పాత నిబంధన

రచయిత: కె విద్యా సాగర్

25:1-5, 25:6, 25:7-10, 25:11, 25:12-18, 25:19-21, 25:22, 25:23, 25:24-26, 25:27,28, 25:29-34

ఆదికాండము 25:1 అబ్రాహాము మరల ఒక స్త్రీని వివాహము చేసికొనెను, ఆమె పేరు కెతూరా.

ఈ వచనంలో అబ్రాహాము కెతురా అనే స్త్రీని వివాహం చేసుకున్నట్టు మనం చూస్తాం. ఇక ఈ "కెతురా" విషయంలో బైబిల్ పండితులు రెండు రకాలైన అభిప్రాయాలను వెళ్ళబుచ్చారు. మొదటిది; ఈమె హాగరే. అబ్రాహాము ఆమెను ఇంటినుండి పంపివేసాక కూడా ఆమె మరొక పురుషుణ్ణి చేరకుండా నిజాయితీగా ఉండబట్టి ఆమెకు ఆ పేరు పెట్టబడిందంట. శారా చనిపోయాక అబ్రాహాము ఆమెనే మరలా వివాహం చేసుకున్నాడంట.

కానీ ఈ అభిప్రాయం నమ్మశక్యంగా లేదు. ఒకవేళ హాగరే కెతూరా ఐతే వీరి ద్వారా అబ్రాహాముకు పుట్టినపిల్లల గురించి ఇక్కడ వేరుగా ఎందుకు రాయబడింది? కెతూరా పిల్లల గురించి క్రింద వచనాల్లోనూ హాగరుకు జన్మించిన ఇష్మాయేలు గురించి 12వ వచనంలోనూ విడివిడిగా రాయబడింది. 1 దినవృత్తాంతములు 1:32లో కూడా ఈ కెతురా సంతతి గురించి వేరుగా ఆ తర్వాత వచనాల్లో ఇస్సాకు, ఇష్మాయేలుల గురించి వేరుగా రాయబడింది.

రెండవది; అబ్రాహాము శారా బ్రతికుండగానే ఈ కెతురా అనే స్త్రీని వివాహం చేసుకున్నాడంట. ఎందుకంటే నూరేళ్ళ వయస్సులోనే తనకిక పిల్లలు పుట్టరని ఆందోళన పడ్డ అబ్రాహాము (ఆదికాండము 17:17) శారా చనిపోయాక మళ్ళీ వివాహం చేసుకుని పిల్లల్ని కనడం అసాధ్యమనేది ఈ అభిప్రాయానికి కారణం. ఎందుకంటే శారా 127 యేట చనిపోయింది (ఆదికాండము 23:1). ఆమెకూ అబ్రాహాముకూ 10 సంవత్సరాల వ్యత్యాసం ఉంది (ఆదికాండము 17:17) అంటే ఆమె చనిపోయేసరికే అబ్రాహాము వయస్సు 137 సంవత్సరాలు. అయితే అబ్రాహాము జీవితం వరుస క్రమంలో రాయబడింది‌. ఆ క్రమంలోనే "అబ్రహాము మరలా ఒక స్త్రీని వివాహం చేసుకొనెను". అనే మాటలు కనిపిస్తున్నాయి‌. దీనిప్రకారం శారా చనిపోయాకే అబ్రాహాము కెతూరాను వివాహం చేసుకున్నాడు.

గమనించండి; గతంలో శారా తనకు పిల్లలు పుట్టరనే కారణంతో అతనికి హాగరును భార్యగా ఇచ్చి చాలా ఇబ్బందులు ఎదుర్కొంది. ఆ విషయంలో అబ్రాహాము కూడా ఇబ్బందికి లోనయ్యాడు (ఆదికాండము 16). చివరికి అతను ఎంతో బాధతో హాగరునూ ఆమె కుమారుణ్ణి ఇంటి నుండి పంపివెయ్యవలసి వచ్చింది. ఇదంతా జరిగి పైగా శారాకు కుమారుడు కూడా జన్మించాక అబ్రాహాము మరో వివాహం ఎందుకు చేసుకుంటాడు? దానికి శారా ఎలా అంగీకరించింది?. కాబట్టి ఈ అభిప్రాయం కూడా సరైనది కాదు. అలానే ఇది నమ్ముతున్నవారు దానికి కారణంగా చూపిస్తున్న అభ్యంతరానికి సమాధానం కష్టమేమీ కాదు. అతను దేవుని అద్భుతం కారణంగా నూరేళ్ళ వయస్సులో ఇస్సాకును కన్నట్టే శారా చనిపోయాక కూడా కెతురా ద్వారా పిల్లల్ని కన్నాడు. అయితే వారిలో ఇస్సాకు మాత్రమే వాగ్దాన పుత్రుడు. పితరుల జీవితం అడుగడుగునా దేవుని అద్భుతాలతో నిండికునియుందని మనం మర్చిపోకూడదు.

