విషయసూచిక
- యెహోవా దూత దేవుడైన యెహోవా;
- యెహోవా దూత యెహోవా దేవుడనే లేఖనాధారమైన బోధపై, వ్యతిరేక వాదనలు;
- యెహోవా దూత,యేసుక్రీస్తు;
బైబిల్ గ్రంథంలో, ఆదికాండము 16 వ అధ్యాయం నుండి యెహోవా దూతగా పిలవబడే, ఒక దూత మనకు పరిచయం చేయబడతాడు. బైబిల్ గ్రంథంలో అనేక చోట్ల దేవదూతల గురించిన ప్రస్తావన మనకు కనిపిస్తూ ఉంటుంది.
అయితే, ఈ యెహోవా దూత అటువంటి సాధారణమైన దేవదూత కాదు; ఎందుకంటే, దేవదూతలు ఎక్కడా కూడా తమని తాము దేవునిగా, యెహోవాగా ప్రకటించుకోవు. లేఖనంలో కూడా వారు దేవుడని కానీ, యెహోవా అని కానీ రాయబడడు. ఎందుకంటే అది దేవదూషణ ఔతుంది. అదేవిధంగా వారు దేవునికి చెందవలసిన మహిమను ఎంతమాత్రమూ స్వీకరించరు.
ఉదాహరణకు;
ప్రకటన గ్రంథము 22:8,9 యోహానను నేను ఈ సంగతులను వినినవాడను చూచినవాడను; నేను విని చూచినప్పుడు వాటిని నాకు చూపుచున్న దూతపాదముల యెదుట నమస్కారము చేయుటకు సాగిలపడగా, అతడు వద్దుసుమీ, నేను నీతోను, ప్రవక్తలైన నీ సహోదరులతోను, ఈ గ్రంథ మందున్న వాక్యములను గైకొనువారితోను సహదాసుడను; దేవునికే నమస్కారము చేయుమని చెప్పెను.
ఈ సందర్భంలో యేసు శిష్యుడైన యోహాను ఒక దేవదూతకు నమస్కరించే ప్రయత్నం చేసినప్పుడు, ఆ దూత అతనిని అడ్డుకుంటూ దేవునికే నమస్కారం చేయమని చెబుతున్నాడు. దీనిని బట్టి దేవదూతలు దేవునికి చెందవలసిన మహిమను ఎంతమాత్రం స్వీకరించరని మనం అర్థం చేసుకోవాలి.
అయితే కొందరు ఆదికాండము 19 వ అధ్యాయంలో, లోతు ఇద్దరు దేవదూతలకు నమస్కరించిన సందర్భాన్ని చూపిస్తూ, దేవదూతలు కూడా భక్తుల నమస్కారాన్ని స్వీకరిస్తాయని భావిస్తారు. కానీ ఆ సందర్భంలో, లోతు ఇంటికి వచ్చిన దేవదూతలు, మనుష్యులుగా అతిధిలుగా వచ్చారు. ఆకాలంలో అతిథులకూ, కొందరు ప్రముఖ వ్యక్తులకూ సాష్టాంగ నమస్కారం చేయడం సాధారణంగా మనకు కనిపిస్తుంది. అదేవిధంగా లోతుకు వచ్చిన ఆ ఇద్దరూ దేవదూతలు అని తెలియదు, దానిగురించి బైబిల్ గ్రంథమే ఆధారాన్ని ఇస్తుంది.
హెబ్రీయులకు 13: 2 ఆతిథ్యము చేయ మరవకుడి; దానివలన కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యముచేసిరి.
