పాత నిబంధన

రచయిత: కె విద్యా సాగర్
ఆదికాండము 46:1
అప్పుడు ఇశ్రాయేలు తనకు కలిగినదంతయు తీసికొని ప్రయాణమై బెయేర్షెబాకు వచ్చి తన తండ్రియైన ఇస్సాకు దేవునికి బలులనర్పించెను. 
 
ఈ వచనంలో  యోసేపు బ్రతికేయుండి ఐగుప్తును పాలిస్తున్నాడని తెలుసుకున్న యాకోబు ముందటి అధ్యాయంలో "నేను చావకముందే వెళ్ళి యోసేపును చూస్తానని" పలికినమాట ప్రకారం ఐగుప్తుకు ప్రయాణమై అక్కడికి సరాసరిగా వెళ్ళిపోకుండా బెయెర్షెబాలో నిలిచి దేవునికి బలులు అర్పిస్తున్నట్టు మనం చూస్తాం. 
ఈ బెరేర్షెబాలో అబ్రాహాము దేవునికి ప్రార్థన చేసాడు (ఆదికాండము 21: 33). తరువాత ఇస్సాకుకు కూడా దేవుడు ఇదే ప్రాంతంలో ప్రత్యక్షమై తన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసాడు‌ (ఆదికాండము 26: 23,24).
 
ఆదికాండము 46:2,3
అప్పుడు రాత్రి దర్శనములయందు దేవుడు యాకోబూ యాకోబూ అని ఇశ్రాయేలును పిలిచెను. అందుకతడు చిత్తము ప్రభువా అనెను. ఆయన నేనే దేవుడను, నీ తండ్రి దేవుడను, ఐగుప్తునకు వెళ్లుటకు భయపడకుము, అక్కడ నిన్ను గొప్ప జనముగా చేసెదను. 
 
ఈ వచనాలలో బెయేర్షెబాలో నిలిచిన యాకోబుకు దేవుడు స్వప్నంలో ప్రత్యక్షమై,  ఐగుప్తుకు వెళ్ళడానికి‌ భయపడవద్దని, నిన్ను అక్కడ గొప్పజనంగా చేస్తానని చెప్పడం మనం చూస్తాం. 
అప్పటికే ఐగుప్తుకు ప్రయాణమైన యాకోబుకు దేవుడు మరలా అక్కడికి వెళ్ళడానికి భయపడవద్దని ఎందుకు చెబుతున్నాడంటే, యోసేపుపై‌ ఉన్న ప్రేమను బట్టి అతను ఐగుప్తుకు బయలుదేరినప్పటికీ అతని మనసులో కొన్ని భయాలైతే తప్పకుండా ఉన్నాయి. అవేమిటంటే, గతంలో తన తండ్రియైన ఇస్సాకు కనాను దేశంలో కరవును‌ బట్టి ఐగుప్తుకు ప్రయాణమైనపుడు దేవుడు అతనికి ప్రత్యక్షమై అక్కడికి‌ వెళ్ళవద్దని చెప్పాడు‌ (ఆదికాండము 26:1). ఈ చరిత్ర తెలిసిన యాకోబుకు తాను ఐగుప్తుకు వెళ్ళడం దేవునికి అనుకూలమా కాదా అనే భయం ఉంది. ఎందుకంటే దేవుడు అబ్రాహాము ఇస్సాకు యాకోబులు ముగ్గురికీ ఈ కనాను దేశంలో సంచరించమని ఆజ్ఞాపించాడు. అందుకే అటువంటి భయంలో‌ ఉన్న యాకోబుకు ఆయన ఈ సందర్భంలో ప్రత్యక్షమై ఐగుప్తుకు వెళ్ళడానికి భయపడవద్దు నిన్ను అక్కడ గొప్పజనంగా చేస్తానని ధైర్యపరుస్తున్నాడు. 
 
