పాత నిబంధన

రచయిత: కె విద్యా సాగర్

విషయసూచిక:14:1,2, 14:3, 14:4 , 14:5, 14:6-8 , 14:9 ,14:10-12 , 14:13,14 , 14:15,16 , 14:17,18 , 14:19,20 , 14:21,22, 14:23-25 , 14:26-28,14:29,14:30,31

నిర్గమకాండము 14:1,2 మరియు యెహోవా మోషేతో ఈలాగు సెలవిచ్చెను ఇశ్రాయేలీయులు తిరిగి పీహహీరోతు ఎదుటను, అనగా మిగ్దోలుకు సముద్రమునకు మధ్య నున్న బయల్సెఫోను నెదుటను, దిగవలెనని వారితో చెప్పుము; దాని యెదుటి సముద్రమునొద్ద వారు దిగవలెను.

ఈ వచనాలలో దేవుడు ఇశ్రాయేలీయులను బయల్సెఫోను యెదుట సముద్రం దగ్గర దిగమని ఆజ్ఞాపించడం మనం చూస్తాం. అక్కడ దిగడం అంటే అక్కడివరకూ ప్రయాణం చేసి నిలవమని అర్థం. నిర్గమకాండము 13: 17,18 ప్రకారం; దేవుడు వారిని కనానుకు చుట్టుదారిలో నడిపిస్తున్నాడు, ఆ క్రమంలోనే ఈ బయల్సెఫోను యెదుట నున్న సముద్రం అడ్డువస్తుంది.

నిర్గమకాండము 14:3 ఫరో ఇశ్రాయేలీయులను గూర్చివారు ఈ దేశములో చిక్కుబడి యున్నారు; అరణ్యము వారిని మూసి వేసెనని అనుకొనును.

ఈ వచనంలో దేవుడు, ఇశ్రాయేలీయులు సముద్రానికి ఎదురుగా నిలవడం చూసిన ఫరో ఏమనుకుంటాడో మోషేకు వివరించడం మనం చూస్తాం. దేవునికి మనిషి హృదయంలో పుట్టే ప్రతీ ఆలోచనా ముందే తెలుసు కాబట్టి (కీర్తనలు 139:2-4) ఫరో ఇంకా ఆలోచించకముందే దేవుడు వాటిని బయలుపరుస్తున్నాడు. అదేవిధంగా ఇశ్రాయేలీయులు సముద్రానికి ఎదురుగా నిలవడం చుసిన ఫరో "వారు ఈ దేశములో చిక్కుబడి యున్నారు; అరణ్యము వారిని మూసి వేసెనని" అనుకుంటాడు. కానీ ఇశ్రాయేలీయులను ఆ మార్గంలో నడిపించింది దేవుడే కాబట్టి ఆ సముద్రాన్ని చీల్చిమరీ వారిని ఆ అరణ్యం నుండి బయటకు రప్పించాడు. దేవుని మార్గంలో పయనిస్తున్నవారిని చూసిన లోకం, ఆ మార్గంలో వారు ఎదుర్కొనే ఇబ్బందులను బట్టి అలానే అపహాస్యం చేస్తుంది, వారిని నాశనం చెయ్యాలనుకుంటుంది. కానీ వారు నడుస్తుంది దేవుని మార్గంలో కాబట్టి ఆయన వారికి తోడుగా ఉంటాడు. భక్తులందరి జీవితంలో ఇదే మనం గమ‌నిస్తాం.

నిర్గమకాండము 14:4 అయితే నేను ఫరో హృదయమును కఠినపరచెదను; అతడు వారిని తరుమగా; నేను ఫరోవలనను అతని సమస్త సేనవలనను మహిమ తెచ్చుకొందును; నేను యెహోవానని ఐగుప్తీయులందరు తెలిసి కొందురనెను. వారు అలాగు దిగిరి.

ఈ వచనంలో దేవుడు తానే ఫరో హృదయాన్ని కఠినపరచబోతున్నాడని దానివల్ల ఫరో అతని సేనలు ఇశ్రాయేలీయులను తరమబోతున్నాడని చివరికి వారి నాశనం ద్వారా ఆయన మహిమ తెచ్చుకోబోతున్నాడని వివరించడం మనం చూస్తాం. దేవుడు ఫరో హృదయాన్ని కఠినపరచడం ఇశ్రాయేలీయుల పట్ల అతనూ మరియు అతని ప్రజలూ చేసిన అన్యాయానికీ ఆయన తీర్పు అని ఇప్పటికే వివరించాను (నిర్గమకాండము 4:21 వ్యాఖ్యానం చూడండి). ఫరో మరియు అతని సైన్యం నాశనమవ్వడంతో ఆ తీర్పు నెరవేరుతుంది.

