పాత నిబంధన

రచయిత: కె విద్యా సాగర్

గ్ర‌ంథపరిచయం; 4:1, 4:2, 4:3,4, 4:5, 4:6,7, 4:8,9, 4:10, 4:11, 4:12, 4:13, 4:14, 4:15, 4:16,17, 4:18, 4:19, 4:20, 4:22,23, 4:24, 4:25,26, 4:27,28, 4:29-31

 నిర్గమకాండము 4:1 అందుకు మోషే చిత్తగించుము; వారు నన్ను నమ్మరు నా మాట వినరు యెహోవా నీకు ప్రత్యక్షము కాలేదందురు అని ఉత్తరమియ్యగా-

గత అధ్యాయం నుండి దేవునికీ మోషేకూ మధ్య జరుగుతున్న సంబాషణకు కొనసాగింపునే ఈ అధ్యాయంలో మనం చూస్తాం. ఆ క్రమంలో ఐగుప్తుకు వెళ్ళమన్న దేవునిమాటలకు ప్రతిస్పందనగా మోషే ఇలా ప్రత్యుత్తరమిస్తున్నాడు. అయితే అతను గత అధ్యాయం 18వ వచనంలో "వారు నీమాట విందురు" అనే దేవుని మాటకు విరుద్ధంగా ఇలా ప్రత్యుత్తరమివ్వట్లేదు. ఎందుకంటే అక్కడ దేవుడు "వారు నీమాట విందురు" అన్నప్పుడు "మోషే వారిదగ్గరకు వెళ్ళి దేవుడు చెయ్యమన్న సూచకక్రియలను చేసాక జరిగేదాని గురించి చెబుతున్నాడు". అప్పుడు మాత్రమే ప్రజల పెద్దలు మోషే మాటలు నమ్మి ఫరో వద్దకు వెళ్ళారు (నిర్గమకాండము 4:30).

కాబట్టి మోషే దేవునికి‌ ఇలాంటి ప్రత్యుత్తరమివ్వడంలో అతనికి దేవునిమాటల పట్ల ఎలాంటి అవిశ్వాసం లేదు కానీ ఆ ప్రజలవైఖరిని బట్టే అలా మాట్లాడవలసి‌వచ్చింది. ఎందుకంటే గతంలోనే వారు మోషే విషయంలో అభ్యంతరపడి అతనిని తిరస్కరించినట్టు మనం చూసాం (అపో.కార్యములు 7:35). ఒకవేళ మోషే దేవునితో ఇలాంటి సంభాషణ జరపకుండా ఆ ప్రజల‌ వద్దకు వెళ్ళి, దేవుడు సెలవిచ్చిన మాటలు వారికి తెలియచేసినప్పటికీ వారు నమ్మకపోవుదురు. గమనించండి; కొందరు భావిస్తున్నట్టుగా మోషే దేవుడు చెప్పిన పని నుండి తప్పించుకోవడానికే ఈవిధంగా సాకులు చెబుతుంటే దేవుడు దానిని తీవ్రంగా ఖండించును. కానీ ఆయన మోషేకు సానుకూలంగా సమాధానం ఇస్తూ సూచకక్రియలను కూడా అనుగ్రహిస్తున్నాడు. దీనిగురించి క్రింది వచనాలలో కూడా మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం.

నిర్గమకాండము 4:2 యెహోవా నీ చేతిలోనిది ఏమిటి అని అతని నడిగెను. అందుకతడు కఱ్ఱ అనెను.

ఈ వచనంలో దేవుడు మోషే చేతిలోని కఱ్ఱ గురించి ప్రశ్నించడం దానికి మోషే బదులివ్వడం మనం చూస్తాం. ఇక్కడ దేవునికి మోషే చేతిలో ఉన్నది ఏంటో తెలియక అలా ప్రశ్నించడం లేదు కానీ ఆయన త‌న ప్రత్యక్షతలలో భక్తుల దృష్టిని కొన్ని వస్తువులపైకి మళ్ళించి, వాటిద్వారా ఒక ప్రత్యేకమైన సందేశం ఇవ్వడానికి అలా ప్రశ్నించడం సాధారణం (యిర్మియా 1:11,13, ఆమోసు 7:8, 8:2, జెకర్యా 4:2, జెకర్యా 5:2).

మోషే అరణ్యంలో మందలను కాస్తున్నాడు కాబట్టి, కాపరుల చేతిలో కఱ్ఱ ఉండడం సహజం. దానిని కోల అని కూడా అంటారు (లేవీకాండము 27:32). భక్తుడైన దావీదు ఒక సందర్భంలో దేవునిని తన కాపరిగా వర్ణిస్తూ "నీ దుడ్డుకఱ్ఱయూ నీదండమునూ నన్ను ఆదరించును" అని పలుకుతాడు (కీర్తనలు 23:4). ఎందుకంటే కాపరి చేతిలోని ఒకే కఱ్ఱ క్రూరజంతువుల భారినుండి మందను కాపాడేటప్పుడు దుడ్డుకఱ్ఱగా దారితప్పిన మందను శిక్షించి సరైనమార్గంలో నడిపించేటప్పుడు దండముగా ఇలా రెండు కార్యాలనూ జరిగిస్తుంది. అందుకే దావీడు "నీదుడ్డుకఱ్ఱయూ నీదండమునూ నన్ను ఆదరించును అని పలుకుతూ దేవుడు తనను శత్రువులనుండి కాపాడేవాడు మాత్రమే కాదనీ దారితప్పినప్పుడు శిక్షించి సరిచేసేవాడని కూడా సాక్ష్యమిస్తున్నాడు.

నిర్గమకాండము 4:3,4 అప్పుడాయన నేలను దాని పడవేయుమనెను. అతడు దాని నేల పడవేయగానే అది పామాయెను. మోషే దానినుండి పారిపోయెను. అప్పుడు యెహోవానీ చెయ్యి చాపి దాని తోక పట్టుకొనుమనగా, అతడు తన చెయ్యి చాపి దాని పట్టు కొనగానే అది అతని చేతిలో కఱ్ఱ ఆయెను.

ఈ వచనంలో దేవుడు, తన చేతిలోని కఱ్ఱ ద్వారా మోషేకు ఒక సూచన అనుగ్రహించడం మనం చూస్తాం. ఆయన తన భక్తులద్వారా చేయించిన అద్భుతాలలో ఇది మొదటిది. దీనికి కారణమేంటో క్రింది వచనంలో చూద్దాం. అయితే ఇక్కడ దేవుడు మోషేకు ఆ కఱ్ఱ పాములా కనిపించేలా కనికట్టు చెయ్యలేదు. నిజంగానే ఆయన జీవం లేని ఆ కఱ్ఱను పాముగా ఆ పామును మరలా కఱ్ఱగా మార్చాడు. సృష్టికర్తగా ఇది ఆయనకు సాధ్యమే. కచ్చితంగా చెప్పాలంటే ఇలాంటి అద్భుతం ఆయనకు మాత్రమే సాధ్యం (ఐగుప్తీయులు కూడా ఇలా చేసారుగా అనే ప్రశ్నకు ఆ సందర్భంలో సమాధానం చూద్దాం).

అదేవిధంగా ఇక్కడ మోషే ఆ పామును చూసి పారిపోయినట్టు మనం చూస్తున్నాం‌. కానీ వెంటనే దేవుడు ఆ పాము తోకను పట్టుకోమని ఆజ్ఞాపించినప్పుడు అతను ఆయన ఆజ్ఞకు లోబడి దాని తోకను పట్టుకున్నాడు. ఇక్కడ మోషేలో దేవునిపట్ల ఉన్నటువంటి విశ్వాసం, ఆయన ఆజ్ఞలను పాటించే విధేయత మరోసారి బహిర్గతమౌతున్నాయి. అందుకే అతను దేవుడు ఆజ్ఞాపించగానే అప్పటివరకూ తాను భయపడి పారిపోయిన పాము తోకను పట్టుకోవడానికి వెనుకాడలేదు. దీనిని బట్టి మన మనసులో ఎలాంటి భయాలు కలుగుతున్నప్పటికీ ఆ భయాల కారణంగా దేవుని ఆజ్ఞలను త్రోసిపుచ్చేవారంగా ఉండకూడదు. దేనికో ఎవరికో భయపడి దేవుని పరిచర్య విషయంలో వెనుకడుగు వెయ్యకూడదు.

నిర్గమకాండము 4:5 ఆయనదానిచేత వారు తమ పితరుల దేవుడైన యెహోవా, అనగా అబ్రాహాము దేవుడు ఇస్సాకు దేవుడు యాకోబు దేవుడు నీకు ప్రత్యక్ష మాయెనని నమ్ముదురనెను.

ఈ వచనంలో దేవుడు మోషేకు ఆ అద్భుతాన్ని అతను ఇశ్రాయేలీయుల మధ్య చెయ్యడం ద్వారా వారు అతన్ని నమ్ముతారని భరోసా కల్పించడం మనం చూస్తాం. ఇక్కడ మనం చాలా స్పష్టంగా "దేవుడు అద్భుతాలను చెయ్యడం వెనుకున్న కారణాన్ని గమనించగలం". ఎందుకంటే ఇప్పుడు ఆయన మోషేను ఇశ్రాయేలీయుల వద్దకు వెళ్ళి, ఆయన చెప్పిన మాటలను ప్రకటించమంటున్నాడు. కానీ వారు ఆ మాటలు ఊరికే చెబితే నమ్మరు కాబట్టి అవి దేవుని మాటలే అని వారు విశ్వసించేలా ఈ అద్భుతాలను రుజువులుగా చేయిస్తున్నాడు. ఈవిధంగా పాతనిబంధనలో అయినా సరే క్రొత్త నిబంధనలో అయినా సరే దేవుడు ప్రవక్తల ద్వారా అపోస్తలుల ద్వారా అద్భుతాలను చేయించింది, ఆయన ప్రత్యక్షతనూ ఆయన మాటలనూ దృఢపరచడానికి మాత్రమే.