ఇక్కడ యాకోబుకు దేవుని ఆజ్ఞలపట్ల ఉన్న భయాన్ని గమనించండి. ఎప్పుడో చనిపోయాడు అనుకుంటున్న తన ప్రియకుమారుడు బ్రతికేయుండి ఐగుప్తును పరిపాలిస్తున్నాడని ఇతను తెలుసుకున్నప్పటికీ, మొదట అక్కడికి వెళ్ళడానికి సిద్ధపడినప్పటికీ సరాసరిగా వెళ్ళిపోకుండా బెయేర్షెబాలో నిలిచిపోయాడు. అక్కడ దేవునికి బలులను అర్పించి భయంతో ఆయన‌‌ మాటకోసం ఎదురుచూస్తున్నాడు. కాబట్టి విశ్వాసులు దేవుని ఆజ్ఞలవిషయంలో తప్పిపోతామేమో అని యాకోబులా భయంకలిగి జీవించాలి.
వారు చేస్తున్న ప్రతీకార్యం దైవాంగీకారమా కాదా అనేదానిని వాక్యాన్ని బట్టి సరిచూసుకోవాలి.
 
ఆదికాండము 46:4
నేను ఐగుప్తునకు నీతోగూడ వచ్చెదను, అంతేకాదు నేను నిశ్చయముగా నిన్ను తిరిగి తీసికొని వచ్చెదను, యోసేపు నీ కన్నుల మీద తన చెయ్యియుంచునని సెలవియ్యగా-
 
ఈ వచనంలో దేవుడు నేను నీతోకూడా ఐగుప్తుకు వచ్చి నిన్ను మరలా‌ ఈ దేశానికి తిరిగి తీసుకువస్తానని యాకోబుతో చెప్పడం మనం చూస్తాం. ఇక్కడ దేవుడు నిన్ను మరలా తీసుకువస్తాను అంటే అతను బ్రతికుండగా తిరిగి కనానుకు వస్తాడని కాదు, అందుకే ఆ క్రిందిమాటల్లోనే యోసేపు సమక్షంలో అతని మరణం జరుగుతుందని కూడా దేవుడు ప్రకటించాడు యోసేపు ఐగుప్తులో ఉన్నాడు. కాబట్టి ఆయన యాకోబును ఐగుప్తు నుండి కనానుకు తిరిగితీసుకుని రావడమంటే అది అతని సంతానం గురించి‌ చెప్పబడుతుందని మనం అర్థం చేసుకోవాలి. 
 
ఉదాహరణకు దేవుడు ఈమాటలు పలికేసరికి యాకోబు ముసలివాడు. కానీ ఆయన మూడవ వచనంలో నిన్ను గొప్పజనంగా చేస్తానని‌ కూడా చెబుతున్నాడు.  దానికి యాకోబు మరలా పిల్లలను కంటాడని కాదు, అప్పటికే ఉన్న అతని సంతానం గొప్పజనంగా మారుతుందని అర్థం. 
అదేవిధంగా ఇశ్రాయేలీయుల జనాంగాన్ని యాకోబు పేరుతో సంబోధించిన ఎన్నో వచనాలు మనకు లేఖనాలలో కనిపిస్తాయి‌ (సంఖ్యాకాండము 24: 5  యెషయా 41: 8  44: 1)  కాబట్టి నేను పైన చెప్పినట్టుగా దేవుడు యాకోబుతో నిన్ను మరలా కనానుకు తీసుకువస్తాను అంటే అతని సంతానం కనానుకు తిరిగివస్తుందని అర్థం.
 
ఆదికాండము 46:5,6
యాకోబు లేచి బెయేర్షెబా నుండి వెళ్లెను. ఫరో అతనినెక్కించి తీసికొని వచ్చుటకు పంపిన బండ్లమీద ఇశ్రాయేలు కుమారులు తమ తండ్రియైన యాకోబును తమ పిల్లలను తమ భార్యలను ఎక్కించిరి.  వారు, అనగా యాకోబును అతని యావత్తు సంతానమును, తమ పశువులను తాము కనానులో సంపాదించిన సంపద యావత్తును తీసికొని ఐగుప్తునకు వచ్చిరి. 
 
ఈ వచనాలలో యాకోబు దేవుని మాటల చేత ధైర్యపరచబడి, యోసేపు పంపించిన బండ్లపై ఐగుప్తుకు వెళ్ళడం మనం చూస్తాం.
 
ఆదికాండము 46:7
అతడు తన కుమారులను తన కుమారుల కుమారులను తన కుమార్తెలను తన కుమారుల కుమార్తెలను తన యావత్తు సంతానమును ఐగుప్తునకు తనతో కూడ తీసికొనివచ్చెను. 
 
