పాత నిబంధన

రచయిత: కె విద్యా సాగర్

41:1, 41:2-7, 41:8, 41:9, 41:10-13, 41:14, 41:15,16, 41:17-24, 41:25-36, 41:37-39, 41:40-44, 41:45, 41:46-49, 41:50-52, 41:53-57

ఆదికాండము 41:1 రెండేండ్లు గడిచిన తరువాత ఫరో ఒక కల కనెను. అందులో అతడు ఏటి దగ్గర నిలిచియుండగా-

గడచిన అధ్యాయంలో యోసేపు పానదాయకుల అధిపతికి చెప్పిన కలభావం చొప్పున ఫరో అతనికి‌ తన ఉద్యోగాన్ని మరలా ఇప్పించడం, అతను యోసేపు చేసిన మేలును మరచిపోవడం చూసాం. అది జరిగిన రెండు సంవత్సరాల తర్వాత ఫరో ఒక కలను కన్నట్టు ఈ వచనంలో చూస్తున్నాం.

ఆదికాండము 41:2-7 చూపునకు అందమైనవియు బలిసినవియునైన యేడు ఆవులు యేటిలో నుండి పైకి వచ్చుచు జమ్ములో మేయుచుండెను. వాటి తరువాత చూపునకు వికారమై చిక్కిపోయిన మరి యేడు ఆవులు ఏటిలో నుండి పైకి వచ్చుచు ఏటి యొడ్డున ఆ ఆవుల దగ్గర నిలుచుండెను. అప్పుడు చూపునకు వికారమై చిక్కిపోయిన ఆ ఆవులు చూపునకు అందమై బలిసిన ఆవులను తినివేయుచుండెను. అంతలో ఫరో మేలుకొనెను. అతడు నిద్రించి రెండవసారి కల కనెను. అందులో మంచి పుష్టిగల యేడు వెన్నులు ఒక్క దంటున పుట్టుచుండెను. మరియు తూర్పు గాలిచేత చెడిపోయిన యేడు పీల వెన్నులు వాటి తరువాత మొలిచెను. అప్పుడు నిండైన పుష్టిగల ఆ యేడు వెన్నులను ఆ పీలవెన్నులు మింగివేసెను. అంతలో ఫరో మేలుకొని అది కల అని గ్రహించెను.

ఈ వచనాలలో ఫరోకు ఐగుప్తుపైకి రాబోయే కరువు గురించి కలలు వచ్చినట్టు మనం చూస్తాం. వాస్తవానికి ఐగుప్తీయులు మరియు ఫరో యెహోవా దేవుణ్ణి సేవించే ప్రజలు కాదు, వారు హేయమైన విగ్రహారాధన చేసేవారు. అయినప్పటికీ యోసేపును ఐగుప్తుకు ప్రధానికిగా చేసేందుకే దేవుడు అతనికి ఈ కలలు రప్పించాడు. ఎందుకంటే ఆ కరువు ఐగుప్తు దేశంలోనే కాదు చుట్టుపక్కల దేశాల్లో కూడా విజృంభించింది (ఆదికాండము 41:57). అయినప్పటికీ దానిగురించి ఆయన ఆ దేశాల నాయకులకు కానీ చివరికి యాకోబుకు కూడా తెలియచెయ్యలేదు. కాబట్టి దేవుడు యోసేపును ఘనపరిచేందుకే ఫరోకు ఆ కరువు గురించిన కలలు రప్పించాడు. దీనివల్ల ఇశ్రాయేలు కుటుంబం కూడా ఐగుప్తులో రక్షించబడింది.

ఆదికాండము 41:8 తెల్లవారినప్పుడు అతని మనస్సు కలవరపడెను గనుక అతడు ఐగుప్తు శకునగాండ్రనందరిని అక్కడి విద్వాంసులనందరిని పిలువనంపి ఫరో తన కలలను వివరించి వారితో చెప్పెను గాని ఫరోకు వాటి భావము తెలుపగలవాడెవడును లేకపోయెను.

