మార్గమేది?

ఆదికాండము‌ 1:5
దేవుడు వెలుగునకు పగలనియు, చీకటికి రాత్రి అనియు పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయెను.

ఈ వచనంలో దేవుడు తాను సృష్టించిన వెలుగు, చీకట్లకు పేర్లు పెడుతున్నట్టు మనం చూస్తాం. కేవలం పేర్లు పెట్టడం మాత్రమే కాక అవి ఎప్పటికీ అలానే కొనసాగేటట్టుగా వాటికి కట్టడ (నిబంధన) కూడా చేస్తున్నాడు.

యిర్మీయా 33:25,26
యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు "పగటినిగూర్చియు రాత్రినిగూర్చియు నేను చేసిన నిబంధన" నిలకడగా ఉండని యెడల భూమ్యాకాశములను గూర్చిన విధులను నియమించువాడను నేను కానియెడల, అబ్రాహాము ఇస్సాకు యాకోబుల సంతానమును ఏలుటకు అతని సంతాన సంబంధియైన యేలికను ఏర్పరచుకొనక నేను యాకోబు సంతానపువాడగు నా సేవకుడైన దావీదు సంతానమును విసర్జింతును. నిశ్చయముగా నేను వారియెడల జాలిపడి చెరలోనుండి వారిని రప్పించెదను.

"అస్తమయము ఉదయము కాగా ఒక దినమాయెను"

దేవుడు ఈ భూమిపై వెలుగును ప్రకాశింపచెయ్యడానికంటే ముందు చీకటి ఉంది (సృష్టించబడింది) తరువాత ఆయన వెలుగును ప్రకాశింపచేసాడు. అందుకే హెబ్రీయుల సంస్కృతిలో వారు రాత్రిని (అస్తమయం) ఉదయాన్ని (పగలు) కలిపి ఒక రోజుగా గుర్తిస్తారు. దేవుడు మొదటి వచనంలో భూమ్యాకాశాలను సృష్టించిన సమయం నుండీ వెలుగును సృష్టించేంతవరకూ దినంలో సగం సమయం చీకటితో (అస్తమయం) గడచింది. వెలుగును సృష్టించాక మిగిలిన సగం దినం గడచింది. ఈ రెండూ కలిపే (అస్తమయం, ఉదయం) ఇక్కడ ఒక దినమని చెప్పబడింది.

ఐతే, ఈ అధ్యాయం అంతటిలో చెప్పబడుతున్న ఆరు దినాల గురించి కొందరు అవి 24 గంటల వ్యవధి గల దినాలు కావని కొన్ని కోట్ల సంవత్సరాలకు సమానమని భావిస్తారు. వారలా భావించడానికి ప్రధానంగా రెండు కారణాలు ఉన్నాయి.

(1) ఈ భూమి పుట్టి ఎన్నో కోట్ల సంవత్సరాలు గడచిందని సైన్స్ ప్రపంచం చెబుతుండడం.
(2) ఈ అధ్యాయంలో దేవుడు నాలుగవ దినాన సూర్యున్ని చేసినట్టు ఉంటుంది కాబట్టి, సూర్యుడు లేకుండా మొదటి నాలుగు దినాలు మన దినాలవలే గడవవని భావించడం.

సరైనవిధంగా ఆలోచిస్తే వీరు చూపించే రెండు కారణాలలోనూ ఉన్న లోపాలను మనం సులభంగా గుర్తించవచ్చు. మొదటిగా ఏదైనా ఒక వస్తువు ఎంతకాలం నుండి ఉనికిలో ఉందనేది నిర్థారించడానికి సైన్స్ "కార్బన్ డేటింగ్" అనే ప్రక్రియ పైన ఆధారపడుతుంది. ఈరోజు సైన్స్ ప్రపంచం ఒక వస్తువు ఇన్ని వేల సంవత్సరాల క్రితంది అని చెబుతుందంటే కార్బన్ డేటింగ్ (C-14 ఐసోటోపు) వంటి పరీక్షలు చెయ్యడమే ప్రధానమైన కారణం. సైన్స్ ప్రపంచం ఈ పరీక్షపైన ఆధారపడే ఈ భూమి ఎన్నోకోట్ల సంవత్సరాల క్రితం నుండి ఉనికిలో ఉన్నదని చెబుతుంది, కానీ ఇది శుద్ధతప్పు. కొందరు శాస్త్రవేత్తలు వెల్లడించిన నివేదికల ప్రకారం కార్బన్‌ డేటింగ్ ద్వారా 3000 వేల సంవత్సరాల వరకూ తప్ప అంతకంటే ముందుకెళ్ళి ఖచ్చితంగా ఆ వస్తువు ఎంతకాలం ముందటిదో చెప్పలేదు. మూడు వేల సంవత్సరాలు మాత్రమే ఖచ్చితం, ఆ తరువాత కేవలం అంచనా మాత్రమే. కాబట్టి భూమి కొన్ని కోట్ల సవత్సరాల నుండే ఉనికిలో ఉందని సైన్స్ చెప్పిన మాటల‌ ఆధారంగా ఏర్పడిన ఈ అభిప్రాయం నమ్మడానికి‌ వీలులేదు. ఒకవేళ సైన్స్ చెబుతున్నట్టుగా భూమిపుట్టి కొన్ని కోట్ల సంవత్సరాలు గడచిందనేది వాస్తవమే అయినప్పటికీ, ఈ అధ్యాయంలో చెప్పబడుతున్న ఆరుదినాలూ సామాన్య దినాలు కావని చెప్పడానికి అవకాశం ఉండదు.

ఎందుకో ఈ ఉదాహరణ చూడండి. దేవుడు ఆదామును సృష్టించిన దినాన అతని శరీరానికి మన శరీరం వలే ప్రారంభ దశ లేదు. మనవలే పసితనం లేదు కానీ, తోటను సేద్యపరచి కాపుకాచే యవ్వనుడుగా ఆదాము శరీరం చేయబడింది. ఒకవేళ ఆదాము శల్యాలు కనుక మనకిప్పుడు లభ్యమై, అతను ఎన్ని సంవత్సరాలు జీవించాడో కచ్చితంగా తెలియచెయ్యగలిగే సైన్స్ లేబ్ కి ఆ శల్యాలను పంపగలిగితే ఆదాము వయస్సు గురించి బైబిల్ చెప్పినదానికీ, ఆ లేబ్ రిపోర్ట్ చెప్పేదానికీ కచ్చితంగా తేడా వస్తుంది. లేబ్ రిపోర్ట్ ఏమో ఆదాము వయసును అతని శరీరప్రారంభ దశనుండీ చెబుతుంది. బైబిల్ ఐతే ఆదాము వయసును అతను యవ్వనుడుగా దేవునిచేత సృష్టించబడిన దినం నుండే చెబుతుంది. ఇవి రెండూ వాస్తవాలే.

అలాగే దేవుడు వృక్షాలను కూడా చిన్నచిన్నమొక్కలుగా నాటి పెద్దవిగా సంవత్సరాల పాటుగా ఎదిగేలా చేయలేదు కానీ ఒకేరోజులో వాటిని పెద్దవిగా సృష్టించాడు. వాటివయస్సును తెలుసుకోవాలని కనుక మనం పరీక్షిస్తే, వాటి ఫలితాలు ఆ వృక్షాలు విత్తనాలుగా, మొక్కలుగా ప్రారంభమై ఎదిగిన స్థితినుండీ వస్తుంది. బైబిల్ ఐతే దేవుడు వాటిని పెద్దపెద్ద వృక్షాలుగా ఒకేరోజులో చేసినట్టుగా చెబుతుంది.

ఈవిధంగా దేవుడు ఈ సమస్త సృష్టినీ ఆరుదినాల్లో అద్భుతంగా సృష్టించి భూమిని నివాసయోగ్యంగా మార్చాడు. ఒకవేళ సైన్స్ లో భూమియొక్క, సృష్టి యొక్క వయస్సును కచ్చితంగా చెప్పే ఫార్ములా ఉండి టెస్టింగ్ చేయడం ప్రారంభిస్తే ఈ భూమి, ఈ సమస్త సృష్టీ ప్రారంభం నుండీ సహజంగా ఎంత సమయంలో అభివృద్ది చెందుతూ నివాసయోగ్యంగా వచ్చిందో తెలియచేస్తుంది. ఇలా ప్రస్తుత సైన్స్ భూమి వయస్సు గురించి చెప్పేది నిజమే అయ్యిండి ఈ భూమి వయస్సు కోట్ల సంవత్సరాలే అయినప్పటికీ బైబిల్ ప్రకారం ఏ ఇబ్బందీ లేదు కదా.

