పాత నిబంధన

రచయిత: కె విద్యా సాగర్
పరిచయం:

విషయసూచిక; 1:1-3, 1:4, 1:5, 1:6,7, 1:8, 1:9,101:11, 1:12, 1:1314, 1:15,16, 1:17, 1:18,19, 1:20,21, 1:22

గ్రంథ పరిచయం:

ఆదికాండానికి కొనసాగింపుగానే ఈ నిర్గమకాండము రాయబడింది. సెప్టువజింటు అనువాదకులు దీనికి Έξοδος (Exodus) అని పేరు పెట్టారు. దానికి తెలుగుభాషలో నిర్గమం అని అర్థం. అందుకే ఈ పుస్తకం నిర్గమకాండము‌ గా పిలవబడుతుంది. నిర్గమం అంటే బయలువెళ్ళడం అని అర్థం. 70 మందిగా ఐగుప్తులో ప్రవేశించిన ఇశ్రాయేలీయులు, అబ్రాహాము ఇస్సాకు యాకోబులకు దేవుడు చేసిన వాగ్దానం ప్రకారం, లక్షలమందిగా విస్తరించి, ఐగుప్తు నుండి ఎలా బయటకు వెళ్ళారో ఎలాంటి అద్భుతాల కారణంగా వెళ్ళారో ఈ గ్రంథం‌‌ వివరిస్తుంది. అదేవిధంగా మార్గమధ్యంలో దేవుడు వారికి జారీ చేసిన ఆజ్ఞలను ప్రత్యక్షపుగుడారానికి సంబంధించిన పరిచర్య విధులను కూడా ఇందులో చదువుతాం.

ప్రాచీన యూదులు, ప్రాముఖ్యంగా ప్రభువైన యేసుక్రీస్తు మరియు ఆయన అపోస్తలుల అంగీకారం ప్రకారం ఆదికాండము, నిర్గమకాండము, లేవీయకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండాలను మోషే పరిశుద్ధాత్మ ప్రేరణతో రచించాడు (మార్కు 12:26, యోహాను 1:17, 5:46, 7:19, 7:23, ఆపో.కార్యములు 7:37,38, 13:39, 15:1, 28:23). వీటిని యూదులు తోరా అని పిలుస్తారు. కొన్ని సందర్భాల్లో ఈ ఐదు పుస్తకాల గురించి ధర్మశాస్త్రం, మోషే ధర్మశాస్త్రం, మోషే అని కూడా రాయబడింది (2 కొరింథీ 3:16 English version, అపో.కార్యములు 21:21, 24:14, లూకా 24:44).

నిర్గమకాండము 1:1-3 ఐగుప్తులోనికి యాకోబుతో వచ్చిన ఇశ్రాయేలీయుల పేరులు ఏవనగా, రూబేను షిమ్యోను లేవి యూదా ఇశ్శాఖారు జెబూలూను బెన్యామీను. దాను నఫ్తాలి గాదు ఆషేరు. వీరిలో ప్రతివాడును తన తన కుటుంబముతో వచ్చెను.

ఆదికాండము 45,46 అధ్యాయాల ప్రకారం, ఐగుప్తుకు ప్రధానిగా నియమించబడిన యోసేపు, తనవద్దకు ధాన్యం కొనుగోలు చెయ్యడానికి వచ్చిన తన అన్నలను గుర్తించి వారి ద్వారా యాకోబు కుటుంబమంతటినీ ఐగుప్తుకు రప్పించడం జరిగింది. ఈ వచనాలలో మోషే అలా ఐగుప్తుకు వచ్చిన యాకోబు కుమారుల పేర్లను మరోసారి జ్ఞాపకం చేస్తున్నాడు.

నిర్గమకాండము 1:4 యాకోబు గర్భమున పుట్టినవారందరు డెబ్బదిమంది.

ఈ వచనంలో యాకోబు గర్భాన పుట్టినవారు అంటే అతని మనువళ్ళతో సహా 70 మందని రాయబడడం మనం చూస్తాం. వాస్తవానికి యాకోబు గర్భాన పుట్టిన సంతానం 69‌ మంది మాత్రమే. అయితే మోషే ఇక్కడ "యాకోబుతో కలిపి మొత్తంగా" ఈ మాటలు చెబుతున్నాడు. ఎందుకంటే ఆదికాండము 46:26 ప్రకారం, యాకోబుతో కలసి ఐగుప్తుకు వచ్చిన అతని సంతానం 66 మంది (కోడళ్ళను మినహాయించి). వారికి అప్పటికే ఐగుప్తులో ఉన్న యోసేపునూ అతని ఇద్దరి కుమారులనూ జతచేస్తే 69 మంది. ఆవిధంగా యాకోబు మరియు అతని సంతానం కలపి 69+1 = 70 మంది  (ఆదికాండము 46:27).

దీనికి మరో స్పష్టమైన ఆధారం ఏంటంటే;

ద్వితియోపదేశకాండము 10: 22 నీ పితరులు డెబ్బది మందియై ఐగుప్తునకు వెళ్లిరి. ఇప్పుడు నీ దేవుడైన యెహోవా ఆకాశనక్షత్రములవలె నిన్ను విస్తరింపజేసి యున్నాడు.

ఈ సందర్భంలో ఇశ్రాయేలీయుల పితరులు 70 మందియై ఐగుప్తుకు వెళ్ళారని రాయబడింది. ఒకవేళ నిర్గమకాండము 1:4లో చెప్పబడిన 70 మందీ యాకోబు కాకుండా అతని సంతానం మాత్రమే ఐతే ఇక్కడ మోషే యాకోబుతో కలపి 71 మంది అని చెప్పేవాడు కదా!. ఎందుకంటే ఐగుప్తుకు వెళ్ళిన ఇశ్రాయేలీయుల పితరుల్లో యాకోబు కూడా ఉండి అక్కడ 17 సంవత్సరాలు జీవించాడు. కాబట్టి 70 మంది అన్నప్పుడు యాకోబుతో కలిపి అర్థం చేసుకోవాలి. ఇలాంటి భాష లేఖనాలలో సాధారణంగా కనిపిస్తుంటుంది. ఉదాహరణకు;

ఆదికాండము 35:23-26 యాకోబు కుమారులు పండ్రెండుగురు, యాకోబు జ్యేష్ఠకుమారుడగు రూబేను, షిమ్యోను, లేవి, యూదా, ఇశ్శాఖారు, జెబూలూను; వీరు లేయా కుమారులు. రాహేలు కుమారులు యోసేపు, బెన్యామీను. రాహేలు దాసియైన బిల్హా కుమారులు దాను, నఫ్తాలి. లేయా దాసియైన జిల్పా కుమారులు గాదు, ఆషేరు వీరు పద్దనరాములో యాకోబునకు పుట్టిన కుమారులు.

