దుర్బోధలకు జవాబు

రచయిత: కె విద్యా సాగర్

అబ్రాహాము‌ సొదొమా‌ గొమొర్రా ప్రజలను చెరపట్టిన ఐదుగురు రాజులను ఓడించి వారందర్నీ వెనక్కు తీసుకువచ్చినప్పుడు షాలేము రాజైన మెల్కీసెదకు అనే వ్యక్తి అతన్ని ఎదుర్కొని ఆశీర్వదించినట్టు, అబ్రాహాము అతనికి దశమభాగం అర్పించినట్టు మనం చదువుతున్నాం (ఆదికాండము 14:18-20). ఎందుకంటే అతను సర్వోన్నతుడైన దేవుని యాజకుడని రాయబడింది. ఈయన గురించి హెబ్రీ పత్రికలో "ఆ షాలేమురాజును మహోన్నతుడగు దేవుని యాజకుడునైన మెల్కీసెదెకు నిరంతరము యాజకుడుగా ఉన్నాడు. అతని పేరుకు మొదట నీతికి రాజనియు, తరువాత సమాధానపు రాజనియు అర్థమిచ్చునట్టి షాలేము రాజని అర్థము. అతడు తండ్రిలేనివాడును తల్లిలేని వాడును వంశావళి లేనివాడును, జీవితకాలమునకు (మూలభాషలో-దినములకు) ఆదియైనను జీవనమునకు అంతమైనను లేనివాడునైయుండి దేవుని కుమారుని పోలియున్నాడు" (హెబ్రీ 7:3) అని రాయబడిన మాటలను ఆధారం చేసుకుని చాలామంది యేసుక్రీస్తే ఈ‌ మెల్కీసెదకు అని విశ్వసిస్తుంటారు.

దానికి విరుద్ధంగా కొందరు యూదులు ఈయనను నోవహు కుమారుడైన షేము అని ప్రచారం చేసేవారు. బహుశా ఆ వాదనను నిరూపించడానికే వారు మన బైబిళ్ళు తర్జుమా చెయ్యబడిన "Masoretic" వ్రాతప్రతిలో అర్పక్షదు నుండి, సెరూగు వరకూ ఉన్నటువంటి వ్యక్తులు కొడుకుల్ని కన్న వయస్సులో 100 సంవత్సరాల చొప్పున తగ్గించి రాశారు. అప్పుడు మాత్రమే షేము అబ్రాహాము కాలం వరకూ జీవించియుండడం సాధ్యమౌతుంది. ఈ సంఖ్యాపరమైన పొరపాట్లు గురించి ఇప్పటికే నేను వివరించాను (ఆదికాండము 11 వ్యాఖ్యానం చూడండి). 

కాబట్టి నోవహు కుమారుడైన షేము, అబ్రాహాము జన్మించేసరికే చనిపోయాడు, షేము జీవించిన కాలం 600 సంవత్సరాలే కాబట్టి (ఆదికాండము 11:10,11) మెల్కీసెదెకు షేము అయ్యే అవకాశం లేదు. మరికొందరు యూదులు ఈయనను ఒక దైవికమైన వ్యక్తి అని కూడా భావించేవారు. ఆ వాదన ఇక్కడ అప్రస్తుతం కాబట్టి విడిచిపెడుతున్నాను.

ఇక చాలామంది క్రైస్తవులు విశ్వసిస్తున్నట్టుగా మెల్కీసెదకు యేసుక్రీస్తు ప్రభువే అనే విషయంలో కూడా వారలా విశ్వసించడానికి ఆధారమైన హెబ్రీ పత్రికలోని "ఆ షాలేమురాజును మహోన్నతుడగు దేవుని యాజకుడునైన మెల్కీ సెదెకు నిరంతరము యాజకుడుగా ఉన్నాడు. అతని పేరుకు మొదట నీతికి రాజనియు, తరువాత సమాధానపు రాజనియు అర్థమిచ్చునట్టి షాలేము రాజని అర్థము. అతడు తండ్రిలేనివాడును తల్లిలేని వాడును వంశావళి లేనివాడును, జీవితకాలమునకు (మూలభాషలో-దినములకు) ఆదియైనను జీవనమునకు అంతమైనను లేనివాడునైయుండి దేవుని కుమారుని పోలియున్నాడు" (హెబ్రీ 7:1-3) అనే మాటల వెనుక గ్రంథ నేపధ్యాన్ని పరిశీలించినప్పుడు కాదని సులభంగానే అర్థమైపోతుంది. గుర్తుంచుకోండి, సందర్భాన్ని విడిచిపెట్టి ఏ వాక్యభాగానికి మనం వివరణ ఇవ్వకూడదు. అది అపార్థానికే దారి తీస్తుంది. అందుకే ఆ నేపధ్యాన్ని ఆ మాటల భావాన్ని వరుసగా పరిశీలిద్దాం.