దేవుడు తన శక్తి చేత ఆరు‌దినాల్లో ఈ సృష్టిని చెయ్యకుండా, ఇది చిన్నచిన్నగా అభివృద్ధి చెందుతూ నివాసయోగ్యంగా మారేలా నియమిస్తే ఈ భూమి అభివృద్ధి చెందడానికి కొన్ని కోట్ల సవత్సరాలే పట్టి ఉండవచ్చేమో! దీని ప్రకారం ఈ భూమి పుట్టి కోట్లయేళ్లు గడచినప్పటికీ ఈ అధ్యాయంలో చెప్పబడుతున్న ఆరు దినాలు సామాన్య దినాలు కావని చెప్పడం సాధ్యం కాదు. అలాగే కార్బన్ డేటింగ్ ను ఆధారం చేసుకుని ఈ భూమి పుట్టి కొన్ని కోట్ల సంవత్సరాలు గడిచిందని సైన్స్ చెబుతుంటే దానిని నమ్మడమూ సరైనది కాదు.

రెండవదిగా, సూర్యుడు నాలుగవ దినాన చేయబడినప్పటికీ దేవుడు ప్రారంభ దినంలోనే వెలుగుని చేసి చీకటిని వేరు చేసినట్టు చూడగలం. ఒక‌ దినము గడవడానికి వెలుగు చీకటి (అస్తమయం,ఉదయం) ఉంటే చాలు, సూర్యుడు అవసరం లేదు. సూర్యుని కంటే ముందు దేవుడు వెలుగును చేసాడు కనుక, సూర్యుని కంటే ముందు ఈ భూమిపైకి దేవుడు వేరే విధంగా వెలుగుని ప్రసరింపచేసాడు. ఆ విధంగా ముందటి దినాలలో అస్తమయం, ఉదయం కలిగి మూడు దినాలు గడిచాయి. నాలుగవ దినాన దేవుడు సూర్యుని చేసి సూర్యుని ద్వారా భూమిపైన ఆ ప్రక్రియ కొనసాగేలా నియమించాడు. కనుక ఈ అధ్యాయంలోని ఆరుదినాలు సామాన్య దినాలు కావని చెప్పడానికి ఈ కారణం కూడా సరిపోదు. ఈ అధ్యాయం అంతటిలో చెప్పబడుతున్న దినాలు మనకి తెలిసిన సామాన్య దినాలే అని మనం ఖచ్చితంగా చెప్పవచ్చు.

ఎందుకంటే;
ఆదికాండము1:27,31
దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను దేవుని స్వరూపమందు వాని సృజించెను అస్తమయమును ఉదయమును కలుగగా ఆరవ దినమాయెను.

ఈ వచనాల ఆధారంగా దేవుడు ఆరవ ది‌నాన నరుని చేసినట్టు మనం చూడగలం. ఈ నరుడు ఎన్ని దినాలు జీవించాడని బైబిల్ చెబుతుందో మరొక వచనాన్ని పరిశీలిద్దాం.

ఆదికాండము 5:5
ఆదాము బ్రదికిన దినములన్నియు తొమ్మిదివందల ముప్పది యేండ్లు; అప్పుడతడు మృతిబొందెను.

ఆదాము సృష్టించబడినది మొదలుకుని తాను బ్రతికినకాలం మొత్తం ఈ వచనంలో రాయబడింది. ఈ అధ్యాయంలోని ఆరు దినాలు సామాన్య దినాలు కాకుండా ఒకోదినం కొన్ని కోట్ల సంవత్సరాల కాలం ఐతే ఆదాము ఎన్నికోట్ల సంవత్సరాలు బ్రతికినట్టు రాయబడాలో ఆలోచించండి.

ఆదికాండము 2:2,3
దేవుడు తాను చేసిన తనపని యేడవదినములోగా సంపూర్తిచేసి, తాను చేసిన తన పని యంతటి నుండి యేడవ దినమున విశ్రమించెను. కాబట్టి దేవుడు ఆ యేడవ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరచెను; ఏలయనగా దానిలో దేవుడు తాను చేసినట్టియు, సృజించినట్టియు తన పని అంతటి నుండి విశ్రమించెను.

ఈ వచనాలలో దేవుడు ఆరు దినాలు సృష్టిని చేసి ఏడవ దినాన విశ్రమించి తాను విశ్రమించిన ఆ ఏడవ రోజును విశ్రాంతిదినంగా పాటించాలని ఆజ్ఞాపిస్తున్నట్టు రాయబడింది.(నిర్గమకాండము 31:16,17, నిర్గమకాండము 20:11). ఇవి సామాన్య దినాలు కాకపోతే ఇశ్రాయేలీయులకి చేసిన ఆ కట్టడ వాస్తవం కాకుండా పోతుంది. కనుక ఈ అధ్యాయంలో చెప్పబడుతున్న దినాలు సామాన్య దినాలుగానే మనం భావించాలి. మరి కొందరు ఐన్ స్టీన్ ఫార్ములాను ఉపయోగించి ఈ దినాలను విశ్లేషించే ప్రయత్నం చేస్తారు. అది నమ్మడానికి మాకున్న అభ్యంతరాల కారణంగా దానిని ఇక్కడ విడిచిపెడుతున్నాము.

ఆదికాండము 1:6-8
మరియు దేవుడు జలముల మధ్య నొక విశాలము కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరచును గాకని పలికెను. దేవుడు ఆ విశాలము చేసి విశాలము క్రింది జలములను విశాలము మీది జలములను వేరుపరచగా ఆ ప్రకారమాయెను. దేవుడు ఆ విశాలమునకు ఆకాశమని పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలుగగా రెండవ దినమాయెను.

ఆదికాండము మొదటి అధ్యాయం రెండవ వచనం ప్రకారం; చీకటి అగాధ "జలములపై" కమ్మియున్నట్టు మనం చూసాం. ప్రారంభంలో సృష్టి మొత్తం జలాలతో నింపబడి ఉంది. ఈ వచనాలలో ఐతే దేవుడు విశాలము కలుగునట్లుగా ఆ జలములను వేరుపరచినట్టు మనం చూస్తాం. దేవుడు ఆనాడు వేరుపరచిన జలాలు నేటికీ ఆకాశానికి పైగా ఉన్నట్టు బైబిల్ చెబుతుంది.

కీర్తనలు 148: 4
పరమాకాశములారా, ఆకాశముపైనున్న జలములారా, ఆయనను స్తుతించుడి.

ఆదికాండము 1:9,10
దేవుడు ఆకాశము క్రిందనున్న జలము లొకచోటనే కూర్చబడి ఆరిన నేల కనబడును గాకని పలుకగా ఆ ప్రకారమాయెను. దేవుడు ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టెను, జలరాశికి ఆయన సముద్రములని పేరు పెట్టెను, అది మంచిదని దేవుడు చూచెను.

ఈ వచనాలలో దేవుడు ఆకాశము క్రింద భూమిపై ఉన్న జలాలను ఒకచోట సమకూర్చి ఆరిన నేలగానూ, సముద్రంగానూ విభాగించినట్టు మనం చూస్తాం. అంతకుముందు ఈ భూమిమొత్తం జలాలతోనే నిండియుంది (2 వ వచనం).

2వ పేతురు 3:5
ఏలయనగా పూర్వమునుండి ఆకాశముండెననియు, నీళ్లలో నుండియు నీళ్లవలనను సమకూర్చబడిన భూమియు దేవుని వాక్యమువలన కలిగెనను.

ఇవే వచనాలలో దేవుడు జలములకు సరిహద్దులను నియమించి వాటికి సముద్రాలని పేరుపెట్టినట్టు రాయబడింది. దీనికి మిగిలిన లేఖనాలు కూడా సాక్ష్యమిస్తున్నాయి.

యోబు 38:8-11
సముద్రము దాని గర్భము నుండి పొర్లి రాగా తలుపుల చేత దానిని మూసినవాడెవడు? నేను మేఘమును దానికి వస్త్రముగాను గాఢాంధకారమును దానికి పొత్తిగుడ్డగాను వేసినప్పుడు నీవుంటివా? దానికి సరిహద్దు నియమించి దానికి అడ్డగడియలను తలుపులను పెట్టించినప్పుడు నీవు ఇంత వరకే గాని మరి దగ్గరకు రాకూడదనియు ఇక్కడనే నీ తరంగముల పొంగు అణపబడుననియు నేను చెప్పినప్పుడు నీవుంటివా

యిర్మీయా 5:22
సముద్రము దాటలేకుండునట్లును, దాని తరంగములెంత పొర్లినను అవి ప్రబలలేకయు, ఎంత ఘోషించినను దాని దాటలేకయు ఉండునట్లును నిత్య నిర్ణయముచేత దానికి ఇసుకను సరిహద్దుగా నియమించిన నాకు మీరు భయపడరా? నా సన్నిధిని వణకరా? ఇదే యెహోవా వాక్కు.