ఉదాహరణకు;
1 రాజులు 18:36 అస్తమయ నైవేద్యము అర్పించు సమయమున ప్రవక్తయగు ఏలీయా దగ్గరకు వచ్చి యీలాగు ప్రార్థనచేసెను-యెహోవా, అబ్రాహాము ఇస్సాకు ఇశ్రాయేలుల దేవా, "ఇశ్రాయేలీయుల మధ్య నీవు దేవుడవై యున్నావనియు, నేను నీ సేవకుడనై యున్నాననియు, ఈ కార్యములన్నియు నీ సెలవు చేత చేసితిననియు" ఈ దినమున కనుపరచుము.

ఈ సందర్భంలో ఏలియా ప్రార్థనచేస్తూ తాను దేవుని ప్రవక్తను అనీ తాను పలికినవన్నీ ఆయన‌ మాటలే అని ప్రజలు విశ్వసించడానికి రుజువుగా ఆయనను అద్భుతం చెయ్యమని వేడుకుంటున్నాడు. దేవుడు అలానే చేసి, ఏలియా పలికిన మాటలన్నీ తన మాటలే అని ఇశ్రాయేలీయులకు దృఢపరిచాడు.

యోహాను 5:36 అయితే యోహాను సాక్ష్యముకంటె నాకెక్కువైన సాక్ష్యము కలదు; అదేమనిన, నేను నెరవేర్చుటకై తండ్రి యే క్రియలను నా కిచ్చియున్నాడో, నేను చేయుచున్న ఆ క్రియలే తండ్రి నన్ను పంపియున్నాడాని నన్నుగూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి.

ఈ సందర్భంలో యేసుక్రీస్తు ప్రభువు అద్భుతాలను (క్రియలు) చేసింది, తనను దేవుడు పంపాడడనడానికి సాక్ష్యంగానే అని చెప్పడం మనం చూస్తున్నాం.

మార్కు 16:20 వారు బయలుదేరి వాక్యమంతట ప్రకటించిరి. ప్రభువు వారికి సహకారుడైయుండి, వెనువెంట జరుగుచువచ్చిన "సూచక క్రియలవలన వాక్యమును స్థిరపరచుచుండెను". ఆమేన్‌.

ఈ సందర్భంలో అపోస్తలులు వాక్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు, వారి చేత చెయ్యబడుతున్న అద్భుతాల ద్వారా ఆ వాక్యం స్థిరపరచబడుతున్నట్టు మనం చూస్తున్నాం. కాబట్టి ఏకాలంలోనైనా సరే భక్తులకు లభించిన దేవుని ప్రత్యక్షతనూ వారి మాటలనూ ప్రజలు విశ్వసించడానికి మాత్రమే అద్భుతాలు చెయ్యబడ్డాయి.

ఈ కారణం‌చేత దేవుని ప్రత్యక్షత ఎప్పుడైతే సంపూర్తి చెయ్యబడి పూర్తి వాక్యం (బైబిల్) మన చేతికి వచ్చిందో దానికి మరేదీ చేర్చకూడదనే ఆదేశం ఇవ్వబడిందో (ప్రకటన 22:18) అప్పుడే అద్భుతాల ఉద్దేశం నెరవేరిపోయింది. అందువల్ల ఎవరైనా సరే "ఇప్పటికే దృఢపరచబడిన" వాక్యాన్ని బట్టి (హెబ్రీ 2:3,4) ఆయనను విశ్వసించాలి తప్ప, దానికి మరలా కొత్త అద్భుతాలకోసం ఎదురుచూడకూడదు. హెబ్రీపత్రికలో ఈ మాటలు స్పష్టంగా రాయబడ్డాయి. "దేవుడు తన చిత్తానుసారముగా సూచకక్రియలచేతను, మహత్కార్య ములచేతను, నానావిధములైన అద్భుతములచేతను, వివిధము లైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించుటచేతను, వారితో కూడ సాక్ష్యమిచ్చుచుండగా వినినవారిచేత మనకు దృఢ పరచబడెను" (హెబ్రీ 2:3,4). అందుకే నేటికీ కొందరు దుర్బోధకులు అద్భుతాల పేరిట, గారడీ విద్యలనూ బుటకపు స్వస్థతలనూ చేస్తున్నారు తప్ప, బైబిల్ లో జరిగిన అద్భుతాలవంటి అద్భుతాలను చెయ్యలేకపోతున్నారు. ఉదాహరణకు; ఏలియా దింపినట్టుగా ఎందుకు అగ్నిని దింపలేకపోతున్నారు?యేసుక్రీస్తు లేపినట్టుగా చనిపోయినవారిని ఎందుకు లేపలేకపోతున్నారు? అపోస్తలులు చేసినట్టుగా పుట్టు కుంటివారిని ఎందుకు నడిపించలేకపోతున్నారు? ఎందుకంటే వాటిని దేవుడు తన భక్తులచేత ఎందుకు చేయించాడో ఆ కార్యం (వాక్యాన్ని స్థిరపరచడం) నెరవేరిపోయాక అలాంటి సామర్థ్యాన్ని ఇక ఆయన మరెవరికీ‌ ఇవ్వడు. గమనించండి; ఇక్కడ నేను దేవుడు అద్భుతాలను చెయ్యడు అనట్లేదు, ఆయన చిత్తానుసారంగా ఆయన ఏదైనా చెయ్యగలడు. అయితే ఆ కాలంలో ప్రవక్తలకూ అపోస్తలులకూ అనుగ్రహించినట్టుగా అద్భుతాలు చేసే శక్తిని ప్రస్తుతం ఆయన ఎవరికీ అనుగ్రహించడు అని మాత్రమే చెబుతున్నాను. కారణం వాక్యప్రత్యక్షత నిలిచిపోయింది.

అదేవిధంగా క్రైస్తవసమాజంలో చాలామంది బోధకులు మేము దేవుణ్ణి చూసామంటూ దేవుడు తమకు ప్రత్యక్షమై‌ ఏదో‌ బయలుపరిచాడంటూ మాయమాటలు చెబుతుంటారు. కానీ దేవుడు తన ప్రత్యక్షతలకూ తన మాటలకూ రుజువుగా ఉంచిన అద్భుతాలను మాత్రం చెయ్యలేరు. ఎందుకంటే పైన చెప్పినట్టుగా దేవుడు భక్తులకు ప్రత్యక్షమైంది తన వాక్కును తెలియచెయ్యడానికైతే అద్భుతాలను చేసింది ఆ వాక్కును స్థిరపరచడానికి మాత్రమే. ఎప్పుడైతే వాక్యం స్థిరపరచబడి మన‌చేతికి వచ్చిందో దానికి కారణమైన ప్రత్యక్షతలను మరలా అనుగ్రహించి, అద్భుతాల‌ను జరిగించవలసిన అవసరం ఇక లేదు. అందుకే ఎవరెవరో మాకు దేవుని ప్రత్యక్షత వచ్చిందని ప్రగల్భాలు పలుకుతున్నప్పటికీ వాటిని విశ్వసించేలా ఎలాంటి రుజువులనూ‌ చూపించడం‌ లేదు.

నిర్గమకాండము 4:6,7 మరియు యెహోవానీ చెయ్యి నీ రొమ్మున ఉంచుకొను మనగా, అతడు తన చెయ్యి రొమ్మున ఉంచుకొని దాని వెలుపలికి తీసినప్పుడు ఆ చెయ్యి కుష్ఠముగలదై హిమమువలె తెల్లగా ఆయెను. తరువాత ఆయననీ చెయ్యి మరల నీ రొమ్మున ఉంచుకొనుమనగా, అతడు తన చెయ్యి మరల తన రొమ్మున ఉంచుకొని తన రొమ్మునుండి వెలుపలికి తీసినప్పుడు అది అతని మిగిలిన శరీరమువలె ఆయెను.

ఈ వచనంలో దేవుడు మరొక అద్భుతం ద్వారా మోషే చేతికి కుష్టురోగం రప్పించడం, మరలా ఆ చెయ్యిని రొమ్ముపై పెట్టి వెనుకకు తీసినప్పుడు దానిని బాగు చెయ్యడం మనం చూస్తున్నాం. ఈ అద్భుతం భవిష్యత్తులో మోషే ఐగుప్తుపై రప్పించబోయే తెగుళ్ళను కూడా సూచిస్తుంది. ఇక్కడ మోషే తన చేతిని మరలా రొమ్ముపై ఉంచుకుని వెనుకకు తీయగానే ఆ చేతికున్న కుష్టురోగం బాగుపడినట్టు, ఐగుప్తుపై కుమ్మరించబడిన తెగుళ్ళ విషయంలో కూడా అతను ప్రార్థన చెయ్యగానే విడుదల కలిగేది.

నిర్గమకాండము 4:8,9 మరియు ఆయనవారు నిన్ను నమ్మక, మొదటి సూచననుబట్టి వినకపోయిన యెడల రెండవ దానిబట్టి విందురు. వారు ఈ రెండు సూచనలనుబట్టి నమ్మక నీమాట వినకపోయిన యెడల నీవు కొంచెము ఏటి నీళ్లు తీసి యెండిన నేలమీద పోయవలెను. అప్పుడు నీవు ఏటిలోనుండి తీసిన నీళ్లు పొడినేలమీద రక్తమగుననెను.