ఆదికాండము 25:2-5 ఆమె అతనికి జిమ్రాను, యొక్షాను, మెదాను, మిద్యాను, ఇష్బాకు, షూవహు అనువారిని కనెను. యొక్షాను షేబను దెదానును కనెను. అష్షూరీయులు లెతూషీయులు లెయుమీయులు అనువారు ఆ దెదాను సంతతివారు. ఏయిఫా ఏఫెరు హనోకు అబీదా ఎల్దాయా అనువారు ఆ మిద్యాను సంతతివారు. వీరందరు కెతూరా సంతతివారు. అబ్రాహాము తనకు కలిగినది యావత్తు ఇస్సాకు కిచ్చెను.

ఈ వచనాలలో కెతూరాకు అబ్రాహాముకూ జన్మించిన సంతానం గురించి మనం చూస్తాం. అయితే ఇస్సాకు దేవుని వాగ్దానపుత్రుడు కాబట్టి "అబ్రాహాము తనకు కలిగినది యావత్తు ఇస్సాకు కిచ్చెను". మిగిలినవారికి ఏం చేసాడో క్రింది వచనాల్లో రాయబడింది.

ఆదికాండము 25:6 అబ్రాహాము తన ఉపపత్నుల కుమారులకు బహుమానములిచ్చి, తాను సజీవుడైయుండగానే తన కుమారుడగు ఇస్సాకు నొద్దనుండి తూర్పుతట్టుగా తూర్పు దేశమునకు వారిని పంపివేసెను.

ఈ వచనంలో అబ్రాహాము "తన ఉపపత్నుల కుమారులకు బహుమానములిచ్చి" కనాను నుండి పంపివేసినట్టు మనం చూస్తాం. బహుమానాలు అంటే వారు స్థిరపడడానికి అవసరమైందంతా ఇచ్చాడని అర్థం చేసుకోవాలి. దేవుని పిలుపు మేరకు వాగ్దానపుత్రుడైన ఇస్సాకు మాత్రమే ఆ భూమి (కనాను) కి హక్కుదారుడు కాబట్టి అక్కడ మాత్రం వారిని ఉండనివ్వలేదు. ఇక్కడ అబ్రాహాము చేసిన పనిని బట్టి‌ విశ్వాసులు రెండు విషయాలను అలవర్చుకోవాలి.

1. అబ్రాహాము బ్రతికుండగా పిల్లల కోసం నిజాయితీగా ఆస్తిని సంపాదించాడు. ఎందుకంటే పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని వారి కోసం సంపాదించడం తల్లితండ్రుల బాధ్యత‌ (2 కోరింథీ 12:14). ఏ తండ్రైనా సోమరిగా మారి తన కుటుంబానికి అవసరమైనవి చేకూర్చకుంటే అతను అవిశ్వాసికంటే చెడ్డవాడని వాక్యం చెబుతుంది (1 తిమోతికి 5:8).

2. అబ్రాహాము బ్రతికుండగానే తన ఆస్తిలో భాగాలను వారికి పంచిపెట్టాడు. అతను చనిపోయాక వారి మధ్యలో తగాదాలు రాకూడదనే జ్ఞానయుక్తంగా బాధ్యతగా ఇలా చేసాడు. కాబట్టి తల్లితండ్రులు బ్రతికున్నప్పుడే కాదు చనిపోయాక కూడా తమ పిల్లల మధ్య ఆస్తి విషయమైన సమస్యలు తలెత్తకుండా జాగ్రతలు తీసుకోవాలి. ఈరోజు చాలా కుటుంబాల్లో ఆ సమస్యలేగా చూస్తున్నాం. విశ్వాసులు ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలి.

అదేవిధంగా ఇక్కడ హాగరు, కెతురాలు అబ్రాహాము ఉపపత్నులని రాయబడింది. 1 దినవృత్తాంతములు 1:32లో కూడా కెతూరా ఉపపత్ని అని రాయబడింది. ఈ అధ్యాయ ప్రారంభ వచనంలో మాత్రం అబ్రాహాము కెతూరాను వివాహం చేసుకున్నాడని, అదేవిధంగా‌ 16వ అధ్యాయం ప్రకారం; శారా హాగరును అతనికి‌ భార్యగా ఇచ్చిందని రాయబడింది. దీనివల్ల హాగరు, కెతూరాలు అబ్రాహాము భార్యలా లేక ఉపపత్నులా అనే సందేహం కొందరికి కలగొచ్చు. అయితే అబ్రాహాముకు చాలామంది పిల్లలు పుట్టి‌నప్పటికీ వారిలో ఇస్సాకు మాత్రమే ఎలా వాగ్దానపుత్రునిగా గుర్తించబడ్డాడో అలానే హాగరు, కెతూరాలు అబ్రాహాము భార్యలే అయినప్పటికీ గ్రంథకర్తలు వాగ్దానపుత్రుడైన ఇస్సాకును కన్నటువంటి శారాకు ప్రాముఖ్యతను ఇస్తూ మిగిలిన ఇద్దరినీ ఉపపత్నులని పేర్కొన్నారు.