ఆదికాండము 1:11-13
దేవుడుగడ్డిని విత్తనములిచ్చు చెట్లను భూమిమీద తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములుగల ఫలమిచ్చు ఫలవృక్షములను భూమి మొలిపించుగాకని పలుకగా ఆ ప్రకారమాయెను. భూమి గడ్డిని తమ తమ జాతి ప్రకారము విత్తనములిచ్చు చెట్లను, తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములుగల ఫలవృక్షములను మొలిపింపగా అది మంచిదని దేవుడు చూచెను. అస్తమయమును ఉదయమును కలుగగా మూడవ దినమాయెను.

ఈ వచనాల ప్రకారం; దేవుడు ఈ భూమిపైన జీవజాలం కంటే ముందుగా వృక్షజాలాన్ని సృష్టించినట్టు మనం చూస్తాం. తరువాత దినాలలో సృష్టించబోతున్న జంతువులకూ, మానవునికీ ఆహారంగా ఉండడానికై దేవుడు ముందుగా ఈ వృక్షజాలాన్ని సృష్టించాడు. నాస్తికమతానికి చెందినవారు ఈ సందర్భాన్ని ఎత్తిచూపుతూ, భూమిపైన వృక్షజాలం జీవించాలంటే సూర్యుని వెలుగు కావాలి. బైబిల్ లో ఆ సూర్యుడు నాలుగవ దినాన సృజించబడినట్టు రాయబడింది. అలాంటప్పుడు మూడవ దినాన దేవుడు సృష్టించిన వృక్షజాలం అంతా సూర్యుడు లేకుండా ఆ దినమంతా ఎలా బ్రతికిందంటూ ప్రశ్నిస్తుంటారు. కనీస అవగాహనతో ఈ అధ్యాయం‌ చదివితే ఈ నాస్తిక మతస్తులకు ఈ ప్రశ్న రాకుండును పాపం. ఎందుకంటే ఈ అధ్యాయం ప్రారంభంలోనే దేవుడు వెలుగుని కలిగించినట్టు మనం చూస్తాం. వృక్షజాలం బ్రతకడానికి కావాల్సింది సూర్యుడు కాదు, వెలుగు. ఆ వెలుగు సూర్యుని కంటే ముందు మూడుదినాలు భూమిపైన ప్రసరించింది. తరువాత దేవుడు ఆ వెలుగును ఆ వెలుగునుండి వచ్చే వేడిని సూర్యుని ద్వారా భూమిపైన ప్రసరించేలా నియమించాడు. వృక్షజాలానికి జీవమిచ్చే వెలుగు సూర్యుని కంటే ముందు నుంచీ భూమిపైన ప్రసరించింది కాబట్టి, నాస్తికమతానికి చెందినవారి ఈ ప్రశ్న సులభంగా వీగిపోతుంది.

ఆదికాండము 1:14-19
దేవుడుపగటిని రాత్రిని వేరుపరచునట్లు ఆకాశవిశాల మందు జ్యోతులు కలుగును గాకనియు, అవి సూచనలను కాలములను దిన సంవత్సరములను సూచించుటకై యుండు గాకనియు, భూమిమీద వెలుగిచ్చుటకు అవి ఆకాశ విశాలమందు జ్యోతులై యుండు గాకనియు పలికెను; ఆ ప్రకారమాయెను. దేవుడు ఆ రెండు గొప్ప జ్యోతులను, అనగా పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని నక్షత్రములను చేసెను. భూమిమీద వెలుగిచ్చుటకును, పగటిని రాత్రిని ఏలుటకును వెలుగును చీకటిని వేరుపరచుటకును దేవుడు ఆకాశ విశాలమందు వాటి నుంచెను; అది మంచిదని దేవుడు చూచెను. అస్తమయమును ఉదయమును కలుగగా నాలుగవ దినమాయెను.

ఈ వచనాలలో దేవుడు నాలుగవ దినాన సూర్య చంద్ర నక్షత్రాలను సృష్టించినట్లు మనం చూస్తాం. దేవుడు ఈ నాలుగవ దినానికి ముందు మూడు దినాలూ, ఆయన‌ కలిగించిన వెలుగునూ, దానికి ముందున్న చీకటిని భూమిపైకి క్రమబద్ధంగా ప్రసరించేలా చేసాడు. ఈ నాలుగవ దినంనుండీ సూర్యుని ద్వారా అటువంటి వెలుగే భూమిపైన ప్రసరించేలా చేసి, రాత్రివేళ కటికచీకటి కాకుండా చంద్రుడు, నక్షత్రములు ప్రకాశించేలా నియమిస్తున్నాడు.

యిర్మీయా 31:35
పగటి వెలుగుకై సూర్యుని, రాత్రి వెలుగుకై చంద్ర నక్షత్రములను నియమించువాడును సైన్యములకధిపతియగు యెహోవా అని ఆయనకు పేరు.

ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించాలి. ఈ చరిత్రయంతా సృష్టి ప్రారంభదశ గురించి చెప్పబడుతుంది. అప్పటినుండి దేవుడు అన్నిటినీ క్రమబద్ధకరీస్తూ వచ్చాడు. ఉదాహరణకు ప్రస్తుతం మన భూమి తన చుట్టూ తాను తిరుగుతూ, సూర్యుడి చుట్టూ తిరుగుతుంది. ఒక్క భూమి మాత్రమే కాదు సౌరకుటుంబంలో ఉన్న గ్రహాలన్నీ సూర్యాకర్షణశక్తి వల్ల సూర్యుడి చుట్టూ తిరుగుతున్నాయి. గ్రహాలు అలా క్రమబద్ధంగా తిరగడానికి సూర్యాకర్షణ శక్తే కారణం. సూర్యుడిని మధ్యలో ఉంచి ఇలాంటి ఒక క్రమాన్ని తీసుకువచ్చిందీ, సూర్యుడిలో ఆ ఆకర్షణశక్తిని పెట్టిందీ దేవుడే. సూర్యుడు లేనప్పుడు ఆయన వేరే ఆకర్షణశక్తితో భూమినీ గ్రహాలనూ నడిపించాడు. తరువాత సూర్యుడి ద్వారా అవి నడిపించబడేటట్టు నిర్ణయించి, సూర్యుడ్ని కలిగించాడు. ఇక్కడ నేను చెప్పాలనుకుంటున్న విషయం ఏమిటంటే, ప్రస్తుతమున్న క్రమాన్ని బట్టి, ఆ క్రమం ఏర్పడుతున్ననాటి పరిస్థితిని (ప్రారంభ దశను) ప్రశ్నించకూడదు. ఈ క్రమం సౌరకుటుంబం విషయంలోనే కాదు, మానవనిర్మాణంలో కూడా మనం చూస్తాం. రెండవ అధ్యాయం ప్రకారం ఆయన మొదటి మనిషిని మట్టినుండి చేసాడు, అతని పక్కటెముక ద్వారా స్త్రీని చేసాడు. అప్పటినుండి ఒక క్రమం ఏర్పడి స్త్రీ పురుషుల‌ కలయిక ద్వారా మానవులు జన్మిస్తున్నారు. మనం ఈ క్రమాన్ని ఆధారం చేసుకుని, స్త్రీ పురుషులు కలయిక లేకుండా ఆదాము ఎలా జన్మించాడు, హవ్వ ఎలా జన్మించిందని ప్రశ్నించడం సరికాదు. ఇప్పుడు మనం క్రమబద్ధీకరించబడిన సృష్టిని చూస్తున్నాం. కానీ బైబిల్ ఈ రెండు అధ్యాయాలలోనూ ఆ క్రమం లేనప్పటి పరిస్థితి గురించీ (ప్రారంభదశ), దేవుడు మెల్లిమెల్లిగా ప్రస్తుతమున్న క్రమాన్ని ఎలా తీసుకువచ్చాడు అనేదాని గురించీ చెబుతుంది.