ఈ వచనాలలో దేవుడు మోషేకు రెండు అద్భుతాలు చూపించిన తర్వాత, ఇశ్రాయేలీయులు ఆ రెండింటిని బట్టీ నమ్మకపోతే ఏటి నీళ్ళు రక్తంగా మార్చబడే మరో అద్భుతం చెయ్యమనడం మనం చూస్తాం. ఇక్కడ దేవునికి తన ప్రజలపట్ల ఉండే ఓర్పు మనకు కనిపిస్తుంది. ఆయన మోషేను పంపాను‌ అనడానికి రుజువుగా ఏదో ఒక అద్భుతం చేసి వదిలెయ్యడం‌ లేదు. ఎందుకంటే ఒక్క అద్భుతాన్ని ప్రజలందరూ నమ్మకపోవచ్చు. ఈ కారణంగా ఆయన ఇశ్రాయేలీయుల ప్రజల్లో మొదటి అద్భుతాన్ని బట్టి నమ్మని ప్రజలు కూడా నమ్మగలిగేలా మరో రెండు అద్భుతాలు కూడా చెయ్యమంటున్నాడు. ఇక్కడ దేవుడు ఆ ప్రజలు మొదటి అద్భుతాన్ని బట్టి మోషేను నమ్ముతారో లేదో అనే సంశయంతో "నిన్ను నమ్మక, మొదటి సూచననుబట్టి వినకపోయిన యెడల" అనడం‌లేదు కానీ మోషేకు ఇశ్రాయేలీయులందరూ తనను తప్పక నమ్ముతారనే నిశ్చయత కలుగచెయ్యడానికే ఈవిధంగా పలికి మరో రెండు అద్భుతాలను కూడా చెయ్యమంటున్నాడు.

నిర్గమకాండము 4:10 అప్పుడు మోషే ప్రభువా, ఇంతకు మునుపైనను, నీవు నీ దాసునితో మాటలాడి నప్పటినుండి యైనను, నేను మాట నేర్పరిని కాను, నేను నోటి మాంద్యము నాలుక మాంద్యము గలవాడనని యెహోవాతో చెప్పగా-

ఈ వచనంలో‌ మోషే తన లోపాలను దేవునిముందు ప్రస్తావించడం మనం చూస్తాం. చాలామంది ఇక్కడ మోషే పలికిన "నేను మాట నేర్పరిని కాను" అనే మాటలను "మోషే ఐగుప్తీయుల సకల విద్యలనూ అభ్యసించి‌ మాటలయందు ప్రవీణుడైయుండెను" ( అపో.కార్యములు 7:22) అనే మాటలతో పోల్చి, మోషే ఇక్కడ తప్పించుకోవడానికే అలా అబద్ధాలు చెబుతున్నాడు తప్ప అతనిలో ఎలాంటి లోపం లేదని బోధిస్తుంటారు. కానీ నేను పైన జ్ఞాపకం‌ చేసినట్టుగా ఇక్కడ మోషే తప్పించుకోవడానికే ఇలాంటి అబద్ధాలు చెబుతుంటే దేవుడు దానిని తీవ్రంగా పరిగణించి, నువ్వు అబద్ధం చెబుతున్నావని గద్దించేవాడు. కానీ క్రింది వచనాల్లో ఆయన మోషేను బలపరిచే మాటలు మాట్లాడుతున్నాడు.

అలాగని మోషే గురించి స్తెఫను చెబుతున్నమాటలు కూడా అవాస్తవాలు కావు. అక్కడ మోషే "మాటలయందు‌ ప్రవీణుడు" అంటే అతను స్పష్టంగా మాట్లాడగలడని కాదు కానీ అతను‌ ఎలాంటి సమస్యకైనా తన మాటలద్వారా మంచి పరిష్కారాన్ని చూపించగల ప్రావీణ్యతగలవాడని అర్థం. ఒక్కమాటలో చెప్పాలంటే అతను జ్ఞానయుక్తంగా మాట్లాడగలడు. అయితే అతను ఆ మాటలు అందరికీ అర్థమయ్యేలా స్పష్టంగా మాట్లాడలేడు. ఎందుకంటే కొందరు తెలివిగా మాట్లాడగలరు కానీ అందరికీ అర్థమయ్యేవిధంగా మాట్లాడలేరు. పైగా మోషేకు నోటిమాంద్యం, నాలుకమాంద్యం (నత్తి) కూడా ఉన్నాయి. దీనిగురించి మనం పౌలును కూడా ఉదాహరణగా తీసుకోవచ్చు (2 కొరింథీ 10:10). కాబట్టి మోషే దేవుడు చెయ్యమంటున్న కార్యం నుండి తప్పించుకోవడానికే అలా అబద్ధాలు చెప్పాడని అతనిపై ఆరోపణలు చెయ్యడం సరికాదు. దానికి ప్రతిగా మనందరమూ మోషే యొక్క తగ్గింపును బట్టి ఎంతో నేర్చుకోవాలి. ఎందుకంటే అతను దేవుడు తనను చెయ్యమంటుంది శక్తివంతమైన కార్యం కాబట్టి తనలో ఉన్న లోపాల కారణంగా దానిని సక్రమంగా చెయ్యలేనని గుర్తించి ఆయనముందు‌ ప్రాధేయపడుతున్నాడు. లక్షలమంది ప్రజలను నడిపించే మహా గొప్పభాగ్యం దక్కింది దీనివల్ల నాకు కూడా ఎంతో ఘనత కలుగుతుందని సంబరపడడం లేదు. కాబట్టి మనం కూడా మోషేలా దేవునికార్యాల‌ విషయంలో మన లోపాలను బలహీనతలను బట్టి తగ్గించుకునేవారంగా ఉండాలి.‌ అప్పుడు ఆయన మోషేకు‌ సూచించినవిధంగా మనకు కూడా తగిన పరిష్కారాన్ని సూచిస్తాడు (12వ వచనం).

అదేవిధంగా ఇక్కడ మోషే "నీవు నీ దాసునితో మాటలాడి నప్పటినుండియైనను, నేను మాట నేర్పరిని కాను" అని పలకడం‌ వెనుక దేవుడు తనతో మాట్లాడుతున్నప్పుడు, అతనిద్వారా అద్భుతాలను చేయిస్తున్నప్పుడు తనలో‌ ఉన్న ఆ నోటిమాంద్యం, నాలుకమాంద్యం‌ కూడా స్వస్థపరచబడుతుందని అనుకుని ఉండవచ్చు. అందుకే "నీవు నీ దాసునితో మాటలాడినప్పటి నుండియైనను" అని ప్రత్యేకంగా దేవుడు తనతో మాట్లాడుతున్న ఆ సమయం గురించి ప్రస్తావిస్తున్నాడు. కానీ దేవుడు అది మాత్రం చెయ్యడం లేదు. కాబట్టి మనం అనుకునే విధానంలో ఆయన అన్నీ పరిష్కరించడు. ఆయన చిత్తానుసారంగానే అన్నిటినీ జరిగిస్తాడు. లేని కుష్టురోగం కలుగచేసి, మరలా దానిని స్వస్థపరచిన ఆయనకు మోషేకు ఉన్న నోటి, నాలుక మాంద్యాలను తీసివెయ్యడం పెద్ద విషయమేమీ కాదు కదా!. కానీ ఇక్కడ అలా చెయ్యలేదు.

నిర్గమకాండము 4:11 యెహోవా మానవునకు నోరిచ్చినవాడు ఎవడు? మూగ వానినేగాని చెవిటివానినేగాని దృష్టిగలవానినేగాని గ్రుడ్డి వానినేగాని పుట్టించినవాడెవడు? యెహోవానైన నేనే గదా.

ఈవచనంలో దేవుడు మోషే అభ్యంతరానికి జవాబుగా అంగవైకల్యం ఉన్నవారిని తానే పుట్టిస్తున్నట్టు తెలియచెయ్యడం మనం చూస్తాం. కాబట్టి ఒక వ్యక్తి జీవితంలో అంగవైకల్యం అనేది దేవుని అనుమతితోనే ప్రవేశిస్తుంది. ఈ కారణంగా అలాంటి లోపాలను మనం సాతానుకు ఆపాదించకూడదు. ఎందుకంటే దేవుడు అనుమతించిన ఈ శారీరక లోపాలలో మనకు గొప్ప ఆదరణ ఉంది. మన శరీరంలో ఉన్న ఏలోపమైనా ఆయన అనుమతినే సూచిస్తుంది. కాబట్టి మనం అలాంటి లోపాలను సాతానుకు ఆపాదించి, మనంతట మనంగా దేవుడు ఇస్తున్న ఆదరణను కోల్పోకూడదు. దేవుడు తన చిత్తానుసారంగా మానవుల ఆయుష్షులో హెచ్చుతగ్గులు పెట్టినట్టే అవయవాల విషయంలో కూడా ఇలాంటి వైకల్యాలను పెట్టాడు.

అయితే కొందరు దీనివల్ల దేవుడు వారికి అన్యాయం‌ చేసాడని నిందిస్తుంటారు. కానీ సృష్టికర్త అయిన దేవునికి తన సృష్టి విషయంలో ఒక చిత్తం‌ ఉంటుంది. ఆయన దానిని అనుసరించే సమస్తాన్ని జరిగిస్తాడు. ఒకవేళ ఆయనకంటూ ఒక చిత్తం లేకుండా మానవులు కొలిచే న్యాయ అన్యాయాలను బట్టి ప్రవర్తిస్తుంటే అప్పుడు ఆయన సార్వభౌముడు, సర్వాధికారి అనడంలో అర్థమే లేదు. ఇందువల్ల ఎవరైనా దేవునికి సంబంధించిన విషయాలను ప్రశ్నిస్తున్నప్పుడు ఆయన పరిధిలోకి వెళ్ళి ప్రశ్నించాలి.

కాబట్టి ఒక వ్యక్తి జీవితంలోకి దేవుడు తన చిత్తప్రకారమే అంగవైకల్యాన్ని అనుమతించాడని, ఆ అధికారం ఆయనకు ఉందని మనం గుర్తించాలి. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు "ఆయన శిష్యులు బోధకుడా, వీడు గ్రుడ్డివాడై పుట్టుటకు ఎవడు పాపము చేసెను? వీడా, వీని కన్నవారా? అని ఆయనను అడుగగా యేసు వీడైనను వీని కన్నవారైనను పాపము చేయలేదు గాని, దేవుని క్రియలు వీనియందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గ్రుడ్డివాడుగా పుట్టెను." (యోహాను 9:2,3) అని సాక్ష్యమిచ్చాడు.