ఆదికాండము 25:7-10 అబ్రాహాము బ్రదికిన సంవత్సరములు నూట డెబ్బదియైదు. అబ్రాహాము నిండు వృద్ధాప్యమునకు వచ్చినవాడై మంచి ముసలితనమున ప్రాణము విడిచి మృతి బొంది తన పితరుల యొద్దకు చేర్చబడెను. హిత్తీయుడైన సోహరు కుమారుడగు ఎఫ్రోను పొలమందలి మక్పేలా గుహలో అతని కుమారులగు ఇస్సాకును ఇష్మాయేలును అతనిని పాతిపెట్టిరి; అది మమ్రే యెదుటనున్నది. అబ్రాహాము హేతు కుమారులయొద్ద కొనిన పొలములోనే అబ్రాహామును అతని భార్యయైన శారాయును పాతి పెట్టబడిరి.

ఈ వచనంలో అబ్రాహాము 175 సంవత్సరాలు బ్రతికి మరణించినట్టు మనం చూస్తాం. బైబిల్ గ్రంథంలో కొన్నిసార్లు మరణం గురించి తెలియచేసేటప్పుడు "ప్రాణము విడిచి మృతి బొంది తన పితరుల యొద్దకు చేర్చబడెను" అనే పదప్రయోగం చెయ్యబడింది. అదేవిధంగా ఇక్కడ అబ్రాహాము ఎఫ్రోను దగ్గర కొన్నటువంటి పొలం గురించి ప్రస్తావించబడి అతన్ని అక్కడ సమాధి చేసినట్టు రాయబడింది. క్రింది వచనంలో అది హేతు కుమారుల దగ్గర కొన్నట్టు కూడా రాయబడింది. వాస్తవానికి అబ్రాహాము ఆ పొలాన్ని ఎఫ్రోను దగ్గరే కొన్నప్పటికీ దానికి సాక్షులుగా హేతుకుమారులు‌ ఉండి, వారిచేతుల మీదుగా అబ్రాహాముకు అది స్థిరపరచబడినందున వారి గురించి కూడా ప్రస్తావించబడింది (అదికాండము 23: 17-20 వ్యాఖ్యానం చూడండి).

ఆదికాండము 25:11 అబ్రాహాము మృతిబొందిన తరువాత దేవుడు అతని కుమారుడగు ఇస్సాకును ఆశీర్వదించెను. అప్పుడు ఇస్సాకు బేయేర్‌ లహాయిరోయి దగ్గర కాపురముండెను.

ఈ వచనంలో అబ్రాహాము చనిపోయాక దేవుడు ఇస్సాకును ఆశీర్వదించినట్టు మనం చూస్తాం. తర్వాత యాకోబు కూడా ఈ ఆశీర్వాదానికి వారసుడయ్యాడు. ఇదంతా అబ్రాహామును దేవుడు పిలచిన పిలుపు మేరకే జరుగుతుంది. ఇస్సాకు ఇప్పడు హాగరుతో యెహోవా దూత మాట్లాడిన ప్రదేశంలో కాపురముంటున్నాడు (అదికాండము 16:14).

ఆదికాండము 25:12-18 ఐగుప్తీయురాలును శారా దాసియునైన హాగరు అబ్రాహామునకు కనిన అబ్రాహాము కుమారుడగు ఇష్మాయేలు వంశావళి యిదే. ఇష్మాయేలు జ్యేష్ఠకుమారుడైన నేబాయోతు కేదారు అద్బయేలు మిబ్శాము మిష్మా దూమానమశ్శా హదరు తేమా యెతూరు నాపీషు కెదెమా ఇవి వారి వారి వంశావళుల ప్రకారము వారి వారి పేరుల చొప్పున ఇష్మాయేలు కుమారులయొక్క పేరులు వారి వారి గ్రామములలోను వారి వారి కోటలలోను ఇష్మాయేలు కుమారులు వీరే, వారి పేరులు ఇవే, వారివారి జనముల ప్రకారము వారు పండ్రెండుగురు రాజులు. ఇష్మాయేలు బ్రదికిన సంవత్సరములు నూట ముప్పది యేడు. అప్పుడతడు ప్రాణమువిడిచి మృతిబొంది తన పితరుల యొద్దకు చేర్చబడెను. వారు అష్షూరునకు వెళ్లు మార్గమున హవీలా మొదలుకొని ఐగుప్తు ఎదుటనున్న షూరువరకు నివసించువారు అతడు తన సహోదరులందరి యెదుట నివాసమేర్పరచుకొనెను.