ఈ వచనాలలో యాకోబు కుమారులు పన్నెండుమందీ అతనికి పద్దనరాములో పుట్టినట్టు రాయబడింది. కానీ యాకోబుకు పద్దనరాములో పుట్టింది పదకొండుమంది మాత్రమే. బెన్యామీను ఎఫ్రాతామార్గం (కనాను దేశం) లో జన్మించాడు (ఆదికాండము35:16-20). కానీ మోషే ఇక్కడ ఎక్కువమంది కుమారులు పుట్టిన పద్దనరామునే ప్రస్తావిస్తూ అక్కడ పుట్టినవారిలో బెన్యామీనును కూడా కలిపేసి మొత్తంగా వివరించాడు. ఎందుకంటే బెన్యామీను ఎక్కడ పుట్టాడో అప్పటికే అతను వివరణ ఇచ్చాడు కాబట్టి, అతనికోసం మరలా ప్రత్యేకంగా ప్రస్తావించలేదు. యాకోబు సంతానం‌ విషయంలో కూడా అతను ఆదికాండము 46వ అధ్యాయంలో 69మందని వివరించాడు కాబట్టి, ఇక్కడ యాకోబును విడిగా ప్రస్తావించకుండా మొత్తంగా 70 మందని రాస్తున్నాడు.

అదేవిధంగా ఐగుప్తుకు‌ వచ్చిన యాకోబు‌ కుటుంబం విషయంలో ఒకచోట 66, మరోచోట 70, ఇంకోచోట 75 అని రాయబడడాన్ని‌ బట్టి కొందరు దీనిని‌ వైరుధ్యంగా ప్రస్తావిస్తుంటారు. కానీ ఇక్కడ ఎలాంటి వైరుధ్యం‌ లేదు. దీనిగురించి ఇప్పటికే నేను వివరించాను (ఆదికాండము 46:26వ్యాఖ్యానం చూడండి).

నిర్గమకాండము 1:5 అప్పటికి యోసేపు ఐగుప్తులో ఉండెను.

ఆదికాండము 45వ అధ్యాయం‌ ప్రకారం, యోసేపు తన‌ అన్నదమ్ములకు కనపరచుకున్నప్పుడు తన తండ్రినీ మిగిలిన కుటుంబాన్నీ ఐగుప్తుకు తీసుకురమ్మని వారినే పంపాడు తప్ప, తనకు అప్పగించబడిన బాధ్యతలను బట్టి తాను వెళ్ళలేదు. ఈ ప్రకారంగా యాకోబు కుటుంబం ఐగుప్తుకు వచ్చేసరికి యోసేపు అతని కుమారులు ఐగుప్తులోనే నివసిస్తున్నారు. దాని గురించే ఈ వచనంలో రాయబడింది. అయినప్పటికీ యోసేపు మరియు అతని‌ కుమారులు ఐగుప్తుకు పరదేశులుగా వచ్చినట్టే. ఎందుకంటే అది వారిదేశం కాదు, దేవుడు వాగ్దానం చేసిన కనాను మాత్రమే వారి స్వదేశం.

నిర్గమకాండము 1:6,7 యోసేపును అతని అన్నదమ్ములందరును ఆ తరము వారందరును చనిపోయిరి. ఇశ్రాయేలీయులు బహు సంతానము గలవారై అభివృద్ధి పొంది విస్తరించి అత్యధికముగా ప్రబలిరి; వారున్న ప్రదేశము వారితో నిండియుండెను.

ఈ వచనాలలో యోసేపు మరియు అతని సహోదరులంతా చనిపోవడం, వారి సంతానమైన ఇశ్రాయేలీయులు దేవుని వాగ్దానం మేరకు బహుగా విస్తరించడం మనం చూస్తాం.‌ వీరి విస్తరణ ఎంత అసమాన్యంగా ఉందంటే మోషే నాయకత్వంలో వీరు ఐగుప్తును విడిచివెళ్ళేటప్పుడు స్త్రీలు, పిల్లలు, వృద్ధులు కాకుండా యుద్ధం చెయ్యగలిగిన పురుషులే ఆరులక్షల వీరులుగా బయలుదేరారు. దీనంతటికీ పట్టిన సమయం కేవలం 215 సంవత్సరాలు మాత్రమే. ఈ సమయంలోనే 70 మందిగా ఐగుప్తులో ప్రవేశించిన ఇశ్రాయేలీయులు లక్షలసంఖ్యలో విస్తరించారు. అందుకే పై వచనంలో వీరిగురించి "బహు సంతానము గలవారై", "అభివృద్ధి పొంది విస్తరించి", "అత్యధికముగా ప్రబలిరి", "వారున్న ప్రదేశము వారితో నిండియుండెను" అని నాలుగు విధాలుగా వర్ణించబడింది.

కొందరు నిర్గమకాండము 12:40 లో రాయబడిన మాటలను ఆధారం చేసుకుని ఇశ్రాయేలీయులు ఐగుప్తులో 430 సంవత్సరాలు నివసించారని భావిస్తుంటారు, కానీ ఆ వచనం తర్జుమాలో లోపం‌ ఉంది. ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నివసించింది కేవలం‌ 215 సంవత్సరాలు మాత్రమే. దానిగురించి వివరంగా తెలుసుకోవడానికి ఈ వ్యాసం చదవండి.

ఇశ్రాయేలీయులు, ఐగుప్తులో ఎంతకాలం బానిసలుగా నివసించారు? 430/400/215?

అదేవిధంగా ఇశ్రాయేలీయులు కాపురమున్న ప్రదేశం పేరు గోషెను, దీనినే రామెసేసు అని పిలిచేవారు (11 వచనం). యోసేపు తన కుటుంబాన్ని ఐగుప్తుకు రప్పించినప్పటికీ ఆ కుటుంబం‌ ఐగుప్తు ఆచారాలను బట్టి కలుషితం కాకూడదనే ఉద్దేశంతో వారిని ఐగుప్తీయుల మధ్యలో కాకుండా గోషెను అనే ప్రత్యేక ప్రాంతంలో నివసింపచేసాడు.

