పాత నిబంధన

రచయిత: కె విద్యా సాగర్

29:1, 29:2, 29:3, 29:4, 29:5, 29:6, 29:7-9, 29:10, 29:11-13, 29:14,15, 29:16,17, 29:18,19, 29:20, 29:21-23, 29:24, 29:25, 29:26, 29:27, 29:28, 29:29, 29:30, 29:31,32, 29:33,34, 29:35

ఆదికాండము 29:1 యాకోబు బయలుదేరి తూర్పు జనుల దేశమునకు వెళ్లెను.

ఈ వచనంలో బేతేలు నుండి ప్రయాణమైన యాకోబు తూర్పు దేశానికి చేరుకున్నట్టు మనం చూస్తాం. తూర్పు జనుల దేశం అంటే సిరియా (ఆదికాండము 31:20, యెషయా 9:12).

ఆదికాండము 29:2 అతడు చూచినప్పుడు పొలములో ఒక బావి కనబడెను. అక్కడ దానియొద్ద గొఱ్ఱెల మందలు మూడు పండుకొనియుండెను. కాపరులు మందలకు ఆ బావి నీళ్లు పెట్టుదురు. ఒక పెద్ద రాయి ఆ బావి మీద మూతవేసి యుండెను.

ఈ వచనంలో యాకోబు ఒక బావి దగ్గరకు చేరుకున్నట్టు మనం చూస్తాం. ఎందుకంటే చుట్టుప్రక్కల ప్రజలు ఏదోఒక సమయంలో నీటికోసం అక్కడికి వస్తారు. వారిని వాకబు చెయ్యడం ద్వారా అతను తన గమ్యానికి చేరుకోవచ్చు. ఆకాలంలో తమ గమ్యాలను ఇలానే తెలుసుకునేవారు (ఆదికాండము 24:11).

ఆదికాండము 29:3 అక్కడికి మందలన్నియు కూడి వచ్చునప్పుడు బావి మీద నుండి ఆ రాతిని పొర్లించి, గొఱ్ఱెలకు నీళ్లు పెట్టి తిరిగి బావిమీది రాతిని దాని చోటనుంచుదురు.

ఈ వచనంలో యాకోబు చేరుకున్న బావిని ఆ ప్రాంతపువారు మూసివేసినట్టు మనం చూస్తాం. కారణం ఏంటంటే; అక్కడ నీరు సమృద్ధిగా లభించే పరిస్థితి ఉండదు కాబట్టి, ఎవరుబడితే వారు ఎప్పుడుబడితే అప్పుడు నీటిని తోడకుండా మందలన్నీ పోగయ్యే సమయంలో మాత్రమే ఆ నీటిని తోడుకునేలా అలా చేసేవారు. అదేవిధంగా అప్పటి బావులు కొన్ని నేలతో సమానంగా ఉండేవి, నీటికోసమని పశువులు అందులో పడిపోకుండా కూడా అలా చేసేవారేమో.

ఆదికాండము 29:4 యాకోబు వారిని చూచి అన్నలారా, మీరెక్కడివారని అడుగగా వారు మేము హారాను వారమనిరి.

ఈ వచనంలో యాకోబు ఆ బావిదగ్గరకు వచ్చిన కాపరులతో మర్యాదగా మాట్లాడడం మనం చూస్తాం. అతను మర్యాదగా "సోదరులారా" అంటూ మాట్లాడాడు కాబట్టే వారు కూడా అతను‌ అడిగినదానికి మర్యాదగా సమాధానం ఇస్తున్నారు. వారి సమాధానం ప్రకారం యాకోబు ఇప్పుడు హారానుకు చేరుకున్నాడు. కాబట్టి విశ్వాసులు చేసే సంభాషణలు మర్యాదపూర్వకంగా ఉండడం చాలా ప్రాముఖ్యం.

ఆదికాండము 29:5 అతడు నాహోరు కుమారుడగు లాబానును మీరెరుగుదురా అని వారినడుగగా వారు ఎరుగుదుమనిరి.