ఈ వచనాలలో దేవుడు అబ్రహాముకు ప్రమాణం చేసినట్టుగా (ఆదికాండము 17:20) ఆయన ఇష్మాయేలును ఆశీర్వదించి, అతని నుండి 12మంది రాజులను జన్మింపచేసినట్టు మనం చూస్తాం. ఈ చరిత్ర అంతా మోషేకు ఆయన తెలియచేసి ఇక్కడ క్రమబద్ధంగా రాయించాడు.

ఆదికాండము 25:19-21 అబ్రాహాము కుమారుడగు ఇస్సాకు వంశావళియిదే. అబ్రాహాము ఇస్సాకును కనెను. ఇస్సాకు పద్దనరాములో నివసించు సిరియావాడైన బెతూయేలు కుమార్తెయును సిరియావాడైన లాబాను సహోదరి యునైన రిబ్కాను పెండ్లి చేసికొన్నప్పుడు నలుబది సంవత్సరములవాడు. ఇస్సాకు భార్య గొడ్రాలు గనుక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను. యెహోవా అతని ప్రార్థన వినెను గనుక అతని భార్యయైన రిబ్కా గర్భవతి ఆయెను.

ఈ వచనాలలో ప్రాముఖ్యంగా రిబ్కా గొడ్రాలుగా ఉన్నప్పుడు ఇస్సాకు ఆ విషయంలో ప్రార్థన చేసినట్టు ఆయన ఇస్సాకు మనవి ఆలకించి రిబ్కా గర్భాన్ని తెరిచినట్టు మనం చూస్తాం. దేవుడు తన భక్తుల ప్రార్థనను సాధనంగా వాడుకుని తన చిత్తాన్ని నెరవేర్చుకుంటాడు అనేందుకు ఇదో మంచి ఉదాహరణ. ఎందుకంటే; ఆయన అబ్రాహాముతో నీ సంతానాన్ని ఆకాశనక్షత్రాలవలే విస్తరింపచేస్తానని, ఆ సంతానం ఇస్సాకు మూలంగా కలుగుతుందని ముందే ప్రకటించాడు. అనగా దానిని ఆయన తన చిత్తప్రకారం ముందుగా‌నే నిర్ణయించాడు.

అయితే ఇస్సాకు భార్య గొడ్రాలుగా ఉంది. ఈ క్రమంలో ఆయన ఇస్సాకు ప్రార్థనను సాధనంగా వాడుకుని ఆమె గర్భాన్ని తెరచి తన నిర్ణయాన్ని నెరవేర్చుకున్నాడు. అదేవిధంగా ఆయన అబ్రాహాముతో నీ సంతానాన్ని విస్తరింపచేస్తానని మోరియా పర్వతంపై చెప్పినప్పుడు (ఆదికాండము 22:16,17 ) అక్కడ ఇస్సాకు కూడా ఉండి ఆ మాటలు విన్నాడు. కాబట్టి అతని సంతానం గొప్పగా విస్తరిస్తుందని ఇస్సాకుకు బాగా తెలుసు. అయినప్పటికీ తన భార్య గొడ్రాలుగా ఉండేసరికి ప్రార్థన చెయ్యడం ప్రారంభించాడు. ఆయన వాగ్దానం చేసాడు కాబట్టి ఎలాగైనా గర్భవతి ఔతుందిలే అని బాధ్యతారహితంగా ఉండలేదు. దీనిప్రకారం; దేవుడు ముందే వాగ్దానం చేసినప్పటికీ మనిషి తన బాధ్యతగా ఆ వాగ్దాన నెరవేర్పు కొరకు ప్రార్థించాలి. ఈవిధంగా మనమంతా దేవుని వాక్యంలో బయలుపరచబడిన ఆయన చిత్తనెరవేర్పుకై ప్రార్థనచెయ్యాలి.

ఆదికాండము 25:22 ఆమె గర్భములో శిశువులు ఒకనితోనొకడు పెనుగులాడిరి గనుక ఆమె ఈలాగైతే నేను బ్రదుకుట యెందుకని అనుకొని యీ విషయమై యెహోవాను అడుగవెళ్లెను.