అదేవిధంగా ఇక్కడ దేవుడు "నేను ఫరో వలనను అతని సమస్త సేన వలనను మహిమ తెచ్చుకొందును" అనడం మనం చుస్తాం. ఈ మాటలు ఫరోనూ అతని సేనలనూ సముద్రంలో‌ ముంచివేసి నాశనం చెయ్యడాన్ని సూచిస్తున్నాయి. దీనినిబట్టి దేవుడు తన పిల్లలను రక్షించుకోవడం ద్వారానే కాదు, దుష్టులను నాశనం చెయ్యడం ద్వారా కూడా మహిమ తెచ్చుకుంటాడని మనం గ్రహించాలి.‌ అందుకే "యెహోవా ప్రతి వస్తువును దాని దాని పని నిమిత్తము కలుగజేసెను నాశన దినమునకు ఆయన భక్తిహీనులను కలుగజేసెను" (సామెతలు 16: 4) అని రాయబడింది. ఎప్పుడైతే ఫరో మరియు అతను సేనలు ఎర్ర సముద్రంలో నాశనమయ్యారో ఐగుప్తీయులతో పాటు చుట్టుప్రక్కల దేశాల వారు కూడా యెహోవా దేవుని శక్తిని గుర్తించారు. ఈ విధంగా వారి నాశనంతో ఆయనకు మహిమ కలిగింది.

నిర్గమకాండము 14:5 ప్రజలు పారిపోయినట్టు ఐగుప్తు రాజునకు తెలుపబడినప్పుడు ఫరో హృదయమును అతని సేవకుల హృదయమును ప్రజలకు విరోధముగా త్రిప్ప బడిమనమెందుకీలాగు చేసితిమి? మన సేవలో నుండకుండ ఇశ్రాయేలీయులను ఎందుకు పోనిచ్చి తిమి అని చెప్పుకొనిరి.

ఈ వచనంలో ఫరో హృదయం, అతని సేవకుల హృదయం ఇశ్రాయేలీయులకు విరోధంగా కఠినపరచబడడం మనం చూస్తాం. దేవుడు నరుల ఆలోచనలను ఎలాగైనా త్రిప్పగలడని ఈ సందర్భం మరోసారి మనకు జ్ఞాపకం చేస్తుంది. ఆయన "పాపం పరిపూర్ణమైన మనిషిని నాశనం చెయ్యాలనుకున్నప్పుడు" ఆ వ్యక్తి ఇక మార్పు చెందే అవకాశం లేకుండా కఠినపరుస్తూనే ఉంటాడు. ఇది ఆయనకు న్యాయమే. ఉదాహరణకు ఈ సందర్భాలు చూడండి.

1 సమూయేలు 2: 25 ​అయితే యెహోవా వారిని చంపదలచి యుండెను గనుక వారు తమ తండ్రి యొక్క మొఱ్ఱను వినకపోయిరి.

2 సమూయేలు 17: 14 అబ్షాలోమును ఇశ్రాయేలువారందరును ఈ మాట విని అర్కీయుడగు హూషై చెప్పిన ఆలోచన అహీతోపెలు చెప్పినదానికంటె యుక్తమని యొప్పు కొనిరి; ఏలయనగా యెహోవా అబ్షాలోముమీదికి ఉపద్రవమును రప్పింప గలందులకై అహీతోపెలు చెప్పిన యుక్తిగల ఆలోచనను వ్యర్థముచేయ నిశ్చయించి యుండెను.

నిర్గమకాండము 14:6-8 అంతట అతడు తన రథమును సిద్ధపరచుకొని, తన జనమును తనతోకూడ తీసికొని పోయెను. మరియు అతడు శ్రేష్ఠమైన ఆరువందల రథములను ఐగుప్తు రథముల నన్నిటిని వాటిలో ప్రతిదానిమీద అధిపతులను తోడు కొనిపోయెను. యెహోవా ఐగుప్తురాజైన ఫరో హృదయమును కఠినపరచగా అతడు ఇశ్రాయేలీయులను తరిమెను. అట్లు ఇశ్రాయేలీయులు బలిమిచేత బయలు వెళ్లు చుండిరి.