ఈ వచనంలో యాకోబు వారిని లాబాను గురించి వాకబు చెయ్యడం మనం చూస్తాం. వాస్తవానికి లాబాను తండ్రి పేరు బెతూయేలు, అతను నాహోరు కుమారుడు. వారి సంస్కృతుల్లో తాతలను కూడా తండ్రులుగానే సంబోధించేవారు కాబట్టి, బహుశా ఆ ప్రాంతంలో బెతూయేలు కంటే నాహోరు (అబ్రాహాము సహోదరుడు) పేరున్నవాడు అవ్వడం వల్ల యాకోబు అతని పేరునే ప్రస్తావిస్తున్నాడు.

ఆదికాండము 29:6 మరియు అతడు అతడు క్షేమముగా ఉన్నాడా అని అడుగగా వారు క్షేమముగానే ఉన్నాడు. ఇదిగో అతని కుమార్తెయైన రాహేలు గొఱ్ఱెల వెంట వచ్చుచున్నదని చెప్పిరి.

ఈ వచనంలో యాకోబుకు రాహేలును గురించిన సమాచారం తెలియడం మనం చూస్తాం. క్రింది వచనాల ప్రకారం; ఇంకా బావిపై రాయి పొర్లించే సమయం కాలేదు. అయినప్పటికీ ఆమె ముందుగానే ఆ చోటికి వచ్చింది, అది యాదృచ్ఛికం కాదు దేవుని నడిపింపు. ప్రపంచంలో జరిగేదేదీ యాదృచ్ఛికంగా జరగదు, ప్రతీదీ సార్వభౌముడైన దేవుని చిత్తానుసారంగానే జరుగుతుంది. అందుకే "ఆయన తన చిత్తానుసారముగా చేసిన నిర్ణయము చొప్పున సమస్త కార్యములను జరిగించుచున్నాడు" (ఎఫెసీ 1:12) అని రాయబడింది.

ఉదాహరణకు, యోసేపును తన అన్నలు గుంటలో పడవేసిన సమయంలో అటువైపుగా ఇష్మాయేలీయులు ఐగుప్తుకు వెళ్ళడం యాదృచ్ఛికం కాదు, దేవుని నిర్ణయం. మోషేను తన తల్లి జమ్ముపెట్టెలో పెట్టి నీటిలో విడిచిపెట్టినప్పుడు ఫరో కుమార్తె స్నానం చెయ్యడానికి అక్కడికి రావడం, ఆమె పనికత్తె ఆ పెట్టెను చూడడం యాదృచ్ఛికం కాదు, దేవుని నిర్ణయం. ఇలా మన జీవితాలలో కూడా ఏదైన ఆలస్యం అవ్వడం, నష్టపోవడం, మరేదైనా సరే ఏదీ యాదృచ్ఛికం కాదు, అసలు యాదృచ్ఛికం అనే నమ్మకమే ఒక మూఢనమ్మకం. కాలాన్ని నడిపించే సృష్టికర్త ఉన్నప్పుడు ఆ కాలంలోనిది ఏదీ యాదృచ్ఛికం కాజాలదు. విశ్వాసులు ఈ విషయంలో అవగాహన కలిగియుండాలి.

రోమీయులకు 8: 28 దేవుని ప్రేమించువారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడినవారికి, మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని యెరుగుదుము.

ఆదికాండము 29:7-9 అతడు ఇదిగో ఇంక చాలా ప్రొద్దు ఉన్నది, పశువులను పోగుచేయు వేళకాలేదు, గొఱ్ఱెలకు నీళ్లు పెట్టి, పోయి వాటిని మేపుడని చెప్పగా వారుమందలన్నియు పోగుకాకమునుపు అది మావలన కాదు, తరువాత బావిమీద నుండి రాయి పొర్లించుదురు. అప్పుడే మేము గొఱ్ఱెలకు నీళ్లు పెట్టుదుమనిరి. అతడు వారితో ఇంక మాటలాడుచుండగా రాహేలు తన తండ్రి గొఱ్ఱెల మందను తోలుకొని వచ్చెను. ఆమె వాటిని మేపునది.

ఈ వచనాలలో యాకోబుకు ఆ బావికి సంబంధించిన ఒప్పందం గురించి తెలియడం, ఆ సమయంలో రిబ్కా అక్కడికి రావడం మనం చూస్తాం. రాహేలు ఇలా అక్కడికి మందలను తోలుకుని రావడాన్ని బట్టి ఆమె‌ తన‌ మేనత్తయైన రిబ్కా‌వలే పనిమంతురాలైన స్త్రీగా మనకు కనిపిస్తుంది. లేయా జబ్బుకండ్లు కలది కాబట్టి ఆమె‌ ఇలాంటి బాధ్యతలు తీసుకుని‌ ఉండకపోవచ్చు.