ఈ వచనాలలో యాకోబుతో పాటుగా ఐగుప్తుకు వచ్చిన అతని కుటుంబీకుల గురించి రాయబడడం మనం చూస్తాం. ఆ జాబితాలో అతనికి కుమార్తెలు కూడా ఉన్నట్టు కనిపిస్తుంది కానీ యాకోబు చరిత్రను మనం పరిశీలించినప్పుడు అతనికి దీనా తప్ప మరో కుమార్తె లేదు. కొందరు ఇక్కడ కుమార్తెలు అనే బహువచనం ఆధారంగా అతనికి‌ దీనా మాత్రమే కాక మరికొందరు కుమార్తెలు కూడా ఉన్నారని భావిస్తుంటారు కానీ, హెబ్రీయులు తమ కోడళ్ళను కూడా కొన్నిసార్లు కుమార్తెలుగా సంబోధిస్తారు కాబట్టి ఇక్కడ చెప్పబడుతున్న అతని కుమార్తెలలో దీనా మినహా మిగిలినవారంతా అతని కోడళ్ళే అని మనం అర్థం చేసుకోవాలి. 
 
ఎందుకంటే, ఐదవ వచనంలో యాకోబు కుమారులు యోసేపు పంపించిన బండ్లపైన‌ వారి తండ్రినీ, తమ పిల్లలనూ, తమ భార్యలను కూడా ఎక్కించినట్టు రాయబడింది. కానీ ఈ వచనంలో యాకోబుతో పాటుగా అతని కుటుంబీకులు ఎవరెవరు ఐగుప్తుకు వచ్చారో వివరించేటప్పుడు తన కుమారులు, కుమార్తెలు, తన కుమారుల కుమారులు, తన‌ కుమారుల కుమార్తెలు వచ్చారని రాయబడిందే తప్ప కోడళ్ళు కూడా వచ్చారని రాయబడలేదు. కాబట్టి అక్కడ చెప్పబడిన యాకోబు కుమార్తెలలో దీనాతో పాటుగా కోడళ్ళు కూడా ఉన్నారు. ఈ అధ్యాయం 26వ వచనంలో గ్రంథకర్త ఐగుప్తుకు వచ్చిన యాకోబు కుటుంబపు సంఖ్య విషయంలో  కోడళ్ళను మినహాయించాడు కానీ, పై వచనంలో మాత్రం వారిని మినహాయించకుండా యాకోబుతో పాటు ఎవరెవరు వచ్చారో స్పష్టంగానే చెబుతున్నాడు.
 
ఆదికాండము 46:8
యాకోబును అతని కుమారులును ఐగుప్తునకు వచ్చిరి. ఇశ్రాయేలు కుమారుల పేళ్లు ఇవే.
 
ఈ వచనంలో యాకోబు అతని కుమారులు ఐగుప్తుకు వచ్చారని రాయబడిన తరువాత అతని కుమారుల జాబితా మొత్తం ఇవ్వబడడం మనం చూస్తాం. ఈ వంశావళిని మనం చదివేటపుడు వీరంతా‌ యాకోబు సంతానం‌ అన్నట్టుగానే చూడాలి తప్ప వీరందరూ యాకోబుతో ఐగుప్తుకు వచ్చినట్టుగా మాత్రం కాదు.  
ఎందుకంటే 1దినవృత్తాంతములు 8వ అధ్యాయం, సెప్టువజింటు, మరియు మరికొన్ని రాతప్రతుల ప్రకారం ఈ అధ్యాయంలో చెప్పబడుతున్న బెన్యామీను కుమారుల పేర్లలో కొందరు అతనికి మనువలు. యాకోబు జీవిత కాలపరిధిని బట్టి చూస్తే అతని కుటుంబం ఐగుప్తుకు వెళ్ళేసరికి అందరికంటే చిన్నవాడైన బెన్యామీనుకు మనువలు పుట్టే అవకాశం లేదు, వారు ఐగుప్తులో పుట్టినవారే (మరి కొందరి మనువలు కూడా). కాబట్టి గ్రంథకర్త ఇక్కడ యాకోబు తాను బ్రతికిన కాలమంతటిలో (ఐగుప్తులో అతను ఉన్న 17 సంవత్సరాలతో సహా) అతనికి కలిగిన సంతానపు వారందరినీ ప్రస్తావిస్తూ ఐగుప్తులో ప్రవేశించడం అనేది వారి జీవితాలలో ప్రాథమిక ఘట్టం కాబట్టి అలా పేర్కొన్నాడు. ఇందులో మనకు ఎటువంటి సమస్యా లేదు, ఎందుకంటే ఈ అధ్యాయం‌ 27వ వచనంలో ఐగుప్తులో యోసేపుకు పుట్టిన పిల్లలు కూడా అక్కడికి వచ్చినవారిగానే రాయబడ్డారు. 
 