ఈ వచనాలలో ఫరో మరియు అతని సైన్యం ఇశ్రాయేలీయులను తరమడం మనం చూస్తాం. ఫరో మరియు అతని‌ సైన్యం ఇశ్రాయేలీయులను తరుముతుంటే ఇశ్రాయేలీయులు ధైర్యసాహసాలతో ముందుకు సాగుతున్నారు. ఇక్కడ ధైర్యసాహసాలు అన్నది సరైన తర్జుమా వాడుకబాష అనువాదంలో కూడా మనం ఇదే చూస్తాం.

నిర్గమకాండము 14:9 ఐగుప్తీయులు, అనగా ఫరో రథముల గుఱ్ఱము లన్నియు అతని గుఱ్ఱపు రౌతులు అతని దండును వారిని తరిమి, బయల్సెఫోను ఎదుటనున్న పీహహీరోతునకు సమీపమైన సముద్రము దగ్గర వారు దిగియుండగా వారిని కలిసికొనిరి.

ఈ వచనంలో ఫరోతో విస్తారమైన రథాలు గుఱ్ఱాలు, గుఱ్ఱపు రౌతులు ఉన్నట్టు మనం చూస్తాం. ఇవి యుద్ధసమయంలో ఉపయోగించేవి కాబట్టి మిగిలిన సమయంలో శాలల్లో కట్టబడి ఉంటాయి, అందుకే ఐగుప్తుపై దేవుడు వడగండ్ల వర్షం కురిపించినప్పుడు ఇవి చావకుండా తప్పించుకున్నాయి. పైగా ఫరో సేవకుల్లో దేవునికి భయపడినవారు వీటిని భద్రం చేసారు (నిర్గమకాండము 9:19,29). జంతువులపైకి తెగులును రప్పించినప్పుడు కూడా ఇవి చావకుండా ఎలా బ్రతికియున్నాయో ఇప్పటికే వివరించాను (నిర్గమకాండము 9:6 వ్యాఖ్యానం చూడండి).

నిర్గమకాండము 14:10-12 ఫరో సమీపించుచుండగా ఇశ్రా యేలీయులు కన్నులెత్తి ఐగుప్తీయులు తమవెనుక వచ్చుట చూచి మిక్కిలి భయపడి యెహోవాకు మొఱపెట్టిరి. అంతట వారు మోషేతో ఐగుప్తులో సమాధులు లేవని యీ యరణ్యములో చచ్చుటకు మమ్మును రప్పించితివా? మమ్మును ఐగుప్తులోనుండి బయటికి రప్పించి మమ్మును ఇట్లు చేయనేల? మా జోలికి రావద్దు, ఐగుప్తీయులకు దాసుల మగుదుమని ఐగుప్తులో మేము నీతో చెప్పినమాట యిదే గదా; మేము ఈ అరణ్యమందు చచ్చుటకంటెె ఐగుప్తీయు లకు దాసుల మగుటయే మేలని చెప్పిరి.

ఈ వచనాలలో ఫరో తమ వెనుక తరమడం గమనించిన ఇశ్రాయేలీయులు మోషేపై తిరుగుబాటు చెయ్యడం మనం చూస్తాం. ఇశ్రాయేలీయులు దేవునిపై (ఆయన సేవకుడిపై) చేసిన పది తిరుగుబాటుల్లో ఇది మొదటిది (సంఖ్యాకాండము 14:22). వీరు ఐగుప్తులో ఆయన జరిగించిన 10 సూచకక్రియలను కన్నులారా చూసినప్పటికీ ఊహించనివిధంగా ఐగుప్తునుండి విడుదల పొందినప్పటికీ తిరుగుబాటు చేసేవారిగానే ఉన్నారు (ద్వితియోపదేశకాండము 9:7). కానీ దేవుడు అబ్రాహాము ఇస్సాకు యాకోబులకు చేసిన ప్రమాణాన్ని బట్టి మాత్రమే వీరిని సహిస్తూ వచ్చాడు.

నిర్గమకాండము 14:13,14 అందుకు మోషేభయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగజేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి; మీరు నేడు చూచిన ఐగుప్తీయులను ఇకమీదట మరి ఎన్నడును చూడరు. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకయే యుండవలెనని ప్రజలతో చెప్పెను.