ఆదికాండము 29:10 యాకోబు తన తల్లి సహోదరుడైన లాబాను కుమార్తెయగు రాహేలును, తన తల్లి సహోదరుడగు లాబాను గొఱ్ఱెలను చూచినప్పుడు అతడు దగ్గరకు వెళ్లి బావిమీద నుండి రాతిని పొర్లించి తన తల్లి సహోదరుడగు లాబాను గొఱ్ఱెలకు నీళ్లు పెట్టెను. యాకోబు రాహేలును ముద్దు పెట్టుకొని యెలుగెత్తి యేడ్చెను.

ఈ వచనంలో రాహేలును చూసిన యాకోబు ఆ బావి మీద నుండి రాయిని పొర్లించి ఆమె‌ మందకు నీళ్ళు పెట్టడం మనం చూస్తాం. యూదా రచనల్లో దీని గురించి చాలామంది కలసి తీసే రాయిని యాకోబు ఒక్కడే తీసివేయడం అక్కడున్న మనుష్యులను ఆశ్చర్యపరిచిందని రాయబడింది.

అదేవిధంగా ఇక్కడ అతను రాహేలును ముద్దుపెట్టుకున్నట్టు చదువుతున్నాం. ఇది ఆ కాలపు సంస్కృతుల్లో ఇద్దరు బంధువుల మధ్య ఉండే ప్రేమను సూచిస్తుంది. అందుకే క్రింది వచనాలలో లాబాను కూడా యాకోబును ముద్దు పెట్టుకుంటాడు. ఇప్పటికీ కొన్ని దేశాల్లో ఈ సాంప్రదాయం‌ కొనసాగుతుంది. వ్యతిరేక లింగం వారిని ముద్దుపెట్టుకోవడం అనగానే తప్పుగా ఊహించుకుంటే తల్లి కూడా తన కొడుకును ముద్దుపెట్టుకోకూడదు.

ఆదికాండము 29:11-13 మరియు యాకోబు తాను ఆమె తండ్రి బంధువుడనియు, రిబ్కా కుమారుడనియు రాహేలుతో చెప్పినప్పుడు ఆమె పరుగెత్తిపోయి తన తండ్రితో చెప్పెను. లాబాను తన సహోదరి కుమారుడైన యాకోబు సమాచారము వినినప్పుడు అతనిని ఎదుర్కొనుటకు పరుగెత్తికొని వచ్చి అతని కౌగలించి ముద్దుపెట్టుకొని తన యింటికి తోడుకొని పోయెను. అతడు ఈ సంగతులన్నియు లాబానుతో చెప్పెను.

ఈ వచనాలలో రాహేలు తన తండ్రియైన లాబానుకు యాకోబు సమాచారం తెలియచెయ్యడం, అతను యాకోబును తన ఇంటికి ఆహ్వానించడం మనం చూస్తాం. యాకోబు లాబాను ఇంట్లో అతను చూపించే ప్రేమాభిమానాల మధ్య ఏ ఇబ్బందీ లేకుండా నెలరోజులు నివసించాడు. ఇదంతా రిబ్కా ఆలోచించినట్టే మంచిగా జరుగుతుంది. అయితే ఆ నెలరోజులూ‌ గడిచాక తన తండ్రిని మోసగించినందుకు క్రమశిక్షణ ప్రారంభమౌతుంది.

ఆదికాండము 29:14,15 అప్పుడు లాబాను నిజముగా నీవు నా ఎముకయు నా మాంసమునైయున్నావు అనెను. అతడు నెల దినములు అతనియొద్ద నివసించిన తరువాత లాబాను నీవు నా బంధువుడవైనందున ఊరకయే నాకు కొలువు చేసెదవా? నీకేమి జీతము కావలెనో చెప్పుమని యాకోబు నడిగెను.