ఈ వచనంలో ఫరో కనిన కలలను బట్టి అతని మనస్సు కలవరపడినప్పుడు ఐగుప్తు శకునగాండ్రు కానీ జ్ఞానులు కానీ వాటి భావం చెప్పలేకపోవడం మనం చూస్తాం. దీనినిబట్టి దేవుని దగ్గర నుండి వచ్చిన కలకు దేవుడు మాత్రమే భావం చెప్పగలడు తప్ప ఏ మనిషీ తన జ్ఞానం చొప్పున దానిని‌ వివరించలేడని అర్థమౌతుంది. అందుకే ఇక్కడ ఫరో కలకు కానీ నెబుకద్నెజరు కలకు కానీ ఆయా దేశాలలో ఉండే జ్ఞానులు భావం చెప్పలేక విఫలమయ్యారు. దీనిని‌ మనం ఆయన వాక్యానికి అన్వయించుకుంటే ఆయన‌ వాక్యంలోని ప్రశ్నకు ఆయన వాక్యమే‌ సమాధానం చెబుతుంది, ఆయన వాక్యంలోని మర్మాలను ఆయన వాక్యమే వివరిస్తుంది. అందుకే పౌలు "మనుష్యజ్ఞానము నేర్పు మాటలతో గాక ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు, ఆత్మ నేర్పు మాటలతో వీటిని గూర్చియే మేము బోధించుచున్నాము" (1 కొరింథీ 2:13) అని అంటున్నాడు.‌ కాబట్టి దేవునివాక్యాన్ని ఏవో తర్కాలు ఉపయోగించి లేక తమ మనస్సులోని‌ భావాలను చొప్పించి కలిపిచెరిపే బోధకులకు మనం దూరంగా ఉండాలి.

ఆదికాండము 41:9 అప్పుడు పానదాయకుల అధిపతి నేడు నా తప్పిదములను జ్ఞాపకము చేసికొనుచున్నాను.

ఈ వచనంలో పానదాయకుల అధిపతి యోసేపు విషయంలో తన తప్పును తెలుసుకుని, అతని గురించి ఫరోకు‌ పరిచయం చెయ్యడం మనం చూస్తాం. మనం కూడా కొన్నిసార్లు మనకు ఉపకారం చేసినవారికి ప్రత్యుపకారం చెయ్యడం మరచిపోతుంటాము. కానీ మన తప్పు మనకు తెలిసినప్పుడు ఈ పానదాయకుల అధిపతిలా దానిని సరిచేసుకునే ప్రయత్నం చెయ్యాలి.

ఆదికాండము 41:10-13‌ ఫరో తన దాసుల మీద కోపగించి నన్నును భక్ష్యకారుల అధిపతిని మా ఉభయులను రాజసంరక్షక సేనాధిపతియింట కావలిలో ఉంచెను. ఒక రాత్రి నేను అతడు మేమిద్దరము కలలు కంటిమి. ఒక్కొకడు వేరువేరు భావములు గల కలలు చెరి యొకటి కంటిమి. అక్కడ రాజ సంరక్షక సేనాధిపతికి దాసుడైయుండిన యొక హెబ్రీ పడుచువాడు మాతో కూడ ఉండెను. అతనితో మా కలలను మేము వివరించి చెప్పినప్పుడు అతడు వాటి భావమును మాకు తెలిపెను. ఒక్కొకని కల చొప్పున దాని దాని భావమును తెలిపెను. అతడు మాకు ఏయే భావము తెలిపెనో ఆయా భావముల చొప్పున జరిగెను. నా ఉద్యోగము నాకు మరల ఇప్పించి భక్ష్యకారుని వ్రేలాడదీయించెనని ఫరోతో చెప్పగా-

ఈ వచనాలలో పానదాయకుల అధిపతి ఫరోకు యోసేపు జ్ఞానం గురించి తెలియచెయ్యడం మనం‌ చూస్తాం. అతను ఆ కల‌ నెరవేరి‌ తన ఉద్యోగం మరలా పొందుకోగానే యోసేపును మరచిపోవడం పొరపాటే అయినప్పటికీ ఇందులో మనకు దేవుని సార్వభౌమత్వం కనిపిస్తుంది.‌ దీనిగురించి, రిబ్కా యాకోబుని మోసానికి ప్రేరేపించిన సందర్భంలోనూ యోసేపు అన్నలు అతడిని అమ్మివేసిన సందర్భంలో వివరించాను. ఒకవేళ పానదాయకుల అధిపతి తన ఉద్యోగాన్ని పొందుకోగానే ఫరోతో మాట్లాడి యోసేపును బయటకు రప్పించి ఉంటే యోసేపు ఐగుప్తు దేశంలో ఘనత పొందేవాడు కాదు. ఆ రెండేళ్ళలో అతను ఐగుప్తును విడచి తన తండ్రి దగ్గరకు పయనమయ్యేవాడు.

ఆదికాండము 41:14 ఫరో యోసేపును పిలువనంపెను. కాబట్టి చెరసాలలోనుండి అతని త్వరగా రప్పించిరి. అతడు క్షౌరము చేయించుకొని మంచి బట్టలు కట్టుకొని ఫరోయొద్దకు వచ్చెను.