నిర్గమకాండము 1:8 అప్పుడు యోసేపును ఎరుగని క్రొత్తరాజు ఐగుప్తును ఏలనారంభించెను.

ఈ వచనంలో "యోసేపును ఎరుగని క్రొత్తరాజు ఐగుప్తును ఏలనారంభించెను" అని మనం చూస్తాం. అయితే "యోసేపును‌ ఎరుగని కొత్తరాజు" అన్నప్పుడు అతనికి యోసేపు‌ గురించి‌ ఏమీ తెలియదని అర్థం కాదు. ఎందుకంటే ఒకటి రెండు తరాలు గడిచినంత మాత్రాన ఐగుప్తు చరిత్రలో యోసేపు ప్రాముఖ్యత అంత సులభంగా కనుమరుగవ్వడం సాధ్యం కాదు. యోసేపు అనే వ్యక్తి కరువు సమయంలో ఐగుప్తుకు చేసిన ఉపకారానికి సాక్ష్యాలుగా, సజీవంగా నిలిచియున్న ఐగుప్తుదేశం, మరియు అక్కడికి రప్పించబడిన అతని‌ కుటుంబం (ఇశ్రాయేలీయులు) కళ్ళముందు ఉన్నాయి. అంతేకాకుండా అప్పటికి యోసేపు సమాధి‌ కూడా ఐగుప్తులోనే‌ ఉంది (ఆదికాండము 50:26). ప్రాముఖ్యంగా మోషే ఈ చరిత్రను రాస్తున్న సమయానికి ఐగుప్తు భూముల విషయంలో అతను చేసిన చట్టం కూడా అమలులోనే ఉంది (ఆదికాండము 47:26).

కాబట్టి యోసేపును "ఎరుగని" కొత్త రాజు అంటే అతన్ని "ఆమోదించని, అంగీకరించని" రాజు అని అర్థం. ఇక్కడ హీబ్రూలో వాడిన יָדַ֖ע (yā-ḏa) అనేపదానికి అర్థం అదే. ఉదాహరణకు;

హొషేయ 2:8 దానికి ధాన్య ద్రాక్షారస తైలములను విస్తారమైన వెండి బంగారములను ఇచ్చినవాడను నేనేయని విచారింపక అది వాటిని బయలు దేవతకు ఉపయోగపరచెను.

ఈ సందర్భంలో "విచారింపక" అన్నప్పుడు కూడా హీబ్రూలో (yā-ḏa) అనే పదమే ఉపయోగించబడింది. ఇక్కడ ఇశ్రాయేలీయులకు యెహోవా దేవుడు తెలుసు కానీ వారు ఆయనను దేవునిగా అంగీకరించకుండా బయలుదేవతను పూజించడం ప్రారంభించారు. అలానే;

న్యాయాధిపతులు 2:10 ఆ తరమువారందరు తమ పితరుల యొద్దకు చేర్బబడిరి. వారి తరువాత యెహోవానైనను ఆయన ఇశ్రాయేలీయుల కొరకు చేసిన కార్యములనైనను ఎరుగని తరమొకటి పుట్టగా-

ఈ సందర్భంలో కూడా యెహోవానైననూ ఆయన చేసిన కార్యములనైననూ ఎరుగని తరం పుట్టిందని రాయబడింది. కానీ ఈ తరానికి యెహోవా దేవుడు మరియు, ఆయన చేసిన‌ కార్యాలు కచ్చితంగా తెలుసు. ఎందుకంటే ప్రతీతరంవారూ తమ భవిష్యత్తు తరాలకు యెహోవా దేవునికోసం ఆయన చేసిన కార్యాలకోసం వివరించాలని పితరులకు ఆజ్ఞాపించబడింది. అప్పటికే రాయబడిన మోషే ధర్మశాస్త్రం, అందులోని పండుగలు, వారు పంచుకుంటున్న కనాను దేశం కూడా యెహోవా దేవునికీ ఆయన చేసిన కార్యాలకూ సాక్ష్యంగా ఉన్నాయి. కాబట్టి ఇక్కడ యెహోవానైననూ ఆయన చేసిన కార్యాలనైననూ "ఎరుగని" తరం పుట్టింది అన్నప్పుడు, ఆ తరం యెహోవా దేవుణ్ణీ ఆయన చేసిన కార్యాలనూ అంగీకరించకుండా గుర్తించకుండా తమ ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారని అర్థం.

అదేవిధంగా ఇక్కడ మనం ఒక ప్రాముఖ్యమైన పాఠాన్ని నేర్చుకోవాలి. యోసేపు ఐగుప్తు దేశానికి ప్రధానిగా నియమించబడి, తన‌ జ్ఞానంతో ఆ దేశాన్నే కాదు, చుట్టుప్రక్కల దేశాలను కూడా ఆ కరువు నుండి‌ కాపాడాడు. ఐగుప్తు దేశంలో‌ ఎన్నో ఉన్నతమైన కార్యాలూ సంస్కరణలూ చేసాడు. కానీ అతను చనిపోయిన కొంతకాలానికే అతనిని ఆమోదించని, అంగీకరించని రాజు ఒకడు అధికారంలోకి వచ్చాడు. ఐగుప్తు ప్రజలు‌ కూడా అలాంటి వైఖరే కలిగియున్నారు. కాబట్టి ఈలోకంలో మనం ఎంత గొప్పస్థాయిలో బ్రతికినా ఎలాంటి గొప్పగొప్ప కార్యాలు చేసినా మన మరణం‌ తర్వాత కొంతకాలానికి అవన్నీ మరుగునపడిపోతాయి. అందుకే "వారిపేరు మరువబడి యున్నది, వారికిక ఏ లాభమును కలుగదు" (ప్రసంగి 9:5) అని రాయబడింది.

కానీ ఈలోకంలో మనం దేవునికోసం బ్రతికితే మనం చేసినదానిని మరచిపోవడానికి ఆయన అన్యాయస్థుడు కాడని లేఖనం చెబుతుంది (హెబ్రీ 6:10). కాబట్టి ఆయన తప్పకుండా మనకు ప్రతిఫలం‌ ఇస్తాడు, యోసేపు కూడా దేవునికోసం‌ బ్రతికిన కారణాన్ని బట్టి ఐగుప్తు అతడిని మరిచిపోయినా అతనికి ఆ ప్రతిఫలం తప్పక దక్కుతుంది.