ఈ వచనాలలో యాకోబును లాబాను జీతానికై పనికి కుదుర్చుకునే ప్రయత్నం చెయ్యడం మనం చూస్తాం. యాకోబు రాహేలును కలుసుకున్నప్పుడే చురుగ్గా బావిమీద రాయిని పొర్లించి మందకు నీరుపెట్టాడు.‌ ఆవిధంగానే అతను లాబాను ఇంట్లో ఉన్న నెలరోజూలూ ఏదో ఒక పనిచేస్తూనే ఉన్నాడు. అది‌ గమనించిన లాబాను అలాంటి చురుకైన వ్యక్తిని అక్కడినుండి వెళ్ళనివ్వకూడదనే ఇలాంటి ప్రయత్నం చేస్తున్నాడు. తన‌ తండ్రి పట్ల జరిగించిన‌ మోసానికి దేవుడతణ్ణి క్రమశిక్షణవైపు నడిపించడంలో ఇది ప్రారంభం. ఎందుకంటే; యాకోబు పొందుకున్న ఆశీర్వాదం ప్రకారం అతనికి తన సోదరుడు‌ దాసుడు ఔతాడు, ఇతను యజమానుడిగా ఉంటాడు. కానీ ప్రస్తుతం అతను లాబాను దగ్గర జీతానికి పనిచేసే దాసుడిగా మారుతున్నాడు. 

అదేవిధంగా లాబాను నీవు నా ఎముకలో ఎముక‌ మాంసములో మాంసమని అతన్ని సంబోధించడం చదువుతున్నాం. ఆ కాలంలో బంధుత్వాన్ని సూచించడానికి ఈ అలంకారం వాడేవారు (2 సమూయేలు 19: 12).

ఆదికాండము 29:16,17 లాబాను కిద్దరు కుమార్తెలుండిరి. వారిలో పెద్దదాని పేరు లేయా. చిన్నదాని పేరు రాహేలు. లేయా జబ్బు కండ్లు గలది. రాహేలు రూపవతియు సుందరియునై యుండెను.

ఈ వచనాలలో లాబాను పెద్దకుమార్తె లేయా జబ్బుకండ్లుగలదని రాయబడడం మనం చూస్తాం. ఆ జబ్బు ఏంటో లేఖనంలో‌ స్పష్టంగా చెప్పబడలేదు కానీ దీనిపై కొందరు వేరువేరు అభిప్రాయాలు వెళ్ళబుచ్చారు. ఏదేమైనప్పటికీ అ కళ్ళు లేయా అందానికి మచ్చగా కనిపిస్తున్నాయి. రాహేలు మాత్రం అందమైనదిగా కనిపిస్తుంది, అందుకే యాకోబు ఆమెనే ప్రేమించాడు. పైగా ఆమె పనిమంతురాలు కూడా.

ఆదికాండము 29:18,19 యాకోబు రాహేలును ప్రేమించి నీ చిన్న కుమార్తెయైన రాహేలు కోసము నీకు ఏడు సంవత్సరములు కొలువు చేసెదననెను. అందుకు లాబాను ఆమెను అన్యునికిచ్చుటకంటె నీకిచ్చుట మేలు. నాయొద్ద ఉండుమని చెప్పగా-

ఈ వచనాలలో యాకోబు రాహేలును ప్రేమించి ఆమెకోసం లాబానుకు 7 సంవత్సరాలు కొలువు చెయ్యడానికి ఒప్పందం చేసుకోవడం మనం చూస్తాం. ఇక్కడ లాబాను ఆమెను అన్యునికివ్వడం కంటే నీకు ఇవ్వడం మేలని పలకడంలో యాకోబును మోసం చేసే ఆలోచన అతనికి ముందు నుండీ ఉన్నట్టు అర్థమౌతుంది. లేయాను కూడా అన్యుడికి ఇవ్వకూడదనే ఉద్దేశంతోనే అతను యాకోబును‌ ప్రణాళిక ప్రకారం మోసం చేసాడు. 

ఆదికాండము 29:20 యాకోబు రాహేలు కోసము ఏడు సంవత్సరములు కొలువు చేసెను. అయినను అతడు ఆమెను ప్రేమించుట వలన అవి అతనికి కొద్ది దినములుగా తోచెను.