ఇక దేవుడు సూచనలనూ, కాలాలనూ, దిన సంవత్సరాలను కూడా సూచించేలా ఈ సూర్యచంద్ర నక్షత్రాలను నియమించినట్టు అక్కడ రాయబడింది. కొన్ని మతాలవారు నమ్ముతు‌న్నట్టుగా మానవుని జీవితాన్ని ఇవి నిర్దేశిస్తాయని‌ కానీ, వాటి ప్రభావం మనపైన ఉంటుందని కానీ దీని అర్థం కాదు. అప్పటినుండి ఈ సూర్యచంద్ర నక్షత్రాల ద్వారా ఆరోజు నుండి దినాలు, సంవత్సరాలు గడుస్తాయని అలాగే ఆయన అనుకున్న సమయంలో వాటి ద్వారా మానవజాతికి కొన్ని హెచ్చరికలు, సూచనలు కూడా అవి తెలియచేసేలా నియమించాడని మాత్రమే ఆ మాటల అర్థం. ఉదాహరణకు యేసుక్రీస్తు జన్మించినప్పుడు ఆకాశంలో నక్షత్రం కనిపించి ఆయన జన్మను‌ సూచించింది. యేసుక్రీస్తు రాకడలో సూర్యుడు కంబలివలే నలుపు ఔతాడని చంద్రుడు రక్తంవలే ఎరుపు ఔతాడని కూడా రాయబడింది. సూర్యచంద్ర నక్షత్రాలద్వారా దేవుడు తెలియచేసే సూచనలుగా ఇటువంటివాటినే మనం గుర్తించాలి.

ఇవే వచనాలలో దేవుడు సూర్యున్ని పెద్దజ్యోతిగా వర్ణించడం జరిగింది. దీనర్థం నక్షత్రాలన్నిటిలోకీ సూర్యుడు పెద్దవాడని కాదు కానీ, భూమిపైకి ఆ సూర్యుడు కనిపించే కోణం గురుంచి ఈ విధంగా రాయబడింది. ఇటువంటి సందర్భాలు బైబిల్ లో మనకి చాలా కనిపిస్తాయి. దీనిని ఫినామినల్ లాజిక్ అంటారు. కంటికి కనిపించేది కనిపించినట్టు వర్ణించేదానిని ఈ విధంగా పిలుస్తారు. ఇదే సూర్యుని గురించిన సందర్భంలో రాత్రిని ఏలే చిన్న జ్యోతిగా చంద్రున్ని వర్ణించి ఈ సూర్యచంద్రులకు వేరుగా నక్షత్రాల గురించి ప్రస్తావించడం జరిగింది. నక్షత్రాలను అక్కడ చిన్నజ్యోతులుగా పేర్కోలేదు, నక్షత్రాలలో అనేకమైనవి మన సూర్యుని కంటే ఎన్నో లక్షలరెట్లు పెద్దవిగా ఉన్నాయని మనకు తెలుసు. బైబిల్ కూడా దానిని ఈ సందర్భంలో తెలియచేస్తుంది. అంతమాత్రమే కాకుండా ఈ సూర్యచంద్ర నక్షత్రాలలోనూ, వాటినుంచి ప్రసరించబడే వెలుగులోనూ ఒకదానితో మరొకదానికి బేధం ఉంటుందని కూడా బైబిల్ చెబుతుంది.

1 కోరింథీయులకు 15: 41
నూర్యుని మహిమ వేరు, చంద్రుని మహిమవేరు, నక్షత్రముల మహిమ వేరు. మహిమనుబట్టియొక నక్షత్రమునకును మరియొక సక్షత్రమునకును భేదము కలదు గదా.

ఆదికాండము 1:20-23
దేవుడు జీవము కలిగి చలించువాటిని జలములు సమృద్ధిగా పుట్టించును గాకనియు, పక్షులు భూమిపైని ఆకాశ విశాలములో ఎగురును గాకనియు పలికెను. దేవుడు జలములలో వాటి వాటి జాతి ప్రకారము జలములు సమృద్ధిగా పుట్టించిన మహా మత్స్యములను, జీవము కలిగి చలించువాటినన్నిటిని, దాని దాని జాతి ప్రకారము రెక్కలుగల ప్రతి పక్షిని సృజించెను. అది మంచిదని దేవుడు చూచెను. దేవుడు మీరు ఫలించి అభివృద్ధి పొంది సముద్ర జలములలో నిండియుండుడనియు, పక్షులు భూమిమీద విస్తరించును గాకనియు, వాటిని ఆశీర్వదించెను. అస్తమయమును ఉదయమును కలుగగా అయిదవ దినమాయెను.

ఈ వచనాల ఆధారంగా దేవుడు మొదటిగా సముద్రంలో జీవం కలిగి చలించే సమస్త జీవరాశులనూ, తరువాత ఆకాశంలో సంచరించే పక్షిజాతులను సృష్టించినట్టు మనం చూస్తాం. కొందరు ఈ వచనాలను సందర్భానుసారంగా అర్థం చేసుకోలేక, బైబిల్ భూమిపైన ఉన్న సమస్తజీవరాశులు, పక్షులు కూడా సముద్రంలోనే పుట్టాయని చెబుతుందంటూ ఆక్షేపిస్తారు. కానీ ఈ వచనాలు మొదటిగా జీవం కలిగి చలించువాటన్నిటినీ అన్నపుడు సముద్రంలోని సమస్తజీవరాశుల గురించి చెబుతున్నాయి. తరువాత ఆకాశంలో సంచరించే పక్షులను కూడా దేవుడు చేసాడని చెబుతున్నాయి. తరువాత వచనాలలో భూమిపైన మిగిలిన జీవరాశుల సృష్టి గురించి రాయబడింది. ఈ పక్షులను, భూమిపైన జీవరాశులను దేవుడు సముద్రం నుండి కాకుండా భూమి నుండే నిర్మించినట్టు అక్కడ వివరంగా రాయబడింది.

ఆదికాండము 2:19
దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశపక్షిని నేలనుండి నిర్మించి-

అంతమాత్రమే కాకుండా ఈ వచనాలలో దేవుడు సముద్రంలోని జీవరాశులనూ, ఆకాశంలోని పక్షిజాతులనూ ఫలించి అభివృద్ధి పొందమని దీవించాడని రాయబడింది. ఆదాము హవ్వలు ఏదేను నుండి బయటకు వచ్చిన కాలం నుండి నేటివరకూ భూమిపైన పుట్టుకొస్తున్న కోటానుకోట్ల మానవజాతికి సముద్రంలోని అనేక జీవరాశులు, ఆకాశంలోని అనేకమైన పక్షులు ఆహారంగా మారుతున్నప్పటికీ ఆనాటి దేవుని దీవెన కారణంగానే నేటికీ వాటి మనుగడ అంతం కాలేదు. మానవుల ఆకలి తీర్చడానికీ మిగిలిన అనేకమైన అవసరతలు తీర్చడానికీ ఈ జీవులన్నీ ఉపయోగపడుతూనే ఉన్నాయి.

ఆదికాండము 1:24,25
దేవుడు వాటి వాటి జాతి ప్రకారము జీవముగల వాటిని, అనగా వాటి వాటి జాతి ప్రకారము పశువులను పురుగులను అడవి జంతువులను భూమి పుట్టించుగాకని పలికెను; ఆప్రకారమాయెను. దేవుడు ఆయా జాతుల ప్రకారము అడవి జంతువులను, ఆయా జాతుల ప్రకారము పశువులను, ఆయా జాతుల ప్రకారము నేలను ప్రాకు ప్రతి పురుగును చేసెను. అది మంచిదని దేవుడు చూచెను.

సముద్రంలోని జీవరాశుల పుట్టుక, ఆకాశంలోని‌ పక్షులు పుట్టుకల గురించి ముందటి వచనాలు వివరిస్తే, ఈ వచనాలు భూమిపైన జీవించే సమస్తజీవరాశుల పుట్టుక గురించి తెలియచేస్తున్నాయి. వీటిలోని ఏ జీవీ మానవునికి కానీ, మరో జీవికి కానీ హానికరంగా ఉండేలా ప్రారంభంలో దేవుడు సృజించలేదు‌, ఆయన అన్నిటినీ మంచిగా చేసాడు. అయితే, మానవ పతనం తరువాత సృష్టిలో జరిగిన అనేకమైన మార్పుల్లో భాగంగా ఈ జీవులు కూడా మార్పుకు గురై మానవునికీ, మరో జీవికీ హానికరంగా తమ మనుగడను సాగిస్తున్నాయి.

ఆదికాండము 1:26
దేవుడు మన స్వరూపమందు మన పోలికె చొప్పున నరులను చేయుదము; వారుసముద్రపు చేపలను ఆకాశ పక్షులను పశువులను సమస్త భూమిని భూమిమీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాకనియు పలికెను.