ఈ వచనాలలో మోషే ఇశ్రాయేలీయుల తిరుగుబాటు మాటలకు కృంగిపోకుండా కోపపడకుండా వారికి దేవుని తరపున ఆదరణ కలిగించే మాటలు పలకడం మనం చుస్తాం. నిజమైన దైవజనుడు ఇలాంటి లక్షణాలు కలిగియుంటాడు. అదేవిధంగా ఇక్కడ మోషే పలుకుతున్న మాటలను బట్టి దేవుని మార్గంలో పయనిస్తున్న విశ్వాసులు వారు పయనిస్తుంది దేవుడు నియమించిన మార్గంలో కాబట్టి, ఆ మార్గంలో శ్రమలు సంభవించినప్పుడు అధైర్యపడకుండా ఇశ్రాయేలీయుల్లా తిరుగుబాటు చెయ్యకుండా "యెహోవా కలుగచేసే రక్షణకోసం వేచిచూడాలి" "యెహోవా మన పక్షంగా యుద్ధం చేస్తాడు కాబట్టి మనం ఆందోళన చెందకూడదు".

నిర్గమకాండము 14:15,16 అంతలో యెహోవా మోషేతో నీవేల నాకు మొఱ పెట్టుచున్నావు? సాగిపోవుడి అని ఇశ్రాయేలీయులతో చెప్పుము. నీవు నీ కఱ్ఱను ఎత్తి ఆ సముద్రమువైపు నీ చెయ్యి చాపి దాని పాయలుగా చేయుము, అప్పుడు ఇశ్రాయేలీయులు సముద్రము మధ్యను ఆరిన నేలమీద నడిచిపోవుదురు.

ఈ వచనాలలో దేవుడు ఆయనకు మొఱ పెడుతున్న మోషేకు సముద్రవైపు తన చేతికర్రను చూపించి దానిని పాయలుగా చెయ్యమని ఆజ్ఞాపించడం మనం చూస్తాం. "నీవేల నాకు మొఱ పెట్టుచున్నావు?" అంటే ఆయన తనకు మోషే చేస్తున్న ప్రార్థనను అడ్డుకుంటున్నట్టు కాదు. ప్రస్తుతం అతని పని మొఱ పెడుతూ ఉండడం కాదు, సముద్రాన్ని పాయలుగా చెయ్యడం కాబట్టి (బహుశా అది దేవుడు ముందే చెప్పుంటాడు) ఆవిధంగా పలికి అతను చెయ్యవలసింది అతనికి జ్ఞాపకం చేస్తున్నాడు.

నిర్గమకాండము 14:17,18 ఇదిగో నేను నేనే ఐగుప్తీయుల హృదయములను కఠినపరుచుదును. వారు వీరిని తరుముదురు; నేను ఫరోవలనను అతని సమస్త సేనవలనను అతని రథముల వలనను అతని గుఱ్ఱపు రౌతులవలనను నాకు మహిమ తెచ్చు కొందును. నేను ఫరోవలనను అతని రథములవలనను అతని గుఱ్ఱపు రౌతులవలనను మహిమ తెచ్చుకొనునప్పుడు నేను యెహోవానని ఐగుప్తీయులు తెలిసికొందురనెను.

ఈ వచనాలలో దేవుడు, ఫరో మరియు అతని సేనలను ఆ సముద్రంలో నాశనం చెయ్యడం ద్వారా తనకు మహిమ తెచ్చుకుంటానని మరోసారి జ్ఞాపకం చెయ్యడం మనం చూస్తాం. ఆయన ఇశ్రాయేలీయులను కనానుకు దగ్గరదారిలో కాకుండా చుట్టు దారిలో సముద్రంవైపుగా నడిపించడానికి ఇది కూడా ఒక ప్రధానమైన కారణం. కాబట్టి ఆయన మనముందు సులభమైన మార్గం కాకుండా కష్టతరమైన మార్గం పెట్టినప్పటికీ అది ఆయన మహిమకోసమే అని గుర్తించాలి.

నిర్గమకాండము 14:19,20 అప్పుడు ఇశ్రాయేలీయుల యెదుట సమూహమునకు ముందుగా నడిచిన దేవదూత వారి వెనుకకుపోయి వారిని వెంబడించెను; ఆ మేఘస్తంభము వారి యెదుటనుండి పోయి వారి వెనుక నిలిచెను అది ఐగుప్తీయుల సేనకు ఇశ్రాయేలీయుల సేనకు నడుమ ప్రవేశించెను; అది మేఘము గనుక వారికి చీకటి కలిగెను గాని, రాత్రి అది వీరికి వెలుగిచ్చెను గనుక ఆ రాత్రి అంతయు ఐగుప్తీయులసేన ఇశ్రాయేలీయులను సమీపించలేదు.

