49:1, 49:2, 49:3,4, 49:5, 49:6, 49:7, 49:8, 49:9, 49:10, 49:11,12, 49:13, 49:14, 49:15, 49:16, 49:17, 49:18, 49:19, 49:20, 49:21, 49:22, 49:23, 49:24,25, 49:26, 49:27, 49:28, 49:29, 49:30-32, 49:33
ఆదికాండము 49:1
యాకోబు తన కుమారులను పిలిపించి యిట్లనెను. మీరు కూడి రండి, అంత్యదినములలో మీకు సంభవింపబోవు సంగతులను మీకు తెలియచేసెదను.
గత అధ్యాయంలో యాకోబు యోసేపునూ అతని సంతానాన్నీ ఉద్దేశించి ప్రవచనాత్మకంగా కొన్ని విషయాలు మాట్లాడినట్టు మనం చూసాం. దానికి కొనసాగింపుగానే ఈ అధ్యాయం ప్రారంభమౌతుంది. ఆ సమయంలో తన కుమారులు కొందరు బయట ఉండి ఉండవచ్చు అందుకే యాకోబు వారిని కూడా తానున్న గదిలోకి పిలిపించి, వారికి జరగబోతే విషయాలను ప్రవచిస్తున్నాడు. అందులో కొన్ని ఆశీర్వాదాలు అయితే మరికొన్ని శాపాలు, కొన్ని భౌతిక సంబంధమైనవైతే మరికొన్ని ఆధ్యాత్మిక సంబంధమైనవి. కొన్ని మోషే, యెహోషువల కాలంలో నెరవేరితే మరికొన్ని న్యాయాధిపతుల కాలంలో నెరవేరాయి.
అదేవిధంగా ఈ ప్రవచనాత్మక మాటల్లో మెస్సీయను గురించిన వాగ్దానం కూడా నిక్షిప్తమై ఉంది కాబట్టి యాకోబు అది అంత్యదినాలలో జరగబోయేదిగా తెలియచేస్తున్నాడు యేసుక్రీస్తు అంత్యదినాలలో జన్మించాడని మనకు లేఖనాలు తెలియచేస్తున్నాయి (హెబ్రీ 1: 2)
ఆదికాండము 49:2
యాకోబు కుమారులారా, కూడి వచ్చి ఆలకించుడి మీ తండ్రియైన ఇశ్రాయేలు మాట వినుడి.
ఈ వచనంలో యాకోబు మరలా తన కుమారులను తన మాటలను వినాలంటూ పిలవడం మనం చూస్తాం. అతను చెప్పే మాటలు ప్రవచనాత్మకంగా పద్యరూపంలో రాయబడ్డాయి కాబట్టి వాటి ప్రాముఖ్యతను తెలియచెయ్యడానికి వాటిని మరలా మరలా ప్రస్తావించడం సాధారణంగానే జరుగుతుంది. అదేవిధంగా యాకోబు ఈమాటలను ప్రవచనాత్మకంగా చెబుతున్నాడు కాబట్టి ఇందులో మనకు కొన్నిచోట్ల అలంకారభాష కూడా కనిపిస్తుంటుంది.
ఆదికాండము 49:3,4
రూబేనూ, నీవు నా పెద్ద కుమారుడవు నా శక్తియు నా బలము యొక్క ప్రథమఫలమును ఔన్నత్యాతిశయమును బలాతిశయమును నీవే. నీళ్లవలె చంచలుడవై నీవు అతిశయము పొందవు నీ తండ్రి మంచము మీదికెక్కితివి దానిని అపవిత్రము చేసితివి అతడు నా మంచము మీదికెక్కెను.
ఈ వచనంలో యాకోబు రూబేను గురించి ప్రవచించడం మనం చూస్తాం. వాస్తవానికి అతను యాకోబుకు పెద్దకుమారుడు కాబట్టి వారి ఆచారం ప్రకారం అతను జ్యేష్ఠత్వపు హక్కును తీసుకుని దానిద్వారా తన తండ్రి సొత్తులో ఇతరులకంటే ఒక భాగం ఎక్కువ పొందుకుంటాడు(ద్వితీయోపదేశకాండము 21:17). కానీ ఈ రూబేను తన తండ్రి ఉపపత్నితో శయనించి నీచమైన కార్యానికి పాల్పడినందువల్ల (ఆదికాండము 35:22) ఆ హక్కును కోల్పోయాడు. అతనికి ప్రతిగా యోసేపు ఆ హక్కును పొందుకున్నాడు (ఆదికాండము 48:22, 1 దినవృత్తాంతములు 5:1). రూబేను ఆ చెడుకార్యం చేసి చాలా సంవత్సరాలు గడచిపోయాయి ఆ సమయంలో అతను తాను చేసినపనిని బట్టి పశ్చాత్తాపపడి ఉండవచ్చు, అందుకే ఆ పాపాన్ని అతడు కొనసాగించినట్టుగా రాయబడలేదు. అయినప్పటికీ ఈ సమయంలో యాకోబు దానిని జ్ఞాపకం చేసుకుంటూ అతనిని జ్యేష్ఠత్వపు హక్కు నుండి తొలగించడమే కాకుండా అందరిముందూ అతను చేసినదానిని ప్రస్తావించి సిగ్గుపడేలా చేసాడు. దీనివల్ల అతని జీవితంపైన చెరగని మచ్చపడింది. కాబట్టి పాపపు ఫలితం ఎప్పటికైనా అనుభవించక తప్పదనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. పాపం చేసి పరువు పోకుండా కాపాడుకోవడం సాధ్యం కాదు. దీనికి ఉదాహరణగా మనం దావీదు జీవితాన్ని కూడా గమనించవచ్చు. అతను బెత్సెబా విషయంలో చేసిన పాపాన్ని బట్టి దేవుడు అతడు మరణించకుండా కృప చూపినప్పటికీ ఆ పాపపు ఫలితాన్ని మాత్రం జీవితాంతమూ అనుభవిస్తూనే ఉన్నాడు.
ఆదికాండము 49:5
షిమ్యోను లేవి అనువారు సహోదరులు వారి ఖడ్గములు బలాత్కారపు ఆయుధములు.
ఈ వచనంలో యాకోబు తన ఇద్దరు కుమారులైన షిమ్యోను, లేవీల గురించి ప్రవచించడం మనం చూస్తాం. వీరికి ఇతర సహోదరులు ఉన్నప్పటికీ వీరిద్దరికీ ఒకేవిధమైన హింసాస్వభావం ఉండడం చేత యాకోబు వీరిద్దరినీ సహోదరులని ఇక్కడ సంబోధిస్తున్నాడు. ఎందుకంటే ఇక్కడ యాకోబు వారు షెకెము విషయంలో చేసిన హింసను జ్ఞాపకం చేసుకుంటూ ఈ మాటలు మాట్లాడుతున్నాడు. వీరు ఆత్మరక్షణ కోసం ఉపయోగించవలసిన ఆయుధాలను బలత్కారం చెయ్యడానికి ఉపయోగించారు. "వారి ఖడ్గములు బలాత్కారపు ఆయుధములు" అంటే అర్థం అదే. రూబేను ఇంటిలో పాపం చేసి తన తండ్రిని బాధపెడితే వీరు బయట హింస చేసి తమ తండ్రికి చెడ్డపేరునూ ప్రమాదాన్నీ తీసుకువచ్చారు. దేవుడు ఆ సమయంలో యాకోబుపై కృప చూపించకపోతే అతనితోపాటు కుటుంబమంతా షెకెము చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలచేతిలో నాశనమయ్యేది. వీరిగురించి యాకోబు పలుకుతున్న మిగిలిన మాటలు కూడా చూడండి.
ఆదికాండము 49:6
నా ప్రాణమా, వారి ఆలోచనలో చేరవద్దు నా ఘనమా, వారి సంఘముతో కలిసికొనవద్దు వారు, కోపమువచ్చి మనుష్యులను చంపిరి తమ స్వేచ్ఛ చేత ఎద్దుల గుదికాలి నరములను తెగగొట్టిరి.
ఈ వచనంలో యాకోబు చెబుతున్న మాటలన్నీ వారు షెకెము ఊరివారికి జరిగించినట్టు మనం చూస్తాం (ఆదికాండము 34వ అధ్యాయం). దానితో అతనికి ఎలాంటి సంబంధం లేదని అలాంటి క్రూరమైన కార్యానికి తాను అంగీకారం తెలుపలేదని యాకోబు ఇక్కడ తెలియచేస్తూ వారు చేసినదానికి వారినే నిందితులుగా ఎంచుతున్నాడు. "నా ప్రాణమా, వారి ఆలోచనలో చేరవద్దు నా ఘనమా, వారి సంఘముతో కలిసికొనవద్దు" అనే మాటలను ప్రత్యేకంగా గమనించండి. విశ్వాసులమైన మనం హింస విషయంలో ఎంతటి విముఖత కలిగియుండాలో ఈ మాటలు మనకు బోధిస్తున్నాయి. అందుకే "కాగా, దేవునిచేత ఏర్పరచబడినవారును పరిశుద్ధులును ప్రియులునైనవారికి తగినట్లు, మీరు జాలిగల మనస్సును, దయాళుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. ఎవడైనను తనకు హానిచేసెనని యొకడనుకొనిన యెడల ఒకనినొకడు సహించుచు ఒకనినొకడు క్షమించుడి, ప్రభువు (క్రీస్తు)మిమ్మును క్షమించినలాగున మీరును క్షమించుడి" (కొలొస్సీ 3:12,13) అని ఆజ్ఞాపించబడుతున్నాము.
ఆదికాండము 49:7
వారి కోపము వేండ్రమైనది వారి ఉగ్రతయు కఠినమైనది అవి శపింపబడును యాకోబులో వారిని విభజించెదను ఇశ్రాయేలులో వారిని చెదరగొట్టెదను.
ఈ వచనంలో యాకోబు లేవీ షిమ్యోనులు కనపరిచిన కోపాన్నీ ఉగ్రతనూ శపించడం మనం చూస్తాం. ఇక్కడ అతను తన కుమారులైన లేవీ షిమ్యోనులను శపించడం లేదు కానీ వారు షెకెము విషయంలో కనపరిచిన కోపం, ఉగ్రతలను శపిస్తున్నాడు. కానీ యాకోబును బట్టి ఆశీర్వదించబడిన వీరు శపించబడే ఆ లక్షణాలు కలిగియుండడం రూబేను తరహాలోనే వారి చరిత్రకు ఎంతో అవమానకరంగా ఉంది. దైవవిరుద్ధమైన లక్షణాలను కలిగియుండడం మన జీవితంపై అలాంటి మచ్చనూ శిక్షను కూడా తీసుకువస్తాయి. వారి కోపము ఎంత వేండ్రమైనదో ఉగ్రత ఎంత కఠినమైనదో ఆదికాండము 34వ అధ్యాయపు వ్యాఖ్యానంలో నేను వివరించాను. వారు ఆత్మరక్షణకోసం ఉపయోగించవలసిన ఆయుధాలను; తమవైపు జరిగిన తప్పును సరిచేసుకునేలా సమాధానంగా ఉండడానికి ప్రయత్నించి, తమది కాని ఆచారం (సున్నతి) పాటించిన బలహీనులపై ప్రయోగించారు. బాధలో బలహీనులుగా ఉన్నవారిని కనికరం లేకుండా చంపారు.
"నా ప్రాణమా, వారి ఆలోచనలో చేరవద్దు నా ఘనమా, వారి సంఘముతో కలిసికొనవద్దు వారు, కోపమువచ్చి మనుష్యులను చంపిరి తమ స్వేచ్ఛచేత ఎద్దుల గుదికాలి నరములను తెగ గొట్టిరి" (ఆదికాండము 49:6).
అందుకే తర్వాత మాటల్లో వారు ఇశ్రాయేలీయుల్లో చెదరగొట్టబడతారని మనం చదువుతున్నాం. కాబట్టి క్రీస్తును బట్టి ఆశీర్వదించబడిన మనలో పగతీర్చుకునే కోపము, ఉగ్రత అనే లక్షణాలు ఉండకూడదు. అందుకే "ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి గనుక కీడుకు ప్రతికీడైనను దూషణకు ప్రతి దూషణయైనను చేయక దీవించుడి" (1పేతురు 3:9) అని రాయబడింది.