ఈ వచనంలో రిబ్కా తన గర్భంలోని శిశువులు పెనుగులాడడం గమనించి దేవునియొద్ద విచారణ చెయ్యడానికి వెళ్ళడం మనం చూస్తాం. సాధారణంగా స్త్రీలకు గర్భవతులుగా ఉన్నప్పుడు శిశువు యొక్క కదలికలు తెలుస్తుంటాయి. ఆ విషయంలో రిబ్కా అప్పటికే‌ పిల్లలను కన్న స్త్రీలను వాకబు చెయ్యడం ద్వారా ఆమె గర్భంలో శిశువులు ఇతరులవలే కాకుండా అసాధారణంగా పెనుగులాడుతున్నట్టు గ్రహించింది. అందుకే తనకు మాత్రమే ఇలా ఎందుకు ఔతుందనే వేదనతో దేవుణ్ణి ఆశ్రయించింది.

తెలుగు బైబిల్ లో ఆ మాటలు "ఇలా అయితే నేను బ్రతకడం యెందుకని" తర్జుమా చేసినప్పటికీ ఇంగ్లీష్ బైబిల్ KJV లో ఆ మాటను పరిశీలిస్తే "ఇలా నాకే యెందుకు ఔతుందనే" అర్థంతో తర్జుమా చెయ్యబడ్డాయి.

Genesis 25:22 And the children struggled together within her; and she said, If it be so, why am I thus? And she went to enquire of the LORD.

అదేవిధంగా ఈ సందర్భంలో రిబ్కా తన గర్భంలో శిశువులు అసాధారణంగా పెనుగులాడడం గ్రహించి దాని విషయమై దేవుని దగ్గర విచారణ చెయ్యడానికి వెళ్ళిన సందర్భాన్ని కొందరు అపార్థం చేసుకుని ఆమె దేవునితో ముఖాముఖిగా ఆ విషయం మాట్లాడిందని భావిస్తుంటారు. కానీ ఇక్కడ మనం ఆ విధంగా భావించకూడదు, అదే నిజమైతే ఆమె మరోచోటికి వెళ్ళడమెందుకు? ఆమె ఉన్న చోటనే మాట్లాడితే దేవుడు ప్రత్యుత్తరమియ్యడా? ఆ కాలంలో ఒక వ్యక్తి దేవుని నుండి ఏదైనా తెలుసుకోవాలి అనుకున్నప్పుడు ప్రవక్త దగ్గరకు కానీ యాజకుడి దగ్గరకు కానీ వెళ్ళి విషయం తెలియచెయ్యడం, దేవుడు ఆ ప్రవక్త/యాజకుడి ద్వారా ప్రత్యుత్తరమియ్యడం అనేక సందర్భాలలో కనిపిస్తుంది (1 సమూయేలు 30:7,8, 2 రాజులు 3:11-13).

ఈ విధంగా మనం ఆలోచించినప్పుడు రిబ్కా దేవునితో ముఖాముఖిగా మాట్లాడలేదని ఆ విషయం వేరొకరి ద్వారా విచారణ చెయ్యడానికే వెళ్ళిందని అర్థమౌతుంది. అయితే ఆ విషయం తెలుసుకునేందుకు ఆమె ఎవరి దగ్గరకు వెళ్ళుంటుందనే ప్రశ్న ఇక్కడ వస్తుంది. కొందరు బైబిల్ పండితులు ఆమె యాజకుడైన మెల్కీసెదెకు దగ్గరకు వెళ్ళిందని చెబుతుంటారు కానీ ఆమెకు అంత అవసరం లేదు. ఎందుకంటే ఆమె మామగారైన అబ్రాహాము దేవుని స్నేహితుడిగా పేరొందినవాడు. గతంలో ఎన్నోసార్లు ఆయన అతనితో మాట్లాడి తన ఇంట భోజనం చేసిన సంఘటన కూడా మనం చూసాం. దేవుడు సొదొమ పట్టణాలను నాశనం చెయ్యబోయేటప్పుడు కూడా ఆయన నేను చెయ్యబోయే కార్యాన్ని అబ్రాహాముకు దాచనని చెప్పడం మనకు కనిపిస్తుంది (ఆదికాండము‌ 18:17). ఆ పట్టణాల నాశనం గురించే ఆయన అబ్రాహాముకు దాచనప్పుడు తన కుటుంబంలో జరిగే కార్యం ఎందుకు దాస్తాడు? దీనిప్రకారం రిబ్కా తన గర్భంలోని పెనుగులాట గురించి దేవునియొద్ద విచారణ చెయ్యడానికి అబ్రాహాము దగ్గరకే వెళ్ళుంటుందని మనం భావించవచ్చు. అప్పటికి అబ్రాహాము బ్రతికేయున్నాడు, అది క్రింది వచనాల్లో వివరిస్తాను.