ఒకవేళ లోతుకు వారు దేవదూతలని తెలిసుంటే, ఆ సందర్భంలో సొదొమ మనుష్యులు వారిని బలత్కరించబోయినప్పుడు, వారిని కాపాడడానికి తన కూతుళ్లను ఎందుకు అప్పగించే ప్రయత్నం చేస్తాడు? వచ్చిన వారు దేవదూతలు కనుక, తమను తాము కాపాడుకోగలరని భావించి ధైర్యంగా ఉండేవాడు. దీనిని బట్టి, ఆ సందర్భంలో దేవదూతలిద్దరూ మానవరూపాల్లో అతిథులుగా వచ్చారు కాబట్టి ఆ కాలపు సంస్కృతి ప్రకారం లోతు వారికి సాష్టాంగ నమస్కారం చేసినప్పుడు అతడిని అడ్డుకునే ప్రయత్నం చెయ్యలేదు.
అదేవిధంగా మరికొందరు దానియేలు సందర్భాన్ని కూడా అపార్థం చేసుకుని దూతలముందు సాష్టాంగపడే పద్ధతి పాతనిబంధన భక్తులకు ఉందని చెబుతుంటారు, దానిని కూడా చూడండి.
దానియేలు 8:17 అప్పుడతడు నేను నిలుచున్న చోటునకు వచ్చెను; అతడు రాగానే నేను మహా భయమొంది సాష్టాంగపడితిని; అతడు నర పుత్రుడా, యీ దర్శనము అంత్యకాలమును గూర్చినదని తెలిసికొనుమనెను.
ఈ సందర్భంలో దర్శనభావాన్ని తెలియచేయడానికి వచ్చిన గాబ్రియేలుకు దానియేలు సాష్టాంగపడినట్టు కనిపిస్తుంది. అయితే ఈ క్రింది వచనాన్ని కూడా మనం పరిశీలిస్తే దానియేలు ఉద్దేశపూర్వకంగా దేవునికి చేసినట్టుగా అతనిముందు సాష్టాంగపడలేదనీ, అతనికి కలిగిన భయం వల్ల, గాఢనిద్రపట్టి ఆవిధంగా నేలన సాష్టాంగపడ్డాడని (కూలబడ్డాడని) అర్థమౌతుంది.
దానియేలు 8:18 అతడు నాతో మాటలాడుచుండగా నేను గాఢనిద్రపట్టినవాడనై నేలను సాష్టాంగపడితిని గనుక అతడు నన్ను పట్టుకొని లేవనెత్తి నిలువబెట్టెను.
ఈవిధంగా మరో సందర్భం కూడా మనకు కనిపిస్తుంది.
దానియేలు 10:9,10 "నేను అతని మాటలు వింటిని; అతని మాటలు విని నేను నేలను సాష్టాంగపడి గాఢనిద్ర పొందినవాడనైతిని. అప్పుడొకడు చేతితో నన్ను ముట్టి నా మోకాళ్లను అరచేతులను నేలమోపి నన్ను నిలువబెట్టి"
అయితే, మనం చూస్తున్న యెహోవా దూత మాత్రం ప్రతీ సందర్భంలోనూ దేవునివలే మాట్లాడడం, భక్తులు ఆయనను దేవునిగా భావించడం, లేఖనం కూడా ఆయనను దేవునిగా, యెహోవాగా వర్ణించడం జరుగుతుంది; ఎందుకంటే, ఆయన దేవుడు, తండ్రితో పాటుగా యెహోవా అనే నామాన్ని కలిగిన యేసుక్రీస్తు ప్రభువైయున్నాడు.
ఈ వ్యాసం అంతటిలో మొదటిగా నేను యెహోవా దూత దేవుడని రాయబడిన ఆధారాలను చూపించి రెండవదిగా దీనిపై కొందరు చేసే వ్యతిరేక వాదనలకూ, అపోహలకూ సమాధానం ఇచ్చి చివరిగా ఆయన యేసుక్రీస్తు ప్రభువే అని స్పష్టం చేస్తాను.