ఇక "ఫరో" గురించి మనం పరిశీలిస్తే; ఈ గ్రంథమంతటిలో "ఫరో" ప్రస్తావన వచ్చినప్పుడల్లా అదంతా ఒకే వ్యక్తి కోసం చెప్పబడుతుందని మనం భావించకూడదు. ఎందుకంటే "ఫరో" అనేది ఐగుప్తు రాజుల గౌరవనామం. ఆ మాటకు మొసలి అనే అర్థం వస్తుంది (యెహెజ్కేలు 29:3). ఐగుప్తీయులు నైలునదిలో నివసించే మొసళ్ళను దేవుళ్ళుగా పూజించేవారు కాబట్టి వారు దేవుని ప్రతిరూపంగా భావించే తమ రాజును ఆ అర్థం వచ్చేలా "ఫరో"లని సంబోధించేవారు.

నిర్గమకాండము 1:9,10 అతడు తన జనులతో ఇట్లనెను ఇదిగో ఇశ్రాయేలు సంతతియైన యీ జనము మనకంటె విస్తారముగాను బలిష్ఠముగాను ఉన్నది. వారు విస్తరింప కుండునట్లు మనము వారియెడల యుక్తిగా జరిగించుదము రండి; లేనియెడల యుద్ధము కలుగునప్పుడుకూడ మన శత్రువులతో చేరి మనకు విరోధముగా యుద్ధముచేసి యీ దేశములోనుండి, వెళ్లిపోదురేమో అనెను.

ఈ వచనాలలో ఐగుప్తురాజైన ఫరో ఇశ్రాయేలీయులకు వ్యతిరేకంగా తన ప్రజలను ఉసిగొల్పడం మనం చూస్తాం. ఆ క్రమంలో భాగంగా అతను ఇశ్రాయేలీయులు‌ మనకంటే విస్తారంగా బలమైనవారిగా ఉన్నారని వారివల్ల యుద్ధం‌ కలిగేటప్పుడు ఈ దేశానికే ప్రమాదమని ఐగుప్తీయులకు అబద్ధాలు నూరిపోస్తున్నాడు. వాస్తవానికి కేవలం గోషెను ప్రాంతంలో మాత్రమే నివసిస్తున్న ఇశ్రాయేలీయులు ఐగుప్తుదేశం‌ మొత్తంలో‌‌ ఉన్న‌ ఐగుప్తీయులకంటే అధికులు కాలేరు. కానీ ఫరో తన‌ ప్రజలను రెచ్చగొట్టడానికి మాత్రమే‌ ఇలాంటి అబద్ధపు మాటలు చెబుతున్నాడు. ఇలా చెయ్యడంలో అతని అసలు ఉద్దేశం ఏంటో ముందు ముందు చూద్దాం.

ఫరో ఒక్కడే కాదు, ప్రతీ తరంలోనూ దేవునిపిల్లలను హింసించిన ఆయాదేశపు రాజులు, వీరివల్ల దేశానికి ప్రమాదమనే ఆరోపణ ద్వారానే వారిని హింసించారు. ఉదాహరణకు ఈ సందర్భాలు చూడండి;

ఎస్తేరు 3: 8 అంతట హామాను అహష్వేరోషుతో చెప్పినదేమనగా మీ రాజ్య సంస్థానములన్నిటియందుండు జనులలో ఒక జాతివారు చెదరియున్నారు; వారి విధులు సకలజనుల విధులకు వేరుగా ఉన్నవి; వారు రాజు యొక్క ఆజ్ఞలను గైకొనువారు కారు; కాబట్టి వారిని ఉండనిచ్చుట రాజునకు ప్రయోజనకరము కాదు.

ఎజ్రా 4:12,13 తమ సన్నిధినుండి మాయొద్దకు వచ్చిన యూదులు యెరూషలేమునకు వచ్చి, తిరుగుబాటుచేసిన ఆ చెడుపట్టణమును కట్టుచున్నారు. వారు దాని ప్రాకారములను నిలిపి దాని పునాదులను మరమ్మతు చేయుచున్నారు. కావున రాజవైన తమకు తెలియవలసినదేమనగా, ఈ పట్టణమును కట్టి దాని ప్రాకారములను నిలువ బెట్టినయెడల వారు శిస్తుగాని సుంకముగాని పన్నుగాని యియ్యకయుందురు, అప్పుడు రాజునకు రావలసిన పైకము నష్టమగును.

ప్రస్తుతం అనేకదేశాల్లో దేవునిపిల్లలపై అధికశాతంలో దాడులు జరుగుతుంది కూడా "వీరివల్ల దేశానికి ప్రమాదమనే" అబద్ధపు ఆరోపణ కారణంగానే.

ఫరో మాటలను ఇంకా‌ మనం పరిశీలిస్తే, అతను "వారు విస్తరింపకుండునట్లు మనము వారియెడల యుక్తిగా జరిగించుదము రండి" అంటూ పిలుపునిస్తున్నాడు. ఇక్కడ ఫరో ఇశ్రాయేలీయులను తనకున్న సైన్యబలంతో అణచివెయ్యాలని చూడడం లేదు కానీ వారు ఆ దేశంలో చేస్తున్న పనులద్వారానే వారిని అణచివేసే ప్రయత్నం చేస్తున్నాడు. దీనినే ఫరో యుక్తిగల ఆలోచనగా భావిస్తున్నాడు. దుష్టుడు తన దుష్టప్రణాళికనే యుక్తిగా భ్రమపడతాడు అనడానికి ఇది మంచి ఉదాహరణ. ఇలాంటి లక్షణం దుష్టులందరిలోనూ సహజంగా కనిపిస్తుంటుంది.