ఈ వచనంలో దేవుని సంకల్పం చొప్పున యోసేపు ఐగుప్తు చెరశాలనుండి విడుదలై ఫరో ముందుకు రావడం మనం చూస్తాం. యోసేపు తన జీవితంలో అన్యాయంగా హింసలు ఎదుర్కొన్నప్పటికీ తనకు అప్పగించబడిన బాధ్యతను ఎప్పుడూ విస్మరించలేదని గత అధ్యాయంలో మనం చూసాం. ఆ సమయంలో అతను పానదాయకుల అధిపతి కలను వివరించి తనను జ్ఞాపకం చేసుకోమని వేడుకున్నప్పటి నుండీ ఫరో కలలను కనేవరకూ ప్రారంభవచనం ప్రకారం 2 సంవత్సరాలు పట్టింది. ఈ రెండు సంవత్సరాలూ ఆ అధిపతి యోసేపును మరచిపోవడం ద్వారా యోసేపు అతనిపై పెట్టుకున్న ఆశ నిరాశ అయ్యిందని ఎంతో బాధకు లోనైయుండవచ్చు. అయినప్పటికీ అతను దేవునికి దూరం కాలేదు. అందుకే తగిన సమయంలో దేవుడు‌ తన సంకల్పం‌ చొప్పున యోసేపును చెరశాలనుండి విడిపించాడు. మనం కూడా ఈ యోసేపు మాదిరిని అనుసరించాలి. అందుకే "దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించునట్లు ఆయన బలిష్ఠమైన చేతిక్రింద దీనమనస్కులై యుండుడి" (1 పేతురు 5:6) అని రాయబడింది.

అదేవిధంగా యోసేపు పానదాయకుల అధిపతిని తనను జ్ఞాపకం చేసుకోమని కోరుతూ ఆ అధిపతి ద్వారా దేవుడతనికి విడుదల కలిగిస్తాడేమో అని ఆలోచించాడు. దేవుడు మాత్రం‌ అతడిని విడిపించడానికి ఫరోకు కలలను నిర్ణయించాడు.

సామెతలు 19: 21 నరుని హృదయములో ఆలోచనలు అనేకములుగా పుట్టును యెహోవాయొక్క తీర్మానమే స్థిరము.

కీర్తనలు 105:17-20 వారికంటె ముందుగా ఆయన యొకని పంపెను. యోసేపు దాసుడుగా అమ్మబడెను. వారు సంకెళ్లచేత అతని కాళ్లు నొప్పించిరి ఇనుము అతని ప్రాణమును బాధించెను. అతడు చెప్పిన సంగతి నెరవేరువరకు యెహోవా వాక్కు అతని పరిశోధించుచుండెను. "రాజు వర్తమానము పంపి అతని విడిపించెను, ప్రజల నేలినవాడు అతని విడుదలచేసెను".

ఒకవేళ యోసేపు ఆలోచించినట్టుగా అతనికి పానదాయకుల అధిపతి ద్వారా దేవుడు విడుదలను కలిగిస్తే అతనికి విడుదల మాత్రమే దొరికేది కానీ దేవుడు ఫరో కలద్వారా అతనికి విడుదలను నిర్ణయించడం ద్వారా ఎనలేని ఘనత కలిగింది. అతను చిన్నతనంలో కన్నటువంటి కల నెరవేరింది. కాబట్టి విశ్వాసుల ఆలోచనలు కొన్నిసార్లు నిరాశలైనప్పుడు వారిపట్ల ఎల్లప్పుడూ దేవుడు నిర్ణయించిన శ్రేష్టమైన చిత్తమే నెరవేరుతుందని ధైర్యం తెచ్చుకోవాలి.

అదేవిధంగా యోసేపు ఫరోముందుకు వచ్చేటప్పుడు శుభ్రమైన వస్త్రాలు ధరించుకుని తలను క్షౌరం చేయించుకుని వచ్చినట్టు రాయబడింది. కాబట్టి మనం పరిస్థితులను బట్టి మనం కలవబోయే వ్యక్తులను బట్టి కచ్చితంగా శరీరసంబంధమైన జాగ్రత్తలు కూడా తీసుకోవాలి, ఇది వారికివ్వవలసిన గౌరవంలో ఒక భాగం.

