పాత నిబంధన

రచయిత: కె విద్యా సాగర్

33:1, 33:2,3, 33:4, 33:5-7, 33:8,9, 33:10, 33:11, 33:12-14, 33:15,16, 33:17, 33:18,19, 33:20

ఆదికాండము 33:1 యాకోబు కన్నులెత్తి చూచినప్పుడు ఏశావును అతనితో నాలుగువందలమంది మనుష్యులును వచ్చుచుండిరి.

ఈ వచనంలో ఏశావు తన సహోదరుడైన యాకోబు యొద్దకు రావడం మనం చూస్తాం. గత అధ్యాయంలో యాకోబు తనవారందరినీ రేవు దాటించి పంపివేసి తాను యెహోవా దూతతో పోరాడాడు. అది జరిగిన తర్వాత బలపరచబడి భార్యాపిల్లలు ఉన్నచోటికి చేరుకున్నాడు.

ఆదికాండము 33:2,3 అప్పుడతడు తన పిల్లలను లేయా రాహేలులకును ఇద్దరు దాసీలకును పంచి అప్పగించెను. అతడు ముందర దాసీలను, వారి పిల్లలను వారి వెనుక లేయాను ఆమె పిల్లలను ఆ వెనుక రాహేలును యోసేపును ఉంచి తాను వారి ముందర వెళ్లుచు తన సహోదరుని సమీపించు వరకు ఏడుమార్లు నేలను సాగిలపడెను.

ఈ వచనాలలో యాకోబు తన పిల్లలందరినీ తన భార్యలందరినీ వరుసక్రమంలో ఉంచి వారందరికంటే ముందుగా ఏశావును ఎదుర్కొంటున్నట్టు మనం చూస్తాం. ఇక్కడ యాకోబు తన ప్రాణం పెట్టైనా సరే తన కుటుంబాన్ని రక్షించుకోవాలని తపన పడుతున్నాడు. ఎందుకంటే; ఈ సంఘటన జరిగే సమయానికి యాకోబు మనసులో ఏశావుపట్ల చాలా భయం ఉంది. తాను ఊహించినట్టే ఏశావు దాడికి పాల్పడితే తన కుటుంబాన్ని తన వెనుక ఉంచడం వల్ల వారు పారిపోయే అవకాశం ఉండేలా అలా చేసాడు. లేదా అతను ఏశావుతో నీపగ నాపైనే తప్ప నా కుటుంబంపై కాదు నువ్వు ఏదైనా హాని చెయ్యాలి అనుకుంటే అదేదోనాకే చెయ్యి అని చెప్పడానికి కూడా అలా చేసుండవచ్చు.

అదేవిధంగా ఇక్కడ యాకోబు తన కుటుంబాన్ని తన వెనుక ఉంచిన వరుసను బట్టి, అతను ఎవరిని ఎంతగా ప్రేమిస్తున్నాడో కూడా అర్థం చేసుకోవచ్చు. మొదటిగా దాసీలనూ వారి పిల్లలనూ ఉంచాడు, రెండవదిగా అనుకోకుండా వివాహం చేసుకున్న లేయానూ ఆమె పిల్లలనూ ఉంచాడు. మూడవదిగా ప్రేమించి వివాహం చేసుకున్న రాహేలునూ ఆమె కుమారుడైన యోసేపునూ ఉంచాడు. యాకోబు అందరికంటే ఎక్కువగా యోసేపునే ప్రేమించాడు (ఆదికాండము 37: 3). ఒకవేళ ఏశావు తనను చంపి తన కుటుంబంపై కూడా దాడికి పాల్పడితే తప్పించుకుపోయే అవకాశం రాహేలు, యోసేపులకే ఎక్కువ ఉంటుంది. అయితే గమనించండి; అతను తన కుటుంబాన్ని ప్రేమించడంలో వ్యత్యాసం చూపిస్తున్నప్పటికీ వారందరినీ తనకంటే ఎక్కువగానే ప్రేమించాడు‌ తనకన్నా ఎవరినీ తక్కువగా ప్రేమించలేదు. అందుకే అందరికంటే ముందు వరుసలో అతనే ఉన్నాడు.