ఈరోజు అన్ని అవయవాలు సరిగా ఉన్నవారు చెయ్యలేని పనులెన్నో అంగవైకల్యం గలవారు చేస్తున్నారు. ముఖ్యంగా ఎంతోమంది తమకున్న వైకల్యాలను‌ అధిగమించి, దేవునికొరకు ప్రయాసపడుతున్నారు. అందువల్ల వీరందరూ తీర్పుదినాన అన్ని అవయవాలు సరిగా ఉండి సోమరులుగా బ్రతుకుతున్నవారిపై తీర్పరులుగా ఉండబోతున్నారు. దేవుడు ఇలాంటి కారణంతో కూడా కొందరి జీవితంలో అంగవైకల్యాన్ని అనుమతించాడని మనం నిస్సందేహంగా భావించవచ్చు.

అదేవిధంగా దేవుడు కొందరిని‌ అంగవైకల్యంతో పుట్టించి, వారిని అలా విడిచిపెట్టెయ్యలేదు. అందుకే మోషే‌ ధర్మశాస్త్రంలో వీరివిషయంలో హెచ్చరికలు చెయ్యబడడం మనం చూస్తాం (లేవీయకాండము 19: 14). అంతేకాకుండా పాతనిబంధన దేవాలయంలో సేవచేసే యాజకుల విషయంలో కూడా వీరిని మినహాయించి, వీరిపై కష్టతరమైన భారం మోపబడకుండా విశ్రాంతిని అనుగ్రహించాడు. ఇదంతా కూడా దేవుడు వారిపై చూపిస్తున్న ఆదరణను మనకు తెలియచేస్తుంది. పై వాక్యభాగంలో "నీ దేవునికి భయపడవలెను" అనేమాటలు వారి విషయంలో మన‌ బాధ్యతను కూడా గుర్తుచేస్తున్నాయి.

నిర్గమకాండము 4:12 కాబట్టి వెళ్లుము, నేను నీ నోటికి తోడైయుండి, నీవు ఏమి పలుకవలసినది నీకు బోధించెదనని అతనితో చెప్పెను.

ఈ వచనంలో దేవుడు మోషే అభ్యంతరానికి పరిష్కారం సూచిస్తూ నేను నీకు తోడైయుంటానని చెప్పడం మనం చూస్తాం. కాబట్టి నేను పైన జ్ఞాపకం చేసినట్టుగా దేవుడు మనం ఊహించిన, కోరుకున్న విధానంలో మన‌లోపాలకు పరిష్కారం చూపించకపోవచ్చు కానీ ఆయన‌ పనికి ఎలాంటి ఆటంకం కలగకుండా మాత్రం ఆయన తోడైయుంటాడు. ఆ పని విషయంలో కావలసిన సామర్థ్యాన్ని ఆయనే అనుగ్రహిస్తాడు. పౌలు విషయంలో కూడా మనం ఇలాంటి పరిస్థితినే గమనిస్తాం (2 కొరింథీ 12:7-9).

నిర్గమకాండము 4:13 అందుకతడు అయ్యో ప్రభువా, నీవు పంప తలంచిన వానినే పంపుమనగా-

ఈ వచనంలో మోషే అప్పటివరకూ అతను లేవనెత్తిన అభ్యంతరాలకూ తన సామర్థ్యలేమికీ దేవుడు తగిన పరిష్కారాలను చూపించినప్పటికీ ఇంకా ఆ దైవకార్యానికి తాను అనర్హుడనని చింతిస్తూ "నీవు పంప తలంచిన వానినే పంపమని" పలకడం మనం చూస్తాం. దీనివల్ల మోషే దేవునికి కోపం రేపినట్టుగా క్రింది వచనంలో గమనిస్తాం. ఎందుకంటే మనకున్న సామర్థ్యలేమి, లోపాలను గురించిన ఆందోళన దేవునిముందు మనల్ని మనం తగ్గించుకునేలా చెయ్యాలే తప్ప, ఆయన మనకు అప్పగించిన బాధ్యతలనుండి తప్పించేవిధంగా ఉండకూడదు. ఎందుకంటే మనం‌ ఆయనముందు మనకున్న లోపాలను బట్టి, సామర్థ్యలేమిని బట్టి తగ్గించుకునేది "నా స్వంత శక్తి చేత ఏమీ చెయ్యలేను, నీ కార్యాన్ని జరిగించడానికి‌ తగిన సామర్థ్యం నీవే అనుగ్రహించమని" వేడుకోవడానికి, ఆ కార్యం విజయవంతమైనప్పుడు సమస్త మహిమ ఘనతలను ఆయనకే ఆపాదించడానికి తప్ప ఆయన పనినుండి మినహాయించబడడానికి కాకూడదు. కాబట్టి దేవునిముందు తగ్గింపు కలిగియుండడానికీ ఆ తగ్గింపు మనల్ని ఆయనపని నుండి వైదొలగిపోయేలా చెయ్యడానికి మధ్య ఉన్న వ్యత్యాసం‌ గమనించాలి. మొదటిదానిని మనం అన్వయించుకోవాలి, రెండవదానిని జయించగలగాలి.

కొందరు యూదా పండితులు మోషే ఇక్కడ మెస్సీయను పంపమని వేడుకుంటున్నాడని వ్యాఖ్యానించారు. ఎందుకంటే మెస్సీయను గురించిన అవగాహన ఇశ్రాయేలీయులకు మొదటి నుండీ ఉంది. ఇందువల్ల యోసేపు నిశ్చయముగా దేవుడు మిమ్మును‌ చూడవచ్చును అని భవిష్యత్తును ప్రవచించినప్పుడు (ఆదికాండము 50:24) వారు మెస్సీయ దిగివచ్చి వారిని‌ ఐగుప్తునుండి విడిపిస్తాడని భావించియుండవచ్చు‌.

నిర్గమకాండము 4:14 ఆయన మోషేమీద కోపపడిలేవీయుడగు నీ అన్నయైన అహరోను లేడా? అతడు బాగుగా మాటలాడగలడని నేనెరుగుదును, ఇదిగో అతడు నిన్ను ఎదుర్కొనవచ్చుచున్నాడు, అతడు నిన్ను చూచి తన హృదయమందు సంతోషించును.

ఈ వచనంలో మోషే పలికినమాటలను బట్టి దేవుడు అతనిపై కోపపడడం, అహరోను గురించి ప్రస్తావించడం మనం చూస్తాం. మొదటినుండీ చెబుతున్నట్టుగా మోషే తనలో ఉన్న సామర్థ్యలేమి, లోపాలను‌ దృష్టిలో‌ పెట్టుకుని దేవుడు తనను చెయ్యమంటున్న కార్యానికి తాను అనర్హుడనని అలా మాట్లాడుతున్నాడు తప్ప, దేవునిమాటలకు విముఖత చూపాలనే‌ ఉద్దేశం అతనిలో‌ లేదు. అయితే అతను లేవనెత్తిన ప్రతీ అభ్యంతరానికీ దేవుడు పరిష్కారం చూపించినా కూడా అతను ఇంకా తనలో ఉన్న లోపాలు, సామర్థ్యలేమి గురించే ఆలోచించి "అయ్యో ప్రభువా, నీవు పంప తలంచిన వానినే పంపమని"‌ ప్రాధేయపడడాన్ని బట్టి దేవుడు అతనిపై కోపపడ్డాడు. కానీ ఆ కోపాన్ని బట్టి ఆయన మోషేను తన సన్నిధినుండి‌ వెలివెయ్యలేదు, శిక్షించనూ లేదు కానీ మరో సూచనగా అహరోనును అనుగ్రహిస్తున్నాడు. కాబట్టి దేవునిలో కలిగే కోపం గురించి మనం రెండు విషయాలు నేర్చుకోవాలి. ఒకటి మనం‌ ఆయనకు అవిధేయత చూపే ఉద్దేశం లేనప్పటికీ ఆయన పని విషయంలో మనకున్న ఆందోళనలను బట్టి వెనుకడుగు వేస్తున్నప్పుడు మనల్ని ఆ పనివైపు నడిపించే కోపం‌. రెండు ఆయన ఆజ్ఞలకు అవిధేయులుగా ప్రవర్తిస్తున్నప్పుడు క్రమశిక్షణ చేసే ‌కోపం.

అదేవిధంగా దేవుడు ఇక్కడ అహరోనును మోషేకు సహాయంగా పంపడాన్ని బట్టి, మోషే దేవునిముందు అభ్యంతరాలను లేవనెత్తినందుకే అహరోనును రంగంలోకి దించాడని, మోషే ఆ విధంగా చెయ్యకుండా ఉండుంటే యాజకత్వం కూడా అతనికే దక్కేదని, ఈవిధంగా మోషే దేవునిముందు తప్పించుకోవాలని ప్రయత్నించడాన్ని బట్టి యాజకత్వాన్ని‌ కోల్పోయాడని భావిస్తుంటారు. కానీ ఇది సరైన అభిప్రాయం‌ కాదు. ఎందుకంటే దేవుడు ఇక్కడ ముందుగానే అహరోనును సిద్ధం చేసినట్టుగా "ఇదిగో అతడు నిన్ను ఎదుర్కొనవచ్చుచున్నాడు, అతడు నిన్ను చూచి తన హృదయమందు సంతోషించును" అని మాట్లాడుతున్నాడు. పైగా మోషేలో ఉన్న నోటి, నాలుక మాంద్యాలు వాస్తవమైనప్పుడు అతను సరిగా మాట్లాడలేడు కాబట్టి, అతనికి ఆ విషయంలో తప్పకుండా సహాయం‌ అవసరం. అందుకే దేవుడు మోషే తన లోపాలను ఆయనముందు అభ్యంతరాలుగా ప్రస్తావించకముందే ఆ పనిలో అహరోనును సహకారిగా నిర్ణయించి, అతనిని కలుసుకునేలా ఐగుప్తునుండి మిద్యానుకు పయనమయ్యేలా ప్రేరేపించాడు.