అసలు హెబ్రీగ్రంథ కర్త మెల్కీసెదెకు గురించి ఎందుకు ప్రస్తావించాడంటే అతను హెబ్రీయులకు అనగా ఇశ్రాయేలీయులకు యేసుక్రీస్తును ప్రధానయాజకునిగా నిరూపించే ప్రయత్నం చేస్తున్నాడు (హెబ్రీ 4:14-16, 5:5-10, 6:20, మరియు 7,8,9 అధ్యాయాలు). అప్పుడు వారినుండి అతనికి ఒక ప్రధానమైన అభ్యంతరం ఎదురౌతుంది.

అదేంటంటే ధర్మశాస్త్రం ప్రకారం యాజకులు లేవిగోత్రంలో పుట్టినవారైయుండాలి (నిర్గమకాండము 28:1, 6:16-20, ద్వితీయోపదేశకాండము 18:1,2). కానీ యేసుక్రీస్తు యూదా గోత్రంలో పుట్టాడు కాబట్టి యాజకుడు కాలేడు. అందుకే అతను మెల్కీసెదకును ప్రస్తావించి, యేసుక్రీస్తు ధర్మశాస్త్రం ప్రకారం లేవీగోత్రంలో చేరిన యాజకుడు కాదనీ అబ్రాహాము కాలంలో ‌సర్వోన్నతుడైన దేవునికి యాజకుడిగా ఉన్నటువంటి మెల్కీసెదెకు క్రమంలో చేరిన యాజకుడని, కీర్తనలు గ్రంథంలోని ప్రవచనం ఆధారంగా నిరూపిస్తున్నాడు (కీర్తనలు 110:4). అతను అప్పటికి షాలేముగా పిలవబడుతున్న యెరూషలేము (కీర్తనలు 76:2) రాజు కూడా.

హెబ్రీ 7:13-17 ఎవనిగూర్చి యీ సంగతులు చెప్పబడెనో ఆయన వేరొక గోత్రములో పుట్టెను. ఆ గోత్రములోనివాడెవడును బలిపీఠమునొద్ద పరిచర్యచేయలేదు. "మన ప్రభువు యూదా సంతానమందు జన్మించెననుట స్పష్టమే. ఆ గోత్రవిషయములో యాజకులను గూర్చి మోషే యేమియు చెప్పలేదు. మరియు శరీరాను సారముగా నెరవేర్చబడు ఆజ్ఞగల ధర్మశాస్త్రమునుబట్టి కాక, నాశనములేని జీవమునకున్న శక్తినిబట్టి నియమింపబడి, మెల్కీసెదెకును పోలినవాడైన వేరొక యాజకుడు వచ్చియున్నాడు". కావున మేము చెప్పిన సంగతి మరింత విశదమైయున్నది. ఏలయనగా నీవు నిరంతరము మెల్కీ సెదెకు క్రమము చొప్పున యాజకుడవై యున్నావు అని ఆయనవిషయమై సాక్ష్యము చెప్పబడెను.

ఇదే హెబ్రీ గ్రంథకర్త మెల్కీసెదెకు ప్రస్తావన తీసుకువచ్చిన సందర్భం. ఒకవేళ మెల్కీసెదెకే యేసుక్రీస్తు ప్రభువైతే అతను ఇద్దరూ ఒక్కరే అని సులభంగా చెప్పగలిగేవాడు. ఆ క్రమంలో చేరినవాడని ఎందుకు చెబుతూడు? ఇక అతని గురించి రాయబడిన మాటలను పరిశీలిస్తే;

1. నీతికి రాజు, సమాధానానికి రాజు అని అర్థమిచ్చు మెల్కీసెదెకు అని పేరు.