ఈ వచనాలలో అంతవరకూ ఇశ్రాయేలీయులకు ముందుగా నడిచిన దూత ఇప్పుడు ఇశ్రాయేలీయుల సముహాం వెనుకకు రావడం, దానివల్ల ఐగుప్తీయులకు చీకటి‌ కలగడం, ఇశ్రాయేలీయులకు వెలుగు కలగడం మనం చూస్తాం. అలా ఇశ్రాయేలీయులకు ముందుగా వెనుకగా నడిచింది "దేవదూత" అని ఆయన ప్రత్యక్షమైన విధానాన్ని బట్టి ప్రస్తావించబడ్డాడు కానీ నిర్గమకాండము 13:21,22 ప్రకారం; ఇశ్రాయేలీయులకు ముందుగా నడిచింది యెహోవా దేవుడే. ఆ విషయం ఈ అధ్యాయం 24వ వచనంలో కూడా స్పష్టమౌతుంది. "అది‌ మేఘము గనుక" అంటే ఆ దేవదూతే మేఘం అని అర్థం కాదు. అది ఆయన సృష్టిస్తున్న మేఘస్థంభం, అగ్ని స్థంభాల గురించి అలా చెప్పబడింది. అందుకే యెహోవా వాటిమధ్యలో ఉన్నట్టు రాయబడింది "అయితే వేకువ జామున యెహోవా ఆ అగ్ని మేఘమయమైన స్తంభమునుండి ఐగుప్తీయుల దండు వైపు చూచి ఐగుప్తీయుల దండును కలవరపరచి" (నిర్గమకాండము 14:24). ఈవిధంగా ఇశ్రాయేలీయులకు మేఘస్థంభంగా అగ్నిస్థంభంగా తన ప్రభావాన్ని కనపరచి, ఈ సందర్భంలో దేవదూతగా ప్రస్తావించబడింది మరెవరో కాదు, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువే. దీనిగురించి మరింత వివరంగా తెలుసుకోవడానికి ఈ వ్యాసం చదవండి.

యెహోవా దూత యేసుక్రీస్తు

అదేవిధంగా ఇక్కడ మనం గుర్తించవలసిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ఇక్కడ యెహోవా దేవుడు ఇశ్రాయేలీయులకేమో అగ్నిస్థంభంగా వెలుగును పంచి ముందుకు నడిపించాడు, ఐగుప్తీయులకేమో మేఘంగా చీకటిని కలిగించి ఇశ్రాయేలీయులను సమీపించకుండా చేసాడు. సువార్తలో కూడా ఇదే జరుగుతుంది. ఆయన నిర్ణయంలో ఉన్నవారంతా ఆ సువార్తను బట్టి మారుమనస్సు పొంది‌ ఆయన వెలుగులోకి వస్తుంటే (అపో.కార్యములు 26:18), ఆయన నిర్ణయంలో లేనివారు అదే సువార్త తిరస్కారాన్ని బట్టి నిత్యచీకటిలో ప్రవేశించబోతున్నారు (మత్తయి 8:12).

నిర్గమకాండము 14:21,22 మోషే సముద్రమువైపు తన చెయ్యి చాపగా యెహోవా ఆ రాత్రి అంతయు బలమైన తూర్పుగాలిచేత సముద్రమును తొలగించి దానిని ఆరిన నేలగా చేసెను. నీళ్లు విభజింపబడగా ఇశ్రాయేలీయులు సముద్రము మధ్యను ఆరిన నేల మీద నడిచిపోయిరి. ఆ నీళ్లు వారి కుడి యెడమ ప్రక్కలను వారికి గోడవలె నుండెను.