ఆదికాండము 33:4 అప్పుడు ఏశావు అతనిని ఎదుర్కొన పరుగెత్తి అతనిని కౌగలించుకొని అతని మెడ మీద పడి ముద్దుపెట్టుకొనెను వారిద్దరు కన్నీరు విడిచిరి.

ఈ వచనంలో యాకోబు ఊహించని విధంగా ఏశావు‌ ప్రవర్తించడం మనం చూస్తాం. ఇది యాకోబు చేసిన ప్రార్థనకు దేవుడిచ్చిన సమాధానం. ఒకప్పుడు యాకోబును చంపుతానని శపథం చేసిన ఏశావు హృదయాన్ని ఆయన మార్చివేసి తన సోదరుడు చేసిన తప్పిదాన్ని క్షమించేలా చేసాడు.

సామెతలు 16: 7 ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు ఆయన వాని శత్రువులను సహా వానికి మిత్రులుగా చేయును.

ఆదికాండము 33:5,6,7 ఏశావు కన్నులెత్తి ఆ స్త్రీలను పిల్లలను చూచి వీరు నీకేమి కావలెనని అడిగినందుకు అతడు వీరు దేవుడు నీ సేవకునికి దయచేసిన పిల్లలే అని చెప్పెను. అప్పుడు ఆ దాసీలును వారి పిల్లలును దగ్గరకువచ్చి సాగిలపడిరి. లేయాయు ఆమె పిల్లలును దగ్గరకువచ్చి సాగిలపడిరి. ఆ తరువాత యోసేపును రాహేలును దగ్గరకు వచ్చి సాగిలపడిరి.

ఈ వచనాలలో ఏశావు; యాకోబుతో ఉన్నవారికోసం ప్రశ్నించినప్పుడు, దానికి యాకోబు వారంతా దేవుడు నాకు అనుగ్రహించినవారని చెబుతూ ఆయనను మహిమపరచడం మనం చూస్తాం. చాలామంది మనుషుల్లో‌ ఉండే ఒక చెడ్డగుణం ఏంటంటే వారు కష్టాలలో ఉన్నప్పుడు దేవుణ్ణి ప్రాధేయపడుతూ ఉంటారు, ఆయన వారికి వాటి నుండి విముక్తి కల్పించగానే సంతోషంలో ఆయననే మర్చిపోతుంటారు. కానీ ఇక్కడ యాకోబు మాత్రం తన సోదరుడు క్షమించాడనే సంతోషంలో పరలోకతండ్రిని ఘనపరుస్తున్నాడు.

ఆదికాండము 33:8-9 ఏశావు నాకు ఎదురుగావచ్చిన ఆ గుంపంతయు ఎందుకని అడుగగా అతడు నా ప్రభువు కటాక్షము నా మీద వచ్చుటకే అని చెప్పెను. అప్పుడు ఏశావు సహోదరుడా, నాకు కావలసినంత ఉన్నది, నీది నీవే ఉంచుకొమ్మని చెప్పెను.

ఈ వచనంలో ఏశావు తనకు యాకోబు పంపిన కానుకను ఎందునిమిత్తం పంపాడో తెలుసుకుని, వాటిని తృణీకరించడం మనం చూస్తాం. ఎందుకంటే అక్కడ యాకోబు వాటిని ఏశావు క్షమాపణ కోరుతూ పంపించాడు కానీ ఏశావు తన సహోదరుణ్ణి క్షమించడానికి ఎలాంటి మూల్యం చెల్లించనవసరం లేదని గుర్తించాడు. అవిశ్వాసియైన ఏశావే సోదరబంధానికి ఇంతగా విలువనిస్తే విశ్వాసులమైన మనం మన కుటుంబసభ్యుల పట్ల, సంఘస్థుల పట్ల మరెంత నిస్వార్థమైన క్షమాగుణంతో నడుచుకోవాలో ఆలోచించండి.