ఈ మాటల్లో హెబ్రీ గ్రంథకర్త మెల్కీసెదెకు అనే పేరుకున్న (అతని రాజ్యమైన షాలేముకున్న) అర్థాన్ని చెబుతున్నాడు తప్ప అతను యేసుక్రీస్తువలే సమాధానానికి కర్తయనో నీతికి రాజుయనో చెప్పడం లేదు. ఉదాహరణకు నేటికాలంలోని మన పేర్లకు కూడా చాలా అర్థాలు వస్తుంటాయి, అంతమాత్రాన ఆ పేరుకున్న భావం మనమే అని కాదుగా. ఈ మెల్కీసెదెకు ఒక సామాన్య మానవుడే అని చెప్పడానికి ఇతని పేరు కూడా మంచి ఆధారంగా ఉంది. ఎందుకంటే ఈ మెల్కీసెదెకు అనే పేరు గురించి "Ancient near Eastern Literature" (కనాను ప్రాంతం) ను పరిశీలించి రాసిన "Dictionary of the Old Testament Samaritan Pentateuch" లో ఉన్న వివరణ ప్రకారం, మెల్కీసెదకు అనే పేరు "Malk/Melek, Sedeq" అనే రెండు పదాల కలయిక, ఈ పదాలకు ఉన్న అర్ధాన్ని "The Ancient near East" (Fitzmyer 311,n.27) ప్రకారం పరిశీలిస్తే "Melek" అంటే నీతి, సమాధానం అని అర్థం వస్తుంది. మనకు బైబిల్ లో కనిపించే కనానీయుల దేవతలలో ఇలాంటి పేరుతో మొలెకు అనే వాడు కూడా మనకు కనిపిస్తాడు.

"Sedeq" అంటే నా రాజు అని అర్థం. దీనినే హెబ్రీ గ్రంథకర్త వివరిస్తూ అతని పేరుకు నీతికీ సమాధానానికీ రాజు అని అర్థమని చెబుతున్నాడు. ఈ మెల్కీసెదెకు యేసుక్రీస్తు ప్రభువే అనేవారు ఆయన కనానీయుల సంస్కృతిలోని పేరుతో ఎందుకు పిలువబడ్డాడో సమాధానం చెప్పవలసి ఉంటుంది. దీనిప్రకారం మెల్కీసెదెకు అనే వ్యక్తి, కనాను ప్రాంతానికి చెందిన వ్యక్తియని మనకు సులభంగానే అర్థం ఔతుంది. అప్పటికి అబ్రాహాము ఆ ప్రాంతంలోనే నివసిస్తున్నాడు.

ఇప్పుడు మీకు దుష్టులైన కనానీయుల్లో మెల్కీసెదెకు అనే దేవుని యాజకుడు ఎలా ఉన్నాడనే ప్రశ్న తలెత్తవచ్చు. కానీ ఈ సంఘటన అబ్రాహాము కాలంలో జరిగిందని గమనించాలి. కనానీయులు చెడ్డవారైనప్పటికీ ఆ కాలంలో మంచివారు కూడా మనకు కనిపిస్తుంటారు. ఉదాహరణకు శారా చనిపోయినప్పుడు వారిలో కొందరు అబ్రాహాము పట్ల కనుపరచిన మంచితనాన్ని మనం గమనిస్తాం (ఆదికాండము 23). ఆ మాటకు వస్తే దేవుని చేత యధార్థవంతుడని పిలవబడిన యోబు కూడా దేవుని చేత ద్వేషించబడిన ఏశావు సంతానం (ఎదోము) వాడే (విలాపవాక్యములు 4:21) దీనిగురించి ఇప్పటికే నేను వివరించాను (ఆదికాండము 36 వ్యాఖ్యానం చూడండి).

ఆ ప్రాంతంలో కూడా కొందరు యాజకులు ఉన్నట్టు యోబు మాటల్లో మనకు అర్థమౌతుంది (యోబు 12:19). అంటే ఆ కాలంలో కొందరు యోబులానే తమ కుటుంబం తరపునా చుట్టుప్రక్కల ప్రజల తరపునా దేవునికి బలులు అర్పిస్తూ యాజకులుగా పిలవబడేవారు. అందులో ఈ మెల్కీసెదకు ఒకడు.

2. తల్లి తండ్రి లేనివాడు వంశావళి లేనివాడు.