ఈ వచనాలలో మోషే దేవుడు చెప్పినట్టుగా తన చేతిని సముద్రంవైపు చాపినప్పుడు ఆయన తూర్పుగాలిచేత ఆ సముద్రాన్ని పాయలుగా చెయ్యడం మనం చూస్తాం. ఆయన గాలిచేత చేసిన అద్భుతాలలో ఇది మరొకటి. ఆయన ఇదే గాలిని విసరింపచేసి జలప్రళయపు నీటిని తొలగించాడు (ఆదికాండము 8:1). ఆయన ఐగుప్తుపైకి ఇదే తూర్పుగాలి చేత మిడతలను రప్పించాడు, మరలా పడమటి గాలి చేత వాటిని తొలగించాడు (నిర్గమకాండము 10:13,19). ఈ సృష్టిలో సమస్తమూ ఆయనకు లోబడుతుందని రుజువు చెయ్యడానికే ఆయన ఈవిధంగా సృష్టిలోని వనరులను ఉపయోగించుకుని అద్భుతాలు చేస్తుంటాడు.

అదేవిధంగా ఆ సముద్రం పాయలుగా చీల్చబడినప్పుడు "ఆ నీళ్లు వారి కుడి యెడమ ప్రక్కలను వారికి గోడవలె నుండెను" అని చూస్తున్నాం. సాధారణంగా మన భూమిపై ఉండే గురుత్వాకర్షణ శక్తి వల్ల నీరు ఆ విధంగా గోడలుగా నిలబడియుండడం అసాధ్యం, అవి ప్రవహిస్తూనే ఉంటాయి. కానీ దేవుడు ఆ నీరు గోడలుగా నిలబడేలా గురుత్వాకర్షణ శక్తిని అధిగమించే మహా అద్భుతాన్ని చేసాడు‌.

నిర్గమకాండము 14:23-25 ఐగుప్తీయులును ఫరో గుఱ్ఱములును రథములును రౌతులును వారిని తరిమి సముద్ర మధ్యమున చేరిరి. అయితే వేకువ జామున యెహోవా ఆ అగ్ని మేఘమయమైన స్తంభమునుండి ఐగుప్తీయుల దండు వైపు చూచి ఐగుప్తీయుల దండును కలవరపరచి వారి రథచక్రములు ఊడిపడునట్లు చేయగా వారు బహు కష్టపడి తోలుచుండిరి. అప్పుడు ఐగుప్తీయులు ఇశ్రా యేలీయుల యెదుటనుండి పారిపోదము రండి; యెహోవా వారిపక్షమున మనతో యుద్ధము చేయుచున్నాడని చెప్పుకొనిరి.

ఈ వచనాలలో సముద్రమార్గంలో ఇశ్రాయేలీయులను తరుముతున్న ఐగుప్తీయులను యెహోవా దేవుడు కలవరపరచడం, ఐగుప్తీయులు ఆ విషయాన్ని గుర్తించి పారిపోవడానికి ప్రయత్నించడం మనం చూస్తాం. ఐగుప్తీయులను ఆయన ఎలా కలవరపరిచాడో మరికొన్ని వివరాలను కీర్తనాకారుడి మాటల్లో మనం గమనిస్తాం.

కీర్తనలు 77:18,19 నీ ఉరుముల ధ్వని సుడిగాలిలో మ్రోగెను మెరుపులు లోకమును ప్రకాశింపజేసెను భూమి వణకి కంపించెను. నీ మార్గము సముద్రములో నుండెను. నీ త్రోవలు మహా జలములలో ఉండెను. నీ యడుగుజాడలు గుర్తింపబడక యుండెను.

ఇక్కడ ఐగుప్తీయుల మరియు ఫరో పరిస్థితి చూడండి. ఇశ్రాయేలీయుల తరపున యెహోవా దేవుడు యుద్ధం చేస్తున్నాడని వారు ఐగుప్తులో ఉండగానే ఆయన రప్పించిన తెగుళ్ళను బట్టి గుర్తించారు. అయినప్పటికీ ఇశ్రాయేలీయులను తరుముతూ సముద్రం మధ్యలోకి చేరుకున్నారు. ఇప్పుడు మాత్రం పారిపోవడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ అది వారివల్ల కాదు. దేవునితో పోరాడాలనుకునేవారి పరిస్థితి ఇలానే ఉంటుంది, ఆయన వారిని నాశనపు అంచుకు నడిపించాక వివరం తెలుసుకున్నప్పటికీ ఎలాంటి ప్రయోజనం ఉండదు.

కీర్తనలు 73: 18,19 నిశ్చయముగా నీవు వారిని కాలుజారు చోటనే ఉంచియున్నావు వారు నశించునట్లు వారిని పడవేయుచున్నావు క్షణమాత్రములోనే వారు పాడై పోవుదురు మహాభయముచేత వారు కడముట్ట నశించుదురు.