ఒకవేళ ఐగుప్తీయులకూ ఆ దేశపు శత్రువులకూ మధ్యలో యుద్ధం‌ జరిగినప్పుడు, ఇశ్రాయేలీయులు ఐగుప్తీయుల శత్రువులతో చేతులు కలుపుతారు అన్నదే ఫరో భయమైతే అతను ఇశ్రాయేలీయులను అణచివెయ్యాలనే దుష్టప్రణాళికలు రూపొందించకుండా వారిని సులభంగా ఐగుప్తు నుండి వెళ్ళగొట్టేవాడు. ఎందుకంటే ఐగుప్తుదేశం ఇశ్రాయేలీయుల స్వదేశం కాదు. ఇది ఇశ్రాయేలీయులకు కూడా బాగా తెలుసు. కానీ ఫరో వారు ఐగుప్తు నుండి ఎక్కడ వెళ్ళిపోతారో అనే ఆందోళనతోనే ఇలాంటి కుట్ర పన్నుతున్నాడు. అందుకే "యీ దేశములో నుండి, వెళ్లిపోదురేమో" అంటున్నాడు. ఎందుకంటే ఇశ్రాయేలీయుల కష్టంవల్ల ఐగుప్తుకు ఎంతో‌ మేలు జరుగుతూ ఉంది. అది కోల్పోవడం‌ ఫరోకు ఇష్టం లేదు. ఇశ్రాయేలీయుల పట్ల దుష్టప్రణాళికను రూపొందించడంలో ఫరోకు ఉన్న అసలు ఉద్దేశం‌ ఇదే. అంటే ఇశ్రాయేలీయులను అతను దేవుడు తమ పితరులకు వాగ్దానం‌ చేసిన కనానుకు తిరిగివెళ్ళనివ్వకుండా అణచివేతతో అడ్డుకట్టలు వెయ్యాలని చూస్తున్నాడు. ఈరోజు దేవుని పిల్లలమైన మనముందు కూడా పరలోకం చేరనివ్వకుండా చెయ్యాలనే అడ్డుకట్టలు ఎన్నెన్నో వెయ్యబడుతుంటాయి. దేవునికి సమయాన్ని ఇవ్వనివ్వకుండా మనపై మోపబడే పనులభారం అందులో‌ భాగమే. కానీ చివరికి ఫరో ఎలాగైతే ఇశ్రాయేలీయులను కనానుకు చేరనియ్యకుండా ఆపలేకపోయాడో మనల్ని కూడా ఈ లోకం‌ పరలోకం చేరనివ్వకుండా ఆపలేదు.

నిర్గమకాండము 1:11 కాబట్టి వారిమీద పెట్టిన భారములలో వారిని శ్రమపెట్టుటకు వెట్టి పనులు చేయించు అధికారులను వారిమీద నియమింపగా వారు ఫరోకొరకు ధాన్యాదులను నిలువచేయు పీతోము రామెసేసను పట్టణములను కట్టిరి.

ఈ వచనంలో ఫరో ఇశ్రాయేలీయులను అణచివెయ్యడానికి పన్నిన దుష్టపన్నాగం ప్రకారం వారిపై అధికారులను నిర్ణయించి కఠినమైన పనులు చేయించడం మనం చూస్తాం. ఇక్కడ ఫరో ఇశ్రాయేలీయులపై ఎలాంటి సైనికచర్యా తీసుకుని వారిని అణచివెయ్యడం లేదు, ఎందుకంటే ఆ ప్రజలు ఐగుప్తీయులతో సమాధానంగా ఉంటున్నారు. అందుకే ఫరో కుయుక్తిగా ఇశ్రాయేలీయులపై పనిభారం అధికంగా మోపి వారిని శ్రమపెట్టాలని అనుకుంటున్నాడు. దీనిద్వారా వారి ఆరోగ్యం క్షీణించి, బలహీనమైన పిల్లలను కనాలని, లేదా ఆ పనిభారాన్ని బట్టి కుటుంబంతో ఆనందంగా గడపలేక వివాహజీవితాలకు దూరంగా ఉండాలని ఫరో కోరిక. ఇలా వారిచేత కఠినసేవ చేయించుకున్నప్పుడు ఆరోగ్యపరంగా సంఖ్యాపరంగా ఆ జాతి క్షీణించిపోతుంది. అదే జరిగితే అబ్రాహాము ఇస్సాకు యాకోబులకు దేవుడు చేసిన ప్రమాణం తప్పిపోతుంది. ఇది ఫరో పన్నాగం వెనుక అపవాది పన్నిన పన్నాగం.

గమనించండి; ఐగుప్తు దేశానికి 70మందిగా వెళ్ళిన ఇశ్రాయేలీయులు, యోసేపు జీవించినంతకాలం, యోసేపును ఆమోదించిన ఐగుప్తు తరం ఉనికిలో ఉన్నంతకాలం, తమపని తాము చేసుకుంటూ సౌకర్యవంతంగా జీవించారు, ఊహించని విధంగా విస్తరించారు. అయితే ఇప్పుడు వారి పరిస్థితి ఊహించని విధంగా తారుమారు అయ్యింది. కాబట్టి ఈలోకంలో మన జీవితాలు ఎప్పుడూ సుఖవంతంగానే గడచిపోవు, కొన్ని సమయాల్లో ఊహించని శ్రమలూ భారాలూ మనపై మోపబడుతుంటాయి. ఆ సమయంలో మనం‌ కృంగిపోకుండా దేవుడు కలిగించే విడుదల కొరకు ఎదురుచూడాలి. ఎందుకంటే దేవుడు మన జీవితాల్లోకి ఆనందాన్ని అనుమతించి కొన్ని పాఠాలు, శ్రమలను అనుమతించి మరికొన్ని పాఠాలు నేర్పిస్తుంటాడు. అన్నీ మనకు అవసరమైనవే.

ప్రసంగి 7: 14 ​సుఖదినమునందు సుఖముగా ఉండుము, ఆపద్దినమునందు యోచించుము; తాము చనిపోయిన తరువాత జరుగుదానిని నరులు తెలిసికొనకుండునట్లు దేవుడు సుఖదుఃఖములను జతపరచియున్నాడు.

అదేవిధంగా ఇశ్రాయేలీయులు "ఫరో కొరకు ధాన్యాదులను నిలువచేయు పీతోము రామెసేసను పట్టణములను కట్టినట్లు" ఈ వచనంలో చూస్తున్నాం. కొందరు బైబిల్ పండితుల పరిశోధన ప్రకారం వీరు పిరమిడ్లను, నైలు నదిపై వంతెనలను కూడా నిర్మించారు. వాటికి సంబంధించిన ఆధారాలను గూగుల్ ద్వారా పరిశీలించండి.

