నిజ క్రైస్తవ జీవితం

రచయిత: కె విద్యా సాగర్

ప్రభువైన యేసుక్రీస్తు తాను సిలువపై మరణించవలసిన సమయం ఆసన్నమైనప్పుడు "తండ్రీ యీ గిన్నె నా యొద్దనుండి నీ చిత్తమైతే తొలగించుము అయినను నా యిష్టముకాదు, నీ చిత్తమే సిద్ధించునుగాక" (లూకా 22:43) అని ప్రార్థించడం మనం చూస్తాం. తర్వాత మాటల్లో "ఆయన వేదనపడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట, నేల పడుచున్న గొప్ప రక్త బిందువులవలె ఆయెను" (లూకా 22:45) అని రాయబడింది.

ఆ సంఘటనను శాస్త్రీయంగా పరిశీలిస్తే మన శరీరం నుంచి చెమటను బయటకు పంపే శ్వేదగ్రంథులకు "Capillary blood vessels" అనేవి రక్తాన్ని ప్రసరింపచేస్తూ ఉంటాయి. ఒక మనిషి తీవ్రమైన లేక భరించలేని వేదనకు గురైనప్పుడు ఆ "Vessels" చెదరిపోయి శ్వేదగ్రంథుల నుండి చెమటతో పాటు రక్తం కూడా బయటకు వస్తుంది. దీనినే "Hematidrosis" అంటారు. యేసుక్రీస్తు విషయంలో అలా జరిగే "ఆయన చెమట, నేల పడుచున్న గొప్ప రక్త బిందువుల వలె" అయ్యింది.

అంతవేదనకు కారణం; ఆయన అనుభవించబోయే సిలువ శ్రమను (శారీరక బాధను) తలచుకోవడాన్ని బట్టేనని కొందరు అభిప్రాయపడతారు, కానీ అది వాస్తవం కాదు. ఎందుకంటే ఆయన తన మరణం గురించి అనేకసార్లు ప్రవచిస్తూ ఆ శ్రమకు సిద్ధపడే లోకానికి వచ్చినట్టు తెలియచేసాడు (హెబ్రీ 10:7, మార్కు 10:45). ఆ సిలువశ్రమకు అభ్యంతరం వ్యక్తం చేసిన పేతురును "సాతానా నా వెనుకకు పో" అంటూ గద్దించాడు (మత్తయి 16:21-24). ప్రాముఖ్యంగా "యిదిగో మీలో ప్రతివాడును ఎవని యింటికి వాడు చెదరిపోయి నన్ను ఒంటరిగా విడిచిపెట్టు గడియ వచ్చుచున్నది, వచ్చేయున్నది; అయితే తండ్రి నాతో ఉన్నాడు గనుక నేను ఒంటరిగా లేను" (యోహాను 16:32) అంటూ తాను‌ భరించవలసిన శారీరక శ్రమ, అవమానాల విషయంలో తండ్రిని బట్టి ధైర్యపరచుకున్నాడు. అలానే తనకు సంభవింపబోవునవన్నియు ఎరిగినవాడై తనను శ్రమపెట్టడానికి వచ్చిన సైనికులకు స్వచ్చందంగా లొంగిపోయాడు (యోహాను 18:4-8).

అలాంటప్పుడు "ఆయన తన చెమట, నేల పడుచున్న గొప్ప రక్త బిందువులవలె" అయ్యేంతగా వేదనపడింది సిలువపై భరించవలసిన శారీరక శ్రమను తలచుకునే అని భావించడం ఏవిధంగానూ సరి కాదు. మరి ఆయన అంతగా ఎందుకు వేదనపడ్డాడంటే తండ్రి నిర్ణయంలో ఉన్నవారి పాపాల నిమిత్తం ఆయన సిలువపై‌‌ మరణించేటప్పుడు శారీరకంగా బాధను అనుభవించడమే కాకుండా తండ్రితో యెడబాటుకు కూడా గురవ్వాలి. కారణం; మన పాపాలన్నీ ఆయనపై మోపబడి (యెషయా 53:6) పాపమెరుగని ఆయన పాపంగా చెయ్యబడ్డాడు (2 కొరింథీ 5:21) కాబట్టి ఆ సమయంలో పరిశుద్ధుడైన తండ్రితో యెడబాటుకు గురవ్వాలి. అలానే మన పాపాల‌కు శారీరక మరణమే (రోమా 1:32) కాకుండా పరిశుద్ధుడైన దేవునితో నిత్యం యెడబాటుకు గురయ్యే (నరకం) శిక్ష కూడా మనపై‌ విధించబడింది (ఎఫెసీ 2:3, 2 థెస్సలోనిక 1:10) కాబట్టి మన తరపున ఆయన ఆ యెడబాటును కూడా భరించాలి (నిత్యుడైన ఆయన కొంత సమయం పాటు ఆ యెడబాటుకు గురైనా మనం నిత్యం అనుభవించవలసిన ఆ శిక్షకు (నరకం) పరిహారం కాగలదు). సిలువపై అదే జరిగింది. ఆ యెడబాటును భరించలేకనే ఆయన "నా దేవా, నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివని" (మత్తయి 27:46) విలపించి మరణించాడు.