ఈ వచనంలో దేవుడు "మన పోలిక మన స్వరూపమందు" నరులను చేయుదమంటూ బహువచనాన్ని ప్రయోగిస్తున్నట్టు మనం చూస్తాం. ఈ వచనం ప్రకారం దేవునిలో ఒకరికంటే ఎక్కువ వ్యక్తులు ఉన్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఆ వ్యక్తులే తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు అని మనం ప్రారంభ వచనాలలో చూసాము. కొందరు దేవుడు మన పోలిక చొప్పున అనే బహువచనాన్ని దేవదూతలతో కలిపి ప్రయోగిస్తున్నాడంటూ పొరపడుతుంటారు. కానీ ఇది పూర్తిగా తప్పు ఎందుకంటే, ఈ వాదన చేసేవారు తమకు తెలియకుండానే దేవదూతలు కూడా దేవునితో పాటు సహసృష్టికర్తలు అని బోధిస్తున్నారు. దేవుడు మాత్రమే సృష్టికర్త అని మనకు బైబిల్ చెబుతుంది. దేవదూతలు ఆయన సేవకులైన ఆత్మలు‌ మాత్రమే (హెబ్రీ 1:14). నరులు దేవుని పోలిక దేవుని స్వరూపంలో సృష్టించబడ్డారని బైబిల్ చెబుతుంది, దేవదూతల పోలిక, స్వరూపంలో కాదు.

ఆదికాండము 1:27
దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను దేవుని స్వరూపమందు వాని సృజించెను స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను.

ముందటి వచనంలో దేవుడు మనపోలిక మన స్వరూపమందు నరులను చేయుదుమని చెప్పినట్టు రాయబడి ఈ వచనంలో మాత్రం వారిని దేవుని స్వరూపమందు సృజించాడని రాయబడింది. అంటే ఆయనతో పాటుగా నరులను సృజించిన మిగిలిన వ్యక్తులు తనతో పాటుగా దైవత్వం సమానంగా కలిగినవారై ఉండాలి. కాబట్టి దేవుడు ఖచ్చితంగా ఈ సందర్భంలో మనం అని సంబోధించిన మిగిలిన వ్యక్తులు దేవదూతలు కాదు కానీ కుమారుడైన యేసుక్రీస్తు, పరిశుద్ధాత్ముడు మాత్రమే అని స్పష్టం ఔతుంది.

ఎందుకంటే, బైబిల్ గ్రంథం తండ్రియైన దేవునితో పాటుగా సమానమైన దేవత్వం కలిగిన వ్యక్తులుగా కుమారున్ని, పరిశుద్ధాత్మున్ని మాత్రమే పరిచయం చేస్తుంది. దేవుడు ఈ ఇరువైఆరవ వచనంలో మనము అని సంబోధించినట్టుగానే ఆదికాండం 11:7 లో బాబేలు గోపురం వద్ద భాషలను తారుమారు చేసినపుడు మనము అని సంబోధించినట్టు చూడగలం. మరికొందరు, దేవుడు రాజు కనుక తనను తాను హుందాగా బహువచనంలో మనము అని సంబోధించుకుని ఉంటాడని పొరపడుతుంటారు, ఇది కూడా తప్పే. ఎందుకంటే, బైబిల్ లోని మిగిలిన సందర్భాలు అన్నిటిలోనూ దేవుడు తనను తాను ఏకవచనంతోనే, నేను, అని సంబోధించుకున్నట్టు చూడగలం. భక్తులు కూడా ఆయన్ని ఏకవచనంలోనే నువ్వు, నీకు అని సంబోధించినట్టూ చూడగలం. ఎందుకంటే హెబ్రీభాషలో తమని తాము హుందాగా బహువచనంలో సంబోధించుకునే సాంప్రదాయం లేదు‌.

ఇక సృష్టిని చేసే సమయంలో దేవునితో పాటుగా కుమారుడు, పరిశుద్ధాత్ముడు సమానంగా పనిచేసారని మనం ప్రారంభ వచనాలలో చూసాము. ఇప్పుడు నరులను చేసేటపుడు కూడా ముగ్గురూ కలసి పనిచేసారని బైబిల్ లోని ఇతర లేఖనాల సాక్ష్యాన్ని కూడా చూద్దాం.

యోబు 33: 4
దేవుని ఆత్మ నన్ను సృజించెను.

ఈ సందర్భములో దేవుని ఆత్మ తనను సృష్టించెనని యోబు స్నేహితుడైన ఏలీహు అంటున్నాడు. యోబు స్నేహితుల మాటలను మనం ప్రామాణికంగా తీసుకోలేము, దేవుడు వారి మాటలను బట్టి వారిని గద్దించాడు కదా అనే సందేహం మీకు కలిగితే, దేవుడు గద్దించింది యోబుకు వేరే స్నేహితులైన ముగ్గురినే కానీ, ఏలీహును కాదు.

యోబు 42:9
తేమానీయుడైన ఎలీఫజును, షూహీయుడైన బిల్దదును, నయమాతీయుడైన జోఫరును పోయి, యెహోవా తమకు ఆజ్ఞాపించినట్లు చేయగా యెహోవా వారిపక్షమున యోబును అంగీకరించెను.

ఏలీహు చెప్పిన మాటలు లేఖనసారాంశాన్ని బట్టి సరియైనవే. ఈవిధంగా దేవుడు నరులను సృజించే సమయంలో పరిశుద్ధాత్ముడు కూడా సమానంగా పనిచేసాడని మనకు అర్థమౌతుంది. అదేవిధంగా, యేసుక్రీస్తు ప్రభువు కూడా నరులను చేసాడనడానికి ఆధారాలు ఉన్నాయి.

యోహాను 1:3
కలిగియున్నదేదియు ఆయన లేకుండ కలుగలేదు. ఈ వచనంలో ‘కలిగియున్నదేదియూ ఆయన‌లేకుండా కలుగలేదు’ అన్నపుడు మనుషులు కూడా ఆయన లేకుండా కలుగలేదు.

కొలొస్సయులకు 1:16,17
ఏలయనగా ఆకాశమందున్నవియు భూమియందున్నవియు, దృశ్యమైనవిగాని, అదృశ్యమైనవిగాని, అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను, సర్వమును ఆయనయందు సృజింపబడెను, సర్వమును ఆయన ద్వారాను ఆయననుబట్టియు సృజింపబడెను. ఆయన అన్నిటికంటె ముందుగా ఉన్నవాడు; ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు.

ఆదికాండము 1:27
దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను; దేవుని స్వరూపమందు వాని సృజించెను; స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను.

పై వచనములో త్రిత్వంలోని ముగ్గురు వ్యక్తులు కలసి నరులను చేసారని మనం చూసాం. ఈ వచనంలో దేవుడు తన "స్వరూపములో" నరుని చేయడమంటే అర్థం ఏమిటో చూద్దాం. కొందరు దేవుడు తన పోలిక తన స్వరూపంలో నరులను చేసాడు అనేదానిని మానవ భౌతికదేహానికి ఆపాదిస్తూ ఉంటారు‌. కానీ ఇక్కడ చెప్పబడిన దేవుని పోలిక దేవుని స్వరూపం భౌతికదేహం గురించి కానేకాదు. ఎందుకంటే దేవుడు ఆత్మ, అదృశ్యుడు అని బైబిల్ ఖచ్చితంగా చెపుతుంది.

యోహాను 4:24
దేవుడు ఆత్మగనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను ఆరాధింపవలెననెను.

కొలొస్సయులకు 1:15
ఆయన అదృశ్యదేవుని స్వరూపియై సర్వసృష్టికి ఆదిసంభూతుడైయున్నాడు.