ఇక లేవి షిమ్యోనుల గోత్రాలు ఇతర గోత్రాలవలే ఒకేచోట స్థిరంగా నివసించకుండా చెదరగొట్టబడ్డారు. యెహోషువా షిమ్యోనీయులకు యూదా గోత్రికుల మధ్యలో స్వాస్థ్యం పంచినప్పటికీ (యెహోషువా 19:1-9) తర్వాత వారు చెదరిపోయారు (1 దినవృత్తాంతములు 4:39-43). అలానే యెరూషలేము టార్గంలో యూదా పండితులు యాకోబు పలికిన ఈ మాటలకు భావం చెబుతూ షిమ్యోను గోత్రికులు బోధకులుగానూ శాస్త్రులుగానూ మారి ఇశ్రాయేలీయులలో చెదరిపోయారని ప్రస్తావించారు. యూదా పండితుడైన జార్కి కూడా అదేవిషయాన్ని తెలియచేసాడు. లేవీ గోత్రీకులను దేవుడు తన యాజకత్వం నిమిత్తం ఏర్పరచుకుని వారికి ఎలాంటి స్వాస్థ్యమూ ఇవ్వలేదు (ద్వితీయోపదేశకాండము 10:9) వారు ఇశ్రాయేలీయుల అన్నీగోత్రాలలోనూ చెదరిపోయి వారికి కేటాయించిన 48 పట్టణాలలో నివసించారు (యెహోషువ 21:1-41). యాజకత్వం అనేది వారి గోత్రానికి అనుగ్రహించబడిన గొప్ప ఆధిక్యతే ఐనా ఆ పని నిమిత్తం వారు ఇశ్రాయేలీయుల గోత్రాలలో 48 పట్టణాలుగా చెదరిపోయారు. ఈవిధంగా "యాకోబులో వారిని విభజించెదను ఇశ్రాయేలులో వారిని చెదరగొట్టెదను" అని ఇక్కడ పలకబడిన మాటలు వారి జీవితంలో నెరవేరాయి.
ఆదికాండము 49:8
యూదా, నీ సహోదరులు నిన్ను స్తుతించెదరు నీ చెయ్యి నీ శత్రువుల మెడమీద ఉండును నీ తండ్రి కుమారులు నీయెదుట సాగిలపడుదురు.
ఈ వచనంలో యాకోబు యూదా గురించి ప్రవచించడం మనం చూస్తాం. ఈ యూదా జన్మించినప్పుడే లేయా నేను యెహోవాను స్తుతిస్తానంటూ ఆ పేరును అతనికి పెట్టింది. ఆ పేరుకు తగినట్టుగానే యూదా పొందుకునే ఆధిక్యతను యాకోబు ఇక్కడ వివరిస్తున్నాడు. ఈ మాటలు యూదులు ఇశ్రాయేలీయులపై చేసిన పరిపాలననూ మరియు యూదాగోత్రం నుండి వచ్చిన మెస్సీయ చేస్తున్న పరిపాలననూ సూచిస్తున్నాయి.
1 దినవృత్తాంతములు 5:2 యూదా తన సహోదరులకంటె హెచ్చినవాడాయెను, అతని నుండి ప్రముఖుడు బయలువెడలెను.
ఆదికాండము 49:9
యూదా కొదమ సింహము నా కుమారుడా, నీవు పట్టినదాని తిని వచ్చితివి సింహమువలెను గర్జించు ఆడు సింహమువలెను అతడు కాళ్లు ముడుచుకొని పండుకొనెను అతని లేపువాడెవడు?
ఈ మాటలు మనకు యూదుల యుద్ధశౌర్యాన్ని తెలియచేస్తున్నాయి. సింహం వేటాడి దానిని తృప్తిగా తిని విశ్రాంతి తీసుకునేటప్పుడు ఏవిధంగానైతే ఎవరూ దానిని నిద్రలేపే సాహసం చెయ్యలేరో అదేవిధంగా యూదులు తమ శత్రువులపై జయం పొంది విశ్రాంతి తీసుకుంటారు. కాలేబు మొదలుకుని దావీదు మరియు అతని సంతానంలోని ఎందరో రాజులు తమ శత్రువుల విషయంలో ఇలాంటి శౌర్యాన్నే కనపరచినట్టు మనం న్యాయాధిపతుల గ్రంథంలోనూ సమూయేలు రెండు గ్రంథాలలోనూ రాజుల రెండు గ్రంథాలలోనూ చదువుతాం. చివరిగా ప్రభువైన యేసుక్రీస్తు కూడా ఈ గోత్రంలోనే జన్మించి (హెబ్రీ 7:14) యూదాగోత్రపు కొదమ సింహంగా పిలవబడి (ప్రకటన 5:5) తన శత్రువులపై విజయం సాధిస్తాడు.
2 థెస్సలొనికయులకు 2:8 అప్పుడా ధర్మవిరోధి (సాతాను) బయలుపరచబడును. ప్రభువైన యేసు తన నోటియూపిరిచేత వానిని సంహరించి తన ఆగమన ప్రకాశముచేత నాశనము చేయును.
ప్రకటన 17:14 వీరు గొఱ్ఱెపిల్లతో యుద్ధము చేతురు గాని, గొఱ్ఱెపిల్ల ప్రభువులకు ప్రభువును రాజులకు రాజునై యున్నందునను, తనతోకూడ ఉండినవారు పిలువబడినవారై, యేర్పరచ బడినవారై, నమ్మకమైనవారై యున్నందునను, ఆయన ఆ రాజులను జయించును.
ఆదికాండము 49:10
షిలోహు వచ్చువరకు యూదా యొద్దనుండి దండము తొలగదు అతని కాళ్ల మధ్య నుండి రాజదండము తొలగదు ప్రజలు అతనికి విధేయులైయుందురు.
ఈ వచనంలో యాకోబు పలుకుతున్న ఈ మాటలు యూదా గోత్రం నుండే మెస్సీయ వస్తాడు అనడానికి కచ్ఛితమైన ఆధారాలుగా మనం చూస్తాం. చారిత్రాత్మకంగా మనం యూదుల చరిత్రను పరిశీలిస్తే ఇక్కడ షిలోహుగా పిలవబడిన మెస్సీయ ఆ గోత్రంలో జన్మించేవరకూ యూదులు తమ అధికారాన్ని పూర్తిగా కోల్పోలేదు. వారు ఆయా దేశాలకు బానిసలుగా కొనిపోబడినప్పటికీ యెరూషలేములో శేషించిన ప్రజలపై ఎవరొకరు పరిపాలన చేసేవారు. కానీ మెస్సీయ జన్మించి మరణించి తిరిగి లేచిన తర్వాత క్రీస్తు శకం 70వ సంవత్సరంలో టైటస్ అనే రోమా అధికారి ఆ దేశాన్ని సర్వనాశనం చేసి వారికిక ఎలాంటి అధికారం లేకుండా చేసాడు. దీనిగురించి యేసుక్రీస్తు కూడా ముందుగానే ప్రవచించారు.
మత్తయి 24:1,2 యేసు దేవాలయమునుండి బయలుదేరి వెళ్లుచుండగా ఆయన శిష్యులు ఆ దేవాలయపు కట్టడములు ఆయనకు చూపింపవచ్చిరి. అందుకాయన మీరు ఇవన్నియు చూచుచున్నారు గదా; రాతిమీద రాయి యొకటియైనను ఇక్కడ నిలిచియుండకుండ పడద్రోయబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనెను.
ఈ విధంగా యేసుక్రీస్తు రాకతో యూదుల మధ్యనుండి రాజదండం తొలగిపోయింది. అప్పటినుంచి ప్రపంచవ్యాప్తంగా ఆయనకు (మెస్సీయకు) ఎంతోమంది విధేయులుగా ఉంటున్నారు. దీనిని బట్టి వాగ్దానం చెయ్యబడిన మెస్సీయ యేసుక్రీస్తే అని యూదులు కూడా ఒప్పుకోక తప్పదు ఎందుకంటే ఈ ప్రవచనం చెప్పబడింది వారి గ్రంథం (పాతనిబంధన) లోనే. ఆ నేరవేర్పు యేసుక్రీస్తులో తప్ప మరెవరి విషయంలోనూ నెరవేరలేదు.
ఆదికాండము 49:11,12
ద్రాక్షావల్లికి తన గాడిదను ఉత్తమ ద్రాక్షావల్లికి తన గాడిదపిల్లను కట్టి ద్రాక్షారసములో తన బట్టలను ద్రాక్షల రక్తములో తన వస్త్రమును ఉదుకును. అతని కన్నులు ద్రాక్షారసముచేత ఎఱ్ఱగాను అతని పళ్లు పాలచేత తెల్లగాను ఉండును.
ఈ వచనాలలో యాకోబు పలుకుతున్న మాటలు యూదులు స్వాస్థ్యంగా పొందబోయే ప్రాంతంలో వారికి లభించే సమృద్ధి గురించి అలంకారప్రాయంగా చెప్పబడ్డాయి. అక్కడ ద్రాక్షారసం మనం బట్టలు ఉతుకుకోవడానికి ఉపయోగించే నీరు అంత విస్తారంగా దొరుకుతుంది. ద్రాక్షతీగల బలం వాటికి గాడిదలను కట్టివేసేంతగా ఉంటుంది (అలంకారం). అదేవిధంగా ఈమాటలు మెస్సీయద్వారా లోకానికి రాబోయే తీర్పును కూడా తెలియచేస్తున్నాయి ఎందుకంటే యూదా తన శత్రువులపై పగతీర్చుకుంటాడనే మాటలకు ఇవి కొనసాగింపు.
యెషయా 63:1-4 రక్తవర్ణ వస్త్రములు ధరించి ఎదోమునుండి వచ్చుచున్నయితడెవడు? శోభితవస్త్రము ధరించినవాడై గంభీరముగా నడచుచు బొస్రానుండి బలాతిశయముతో వచ్చుచున్న యితడెవడు? నీతినిబట్టి మాటలాడుచున్న నేనే రక్షించుటకు బలాఢ్యుడనైన నేనే. నీ వస్త్రము ఎఱ్ఱగా ఉన్నదేమి? నీ బట్టలు ద్రాక్షగానుగను త్రొక్కుచుండువాని బట్టలవలె ఉన్నవేమి? ఒంటరిగా ద్రాక్షగానుగను త్రొక్కితిని, జనములలో ఎవడును నాతోకూడ ఉండలేదు కోపగించుకొని వారిని త్రొక్కితిని రౌద్రముచేత వారిని అణగద్రొక్కితిని వారి రక్తము నా వస్త్రములమీద చిందినది, నా బట్టలన్నియు డాగులే. పగతీర్చుకొను దినము నా మనస్సునకు వచ్చెను విముక్తి చేయదగిన సంవత్సరము వచ్చియుండెను.
ఆదికాండము 49:13
జెబూలూను సముద్రపు రేవున నివసించును అతడు ఓడలకు రేవుగా ఉండును అతని పొలిమేర సీదోనువరకు నుండును.
ఈ వచనంలో యాకోబు జెబులూను గురించి ప్రవచించడం మనం చూస్తాం. అతను చెప్పినట్టే ఇశ్రాయేలీయులు ఐగుప్తునుండి వచ్చాక ఈ గోత్రం కనాను ఉత్తరభాగంలో సీదోనుకు దగ్గరగా స్వాస్థ్యం పొందుకుంది. దీనివల్ల సముద్రవాణిజ్యపరంగా ఇది అభివృద్ధి చెందింది. ఇక్కడ మనం గుర్తించవలసిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ఈ అధ్యాయంలో యాకోబు వీరు ఎక్కడెక్కడ అయితే నివసిస్తారని ప్రవచనాత్మకంగా చెప్పాడో అవే ప్రదేశాలు వీరికి చీటీవల్ల స్వాస్థ్యంగా వచ్చాయి యెహోషువా తన ఇష్టప్రకారమో లేక వారి కోరిక ప్రకారమో వాటిని పంచలేదు.
యెహొషువ 19:10-16 మూడవవంతు చీటి వారి వంశముచొప్పున జెబూలూనీయుల పక్షముగా వచ్చెను. వారి స్వాస్థ్యపు సరిహద్దు శారీదువరకు సాగెను. వారి సరిహద్దు పడ మటివైపుగా మరలావరకును దబ్బాషతువరకును సాగి యొక్నెయామునకు ఎదురుగానున్న యేటివరకు వ్యాపించి శారీదునుండి సూర్యోదయ దిక్కున కిస్లోత్తాబోరు సరిహద్దువరకు దాబెరతునుండి యాఫీయకు ఎక్కి అక్కడనుండి తూర్పు తట్టు గిత్తహెపెరువరకును ఇత్కా చీనువరకును సాగి నేయావరకు వ్యాపించు రిమ్మోనుదనుక పోయెను. దాని సరిహద్దు హన్నాతోను వరకు ఉత్తరదిక్కున చుట్టుకొని అక్కడనుండి యిప్తాయేలు లోయలో నిలిచెను. కట్టాతు నహలాలు షిమ్రోను ఇదలా బేత్లెహేము అను పండ్రెండు పట్టణములును వాటి పల్లెలును. ఆ పట్టణములును వాటి పల్లెలును వారి వంశములచొప్పున జెబూలూనీయులకు కలిగిన స్వాస్థ్యము.
ఆదికాండము 49:14
ఇశ్శాఖారు రెండు దొడ్ల మధ్యను పండుకొనియున్న బలమైన గార్దభము.
ఈ వచనంలో యాకోబు ఇశ్శాఖారు గురించి ప్రవచించడం మనం చూస్తాం. అతను చెప్పినట్టే అతని గోత్రానికి జెబులూను గోత్రీకులకూ దాను గోత్రీకులకూ మధ్యలో స్వాస్థ్యం వచ్చింది. కాబట్టి రెండు దొడ్లమధ్య పండుకొనియున్న గార్దభంగా ఇతను వర్ణించబడ్డాడు. గార్దభం అన్నప్పుడు అతని బలాన్ని సూచిస్తుంది.