ఆదికాండము 46:8-15
యాకోబును అతని కుమారులును ఐగుప్తునకు వచ్చిరి. ఇశ్రాయేలు కుమారుల పేళ్లు ఇవే. యాకోబు జ్యేష్ఠ కుమారుడు రూబేను. రూబేను కుమారులైన హనోకు పల్లు హెస్రోను కర్మీ.  షిమ్యోను కుమారులైన యెమూయేలు యామీను ఓహదు యాకీను సోహరు కనానీయురాలి కుమారుడైన షావూలు.  లేవి కుమారులైన గెర్షోను కహాతు మెరారి  యూదా కుమారులైన ఏరు ఓనాను షేలా పెరెసు జెరహు. ఆ ఏరును ఓనానును కనాను దేశములో చనిపోయిరి. పెరెసు కుమారులైన హెస్రోను హామూలు.  ఇశ్శాఖారు కుమారులైన తోలా పువ్వా యోబు షిమ్రోను. జెబూలూను కుమారులైన సెరెదు ఏలోను యహలేలు. వీరు లేయా కుమారులు. ఆమె పద్దనరాములో యాకోబు వారిని అతని కుమార్తెయైన దీనాను కనెను. అతని కుమారులును అతని కుమార్తెలును అందరును ముప్పది ముగ్గురు. 
 
ఈ వచనాలలో లేయా ద్వారా యాకోబుకు కలిగిన సంతానం దీనా కాకుండా 33 మందని రాయబడడం మనం చూస్తాం. అయితే ఇక్కడ కుమార్తెలు అనే బహువచన ప్రయోగం మనకు కనిపిస్తుంది. దీని ఆధారంగా  కొందరు యాకోబుకు దీనానే కాకుండా మరికొందరు కుమార్తెలు కూడా ఉండియుంటారని అభిప్రాయపడతారు కానీ, యాకోబు జీవితచరిత్రలో తనకు పుట్టిన సంతానపు‌ వివరాలు వారు ఎక్కడెక్కడ ఎవరెవరికి పుట్టారో కూడా స్పష్టంగా తెలియచెయ్యబడ్డాయి.  
 
ఈ కారణం చేత యాకోబుకు దీనా కాకుండా ఇతర కుమార్తెలు ఉన్నారని చెప్పలేము (ఇతర వంశావళులతో పోల్చలేము). కాబట్టి ఇక్కడ దీనాను కుమార్తెలు అని‌ బహువచనంతో సంబోధించడం బాషాపరమైన వాడుకగానే మనం అర్థం చేసుకోవాలి.
ఉదాహరణకు 7వ వచనంలో యాకోబుతో పాటుగా అతని కుమారుల కుమార్తెలు కూడా వచ్చినట్టు రాయబడింది‌ కానీ యాకోబు కుమారులలో ఆషేరుకు మాత్రమే శెరహు అనే ఒకే కుమార్తె ఉంది (17వ).
 
ఆదికాండము 46:16-18
గాదు కుమారులైన సిప్యోను హగ్గీ షూనీ ఎస్బోను ఏరీ ఆరోదీ అరేలీ. ఆషేరు కుమారులైన ఇమ్నా ఇష్వా ఇష్వీ బెరీయా; వారి సహోదరియైన శెరహు. ఆ బెరీయా కుమారులైన హెబెరు మల్కీయేలు. లాబాను తన కుమార్తెయైన లేయాకిచ్చిన జిల్పా కుమారులు వీరే. ఆమె యీ పదునారు మందిని యాకోబునకు కనెను. 
 
ఈ వచనాలలో జిల్పా ద్వారా యాకోబుకు కలిగిన సంతానం 16 మందని రాయబడడం మనం చూస్తాం.
 