నిర్గమకాండము 1:12 అయినను ఐగుప్తీయులు వారిని శ్రమపెట్టినకొలది వారు విస్తరించి ప్రబలిరి గనుక వారు ఇశ్రాయేలీయుల యెడల అసహ్యపడిరి.

ఈ వచనంలో ఇశ్రాయేలీయులు ఫరో పన్నిన పన్నాగానికి విరుద్ధంగా అత్యధికంగా విస్తరించడం, ఫరో మరియు అతని ప్రజలు వారి విస్తరణ చూసి అసహ్యపడడం మనం చూస్తాం.‌ ఇశ్రాయేలీయులపై పనిభారం అధికంగా మోపి వారిని శ్రమపెట్టడం ద్వారా వారి ఆరోగ్యాలు కృంగిపోవాలని, వారికి పుట్టే పిల్లలు బలహీనులుగా ఉండాలని, చివరికి వారు కుటుంబంతో ఆనందంగా గడపలేక‌ వివాహజీవితాలకు కూడా దూరమై జాతి విస్తరణ నిలచిపోవాలన్నది ఫరో ఉద్దేశం. కానీ ఆ ప్రజలకు దేవుడు తోడైయుండడాన్ని బట్టి, ఆయన తన ప్రమాణాన్ని తప్పకుండా నెరవేర్చుకుంటాడు‌ కాబట్టి, ఫరో ఊహించినవి ఏవీ జరగడం లేదు.

అదేవిధంగా ఈ వచనంలో ఇశ్రాయేలీయుల విషయంలో చూసిన విస్తరణ, మనం సంఘచరిత్రలో కూడా చూస్తాం. వారు ఎలాగైతే ఐగుప్తీయులు తమను శ్రమపెడుతున్నకొలదీ క్షీణించిపోకుండా విస్తరించారో సంఘం కూడా శ్రమల్లో బహుగా విస్తరించింది, నేటికీ విస్తరిస్తుంది. ఎందుకంటే ఈ‌ ఇరుప్రజల వెనుకున్నదీ ఒకే సర్వశక్తిమంతుడైన దేవుడు. కానీ‌ లోకం‌ వీరి విస్తరణను చూసి వారి వెనుకున్నది ఆయనేయని గుర్తించి పశ్చాత్తాపపడకుండా మరింత దుష్టత్వంలో కూరుకుపోయింది. అందుకే "ఐగుప్తీయులు కూడా ఇశ్రాయేలీయుల విస్తరణ చూసి అసహ్యపడినట్టు రాయబడింది" వారు ఇశ్రాయేలీయుల విస్తరణ చూసి అసహ్యపడి వారిపై మరింత పగపట్టారు తప్ప, మనం దేవునితో పోరాడుతున్నామని గుర్తించి మారుమనస్సు పొందలేదు. ఇది దుష్టులకు ఉండే సహజలక్షణం. వీరు దేవునికార్యాలను ప్రత్యక్షంగా గమనించినప్పటికీ వాటినిబట్టి మారుమనస్సు పొందలేరు.

నిర్గమకాండము 1:13,14 ఇశ్రాయేలీయులచేత ఐగుప్తీయులు కఠినముగా సేవ చేయించుకొనిరి; వారు ఇశ్రాయేలీయులచేత చేయించుకొనిన ప్రతి పనియు కఠినముగా ఉండెను. వారు జిగటమంటి పనిలోను, ఇటుకల పనిలోను, పొలములో చేయు ప్రతిపనిలోను కఠినసేవ చేయించి వారి ప్రాణములను విసికించిరి.

ఈ వచనాలలో ఇశ్రాయేలీయుల చేత ఐగుప్తీయులు ఎలాంటి కఠినమైన పనులు చేయించేవారో మనం చూస్తాం. దేవుడు ఇలాంటి కఠినమైన పరిస్థితిని వారి జీవితంలోకి అనుమతించడం ద్వారా పరదేశుల విషయంలో వీరు ఎలాంటి‌ కనికరమైన వైఖరిని కలిగియుండాలో‌ బోధించాడు (నిర్గమకాండము 22:21, 23:9, లేవీకాండము 19:34ద్వితీయోపదేశకాండము 10:19). కాబట్టి పైన జ్ఞాపకం చేసినట్టు దేవుడు మనకు కొన్ని పాఠాలను నేర్పించి, మన వైఖరిని తనకు అనుకూలంగా మార్చుకునేందుకు కూడా మన జీవితాల్లోకి శ్రమలను అనుమతిస్తాడు.

నిర్గమకాండము 1:15,16 మరియు ఐగుప్తురాజు షిఫ్రా పూయా అను హెబ్రీయుల మంత్రసానులతో మాటలాడి, మీరు హెబ్రీ స్త్రీలకు మంత్రసానిపని చేయుచు వారిని కాన్పుపీటల మీద చూచినప్పుడు మగవాడైనయెడల వాని చంపుడి, ఆడుదైనయెడల దాని బ్రదుకనియ్యుడని వారితో చెప్పెను.

ఈ వచనాలలో ఫరో హెబ్రీయుల మంత్రసానులతో మాట్లాడి, ఇశ్రాయేలీయుల్లో మగపిల్లలను చంపమనడం‌ మనం చూస్తాం. ఇక్కడ మంత్రసానులు అంటే మంత్రాలు వేసేవారు అని‌ కాదు కానీ మన తెలుగులో ఇంటివద్ద కానుపు వేసేవారిని అలా సంబోధిస్తారు కాబట్టి తర్జుమాలో ఆ పదం వాడడం జరిగింది. ఇంగ్లీషులో వీరిని ఉద్దేశించి Midwives అనేపదం వాడబడింది. అదేవిధంగా వీరి పేర్లను బట్టి వీరు కూడా ఇశ్రాయేలీయులే అని కొందరు అభిప్రాయపడ్డారు, కానీ ఫరో ఇశ్రాయేలీయుల మగపిల్లలను చంపడానికి వారి స్వజాతి మంత్రసానులనే సంప్రదించాడా? దానికి‌ వారు అంగీకరిస్తారని‌ భావించాడా? అనే ప్రశ్నలు ఇక్కడ తలెత్తుతున్నాయి. పైగా క్రింది వచనాల్లో వారి వంశాభివృద్ధి కూడా ఇశ్రాయేలీయులకు వేరుగా చెప్పబడింది. ఈ కారణంగా వారు ఇశ్రాయేలీయులకు చెందినవారే అని కచ్చితంగా చెప్పలేము. వారు ఐగుప్తీయులే అయ్యుండి, గోషెను ప్రాంతంలో ఇశ్రాయేలీయుల మంత్రసానులుగా పనిచేస్తుండవచ్చు.