దీనినిబట్టి గెత్సెమనే తోటలో "ఆయన చెమట, నేల పడుచున్న గొప్ప రక్త బిందువులవలె" అయ్యేంతగా వేదనపడింది తండ్రితో తనకు కలగబోయే ఆ యెడబాటును తలుచుకునే అని గ్రహించగలం. ఆ యెడబాటును సహించలేకే ముందుగా ఆయన "తండ్రీ నీ చిత్తమైతే ఈ గిన్నెను నాయొద్దనుండి తొలగించమని" (లూకా 22:43) ప్రార్థించాడు. కానీ అది తండ్రి చిత్తం కాదని గ్రహించి "నీ చిత్తమే సిద్ధించునుగాక" అని అంగీకరించాడు.

యేసుక్రీస్తు తండ్రితో గురైన ఆ యెడబాటు వేదనకు మరో నిదర్శనం ఏంటంటే; మనిషి గుండెచుట్టూ నీటితో కూడిన "Pericardium" అనే పొర ఉంటుంది. సాధారణ మనిషికి అది 20 CC వరకూ ఉంటే ఆ మనిషి తీవ్రమైన వేదనకు గురైనప్పుడు 500 CC వరకూ పెరుగుతుంది. సిలువపై యేసుక్రీస్తు "నా దేవా, నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివని" (మత్తయి 27:46) విలపించి మరణించాక సైనికులలో ఒకడు ఆయన ప్రక్కలో ఈటెతో పొడిచినప్పుడు రక్తంతో పాటు నీరు కూడా కారడానికి (యోహాను 19:34) కారణం అదే. రోమా సైనికులు సిలువపై ఒక వ్యక్తి చనిపోయినప్పుడు అది నిర్థారించుకోవడానికి (కొన ఊపిరితో ఉంటే చంపడానికి) పొడవాటి బల్లెంతో ప్రక్కలో నుండి గుండెల్లోకి పొడుస్తారు. అలా పొడిచినప్పుడే ఆయనకు తండ్రితో యెడబాటు వల్ల కలిగిన వేదనను బట్టి గుండె చుట్టూ 500 CC వరకూ పెరిగిపోయిన "Pericardium" పొరలోని నీరు బయటకు కారింది.

గమనించండి; కుమారుడైన క్రీస్తుకు తండ్రితో యెడబాటు అనేది శరీరంలోని "Capillary blood vessels" చెదరిపోయి (Hematidrosis) చెమటతో పాటు రక్తం కూడా బయటకు వచ్చేంతగానూ ప్రక్కనుండి గుండెల్లోకి పొడిచినప్పుడు "Pericardium" పొర నుండి నీరు కూడా బయటకు కారేంతగానూ వేదనకు గురిచేస్తే దేవుని పిల్లలుగా తిరిగి జన్మించి ఆ క్రీస్తును ధరించుకున్న (గలతీ 3:27) అందరిలోనూ తండ్రితో యెడబాటు అంటే అలాంటి సహించలేని లక్షణమే ఉంటుంది/ఉండాలి కూడా.

"ఆయన యందు నిలిచియున్నవాడనని చెప్పుకొనువాడు ఆయన ఏలాగు నడుచుకొనెనో ఆలాగే తానును నడుచుకొన బద్ధుడైయున్నాడు. మనమాయనయందున్నామని దీనివలన తెలిసికొనుచున్నాము" (1యోహాను 2:6).

మరి మనలో ఆ లక్షణం ఉందా? ఔను అనంటే మనం పాపంవైపు మొగ్గుచూపే ప్రతీసారీ తండ్రితో యెడబాటుకే గురౌతున్నామని గుర్తుంచుకోండి. మన పాపాలు మోపబడినందుకే పాపం చెయ్యని క్రీస్తు ఆ యెడబాటుకు గురైనప్పుడు మన స్వంతపాపాలను బట్టి ఆయనతో మరింతగా యెడబాటుకు గురౌతాము కదా!. అందుకే భక్తుడైన దావీదు తాను పాపం‌‌‌ చేసినప్పుడు "నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము" (కీర్తనలు 51:11) అని రోధించాడు. కాబట్టి తండ్రితో యెడబాటు కలిగించే పాపాన్ని అసహ్యించుకుంటూ లేదా తండ్రితో క్రీస్తుకు యెడబాటు కలిగించి ఆయనను అంతగా వేదనపెట్టిన పాపాన్ని సంపూర్ణంగా ద్వేషిస్తూ అందులో మరలా చిక్కుకోకుండా ఉండేవారే దేవుని కుమారుడైన క్రీస్తురక్తంలో కడగబడిన నిజమైన దేవుని కుమారుడు/కుమార్తె.