ఆదికాండము 46:19-22
యాకోబు భార్యయైన రాహేలు కుమారులైన యోసేపు బెన్యామీను. యోసేపునకు మనష్షే ఎఫ్రాయిములు పుట్టిరి. వారిని ఐగుప్తుదేశమందు ఓనుకు యాజకుడగు పోతీఫెర కుమార్తెయైన ఆసెనతు అతనికి కనెను. బెన్యామీను కుమారులైన బెల బేకెరు అష్బేలు గెరా నయమాను ఏహీరోషు ముప్పీము హుప్పీము ఆర్దు. యాకోబునకు రాహేలు కనిన కుమారులగు వీరందరు పదునలుగురు. 
 
ఈ వచనాలలో రాహేలు ద్వారా యాకోబుకు కలిగిన సంతానం 16 మందని రాయబడడం మనం చూస్తాం. ఇందులో బెన్యామీను కుమారులుగా చెప్పబడున్న కొందరు అతని మనువలుగా 1 దినవృత్తాంతములు 8వ అధ్యాయంలోనూ, సెప్టువజింటులోనూ, మరికొన్ని రాతప్రతుల్లోనూ పేర్కోబడింది. కాబట్టి వీరిలో కొందరు అతను ఐగుప్తుకు వెళ్ళాక పుట్టినవారే.‌ అదేవిధంగా బెన్యామీను కుమారులలో ఏహీరోషు అనే పేరును తెలుగులో ఒకే వ్యక్తి పేరుగా తర్జుమా చేసారు కానీ ఏహీ, రోషు అనేవి ఇద్దరు వ్యక్తుల పేర్లు. 
ఇంగ్లీషు భాషలోనూ, మూలభాషలోనూ ఆ విధంగానే మనకు కనిపిస్తుంది.
 
ఆదికాండము 46:23-25
దాను కుమారుడైన హుషీము. నఫ్తాలి కుమారులైన యహనేలు గూనీ యేసెరు షిల్లేము. లాబాను తన కుమార్తెయైన రాహేలునకు ఇచ్చిన బిల్హా కుమారులు వీరే. ఆమె వారిని యాకోబునకు కనెను. వారందరు ఏడుగురు.
 
ఈ వచనాలలో బిల్హా ద్వారా యాకోబుకు కలిగిన సంతానం 7 మందని రాయబడడం మనం చూస్తాం.
 
ఆదికాండము 46:26 
యాకోబు కోడండ్రను వినాయించి అతని గర్భవాసమున పుట్టి యాకోబుతో ఐగుప్తునకు వచ్చినవారందరు అరువది ఆరుగురు. 
 
ఈ వచనంలో యాకోబు కోడళ్ళు కాకుండా అతనితో పాటుగా వచ్చినవారు 66 మందని రాయబడడం మనం చూస్తాం.  ఈ లెక్కలో మనం యోసేపునూ, అతని ఇద్దరి కుమారులను, యాకోబును కూడా చేర్చకూడదు. అలా చూసినప్పుడు:
 
యాకోబు పదకొండుమంది కుమారులు, ఒక కూమార్తె 12
రూబేను కుమారులు 4
షిమ్యోను కుమారులు 6
లేవీ‌ కుమారులు 3
యూదా కుమారులు, మనవళ్ళు 5
ఇశ్శాకారు కుమారులు 4
జెబులూను కుమారులు 3
గాదు కుమారులు 7
ఆషేరు కుమారులు, కుమార్తె 7
దాను కుమారులు 1
నప్తాలీ కుమారులు 4
బెన్యామీను కుమారులు 10
మొత్తం66 మంది
  
స్తెఫను తన ప్రసంగంలో వీరితో (66మంది) పాటు యాకోబు కోడళ్ళను కూడా లెక్కించి వారు 75 మందని చెబుతున్నాడు, అందుకే అతను "పితరులను" అనకుండా "స్వజనులను" అనే పదప్రయోగం చేసాడు. (అపొ. కార్యములు 7:14). అందులో కూడా యోసేపు, అతని ఇద్దరి కుమారులు మినహాయించబడ్డారు, ఎందుకంటే వారు యాకోబుతో కలసి ఐగుప్తుకు వెళ్ళలేదు అతనికంటే ముందే ఐగుప్తులో ఉన్నారు.
 
ఆదికాండము 46:27
ఐగుప్తులో అతనికి పుట్టిన యోసేపు కుమారులిద్దరు. ఐగుప్తునకు వచ్చిన యాకోబు కుటుంబపువారందరు డెబ్బదిమంది. 
 