ఆదికాండము 41:15,16 ఫరో యోసేపుతో నేనొక కల కంటిని, దాని భావమును తెలుపగలవారెవరును లేరు. నీవు కలను విన్నయెడల దాని భావమును తెలుపగలవని నిన్నుగూర్చి వింటినని అతనితో చెప్పినందుకు యోసేపు నావలన కాదు, దేవుడే ఫరోకు క్షేమకరమైన ఉత్తరమిచ్చునని ఫరోతో చెప్పెను.

ఈ వచనాలలో ఫరో తన కల గురించి యోసేపుకు చెప్పడం, దానికి యోసేపు "నావలన కాదు, దేవుడే ఫరోకు క్షేమకరమైన ఉత్తరమిచ్చునని" పలకడం మనం చూస్తాం. ఈ మాటల్లో అతను ఒకవైపు దేవుణ్ణి ఘనపరుస్తూ మరోవైపు తన అధికారియైన ఫరోకు క్షేమం కూడా కోరుకుంటున్నాడు. గమనించండి; ఇక్కడ యోసేపు ఫరో మెప్పు పొందేందుకు అది తన గొప్పతనంగా చెప్పుకోవచ్చు కానీ అతను ఆ తప్పు చెయ్యట్లేదు. దానియేలు పౌలులు కూడా ఇదేవిధంగా దేవునికే మహిమను ఆపాదిస్తూ యథార్థమైన ప్రవర్తనను కనపరిచారు (దానియేలు 2:26-28, 2 కోరింథీ 3:5). కాబట్టి విశ్వాసులు తమకున్న నైపుణ్యం, జ్ఞానాలను తమ గొప్పతనంగా భావిస్తున్నారో లేక దేవుని‌ బహుమానంగా భావించి ఆయనను మహిమపరుస్తున్నారో పరీక్షించుకోవాలి.

ఆదికాండము 41:17-24 అందుకు ఫరోనా కలలో నేను ఏటియొడ్డున నిలుచుంటిని. బలిసినవియు, చూపునకందమైనవియునైన, యేడు ఆవులు ఏటిలోనుండి పైకివచ్చి జమ్ములో మేయుచుండెను. మరియు నీరసమై బహు వికార రూపము కలిగి చిక్కిపోయిన మరి యేడు ఆవులు వాటి తరువాత పైకి వచ్చెను. వీటి అంత వికారమైనవి ఐగుప్తు దేశమందు ఎక్కడను నాకు కనబడలేదు. చిక్కిపోయి వికారముగానున్న ఆవులు బలిసిన మొదటి యేడు ఆవులను తినివేసెను. అవి వాటి కడుపులో పడెను గాని అవి కడుపులో పడినట్టు కనబడలేదు, మొదట ఉండినట్లే అవి చూపునకు వికారముగా నుండెను. అంతలో నేను మేలుకొంటిని. మరియు నా కలలో నేను చూడగా పుష్టిగల యేడు మంచి వెన్నులు ఒక్కదంటున పుట్టెను. మరియు తూర్పు గాలిచేత చెడిపోయి యెండిన యేడు పీలవెన్నులు వాటి తరువాత మొలిచెను. ఈ పీలవెన్నులు ఆ మంచి వెన్నులను మింగివేసెను. ఈ కలను జ్ఞానులకు తెలియ చెప్పితిని గాని దాని భావమును తెలుపగలవారెవరును లేరని అతనితో చెప్పెను.

ఈ వచనాలలో ఫరో తాను కన్న కలలను యోసేపుకు వివరించడం మనం చూస్తాం. అతను యోసేపు విషయంలో ఎలాంటి సందేహానికి గురి కానందువల్లే ఓపికగా దానిని తెలియచేసాడు.