మరోవిషయం ఏంటంటే దేవుడు ఇక్కడ అహరోను గురించి "అతను బాగుగా మాట్లాడగలడని నేనెరుగుదును" అంటున్నాడు. మోషే మాటల యందు ప్రవీణుడే (జ్ఞానంతో మాట్లాడగలడు) కానీ ఆ మాటలను ప్రజలకు అర్థమయ్యేశైలిలో మాట్లాడలేడు. పైగా అతనికి నోటిమాంద్యము, నాలుక మాంద్యాలు కూడా ఉన్నాయి. అహరోను బాగా మాట్లాడగలడు కానీ ఏ సమయంలో దేనిగురించి మాట్లాడాలో ఎలాంటి జ్ఞానంతో మాట్లాడాలో అతనికి తెలియదు. కాబట్టి దేవుడు ఇక్కడ వీరిద్దరినీ ఒకరికి ఒకరు సహకారులుగా నియమించి తన‌ కార్యాన్ని‌ నెరవేర్చుకోబోతున్నాడు. సంఘంలో కూడా మనం ఇలాంటి పద్ధతిని అనుసరించాలి. దేవుడు‌ మనకు పంచియిచ్చిన తలాంతులతో ఒకరికి ఒకరు సహాయం‌ చేసుకుంటూ దేవుని పనిని‌ విజయవంతంగా పూర్తి చెయ్యాలి.

నిర్గమకాండము 4:15 నీవు అతనితో మాటలాడి అతని నోటికి మాటలు అందించవలెను, నేను నీ నోటికి అతని నోటికి తోడై యుండి, మీరు చేయ వలసినదానిని మీకు బోధించెదను.

ఈ వచనంలో దేవుడు మోషే అహరోనులు చెయ్యవలసినదానిని ‌వివరించడం మనం చూస్తాం.
ఆయన మోషేలోనూ అహరోనులోనూ అప్పటికే రెండు వేరు వేరు ప్రత్యేకతలను పెట్టాడు. ఒకరు జ్ఞానయుక్తంగా మాట్లాడగలరు, మరొకరు ప్రజలకు అర్థమయ్యే శైలిలో మాట్లాడగలరు. అయినప్పటికీ ఆయన‌ మరలా మీ నోటికి తోడైయుంటానని చెబుతున్నాడు. దీనిని బట్టి, ఆయన మనలో మొదటినుండే కొన్ని ప్రత్యేకతలను పెట్టినప్పటికీ ఆయన నియమించిన ప్రత్యేకకార్యంలో పాల్గొనడానికి అవి సరిపోవు. అప్పుడు ఆయన సహాయం (తోడు) తప్పకుండా అవసరమౌతుంది. అందుకే మనం ఎన్ని ప్రత్యేకతలతో ఉన్నప్పటికీ దేవుని‌కార్యం విషయంలో తగ్గింపు కలిగి పదే పదే ఆయన సహాయం వేడుకోవాలి.

నిర్గమకాండము 4:16,17 అతడే నీకు బదులు జనులతో మాటలాడును, అతడే నీకు నోరుగానుండును, నీవు అతనికి దేవుడవుగా ఉందువు. ఈ కఱ్ఱను చేతపట్టు కొనిదానితో ఆ సూచక క్రియలు చేయవలెననిచెప్పెను.

ఈ వచనాలలో మోషేకు అహరోను ఏవిధంగా సహాయంగా ఉంటాడో మోషే దేనిద్వారా సూచకక్రియలను చెయ్యాలో దేవుడు అతనికి మరోసారి తెలియచెయ్యడం మనం చూస్తాం.
ఇక్కడ మోషే అహరోనుకు దేవునిగా ఉంటాడు అనేమాట "దేవుని ప్రతినిధిగా" అతనితో మాట్లాడతాడనే భావంలో చెప్పబడింది. అంతేతప్ప అప్పటినుండి మోషే కూడా దేవుడైపోయాడనే అర్థం ఇందులో లేదు. ఇంకా వివరంగా చెప్పాలంటే ఇది అలంకారంగా‌ చెప్పబడినమాట. ఎందుకంటే "నీవు అతనికి దేవుడవుగా ఉందువు" అనేమాటకు ముందున్న మాటలో "అతడే నీకు నోరుగా నుండును" అనే మాట కూడా వాడబడింది. దీనిప్రకారం అహరోను మోషే మాటలను ప్రజలకు అందిస్తాడు కాబట్టి ఎలాగైతే మోషే నోరుగా ఉంటాడని చెప్పబడిందో అలానే మోషే కూడా దేవునిమాటలను అహరోనుకు తెలియచేస్తాడు కాబట్టి "నీవు అతనికి దేవుడవుగా ఉందువు" అని చెప్పబడింది. అక్కడ అహరోను మోషే నోరుగా మారిపోనట్టే మోషే కూడా దేవునిగా మారిపోలేదు.

ఇక్కడినుండే ఇశ్రాయేలీయుల ప్రజల్లో తమమధ్య దేవుని ప్రతినిధులుగా వ్యవహరించే న్యాయాధిపతులను దైవాలుగా సంబోధించే పద్ధతి ప్రవేశించింది. వీరిగురించి ఆసాపు కీర్తనలోనూ (కీర్తనలు 82:1-8) యేసుక్రీస్తు మాటల్లో కూడా (యోహాను10:34-36) మనకు కనిపిస్తుంది. అయితే కొన్ని అవాంతర శాఖలవారు ఈమాటలను అపార్థం చేసుకుని, మనం కూడా దైవాలమే అని బోధించడం మొదలు పెట్టారు. దీనిగురించి‌ వివరంగా తెలుసుకోవడానికి ఈ వ్యాసం చదవండి.

వీరు దైవములా?

అదేవిధంగా యేసుక్రీస్తు దైవత్వాన్ని తృణీకరించే కొన్ని గుంపులు, ఇక్కడ మోషే అహరోనుకూ తరువాత ఫరోకూ (నిర్గమకాండము 7:1) దేవునిగా నియమించబడడం చూపించి, యేసుక్రీస్తు కూడా ఆ భావంలోనే దేవుడని రాయబడిందని (యోహాను 1:1) అంతేతప్ప ఆయన తండ్రివంటి దేవుడు కాడని వాదిస్తుంటారు. కానీ లేఖనాలు యేసుక్రీస్తును దేవుడు అని పరిచయం చేసినప్పుడు ఆయన తండ్రివలే సర్వాధికారం గల దేవుడని (రోమా 9:5), మహా దేవుడని (తీతుకు 2:13), తండ్రితో సమానంగా ఉన్న దేవుడని (పిలిప్పీ 2:6), నిత్యుడైన దేవుడని (ప్రకటన 1:8, యెషయా 9:6) కచ్చితమైన ఆధారాలను ఇస్తున్నాయి. కాబట్టి యేసుక్రీస్తు దైవత్వాన్ని, మోషే దేవునిగా నియమించబడడంతో పోల్చి ఆయన కూడా మోషేవంటి దేవుడే తప్ప తండ్రి (యెహోవా) వంటి దేవుడు కాడని బోధించడం అపవాది కుట్రగా మనం అర్థం చేసుకోవాలి. యేసుక్రీస్తు దైవత్వం గురించి మరింత వివరంగా తెలుసుకోవడానికి ఈ వ్యాసాలను చదవండి.

యెహోవా దూత యేసుక్రీస్తు

యేసుక్రీస్తు దేవుడా

యేసుక్రీస్తు దేవుడు అని ప్రకటిస్తున్న యూదా మరియు పేతురు రాసిన‌ పత్రికలు

నిర్గమకాండము 4:18 అటుతరువాత మోషే బయలుదేరి తన మామయైన యిత్రోయొద్దకు తిరిగి వెళ్లిసెలవైనయెడల నేను ఐగుప్తులోనున్న నా బంధువులయొద్దకు మరల పోయి వారింక సజీవులై యున్నారేమో చూచెదనని అతనితో చెప్పగా ఇత్రో - క్షేమముగా వెళ్లుమని మోషేతో అనెను.

ఈ వచనంలో మోషే దేవునిమాట ప్రకారం ఐగుప్తుకు వెళ్ళడానికి సిద్ధమై, తనమామయైన యిత్రోను దానికి అనుమతి కోరడం మనం చూస్తాం. ఇక్కడ మోషే తనకు దేవుడు ప్రత్యక్షమవ్వగానే తనంతట తానుగా అక్కడినుండి వెళ్ళిపోయి, యిత్రోను అవమానించడం లేదు. ఎందుకంటే మోషే ఐగుప్తు నుండి పారిపోయి వచ్చినప్పుడు యిత్రో అతనిని‌ ఎంతో ఆదరించాడు. నిరాశ్రయుడిగా తనవద్దకు వచ్చిన మోషేను కేవలం మందలకాపరిగా నియమించుకోవడమే కాకుండా తన కుమార్తెను ఇచ్చి వివాహం కూడా జరిపించాడు. కాబట్టి మోషే ఐగుప్తుకు తిరిగివెళ్ళమని దేవుడు ఆజ్ఞాపించినప్పుడు తనను ఐగుప్తుకు పంపించమని‌ వినయపూర్వకంగా యిత్రోను కోరుతున్నాడు. దీనినిబట్టి దేవుని ప్రత్యక్షత, ఆయన పని చెయ్యాలనే తపన, మనల్ని వ్యక్తిగత బాధ్యతలనుండి తప్పించేదిగా ఉండకూడదు.