ఆదికాండము 49:15
అతడు విశ్రాంతి మంచిదగుటయు ఆ భూమి రమ్యమైనదగుటయు చూచెను గనుక అతడు మోయుటకు భుజము వంచుకొని వెట్టిచేయు దాసుడగును.
ఇశ్శాఖారు గోత్రీకులు ఎక్కువగా యుద్దాలలో పాల్గోకుండా భూమిపైనే ఆధారపడి కష్టపడి వ్యవసాయం చేసేవారు. దీనివల్ల యుద్ధాలు సంభవించినప్పుడు వీరు యుద్దంలో పాల్గొనేవారికి పన్నును కట్టవలసి వచ్చేది ఇందువల్ల అతడు దాసుడిగా వర్ణించబడ్డాడు.
ఆదికాండము 49:16
దాను ఇశ్రాయేలు గోత్రికులవలె తన ప్రజలకు న్యాయము తీర్చును.
ఈ వచనంలో యాకోబు దాను గురించి ప్రవచించడం మనం చూస్తాం. ఈ దాను యాకోబు భార్యలైన లేయా రాహేలుల ద్వారా కాకుండా రాహేలు దాసిద్వారా జన్మించాడు (ఆదికాండము 30:5,6) అయినప్పటికీ అతను ఇశ్రాయేలీయుల మిగిలిన గోత్రాలకంటే తక్కువేం కాదని అతను కూడా మిగిలిన ఇశ్రాయేలీయులతో పాటు తన ప్రజలకు న్యాయం తీరుస్తాడని ఈ మాటలు తెలియచేస్తున్నాయి.
ఆదికాండము 49:17
దాను త్రోవలో సర్పముగాను దారిలో కట్లపాముగాను ఉండును. అది గుఱ్ఱపు మడిమెలు కరచును అందువలన ఎక్కువాడు వెనుకకు పడును.
దాను గోత్రీకులకు సరిహద్దుల్లోని భూభాగం స్వాస్థ్యంగా లభించింది (యెహోషువ 19:40-46) దీనివల్ల ఆ దేశంపై యుద్ధానికి ఎవరు ప్రవేశించినా మొదటిగా దాను గోత్రీకులను దాటుకునే వెళ్ళాలి. కాబట్టి ఆ గోత్రీకులు తమ దేశంలోకి ప్రవేశించే శత్రువులను అడ్డుకోడానికి సర్పంవలే వివేకంగా ఉండి వారిని అంతం చేస్తారు. ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతిగా వ్యవహరించిన సంసోను ఈ గోత్రానికి చెందినవాడే.
ఆదికాండము 49:18,19
యెహోవా, నీ రక్షణకొరకు కనిపెట్టియున్నాను. బంటుల గుంపు గాదును కొట్టును అతడు మడిమెను కొట్టును.
గాదు గోత్రంవారు సరిహద్దు ప్రాంతంలో నివసిస్తూ తమ దేశంలోకి ప్రవేశించే శత్రువును మట్టుపెట్టడానికి సిద్ధంగా ఉంటారని పై వచనంలో మనం చూసాం. ఆ క్రమంలో వీరిలో కొందరు చనిపోవడం సహజం అందుకే యాకోబు తన దేవుణ్ణి గాదు యొక్క రక్షణకోసం వేడుకుంటున్నాడు. బంటుల గుంపు గాదును కొట్టును అంటే వారికి తటస్థించే ఆ అపాయాలు సూచిస్తున్నాయి. అయినప్పటికీ అతనిగోత్రం వారు యుద్ధసన్నద్ధులై తమ శత్రువులతో పోరాడతారు - అదే అతను వారి మడిమెను కొట్టడం.
ఆదికాండము 49:20
ఆషేరునొద్ద శ్రేష్ఠమైన ఆహారము కలదు రాజులకు తగిన మధుర పదార్థములను అతడిచ్చును.
ఈ వచనంలో యాకోబు ఆషేరు గురించి ప్రవచించడం మనం చూస్తాం. ఆషేరు గోత్రంవారికి స్వాస్థ్యంగా లభించిన భూ భాగంలో (యెహోషువ 19:24-31) ఆహారము మరియు తైలాల సమృద్ధి ఇతరగోత్రాలకంటే ఎక్కువగా లభిస్తుంది. దీనిమూలంగా తమ దేశాన్ని పరిపాలించే రాజులు ఈ ప్రాంతంనుండే ఆహారాన్ని పొందుకునేవారు.
ఆదికాండము 49:21
నఫ్తాలి విడువబడిన లేడి అతడు ఇంపైనమాటలు పలుకును.
ఈ వచనంలో యాకోబు నప్తాలి గురించి ప్రవచించడం మనం చూస్తాం. ఇందులో అతను విడువబడిన లేడిగా సంబోధించబడ్డాడు. కొందరు బైబిల్ పండితులు ఆ మాటకు సింధూరవృక్షం అనే అర్థం కూడా వస్తుందని అ వృక్షంలానే నఫ్తాలి విస్తరిస్తాడని చెప్పేందుకే యాకోబు ఆ పోలికను తీసుకున్నాడని భావించారు. అదేవిధంగా అతను ఇంపైన మాటలు పలికి అందరినీ తనవైపు ఆకర్షించుకుంటాడు.
ఆదికాండము 49:22
యోసేపు ఫలించెడి కొమ్మ ఊట యొద్ద ఫలించెడి కొమ్మదాని రెమ్మలు గోడమీదికి ఎక్కి వ్యాపించును.
ఈ వచనంలో యాకోబు తన ప్రియకుమారుడైన యోసేపు గురించి ప్రవచించడం మనం చూస్తాం. ఇందులో అతను అతను ఊటయొద్ద ఫలించెడి కొమ్మగా పోల్చబడ్డాడు. నీటి ఊటల (నదుల) పక్కన ఉన్న చెట్టు ఎలాగైతే ఫలించి విస్తరిస్తుందో అలానే యోసేపు సంతానం అభివృద్ధి చెందుతుంది.
ఆదికాండము 49:23
విలుకాండ్రు అతని వేధించిరి వారు బాణములను వేసి అతని హింసించిరి.
ఈ వచనంలో యాకోబు; యోసేపు జీవితంలో అతనికి కలిగిన హింసలను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. యోసేపు చరిత్రను మనం పరిశీలించినప్పుడు అతను మొదటిగా తన అన్నలచేత హింసించబడ్డాడు, తరువాత పోతిఫరు భార్య చేత హింసించబడ్డాడు. చివరికి పానదాయకుల అధిపతి కూడా యోసేపును రెండు సంవత్సరాలు మరచిపోయి బాధపడేలా చేసాడు.
ఆదికాండము 49:24,25
యాకోబు కొలుచు పరాక్రమశాలియైనవాని హస్తబలమువలన అతని విల్లు బలమైనదగును. ఇశ్రాయేలునకు బండయు మేపెడివాడును ఆయనే. నీకు సహాయము చేయు నీ తండ్రి దేవునివలనను పైనుండి మింటి దీవెనలతోను క్రింద దాగియున్న అగాధజలముల దీవెనలతోను స్తనముల దీవెనలతోను గర్భముల దీవెనలతోను నిన్ను దీవించు సర్వశక్తుని దీవెనవలనను అతని బాహుబలము దిట్టపరచబడును.
ఈ వచనాలలో యాకోబు తన కుమారుడైన యోసేపును అన్ని హింసల నుండీ తప్పించి ఘనపరచిన పరాక్రమశాలి అయిన తన దేవుణ్ణి బండగా కాపరిగా వర్ణిస్తూ ఆయనవల్ల యోసేపుకు సమస్తమైన దీవెనలూ కలుగుతాయని ప్రవచిస్తున్నాడు. ఆయనను బట్టి యోసేపు సంతానం వారి విల్లు బలమైనదిగా (యుద్ధశూరులుగా) మారుతుంది.
ఆదికాండము 49:26
నీ తండ్రి దీవెనలు నా పూర్వికుల దీవెనలపైని చిరకాల పర్వతములకంటె హెచ్చుగ ప్రబలమగును. అవి యోసేపు తలమీదను తన సహోదరులనుండి వేరుపరచబడిన వాని నడినెత్తిమీదను ఉండును.
ఈ వచనంలో యాకోబు యోసేపు గురించిన తన మాటలను కొనసాగిస్తూ తాను పొందుకున్న దీవెనలు తన పితరుల దీవెనలకంటే ఉన్నతమైనవని, అవి యోసేపు తలమీదకు వస్తాయని చెబుతున్నాడు.
ద్వితీయోపదేశకాండము 33:13-17 యోసేపునుగూర్చి యిట్లనెను ఆకాశ పరమార్థములవలన మంచువలన క్రింద క్రుంగియున్న అగాధ జలములవలన సూర్యునివలన కలుగు ఫలములోని శ్రేష్ఠపదార్థముల వలన చంద్రుడు పుట్టించు శ్రేష్ఠపదార్థముల వలన పురాతన పర్వతముల శ్రేష్ఠపదార్థముల వలన నిత్యపర్వతముల శ్రేష్ఠపదార్థముల వలన సంపూర్ణముగా ఫలించు భూమికి కలిగిన శ్రేష్ఠపదార్థముల వలన యెహోవా అతని భూమిని దీవించును పొదలోనుండినవాని కటాక్షము యోసేపు తలమీదికి వచ్చును తన సహోదరులలో ప్రఖ్యాతినొందినవాని నడినెత్తి మీదికి అది వచ్చును. అతని వృషభమునకు మొదట పుట్టినదానికి ఘనత కలదు. అతని కొమ్ములు గురుపోతు కొమ్ములు వాటివలన అతడు భూమ్యంతములవరకు జనులను త్రోసివేయును ఎఫ్రాయిముయొక్క పదివేలును మనష్షేయొక్క వేలును ఆలాగుననుందురు.
ఆదికాండము 49:27
బెన్యామీను చీల్చునట్టి తోడేలు అతడు ఉదయమందు ఎరను తిని అస్తమయమందు దోపుడుసొమ్ము పంచుకొనును.
ఈ వచనంలో యాకోబు బెన్యామీను గురించి ప్రవచించడం మనం చూస్తాం. ఇందులో అతను చీల్చునట్టి తోడేలుగా వర్ణించబడ్డాడు. అది ఆ గోత్రపువారి యుద్ధశౌర్యాన్ని తెలియచేస్తుంది. తోడేలు ఎరను తిన్నట్టుగా వారు పగలంతా యుద్ధంలో సైనికులను చంపి సాయంకాలంలో వారినుండి దోచుకున్న సొమ్మును పంచుకుంటారు. ఇశ్రాయేలీయులను పరిపాలించిన మొదటిరాజు సౌలు ఈ గోత్రానికి చెందినవాడే (1 సమూయేలు 9:1,2) అపోస్తలుడైన పౌలు కూడా ఈ గోత్రంలోనే జన్మించాడు (రోమా 11:1).
ద్వితీయోపదేశకాండము 33:12 బెన్యామీనునుగూర్చి యిట్లనెను బెన్యామీను యెహోవాకు ప్రియుడు ఆయనయొద్ద అతడు సురక్షితముగా నివసించును దినమెల్ల ఆయన అతనికి ఆశ్రయమగును ఆయన భుజముల మధ్య అతడు నివసించును.
ఆదికాండము 49:28
ఇవి అన్నియు ఇశ్రాయేలు పండ్రెండు గోత్రములు. వారి తండ్రి వారిని దీవించుచు వారితో చెప్పినది యిదే. ఎవరి దీవెన చొప్పున వారిని దీవించెను.
ఈ వచనంలో ఇశ్రాయేలీయులవి పన్నెండు గోత్రాలనూ యాకోబు దీవించినట్టు రాయబడడం మనం చూస్తాం. వీరి సంతానం గురించి మోషే కూడా తన మరణసమయంలో ఇలా దీవించాడు.