ఆదికాండము 25:23 అప్పుడు యెహోవా ఆమెతో నిట్లనెను రెండు జనములు నీ గర్భములో కలవు. రెండు జనపదములు నీ కడుపులోనుండి ప్రత్యేకముగా వచ్చును. ఒక జనపదముకంటె ఒక జనపదము బలిష్టమై యుండును. పెద్దవాడు చిన్నవానికి దాసుడగును అనెను.

ఈ వచనంలో దేవుడు రిబ్కాకు పుట్టబోయే పిల్లల భవిష్యత్తు తెలియచేస్తున్నట్టు మనం చూస్తాం. మానవుల విషయంలో దేవునికి ‌ముందస్తు ఏర్పాటు ఉంటుందని ఈ సందర్భం మనకు స్పష్టంగా తెలియచేస్తుంది. ఆ ఏర్పాటు ప్రకారమే యాకోబు సంతానం ఏశావు సంతానం కంటే ఉన్నతమైన జనమై, దేవుని ప్రజలుగా (ఇశ్రాయేలీయులు) పేరుపొందారు. దీని గురించి పౌలు మాటలు పరిశీలించండి.

రోమీయులకు 9:10-16 అంతేకాదు, రిబ్కా మన తండ్రియైన ఇస్సాకు అను ఒకనివలన గర్భవతియైనప్పుడు, ఏర్పాటును అనుసరించిన దేవుని సంకల్పము, క్రియల మూలముగా కాక పిలుచు వాని మూలముగానే నిలుకడగా ఉండు నిమిత్తము, పిల్లలింక పుట్టి మేలైనను కీడైనను చేయక ముందేపెద్దవాడు చిన్నవానికి దాసుడగును అని ఆమెతో చెప్పబడెను. ఇందునుగూర్చి నేను యాకోబును ప్రేమించితిని, ఏశావును ద్వేషించితిని అని వ్రాయబడి యున్నది. కాబట్టి యేమందుము? దేవునియందు అన్యాయము కలదా? అట్లనరాదు. అందుకు మోషేతో ఈలాగు చెప్పుచున్నాడు ఎవనిని కరుణింతునో వానిని కరుణింతును. ఎవనియెడల జాలి చూపుదునో వానియెడల జాలి చూపుదును. కాగా పొందగోరువానివలననైనను, ప్రయాసపడువాని (మూలభాషలో-పరుగెత్తువాని) వలననైనను కాదు గాని,కరుణించు దేవునివలననే అగును.

గమనించండి; యాకోబు మంచివాడు కాబట్టి దేవుడు అతన్ని ఎన్నుకోలేదు. ఏశావు చెడ్డవాడు కాబట్టి అతన్ని తృణీకరించనూ లేదు. నిజానికి ఇద్దరూ చెడ్డవారే దేవుని ద్వేషానికి పాత్రులే. వారి ప్రారంభచరిత్రను పరిశీలించినప్పుడు ఆ విషయం మనకు సులభంగానే అర్థమైపోతుంది. కానీ దేవుడు తన చిత్తప్రకారం యాకోబును ఎన్నుకున్నాడు (ప్రేమించాడు) ఏశావును ద్వేషించాడు (అతను పాత్రుడైన ఆ ద్వేషానికి విడిచిపెట్టేసాడు). ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ఆయన యాకోబును ఎన్నుకున్నాడు కాబట్టే యాకోబు భక్తుడిగా మారాడు. ఏశావును తాను పాత్రుడైన ద్వేషానికి వదిలేసాడు కాబట్టే అతను అలా జీవించలేకపోయాడు. ఇందులో అన్యాయమని దేవునిపై ఆరోపించడానికి ఏమీ లేదు. ఉగ్రతపాత్రులైన మనుషుల్లో ఎవర్ని ఎన్నుకోవాలో ఎవర్ని ఆ ఉగ్రతకే విడిచిపెట్టాలో పూర్తిగా ఆయన చిత్తం. ఆయన ఎవరికీ రుణపడి లేడు. ప్రాముఖ్యంగా ఆయన మంచివాడైన ఏశావును బ్రష్టుడిగా మార్చలేదు.