నిర్గమకాండము 14:26-28 అంతలో యెహోవా మోషేతో ఐగుప్తీయుల మీదికిని వారి రథములమీదికిని వారి రౌతులమీదికిని నీళ్లు తిరిగి వచ్చునట్లు సముద్రముమీద నీ చెయ్యి చాపుమనెను. మోషే సముద్రముమీద తన చెయ్యి చాపగా ప్రొద్దు పొడిచినప్పుడు సముద్రము అధిక బలముతో తిరిగి పొర్లెను గనుక ఐగుప్తీయులు అది చూచి వెనుకకు పారిపోయిరి. అప్పుడు యెహోవా సముద్రముమధ్యను ఐగుప్తీయులను నాశము చేసెను. నీళ్లు తిరిగి వచ్చి ఆ రథములను రౌతులను వారి వెనుక సముద్రములోనికి వచ్చిన ఫరోయొక్క సర్వసేనను కప్పివేసెను; వారిలో ఒక్కడైనను మిగిలి యుండలేదు.

ఈ వచనాలలో‌ మోషే దేవుడు చెప్పినట్టుగా తన చేయిని సముద్రంపై చాపినప్పుడు సముద్రం యదావిధిగా మూసుకుపోయి ఐగుప్తీయులను ఫరోనూ నాశనం చెయ్యడం మనం చూస్తాం. ఇంతటితో ఫరో పైనా అతని సైన్యం పైనా దేవుని తీర్పు ముగిసింది.

కీర్తనలు 136: 15 ఫరోను అతని సైన్యమును ఎఱ్ఱసముద్రములో ఆయన ముంచివేసెను ఆయన కృప నిరంతరముండును.

నిర్గమకాండము 14:29 అయితే ఇశ్రాయేలీయులు ఆరిననేలను సముద్రము మధ్యనున్నప్పుడు ఆ నీళ్లు వారి కుడి యెడమ ప్రక్కలను గోడవలె నుండెను.

సముద్రమార్గంలో ఇశ్రాయేలీయులకూ ఐగుప్తీయులకూ మధ్యలో చాలా దూరం ఉంది. ఇశ్రాయేలీయులు ముందు ఉంటే ఐగుప్తీయులు వారి వెనుక తరుముతున్నారు. ఎప్పుడైతే ఐగుప్తీయులు తమతో యెహోవా దేవుడు యుద్ధం చేస్తున్నాడని గమనించారో వెనక్కు తిరిగిపారిపోవడం ప్రారంభించారు. ఆ సమయంలో సముద్రం ఎక్కడైతే చీలడం ప్రారంభమైందో అక్కడినుంచి యాదావిధిగా మూసుకుపోవడం మొదలైంది. అది ఇశ్రాయేలీయుల దగ్గరకు యదావిధిగా వచ్చేసరికి వారు తీరాన్ని చేరుకున్నారు.

నిర్గమకాండము 14:30,31 ఆ దినమున యెహోవా ఐగుప్తీయుల చేతిలోనుండి ఇశ్రాయేలీయులను రక్షించెను. ఇశ్రాయేలీయులు చచ్చిన ఐగుప్తీ యులను సముద్రతీరమున చూచిరి. యెహోవా ఐగుప్తీయులకు చేసిన గొప్ప కార్య మును ఇశ్రాయేలీ యులు చూచిరి గనుక ఆ ప్రజలు యెహోవాకు భయపడి యెహోవాయందును ఆయన సేవకుడైన మోషేయందును నమ్మకముంచిరి.

ఈ వచనాలలో ఇశ్రాయేలీయులు తీరం చేరుకున్నాక ఐగుప్తీయుల శవాలను చూసినట్టు, అప్పుడు వారు యెహోవాకు భయపడి ఆయనయందూ మోషేయందూ నమ్మికయుంచినట్టు మనం చూస్తాం. చూడండి; దేవుని ప్రజలను చంపాలని తరిమిన వారి శవాలు ఆ దేవుని ప్రజలు చూసేలా దేవుడు తీర్పుతీర్చాడు. దేవుని ప్రజలకు హాని చెయ్యాలనుకున్నవారి పరిస్థితి చివరికి ఇలానే ఔతుంది. కాబట్టి వారిని బట్టి మనం అభ్యంతరపడకూడదు, వారి నాశనాన్ని దేవుడు ఎప్పుడో నిర్ణయించేసాడు.

 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.