ద్వితీయోపదేశకాండము 33:6-29 రూబేను బ్రదికి చావక యుండునుగాక అతనివారు లెక్కింపలేనంతమంది అగుదురు. యూదానుగూర్చి అతడిట్లనెను యెహోవా, యూదా మనవి విని, అతని ప్రజల యొద్దకు అతనిని చేర్చుము. యూదా బాహుబలము అతనికి చాలునట్లుచేసి అతని శత్రువులకు విరోధముగా నీవతనికి సహాయుడవై యుందువు. లేవినిగూర్చి యిట్లనెను నీ తుమ్మీమము నీ ఊరీము నీ భక్తునికి కలవు మస్సాలో నీవు అతని పరిశోధించితివి మెరీబా నీళ్లయొద్ద అతనితో వివాదపడితివి. అతడునేను వానినెరుగనని తన తండ్రిని గూర్చియు తన తల్లినిగూర్చియు అనెను తన సహోదరులను లక్ష్యపెట్టలేదు తన కుమారులను కుమారులని యెంచలేదు వారు నీ వాక్యమునుబట్టి నీ నిబంధనను గైకొనిరి. వారు యాకోబునకు నీ విధులను ఇశ్రాయేలునకు నీ ధర్మశాస్త్రమును నేర్పుదురు నీ సన్నిధిని ధూపమును నీ బలిపీఠముమీద సర్వాంగబలిని అర్పించుదురు యెహోవా, అతని బలమును అంగీకరించుము అతడు చేయు కార్యమును అంగీకరించుమీ అతని విరోధులును అతని ద్వేషించువారును లేవ కుండునట్లు వారి నడుములను విరుగగొట్టుము. బన్యామీనునుగూర్చి యిట్లనెను బెన్యామీను యెహోవాకు ప్రియుడు ఆయనయొద్ద అతడు సురక్షితముగా నివసించును దినమెల్ల ఆయన అతనికి ఆశ్రయమగును ఆయన భుజములమధ్య2 అతడు నివసించును యోసేపునుగూర్చి యిట్లనెను ఆకాశ పరమార్థములవలన మంచువలన క్రింద క్రుంగియున్న అగాధ జలములవలన సూర్యునివలన కలుగు ఫలములోని శ్రేష్ఠపదార్థముల వలన చంద్రుడు పుట్టించు శ్రేష్ఠపదార్థములవలన పురాతన పర్వతముల శ్రేష్ఠపదార్థములవలన నిత్యపర్వతముల శ్రేష్ఠపదార్థములవలన సంపూర్ణముగా ఫలించు భూమికి కలిగిన శ్రేష్ఠపదార్థ ములవలన యెహోవా అతని భూమిని దీవించును పొదలోనుండినవాని కటాక్షము యోసేపు తలమీదికి వచ్చును తన సహోదరులలో ప్రఖ్యాతినొందినవాని నడినెత్తి మీదికి అది వచ్చును. అతని వృషభమునకు మొదట పుట్టినదానికి ఘనత కలదు. అతని కొమ్ములు గురుపోతు కొమ్ములు వాటివలన అతడు భూమ్యంతములవరకు జనులను త్రోసివేయును ఎఫ్రాయిముయొక్క పదివేలును మనష్షేయొక్క వేలును ఆలాగున నుందురు. జబూలూనునుగూర్చి యిట్లనెను జెబూలూనూ, నీవు బయలు వెళ్లు స్థలమందు సంతోషించుము ఇశ్శాఖారూ, నీ గుడారములయందు సంతోషించుము. వారు జనములను కొండకు పిలిచిరి అక్కడ నీతి బలుల నర్పింతురు వారు సముద్రముల సమృద్ధిని ఇసుకలో దాచబడిన రహస్యద్రవ్యములను పీల్చుదురు. గాదునుగూర్చి యిట్లనెను గాదును విశాలపరచువాడు స్తుతింపబడును అతడు ఆడు సింహమువలె పొంచియుండును బాహు వును నడినెత్తిని చీల్చివేయును. అతడు తనకొరకు మొదటిభాగము చూచుకొనెను అక్కడ నాయకుని భాగము కాపాడబడెను. అతడు జనములోని ముఖ్యులతో కూడ వచ్చెను యెహోవా తీర్చిన న్యాయమును జరిపెను ఇశ్రాయేలీయులయొద్ద యెహోవా విధులను ఆచరించెను. దానునుగూర్చి యిట్లనెను దాను సింహపుపిల్ల అది బాషానునుండి దుమికి దాటును. నఫ్తాలినిగూర్చి యిట్లనెను కటాక్షముచేత తృప్తిపొందిన నఫ్తాలి, యెహోవా దీవెనచేత నింపబడిన నఫ్తాలి, పశ్చిమ దక్షిణ దిక్కులను స్వాధీనపరచుకొనుము. ఆషేరునుగూర్చి యిట్లనెను ఆషేరు తన సహోదరులకంటె ఎక్కువగా ఆశీర్వ దింపబడును. అతడు తన సహోదరులకంటె కటాక్షము నొందును తన పాదములను తైలములో ముంచుకొనును. నీ కమ్ములు ఇనుపవియు ఇత్తడివియునై యుండును.నీవు బ్రదుకు దినములలో నీకు విశ్రాంతి కలుగును. యెషూరూనూ, దేవుని పోలినవాడెవడును లేడు ఆయన నీకు సహాయము చేయుటకు ఆకాశవాహనుడై వచ్చును మహోన్నతుడై మేఘవాహనుడగును. శాశ్వతుడైన దేవుడు నీకు నివాసస్థలము నిత్యముగనుండు బాహువులు నీ క్రిందనుండును ఆయన నీ యెదుటనుండి శత్రువును వెళ్ళగొట్టి నశింపజేయుమనెను. ఇశ్రాయేలు నిర్భయముగా నివసించును యాకోబు ఊట ప్రత్యేకింపబడును అతడు ధాన్య ద్రాక్షారసములుగల దేశములో నుండును అతనిపై ఆకాశము మంచును కురిపించును. ఇశ్రాయేలూ, నీ భాగ్యమెంత గొప్పది యెహోవా రక్షించిన నిన్ను పోలినవాడెవడు? ఆయన నీకు సహాయకరమైన కేడెము నీకు ఔన్నత్యమును కలిగించు ఖడ్గము నీ శత్రువులు నీకు లోబడినట్లుగా వారు వేషము వేయుదురు నీవు వారి ఉన్నతస్థలములను త్రొక్కుదువు.
ఆదికాండము 49:29
తరువాత అతడు వారికాజ్ఞాపించుచు ఇట్లనెను నేను నా స్వజనులయొద్దకు చేర్చబడుచున్నాను.
ఈ వచనంలో యాకోబు తన మరణం గురించి మాట్లాడుతూ "నేను నా స్వజనులయొద్దకు చేర్చబడుచున్నాను" అని పలకడం మనం చూస్తాం. పితరులందరి మరణం విషయంలోనూ మనకు ఈ మాటలు కనిపిస్తాయి (ఆదికాండము 25:8, ఆదికాండము 35:29). దేవుడు కూడా అబ్రాహాముతో ఈ విషయం ప్రస్తావించాడు (ఆదికాండము 15:15). ఈమాటలు వారు సమాధి చెయ్యబడడం (పితరుల సమాధిలో పెట్టబడడం) గురించి మాత్రమే కాకుండా మరణం తర్వాత దేవుడు వారికి సిద్ధపరచిన స్థలానికి చేరుకోవడం గురించి కూడా చెప్పబడుతున్నాయి. అందుకే యాకోబు సమాధిలో పెట్టబడకముందే "యాకోబు తన కుమారుల కాజ్ఞాపించుట చాలించి మంచముమీద తన కాళ్లు ముడుచుకొని ప్రాణమువిడిచి తన స్వజనులయొద్దకు చేర్చబడెను" అని 33వ వచనంలో రాయబడింది. యేసుక్రీస్తు ఈ భూమిపై జన్మించి, మరణించి తిరిగిలేచేంతవరకూ ఎవరూ పరలోకం చేరుకోలేదు (అపొ.కా 2:34, (యోహాను 3:13). ఎందుకంటే ఎవరు పరలోకం వెళ్ళాలన్నా అది యేసుక్రీస్తు సిలువ మరణం ద్వారా వారి పాపాలకు ప్రాయుశ్చిత్తం జరిగాకే సాధ్యం. ఆ ప్రాయుశ్చిత్తం యేసుక్రీస్తుకు ముందు చనిపోయిన విశ్వాసులకు కూడా వర్తిస్తుంది (యోహాను 14:6). కాబట్టి యేసుక్రీస్తు ఈలోకంలో జన్మించి మరణించి తిరిగిలేచేంతవరకూ మరణించిన విశ్వాసులందరికీ దేవుడు ఒక స్థలాన్ని (పరదైసు) సిద్ధపరిచాడు. లాజరు, ధనవంతుని ఉపమానంలో మనం అదే గమనిస్తాం (లూకా 16:22). ఆ స్థలం (పరదైసు) గురించే ఇక్కడ యాకోబు తన స్వజనులయొద్దకు చేర్చబడ్డాడని రాయబడిందని నేను భావిస్తున్నాను. ఎందుకంటే అక్కడే యాకోబు స్వజనులు (అబ్రాహాము ఇస్సాకులతో సహా విశ్వాసులైన పితరులందరూ) ఉన్నారు.
అయితే మనం రాజుల గ్రంథాలను చదువుతున్నప్పుడు; అక్కడ కొందరు దుష్టరాజులు కూడా తమ పితరుల యొద్దకు చేర్చబడినట్టు కనిపిస్తుంది. ఔను. వారు కూడా తమ పితరుల యొద్దకే చేర్చబడ్దారు. ఎందుకంటే యేసుక్రీస్తు మరణ పునరుత్థానాల వరకూ మరణించిన విశ్వాసులు విశ్రమించడానికి ఎలాగైతే ఒక స్థలం (పరదైసు)నిర్ణయించబడిందో అలానే తీర్పుదినంవరకూ మరణించిన పాపులు యాతనపడడానికి కూడా ఒక స్థలం (పాతాళం) నిర్ణయించబడింది. దుష్టులైతే పాతాళంలోని వారి పితరులయొద్దకు చేర్చబడతారు, విశ్వాసులైతే పరదైసులోని తమ స్వజనులయొద్దకు చేర్చబడతారు. యాకోబు విశ్వాసి కాబట్టి అతను చనిపోగానే పరదైసులోని తన స్వజనుల యొద్దకు చేర్చబడ్డాడు.
ఆదికాండము 49:30-32
హిత్తీయుడైన ఎఫ్రోను భూమియం దున్న గుహలో నా తండ్రుల యొద్ద నన్ను పాతిపెట్టుడి. ఆ గుహ కనాను దేశమందలి మమ్రే యెదుటనున్న మక్పేలా పొలములో ఉన్నది. అబ్రాహాము దానిని ఆ పొలమును హిత్తీయుడగు ఎఫ్రోనుయొద్ద శ్మశాన భూమి కొరకు స్వాస్థ్యముగా కొనెను. అక్కడనే వారు అబ్రాహామును అతని భార్యయైన శారాను పాతి పెట్టిరి. అక్కడనే ఇస్సాకును అతని భార్యయైన రిబ్కాను పాతి పెట్టిరి. అక్కడనే నేను లేయాను పాతిపెట్టితిని. ఆ పొలమును అందులోనున్న గుహయు హేతుకుమారుల యొద్ద కొనబడినదనెను.
ఈ వచనాలలో యాకోబు తనను ఎక్కడ సమాధి చెయ్యాలో తన కుమారులకు ఆజ్ఞాపించడం మనం చూస్తాం. అతను ప్రస్తావించిన ఆ భూమిని అబ్రాహాము శారా చనిపోయినప్పుడు ఎఫ్రోను దగ్గర కొన్నాడు (ఆదికాండము 23:17-20). అయితే అపోస్తలుల కార్యములు 7:16లో స్తెఫను; ఆ భూమిని అబ్రాహాము హమోరు కుమారుల యొద్ద కొన్నాడని అక్కడే యాకోబు సమాధి చెయ్యబడ్డాడని ప్రస్తావించాడు. కొంతమంది దీనిని వైరుధ్యంగా భావిస్తుంటారు కానీ ఇక్కడ ఎలాంటి వైరుధ్యం లేదు. ఆ విషయం నేను ఇప్పటికే వివరించాను. (ఆదికాండము 23:17-20 వ్యాఖ్యానం చూడండి).
ఆదికాండము 49:33
యాకోబు తన కుమారుల కాజ్ఞాపించుట చాలించి మంచముమీద తన కాళ్లు ముడుచుకొని ప్రాణమువిడిచి తన స్వజనులయొద్దకు చేర్చ బడెను
ఈ వచనంలో యాకోబు మరణించడం మనం చూస్తాం. ఈ యాకోబు కనాను ప్రాంతంలో కరవువచ్చినప్పుడు అతని కుమారులు బెన్యామీనును కూడా ఐగుప్తుకు తీసుకునివెళ్తామంటే మీరు నన్ను పుత్రహీనుడిగా చేస్తున్నారని ఎంతో బాధపడ్డాడు. కానీ దేవుడు అతను కోల్పోయాననుకున్న యోసేపును సైతం మరలా అతను కలుసుకుని తనతో 17 సంవత్సరాలు కలిసియుండి, చివరికి ఆనందంగా మరణించే భాగ్యాన్ని ప్రసాదించాడు. అతను ఐగుప్తుకు ప్రయాణమైనప్పుడు దేవుడు చెప్పినట్టుగానే యోసేపు అతని కన్నుల మీద చెయ్యి ఉంచాడు (ఆదికాండము 46:4).
కీర్తనలు 116: 15 యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువ గలది.
Copyright Notice
ఈ వ్యాసాన్ని/పుస్తకాన్ని వాణిజ్యపరంగా ఉపయోగించాలనుకున్నవారు మా లిఖితపూర్వక అనుమతిని తప్పక తీసుకోవాలి. ఉచిత ప్రచురణ కొరకు మా అనుమతిని తీసుకోనవసరం లేదు.
ఐతే, పూర్తిగానైనా పాక్షికంగానైనా, ఈ వ్యాసాన్ని/పుస్తకాన్ని ప్రచురించేవారు ఈ కిందున్న కాపీరైట్ నోటీసును తప్పక జతచేస్తూ ప్రకటించాలి:
"ఈ వ్యాసం/పుస్తకం, 'హితబోధ కమ్యూనికేషన్స్'వారి
అనుమతి ద్వారా ప్రచురించబడింది ©2024 www.hithabodha.com"
ఇందులో ఉపయోగించిన బైబిలు వచనాలన్నీ బైబిల్ సొసైటీవారు ప్రచురించిన పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఉపయోగించబడినవి.