మోషే ధర్మశాస్త్రం ప్రకారం, యాజకత్వం చేసే లేవీయులు తమ వంశావళిని బట్టి, యాజకత్వాన్ని పొందుకుంటారు. వారు లేవీ గోత్రానికి చెందిన తల్లితండ్రులకు పుట్టినవారైయుంటారు. అయితే మెల్కీసెదెకు లేవీ గోత్రానికి చెందిన తల్లి తండ్రులకు పుట్టినవాడు కాదు. అప్పటికి అసలు లేవీగోత్రమే లేదు. కాబట్టి అతని యాజకత్వం, ఆ వంశావళిని బట్టి కానీ మోషే ధర్మశాస్త్రాన్ని బట్టి కానీ వచ్చింది కాదని చెప్పేందుకు హెబ్రీ గ్రంథకర్త ఈ మాటలు ఉపయోగించాడు. అందుకే ఆ క్రింది వచనంలో "వారితో సంబంధించిన వంశావళి లేనివాడైన మెల్కీసెదెకు అబ్రాహామునొద్ద పదియవవంతు పుచ్చుకొని వాగ్దానములను పొందినవానిని ఆశీర్వదించెను" (హెబ్రీ 7:6) అని రాస్తున్నాడు.

3. జీవితకాలమునకు ఆది అంతము లేనివాడు.

లేవీక్రమాన్ని బట్టి యాజకత్వం చేసేవారికి, తమ తండ్రులను బట్టి, తరగతుల ఏర్పాటు ఉంటుంది (1 దినవృత్తాంతములు‌ 24:7-20). వారు ఆ తరగతిలోని దినాలలో యాజకత్వాన్ని చేసి ఇంటికి తిరిగివెళ్తారు. ఉదాహరణకు యోహాను తండ్రియైన జెకర్యా (లూకా 1:8,23). కానీ మెల్కీసెదెకు విషయంలో అలాంటి తరగతులు కానీ దినాల నిర్ణయం కానీ ఏమీలేకుండా యాజకత్వం చేసాడని చెప్పేందుకు గ్రంథకర్త‌‌ ఈ మాటలు ఉపయోగించాడు. "నిరంతరము యాజకుడిగా ఉన్నాడు" అనేదానికి కూడా అర్థం అదే. అంతేతప్ప అతను నిత్యుడని కాదు. అందుకే అక్కడ జీవితకాలమునకు అన్నప్పుడు, పుట్ నోట్ లో దినములకు అని కూడా రాయబడింది. అంటే కొన్ని హెబ్రీ పత్రిక వ్రాతప్రతుల్లో "జీవితకాలమునకు" అని కాకుండా "దినములకు" (లేవీయులవంటి) అని కూడా ఉండింది.

4. ఆయన దేవుని కుమారుని పోలినవాడై యున్నాడు.

ఈమాటలకు పాతనిబంధన కాలంలో బలులు, కొన్ని ఆచారాలు ఏవిధంగానైతే క్రీస్తుకు ఛాయగా (పోలికగా) ఉన్నాయో (కొలస్సీ 2:17, హెబ్రీ 9:10-12) అలానే మెల్కీసెదెకు అనబడే ఈ యాజకుడు కూడా యేసుక్రీస్తు అనే సర్వోన్నతుడైన దేవుని యాజకునికి (దేవుని కుమారునికి) పోలికగా ఉన్నాడని అర్థం. పైన వివరించినట్టు మెల్కీసెదెకు ఎలాగైతే లేవీగోత్రంతో కానీ ధర్మశాస్త్రంతో‌ కానీ పని లేకుండా యాజకత్వం చేసాడో యేసుక్రీస్తు కూడా వాటితో సంబంధం లేకుండా మెల్కీసెదెకు క్రమంలో యాజకత్వం చేస్తున్నాడు. ఇదే ఆ పోలిక. అసలు యాజకవ్యవస్థ ఏర్పడిందే క్రీస్తుకు ఛాయగా.

కాబట్టి ఈ మాటలన్నీ కూడా హెబ్రీగ్రంథకర్త కేవలం షాలేము రాజైన మెల్కీసెదెకు ఎలాగైతే లేవీగోత్రంతో సంబంధం లేని ప్రధానయాజకుడో అలానే యేసుక్రీస్తు కూడా అతని క్రమంలో చేరిన (లేవీగోత్రంతో సంబంధం లేని) ప్రధానయాజకుడు‌ మరియు రాజు అని రుజువు చెయ్యడానికే ఉపయోగించాడు. అంతేతప్ప ఇద్దరూ ఒక్కరే అని చెప్పడానికి కాదు.

చివరిగా యేసుక్రీస్తే మెల్కీసెదకు అని అపార్థం చేసుకుంటున్నవారు దానికి ఆధారంగా భావిస్తున్న మరో రెండు మాటలకు కూడా వివరణ చూద్దాం.