అదేవిధంగా యుద్ధాల్లో పురుషులే పాల్గొంటారు కాబట్టి వంశాభివృద్ధి కూడా వారి మూలంగానే జరుగుతుంది కాబట్టి ఫరో ఇక్కడ ఇశ్రాయేలీయుల్లో మగపిల్లలను చంపమని, ఆడపిల్లలను బ్రతకనివ్వమని మంత్రసానులకు ఆజ్ఞాపిస్తున్నాడు. దీనివల్ల ఇశ్రాయేలీయుల జాతి విస్తరణ నిలచిపోయి నాశనం ఔతుందని అతని భావించాడు.

నిర్గమకాండము 1:17 అయితే ఆ మంత్రసానులు దేవునికి భయపడి, ఐగుప్తురాజు తమ కాజ్ఞాపించినట్లు చేయక మగపిల్లలను బ్రదుకనియ్యగా-

ఈ వచనంలో మంత్రసానులు దేవునికి భయపడి, ఫరో ఆజ్ఞచొప్పున ఇశ్రాయేలీయుల మగపిల్లలను చంపకుండా వారిని కాపాడడం మనం చూస్తాం. ఎందుకంటే ఫరో వారిని చెయ్యమన్నది ఎంతో క్రూరమైన కార్యమని, అది దేవునియెదుట ఘోర పాపమని వారికి తెలుసు. అందుకే వారు ఆ విషయంలో ఫరో ఆజ్ఞ పట్ల కాకుండా దేవునిపట్ల‌ తమ భయాన్ని కనపరిచారు. విశ్వాసులమైన‌ మనం కూడా ఎవరో బలవంతపెట్టారని కాని, ఎక్కువమంది ప్రజలు ఆ వైపుకే మొగ్గుచూపుతున్నారని కాని, ఏదిబడితే అది చెయ్యకుండా మనం‌ చేసే కార్యాలు వాక్యపరిధిలో పరిశీలించుకుని చెయ్యాలి. అధికారులకు లోబడమని బైబిల్ కూడా ఆజ్ఞాపిస్తున్నప్పటికీ అందులో అధికారం చాటున వారు చేసే అన్యాయమైన, క్రూరమైన కార్యాలను కూడా మనం అంగీకరించాలనే భావం లేదు. ఏదైనా వాక్యసమ్మతంగా ఉన్నంతవరకే మనకూ సమ్మతం, ఏదైనా వాక్యవిరుద్ధంగా ఉంటే అది మనకూ విరుద్ధం. అందుకే షద్రకు మేషాకు అబేద్నెగోలు‌ నెబుకద్నెజరు చేసిన దైవవిరుద్ధమైన చట్టం‌ విషయంలో కఠినంగా బదులిచ్చారు, అపోస్తలులు కూడా ఈ విషయంలో మనకు మెలకువలు నేర్పించారు.

నిర్గమకాండము 1:18,19 ఐగుప్తురాజు ఆ మంత్ర సానులను పిలిపించి మీరెందుకు మగపిల్లలను బ్రదుకనిచ్చితిరి? ఈ పని యేల చేసితిరి అని అడిగెను. అందుకు ఆ మంత్ర సానులు హెబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీలవంటివారు కారు; వారు చురుకైనవారు. మంత్రసాని వారియొద్దకు వెళ్లక మునుపే వారు ప్రసవించి యుందురని ఫరోతో చెప్పిరి.

ఈ వచనాలలో ఆ మంత్రసానులు తన ఆదేశాల ప్రకారం చెయ్యట్లేదని గుర్తించిన ఫరో వారిని ప్రశ్నించడం, వారు అతనికి బదులివ్వడం‌ మనం చూస్తాం. కొందరు బైబిల్ విమర్శకులు ఇక్కడ ఆ మంత్రసానులు పలికిన మాటలను ఆధారం చేసుకుని వారు ఫరోకు అబద్ధాలు చెప్పినప్పటికీ "దేవుడు వారికి మేలు చేసాడని" దీనిప్రకారం బైబిల్ దేవుడు అబద్ధాలను ఆమోదిస్తాడని విమర్శిస్తుంటారు. దురదృష్టవశాత్తూ క్రైస్తవ్యంలో కూడా కొందరు అజ్ఞానులు అలాంటి బోధలు చేస్తుంటారు. కానీ ఇక్కడ ఆ మంత్రసానులు చెబుతున్నదానిలో ఎలాంటి అబద్ధం లేదు. ఎందుకంటే ఇశ్రాయేలీయుల స్త్రీలు అప్పటికే బానిసలుగా కఠినమైన పనులు చేస్తున్నారు కాబట్టి వారికి ప్రసవం సులభంగానే జరుగుతుంటుంది. ఇది శాస్త్రీయంగా నిరూపితమైన విషయం. పైగా వారు తింటున్న ఆహారం కూడా బలమైనది (నిర్గమకాండము 16:3, సంఖ్యాకాండము 11:5). అందువల్ల ఆ మంత్రసానులు వెళ్ళకముందే వారికి ప్రసవం జరిగిపోతుండవచ్చు. అందుకే వారు మేము ఆ పిల్లలను చంపలేకపోయామని‌ ఫరోకు బదులిస్తున్నారు.