ఆదికాండము అధ్యాయము 49
49:1, 49:2, 49:3,4, 49:5, 49:6, 49:7, 49:8, 49:9, 49:10, 49:11,12, 49:13, 49:14, 49:15, 49:16, 49:17, 49:18, 49:19, 49:20, 49:21, 49:22, 49:23, 49:24,25, 49:26, 49:27, 49:28, 49:29, 49:30-32, 49:33
ఆదికాండము 49:1
యాకోబు తన కుమారులను పిలిపించి యిట్లనెను. మీరు కూడి రండి, అంత్యదినములలో మీకు సంభవింపబోవు సంగతులను మీకు తెలియచేసెదను.
గత అధ్యాయంలో యాకోబు యోసేపునూ అతని సంతానాన్నీ ఉద్దేశించి ప్రవచనాత్మకంగా కొన్ని విషయాలు మాట్లాడినట్టు మనం చూసాం. దానికి కొనసాగింపుగానే ఈ అధ్యాయం ప్రారంభమౌతుంది. ఆ సమయంలో తన కుమారులు కొందరు బయట ఉండి ఉండవచ్చు అందుకే యాకోబు వారిని కూడా తానున్న గదిలోకి పిలిపించి, వారికి జరగబోతే విషయాలను ప్రవచిస్తున్నాడు. అందులో కొన్ని ఆశీర్వాదాలు అయితే మరికొన్ని శాపాలు, కొన్ని భౌతిక సంబంధమైనవైతే మరికొన్ని ఆధ్యాత్మిక సంబంధమైనవి. కొన్ని మోషే, యెహోషువల కాలంలో నెరవేరితే మరికొన్ని న్యాయాధిపతుల కాలంలో నెరవేరాయి.
అదేవిధంగా ఈ ప్రవచనాత్మక మాటల్లో మెస్సీయను గురించిన వాగ్దానం కూడా నిక్షిప్తమై ఉంది కాబట్టి యాకోబు అది అంత్యదినాలలో జరగబోయేదిగా తెలియచేస్తున్నాడు యేసుక్రీస్తు అంత్యదినాలలో జన్మించాడని మనకు లేఖనాలు తెలియచేస్తున్నాయి (హెబ్రీ 1: 2)
ఆదికాండము 49:2
యాకోబు కుమారులారా, కూడి వచ్చి ఆలకించుడి మీ తండ్రియైన ఇశ్రాయేలు మాట వినుడి.
ఈ వచనంలో యాకోబు మరలా తన కుమారులను తన మాటలను వినాలంటూ పిలవడం మనం చూస్తాం. అతను చెప్పే మాటలు ప్రవచనాత్మకంగా పద్యరూపంలో రాయబడ్డాయి కాబట్టి వాటి ప్రాముఖ్యతను తెలియచెయ్యడానికి వాటిని మరలా మరలా ప్రస్తావించడం సాధారణంగానే జరుగుతుంది. అదేవిధంగా యాకోబు ఈమాటలను ప్రవచనాత్మకంగా చెబుతున్నాడు కాబట్టి ఇందులో మనకు కొన్నిచోట్ల అలంకారభాష కూడా కనిపిస్తుంటుంది.
ఆదికాండము 49:3,4
రూబేనూ, నీవు నా పెద్ద కుమారుడవు నా శక్తియు నా బలము యొక్క ప్రథమఫలమును ఔన్నత్యాతిశయమును బలాతిశయమును నీవే. నీళ్లవలె చంచలుడవై నీవు అతిశయము పొందవు నీ తండ్రి మంచము మీదికెక్కితివి దానిని అపవిత్రము చేసితివి అతడు నా మంచము మీదికెక్కెను.
ఈ వచనంలో యాకోబు రూబేను గురించి ప్రవచించడం మనం చూస్తాం. వాస్తవానికి అతను యాకోబుకు పెద్దకుమారుడు కాబట్టి వారి ఆచారం ప్రకారం అతను జ్యేష్ఠత్వపు హక్కును తీసుకుని దానిద్వారా తన తండ్రి సొత్తులో ఇతరులకంటే ఒక భాగం ఎక్కువ పొందుకుంటాడు(ద్వితీయోపదేశకాండము 21:17). కానీ ఈ రూబేను తన తండ్రి ఉపపత్నితో శయనించి నీచమైన కార్యానికి పాల్పడినందువల్ల (ఆదికాండము 35:22) ఆ హక్కును కోల్పోయాడు. అతనికి ప్రతిగా యోసేపు ఆ హక్కును పొందుకున్నాడు (ఆదికాండము 48:22, 1 దినవృత్తాంతములు 5:1). రూబేను ఆ చెడుకార్యం చేసి చాలా సంవత్సరాలు గడచిపోయాయి ఆ సమయంలో అతను తాను చేసినపనిని బట్టి పశ్చాత్తాపపడి ఉండవచ్చు, అందుకే ఆ పాపాన్ని అతడు కొనసాగించినట్టుగా రాయబడలేదు. అయినప్పటికీ ఈ సమయంలో యాకోబు దానిని జ్ఞాపకం చేసుకుంటూ అతనిని జ్యేష్ఠత్వపు హక్కు నుండి తొలగించడమే కాకుండా అందరిముందూ అతను చేసినదానిని ప్రస్తావించి సిగ్గుపడేలా చేసాడు. దీనివల్ల అతని జీవితంపైన చెరగని మచ్చపడింది. కాబట్టి పాపపు ఫలితం ఎప్పటికైనా అనుభవించక తప్పదనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. పాపం చేసి పరువు పోకుండా కాపాడుకోవడం సాధ్యం కాదు. దీనికి ఉదాహరణగా మనం దావీదు జీవితాన్ని కూడా గమనించవచ్చు. అతను బెత్సెబా విషయంలో చేసిన పాపాన్ని బట్టి దేవుడు అతడు మరణించకుండా కృప చూపినప్పటికీ ఆ పాపపు ఫలితాన్ని మాత్రం జీవితాంతమూ అనుభవిస్తూనే ఉన్నాడు.
ఆదికాండము 49:5
షిమ్యోను లేవి అనువారు సహోదరులు వారి ఖడ్గములు బలాత్కారపు ఆయుధములు.
ఈ వచనంలో యాకోబు తన ఇద్దరు కుమారులైన షిమ్యోను, లేవీల గురించి ప్రవచించడం మనం చూస్తాం. వీరికి ఇతర సహోదరులు ఉన్నప్పటికీ వీరిద్దరికీ ఒకేవిధమైన హింసాస్వభావం ఉండడం చేత యాకోబు వీరిద్దరినీ సహోదరులని ఇక్కడ సంబోధిస్తున్నాడు. ఎందుకంటే ఇక్కడ యాకోబు వారు షెకెము విషయంలో చేసిన హింసను జ్ఞాపకం చేసుకుంటూ ఈ మాటలు మాట్లాడుతున్నాడు. వీరు ఆత్మరక్షణ కోసం ఉపయోగించవలసిన ఆయుధాలను బలత్కారం చెయ్యడానికి ఉపయోగించారు. "వారి ఖడ్గములు బలాత్కారపు ఆయుధములు" అంటే అర్థం అదే. రూబేను ఇంటిలో పాపం చేసి తన తండ్రిని బాధపెడితే వీరు బయట హింస చేసి తమ తండ్రికి చెడ్డపేరునూ ప్రమాదాన్నీ తీసుకువచ్చారు. దేవుడు ఆ సమయంలో యాకోబుపై కృప చూపించకపోతే అతనితోపాటు కుటుంబమంతా షెకెము చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలచేతిలో నాశనమయ్యేది. వీరిగురించి యాకోబు పలుకుతున్న మిగిలిన మాటలు కూడా చూడండి.
ఆదికాండము 49:6
నా ప్రాణమా, వారి ఆలోచనలో చేరవద్దు నా ఘనమా, వారి సంఘముతో కలిసికొనవద్దు వారు, కోపమువచ్చి మనుష్యులను చంపిరి తమ స్వేచ్ఛ చేత ఎద్దుల గుదికాలి నరములను తెగగొట్టిరి.
ఈ వచనంలో యాకోబు చెబుతున్న మాటలన్నీ వారు షెకెము ఊరివారికి జరిగించినట్టు మనం చూస్తాం (ఆదికాండము 34వ అధ్యాయం). దానితో అతనికి ఎలాంటి సంబంధం లేదని అలాంటి క్రూరమైన కార్యానికి తాను అంగీకారం తెలుపలేదని యాకోబు ఇక్కడ తెలియచేస్తూ వారు చేసినదానికి వారినే నిందితులుగా ఎంచుతున్నాడు. "నా ప్రాణమా, వారి ఆలోచనలో చేరవద్దు నా ఘనమా, వారి సంఘముతో కలిసికొనవద్దు" అనే మాటలను ప్రత్యేకంగా గమనించండి. విశ్వాసులమైన మనం హింస విషయంలో ఎంతటి విముఖత కలిగియుండాలో ఈ మాటలు మనకు బోధిస్తున్నాయి. అందుకే "కాగా, దేవునిచేత ఏర్పరచబడినవారును పరిశుద్ధులును ప్రియులునైనవారికి తగినట్లు, మీరు జాలిగల మనస్సును, దయాళుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. ఎవడైనను తనకు హానిచేసెనని యొకడనుకొనిన యెడల ఒకనినొకడు సహించుచు ఒకనినొకడు క్షమించుడి, ప్రభువు (క్రీస్తు)మిమ్మును క్షమించినలాగున మీరును క్షమించుడి" (కొలొస్సీ 3:12,13) అని ఆజ్ఞాపించబడుతున్నాము.
ఆదికాండము 49:7
వారి కోపము వేండ్రమైనది వారి ఉగ్రతయు కఠినమైనది అవి శపింపబడును యాకోబులో వారిని విభజించెదను ఇశ్రాయేలులో వారిని చెదరగొట్టెదను.
ఈ వచనంలో యాకోబు లేవీ షిమ్యోనులు కనపరిచిన కోపాన్నీ ఉగ్రతనూ శపించడం మనం చూస్తాం. ఇక్కడ అతను తన కుమారులైన లేవీ షిమ్యోనులను శపించడం లేదు కానీ వారు షెకెము విషయంలో కనపరిచిన కోపం, ఉగ్రతలను శపిస్తున్నాడు. కానీ యాకోబును బట్టి ఆశీర్వదించబడిన వీరు శపించబడే ఆ లక్షణాలు కలిగియుండడం రూబేను తరహాలోనే వారి చరిత్రకు ఎంతో అవమానకరంగా ఉంది. దైవవిరుద్ధమైన లక్షణాలను కలిగియుండడం మన జీవితంపై అలాంటి మచ్చనూ శిక్షను కూడా తీసుకువస్తాయి. వారి కోపము ఎంత వేండ్రమైనదో ఉగ్రత ఎంత కఠినమైనదో ఆదికాండము 34వ అధ్యాయపు వ్యాఖ్యానంలో నేను వివరించాను. వారు ఆత్మరక్షణకోసం ఉపయోగించవలసిన ఆయుధాలను; తమవైపు జరిగిన తప్పును సరిచేసుకునేలా సమాధానంగా ఉండడానికి ప్రయత్నించి, తమది కాని ఆచారం (సున్నతి) పాటించిన బలహీనులపై ప్రయోగించారు. బాధలో బలహీనులుగా ఉన్నవారిని కనికరం లేకుండా చంపారు.
"నా ప్రాణమా, వారి ఆలోచనలో చేరవద్దు నా ఘనమా, వారి సంఘముతో కలిసికొనవద్దు వారు, కోపమువచ్చి మనుష్యులను చంపిరి తమ స్వేచ్ఛచేత ఎద్దుల గుదికాలి నరములను తెగ గొట్టిరి" (ఆదికాండము 49:6).
అందుకే తర్వాత మాటల్లో వారు ఇశ్రాయేలీయుల్లో చెదరగొట్టబడతారని మనం చదువుతున్నాం. కాబట్టి క్రీస్తును బట్టి ఆశీర్వదించబడిన మనలో పగతీర్చుకునే కోపము, ఉగ్రత అనే లక్షణాలు ఉండకూడదు. అందుకే "ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి గనుక కీడుకు ప్రతికీడైనను దూషణకు ప్రతి దూషణయైనను చేయక దీవించుడి" (1పేతురు 3:9) అని రాయబడింది.