ఈ వచనంలో యాకోబు రాహేలును ప్రేమించి ఆమె కోసం 7 సంవత్సరాలు కొలువు చెయ్యడం మనం చూస్తాం. నిజమైన యవ్వనప్రేమకు యాకోబు రాహేలులు మంచి మాదిరిగా కనిపిస్తున్నారు. యాకోబు ఆమె కోసం త్యాగపూరితంగా పనిచేస్తూ ఒకేచోటే ఉంటున్నప్పటికీ వివాహం జరిగేవరకూ వారు తమ పవిత్రతను కోల్పోయి వ్యభిచరించలేదు.

అదేవిధంగా యాకోబు రాహేలుపై ఉన్న ప్రేమతో కొలువు చేసిన ఆ 7 సంవత్సరాలూ అతనికి కొద్ది దినాలుగా తోచిందని రాయబడింది. ఒకరిపై ప్రేమతో చేసే ఏ కష్టమైనా మనకు కష్టంగా అనిపించదు, ఆ సమయం తెలియకుండానే గడచిపోతుంది. అదే ప్రేమ మనకు మన ప్రభువుపై కూడా ఉంటే ఆయనకోసం పడే ఏ ప్రయాసైనా కష్టంగా తోచదు. ఆ ప్రేమతోనే ప్రవక్తలూ అపోస్తలులు ఎన్నో శ్రమలను, ప్రయాసలను, చివరికి మరణాలను కూడా ఇష్టంగా అనుభవించారు.

ఆదికాండము 29:21-23 తరువాత యాకోబు నా దినములు సంపూర్ణమైనవి గనుక నేను నా భార్యయొద్దకు పోవునట్లు ఆమెను నాకిమ్మని లాబాను నడుగగా లాబాను ఆ స్థలములోనున్న మనుష్యులనందరిని పోగుచేసి విందు చేయించి రాత్రి వేళ తన కుమార్తెయైన లేయాను అతనియొద్దకు తీసికొని పోగా యాకోబు ఆమెను కూడెను.

ఈ వచనాలలో లాబాను ఉద్దేశపూర్వకంగా యాకోబును మోసగించడం మనం చూస్తాం. అతను యాకోబును మాత్రమే కాదు తన కుమార్తెయైన రాహేలును కూడా మోసగించాడు. ప్రాచీనకాలపు వివాహాల్లో అక్కడున్న ప్రజలకు రాత్రివేళ విందు చేసి విడివిడిగా ఉన్న వధూవరులను చీకటిగదిలోకి పంపడం ఆనవాయితీ. ఇక్కడ యాకోబు విషయంలో అదే జరిగింది కాబట్టి గదిలో తనతో ఉన్న స్త్రీ ఎవరో గుర్తించలేకపోయాడు. పైగా ఆమె మౌనంగా ఉందేమో. అందువల్ల యాకోబు ఆమె స్వరాన్ని కూడా గుర్తుపట్టలేకపోయాడు.

అయితే ఈ మోసంలో లేయా పాత్ర కూడా ఖచ్చితంగా ఉంది, యాకోబు తన చెల్లెలిని ప్రేమిస్తున్నాడనే విషయం ఆమెకు తెలిసినప్పటికీ ఆమె తన తండ్రి చేసే మోసంతో ఏకీభవించి మౌనంగా ఉండిపోయింది. ఆమెలో నిజాయితీ ఉండుంటే నేను రాహేలును కాదని చెప్పి ఉండేది.  ఈవిధంగా లేయా యాకోబును మోసగించడంలో తండ్రితో పాటు ప్రమేయం చూపించింది.

జరిగిన సంఘటనలో లాబాను, లేయాల మోసంతో పాటు సార్వభౌముడైన దేవుని‌ న్యాయం కూడా మనకు కనిపిస్తుంది. యాకోబును‌ ఆయన క్రమశిక్షణవైపుగా నడిపే క్రమంలో అతను ఎలాగైతే మారువేషంలో తన తండ్రిని మోసగించాడో అదే మారువేషంలో ఉన్న లేయా వల్ల మోసపోయేలా ఆయన నిర్ణయించాడు.

గలతీ 6:7 మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును.

ఆదికాండము 29:24 మరియు లాబాను తన దాసియైన జిల్పాను తన కుమార్తెయైన లేయాకు దాసిగా ఇచ్చెను.