ఆదికాండము 41:25-36 అందుకు యోసేపు ఫరో కనిన కల ఒక్కటే. దేవుడు తాను చేయబోవుచున్నది ఫరోకు తెలియచేసెను. ఆ యేడు మంచి ఆవులు ఏడు సంవత్సరములు ఆ యేడు మంచి వెన్నులును ఏడు సంవత్సరములు. కల ఒక్కటే. వాటి తరువాత, చిక్కిపోయి వికారమై పైకివచ్చిన యేడు ఆవులును ఏడు సంవత్సరములు. తూర్పు గాలిచేత చెడిపోయిన యేడు పీలవెన్నులు కరవుగల యేడు సంవత్సరములు. నేను ఫరోతో చెప్పు మాట యిదే. దేవుడు తాను చేయబోవుచున్నది ఫరోకు చూపించెను. ఇదిగో ఐగుప్తు దేశమందంతటను బహు సమృద్ధిగా పంట పండు ఏడు సంవత్సరములు వచ్చుచున్నవి. మరియు కరవుగల యేడు సంవత్సరములు వాటి తరువాత వచ్చును; అప్పుడు ఐగుప్తు దేశమందు ఆ పంట సమృద్ధి యావత్తును మరువబడును, ఆ కరవు దేశమును పాడుచేయును. దాని తరువాత కలుగు కరవుచేత దేశమందు ఆ పంట సమృద్ధి తెలియబడకపోవును. ఆ కరవు మిక్కిలి భారముగానుండును. ఈ కార్యము దేవునివలన నిర్ణయింపబడియున్నది. ఇది దేవుడు శీఘ్రముగా జరిగించును. అందుచేతనే ఆ కల ఫరోకు రెట్టింపబడెను. కాబట్టి ఫరో వివేక జ్ఞానములుగల ఒక మనుష్యుని చూచుకొని ఐగుప్తు దేశము మీద అతని నియమింపవలెను. ఫరో అట్లు చేసి యీ దేశముపైన అధిపతులను నియమించి సమృద్ధిగా పంట పండు ఏడు సంవత్సరములలో ఐగుప్తు దేశమందంతటను అయిదవ భాగము తీసికొనవలెను. రాబోవు ఈ మంచి సంవత్సరములలో దొరుకు ఆహారమంతయు సమకూర్చి ఆ ధాన్యము ఫరో చేతికప్పగించి ఆయా పట్టణములలో ఆహారమునకై భద్రము చేయవలెను. కరవుచేత ఈ దేశము నశించిపోకుండ ఆ ఆహారము ఐగుప్తుదేశములో రాబోవు కరవు సంవత్సరములు ఏడింటికి ఈ దేశమందు సంగ్రహముగా నుండునని ఫరోతో చెప్పెను.

ఈ వచనాలలో యోసేపు ఫరో కలలకు భావం చెప్పడమే కాకుండా రానున్న కరువును ఎదుర్కొనే ఉపాయం కూడా తెలియచెయ్యడం మనం చూస్తాం.

సామెతలు 12:26 నీతిమంతుడు తన పొరుగువానికి దారి చూపును.

దీనినిబట్టి మనం కూడా దేవుడు సమృద్ధిని అనుగ్రహించిన సమయంలో ఇష్టానుసారంగా ఖర్చు చెయ్యకుండా సమృద్ధి అనేది ఎప్పుడూ ఒకేలా ఉండదని గుర్తించి జాగ్రత్త చేసుకోవాలి. దీనివల్ల మన కుటుంబాన్నీ మన సన్నిహితులనూ కష్టకాలంలో సంరక్షించుకోగలం.

అదేవిధంగా యోసేపు ఆ కరువు దేవునిచేత నిర్ణయించబడిందని చెబుతూ దేవుని సార్వభౌమత్వం గురించీ సమస్త దేశాలపై ఆయన అధికారం గురించీ ఫరోకు‌ బోధిస్తున్నాడు.

కీర్తనలు 103:19 యెహోవా ఆకాశమందు తన సింహాసనమును స్థిరపరచియున్నాడు. ఆయన అన్నిటి మీద రాజ్య పరిపాలన చేయుచున్నాడు.

ఇక దేవుడు నిర్ణయించిన ఆ కరువు వల్లే యోసేపు ఐగుప్తుకు ప్రధాని అయ్యాడు, తన కుటుంబాన్ని మరలా కలుసుకోగలిగాడు, వారిని కరవు కాలంలో పోషించగలిగాడు. అంతమాత్రమే కాకుండా దేవుడు అబ్రాహాముకు ముందే తెలియచేసినట్టు అతని సంతానమైన యాకోబు కుటుంబం (ఇశ్రాయేలీయులు) ఐగుప్తులో 215 సంవత్సరాలు బానిసలయ్యారు.

ఆదికాండము 41:37-39 ఆ మాట ఫరోదృష్టికిని అతని సమస్త సేవకుల దృష్టికిని యుక్తమైయుండెను గనుక అతడు తన సేవకులను చూచి ఇతనివలె దేవుని ఆత్మగల మనుష్యుని కనుగొనగలమా అనియనెను. మరియు ఫరో దేవుడు ఇదంతయు నీకు తెలియపరచెను గనుక నీవలె వివేకజ్ఞానములు గలవారెవరును లేరు.