ఆత్మ, అదృశ్యుడైన దేవునికి మనవలే భౌతికదేహం ఉండదు. ఒకవేళ బైబిల్ లోని అనేక సందర్భాలలో దేవుడు కనపరచిన ప్రత్యక్షతలలో దేవునికి మనవలే దేహం ఉన్నట్టు, ఆయనకు కాళ్లు, చేతులు, చెవులు, కళ్లు, నోరు ఉన్నట్టుగ రాయబడింది కదా అనే సందేహం కలిగితే, మానవుని అర్థమయ్యే భాషలో ఆ విధంగా రాయబడిందని మనం గ్రహించాలి. దీనిని థియలాజికల్ గా Anthropomorphism అంటారు. దేవుడు మానవులకు ఎలా ప్రత్యక్షమైతే వారికి అర్థమౌతుందో ఆ రూపంలోనే ఆయన ఉన్నట్టుగా కనిపించాడు. వాస్తవానికి ఆయనకు మనకున్నట్టుగా అవయవాలు ఉండవు. దీనికి ఇంకొక ఆధారం ఈ వచనంలోనే మనం చూడవచ్చు. దేవుడు తన పోలికలో తన స్వరూపంలో పురుషున్నీ, స్త్రీని కూడా చేసినట్టు మనం చూడగలం. పోలిక, స్వరూపం అనగానే భౌతికదేహమే అని మనం ఆలోచిస్తే ఇంతకూ దేవునిది పురుషుని భౌతిక దేహమా, స్త్రీ భౌతికదేహమా అనే సందిగ్ధత నెలకొంటుందే తప్ప సమాధానం మాత్రం వచ్చే పరిస్థితి లేదు. మరికొందరు ఇంకాస్త ముందుకువెళ్లి ఈ వచనాన్ని వక్రీకరించి ఒక కల్ట్ నే స్థాపించారు. దాని పేరు World Mission Society Church of God (పరలోకపు తల్లి). ఈ కల్ట్ మన తెలుగులో కూడా విస్తరిస్తూ ఉంది. దేవుడు స్త్రీని పురుషుడినీ తన పోలిక తన స్వరూపంలో చేసాడని రాయబడిన మాటలను వీరు వక్రీకరించి, దేవునిలో స్త్రీ వ్యక్తి కూడా ఉన్నదనీ పురుషుడిని దేవుడు తన పోలిక తన స్వరూపంలో చేస్తే స్త్రీని దేవునిలో ఉన్న స్త్రీ వ్యక్తి తన పోలిక స్వరూపంలో చేసిందని బోధిస్తూ దేవునిలో ఉన్న ఆ స్త్రీ వ్యక్తి మరెవరో కాదు అంటూ సౌత్ కొరియాకు చెందిన "జాన్ గిల్ జా" అనే ఒక స్త్రీని పరిచయం చేస్తారు. ఇది ఒక కల్ట్, వీరు చెప్పేదానికి బైబిల్ లో‌ ఒక్క ఆధారం కూడా లేదు. ఈ కల్ట్ గురించి వివరించడానికి ఇది సందర్భం కాదు కనుక ఈ విషయాన్ని ఇక్కడే విడిచిపెడుతున్నాను.

ఇప్పుడు బైబిల్ గ్రంథం ఆధారంగా దేవుని పోలిక, స్వరూపం అంటే ఏమిటో, మానవున్ని దేవునిపోలిక, దేవుని స్వరూపంలో చేసాడన్నపుడు మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలో చూద్దాం.

ఎఫెసీయులకు 4:23,24
మీ చిత్తవృత్తియందు నూతన పరచబడినవారై, నీతియు యథార్థమైన భక్తియుగలవారై, దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను.

ఈ వచనాన్ని మనం పరిశీలిస్తే దేవుని పోలిక అన్నపుడు స్వభావం గురించి చెబుతుందని అర్థమౌతుంది.

గలతియులకు 4: 19
నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీయందేర్పడు వరకు మీ విషయమై మరల నాకు ప్రసవవేదన కలుగుచున్నది.

ఈ వచనంలో క్రీస్తు స్వరూపం అన్నపుడు క్రీస్తు కలిగియున్న నైతిక గుణలక్షణాలు (ఫిలిప్పీ2:5 మనసు) వారిలో ఏర్పడాలనే ఉద్దేశంతోనే కదా పౌలు ఇంత ప్రయాసపడుతున్నాడు.

రోమీయులకు 8:29
ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు, దేవుడెవరిని ముందు ఎరిగెనో, వారు తన కుమారునితో సారూప్యము గలవారవుటకు వారిని ముందుగా నిర్ణయించెను.

ఈవచనంలో క్రీస్తుతో స్వారూప్యం గలవారమవ్వడానికి దేవుడు మనల్ని నిర్ణయించాడని రాయబడింది. దీనర్థం భూమిపైన యేసుక్రీస్తు ముప్పైమూడున్నర యేళ్లు ఏ భౌతికదేహంతో జీవించాడో అలా మనల్ని మార్చడానికనా? కాదు కదా. క్రీస్తు కలిగియున్న నైతికగుణలక్షణాల గురించే కదా ఈమాటలన్నీ మనకి సాక్ష్యమిస్తున్నాయి. దేవుని పోలిక దేవుని స్వరూపంలో మానవున్ని సృజించెను అంటే మానవుడు దేవుని యొక్క నైతిక గుణలక్షణాలు కలిగి పాపమనేది లేకుండా సృష్టించబడ్డాడని అర్థం. ఆదాము హవ్వలు పాపం చేశాక వారు వారి నుంచి వస్తున్న మనుషులందరూ వారిలోని దేవుని నైతికగుణ లక్షణాలకు వ్యతిరేకంగా పతనమైన స్థాయిలో పాపానికి దాసులై జీవిస్తున్నారు. కనుకనే‌ మనుషులందరూ ఖచ్చితంగా పాపం‌ చేస్తున్నారు. ఆదాము హవ్వల ద్వారా మనుషులలో పతనమైన దేవుని నైతికగుణలక్షణాలను క్రీస్తుద్వారా తిరిగి‌ మనుషుల్లో దేవుడు స్థాపిస్తున్నాడని లేఖనాలు చెప్పే సంపూర్ణ సారాంశం. మనం పైన చూసిన వచనాలు కూడా ఇదే చెబుతున్నాయి. కాబట్టి, దేవునిపోలిక దేవుని స్వరూపం అంటే భౌతికదేహం కాదు మన మనసులోని దేవుని నైతిక గుణలక్షణాలే. మరోవిధంగా దేవుని పోలిక, దేవుని స్వరూపం అన్నప్పుడు ఆయన సృజనాత్మకతను కూడా సూచిస్తుంది‌. మనిషి సృష్టికర్తయైన దేవునిపోలిక దేవుని స్వరూపంలో చేయబడ్డాడు కాబట్టే ఎన్నో సృష్టించగలుగుతున్నాడు.

అదేవిధంగా బైబిల్ అసలైన సౌమ్యవాదాన్ని బోధిస్తుందని ఈ వచనం సాక్ష్యమిస్తుంది. ఒకే దేవుడు తన పోలిక తన స్వరూపంలో పురుషుడినీ, స్త్రీనీ చెయ్యడం వలన స్త్రీ పురుషులిద్దరూ సమాన ఆధిక్యతగలవారని, వారికి అప్పగించిన భాధ్యతల్లో తేడాలున్నప్పటికీ ఏ ఒక్కరూ మరొకరికంటే తక్కువ‌గా కానీ ఎక్కువగా కానీ చేయబడలేదని తేటతెల్లమౌతుంది. ఈ ప్రపంచంలో అనేకమైన మతాలు పుట్టుకువచ్చాయి, ఒకొక్క మతంలో మానవ ఆవిర్భావం గురించి ఒక్కో విధంగా చెప్పబడింది. ఉదాహరణకు మన భారతదేశంలోని హిందూ మతంలో బ్రహ్మ శరీరంలో వేరువేరు భాగముల నుండి మానవజాతి వేరువేరు వర్ణాలుగా ఆవిర్భవించినట్టు చెప్పబడింది. దీనివలన వర్ణవ్యవస్థ (కుల) పుట్టుకువచ్చింది, ఒక వర్ణం కంటే మరొక వర్ణం ఎక్కువ లేక తక్కువ అనే బేధం ఇప్పటికీ రాజ్యమేలుతుంది. ఈ హిందూమత సిద్ధాంతం ఆధారంగా మనుషులంతా ఒక్కటే, అందరూ సమానమే అని చెప్పడం సాధ్యం కాదు.

కానీ నిజదేవుని వాక్యమైన బైబిల్ గ్రంథంలో పురుషుడూ, స్త్రీ వారినుండి జనియిస్తున్న యావత్తు మానవజాతి అందరూ ఒకే దేవుని పోలిక, దేవుని స్వరూపంలో సృష్టించబడుతున్నారు కాబట్టి మనుషులంతా ఒక్కటే, అందరూ సమానమే, ఎటువంటి వర్ణ, లింగ, ప్రాంతీయ, వర్గ భేధాలు లేనేలేవని చెప్పే సిద్ధాంతం బైబిల్ మాత్రమే బోధిస్తుంది. దీనికి బైబిల్ లోని మిగిలిన లేఖనాలన్నీ సాక్ష్యమిస్తున్నాయి. నిన్నువలె నీ పొరుగువానిని ప్రేమించుము అనే సిద్ధాంతం బైబిల్ నుండే పుట్టింది. ఏ నరున్నీ చంపకూడదనే నియమం కూడా బైబిల్ నుండే పుట్టింది.