ఇక లేవి షిమ్యోనుల గోత్రాలు ఇతర గోత్రాలవలే ఒకేచోట స్థిరంగా నివసించకుండా చెదరగొట్టబడ్డారు. యెహోషువా షిమ్యోనీయులకు యూదా గోత్రికుల మధ్యలో స్వాస్థ్యం పంచినప్పటికీ (యెహోషువా 19:1-9) తర్వాత వారు చెదరిపోయారు (1 దినవృత్తాంతములు 4:39-43). అలానే యెరూషలేము టార్గంలో యూదా పండితులు యాకోబు పలికిన ఈ మాటలకు భావం చెబుతూ షిమ్యోను గోత్రికులు బోధకులుగానూ శాస్త్రులుగానూ మారి ఇశ్రాయేలీయులలో చెదరిపోయారని ప్రస్తావించారు. యూదా పండితుడైన జార్కి కూడా అదేవిషయాన్ని తెలియచేసాడు. లేవీ గోత్రీకులను దేవుడు తన యాజకత్వం నిమిత్తం ఏర్పరచుకుని వారికి ఎలాంటి స్వాస్థ్యమూ ఇవ్వలేదు (ద్వితీయోపదేశకాండము 10:9) వారు ఇశ్రాయేలీయుల అన్నీగోత్రాలలోనూ చెదరిపోయి వారికి కేటాయించిన 48 పట్టణాలలో నివసించారు (యెహోషువ 21:1-41). యాజకత్వం అనేది వారి గోత్రానికి అనుగ్రహించబడిన గొప్ప ఆధిక్యతే ఐనా ఆ పని నిమిత్తం వారు ఇశ్రాయేలీయుల గోత్రాలలో 48 పట్టణాలుగా చెదరిపోయారు. ఈవిధంగా "యాకోబులో వారిని విభజించెదను ఇశ్రాయేలులో వారిని చెదరగొట్టెదను" అని ఇక్కడ పలకబడిన మాటలు వారి జీవితంలో నెరవేరాయి.
ఆదికాండము 49:8
యూదా, నీ సహోదరులు నిన్ను స్తుతించెదరు నీ చెయ్యి నీ శత్రువుల మెడమీద ఉండును నీ తండ్రి కుమారులు నీయెదుట సాగిలపడుదురు.
ఈ వచనంలో యాకోబు యూదా గురించి ప్రవచించడం మనం చూస్తాం. ఈ యూదా జన్మించినప్పుడే లేయా నేను యెహోవాను స్తుతిస్తానంటూ ఆ పేరును అతనికి పెట్టింది. ఆ పేరుకు తగినట్టుగానే యూదా పొందుకునే ఆధిక్యతను యాకోబు ఇక్కడ వివరిస్తున్నాడు. ఈ మాటలు యూదులు ఇశ్రాయేలీయులపై చేసిన పరిపాలననూ మరియు యూదాగోత్రం నుండి వచ్చిన మెస్సీయ చేస్తున్న పరిపాలననూ సూచిస్తున్నాయి.
1 దినవృత్తాంతములు 5:2 యూదా తన సహోదరులకంటె హెచ్చినవాడాయెను, అతని నుండి ప్రముఖుడు బయలువెడలెను.
ఆదికాండము 49:9
యూదా కొదమ సింహము నా కుమారుడా, నీవు పట్టినదాని తిని వచ్చితివి సింహమువలెను గర్జించు ఆడు సింహమువలెను అతడు కాళ్లు ముడుచుకొని పండుకొనెను అతని లేపువాడెవడు?
ఈ మాటలు మనకు యూదుల యుద్ధశౌర్యాన్ని తెలియచేస్తున్నాయి. సింహం వేటాడి దానిని తృప్తిగా తిని విశ్రాంతి తీసుకునేటప్పుడు ఏవిధంగానైతే ఎవరూ దానిని నిద్రలేపే సాహసం చెయ్యలేరో అదేవిధంగా యూదులు తమ శత్రువులపై జయం పొంది విశ్రాంతి తీసుకుంటారు. కాలేబు మొదలుకుని దావీదు మరియు అతని సంతానంలోని ఎందరో రాజులు తమ శత్రువుల విషయంలో ఇలాంటి శౌర్యాన్నే కనపరచినట్టు మనం న్యాయాధిపతుల గ్రంథంలోనూ సమూయేలు రెండు గ్రంథాలలోనూ రాజుల రెండు గ్రంథాలలోనూ చదువుతాం. చివరిగా ప్రభువైన యేసుక్రీస్తు కూడా ఈ గోత్రంలోనే జన్మించి (హెబ్రీ 7:14) యూదాగోత్రపు కొదమ సింహంగా పిలవబడి (ప్రకటన 5:5) తన శత్రువులపై విజయం సాధిస్తాడు.
2 థెస్సలొనికయులకు 2:8 అప్పుడా ధర్మవిరోధి (సాతాను) బయలుపరచబడును. ప్రభువైన యేసు తన నోటియూపిరిచేత వానిని సంహరించి తన ఆగమన ప్రకాశముచేత నాశనము చేయును.
ప్రకటన 17:14 వీరు గొఱ్ఱెపిల్లతో యుద్ధము చేతురు గాని, గొఱ్ఱెపిల్ల ప్రభువులకు ప్రభువును రాజులకు రాజునై యున్నందునను, తనతోకూడ ఉండినవారు పిలువబడినవారై, యేర్పరచ బడినవారై, నమ్మకమైనవారై యున్నందునను, ఆయన ఆ రాజులను జయించును.
ఆదికాండము 49:10
షిలోహు వచ్చువరకు యూదా యొద్దనుండి దండము తొలగదు అతని కాళ్ల మధ్య నుండి రాజదండము తొలగదు ప్రజలు అతనికి విధేయులైయుందురు.
ఈ వచనంలో యాకోబు పలుకుతున్న ఈ మాటలు యూదా గోత్రం నుండే మెస్సీయ వస్తాడు అనడానికి కచ్ఛితమైన ఆధారాలుగా మనం చూస్తాం. చారిత్రాత్మకంగా మనం యూదుల చరిత్రను పరిశీలిస్తే ఇక్కడ షిలోహుగా పిలవబడిన మెస్సీయ ఆ గోత్రంలో జన్మించేవరకూ యూదులు తమ అధికారాన్ని పూర్తిగా కోల్పోలేదు. వారు ఆయా దేశాలకు బానిసలుగా కొనిపోబడినప్పటికీ యెరూషలేములో శేషించిన ప్రజలపై ఎవరొకరు పరిపాలన చేసేవారు. కానీ మెస్సీయ జన్మించి మరణించి తిరిగి లేచిన తర్వాత క్రీస్తు శకం 70వ సంవత్సరంలో టైటస్ అనే రోమా అధికారి ఆ దేశాన్ని సర్వనాశనం చేసి వారికిక ఎలాంటి అధికారం లేకుండా చేసాడు. దీనిగురించి యేసుక్రీస్తు కూడా ముందుగానే ప్రవచించారు.
మత్తయి 24:1,2 యేసు దేవాలయమునుండి బయలుదేరి వెళ్లుచుండగా ఆయన శిష్యులు ఆ దేవాలయపు కట్టడములు ఆయనకు చూపింపవచ్చిరి. అందుకాయన మీరు ఇవన్నియు చూచుచున్నారు గదా; రాతిమీద రాయి యొకటియైనను ఇక్కడ నిలిచియుండకుండ పడద్రోయబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనెను.
ఈ విధంగా యేసుక్రీస్తు రాకతో యూదుల మధ్యనుండి రాజదండం తొలగిపోయింది. అప్పటినుంచి ప్రపంచవ్యాప్తంగా ఆయనకు (మెస్సీయకు) ఎంతోమంది విధేయులుగా ఉంటున్నారు. దీనిని బట్టి వాగ్దానం చెయ్యబడిన మెస్సీయ యేసుక్రీస్తే అని యూదులు కూడా ఒప్పుకోక తప్పదు ఎందుకంటే ఈ ప్రవచనం చెప్పబడింది వారి గ్రంథం (పాతనిబంధన) లోనే. ఆ నేరవేర్పు యేసుక్రీస్తులో తప్ప మరెవరి విషయంలోనూ నెరవేరలేదు.
ఆదికాండము 49:11,12
ద్రాక్షావల్లికి తన గాడిదను ఉత్తమ ద్రాక్షావల్లికి తన గాడిదపిల్లను కట్టి ద్రాక్షారసములో తన బట్టలను ద్రాక్షల రక్తములో తన వస్త్రమును ఉదుకును. అతని కన్నులు ద్రాక్షారసముచేత ఎఱ్ఱగాను అతని పళ్లు పాలచేత తెల్లగాను ఉండును.
ఈ వచనాలలో యాకోబు పలుకుతున్న మాటలు యూదులు స్వాస్థ్యంగా పొందబోయే ప్రాంతంలో వారికి లభించే సమృద్ధి గురించి అలంకారప్రాయంగా చెప్పబడ్డాయి. అక్కడ ద్రాక్షారసం మనం బట్టలు ఉతుకుకోవడానికి ఉపయోగించే నీరు అంత విస్తారంగా దొరుకుతుంది. ద్రాక్షతీగల బలం వాటికి గాడిదలను కట్టివేసేంతగా ఉంటుంది (అలంకారం). అదేవిధంగా ఈమాటలు మెస్సీయద్వారా లోకానికి రాబోయే తీర్పును కూడా తెలియచేస్తున్నాయి ఎందుకంటే యూదా తన శత్రువులపై పగతీర్చుకుంటాడనే మాటలకు ఇవి కొనసాగింపు.
యెషయా 63:1-4 రక్తవర్ణ వస్త్రములు ధరించి ఎదోమునుండి వచ్చుచున్నయితడెవడు? శోభితవస్త్రము ధరించినవాడై గంభీరముగా నడచుచు బొస్రానుండి బలాతిశయముతో వచ్చుచున్న యితడెవడు? నీతినిబట్టి మాటలాడుచున్న నేనే రక్షించుటకు బలాఢ్యుడనైన నేనే. నీ వస్త్రము ఎఱ్ఱగా ఉన్నదేమి? నీ బట్టలు ద్రాక్షగానుగను త్రొక్కుచుండువాని బట్టలవలె ఉన్నవేమి? ఒంటరిగా ద్రాక్షగానుగను త్రొక్కితిని, జనములలో ఎవడును నాతోకూడ ఉండలేదు కోపగించుకొని వారిని త్రొక్కితిని రౌద్రముచేత వారిని అణగద్రొక్కితిని వారి రక్తము నా వస్త్రములమీద చిందినది, నా బట్టలన్నియు డాగులే. పగతీర్చుకొను దినము నా మనస్సునకు వచ్చెను విముక్తి చేయదగిన సంవత్సరము వచ్చియుండెను.
ఆదికాండము 49:13
జెబూలూను సముద్రపు రేవున నివసించును అతడు ఓడలకు రేవుగా ఉండును అతని పొలిమేర సీదోనువరకు నుండును.
ఈ వచనంలో యాకోబు జెబులూను గురించి ప్రవచించడం మనం చూస్తాం. అతను చెప్పినట్టే ఇశ్రాయేలీయులు ఐగుప్తునుండి వచ్చాక ఈ గోత్రం కనాను ఉత్తరభాగంలో సీదోనుకు దగ్గరగా స్వాస్థ్యం పొందుకుంది. దీనివల్ల సముద్రవాణిజ్యపరంగా ఇది అభివృద్ధి చెందింది. ఇక్కడ మనం గుర్తించవలసిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ఈ అధ్యాయంలో యాకోబు వీరు ఎక్కడెక్కడ అయితే నివసిస్తారని ప్రవచనాత్మకంగా చెప్పాడో అవే ప్రదేశాలు వీరికి చీటీవల్ల స్వాస్థ్యంగా వచ్చాయి యెహోషువా తన ఇష్టప్రకారమో లేక వారి కోరిక ప్రకారమో వాటిని పంచలేదు.
యెహొషువ 19:10-16 మూడవవంతు చీటి వారి వంశముచొప్పున జెబూలూనీయుల పక్షముగా వచ్చెను. వారి స్వాస్థ్యపు సరిహద్దు శారీదువరకు సాగెను. వారి సరిహద్దు పడ మటివైపుగా మరలావరకును దబ్బాషతువరకును సాగి యొక్నెయామునకు ఎదురుగానున్న యేటివరకు వ్యాపించి శారీదునుండి సూర్యోదయ దిక్కున కిస్లోత్తాబోరు సరిహద్దువరకు దాబెరతునుండి యాఫీయకు ఎక్కి అక్కడనుండి తూర్పు తట్టు గిత్తహెపెరువరకును ఇత్కా చీనువరకును సాగి నేయావరకు వ్యాపించు రిమ్మోనుదనుక పోయెను. దాని సరిహద్దు హన్నాతోను వరకు ఉత్తరదిక్కున చుట్టుకొని అక్కడనుండి యిప్తాయేలు లోయలో నిలిచెను. కట్టాతు నహలాలు షిమ్రోను ఇదలా బేత్లెహేము అను పండ్రెండు పట్టణములును వాటి పల్లెలును. ఆ పట్టణములును వాటి పల్లెలును వారి వంశములచొప్పున జెబూలూనీయులకు కలిగిన స్వాస్థ్యము.
ఆదికాండము 49:14
ఇశ్శాఖారు రెండు దొడ్ల మధ్యను పండుకొనియున్న బలమైన గార్దభము.