ఈ వచనంలో లాబాను తన కుమార్తెకు జిల్పా అనే స్త్రీని దాసిగా ఇవ్వడం మనం చూస్తాం. ప్రాచీనకాలంలో తాము కొనుగోలు చేసిన దాసదాసీలపై యజమానులకు పూర్తి హక్కు ఉండేది. ఆ హక్కును బట్టి వారు తమ కుమార్తెలకు వివాహం చేసినప్పుడు వారికి సేవలు చెయ్యడానికై వారిని కానుకలుగా ఇచ్చేవారు.

ఆదికాండము 29:25 ఉదయమందు ఆమెను లేయా అని యెరిగి అతడు లాబానుతో నీవు నాకు చేసిన పనియేమిటి? రాహేలు కోసమేగదా నీకు కొలువు చేసితిని? ఎందుకు నన్ను మోసపుచ్చితివనెను.

ఈ వచనంలో యాకోబు రాత్రి తనతో ఉన్నది రాహేలు కాదు లేయా అని గుర్తించి లాబానును ప్రశ్నించడం మనం చూస్తాం. గతంలో తాను కూడా అదే పని‌చేసాడని ఆ పనివల్ల తన అన్న కూడా ఇలానే బాధపడ్డాడని ఇప్పుడతనికి అనుభవమౌతుంది.

ఆదికాండము 29:26 అందుకు లాబాను పెద్దదానికంటె ముందుగా చిన్నదానినిచ్చుట మా దేశమర్యాద కాదు.

ఈ వచనంలో లాబాను యాకోబు ప్రశ్ననుండి తప్పించుకోవడానికి సాకు చెప్పడం మనం చూస్తాం. అతను చెబుతుంది నిజమే ఐతే ఆ విషయం ముందే యాకోబుకు చెప్పేవాడు. పైగా‌ అక్కడున్న ప్రజలను నా చిన్న కుమార్తె వివాహమని విందుకు పిలవడం సాధ్యమయ్యేది కాదు. ఒకవేళ అతను పెద్దకుమార్తె‌ వివాహమనే విందుకు పిలిచుంటే విందుకు వచ్చినవారు యాకోబును కలుసుకోకుండా ఉండరు కాబట్టి, ఆ విషయం యాకోబుకు చెప్పి ఉండేవారు.

ఆదికాండము 29:27 ఈమె యొక్క వారము సంపూర్ణము చేయుము. నీవిక యేడు సంవత్సరములు నాకు కొలువు చేసినయెడల అందుకై ఆమెను కూడ నీకిచ్చెదమని చెప్పగా-

ఈ వచనంలో లాబాను రాహేలు నిమిత్తం మరో 7 సంవత్సారాల కొలువుకు యాకోబును ఒప్పించడం మనం చూస్తాం. యాకోబు ఎలాగైతే తన అన్న ఆకలిని అడ్డుపెట్టుకుని వ్యాపారం తరహాలో బేరానికి దిగాడో ఇక్కడ లాబాను కూడా అలానే చేస్తున్నాడు. ఇదంతా అతడిని క్రమశిక్షణ వైపుగా నడిపే దేవుని నిర్ణయమే. అయితే ఇందులో మోసగించినవారు తమ మోసానికి బాధ్యులుగానే ఉంటారని ఇప్పటికే వివరించాను.

"ఈమెయొక్క వారము సంపూర్ణము చేయుము"

ఆకాలంలో వివాహమయ్యాక ఏడురోజుల పాటు విందు జరిగేది (న్యాయాధిపతులు 14:16,17) ఆ ఏడురాత్రులూ తొలిరాత్రులుగానే పరిగణించబడేవి‌. లాబాను వాటిగురించే ఇక్కడ మాట్లాడుతూ అవి సక్రమంగా పూర్తికానివ్వు, తర్వాత రాహేలును కూడా వివాహం చేసుకొందువు అంటున్నాడు.

ఆదికాండము 29:28 యాకోబు అలాగు చేసి ఆమె వారము సంపూర్తియైన తరువాత అతడు తన కుమార్తెయైన రాహేలును అతనికి భార్యగా ఇచ్చెను.