అయితే ఒకటి; మనం ఈ భూమిపై ఉన్నంతకాలం పాపస్వభావంతోనే అనగా పాపానికి మొగ్గుచూపే శరీరం/స్వభావంతోనే ఉంటాం (రోమా 7:23) కాబట్టి కొన్నిసార్లు మనం తప్పిపోతుంటాం. అందుకే క్రీస్తు ప్రియ శిష్యుడైన యోహాను "మనము పాపము లేని వారమని చెప్పుకొనిన యెడల, మనలను మనమే మోసపుచ్చుకొందుము, మరియు మనలో సత్యముండదు" (1యోహాను 1:8), "మనము పాపము చేయలేదని చెప్పుకొనినయెడల, ఆయనను అబద్ధికునిగా చేయువారమగుదుము, మరియు ఆయన వాక్యము మనలో ఉండదు" (1 యోహాను 1:10) అని అంటున్నాడు. కానీ తండ్రితో యెడబాటుకు గురిచేసే ఆ పాపంలో అలవాటుగా అనగా ఏమీ కాదులే అన్నట్టూ ఆయన క్షమించేస్తాడులే అన్నట్టూ చిక్కుకుంటున్నామా లేక నిజాయితీగా దానితో పోరాడుతూ ఒకోసారి ఓడిపోతున్నామా అనేది పరిశీలించుకోవలసిన విషయం. నిజాయితీగా పోరాడే ఓడిపోతే "మన పాపములను మనము ఒప్పుకొనిన యెడల, ఆయన నమ్మదగినవాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతినుండి మనలను పవిత్రులనుగా చేయును" (1యోహాను 1:9) అని రాయబడింది కాబట్టి యథార్థమైన పశ్చాత్తాపపు వేదనతో ఒప్పుకుంటే జయించే సహాయాన్ని కోరుకుంటే తండ్రితో‌‌ కలిగే యెడబాటు నుండి విడిపించబడినట్టే.

పాపంతో నిజాయితీగా పోరాడడం అనేదానికి కూడా స్పష్టత ఇవ్వదలిచాను "మీరు పాపముతో పోరాడుటలో రక్తము కారునంతగా ఇంక దానిని ఎదిరింపలేదు" (హెబ్రీ 12:4) అని చదువుతున్నాం. అంటే పాపంతో మనం రక్తం కారేంతగా అనగా యుద్ధంలో ఒక సైనికుడు తన శరీరానికి గాయలయ్యి రక్తం కారుతున్నప్పటికీ శత్రువుతో ఎలా పోరాడతాడో అలా పోరాడాలి. అలా పోరాడి కూడా ఏదైనా పాపం విషయంలో ఓడిపోతే పైన చెప్పినట్టు "మన పాపములను మనము ఒప్పుకొనిన యెడల, ఆయన నమ్మదగినవాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతినుండి మనలను పవిత్రులనుగా చేయును" అనే ఓదార్పు మనకు ఉంది. మళ్ళీ చెబుతున్నాను; అలవాటుగానూ ఏమీ కాదు ఆయన క్షమించేస్తాడులే అన్నట్టుగానూ పాపంలో చిక్కుకునేవారికి ఆ మాటలు వర్తించవు. వారికి తండ్రితో యెడబాటు అంటే ఎలాంటి వేదనా లేదు. పాపపు‌ ఒప్పుకోలులో యథార్థమైన పశ్చాత్తాపపు వేదన కూడా లేదు. ఎందుకంటే వారు క్రీస్తు రక్తంలో కడగబడిన దేవుని పిల్లలు కాదు.

నిజమైన దేవునిపిల్లలు దేవునితో యెడబాటు అంటే క్రీస్తులా వేదనకు గురౌతారు. ఆ యెడబాటుకు గురిచేసే పాపంతో రక్తం కారేంతగా పోరాడతారు. ఓడిపోతే "పశ్చాత్తాపపు వేదనతో" వారి పాపాన్ని కీర్తనాకారుడిలా  ఒప్పుకుని (కీర్తనలు 51), పేతురులా సంతాపపడి ఏడ్చి (మత్తయి 26:75), ఆపై మరింత జాగ్రత్తగా మసలుకుంటారు (1 యోహాను 2:6, 1 కొరింథీ 10:12). ప్రాముఖ్యంగా క్రీస్తుకు తండ్రితో యెడబాటు కలిగేలా చేసి ఆయన అంతగా వేదనపడేలా చేసిన పాపాన్ని సంపూర్ణంగా ద్వేషిస్తారు (కీర్తనలు 139:21,22).

2 తిమోతికి 2:19 ప్రభువు తనవారిని ఎరుగును, ప్రభువు నామమును ఒప్పుకొను ప్రతివాడును దుర్నీతి నుండి తొలగిపోవలెను.

దేవునితో యెడబాటుకు గురిచేసే ఒక పాపం‌ విషయంలో అప్రమత్తంగా ఉండడానికి ఈ వ్యాసం చదవండి.

సినిమాలు-క్రైస్తవులు

ఇంతకూ దేవునిపై మనకున్న ప్రేమ నిజమైనదో కాదో పరీక్షించుకోవడానికి ఈ వ్యాసం చదవండి.

దేవునిపై నీ ప్రేమ వాస్తవమా లేక భ్రమా?

Add comment

Security code
Refresh

 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.