హెబ్రీ 7:8లో "మరియు లేవిక్రమము చూడగా చావునకు లోనైనవారు పదియవవంతులను పుచ్చుకొనుచున్నారు. అయితే ఈ క్రమము చూడగా, జీవించుచున్నాడని సాక్ష్యము పొందినవాడు పుచ్చుకొనుచున్నాడు" అనే మాటలను వీరు మెల్కీసెదకుకు ఆపాదించి ఇద్దరూ ఒక్కరే అని భావిస్తుంటారు. కానీ అక్కడ "జీవించుచున్నాడని సాక్ష్యము పొందినవాడు" అని రాయబడింది మెల్కీసెదకు గురించి కాదు కానీ అతని క్రమంలో ప్రధానయాజకుడైన యేసుక్రీస్తు గురించే మాట్లాడుతున్నాడు. అందుకే పుచ్చుకొన్నాడు అని కాకుండా పుచ్చుకొనుచున్నాడని, అది ఇంకా జరుగుతున్నట్టుగా రాస్తున్నాడు. ప్రస్తుతం క్రైస్తవ సంఘాలన్నీ తమ కానుకలను ఇస్తుంది యేసుక్రీస్తుకే (ఆయన పనికొరకే) కదా!

అదేవిధంగా అబ్రాహామును మెల్కీసెదెకు కలిసిన ఆ సందర్భంలో అతను అబ్రాహామును ఆశీర్వదించినట్టుగా మనకు కనిపిస్తుంది. దీని ఆధారంగా కూడా కొందరు అబ్రాహాము అంతటి గొప్ప భక్తుడిని అతను ఆశీర్వదించాడంటే అతను సాధారణమైన వ్యక్తి అయ్యిండే అవకాశం లేదని, అతను‌ కచ్చితంగా యేసుక్రీస్తు ప్రభువో లేక దైవత్వం కలిగిన వ్యక్తో అయ్యుంటారని అభిప్రాయపడతారు. కానీ మనం మోషే ధర్మశాస్త్రాన్ని చదివితే లేవీగోత్రికులు ఇశ్రాయేలు మిగిలిన ప్రజల్ని (యూదా గోత్రంతో సహా) ఆశీర్వదిస్తున్నట్టు మనకు కనిపిస్తుంది. దీనిప్రకారం లేవీగోత్రికులు, ఇశ్రాయేలీయులు అందరికంటే గొప్పవారని కాదుకదా? వారు దేవుని సన్నిధిలో యాజకులుగా ఉంటూ దేవునికీ ఇశ్రాయేలీయులకూ మధ్యలో ప్రతినిధులుగా వ్యవహరిస్తారు కాబట్టి, ఆవిధంగా ఆశీర్వదిస్తుంటారు (సంఖ్యాకాండము 6:22,23).

కాబట్టి యేసుక్రీస్తు ప్రభువే మెల్కీసెదకు అనే బోధ కేవలం సందర్భానికి వెలుపటినుండి పుట్టిన అపార్థపు బోధనే అని మరోసారి జ్ఞాపకం చేస్తున్నాను. ఒకవిధంగా ఇద్దరూ ఒక్కరు కాదని చెప్పడానికి ఈ వివరణ అంతా కూడా అవసరం లేదు. అబ్రాహాము మెల్కీసెదకుకు దశమభాగం ఇచ్చాడు కదా యేసుక్రీస్తు ప్రభువే మెల్కీసెదకులా అతనియొద్దకు వచ్చుంటే ఆ దశమభాగం ఆయన ఏం చేసినట్టు? అబ్రాహాము కూడా ఎందుకు ఇచ్చినట్టు?. కొందరు "మీ తండ్రియైన అబ్రాహాము నా దినము చూతునని మిగుల ఆనందించెను; అది చూచి సంతోషించెను" (యోహాను 8:56) అని యేసుక్రీస్తు పలికిన మాటలను కూడా మెల్కీసెదకుతో ముడిపెట్టి ఈయనే ఆయనని వాదిస్తుంటారు. కానీ ఆ సందర్భాన్ని పరిశీలించినా అబ్రాహామును ప్రతీసారీ దర్శించింది ఎవరో అర్థమైనా అది ఒక అమాయకపు వాదనే కాబట్టి దానిని విడిచిపెడుతున్నాను.

Add comment

Security code
Refresh

 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.