ఈ వచనంలో యాకోబు ఆ ఏడురోజులూ గడిచాక రాహేలును కూడా వివాహం చేసుకోవడం మనం చూస్తాం. లాబాను అతనితో మొదటిసారి ఒప్పందం చేసుకున్నప్పుడు, ఆ ఏడు సంవత్సరాలు ముగిసాకే లేయాను భార్యగా ఇచ్చాడు. ప్రస్తుతమైతే రాహేలును కూడా భార్యగా ఇచ్చేసి మరో ఏడు సంవత్సరాలు కొలువు చెయ్యమన్నాడు. యాకోబు రాహేలు నిమిత్తం కొలువు చెయ్యవలసిన ఆ ఏడు సంవత్సరాలూ ఇద్దరితోనూ కలిసుండి పిల్లలను కూడా కన్నాడు.

ఆదికాండము 29:29 మరియు లాబాను తన దాసియగు బిల్హాను తన కుమార్తెయైన రాహేలుకు దాసిగా ఇచ్చెను.

ఈ వచనంలో లాబాను రాహేలుకు కూడా బిల్హా అనే స్త్రీని దాసిగా ఇవ్వడం మనం చూస్తాం. ఈవిధంగా లాబాను యాకోబు ఇద్దరు భార్యలకూ ఇద్దరు దాసిలను ఇవ్వడం జరిగింది.

ఆదికాండము 29:30 యాకోబు రాహేలును కూడెను, మరియు అతడు లేయాకంటె రాహేలును బహుగా ప్రేమించి అతనికి మరియేడేండ్లు కొలువు చేసెను.

ఈ వచనంలో యాకోబు రాహేలును కూడా భార్యగా చేసుకున్న తర్వాత లాబానుతో చేసుకున్న ఒప్పందం ప్రకారం; మరో ఏడు సంవత్సరాలు అతనికి కొలువు చెయ్యడం మనం చూస్తాం. "మరియేడేండ్లు" అంటే పైన వివరించినట్టు మొదటి ఏడు సంవత్సరాలు కాకుండా మరో ఏడు సంవత్సరాలని అర్థం. మొత్తానికి యాకోబు తన భార్యల నిమిత్తం 14 సంవత్సరాలు కొలువు చేసాడు (ఆదికాండము 31:41).

ఆదికాండము 29:31,32 లేయా ద్వేషింపబడుట యెహోవా చూచి ఆమె గర్భము తెరిచెను, రాహేలు గొడ్రాలై యుండెను. లేయా గర్భవతియై కుమారుని కని, యెహోవా నా శ్రమను చూచియున్నాడు గనుక నా పెనిమిటి నన్ను ప్రేమించును గదా అనుకొని అతనికి రూబేను అను పేరు పెట్టెను.

ఈ వచనంలో లేయా ద్వేషించబడడం చూసి యెహోవా చూచి ఆమె గర్భాన్ని తెరవడం ఆమెకు రూబేను పుట్టడం మనం చూస్తాం. యాకోబు రాహేలునే ప్రేమించాడనే విషయం ఆమెకు తెలిసినప్పటికీ మోసంతో అతన్ని భర్తగా చేసుకుంది కాబట్టి యాకోబు ఆమెను ద్వేషిస్తూనే ఉన్నాడు. అనగా రాహేలుపై చూపించే ప్రేమ ఆమెపై చూపించట్లేదు. అయినప్పటికీ ఆ విషయంలో ఆమె తన తండ్రికి ఎలాంటి ఫిర్యాదూ చెయ్యలేదు. ఎందుకంటే ఆమె అతణ్ణి మోసం చేసిందనేది ఆమెకు కూడా తెలుసు. అందుకే ఆమె ఎలాంటి ఫిర్యాదులూ చెయ్యకుండా తన తప్పును తెలుసుకుని దేవునిపైనే ఆధారపడింది.