ఈ వచనాలలో యోసేపుకు దేవుడు అనుగ్రహించిన జ్ఞానం విగ్రహారాధన చేసే ఫరోకు సైతం యోసేపు నమ్మే దేవుడే నిజమైన దేవుడని గుర్తించేలా చేసినట్టు మనం చూస్తాం. ఐగుప్తు నాగరికత ప్రాచీనమైనది, అందులో మతపరమైన జ్ఞానులకూ మాంత్రికులకూ విద్వాంసులకూ కొదువలేదు. ఐగుప్తు మాంత్రికుల శక్తిని మనం మోషే సందర్భంలో కూడా గమనిస్తాం (నిర్గమకాండం 7:11). అయినప్పటికీ దేవుని శక్తిజ్ఞానాల ముందు వారు సరితూగలేరు, ఆయన నిర్ణయాన్ని గుర్తించలేరు, ఈ విషయాన్ని ఫరో గుర్తించి తనదగ్గరున్న జ్ఞానులందరినీ ప్రక్కనపెడుతూ యోసేపు వారందరికంటే అతీతమైన జ్ఞానం కలవాడని ఒప్పుకుంటున్నాడు.

యిర్మీయా 10:7,8 జనములకు రాజా, నీకు భయపడని వాడెవడు? జనముల జ్ఞానులందరిలోను వారి రాజ్యము లన్నిటిలోను నీవంటివాడెవడును లేడు గనుక నరులు నీకు భయపడుట అనుగుణ్యము. జనులు కేవలము పశుప్రాయులు, అవివేకులు బొమ్మల పూజ వలన వచ్చు జ్ఞానము వ్యర్థము.

ఆదికాండము 41:40-44 నీవు నా యింటికి అధికారివైయుండవలెను, నా ప్రజలందరు నీకు విధేయులైయుందురు. సింహాసన విషయములో మాత్రమే నేను నీకంటె పైవాడనైయుందునని యోసేపుతో చెప్పెను. మరియు ఫరో చూడుము, ఐగుప్తు దేశమంతటి మీద నిన్ను నియమించియున్నానని యోసేపుతో చెప్పెను. మరియు ఫరో తన చేతినున్న తన ఉంగరము తీసి యోసేపు చేతిని పెట్టి, సన్నపు నారబట్టలు అతనికి తొడిగించి, అతని మెడకు బంగారు గొలుసు వేసి తన రెండవ రథముమీద అతనినెక్కించెను. అప్పుడు వందనము చేయుడని అతని ముందర జనులు కేకలువేసిరి. అట్లు ఐగుప్తు దేశమంతటిమీద అతని నియమించెను. మరియు ఫరో యోసేపుతో ఫరోను నేనే; అయినను నీ సెలవు లేక ఐగుప్తు దేశమందంతటను ఏ మనుష్యుడును తన చేతినైనను కాలినైనను ఎత్తకూడదని చెప్పెను.

ఈ వచనాలలో యోసేపు కన్న కలలు నెరవేరేలా దేవుడు అతడిని ఐగుప్తుకు ప్రధానిగా నియమించడం మనం‌ చూస్తాం. ఆ క్రమంలో ఫరో తన ఉంగరాన్ని యోసేపుకు పెట్టినట్టు కూడా చదువుతున్నాం. రాజులు రాసే శాసనాలను ఈ ఉంగరంపైన ఉండే రాజముద్రతోనే ముద్రిస్తారు, అప్పుడే ఆ శాసనం చెల్లుబాటు ఔతుంది‌ (ఎస్తేరు 3:9-11). దీనిని బట్టి ఫరో యోసేపుతో చెప్పినట్టుగా సింహాసనం విషయంలో అతనే రాజుగా ఉన్నప్పటికీ ఐగుప్తుకు సంబంధించిన పాలనాపద్ధతి అంతా యోసేపుకే అప్పగించబడింది.

అందుకే ఫరో నీ సెలవు లేకుండా ఐగుప్తు దేశంలో ఎవరూ చేతిని కానీ కాలిని కానీ ఎత్తకూడదని చెబుతున్నాడు, కొందరు బైబిల్ పండితుల వివరణ ప్రకారం; ఇది యుద్ధానికి సంబంధించి‌న అలంకార‌ భాష. యుద్దం చేసేటప్పుడు సైనికులు చేతులతో కవచాన్ని కట్టుకుని కత్తిని పట్టుకుని, గుర్రాలను‌ ఎక్కుతారు. ఆవిధంగా ఐగుప్తు శాంతి భద్రతలన్నీ యోసేపు చేతిలోనే ఉంటాయని చెప్పేందుకు ఫరో ఆ మాటలను ఉపయోగించాడు.