అదేవిధంగా ఏశావు నాకు కావలసినంత ఉందని యాకోబుతో చెప్పడం ద్వారా దేవుడు అతడిని కూడా భౌతికంగా దీవించాడని మనం గుర్తిస్తున్నాం. ఏశావుకు ఆయన‌ అంతటి సమృద్ధిని దయచేసాడు‌ కాబట్టే అతను తన సోదరుడిని క్షమించగలిగాడు. ఏశావు కనుక అలాంటి సమృద్ధి లేక హీనస్థితిలో ఉండుంటే దానికి కారణం యాకోబు తన దీవెనను దొంగిలించుకుపోవడమే అని భావించి ఇంకా పగతోనే ఉండేవాడు. కాబట్టి సార్వభౌముడైన దేవుడు మానవుల పట్ల చేసే‌ మేలు కీడులన్నీ ఆయన చిత్తాన్ని నెరవేర్చుకునేందుకే.

ఆదికాండము 33:10 అప్పుడు యాకోబు అట్లు కాదు. నీ కటాక్షము నా మీద నున్నయెడల చిత్తగించి నా చేత ఈ కానుక పుచ్చుకొనుము, దేవుని ముఖము చూచినట్లు నీ ముఖము చూచితిని. నీ కటాక్షము నా మీద వచ్చినది గదా-

ఈ వచనంలో యాకోబు తన కానుకను స్వీకరించమని‌ ఏశావును బ్రతిమిలాడుతూ దేవుని ముఖం చూసినట్టు నీ ముఖం చూసానని చెప్పడం మనం చూస్తాం. ఈమాటల్లో యాకోబు ఏశావునేమీ దేవునితో సమానుడిగా చెయ్యడం లేదు కానీ గతంలో అతను తనకు ప్రత్యక్షమైన దేవుణ్ణి చూసినప్పుడు ఎలాంటి భయానికైతే లోనయ్యాడో (ఆదికాండము 28:16,17) అలాంటి భయమే ఏశావు ముఖాన్ని చూసినప్పుడు కూడా కలిగిందని కానీ అతని కటాక్షం తనపైకి వచ్చిందనే భావంలో అలా పోల్చాడు.

ఆదికాండము 33:11 నేను నీయొద్దకు తెచ్చిన కానుకను చిత్తగించి పుచ్చుకొనుము. దేవుడు నన్ను కనికరించెను; మరియు నాకు కావలసినంత ఉన్నదని చెప్పి అతని బలవంతము చేసెను గనుక అతడు దాని పుచ్చుకొని-

ఈ వచనంలో ఏశావు యాకోబు మాటకు సమ్మతించి అతను‌ పంపిన కానుకను స్వీకరించడం మనం చూస్తాం. అయితే ఇక్కడ అతను యాకోబు తనకు ఇస్తున్న ఉద్దేశాన్ని బట్టే దానిని స్వీకరించాడు. యాకోబు మొదట అతనికి కానుకను పంపినప్పుడు అతని‌ కటాక్షాన్ని కోరుకుంటూ దానిని పంపాడు, పైన చెప్పినట్టుగా తన సోదరుడిని‌ క్షమించడానికి అది అవసరం లేదు కాబట్టి ఏశావు దానిని తిరస్కరించాడు. కానీ ఇక్కడ యాకోబు ఏశావు కటాక్షం తనపైకి వచ్చిన సంతోషంతో ఆ కానుకను ఇస్తున్నాడు. అందుకే ఏశావు దానిని స్వీకరించాడు. కాబట్టి ఇతరులు మనకేదైనా ఇచ్చేదానిని తీసుకునేముందు వారు ఎలాంటి ఉద్దేశంతో‌ ఇస్తున్నారో గుర్తించి దానిని స్వీకరించాలి. మన వ్యక్తిత్వం ఎలాంటిదో మన ఇచ్చి పుచ్చుకోవడాలలో కూడా బయటపడుతుంది.