ఈ వచనంలో గ్రంథకర్త 26వ వచనంలో తాను యాకోబు కోడళ్ళను మినహాయించి చెప్పిన 66 మందికీ, ఇక్కడ యాకోబునూ, యోసేపునూ, అతని ఇద్దరు కుమారులనూ కలపి వారందరూ 70 మందని చెబుతున్నాడు. యోసేపు కుమారులిద్దరూ ఐగుప్తులోనే పుట్టినప్పటికీ వారు యాకోబు కుమారులుగానే పిలవబడ్డారు (ఆదికాండము 48:5).
 
ఈ 70 మందిలో కూడా గ్రంథకర్త యాకోబు కోడళ్ళ సంఖ్యను‌ చేర్చలేదు ఎందుకంటే అతను యాకోబు గర్భంనుండి వచ్చిన సంతానాన్ని మాత్రమే పరిగణలోకి తీసుకున్నాడు.
 
ద్వితియోపదేశకాండము 10: 22 
నీ పితరులు డెబ్బది మందియై ఐగుప్తునకు వెళ్లిరి. ఇప్పుడు నీ దేవుడైన యెహోవా ఆకాశనక్షత్రములవలె నిన్ను విస్తరింపజేసియున్నాడు.
 
కేవలం స్తెఫను మాత్రమే, అప్పటికే ఐగుప్తులో ఉన్న యోసేపునూ, అతని‌ ఇద్దరి కుమారులనూ మినహాయించి మిగిలిన యాకోబు సంతానం 66 మందితో అతనినీ, అతని కోడళ్ళను కూడా కలిపి వారు 75 మందని పేర్కొన్నాడు, ఎందుకంటే అతను ఐగుప్తులో ఉన్న యోసేపు యాకోబుతో పాటుగా  తన దగ్గరకు ఎంతమందిని పిలిపించాడో (యాకోబుతో కలసి ఎంతమంది వచ్చారో - 75)  ఆ వివరాలను చెబుతున్నాడు.
 
అపొస్తలుల కార్యములు 7:14
యోసేపు తన తండ్రియైన యాకోబును తన స్వజనులందరిని పిలువనంపెను. "వారు డెబ్బదియయిదుగురు". 
 
దీనిప్రకారం ప్రకారం యాకోబుతో పాటు ఐగుప్తుకు వచ్చిన అతని కోడళ్ళు 9 మంది. మిగిలిన కుమారుల భార్యలు బహుశా యూదా భార్యవలే చనిపోయి ఉండవచ్చు.
 
ఆదికాండము 46:28,29
అతడు గోషెనుకు త్రోవ చూపుటకు యోసేపునొద్దకు తనకు ముందుగా యూదాను పంపెను. వారు గోషెను దేశమునకు రాగా యోసేపు తన రథమును సిద్ధము చేయించి తన తండ్రియైన ఇశ్రాయేలును ఎదుర్కొనుటకు గోషెనుకు వెళ్లి అతనికి కనబడెను. అప్పుడతడు అతని మెడమీద పడి అతని మెడ పట్టుకొని యెంతో ఏడ్చెను.
 
ఈ వచనాలలో యాకోబు ఐగుప్తుకు రాగానే యోసేపు అతనిని కలుసుకుని వారిమధ్య ఉన్న ప్రేమను బట్టి ఎంతగానో ఏడ్చినట్టు మనం చూస్తాం. లోకంలో చాలామంది ప్రేమలు వారు దూరంగా ఉన్న కాలం పెరిగే కొద్దీ సమసిపోతుంటాయి, కానీ యాకోబు యోసేపుల మధ్య ఇరవై సంవత్సరాలుగా యెడబాటు‌ కలిగినప్పటికీ వారికి ఒకరిపట్ల ఒకరికి ప్రేమ తరగలేదు.
 
ఆదికాండము 46:30
అప్పుడు ఇశ్రాయేలు యోసేపుతో నీవింక బ్రదికియున్నావు. నీ ముఖము చూచితిని గనుక నేనికను చనిపోవుదునని చెప్పెను. 
 