ఎందుకంటే,
ఆదికాండము 9:6
నరుని రక్తమును చిందించు వాని రక్తము నరునివలననే చిందింప బడును; ఏలయనగా దేవుడు తన స్వరూపమందు నరుని చేసెను.

ఈ ఇరువది ఏడవ వచనంలో దేవుడు పురుషుడిని, స్త్రీని తనతో పాటుగా కుమారుడైన యేసుక్రీస్తు, పరిశుద్ధాత్మలుతో కలసి వారి పోలిక, వారి స్వరూపమందు సృష్టించాడనేది ఒకే మాటలో రాయబడింది. కానీ వారి దేహాలను ఏ విధంగా నిర్మించాడో తరువాతి అధ్యాయంలో వివరంగా రాయబడింది.

ఆదికాండము 1:28
దేవుడు వారిని ఆశీర్వదించెను; ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధిపొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరచుకొనుడి; సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమిమీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను.

ఈ వచనంలో దేవుడు మనుషులను సృజించాక మొట్టమొదటిగా వారు ఫలించాలని, అభివృద్ది చెందాలని ఆదేశిస్తున్నట్టు మనం చూస్తాం. యవ్వన పురుషులు స్త్రీలు ప్రభువునందు వివాహం చేసుకుని ప్రభువు చెప్పినట్టుగా లోకమందు ఫలించి అభివృద్ధి చెందాలి అనేది దేవునిప్రణాళికగా మనం గుర్తించాలి. వివాహాన్ని నిషేధించే కొన్ని దుర్భోధలను వ్యాప్తి చేసే సంఘాలు విస్తరిస్తున్నందున ఈ మాటలు మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. అందుకే బైబిల్ గ్రంథం వివాహాన్ని నిషేధించేది దెయ్యపుబోధ అని చెబుతుంది.

1 తిమోతి 4:1-3
అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణవలన మోసపరచు ఆత్మలయందును దయ్యముల బోధయందును లక్ష్యముంచి, విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. ఆ అబద్ధికులు, వాత వేయబడిన మనస్సాక్షిగలవారై, వివాహము నిషేధించుదురు.

అలా అని ప్రభువు కోసం వివాహజీవితానికి దూరంగా ఉండాలనే నిర్ణయం తీసుకున్నవారిని నేను తప్పుపట్టడం లేదు. దేవుని అనుగ్రహంతో, సరైన ప్రణాళికతో వివాహజీవితం లేకుండా ప్రభువు కోసం నిలబడాలి అనుకునేవారిని బైబిల్ స్వాగతిస్తుంది (మత్తయి 19:11).

అయితే ఒక వ్యక్తి చేత బలవంతంగా వివాహజీవితానికి దూరంగా ఉంచే ప్రయత్నం చేసే బోధ మాత్రం దెయ్యాల బోధగా, దేవుని ‌ప్రణాళికను ధిక్కరింపచేసే కపట బోధగా మనం గుర్తించాల్సి ఉంది. పౌలు కూడా తన పత్రికల్లో వివాహాన్ని గురించి వివరంగా రాసారు. ఆయన వివాహం చేసుకునేవారిని చేసుకోకూడదని కానీ, ప్రభువుకోసం వివాహం చేసుకోకుండా ఉందామనుకునేవారిని చేసుకునేలా కానీ ఆజ్ఞాపించలేదు. అది వారి స్వచిత్తంగా భావించి ఏది చేసినా దేవుని అనుగ్రహం పైన ఆధారపడి ‌చేయమని బోధించారు. ఆ క్రమంలో వివాహం చేసుకుంటే వచ్చే శారీరక కష్టాలు, చేసుకోకపోతే పుట్టే శారీరక కోరికలు గురించి వివరించి వివాహం చేసుకున్నా ప్రభువును సంతోషపెట్టడం మరచిపోవద్దు, వివాహం చేసుకోకపోతే ప్రభువుకు విరోధంగా కామతప్తులు కావద్దని హెచ్చరించాడు.

ఇక ఇదే వచనంలో దేవుడు సముద్రంలోనూ, భూమిపైనా, ఆకాశంలోని సంచరించే సమస్త జీవరాశులన్నిటినీ నరునికి లోపరిచినట్టు చూడగలం. ఈమాటలు కీర్తనాకారుడు కూడా ప్రస్తావించాడు.

కీర్తనల 8:6-8
నీ చేతిపనులమీద వానికి అధికారమిచ్చియున్నావు. గొఱ్ఱెలన్నిటిని, ఎడ్లనన్నిటిని అడవి మృగములను ఆకాశపక్షులను సముద్ర మత్స్య ములను సముద్రమార్గములలో సంచరించువాటినన్నిటిని వాని పాదముల క్రింద నీవు ఉంచియున్నావు.

ఆదాము హవ్వలు పాపం చేయకముందు సృష్టిలోని జీవరాశులన్నీ వారికి లోబడి వారి పాదాల క్రింద ఉన్నాయి. ఏ జీవరాశి వారికి హానికరంగా లేనేలేదు. అటువంటి పరిస్థితినే క్రీస్తు తన వెయ్యేండ్ల పాలనలో మరలా తిరిగి స్థాపించబోతున్నట్టుగా మనం బైబిల్ నుండి చూడగలం.

యెషయా గ్రంథము 11:6-9
తోడేలు గొఱ్ఱెపిల్లయొద్ద వాసముచేయును చిఱుతపులి మేకపిల్లయొద్ద పండుకొనును దూడయు కొదమసింహమును పెంచబడిన కోడెయు కూడుకొనగా బాలుడు వాటిని తోలును. ఆవులు ఎలుగులు కూడి మేయును వాటి పిల్లలు ఒక్క చోటనే పండుకొనును ఎద్దు మేయునట్లు సింహము గడ్డి మేయును. పాలుకుడుచు పిల్ల నాగుపాము పుట్టయొద్ద ఆట్లా డును మిడినాగు పుట్టమీద పాలువిడిచిన పిల్ల తన చెయ్యి చాచును. నా పరిశుద్ధ పర్వతమందంతటను ఏ మృగమును హాని చేయదు నాశముచేయదు.

ఆదాము హవ్వలు పాపం చేసాక ఏ జీవరాశినైతే దేవుడు వారికి లోపరిచాడో అందులో కొన్ని జీవరాశులను మానవజాతికి హానికరంగా మార్చాడని కూడా బైబిల్ సాక్ష్యమిస్తుంది.

యిర్మియా 5: 6
వారు తిరుగుబాటుచేసి బహుగా విశ్వాసఘాతకులైరి గనుక అరణ్యమునుండి వచ్చిన సింహము వారిని చంపును, అడవి తోడేలు వారిని నాశనము చేయును, చిరుతపులి వారి పట్టణములయొద్ద పొంచి యుండును, వాటిలోనుండి బయలుదేరు ప్రతివాడు చీల్చబడును.

ఈవచనం ఇశ్రాయేలీయుల గురించి రాయబడినప్పటికీ తిరుగుబాటుకూ, విశ్వాసఘాతకానికీ శిక్షగా జంతువులను వారికి హానికరంగా మార్చినట్టు సాక్ష్యమిస్తుంది కనుక, ఆదాము హవ్వల పాపం తరువాత ఉద్భవించిన మానవజాతి తిరుగుబాటుకూ, విశ్వాసఘాతకానికీ ఇది ఆపాదించబడుతుంది. కనుకనే ఈనాడు ఎన్నోజంతువులు మానవమనుగడకు హానికరంగా ప్రవర్తిస్తున్నాయి. మానవజాతి పాపాన్ని బట్టి వారికి లోపరిచిన జీవరాశులలో కొన్ని వారికి హానికరంగా మారడమే కాకుండా, వారి పాపం మూలంగా వాటి మనుగడకు కూడా ముప్పు వాటిల్లుతుందని బైబిల్ చెబుతుంది.

యిర్మియా 12: 4
దేశములో నివసించువారి చెడుతనమువలన జంతువులును పక్షులును సమసిపోవుచున్నవి. సమస్తమునూ లోపరచిన దేవుని యెదుట తిరుగుబాటును ప్రదర్శించిన మానవజాతికి కలిగిన ఒకానొక ప్రతిఫలం ఇది.