ఆదికాండము 33:12-14 మనము వెళ్లుదము. నేను నీకు ముందుగా సాగిపోవుదునని చెప్పగా అతడు నాయొద్దనున్న పిల్లలు పసిపిల్లలనియు, గొఱ్ఱెలు మేకలు పశువులు పాలిచ్చునవి అనియు నా ప్రభువుకు తెలియును. ఒక్కదినమే వాటిని వడిగా తోలినయెడల ఈ మంద అంతయు చచ్చును. నా ప్రభువు దయచేసి తన దాసునికి ముందుగా వెళ్లవలెను. నేను నా ప్రభువునొద్దకు శేయీరునకు వచ్చు వరకు, నా ముందరనున్న మందలు నడువగలిగిన కొలదిని ఈ పిల్లలు నడువగలిగినకొలదిని వాటిని మెల్లగా నడిపించుకొని వచ్చెదనని అతనితో చెప్పెను.

ఈ వచనాలలో‌ ఏశావు తన సహోదరుడైన యాకోబును తన ఇంటికి ఆహ్వానించడం మనం చూస్తాం. యాకోబు ఏశావుల గతచరిత్రను మనం పరిశీలించినప్పుడు వారిద్దరూ ఎప్పుడూ ఇంత ప్రేమగా లేరు. కానీ వారిద్దరి మధ్య దేవుడే సమాధానం కలుగచేసేసరికి మునుపటికంటే ఆప్యాయంగా మసులుకుంటున్నారు. దేవుడు కలిగించే సమాధానం ఇలానే ఉన్నతంగా ఉంటుంది. అదేవిధంగా ఈ సందర్భంలో ఏశావు యాకోబును పిలవగానే అతని‌ వెంట వెళ్ళిపోకుండా అతనితో ఉన్న కుటుంబం, మంద పరిస్థితిని ఆలోచిస్తూ తన సోదరుడికి విషయం తెలియచేస్తున్నాడు. మనం కూడా ఏదైనా చేసేముందు‌ మనతో ఉన్నవారి పరిస్థితిని కూడా అర్థం చేసుకుని ముందడుగు వెయ్యాలి.

ఆదికాండము 33:15,16 అప్పుడు ఏశావు నీకిష్టమైన యెడల నాయొద్దనున్న యీ జనులలో కొందరిని నీ యొద్ద విడిచిపెట్టుదునని చెప్పగా అతడు అదియేల? నా ప్రభువు కటాక్షము నామీద నుండనిమ్మనెను. ఆ దినమున ఏశావు తన త్రోవను శేయీరునకు తిరిగిపోయెను.

ఈ వచనాలలో ఏశావు తనదగ్గర ఉన్న కొంతమందిని యాకోబు దగ్గర విడిచిపెడతాను అన్నప్పుడు యాకోబు నిరాకరించడం మనం చూస్తాం. దీనిని బట్టి కొందరు యాకోబుకు ఏశావు దగ్గరకు వెళ్ళడం ఇష్టం లేకనే ఇలా నిరాకరించాడని, కావాలనే ఏశావుతో మందల గురించీ పిల్లల గురించీ సాకులు చెప్పాడని అభిప్రాయపడతారు. అలా అభిప్రాయపడడానికి కారణంగా ఈ క్రిందివచనాల్లో అతను ఏశావు నివసిస్తున్న శెయీరుకు వెళ్ళకుండా సుక్కోతుకు వెళ్ళినట్టు రాయబడినదానినీ దేవుడు అతనికి ప్రత్యక్షమైనప్పుడు కనానుకు వెళ్ళమని ఆజ్ఞాపించినదానినీ చూపిస్తారు. యాకోబు కనుక శేయీరుకు వెళ్తే దేవుని మాటకు విరుద్ధంగా పయనించినవాడు ఔతాడు అన్నదే వారికున్న ప్రధాన సమస్య.