ఈ వచనంలో యాకోబు తన జీవితానికి ఇంకేమీ అక్కర్లేదు అన్నట్టుగా, తృప్తితో నిన్ను చూసాను కాబట్టి ఇక నేను చనిపోతాను అని‌ పలకడం మనం చూస్తాం. కానీ మరణ దినం అనేది దేవుని వశం, ఒక మనిషి నేను చనిపోవాలి అనుకున్నా, నేను బ్రతకాలి అనుకున్నా అది కేవలం దేవుని వశం. అందుకే ఇక్కడ నేనిక చనిపోతాను అని పలికిన యాకోబు ఐగుప్తుకు‌ వెళ్ళాక ఇంకా 17 సంవత్సరాలు జీవించాడు.
 
ఆదికాండము 46:31-34 
యోసేపు తన సహోదరులను తన తండ్రి కుటుంబపు వారిని చూచి నేను వెళ్లి యిది ఫరోకు తెలియచేసి, కనానుదేశములో ఉండిన నా సహోదరులును నా తండ్రి కుటుంబపువారును నాయొద్దకు వచ్చిరి ఆ మనుష్యులు పశువులు గలవారు, వారు గొఱ్ఱెల కాపరులు. వారు తమ గొఱ్ఱెలను పశువులను తమకు కలిగినదంతయు తీసికొనివచ్చిరని అతనితో చెప్పెదను. గొఱ్ఱెల కాపరియైన ప్రతివాడు ఐగుప్తీయులకు హేయుడు గనుక ఫరో మిమ్మును పిలిపించి మీ వృత్తి యేమిటని అడిగినయెడల మీరు గోషెను దేశమందు కాపురముండునట్లు మా చిన్నతనము నుండి ఇదివరకు నీ దాసులమైన మేమును మా పూర్వికులును పశువులు గలవారమైయున్నామని ఉత్తరమియ్యుడని చెప్పెను.
 
ఈ వచనాలలో‌ యోసేపు తన కుటుంబమంతా ఐగుప్తుకు‌ వచ్చినపుడు ఆ విషయాన్ని ఫరోకు తెలియచెయ్యడానికి‌ వెళ్తూ ఫరో మిమ్మల్ని మీ వృత్తి గురించి అడిగినప్పుడు "గొఱ్ఱెల కాపరులు ఐగుప్తీయులకు హేయులు" కాబట్టి మీరు గోషెను ప్రాంతంలో నివసించేట్టుగా మీరు పశువుల కాపరులమని చెప్పమన్నట్టు మనం చూస్తాం.
 
ఈవిధంగా అతను ఐగుప్తు దేశంలోకి  తన కుటుంబాన్ని రప్పించినప్పటికీ, ఆ దేశపు ఆచారాలలో వారు చిక్కుబడకుండా ఒక ప్రత్యేకమైన ప్రాంతంలో  ఉండేటట్టు జాగ్రత తీసుకుంటున్నాడు. అందుకే వారిని ఐగుప్తు కీలక పదవుల్లో‌ నియమించకుండా వారి వృత్తిలోనే కొనసాగింపచేస్తున్నాడు.  మనం కూడా మన కుటుంబాల విషయంలో ఇటువంటి జాగ్రతలు తీసుకోవాలి, వారికి సమృద్ధి కలిగించే ఉద్యోగాలుండే ప్రాంతాలలో వారు కొనసాగడం కంటే, దేవునికి దూరం కాకుండా చూసుకోవడం ప్రాముఖ్యం.
ఇంతకూ గొఱ్ఱెల కాపరియైనవాడు ఐగుప్తీయులకు ఎందుకు హేయుడో నేను ఇప్పటికే వివరించాను (ఆదికాండము 43:32 వాఖ్యానం చూడండి).

Add comment

Security code
Refresh

 

హితబోధ అనే ఈ వెబ్ సైట్ తెలుగు క్రైస్తవ జనులకు ఆధ్యాత్మిక, అనుసరణీయ, ప్రశ్నల నివృత్తిని కలిగించేలా నిర్మించబడినది. అంతేగాక, దుర్బోధలకు ధీటైన సమాధానాలను మరియు జీవితంలో అనేక చిక్కు ప్రశ్నలకు సరైన సమాధానాలను అనేక ప్రఖ్యాతగాంచిన దైవజనుల చేత ఇప్పించడం జరిగింది.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : హితబోధ ఎప్పుడూ, ఎవ్వరినీ ఆర్థిక సహాయం కోరదు; ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.