అలాగైతే "ఆ మంత్రసానులు దేవునికి భయపడి మగపిల్లలను బ్రతకనిచ్చారని" ఎందుకు రాయబడిందనే ప్రశ్న ఇక్కడ తలెత్తవచ్చు. ఔను, ఆ మంత్రసానులు దేవునికి భయపడి మగపిల్లలను చంపకుండా వదిలెయ్యడమూ వాస్తవమే అలానే ఫరోతో చెబుతున్న మాటలు కూడా వాస్తవమే. ఎలాగంటే ఇశ్రాయేలీయుల స్త్రీలలో ఎవరైనా ప్రసనవేదన పడుతున్నప్పుడు వీరికి కబురు‌ పంపినా వీరికి ఎలాగూ ఆ స్త్రీల చురుకుతనం, శారీరక బలం గురించి తెలుసు కాబట్టి, ప్రసవం అయ్యేవరకూ అక్కడికి వెళ్ళకుండా ఆలస్యం చేస్తుండవచ్చు. ఆవిధంగా వీరు ఆలస్యంగా వెళ్ళేసరికి తల్లి స్పృహలో ఉంటుంది‌ కాబట్టి వీరు చంపాలి అనుకున్నా కూడా ఆ బిడ్డను చంపలేరు. ఎందుకంటే ఈ హత్యలు రహస్యంగా జరిగించాలన్నది ఫరో ఉద్దేశం. అలాంటి ఉద్దేశమే లేకపోతే తల్లులు స్పృహలో ఉన్న కారణాన్ని బట్టి శిశువులను చంపలేకపోతున్నామనే వారి వివరణను ఫరో అంగీకరించేవాడు కాదుగా?. ఈవిధంగా ఆ మంత్రసానులు దేవునికి భయపడి మగపిల్లలను‌ బ్రతకనివ్వడమూ (ఆలస్యంగా వెళ్ళడం ద్వారా) వాస్తవమే ఫరోకు చెబుతున్న మాటలు కూడా వాస్తవమే.

వాదన కోసం ఇదంతా ప్రక్కనపెట్టి, ఆ మంత్రసానులు ఫరోకు అబద్ధమే చెప్పారు అనుకున్నప్పటికీ అందులో దేవుణ్ణి‌ నిందించే అవకాశం ఎవ్వరికీ లేదు. ఎందుకంటే దేవుడు ఆ మంత్రసానులకు మేలు చేసింది "వారు ఆయనకు భయపడి ఇశ్రాయేలీయుల మగపిల్లలను చంపడానికి ప్రయత్నించలేదు" కాబట్టే తప్ప "ఫరోకు అబద్ధాలు చెప్పినందుకు కాదు". ఒకవేళ వారు అబద్ధమే చెప్పుంటే అది వారి వ్యక్తిగత నిర్ణయం. ఫరోకు అబద్ధం చెప్పి తప్పించుకోమని దేవుడేమీ వారికి బోధించలేదు. వారు చేసింది‌ మంచిపని అయినప్పడు ఎలాంటి మూల్యమైనా చెల్లించడానికి సిద్ధపడి నిజమే చెప్పవచ్చు.

నిర్గమకాండము 1:20,21 దేవుడు ఆ మంత్ర సానులకు మేలుచేసెను. ఆ జనము విస్తరించి మిక్కిలి ప్రబలెను. ఆ మంత్రసానులు దేవునికి భయపడినందున ఆయన వారికి వంశాభివృద్ధి కలుగజేసెను.

ఈ వచనాలలో దేవుడు‌ ఆ మంత్రసానులకు మేలు చేసినట్టు మనం చూస్తాం. మనుషులు దేవునిపట్ల‌ భయంతో దుష్టత్వానికి దూరంగా జీవిస్తున్నప్పుడు ఆయన తప్పకుండా వారికి ప్రతిఫలమిస్తాడని ఈ సందర్భం మనకు బోధిస్తుంది. కొన్నిసార్లు ఆ ప్రతిఫలం వీరి విషయంలో కనిపించినట్టు వెంటనే కనిపించకపోవచ్చు, అయినప్పటికీ ఆ ప్రతిఫలం మాత్రం తప్పకుండా తగినసమయంలో చేరువౌతుంది.

అదేవిధంగా ఆయన మంత్రసానులకు "వంశాభివృద్ధి" కలుగచేసాడు అన్నచోట ఇంగ్లీషు బాషలో Houses అని తర్జుమా చేసారు. దీనిఆధారంగా కొందరు బైబిల్ పండితులు దేవుడు వారికి గృహాలను కట్టించి ఇచ్చాడని బోధించారు. వాస్తవానికి అక్కడ హీబ్రూలో వాడబడిన పదానికి House అనే అర్థం కూడా ఉన్నప్పటికీ ఆ పదానికి Family అనే అర్థం కూడా వస్తుంది. కాబట్టి ఈ వచనాలను మనం సందర్భపరిధిలో పరిశీలించినప్పుడు తెలుగు తర్జుమాలో వాడబడిన "వంశాభివృద్ధి" అన్నపదమే సరైనదని అర్థమౌతుంది. వారు దేవునికి‌ భయపడ్డారు, అందువల్ల ఆయన ఇశ్రాయేలీయులతో పాటు వారి కుటుంబాలను కూడా విస్తరింపచేసాడు.

నిర్గమకాండము 1:22 అయితే ఫరో హెబ్రీయులలో పుట్టిన ప్రతి కుమారుని నదిలో పారవేయుడి, ప్రతి కుమార్తెను బ్రదుకనియ్యుడి అని తన జనులందరికి ఆజ్ఞాపించెను.

ఈ వచనంలో ఫరో ఇశ్రాయేలీయులకు మగపిల్లాడు పుడితే నదిలో‌ పారవెయ్యమని ఆదేశించడం‌ మనం చూస్తాం. పతనమైన మనిషి తన దుష్ట ఉద్దేశాలను నెరవేర్చుకోవడానికి తనకున్న అవకాశాలను బట్టి ఎంతటి క్రూరుడిగానైనా మారతాడని ఈ చర్య మనకు బోధిస్తుంది.

రోమీయులకు 3:14-18 వారి నోటినిండ శపించుటయు పగయు ఉన్నవి. రక్తము చిందించుటకు వారి పాదములు పరుగెత్తు చున్నవి. నాశనమును కష్టమును వారి మార్గములలో ఉన్నవి. శాంతి మార్గము వారెరుగరు. వారి కన్నుల యెదుట దేవుని భయము లేదు.

ఇశ్రాయేలీయుల మగపిల్లలను చంపమని ఫరో చేసిన ఈ ఆదేశం, అతని‌ మరణంతో కొద్దికాలంలోనే నిలచిపోయుంది. ఈ క్రూరమైన కార్యం అహరోను పుట్టిన కొంతకాలానికి ప్రారంభమై మోషే పుట్టిన కొంతకాలానికి నిలచిపోయుంది. లేకుంటే ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి‌ బయలువెళ్ళినప్పుడు వారిలో యుద్ధవీరులుగా బయలువెళ్ళిన పురుషులు ఆరులక్షలమందిగా ఉండేవారు కాదు.

 
 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.