ఆదికాండము 1:29-31
దేవుడు ఇదిగో భూమిమీదనున్న విత్తనములిచ్చు ప్రతి చెట్టును విత్తనములిచ్చు వృక్షఫలముగల ప్రతి వృక్ష మును మీ కిచ్చి యున్నాను; అవి మీ కాహారమగును. భూమిమీదనుండు జంతువులన్నిటికిని ఆకాశ పక్షులన్నిటికిని భూమిమీద ప్రాకు సమస్త జీవులకును పచ్చని చెట్లన్నియు ఆహారమగునని పలికెను. ఆ ప్రకారమాయెను. దేవుడు తాను చేసినది యావత్తును చూచినప్పుడు అది చాలమంచిదిగ నుండెను. అస్తమయమును ఉదయమును కలుగగా ఆరవ దినమాయెను.

ఈ వచనాలలో ఏదేనుతోటలో, మనుషులకూ, జంతువులకూ, శాఖాల్ని మాత్రమే దేవుడు ఆహారంగా ఇచ్చినట్లు మనం చూస్తాం. ఈ పరిస్థితి మరలా పై భాగంలో చూసినటువంటి యెషయా గ్రంథంలోని ప్రవచనాలు మనకు జ్ఞాపకం చేస్తున్నాయి. దేవుడు ఏదేనులో మనుషులకు కానీ, జంతువులకు కానీ మరోజీవిని చంపి తినే హక్కును ఇవ్వలేదు.

ఈ 29,30 వచనాలు కొందరు సరిగా అర్థం చేసుకోలేక మొక్కలలో కొన్ని విషపూరితమైనవి కూడా ఉంటాయని, దేవుడు ఆదాము హవ్వలకు సమస్త శాఖాల్నీ భుజించమని చెబితే, వారు వాటిని కూడా తిని చనిపోయే అవకాశం ఉంటుందిగా అని ప్రశ్నిస్తుంటారు. కానీ, ఏదేనుతోటలో మనిషికి మరణమే లేదు, అటువంటప్పుడు వారు ఏది తిన్నప్పటికీ వారికి హానికరం కాలేదు. అదేవిధంగా, ప్రారంభంలో దేవుడు చేసిన సమస్తమూ చాలా మంచిదిగా ఉందని ఈ అధ్యాయంలో మరలా మరలా జ్ఞాపకం చెయ్యబడింది.

31వ వచనం కూడా అదే తెలియచేస్తుంది. దేవుడు మంచివాడు కాబట్టి ఆయన చేసిన సమస్తమూ మంచిగానే మారిందని, ఆదాము హవ్వల పాపఫలితంగానే చెడు అనేది లోకంలో ప్రవేశించిందని మనం పైభాగాల్లో చూసాము. ఆదాము హవ్వలు పాపం చేసే వరకూ భూమిపైన ఎటువంటి హానికరమైన చెట్లూ మొలవలేదు, అటువంటివన్నీ తరువాతనే పుట్టుకువచ్చాయి.

ఆదికాండము 3:17,18
ఆయన ఆదాముతోనీవు నీ భార్యమాట వినితినవద్దని నేను నీ కాజ్ఞాపించిన వృక్షఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపింపబడియున్నది; ప్రయాసముతోనే నీవు బ్రదుకు దినములన్నియు దాని పంట తిందువు; అది ముండ్ల తుప్పలను గచ్చపొదలను నీకు మొలిపించును; పొలములోని పంట తిందువు.

మన దేహాన్ని గాయపరిచే ముళ్లుచెట్లు కూడా ఆదాము హవ్వల పాపం తరువాతనే వారికి శాపంగా మొలచినట్టు ఇక్కడ చూడగలం. అటువంటప్పుడు దానికి ముందుకాలంలో ఏ విషపు చెట్టూ మొలచే అవకాశం లేదు.

అదేవిధంగా, వారు ఏదేను నుండి గెంటివేయబడ్డాక, విషపు మొక్కలు మొలిచాయి కాబట్టి, అందులో వారు వేటిని తినాలో వేటిని తినకూడదో వారికెలా తెలిసిందనే సందేహం కలిగినా దానికి కూడా సమాధానం ఉంది.

మానవుడు పాపం చేసాక వారిని ఏదేను నుండి గెంటివేసినప్పటికీ, దేవుడు వారిని పూర్తిగా విసర్జించలేదు. ఒకవేళ పూర్తిగా విసర్జిస్తే ఏదేను నుండి గెంటివేసేటప్పుడు ఆదాముహవ్వలకు చర్మపు చొక్కాయిలు ఎందుకు చేసిస్తాడు?

ఈ వచనాలు చూడండి;
యెషయా 28:24-29
దున్నువాడు విత్తుటకు నిత్యము తన పొలముదున్నునా? అతడు దుక్కి పెల్లలు నిత్యము బద్దలగొట్టునా? అతడు నేల సదునుచేసిన తరువాత నల్ల జీలకఱ్ఱ చల్లును తెల్ల జీలకఱ్ఱ చల్లును గోధుమలు వరుసగా విత్తును యవలను తానేర్పరచిన చేనిలో చల్లును దాని అంచున మిరపమొలకలు వేయును గదా? వాని దేవుడే తగిన క్రమము వానికి నేర్పియున్నాడు ఆయన వానికి ఆ పని బోధించుచున్నాడు. సేద్యగాడు నల్ల జీలకఱ్ఱ పదునుగల యంత్రముచేత నూర్చడు బండిచక్రములను జీలకఱ్ఱమీద నడిపింపడు గాని కఱ్ఱచేత నల్ల జీలకఱ్ఱను చువ్వచేత జీలకఱ్ఱను దుళ్ల గొట్టును గదా? మనుష్యులు గోధుమలు గాలింపగా దాని నలుచుదురా? సేద్యగాడును ఎల్లప్పుడు దాని నూర్చుచుండడు ఎల్లప్పుడును అతడు బండిచక్రమును గుఱ్ఱములను దాని మీద నడిపించుచుండడు, దాని నలుపడు గదా! జనులు సైన్యములకధిపతియగు యెహోవాచేత దాని నేర్చుకొందురు. ఆశ్చర్యమైన ఆలోచనశక్తియు అధిక బుద్ధియు అనుగ్రహించువాడు ఆయనే.

మనం చూసిన ఈ వచనాలలో మానవుడు వ్యవసాయం చేయడానికి దేవుడు నేర్పిన క్రమమే కారణమనీ, దేవుడే తగిన బుద్ధిని ప్రసాదించి ఎప్పుడు ఏది చేయాలో నేర్పిస్తున్నాడనీ రాయబడింది. పాపం ద్వారా ఏదేను నుండి బయటకు త్రోసివేయబడిన ఆదాము హవ్వలకు, వారినుండి వచ్చే మనుషులందరికీ ఏ ఆహారం తింటే ఆరోగ్యకరమో, ఏదితింటే హానికరమో, దేవుడే తగిన క్రమాన్ని నేర్పించాడు.

(ఈ సమస్త సృష్టినీ అందులోని జీవరాసులను దేవుడే సృష్టించాడనీ ఇప్పటివరకూ మనం చూసిన బైబిల్ సత్యానికి వ్యతిరేకంగా నాస్తికులు ప్రస్తావించే డార్విన్ జీవపరిణామ సిద్ధాంతం ఎంత ఊహాజనితమో సైన్స్ ప్రకారం అది ఎంత అవాస్తవమో తెలుసుకోవడానికి ఈ వ్యాసం చదవండి)

డార్విన్ జీవపరిణామ సిద్ధాంతం వాస్తవమా లేక ఊహాజనితమా?

Add comment

Security code
Refresh

Comments  

# దయచేసి అన్ని పుస్తకాల వ్యాఖ్యానించగలరూSajeev paul 2020-12-13 13:32
వ్యాఖ్యలు verse by verse అద్భుతమైన రీతిలో ఉన్నాయి ..ఇలాగే దయచేసి బైబిల్ లోని అన్ని పుస్తకాల పై అందించగలరు ..
Sajeev
9949939869
Reply
# RE: దయచేసి అన్ని పుస్తకాల వ్యాఖ్యానించగలరూNarasimhudu 2020-12-20 20:28
Sure Brother. Thank you for encouraging us.
Reply
 

హితబోధ అనే ఈ వెబ్ సైట్ తెలుగు క్రైస్తవ జనులకు ఆధ్యాత్మిక, అనుసరణీయ, ప్రశ్నల నివృత్తిని కలిగించేలా నిర్మించబడినది. అంతేగాక, దుర్బోధలకు ధీటైన సమాధానాలను మరియు జీవితంలో అనేక చిక్కు ప్రశ్నలకు సరైన సమాధానాలను అనేక ప్రఖ్యాతగాంచిన దైవజనుల చేత ఇప్పించడం జరిగింది.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : హితబోధ ఎప్పుడూ, ఎవ్వరినీ ఆర్థిక సహాయం కోరదు; ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.