"అందుకు మోషేతో ఈలాగు చెప్పుచున్నాడు ఎవనిని కరుణింతునో వానిని కరుణింతును. ఎవనియెడల జాలి చూపుదునో వానియెడల జాలి చూపుదును"

ఆదికాండము 25:24-26 ఆమె ప్రసూతి కావలసిన దినములు నిండినప్పుడు ఆమె గర్భమందు కవలవారు ఉండిరి. మొదటివాడు ఎఱ్ఱనివాడుగా బయటికివచ్చెను. అతని ఒళ్లంతయు రోమ వస్త్రమువలె నుండెను గనుక అతనికి ఏశావు అను పేరు పెట్టిరి. తరువాత అతని సహోదరుడు బయటికి వచ్చి నప్పుడు అతని చెయ్యి ఏశావు మడిమెను పట్టుకొని యుండెను గనుక అతనికి యాకోబు అను పేరు పెట్టబడెను. ఆమె వారిని కనినప్పుడు ఇస్సాకు అరువదియేండ్లవాడు.

ఈ వచనాలలో రిబ్కాకు ఇద్దరు కుమారులు జన్మించినట్టు, అందులో ఒక కుమారుడి చెయ్యి మరొక కుమారుడి మడిమెను పట్టుకుని ఉన్నట్టు మనం చూస్తాం. నిజానికి అప్పుడే పుడుతున్న పిల్లాడు దేనినీ గట్టిగా పట్టుకోలేడు, కానీ యాకోబు మాత్రం తన సోదరుని మడిమను పట్టుకున్నట్టు ఇక్కడ మరియు, హోషెయ 12:3లో కూడా రాయబడింది. ఇదెలా సాధ్యమౌతుందనే ప్రశ్న కొందరికి తలెత్తే అవకాశం ఉంది. దీని సమాధానానికై మనం ప్రాచీన యూదుల నానుడులను తెలుసుకోవాలి. సాధారణంగా కవలపిల్లలు జన్మించేటప్పుడు, ఇద్దరి మధ్యా కనీసం 2-5 నిమిషాల‌ వ్యవథి ఉంటుంది. అలా కాకుండా ఇద్దరూ అంటుకుని ఉన్నట్టుగా వెంటనే జన్మించడం చాలా అరుదుగా జరుగుతుంది.

ఆవిధంగా జన్మించేవారి గురించి హెబ్రీయులు మడిమెను పట్టుకున్నవాడనే నానుడి వాడతారు. ఇక్కడ మోషే అదే నానుడిని ఉపయోగిస్తూ యాకోబు తన సోదరుని మడిమెను పట్టుకుని జన్మించాడని రాస్తున్నాడు. అదేవిధంగా మోసగాండ్రను, అబద్ధికులని సంబోధించడానికి కూడా హెబ్రీయులు ఈ‌ నానుడిని ఉపయోగించేవారు (ఈ వాదనను నేను Ellicott's Bible commentary English నుండి తీసుకోవడం జరిగింది). మన సంస్కృతిలో కూడా ఇలాంటి కొన్ని నానుడులు మనం వింటుంటాం, ఉదాహరణకు పెళ్ళాం కొంగుపట్టుకుని తిరుగుతాడు, వాడు వాళ్ళ అమ్మ నోట్లో నుండి ఊడిపడ్డాడు.

అదేవిధంగా; యాకోబు, ఏశావులు జన్మించిన 15 సంవత్సరాల వరకూ అబ్రాహాము‌ జీవించాడు. ఆదికాండము 21:5 ప్రకారం; ఇస్సాకు జన్మించేసరికి అబ్రాహాముకు 100 సవత్సరాలు, ఇస్సాకుకు 60 సంవత్సరాల వయస్సులో వీరు జన్మించారు. 100+60-160 అబ్రాహాము మొత్తం 175 సంవత్సరాలు జీవించాడు. ఈ విధంగా అతను‌ తన కుమారుడి సంతానంతో 15 సంవత్సరాలు జీవించాడు.

ఆదికాండము 25:27,28 ఆ చిన్నవారు ఎదిగినప్పుడు ఏశావు వేటాడుటయందు నేర్పరియై అరణ్యవాసిగా నుండెను. యాకోబు సాధువై గుడారములలో నివసించుచుండెను. ఇస్సాకు ఏశావు తెచ్చిన వేటమాంసమును తినుచుండెను గనుక అతని ప్రేమించెను. రిబ్కా యాకోబును ప్రేమించెను.