అయితే నేను ఈ అభిప్రాయంతో ఏకీభవించడం లేదు. అదేనిజమైతే ఏశావు క్షమించాక కూడా యాకోబులో మార్పూ లేకుండా మరలా తన సహోదరుడికి అబద్ధం చెప్పి మోసగించాడని భావించవలసి ఉంటుంది. ఎందుకంటే అతను ఏశావుతో నేను శేయీరుకు వస్తానని మాటిచ్చాడు. ఏశావు ఆమాటను నమ్మి అక్కడి నుండి తన చోటికి వెళ్ళిపోయాడు. కాబట్టి యాకోబు తాను ఏశావుతో చెప్పినట్టు శేయీరుకు వెళ్ళి కొన్నిదినాలు తన సహోదరుడితో నివసించి ఆ తర్వాతే సుక్కోతుకు వచ్చాడు. అదంత ప్రాముఖ్యమైన విషయం కాదు కాబట్టి లేఖనంలో ప్రస్తావించబడలేదు. అలా యాకోబు శేయీరుకు వెళ్ళివస్తే దేవుని మాటకు విరుద్ధంగా ప్రవర్తించడం కూడా అవ్వదు. ఎందుకంటే అతను శేయీరులో శాశ్వతంగా ఉండిపోలేదు, అతిథిగా వెళ్ళి మరలా దేవుడు చెప్పినచోటికే వచ్చాడు. యాకోబు అలా చెయ్యడం దేవుని మాటకు విరుద్ధంగా ప్రవర్తించడమే ఐతే ఏశావుకు శెయీరుకు వస్తానని మాట ఇచ్చి వెళ్ళకుండా మోసగించడం ఆయన న్యాయానికి మరింత విరుద్ధంగా ప్రవర్తించడమే కదా! కాబట్టి యాకోబు శెయీరుకు వెళ్ళాడు. మరి తన మనుష్యులను యాకోబు దగ్గర ఉంచుతాను అన్నప్పుడు ఎందుకు నిరాకరించాడంటే యాకోబుకు ప్రస్తుతం వారి అవసరం లేదు, పైగా అతను ఇంకా ఏశావుకు రుణపడాలి అనుకోవడం లేదు.

ఆదికాండము 33:17 అప్పుడు యాకోబు సుక్కోతుకు ప్రయాణమై పోయి తనకొకయిల్లు కట్టించుకొని తన పశువులకు పాకలు వేయించెను. అందుచేత ఆ చోటికి సుక్కోతు అను పేరు పెట్టబడెను.

ఈ వచనంలో యాకోబు సుక్కోతుకు వెళ్ళి అక్కడ నివసిస్తున్నట్టు మనం చూస్తాం. ఈ వచన ప్రారంభంలో "అప్పుడు" అంటే యాకోబు ఏశావుకు మాట ఇచ్చినట్టుగా శేయీరుకు వెళ్ళి వచ్చిన తర్వాత అని మనం అర్థం చేసుకోవాలి. అదేవిధంగా ఇక్కడ సుక్కోతు అనే పేరు ఆ ప్రాంతానికి ఎలా వచ్చిందో గ్రంథకర్త వివరిస్తూ ప్రారంభంలో అదే పేరుతో దానిని ప్రస్తావించాడు. గ్రంథకర్తలు చరిత్రను రాస్తున్నప్పుడు అవి అప్పటికి ఏ పేర్లతో పిలవబడుతున్నాయో వాటినే సంబోధించినప్పటికీ వారు వివరిస్తున్న వ్యక్తుల సమయానికి మాత్రం ఆ ప్రాంతాలు వేరే పేర్లతో పిలవబడేవి. ఈ వివరణ చాలాసార్లే నేను ఇవ్వడం జరిగింది కాబట్టి విడిచిపెడుతున్నాను.