ఇక్కడ యిత్రో కూడా మోషేను ఎలాంటి ఆటంకం కలుగచెయ్యకుండా ఐగుప్తుకు పంపడానికి సిద్ధపడుతున్నాడు. అతను తలచుకుంటే ఆటంకం కలిగించేవాడు. ఎందుకంటే ఇప్పుడు మోషేతో పాటు అతని కుమార్తె మరియు ఆమె పిల్లలు కూడా వెళ్ళవలసి వస్తుంది కాబట్టి మోషే చరిత్రను బట్టి వారికి ఐగుప్తులో ఏదైనా హాని సంభవిస్తుందనే ఆలోచన అతనికి తప్పకవస్తుంది. కానీ అతను మోషే కోరికను మన్నించి, క్షేమముగా వెళ్ళమని చెబుతున్నాడు. ఈవిధంగా దేవుడు మోషే ఐగుప్తు ప్రయాణానికి అనుకూల వాతావరణం కలుగచేస్తున్నాడు. అయితే ఇక్కడ యిత్రో అనుమతిని ఇవ్వకపోయినప్పటికీ మోషే తప్పకుండా అక్కడినుండి వెళ్ళిపోయేవాడు. దానివల్ల యిత్రోనే మోషేతో ఉన్న మంచి సంబంధాన్ని కోల్పోయేవాడు.

అదేవిధంగా ఇక్కడ మోషే యిత్రోకు తనకు దేవుడు ప్రత్యక్షమైన సంగతి చెప్పకుండా "నా బంధువులయొద్దకు మరల పోయి వారింక సజీవులై యున్నారేమో చూచెదనని" చెప్పడాన్ని బట్టి అతను యిత్రోకు అబద్ధం చెబుతున్నాడని కొందరు ఆరోపిస్తుంటారు. కానీ ఇక్కడ మోషే‌ చెబుతున్న అబద్ధం‌‌ ఏమీలేదు. ఎందుకంటే ఒక మనిషిగా తన మనసులో తనకు సంబంధించినవారు ఎలా ఉన్నారో చూడాలనే తపన తప్పకుండా కలుగుతుంది. కానీ అతను ఇంతకాలం తనకున్న భయాన్ని బట్టి ఐగుప్తుకు వెళ్ళి వారిని చూడలేకపోయాడు. ఇప్పుడు స్వయంగా దేవుడే అతనికి ప్రత్యక్షమై ఐగుప్తుకు వెళ్ళమంటున్నాడు కాబట్టి, తనలో ఆ తపన మరింతగా పెరిగి దానినే యిత్రోకు చెబుతున్నాడు.

అయితే మోషే తనకు దేవుడు ప్రత్యక్షమైన సంగతి యిత్రోకు చెప్పకుండా ఉండడానికి కారణం‌ ఏంటంటే ఆ సంగతి యిత్రోకు చెప్పవలసిన అవసరం అతనికి లేదు ఎందుకంటే యిత్రో ఇశ్రాయేలీయుడు కాదు. పైగా మోషే ఆ సంగతిని యిత్రోకు చెప్పినప్పుడు పొరపాటున ఆ విషయం ఐగుప్తుకు చేరితే మోషే విషయంలో వారు ముందే జాగ్రతపడి, ఇశ్రాయేలీయుల్లో తిరుగుబాటు తలెత్తకుండా అతను ఐగుప్తుకు చేరకుండా అడ్డుకునే ప్రమాదం‌ ఉంది. ఎందుకంటే మిద్యానుకూ ఐగుప్తుకూ మధ్యలో ఎంతో దూరం ఉండదు, పైగా ఆ ఇరు దేశాలమధ్య వ్యాపార సంబంధాలు ఉన్నట్టు ఎన్నో ఉదాహరణలు మనకు కనిపిస్తాయి‌ (ఆదికాండము 37:36). ఈవిధంగా మోషే తాను చెయ్యబోతున్న కార్యం‌ విషయంలో తనకారణంగా ముందుగానే ఆటంకాలు తలెత్తకుండా జాగ్రతపడుతూ యిత్రోకు సగం కారణం‌ మాత్రమే చెబుతున్నాడు.

నిర్గమకాండము 4:19 అంతట యెహోవానీ ప్రాణమును వెదకిన మనుష్యులందరు చనిపోయిరి గనుక ఐగుప్తుకు తిరిగి వెళ్లు మని మిద్యానులో మోషేతో చెప్పగా-

ఈ వచనంలో దేవుడు మరలా మోషేకు ప్రత్యక్షమై ఐగుప్తుదేశంలో అతన్ని చంపాలి అనుకున్నవారందరూ చనిపోయారు కాబట్టి అక్కడికి తిరిగివెళ్ళమని చెప్పడం మనం చూస్తాం. గతంలో మోషే దేవునితో మాట్లాడుతున్నప్పుడు తనకున్న లోపాలనూ సామర్థ్యలేమినీ ఆయనముందు అభ్యంతరాలుగా ప్రస్తావించాడు తప్ప, తన మనసులో ఉన్న భయాన్ని మాత్రం ప్రస్తావించలేదు. ఎందుకంటే అతను ఐగుప్తీయుడ్ని చంపిన కారణంగా ఫరో మరియు ఆ చంపబడిన ఐగుప్తీయుడి బంధువులు మోషేపై కక్షకట్టడం సహజం. కానీ మోషే దేవునిముందు తన వ్యక్తిగత భయాన్ని అభ్యంతరంగా పెట్టలేదు కానీ ఆ కార్యం విషయంలో తన అనర్హతను మాత్రమే అభ్యంతరంగా భావించాడు. ఇక్కడ మోషే యొక్క వ్యక్తిత్వం మరోసారి అర్థమౌతుంది. అయినప్పటికీ హృదయాలను ఎరిగిన దేవుడు మోషేను అలా తన భయంలోనే వదిలెయ్యకుండా మరలా ప్రత్యక్షమై ఐగుప్తులో అతనిని చంపాలి అనుకున్నవారంతా చనిపోయారని ధైర్యమిస్తున్నాడు. కాబట్టి దేవునిపని విషయంలో మన వ్యక్తిగత భయాలను లక్ష్యపెట్టకుండా ముందుకు సాగినప్పుడు ఆయనే మనకు తగిన ఆదరణను కలిగిస్తాడు.

నిర్గమకాండము 4:20 మోషే తన భార్యను తన కుమారులను తీసికొని గాడిదమీద నెక్కించు కొని ఐగుప్తుకు తిరిగి వెళ్లెను. మోషే దేవుని కఱ్ఱను తన చేత పట్టుకొని పోయెను.

ఈ వచనంలో దేవునిచేత ధైర్యపరచబడిన మోషే తన భార్యనూ పిల్లలనూ తీసుకుని ఐగుప్తుకు ప్రయాణమైనట్టు మనం చూస్తున్నాం. ఇక్కడ "తిరిగివెళ్ళెను" అంటే ప్రయాణమయ్యాడనే మనం అర్థం చేసుకోవాలి తప్ప అక్కడికి పూర్తిగా చేరిపోయాడని కాదు.‌ ఎందుకంటే క్రింది వచనంలో మరలా దేవుడు అతనితో "ఐగుప్తుకు తిరిగి చేరిన తరువాత" అంటున్నాడు.‌ కాబట్టి మోషే ఐగుప్తుకు తిరుగు ప్రయాణంలో ఉన్నాడు తప్ప, ఇంకా ఐగుప్తుకు చేరుకోలేదు. మరోవిషయం ఏంటంటే మోషే భార్యా పిల్లలు ఐగుప్తుకు చేరకముందే వెనుకకు పంపబడ్డారు. దీనిగురించి క్రింది వచనాల్లో చూద్దాం.

అదేవిధంగా ఇక్కడ మోషే దేవుడు తనతో చెప్పినట్టుగా "దేవుని కఱ్ఱను తన చేత పట్టుకొని" వెళ్ళడం మనం చూస్తాం. దేవుడు తన ద్వారా జరిగించబోతున్న కార్యంలో ఆ కఱ్ఱను కూడా సాధనంగా‌ వాడుకుంటున్నాడు‌‌ కాబట్టి దాని గురించి ఇక్కడ ప్రత్యేకంగా చెప్పబడింది. కాబట్టి దేవునిపనిలో మనకు సహాయంగా ఉండే పరికరాల విషయంలో కూడా మనం శ్రద్ధ కలిగియుండాలి.

నిర్గమకాండము 4:21 అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెనునీవు ఐగుప్తునందు తిరిగి చేరిన తరువాత, చేయుటకు నేను నీకిచ్చిన మహత్కార్యము లన్నియు ఫరో యెదుట చేయవలెను సుమీ అయితే నేను అతని హ్రుదయమును కఠినపరచెదను,అతడు ఈ జనులను పోనియ్యడు.

ఈ వచనంలో దేవుడు ఐగుప్తుకు చేరాక మోషే చెయ్యవలసిన అద్భుతాల గురించి ప్రస్తావిస్తూ నేనే ఫరో హృదయాన్ని కఠినపరుస్తానని, కాబట్టి అతను ఆ జనులను పోనియ్యడని చెప్పడం మనం చూస్తాం. తర్వాత చరిత్రను మనం పరిశీలించినప్పుడు ఇక్కడ ఆయన చెప్పినట్టుగానే ఫరో హృదయం మాటిమాటికీ కఠినపరచబడింది. దీనికారణంగా ఐగుప్తుపైనా ఫరో పైనా దేవుని ఉగ్రత కుమ్మరించబడింది. కొందరు బైబిల్ విమర్శకులు ఈమాటలను ఆధారం చేసుకుని, ఇక్కడ దేవుడే ఫరో క్రూరంగా ప్రవర్తించేలా అతని హృదయాన్ని కఠినపరచి, మరలా ఆ క్రూరత్వానికి శిక్షవిధించాడని, ఇది ఎంతమాత్రం న్యాయమైన చర్యకాదని ఆరోపణలు చేస్తుంటారు. కానీ దేవుడు ఫరో హృదయాన్ని కఠినపరచడానికి ముందే ఫరో క్రూరుడిగా ఉన్నట్టు మనకు అర్థమౌతుంది.
దానికి మంచి నిదర్శనమే ఇశ్రాయేలీయుల అనుభవిస్తున్న బానిసత్వం.