ఆదికాండము 41:45 మరియు ఫరో యోసేపునకు జప్నత్పనేహు అను పేరు పెట్టి, అతనికి ఓనుయొక్క యాజకుడైన పోతీఫెర కుమార్తెయగు ఆసెనతునిచ్చి పెండ్లి చేసెను.

ఈ వచనంలో ఫరో యోసేపుకు జప్నత్పనేహుగా పేరు మార్చి అతనికి ఆసెనతు అనే స్త్రీతో వివాహం జరిపించడం మనం చూస్తా. బైబిల్ గ్రంథంలో భక్తులు అన్యదేశాలలో జీవిస్తున్నప్పుడు అక్కడి రాజులు పెట్టే అన్యపేర్లతో పిలవబడడానికి అభ్యంతరమూ చెప్పలేదు, దానియేలుకు కూడా నెబుకద్నెజరు తన దేవతపేరు పెట్టాడు. కానీ నేటిసంఘాలలో బాప్తీస్మం తీసుకున్న విశ్వాసుల పేర్లను మార్చడం ఆచారంలా కొనసాగుతుంది. కానీ విశ్వాసి పిలువబడే పేరును బట్టి దేవుని ముందు‌ అతనికి ఎలాంటి ఘనతా రాదనీ అన్యపేర్లతో పిలవబడడంలో ఎలాంటి పాపమూ లేదని మనం గుర్తించాలి (ఆదికాండము 17:5 వ్యాఖ్యానం చూడండి).

అదేవిధంగా ఈ సందర్భంలో యోసేపు ఫరో చెప్పిన స్త్రీని‌ వివాహం చేసుకోవడాన్ని బట్టి అతను విగ్రహారాధన చేసే స్త్రీని వివాహం చేసుకున్నాడని కొందరు భావిస్తుంటారు. కానీ యోసేపు ఫరో కలభావాన్ని చెప్పినప్పుడే ఐగుప్తు దేశాన్ని యెహోవా దేవుని పేరుతో ప్రభావం చెయ్యగలిగాడు. తర్వాత కాలంతో అతని గృహనిర్వాహకుడు కూడా యెహోవా దేవుని గురించి ఉన్నతంగా మాట్లాడిన సందర్భం మనకు కనిపిస్తుంది (ఆదికాండము 43:23). గతంలో దేవునికి విరోధంగా నేను పాపం చెయ్యలేనని పోతిఫరు భార్య కామవాంఛకు లొంగకుండా తప్పించుకున్న ఈ యోసేపు తన వివాహం విషయంలో మాత్రం దేవునికి విరోధంగా ఎలా నడుచుకుంటాడు?

కాబట్టి తాను వివాహం చేసుకున్న స్త్రీ తప్పకుండా యోసేపును బట్టి యెహోవా‌ దేవుణ్ణి నమ్మిన వ్యక్తే అయ్యుండాలి. తర్వాత ఫరో వారిద్దరికీ వివాహం చేసాడు. ఈ అధ్యాయంలో యోసేపు ఫరో కల భావాన్ని వివరించగానే అతని వివాహం జరిగిపోయినట్టు రాయబడినంత మాత్రాన అది వెంటనే జరిగిపోయిందని భావించకూడదు.

ఆదికాండము 41:46-49 యోసేపు బయలుదేరి ఐగుప్తు దేశమందంతట సంచరించెను. యోసేపు ఐగుప్తు రాజైన ఫరో యెదుట నిలిచినప్పుడు ముప్పది సంవత్సరములవాడైయుండెను. అప్పుడు యోసేపు ఫరో యెదుటనుండి వెళ్లి ఐగుప్తు దేశమందంతట సంచారము చేసెను. సమృద్ధిగా పంటపండిన యేడు సంవత్సరములలో భూమి బహువిరివిగా పండెను. ఐగుప్తు దేశమందున్న యేడు సంవత్సరముల ఆహారమంతయు అతడు సమకూర్చి, ఆయా పట్టణములలో దాని నిలువచేసెను. ఏ పట్టణము చుట్టునుండు పొలముయొక్క ధాన్యము ఆ పట్టణమందే నిలువచేసెను. యోసేపు సముద్రపు ఇసుకవలె అతి విస్తారముగా ధాన్యము పోగుచేసెను. కొలుచుట అసాధ్యమాయెను గనుక కొలుచుట మానివేసెను.