ఆదికాండము 33:18,19 అట్లు యాకోబు పద్దనరాములో నుండి వచ్చిన తరువాత కనాను దేశములోనున్న షెకెమను ఊరికి సురక్షితముగా వచ్చి ఆ ఊరిముందర తన గుడారములు వేసెను. మరియు అతడు తన గుడారములు వేసిన పొలము యొక్క భాగమును షెకెము తండ్రియైన హమోరు కుమారులయొద్ద నూరు వరహాలకు కొని-

ఈ వచనాలలో యాకోబు కనాను ప్రాంతానికి చేరుకుని అక్కడ ఒక స్థలాన్ని వెలపెట్టి కొనుక్కున్నట్టు మనం చూస్తాం. దేవుడు అబ్రాహాముతో చేసిన ప్రమాణం ప్రకారం కనాను దేశం వారి సంతానానికి స్వాస్థ్యంగా ఇవ్వబడుతుందే తప్ప అబ్రాహాము ఇస్సాకు యాకోబులు అందులో పరదేశులుగానే నివసించారు (అపొ. కార్యములు 7:5, హెబ్రీ 11:9).

కాబట్టి యాకోబు న్యాయబద్ధంగా అప్పటికి కనానులో ఎవరు నివసిస్తున్నారో వారిదగ్గర వెలపెట్టే ఆ భూమిని కొనుక్కోవాలి. గతంలో అతని తాతయైన అబ్రాహాము కూడా ఇదేవిధంగా చేసాడు (23వ అధ్యాయం). అయితే స్తెఫను ఇక్కడ యాకోబు ఎవరిదగ్గరైతే భూమిని కొన్నాడో ఆ హమోరు కుమారుల దగ్గర అబ్రాహాము కొన్నట్టు ప్రస్తావించాడు (అపొ.కా 7:16). స్తెఫను అలా పేర్లు మార్చి ఎందుకు ప్రస్తావించాడో ఇప్పటికే నేను వివరించాను (ఆదికాండము 23: 17-20 వ్యాఖ్యానం చూడండి).

ఆదికాండము 33:20 అక్కడ ఒక బలిపీఠము కట్టించి దానికి ఏల్‌ ఎలోహేయి ఇశ్రాయేలు అను పేరు పెట్టెను.

ఈ వచనంలో యాకోబు తాను కొనుక్కున్న భూమిలో ఒక బలిపీఠం కట్టి దానికి పేరుపెట్టడం మనం చూస్తాం. యాకోబుతో దేవుడు పెనుగులాడి అతనిని ఆశీర్వదించాక అతనిలో ఎంత గొప్ప మార్పు వచ్చిందో ఈ సందర్భం‌ మనకు రుజువుచేస్తుంది. గతంలో అతను దేవుణ్ణి అబ్రాహాము దేవుడు ఇస్సాకు దేవుడని సంబోధించేవాడు కానీ ఇక్కడ అతను ఆ బలిపీఠానికి పెట్టిన పేరుకు ఇశ్రాయేలు (నా) దేవుడు అని అర్థం వస్తుంది. దీనిప్రకారం; యాకోబు దేవుణ్ణి తన దేవుడని మనస్ఫూర్తిగా ఒప్పుకుంటున్నాడు. కాబట్టి దేవుని సంకల్పం చొప్పున రక్షించబడివారంతా యాకోబులా మార్చబడి దేవుణ్ణి హత్తుకుంటారు (జెకర్యా 2:11). అదేవిధంగా ప్రారంభం నుండీ మనిషికీ దేవునికీ మధ్యలో బలిపీఠం ఉన్నట్టు మనకు కనిపిస్తుంది. హేబెలు కానీ నోవహు కానీ అబ్రాహాము కానీ బలిపీఠంపై చిందించే రక్తం ద్వారానే దేవుణ్ణి సమీపించేవారు. ఇది యేసుక్రీస్తు బలియాగానికి ఛాయగా ఉంది, ప్రస్తుతం మనమంతా ఆయన బలియాగాన్ని బట్టే దైవసన్నిధిని సమీపిస్తున్నాం (హెబ్రీ 10:20).

Add comment

Security code
Refresh

 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.