ఈ లేయా వైఖరి ద్వేషించబడుతున్న భార్యాభర్తలకు మంచి మాదిరిగా ఉంది. కాబట్టి వివాహ జీవితంలో భాగస్వామి మనల్ని ద్వేషిస్తున్నప్పుడు మనతప్పేమీ లేదన్నట్టు పిర్యాదులకు పాల్పడకుండా మొదట దానికి కారణమేంటో తెలుసుకోవాలి. కారణం మన పొరపాటే అయ్యుంటే ఆ ద్వేషం న్యాయమని ఎంచి పశ్చాత్తాపంతో దేవునిపై ఆధారపడాలి. భాగస్వామి ద్వేషాన్ని మన ప్రేమతోనే నిర్వీర్యం‌ చెయ్యడానికి ప్రయత్నించాలి. లేయా అలా చేసింది కాబట్టే దేవుడు ఆమెను ప్రేమించాడు. గర్భాన్ని తెరిచాడు. ప్రస్తుతం చాలామంది భార్యాభర్తల్లో ఈ నిజాయితీని మనం చూడలేకున్నాము. మేము అమాయకులం అన్నట్టు అవతలివారిపై ఫిర్యాదులకు పాల్పడేవారే తప్ప తమ తప్పులు ఒప్పుకుని సరిచేసుకునేవారు చాలా అరుదుగా ఉంటున్నారు. అందుకే ఈ మాటలు ప్రత్యేకంగా చెబుతున్నాను. విశ్వాసులైతే ఇలా ఉండకూడదు.

అదేవిధంగా ప్రతీమానవుని జననం ఆయన గర్భాన్ని తెరవడం మూలంగానే జరుగుతుంది‌ (కీర్తనలు 100:3, 127:3).

ఇక ఈ లేయాకు పుట్టిన రూబేను గురించి పరిశీలిస్తే అతను యాకోబుకు జ్యేష్ఠకుమారుడిగా జన్మించినప్పటికీ పెద్దవాడయ్యాక జరిగించిన హేయమైన పనిని బట్టి నిందించబడ్డాడు, జ్యేష్ఠత్వపు హక్కును కూడా కోల్పోయాడు (ఆదికాండము 35:22, 49:3,4, 1 దినవృత్తాంతములు 5:1). 

ఆదికాండము 29:33,34 ఆమె మరల గర్భవతియై కుమారుని కని నేను ద్వేషింపబడితినన్న సంగతి యెహోవా విన్నాడు గనుక ఇతనికూడ నాకు దయచేసెననుకొని అతనికి షిమ్యోను అను పేరు పెట్టెను. ఆమె మరల గర్భవతియై కుమారుని కని తుదకు ఈసారి నా పెనిమిటి నాతో హత్తుకొనియుండును; అతనికి ముగ్గురు కుమారులను కంటిననుకొనెను. అందుచేత అతనికి లేవి అను పేరు పెట్టెను.

ఈ వచనాలలో లేయా మరో ఇద్దరు కుమారులను కూడా కన్నట్టు మనం చూస్తాం. ఆమె మూడవ కుమారుడైన లేవీని‌ కనేవరకూ యాకోబు ఆమెపైన ద్వేషంతోనే వ్యవహరిస్తూ ఉండవచ్చు అందుకే ఆమె‌ ఈసారి నా పెనిమిటి నాతో హత్తుకుని‌ ఉంటాడని పలుకుతుంది. కాబట్టి పైన తెలియచేసినట్టుగా భాగస్వామి విషయంలో మనం పొరపాటు చేసినప్పుడు వారికి కలిగిన ద్వేషం తగ్గడానికి ఎంత ఆలస్యమైనా సహనం కోల్పోకూడదు, లేయా వంటి విశ్వాసులు ఇలాంటి ప్రవర్తననే అనుసరిస్తారు. అదేవిధంగా ఈ సందర్భంలో యాకోబుకు మూడవ కుమారుడిగా లేవి జన్మించడం మనకు కనిపిస్తుంది, ఇతని నుండి వచ్చిన లేవీగోత్రాన్నే దేవుడు తన యాజకత్వం కోసం ప్రత్యేకపరచుకున్నాడు.

ఆదికాండము 29:35 ఆమె మరల గర్భవతియై కుమారుని కని ఈసారి యెహోవాను స్తుతించెదననుకొని యూదా అను పేరు పెట్టెను. అప్పుడామెకు కానుపు ఉడిగెను.

ఈ వచనంలో లేయా నాలుగవ కుమారుడిని కని ఈసారి యెహోవాను స్తుతిస్తానని అతనికి యూదా అనే పేరు పెట్టడం మనం చూస్తాం. ఈ యూదా నుండి వచ్చిన యూదా గోత్రంలోనే మన ప్రభువైన యేసుక్రీస్తు జన్మించారు, ఏర్పరచబడినవారంతా లేయాతో కలసి యెహోవాను స్తుతించేలా మార్గం తెరిచారు (మత్తయి 1:1-16).

Add comment

Security code
Refresh

 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.