వాస్తవానికి ఇశ్రాయేలీయుల మగపిల్లలను చంపించిన ఫరో ఈ ఫరో కాకపోయినప్పటికీ ఈ ఫరో కూడా అలాంటి క్రూరస్వభావమే కలిగియున్నాడు. అందుకే ఆ ఫరో ఇశ్రాయేలీయులపై పెట్టిన పనుల భారాన్ని ఇంకా అమలుచేస్తూ ఇశ్రాయేలీయులను హింసించడం విషయంలో రాజీపడకుండా ఉన్నాడు. "ఇశ్రాయేలీయులచేత ఐగుప్తీయులు కఠినముగా సేవ చేయించుకొనిరి" (నిర్గమకాండము 1:13) కఠినంగా ప్రవర్తించేవారిని ఆయన కఠినపరిచే బుద్ధి చెబుతాడు.

కాబట్టి ఇక్కడేమీ దేవుడు కొత్తగా ఫరోను క్రూరుడిగా మార్చడానికి అతని హృదయాన్ని కఠినపరచలేదు. బైబిల్ ప్రకటించే దేవుడు పాపాన్ని అసహ్యించుకుంటాడు తప్ప పాపం చేసేలా ఎవర్నీ ప్రేరేపించడు (కీర్తనలు 5:4, హబక్కూకు 1:13). మరి ఇంతకూ ఆయన ఫరో హృదయాన్ని కఠినపరచడం అంటే ఏంటంటే ఈ భూమిపై ఏ మనిషైనా తాను చేస్తున్నపాపం విషయంలో మారుమనస్సు పొంది పశ్చాత్తాపపడాలంటే అది కేవలం దేవుని‌ కృప ద్వారానే సాధ్యమౌతుంది (2తిమోతి 2:24) లేకపోతే ఆ వ్యక్తి జీవితాంతం అదే పాపంలో జీవించి నాశనానికి పోతాడు (యోహాను 8:21). ఇక్కడ ఫరో విషయంలో దేవుడు అదే చేస్తూ అతను మోషే చేసిన అద్భుతాలు చూసినప్పటికీ మారుమనస్సు పొందేలా కృపచూపించబోను అంటున్నాడు. అతని హృదయాన్ని కఠినపరచడం అంటే భావం ఇదే. ఎందుకంటే అప్పటికే ఫరో ఇశ్రాయేలీయులను ఎంతో హింసించాడు కాబట్టి అతనిపట్ల దేవుడు తన బలాన్ని చూపించాలి. దేవుడు అందుకే అతన్ని నియమించాడు (నిర్గమకాండము 9: 16).

అప్పటికే తమ పాపాల వల్ల‌ ఉగ్రతపాత్రులైన వారికి ఆయన కృపచూపించి మారుమనస్సు పొందేలా చెయ్యాలా లేక వారిని అలానే ఉగ్రతకు విడిచిపెట్టెయ్యాలా అనేది పూర్తిగా ఆయన చిత్తం. ఇలా ఆయన కొందరు పాపులను వారు న్యాయబద్ధంగా అర్హులైనటువంటి ఉగ్రతకు విడిచిపెట్టెయ్యడమే వారిని కఠినపరచడం, లేదా భ్రష్టత్వానికి అప్పగించడం.

రోమీయులకు 1:28 మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటియ్య నొల్లకపోయిరి గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సుకు వారినప్పగించెను.

కాబట్టి దేవుడు, ఫరో హృదయాన్ని కఠినపరచడం, ఇశ్రాయేలీయుల పక్షంగా ఆయన తీరుస్తున్న తీర్పుగా మనం అర్థం చేసుకోవాలి. ఫరో మరియు ఐగుప్తీయులు అప్పటివరకూ తమ‌స్వచిత్తం చొప్పున ఇశ్రాయేలీయులను హింసించినందుకు శిక్షించబడాలంటే ఫరోకు మారుమనస్సు పొందే కృపను‌ ఆయన అనుగ్రహించకూడదు‌. అదేవిధంగా దీనిద్వారా ఒకవైపు ఇశ్రాయేలీయులు ఐగుప్తీయులపై కుమ్మరించబడిన తీర్పులను బట్టి ఆయన శక్తిని గుర్తిస్తే మరోవైపు ఐగుప్తీయులు ఇంతకాలం తాము దేవుళ్ళుగా కొలిచినవారు ఎంత అసమర్థులో గ్రహిస్తారు.

నిర్గమకాండము 4:22,23 అప్పుడు నీవు ఫరోతో ఇశ్రాయేలు నా కుమారుడు, నా జ్యేష్ఠపుత్రుడు; నన్ను సేవించునట్లు నా కుమారుని పోనిమ్మని నీకు ఆజ్ఞాపించు చున్నాను; వాని పంపనొల్లనియెడల ఇదిగో నేను నీ కుమారుని, నీ జ్యేష్ఠ పుత్రుని చంపెదనని యెహోవా సెల విచ్చుచున్నాడని అతనితో చెప్పుమనెను.

ఈ వచనాలలో దేవుడు మోషే ఐగుప్తుకు చేరాక ఫరో ముందు ఏం చెప్పాలో తెలియచెయ్యడం మనం చూస్తాం. ఇక్కడ దేవుడు ఇశ్రాయేలీయులకూ తనకూ ఉన్న సంబంధాన్ని తండ్రీ కుమారుల సంబంధంతో పోలుస్తున్నాడు. ఇది ఫరో చేస్తున్న తప్పిదం యొక్క తీవ్రతను అతనికి తెలియచేస్తుంది. ఎందుకంటే సాధారణంగా ఆ కాలంలో వేరేవ్యక్తి దాసుడ్ని నిర్బంధించి అతనితో పని చేయించుకోవడమే పెద్దనేరంగా పరిగణించబడుతుంది. ఎందుకంటే ఆ దాసుడు వేరేవాని‌‌ సొత్తు. అలాంటిది వేరేవాని కుమారుడ్ని నిర్భంధించి పని చేయించుకుంటే అది మరింత తీవ్రమైన నేరంగా పరిగణించబడుతుంది కదా! ఈవిధంగా ఫరో దేవుని పిల్లలలైన ఇశ్రాయేలీయులను నిర్భంధించి వారితో కఠినసేవ చేయించుకున్నందుకు తీవ్రమైన పర్యవసానాలను ఎదుర్కోవలసి ఉంటుందని ఈ మాటల్లో భావం.

అదేవిధంగా ఇక్కడ దేవుడు మోషేతో "నన్ను సేవించునట్లు నా కుమారుని పోనిమ్మని నీకు ఆజ్ఞాపించుచున్నాను" అని ఫరోకు చెప్పమంటున్నాడు. ఇక్కడ దేవుని కుమారులు (పిల్లలు) చెయ్యవలసిన కార్యం కూడా మనకు కనిపిస్తుంది. దేవుని పిల్లలు ఆయనను నిత్యం సేవించాలి, దేవునిపట్ల అలాంటి ఆరాధనాభావం లేనివారు ఆయన పిల్లలు కాదు (మత్తయి 4:10, యోబు 21:15). ఈవిధంగా ఇక్కడ మనం దేవుని పిల్లల చెయ్యవలసినదానినీ దానికి ఎవరైనా విఘాతం కలిగిస్తే వారు ఎదుర్కొనే పర్యవసానాన్నీ రెండింటినీ గమనిస్తున్నాం.

అయితే ఈ వచనాలలోని చివరిమాటలు (నీ జ్యేష్ఠ పుత్రుని చంపెదను) మోషే ఫరో యొద్దకు వెళ్ళిన వెంటనే చెప్పవలసినవి కావు. అవి సంహారక దూత ఐగుప్తీయుల తొలిచూలు పిల్లలను‌ చంపడానికి ముందు ఫరోకు చెప్పబడినమాటలు. దేవుడు ఇక్కడ మోషేకు అతను ఫరోముందు చెప్పవలసిన ప్రాముఖ్యమైన మాటలన్నిటినీ మొత్తంగా (overall) జ్ఞాపకం చేస్తున్నాడు.

నిర్గమకాండము 4:24 అతడు పోవు మార్గమున సత్రములో యెహోవా అతనిని ఎదుర్కొని అతని చంపచూడగా-

ఈ వచనంలో మోషే దేవునిమాట చొప్పున తన కుటుంబంతో కలసి ఐగుప్తుకు ప్రయాణమైనప్పుడు వారు విశ్రాంతి తీసుకునే సత్రంలో ఆయన మోషేను చంపచూడడం మనం చూస్తాం. దీనికి కారణం ఏంటో ఈ క్రింది వచనాల్లో మనకు కనిపిస్తుంది.

నిర్గమకాండము 4:25,26 సిప్పోరా వాడిగల రాయి తీసికొని తన కుమారునికి సున్నతిచేసి అతని పాదములయొద్ద అది పడవేసినిజముగా నీవు నాకు రక్తసంబంధమైన పెనిమిటివైతివనెను; అంతట ఆయన అతనిని విడిచెను. అప్పుడు ఆమెఈ సున్నతినిబట్టి నీవు నాకు రక్తసంబంధమైన పెనిమిటివైతివనెను.