ఈ వచనాలలో యోసేపు దేవునిని బట్టి ఫరో తనకు అప్పగించిన బాధ్యతకు ఎంత ‌నిబద్ధతతో లోబడుతున్నాడో మనం చూస్తాం. ఇప్పుడు అతను ఐగుప్తు దేశానికి ప్రధానిగా ఉన్నప్పటికీ తనకున్న అధికారంతో కనానుకు వెళ్ళి తన కుటుంబాన్ని కలుసుకునే ప్రయత్నం చెయ్యడం లేదు కానీ ఐగుప్తును కరవునుండి తప్పించడానికి ఆ దేశమంతటిలో ఉన్న వ‌నరులను పరిశీలించే పనిలో నిమగ్నమయ్యాడు. అలానే ఈ సమయానికి అతనికి 30 సంవత్సరాలు. అతను 17వ సంవత్సరంలో ఐగుప్తుకు అమ్మబడ్డాడు. అంటే అతను 13 సంవత్సరాల పాటు ఫోతిఫరు ఇంట్లోనూ చెరశాలలోనూ జీవించాడు.

ఆదికాండము 41:50-52 కరవు సంవత్సరములు రాకమునుపు యోసేపుకిద్దరు కుమారులు పుట్టిరి. ఓనుయొక్క యాజకుడైన పోతీఫెర కుమార్తెయగు ఆసెనతు అతనికి వారిని కనెను. అప్పుడు యోసేపుదేవుడు నా సమస్త బాధను నా తండ్రి యింటివారినందరిని నేను మరచిపోవునట్లు చేసెనని చెప్పి తన జ్యేష్ఠకుమారునికి మనష్షే అను పేరు పెట్టెను. తరువాత అతడు నాకు బాధ కలిగిన దేశమందు దేవుడు నన్ను అభివృద్ధి పొందించెనని చెప్పి, రెండవవానికి ఎఫ్రాయిము అను పేరు పెట్టెను.

ఈ వచనాలలో యోసేపుకు మనష్షే, ఎఫ్రాయిము అనే ఇద్దరు కుమారులు జన్మించినట్టు మనం చూస్తాం. యోసేపుకు మనష్షే జ్యేష్టకుమారుడై‌నప్పటికీ ఎఫ్రాయిము అతనికంటే ఆధిక్యతను పొందుకున్నాడు (ఆదికాండము 48:17-20). వీరిద్దరూ యాకోబు కుమారులతో పాటుగా ఇశ్రాయేలీయుల గోత్రకర్తలుగా ఎంచబడ్డారు (ఆదికాండము 48:5).

ఆదికాండము 41:53-57 ఐగుప్తు దేశమందు సమృద్ధిగా పంటపండిన సంవత్సరములు గడచిన తరువాత యోసేపు చెప్పిన ప్రకారము ఏడు కరవు సంవత్సరములు ఆరంభమాయెను గాని ఐగుప్తు దేశమందంతటను ఆహారముండెను. ఐగుప్తు దేశమందంతటను కరవు వచ్చినప్పుడు ఆ దేశస్థులు ఆహారము కోసము ఫరోతో మొరపెట్టుకొనిరి, అప్పుడు ఫరో మీరు యోసేపు వద్దకు వెళ్లి అతడు మీతో చెప్పునట్లు చేయుడని ఐగుప్తీయులందరితో చెప్పెను. కరవు ఆ దేశమందంతటను ఉండెను గనుక యోసేపు కొట్లన్నియు విప్పించి ఐగుప్తీయులకు ధాన్యమమ్మకము చేసెను. ఐగుప్తు దేశమందు ఆ కరవుభారముగా ఉండెను. మరియు ఆ కరవు ప్రతి దేశమందు భారమైనందున సమస్త దేశస్థులు యోసేపునొద్ద ధాన్యము కొనుటకు ఐగుప్తునకు వచ్చిరి.

ఈ వచనాలలో యోసేపు ఫరోకు వివరించినట్టుగా ఐగుప్తు దేశంలోనూ చుట్టుపక్కల దేశాలలోనూ కరవు తాండవించడం, యోసేపు వారికి ధాన్యపు అమ్మకం చేస్తూ వారిని రక్షించడం మనం చూస్తాం. ఈవిధంగా యోసేపు ఐగుప్తుకు ప్రధానిగా మారి వారిని సంరక్షించే నాయకుడిగా ఉన్నతమైన పేరు సంపాదించుకున్నాడు.

సామెతలు 11:30 నీతిమంతులు ఇచ్చు ఫలము జీవవృక్షము జ్ఞానముగలవారు ఇతరులను రక్షించుదురు.

Add comment

Security code
Refresh

 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.