ఈ వచనంలో యాకోబు ఇశ్శాఖారు గురించి ప్రవచించడం మనం చూస్తాం. అతను చెప్పినట్టే అతని గోత్రానికి జెబులూను గోత్రీకులకూ దాను గోత్రీకులకూ మధ్యలో స్వాస్థ్యం వచ్చింది. కాబట్టి రెండు దొడ్లమధ్య పండుకొనియున్న గార్దభంగా ఇతను వర్ణించబడ్డాడు. గార్దభం అన్నప్పుడు అతని బలాన్ని సూచిస్తుంది.
ఆదికాండము 49:15
అతడు విశ్రాంతి మంచిదగుటయు ఆ భూమి రమ్యమైనదగుటయు చూచెను గనుక అతడు మోయుటకు భుజము వంచుకొని వెట్టిచేయు దాసుడగును.
ఇశ్శాఖారు గోత్రీకులు ఎక్కువగా యుద్దాలలో పాల్గోకుండా భూమిపైనే ఆధారపడి కష్టపడి వ్యవసాయం చేసేవారు. దీనివల్ల యుద్ధాలు సంభవించినప్పుడు వీరు యుద్దంలో పాల్గొనేవారికి పన్నును కట్టవలసి వచ్చేది ఇందువల్ల అతడు దాసుడిగా వర్ణించబడ్డాడు.
ఆదికాండము 49:16
దాను ఇశ్రాయేలు గోత్రికులవలె తన ప్రజలకు న్యాయము తీర్చును.
ఈ వచనంలో యాకోబు దాను గురించి ప్రవచించడం మనం చూస్తాం. ఈ దాను యాకోబు భార్యలైన లేయా రాహేలుల ద్వారా కాకుండా రాహేలు దాసిద్వారా జన్మించాడు (ఆదికాండము 30:5,6) అయినప్పటికీ అతను ఇశ్రాయేలీయుల మిగిలిన గోత్రాలకంటే తక్కువేం కాదని అతను కూడా మిగిలిన ఇశ్రాయేలీయులతో పాటు తన ప్రజలకు న్యాయం తీరుస్తాడని ఈ మాటలు తెలియచేస్తున్నాయి.
ఆదికాండము 49:17
దాను త్రోవలో సర్పముగాను దారిలో కట్లపాముగాను ఉండును. అది గుఱ్ఱపు మడిమెలు కరచును అందువలన ఎక్కువాడు వెనుకకు పడును.
దాను గోత్రీకులకు సరిహద్దుల్లోని భూభాగం స్వాస్థ్యంగా లభించింది (యెహోషువ 19:40-46) దీనివల్ల ఆ దేశంపై యుద్ధానికి ఎవరు ప్రవేశించినా మొదటిగా దాను గోత్రీకులను దాటుకునే వెళ్ళాలి. కాబట్టి ఆ గోత్రీకులు తమ దేశంలోకి ప్రవేశించే శత్రువులను అడ్డుకోడానికి సర్పంవలే వివేకంగా ఉండి వారిని అంతం చేస్తారు. ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతిగా వ్యవహరించిన సంసోను ఈ గోత్రానికి చెందినవాడే.
ఆదికాండము 49:18,19
యెహోవా, నీ రక్షణకొరకు కనిపెట్టియున్నాను. బంటుల గుంపు గాదును కొట్టును అతడు మడిమెను కొట్టును.
గాదు గోత్రంవారు సరిహద్దు ప్రాంతంలో నివసిస్తూ తమ దేశంలోకి ప్రవేశించే శత్రువును మట్టుపెట్టడానికి సిద్ధంగా ఉంటారని పై వచనంలో మనం చూసాం. ఆ క్రమంలో వీరిలో కొందరు చనిపోవడం సహజం అందుకే యాకోబు తన దేవుణ్ణి గాదు యొక్క రక్షణకోసం వేడుకుంటున్నాడు. బంటుల గుంపు గాదును కొట్టును అంటే వారికి తటస్థించే ఆ అపాయాలు సూచిస్తున్నాయి. అయినప్పటికీ అతనిగోత్రం వారు యుద్ధసన్నద్ధులై తమ శత్రువులతో పోరాడతారు - అదే అతను వారి మడిమెను కొట్టడం.
ఆదికాండము 49:20
ఆషేరునొద్ద శ్రేష్ఠమైన ఆహారము కలదు రాజులకు తగిన మధుర పదార్థములను అతడిచ్చును.
ఈ వచనంలో యాకోబు ఆషేరు గురించి ప్రవచించడం మనం చూస్తాం. ఆషేరు గోత్రంవారికి స్వాస్థ్యంగా లభించిన భూ భాగంలో (యెహోషువ 19:24-31) ఆహారము మరియు తైలాల సమృద్ధి ఇతరగోత్రాలకంటే ఎక్కువగా లభిస్తుంది. దీనిమూలంగా తమ దేశాన్ని పరిపాలించే రాజులు ఈ ప్రాంతంనుండే ఆహారాన్ని పొందుకునేవారు.
ఆదికాండము 49:21
నఫ్తాలి విడువబడిన లేడి అతడు ఇంపైనమాటలు పలుకును.
ఈ వచనంలో యాకోబు నప్తాలి గురించి ప్రవచించడం మనం చూస్తాం. ఇందులో అతను విడువబడిన లేడిగా సంబోధించబడ్డాడు. కొందరు బైబిల్ పండితులు ఆ మాటకు సింధూరవృక్షం అనే అర్థం కూడా వస్తుందని అ వృక్షంలానే నఫ్తాలి విస్తరిస్తాడని చెప్పేందుకే యాకోబు ఆ పోలికను తీసుకున్నాడని భావించారు. అదేవిధంగా అతను ఇంపైన మాటలు పలికి అందరినీ తనవైపు ఆకర్షించుకుంటాడు.
ఆదికాండము 49:22
యోసేపు ఫలించెడి కొమ్మ ఊట యొద్ద ఫలించెడి కొమ్మదాని రెమ్మలు గోడమీదికి ఎక్కి వ్యాపించును.
ఈ వచనంలో యాకోబు తన ప్రియకుమారుడైన యోసేపు గురించి ప్రవచించడం మనం చూస్తాం. ఇందులో అతను అతను ఊటయొద్ద ఫలించెడి కొమ్మగా పోల్చబడ్డాడు. నీటి ఊటల (నదుల) పక్కన ఉన్న చెట్టు ఎలాగైతే ఫలించి విస్తరిస్తుందో అలానే యోసేపు సంతానం అభివృద్ధి చెందుతుంది.
ఆదికాండము 49:23
విలుకాండ్రు అతని వేధించిరి వారు బాణములను వేసి అతని హింసించిరి.
ఈ వచనంలో యాకోబు; యోసేపు జీవితంలో అతనికి కలిగిన హింసలను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. యోసేపు చరిత్రను మనం పరిశీలించినప్పుడు అతను మొదటిగా తన అన్నలచేత హింసించబడ్డాడు, తరువాత పోతిఫరు భార్య చేత హింసించబడ్డాడు. చివరికి పానదాయకుల అధిపతి కూడా యోసేపును రెండు సంవత్సరాలు మరచిపోయి బాధపడేలా చేసాడు.
ఆదికాండము 49:24,25
యాకోబు కొలుచు పరాక్రమశాలియైనవాని హస్తబలమువలన అతని విల్లు బలమైనదగును. ఇశ్రాయేలునకు బండయు మేపెడివాడును ఆయనే. నీకు సహాయము చేయు నీ తండ్రి దేవునివలనను పైనుండి మింటి దీవెనలతోను క్రింద దాగియున్న అగాధజలముల దీవెనలతోను స్తనముల దీవెనలతోను గర్భముల దీవెనలతోను నిన్ను దీవించు సర్వశక్తుని దీవెనవలనను అతని బాహుబలము దిట్టపరచబడును.
ఈ వచనాలలో యాకోబు తన కుమారుడైన యోసేపును అన్ని హింసల నుండీ తప్పించి ఘనపరచిన పరాక్రమశాలి అయిన తన దేవుణ్ణి బండగా కాపరిగా వర్ణిస్తూ ఆయనవల్ల యోసేపుకు సమస్తమైన దీవెనలూ కలుగుతాయని ప్రవచిస్తున్నాడు. ఆయనను బట్టి యోసేపు సంతానం వారి విల్లు బలమైనదిగా (యుద్ధశూరులుగా) మారుతుంది.
ఆదికాండము 49:26
నీ తండ్రి దీవెనలు నా పూర్వికుల దీవెనలపైని చిరకాల పర్వతములకంటె హెచ్చుగ ప్రబలమగును. అవి యోసేపు తలమీదను తన సహోదరులనుండి వేరుపరచబడిన వాని నడినెత్తిమీదను ఉండును.
ఈ వచనంలో యాకోబు యోసేపు గురించిన తన మాటలను కొనసాగిస్తూ తాను పొందుకున్న దీవెనలు తన పితరుల దీవెనలకంటే ఉన్నతమైనవని, అవి యోసేపు తలమీదకు వస్తాయని చెబుతున్నాడు.
ద్వితీయోపదేశకాండము 33:13-17 యోసేపునుగూర్చి యిట్లనెను ఆకాశ పరమార్థములవలన మంచువలన క్రింద క్రుంగియున్న అగాధ జలములవలన సూర్యునివలన కలుగు ఫలములోని శ్రేష్ఠపదార్థముల వలన చంద్రుడు పుట్టించు శ్రేష్ఠపదార్థముల వలన పురాతన పర్వతముల శ్రేష్ఠపదార్థముల వలన నిత్యపర్వతముల శ్రేష్ఠపదార్థముల వలన సంపూర్ణముగా ఫలించు భూమికి కలిగిన శ్రేష్ఠపదార్థముల వలన యెహోవా అతని భూమిని దీవించును పొదలోనుండినవాని కటాక్షము యోసేపు తలమీదికి వచ్చును తన సహోదరులలో ప్రఖ్యాతినొందినవాని నడినెత్తి మీదికి అది వచ్చును. అతని వృషభమునకు మొదట పుట్టినదానికి ఘనత కలదు. అతని కొమ్ములు గురుపోతు కొమ్ములు వాటివలన అతడు భూమ్యంతములవరకు జనులను త్రోసివేయును ఎఫ్రాయిముయొక్క పదివేలును మనష్షేయొక్క వేలును ఆలాగుననుందురు.
ఆదికాండము 49:27
బెన్యామీను చీల్చునట్టి తోడేలు అతడు ఉదయమందు ఎరను తిని అస్తమయమందు దోపుడుసొమ్ము పంచుకొనును.
ఈ వచనంలో యాకోబు బెన్యామీను గురించి ప్రవచించడం మనం చూస్తాం. ఇందులో అతను చీల్చునట్టి తోడేలుగా వర్ణించబడ్డాడు. అది ఆ గోత్రపువారి యుద్ధశౌర్యాన్ని తెలియచేస్తుంది. తోడేలు ఎరను తిన్నట్టుగా వారు పగలంతా యుద్ధంలో సైనికులను చంపి సాయంకాలంలో వారినుండి దోచుకున్న సొమ్మును పంచుకుంటారు. ఇశ్రాయేలీయులను పరిపాలించిన మొదటిరాజు సౌలు ఈ గోత్రానికి చెందినవాడే (1 సమూయేలు 9:1,2) అపోస్తలుడైన పౌలు కూడా ఈ గోత్రంలోనే జన్మించాడు (రోమా 11:1).
ద్వితీయోపదేశకాండము 33:12 బెన్యామీనునుగూర్చి యిట్లనెను బెన్యామీను యెహోవాకు ప్రియుడు ఆయనయొద్ద అతడు సురక్షితముగా నివసించును దినమెల్ల ఆయన అతనికి ఆశ్రయమగును ఆయన భుజముల మధ్య అతడు నివసించును.
ఆదికాండము 49:28
ఇవి అన్నియు ఇశ్రాయేలు పండ్రెండు గోత్రములు. వారి తండ్రి వారిని దీవించుచు వారితో చెప్పినది యిదే. ఎవరి దీవెన చొప్పున వారిని దీవించెను.
ఈ వచనంలో ఇశ్రాయేలీయులవి పన్నెండు గోత్రాలనూ యాకోబు దీవించినట్టు రాయబడడం మనం చూస్తాం. వీరి సంతానం గురించి మోషే కూడా తన మరణసమయంలో ఇలా దీవించాడు.