ఈ వచనాల ప్రకారం మోషే ఇద్దరు కుమారులలో (గెర్షోము, ఎలీయెజెరు) ఒకరికి అతను అబ్రాహాముతో దేవుడు చేసిన నిబంధనకు గురుతైన సున్నతిని (ఆదికాండము 17:9-14) చెయ్యలేదు. బహుశా చిన్న కుమారుడైన ఎలీయెజెరు (నిర్గమకాండము18:4) విషయంలోనే ఈ సున్నతిని పాటించలేదేమో. అందుకే దేవుడు మోషేను చంపచూసాడు. ఎందుకంటే ఇప్పుడు నిబంధన ప్రజలను‌ విడిపించడానికి బయలుదేరిన మోషే తన కుమారుడి విషయంలో మాత్రం ఆ నిబంధనకు గురుతైన సున్నతిని విస్మరించడం చిన్న విషయమేమీ కాదు. అది గతంలో అలక్ష్యపెట్టబడినా కనీసం దేవుడు అతనికి ప్రత్యక్షమైనప్పుడైనా చెయ్యవలసింది. కానీ ఇప్పుడు కూడా అతను అలా చెయ్యకపోయేసరికి, దాని పర్యవసానం మోషేకు తెలియచెయ్యడానికే ఆయన అతడిని చంపచూసాడు.

అయితే ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మనం గమనించాలి. సున్నతి కారణంగా ‌ఆయన మోషేను చంపాలి అనుకుంటే వెంటనే చంపేసేవాడు కానీ చంపచూసాడు అన్నప్పుడు అతను చేసిన తప్పిదం యొక్క తీవ్రతను తెలియచెయ్యడానికే ఆ విధంగా చేసాడని అర్థమౌతుంది. దీనిని బట్టి దేవుని సేవకులమైన మనం ఏ నిబంధన వాక్యాన్ని అయితే ప్రజలకు ప్రకటిస్తున్నామో దానిని పాటించడం విషయంలో అలక్ష్యం చేస్తే కఠినమైన పరిస్థితులు ఎదుర్కోవలసి ఉంటుందని గుర్తుంచుకోవాలి.

ఇక సిప్పోరా చేసినదానిని మనం ఆలోచిస్తే; బహుశా వారు సత్రంలో బసచేస్తున్నప్పుడు ఆయన ఉన్నపాటుగా మోషేకు మరణకరమైన వ్యాధిని కలిగించియుంటాడు. అది తమ కుమారుడికి సున్నతి చెయ్యకపోవడం‌ వల్ల వచ్చిన శిక్షయేయని మోషే సిప్పోరాలు గ్రహించారు. అప్పటికి‌ మోషే వ్యాధితో బాధపడుతున్నాడు కాబట్టి సిప్పోరానే తెగించి తన కుమారుడికి సున్నతి చేసింది. ఈవిధంగా సిప్పోరా తన భర్తను బ్రతికించుకుంది, అందుకే ఆమె సున్నతిలో తీసివేసే మర్మాంగం ముందటి చర్మాన్ని (foreskin) మోషే కాళ్ళ దగ్గర పడవేసి "ఈ సున్నతిని బట్టి నీవు నాకు రక్తసంబంధమైన పెనిమిటివైతివి" అంటుంది. ఈమాటలకు నేను సున్నతి చేసి రక్తాన్ని చిందించడం ద్వారా నిన్ను మరలా భర్తగా పొందుకున్నాను (కాపాడుకున్నాను) అని అర్థం.

గమనించండి; ఇక్కడ సిప్పోరా తాను చెయ్యవలసింది చాలా సున్నితమైన కార్యం అది కూడా స్వంత కొడుకు విషయంలో‌ అయినప్పటికీ ఆ కార్యం చెయ్యడానికి వెనుకాడలేదు. ఎందుకంటే ప్రస్తుతం ఆ కార్యం చెయ్యవలసిన బాధ్యత ఆమెదే. లేకుంటే తన భర్తకు చనిపోయే పరిస్థితి. కాబట్టి దైవభక్తిగల స్త్రీలు తమ కుటుంబ క్షేమం కోసం ఎలాంటి కార్యం చెయ్యవలసి వచ్చినా ఈ సిప్పోరాలనే బాధ్యతతో సిద్ధపడాలి.‌

ఈ సంఘటన జరిగాక సిప్పోరా మరియు ఆమె ఇద్దరు పిల్లలు తమ‌ తండ్రి ఇంటికి పంపబడ్డారు. బహుశా తన కుమారుడికి కలిగిన సున్నతి గాయం వలన మోషే వారిని కొంతకాలం వరకూ అక్కడే ఉండమని వెనక్కు పంపివేసి యుండవచ్చు. ఇశ్రాయేలీయులు ఐగుప్తునుండి విడుదల పొందేవరకూ వారు తమ‌ తండ్రియైన యిత్రో ఇంటిలోనే ఉన్నారు. తర్వాత మోషే ఇశ్రాయేలీయులను విడిపించుకుని తనకు దేవుడు ప్రత్యక్షమైన సీనాయి కొండదగ్గరకు వచ్చినప్పుడు వారు అతనికి మరలా అప్పగించబడ్డారు (నిర్గమకాండము 18:2).


నిర్గమకాండము 4:27,28 మరియు యెహోవా మోషేను ఎదుర్కొనుటకు అరణ్యములోనికి వెళ్లుమని అహరోనుతో చెప్పగా అతడు వెళ్లి దేవుని పర్వతమందు అతని కలిసికొని అతని ముద్దు పెట్టుకొనెను. అప్పుడు మోషే తన్ను పంపిన యెహోవా పలుకుమన్న మాటలన్నిటిని, ఆయన చేయనాజ్ఞాపించిన సూచక క్రియలన్నిటిని అహరోనుకు తెలిపెను.

ఈ వచనాలలో దేవుడు సీనాయి పర్వతం దగ్గర మోషేను కలుసుకోమని అహరోనుకు సెలవివ్వడం, అహరోను మోషేను కలుసుకున్నప్పుడు అతను దేవుడు చెప్పినమాటలన్నిటినీ అహరోనుకు తెలియచెయ్యడం‌ మనం చూస్తాం. మిద్యాను నుండి ఐగుప్తుకు వెళ్ళే మార్గంలోనే ఈ సీనాయి పర్వతం‌‌ ఉంటుంది. ఇశ్రాయేలీయులు ఐగుప్తునుండి‌ కనాను వెళ్ళేటప్పుడు కూడా ఈ పర్వతం దాటుకుని‌ మిద్యాను మీదుగా ప్రయాణం చెయ్యాలి. ఆ కాలంలో‌ మందకాపరులు చాలా దూరం వెళ్ళి తమ‌మందలను‌ మేపేవారు కాబట్టి మోషే మిద్యాను నుండి ఈ పర్వతంపైకి వచ్చి మొదటిసారిగా దేవుని ప్రత్యక్షతను పొందుకున్నాడు.

ఇక అహరోను గురించి మనం పరిశీలిస్తే ఇతను మోషే కంటే మూడు సంవత్సరాల పెద్దవాడు‌ (నిర్గమకాండము 7:7). అయినప్పటికీ అతను మోషేకు సహకారిగా ఉండడానికి, మోషే తనకు దేవుని‌గా నియమించబడడానికి (16వ వచనం) సిగ్గుపడలేదు. తనకంటే చిన్నవాడు తనకంటే ప్రముఖస్థానంలో ఉండడాన్ని‌ బట్టి అసూయ చెందలేదు‌ కానీ దేవుని కార్యంలో తాను మోషేకు సహకారిగా నియమించబడినందుకు ఎంతగానో సంతోషించాడు. మనం కూడా సంఘంలో‌ ఇలాంటి వైఖరినే కలిగియుండాలి. మనకంటే ప్రముఖ స్థానంలో ఉన్నవారిని బట్టి అసూయ చెందకుండా వారి ఆదేశాల క్రింద పని చెయ్యడానికి సిగ్గుపడకుండా దేవుడు నియమించిన పాత్రలలో ఆసక్తిగా సాగిపోవాలి. అందుకే "సహోదర ప్రేమ విషయములో ఒకనియందొకడు అనురాగముగలవారై, ఘనత విషయములో ఒకని నొకడు గొప్పగా ఎంచుకొనుడి" (రోమా 12: 10) అని రాయబడింది.

నిర్గమకాండము 4:29-31 తరువాత మోషే అహరోనులు వెళ్లి ఇశ్రాయేలీయుల పెద్దలనందరిని పోగుచేసి, యెహోవా మోషేతో చెప్పినమాటలన్నియు అహరోను వివరించి, జనులయెదుట ఆ సూచక క్రియలను చేయగా జనులు నమ్మిరి. మరియుయెహోవా ఇశ్రాయేలీయులను చూడవచ్చి తమ బాధను కనిపెట్టెనను మాట జనులు విని తలవంచుకొని నమస్కారము చేసిరి.

ఈ వచనాలలో మోషే అహరోనులు దేవుడు తమకు ఆజ్ఞాపించినట్టుగా ఐగుప్తుకు వెళ్ళి ఇశ్రాయేలీయుల ప్రజలను సమకూర్చి వారిముందు దేవుడు చెప్పిన‌‌సూచక క్రియలన్నీ చేసినప్పుడు వారు మోషే‌ మాటలను నమ్మినట్టు మనం‌ చూస్తాం. దీనిని బట్టి ఇశ్రాయేలీయుల ప్రజలు దేవునికి నమస్కారం చేస్తూ ఆయనను ఆరాధిస్తున్నారు. ఈ నమస్కారంలో ఇకపై మోషే ద్వారా దేవుడు తమకు ఆజ్ఞాపించినవన్నీ పాటిస్తామనే సంసిద్ధత కూడా ఇమిడి ఉంది. అందుకే తర్వాత అధ్యాయంలో వారు మోషేతో కలసి ఫరోవద్దకు వెళ్ళినట్టు చదువుతాం.

 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.