ఈ వచనాలలో ఇస్సాకు రిబ్కాలు యాకోబు, ఏశావులను వేరువేరుగా ప్రేమిస్తున్నట్టు మనం చూస్తాం. బహుశా పెద్దవాడు చిన్నవాడికి దాసుడౌతాడని రిబ్కాకు ముందే తెలియడం వల్ల ఆమె యాకోబును ఎక్కువగా ప్రేమిస్తుండవచ్చు. లేదా మాంసం తెచ్చిపెడుతున్నందున ఇస్సాకు ఏశావును ఎలా ప్రేమించాడో అలానే యాకోబు తనతో పాటే గుడారంలో గడుపుతున్నందుకు రిబ్కా అతడిని ఎక్కువగా ప్రేమిస్తుండవచ్చు. ఏదేమైనప్పటికీ ఒక్క విషయం మనం గుర్తుంచుకోవాలి. తల్లితండ్రులు ఇలా వెలిచూపు ద్వారా పిల్లల్ని ప్రేమించడం మంచి మాదిరైతే కాదు. దీనివల్ల పిల్లల‌‌ మనసుల్లో చాలా వ్యతిరేకత నెలకొంటుంది. ప్రాముఖ్యంగా తల్లితండ్రులు వృద్ధులైనప్పుడు కొందరు పిల్లలు వారిని నిందించే అవకాశాన్ని (నాకంటే వాడినే ఎక్కువగా చూసారు కదా వాడిదగ్గరకే పొండి) ఇది కల్పిస్తుంది. చాలా కుటుంబాల్లో దీనిని చూస్తున్నాం.

ఆదికాండము 25:29-34 ఒకనాడు యాకోబు కలగూరవంటకము వండుకొను చుండగా ఏశావు అలసినవాడై పొలములోనుండి వచ్చి నేను అలసియున్నాను. ఆ యెఱ్ఱయెఱ్ఱగా నున్న దానిలో కొంచెము దయచేసి నాకు పెట్టుమని అడిగెను. అందుచేత అతని పేరు ఎదోము అనబడెను. అందుకు యాకోబునీ జ్యేష్ఠత్వము నేడు నాకిమ్మని అడుగగా ఏశావు నేను చావబోవుచున్నాను గదా జ్యేష్ఠత్వము నాకెందుకనెను యాకోబు నేడు నాతో ప్రమాణము చేయుమనెను. అతడు యాకోబుతో ప్రమాణముచేసి అతనికి జ్యేష్ఠత్వమును అమ్మివేయగా యాకోబు ఆహారమును చిక్కుడుకాయల వంటకమును ఏశావు కిచ్చెను; అతడు తిని త్రాగి లేచిపోయెను. అట్లు ఏశావు తన జ్యేష్ఠత్వమును తృణీకరించెను.

ఈ వచనాలలో ఏశావు ఆకలిని అవకాశంగా తీసుకున్న యాకోబు అతని జ్యేష్ఠత్వపు హక్కును కోరడం, ఏశావు కూడా దానికి సమ్మతించి ఆ హక్కును అమ్మివెయ్యడం మనం చూస్తాం. పెద్దవాడు చిన్నవాడికి దాసుడౌతాడనే దేవుని‌ ముందస్తు నిర్ణయ నెరవేర్పుకు ఇది ప్రారంభం. ప్రాచీన యూదుల పద్ధతి ప్రకారం, జ్యేష్ఠకుమారుడికి తండ్రి ఆస్తిలో రెండు బాగాలు వస్తాయి, ఇక్కడ ఏశావు దానిని‌ యాకోబుకు అమ్మివెయ్యడం ద్వారా తండ్రి ఆస్తినుండి తనకు అధనంగా వచ్చే ఒక భాగాన్ని నష్టపోయాడు. ఇక్కడ నెరవేరింది దేవుని చిత్తమే అయినప్పటికీ ఏశావు ఒక పూటకూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును చులకనగా‌ చూసి, ఉద్దేశపూర్వకంగా దానిని అమ్మివేసాడు, కాబట్టి దానికి అతనే బాధ్యుడు. అందుచేత అతను లేఖనాలలో భ్రష్టుడిగా పేర్కోబడి విశ్వాసులను హెచ్చరించడానికి ఉదాహరణగా మారాడు (హెబ్రీ 12:15-17).

కాబట్టి విశ్వాసులు ఏశావులా దేవుడు తమకు అనుగ్రహించిన గొప్ప భాగ్యమైన రక్షణను చులకనగా చూడకూడదు. మనం ఎప్పుడైతే పాపానికి మరలా మనల్ని మనం అమ్ముకుంటామో అప్పుడు ఆ రక్షణను చులకనగా చూసి అమ్ముకున్నట్టే. ఎందుకంటే గతకాలంలో మనం అదే పాపానికి బంధీలమైయుండగా దేవుడు తన కుమారుని మరణం ద్వారా మనల్ని విడిపించాడు (రోమా 6:17,18, రోమా 6:6).
అనగా రక్షణ అనే భాగ్యాన్ని ప్రసాదించాడు.

Add comment

Security code
Refresh

 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.