ద్వితీయోపదేశకాండము 33:6-29 రూబేను బ్రదికి చావక యుండునుగాక అతనివారు లెక్కింపలేనంతమంది అగుదురు. యూదానుగూర్చి అతడిట్లనెను యెహోవా, యూదా మనవి విని, అతని ప్రజల యొద్దకు అతనిని చేర్చుము. యూదా బాహుబలము అతనికి చాలునట్లుచేసి అతని శత్రువులకు విరోధముగా నీవతనికి సహాయుడవై యుందువు. లేవినిగూర్చి యిట్లనెను నీ తుమ్మీమము నీ ఊరీము నీ భక్తునికి కలవు మస్సాలో నీవు అతని పరిశోధించితివి మెరీబా నీళ్లయొద్ద అతనితో వివాదపడితివి. అతడునేను వానినెరుగనని తన తండ్రిని గూర్చియు తన తల్లినిగూర్చియు అనెను తన సహోదరులను లక్ష్యపెట్టలేదు తన కుమారులను కుమారులని యెంచలేదు వారు నీ వాక్యమునుబట్టి నీ నిబంధనను గైకొనిరి. వారు యాకోబునకు నీ విధులను ఇశ్రాయేలునకు నీ ధర్మశాస్త్రమును నేర్పుదురు నీ సన్నిధిని ధూపమును నీ బలిపీఠముమీద సర్వాంగబలిని అర్పించుదురు యెహోవా, అతని బలమును అంగీకరించుము అతడు చేయు కార్యమును అంగీకరించుమీ అతని విరోధులును అతని ద్వేషించువారును లేవ కుండునట్లు వారి నడుములను విరుగగొట్టుము. బన్యామీనునుగూర్చి యిట్లనెను బెన్యామీను యెహోవాకు ప్రియుడు ఆయనయొద్ద అతడు సురక్షితముగా నివసించును దినమెల్ల ఆయన అతనికి ఆశ్రయమగును ఆయన భుజములమధ్య2 అతడు నివసించును యోసేపునుగూర్చి యిట్లనెను ఆకాశ పరమార్థములవలన మంచువలన క్రింద క్రుంగియున్న అగాధ జలములవలన సూర్యునివలన కలుగు ఫలములోని శ్రేష్ఠపదార్థముల వలన చంద్రుడు పుట్టించు శ్రేష్ఠపదార్థములవలన పురాతన పర్వతముల శ్రేష్ఠపదార్థములవలన నిత్యపర్వతముల శ్రేష్ఠపదార్థములవలన సంపూర్ణముగా ఫలించు భూమికి కలిగిన శ్రేష్ఠపదార్థ ములవలన యెహోవా అతని భూమిని దీవించును పొదలోనుండినవాని కటాక్షము యోసేపు తలమీదికి వచ్చును తన సహోదరులలో ప్రఖ్యాతినొందినవాని నడినెత్తి మీదికి అది వచ్చును. అతని వృషభమునకు మొదట పుట్టినదానికి ఘనత కలదు. అతని కొమ్ములు గురుపోతు కొమ్ములు వాటివలన అతడు భూమ్యంతములవరకు జనులను త్రోసివేయును ఎఫ్రాయిముయొక్క పదివేలును మనష్షేయొక్క వేలును ఆలాగున నుందురు. జబూలూనునుగూర్చి యిట్లనెను జెబూలూనూ, నీవు బయలు వెళ్లు స్థలమందు సంతోషించుము ఇశ్శాఖారూ, నీ గుడారములయందు సంతోషించుము. వారు జనములను కొండకు పిలిచిరి అక్కడ నీతి బలుల నర్పింతురు వారు సముద్రముల సమృద్ధిని ఇసుకలో దాచబడిన రహస్యద్రవ్యములను పీల్చుదురు. గాదునుగూర్చి యిట్లనెను గాదును విశాలపరచువాడు స్తుతింపబడును అతడు ఆడు సింహమువలె పొంచియుండును బాహు వును నడినెత్తిని చీల్చివేయును. అతడు తనకొరకు మొదటిభాగము చూచుకొనెను అక్కడ నాయకుని భాగము కాపాడబడెను. అతడు జనములోని ముఖ్యులతో కూడ వచ్చెను యెహోవా తీర్చిన న్యాయమును జరిపెను ఇశ్రాయేలీయులయొద్ద యెహోవా విధులను ఆచరించెను. దానునుగూర్చి యిట్లనెను దాను సింహపుపిల్ల అది బాషానునుండి దుమికి దాటును. నఫ్తాలినిగూర్చి యిట్లనెను కటాక్షముచేత తృప్తిపొందిన నఫ్తాలి, యెహోవా దీవెనచేత నింపబడిన నఫ్తాలి, పశ్చిమ దక్షిణ దిక్కులను స్వాధీనపరచుకొనుము. ఆషేరునుగూర్చి యిట్లనెను ఆషేరు తన సహోదరులకంటె ఎక్కువగా ఆశీర్వ దింపబడును. అతడు తన సహోదరులకంటె కటాక్షము నొందును తన పాదములను తైలములో ముంచుకొనును. నీ కమ్ములు ఇనుపవియు ఇత్తడివియునై యుండును.నీవు బ్రదుకు దినములలో నీకు విశ్రాంతి కలుగును. యెషూరూనూ, దేవుని పోలినవాడెవడును లేడు ఆయన నీకు సహాయము చేయుటకు ఆకాశవాహనుడై వచ్చును మహోన్నతుడై మేఘవాహనుడగును. శాశ్వతుడైన దేవుడు నీకు నివాసస్థలము నిత్యముగనుండు బాహువులు నీ క్రిందనుండును ఆయన నీ యెదుటనుండి శత్రువును వెళ్ళగొట్టి నశింపజేయుమనెను. ఇశ్రాయేలు నిర్భయముగా నివసించును యాకోబు ఊట ప్రత్యేకింపబడును అతడు ధాన్య ద్రాక్షారసములుగల దేశములో నుండును అతనిపై ఆకాశము మంచును కురిపించును. ఇశ్రాయేలూ, నీ భాగ్యమెంత గొప్పది యెహోవా రక్షించిన నిన్ను పోలినవాడెవడు? ఆయన నీకు సహాయకరమైన కేడెము నీకు ఔన్నత్యమును కలిగించు ఖడ్గము నీ శత్రువులు నీకు లోబడినట్లుగా వారు వేషము వేయుదురు నీవు వారి ఉన్నతస్థలములను త్రొక్కుదువు.
ఆదికాండము 49:29
తరువాత అతడు వారికాజ్ఞాపించుచు ఇట్లనెను నేను నా స్వజనులయొద్దకు చేర్చబడుచున్నాను.
ఈ వచనంలో యాకోబు తన మరణం గురించి మాట్లాడుతూ "నేను నా స్వజనులయొద్దకు చేర్చబడుచున్నాను" అని పలకడం మనం చూస్తాం. పితరులందరి మరణం విషయంలోనూ మనకు ఈ మాటలు కనిపిస్తాయి (ఆదికాండము 25:8, ఆదికాండము 35:29). దేవుడు కూడా అబ్రాహాముతో ఈ విషయం ప్రస్తావించాడు (ఆదికాండము 15:15). ఈమాటలు వారు సమాధి చెయ్యబడడం (పితరుల సమాధిలో పెట్టబడడం) గురించి మాత్రమే కాకుండా మరణం తర్వాత దేవుడు వారికి సిద్ధపరచిన స్థలానికి చేరుకోవడం గురించి కూడా చెప్పబడుతున్నాయి. అందుకే యాకోబు సమాధిలో పెట్టబడకముందే "యాకోబు తన కుమారుల కాజ్ఞాపించుట చాలించి మంచముమీద తన కాళ్లు ముడుచుకొని ప్రాణమువిడిచి తన స్వజనులయొద్దకు చేర్చబడెను" అని 33వ వచనంలో రాయబడింది. యేసుక్రీస్తు ఈ భూమిపై జన్మించి, మరణించి తిరిగిలేచేంతవరకూ ఎవరూ పరలోకం చేరుకోలేదు (అపొ.కా 2:34, (యోహాను 3:13). ఎందుకంటే ఎవరు పరలోకం వెళ్ళాలన్నా అది యేసుక్రీస్తు సిలువ మరణం ద్వారా వారి పాపాలకు ప్రాయుశ్చిత్తం జరిగాకే సాధ్యం. ఆ ప్రాయుశ్చిత్తం యేసుక్రీస్తుకు ముందు చనిపోయిన విశ్వాసులకు కూడా వర్తిస్తుంది (యోహాను 14:6). కాబట్టి యేసుక్రీస్తు ఈలోకంలో జన్మించి మరణించి తిరిగిలేచేంతవరకూ మరణించిన విశ్వాసులందరికీ దేవుడు ఒక స్థలాన్ని (పరదైసు) సిద్ధపరిచాడు. లాజరు, ధనవంతుని ఉపమానంలో మనం అదే గమనిస్తాం (లూకా 16:22). ఆ స్థలం (పరదైసు) గురించే ఇక్కడ యాకోబు తన స్వజనులయొద్దకు చేర్చబడ్డాడని రాయబడిందని నేను భావిస్తున్నాను. ఎందుకంటే అక్కడే యాకోబు స్వజనులు (అబ్రాహాము ఇస్సాకులతో సహా విశ్వాసులైన పితరులందరూ) ఉన్నారు.
అయితే మనం రాజుల గ్రంథాలను చదువుతున్నప్పుడు; అక్కడ కొందరు దుష్టరాజులు కూడా తమ పితరుల యొద్దకు చేర్చబడినట్టు కనిపిస్తుంది. ఔను. వారు కూడా తమ పితరుల యొద్దకే చేర్చబడ్దారు. ఎందుకంటే యేసుక్రీస్తు మరణ పునరుత్థానాల వరకూ మరణించిన విశ్వాసులు విశ్రమించడానికి ఎలాగైతే ఒక స్థలం (పరదైసు)నిర్ణయించబడిందో అలానే తీర్పుదినంవరకూ మరణించిన పాపులు యాతనపడడానికి కూడా ఒక స్థలం (పాతాళం) నిర్ణయించబడింది. దుష్టులైతే పాతాళంలోని వారి పితరులయొద్దకు చేర్చబడతారు, విశ్వాసులైతే పరదైసులోని తమ స్వజనులయొద్దకు చేర్చబడతారు. యాకోబు విశ్వాసి కాబట్టి అతను చనిపోగానే పరదైసులోని తన స్వజనుల యొద్దకు చేర్చబడ్డాడు.
ఆదికాండము 49:30-32
హిత్తీయుడైన ఎఫ్రోను భూమియం దున్న గుహలో నా తండ్రుల యొద్ద నన్ను పాతిపెట్టుడి. ఆ గుహ కనాను దేశమందలి మమ్రే యెదుటనున్న మక్పేలా పొలములో ఉన్నది. అబ్రాహాము దానిని ఆ పొలమును హిత్తీయుడగు ఎఫ్రోనుయొద్ద శ్మశాన భూమి కొరకు స్వాస్థ్యముగా కొనెను. అక్కడనే వారు అబ్రాహామును అతని భార్యయైన శారాను పాతి పెట్టిరి. అక్కడనే ఇస్సాకును అతని భార్యయైన రిబ్కాను పాతి పెట్టిరి. అక్కడనే నేను లేయాను పాతిపెట్టితిని. ఆ పొలమును అందులోనున్న గుహయు హేతుకుమారుల యొద్ద కొనబడినదనెను.
ఈ వచనాలలో యాకోబు తనను ఎక్కడ సమాధి చెయ్యాలో తన కుమారులకు ఆజ్ఞాపించడం మనం చూస్తాం. అతను ప్రస్తావించిన ఆ భూమిని అబ్రాహాము శారా చనిపోయినప్పుడు ఎఫ్రోను దగ్గర కొన్నాడు (ఆదికాండము 23:17-20). అయితే అపోస్తలుల కార్యములు 7:16లో స్తెఫను; ఆ భూమిని అబ్రాహాము హమోరు కుమారుల యొద్ద కొన్నాడని అక్కడే యాకోబు సమాధి చెయ్యబడ్డాడని ప్రస్తావించాడు. కొంతమంది దీనిని వైరుధ్యంగా భావిస్తుంటారు కానీ ఇక్కడ ఎలాంటి వైరుధ్యం లేదు. ఆ విషయం నేను ఇప్పటికే వివరించాను. (ఆదికాండము 23:17-20 వ్యాఖ్యానం చూడండి).
ఆదికాండము 49:33
యాకోబు తన కుమారుల కాజ్ఞాపించుట చాలించి మంచముమీద తన కాళ్లు ముడుచుకొని ప్రాణమువిడిచి తన స్వజనులయొద్దకు చేర్చ బడెను
ఈ వచనంలో యాకోబు మరణించడం మనం చూస్తాం. ఈ యాకోబు కనాను ప్రాంతంలో కరవువచ్చినప్పుడు అతని కుమారులు బెన్యామీనును కూడా ఐగుప్తుకు తీసుకునివెళ్తామంటే మీరు నన్ను పుత్రహీనుడిగా చేస్తున్నారని ఎంతో బాధపడ్డాడు. కానీ దేవుడు అతను కోల్పోయాననుకున్న యోసేపును సైతం మరలా అతను కలుసుకుని తనతో 17 సంవత్సరాలు కలిసియుండి, చివరికి ఆనందంగా మరణించే భాగ్యాన్ని ప్రసాదించాడు. అతను ఐగుప్తుకు ప్రయాణమైనప్పుడు దేవుడు చెప్పినట్టుగానే యోసేపు అతని కన్నుల మీద చెయ్యి ఉంచాడు (ఆదికాండము 46:4).
కీర్తనలు 116: 15 యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువ గలది.
Copyright Notice
"ఈ వ్యాసం/పుస్తకం, 'హితబోధ కమ్యూనికేషన్స్'వారి అనుమతి ద్వారా ప్రచురించబడింది ©2024 www.hithabodha.com"
ఇందులో ఉపయోగించిన బైబిలు వచనాలన్నీ బైబిల్ సొసైటీవారు ప్రచురించిన పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఉపయోగించబడినవి.
Add comment