1. యెహోవా దూత దేవుడైన యెహోవా;
ఆదికాండము 16:7-10 యెహోవా దూత అరణ్య ములో నీటిబుగ్గయొద్ద, అనగా షూరు మార్గములో బుగ్గ యొద్ద, ఆమెను కనుగొని శారయి దాసివైన హాగరూ, ఎక్కడనుండి వచ్చితివి, ఎక్కడికి వెళ్ళుచున్నావని అడిగి నందుకు అదినా యజమానురాలైన శారయియొద్దనుండి పారిపోవుచున్నాననెను. అప్పుడు యెహోవా దూతనీ యజమానురాలి యొద్దకు తిరిగి వెళ్లి ఆమె చేతి క్రింద అణిగియుండుమని దానితో చెప్పెను.మరియు యెహోవా దూతనీ సంతానమును నిశ్చయముగా విస్త రింపజేసెదను; అది లెక్కింప వీలులేనంతగా విస్తారమవునని దానితో చెప్పెను.
ఈ సందర్భంలో శారాయి దాసియైన హాగరుకు అరణ్యంలో ప్రత్యక్షమైన యెహోవా దూత మాట్లాడుతూ, నేను నీ సంతానాన్ని విస్తరింపచేస్తానని వాగ్ధానం చేస్తున్నాడు; ఇటువంటి వాగ్ధానాన్ని దేవుడు మాత్రమే చేయగలడు. దీని ఆధారంగా ఆయన ఇక్కడ తనను తాను దేవునిగా కనపరచుకుంటున్నాడు. ఆ విధంగా ఆయన కనపరచుకోవడమే కాదు హాగరు కూడా ఆయనను ఏ విధంగా గుర్తించిందో చూడండి;
ఆదికాండము16:13 అదిచూచుచున్న దేవుడవు నీవే అను పేరు తనతో మాటలాడిన యెహోవాకు పెట్టెను ఏలయనగా నన్ను చూచినవాని నేనిక్కడ చూచితిని గదా అని అనుకొనెను.
ఈ సందర్భంలో హాగరు మాటల ప్రకారం తనకు యెహోవా దూతగా ప్రత్యక్షమైన వ్యక్తి, దేవుడని ఆమె గుర్తించింది. ఇక్కడ కేవలం ఆమె మాత్రమే ఆయనను దేవునిగా సంబోధించడం లేదు కానీ పరిశుద్ధాత్మ ప్రేరణతో ఈ సంఘటనను రాస్తున్న మోషే కూడా ఆ మాట్లాడిన దూత యెహోవా అని స్పష్టం చేస్తున్నాడు. ఈ దూత గురించి మరికొన్ని సందర్భాలను చూద్దాం;
ఆదికాండము 21:17,18 దేవుడు ఆ చిన్నవాని మొరను వినెను. అప్పుడు దేవుని దూత ఆకాశమునుండి హాగరును పిలిచిహాగరూ నీకేమివచ్చినది? భయపడకుము; ఆ చిన్నవాడున్న చోట దేవుడు వాని స్వరము విని యున్నాడు; నీవు లేచి ఆ చిన్నవాని లేవనెత్తి నీ చేత పట్టుకొనుము; వానిని గొప్ప జనముగా చేసెదనని ఆమెతో అనెను.
ఈ సందర్భంలో అదే దూత హాగరుకు మరలా ప్రత్యక్షమై ఇష్మాయేలు గురించి గతంలో తాను చేసినటువంటి వాగ్ధానాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు; ఇప్పుడు అబ్రాహాముకు ఆయన ప్రత్యక్షమైన సందర్భాన్ని చూడండి;
ఆదికాండము 22:10-14 అప్పుడు అబ్రాహాము తన కుమారుని వధించుటకు తన చెయ్యి చాపి కత్తి పట్టుకొనగా యెహోవా దూత పరలోకమునుండి అబ్రాహామా అబ్రాహామా అని అతని పిలిచెను; అందుకతడుచిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన ఆ చిన్నవానిమీద చెయ్యి వేయకుము; అతని నేమియు చేయకుము; నీకు ఒక్కడైయున్న నీ కుమారుని నాకియ్య వెనుతీయ లేదుగనుక నీవు దేవునికి భయపడువాడవని యిందవలననాకు కనబడుచున్నదనెను. అప్పుడు అబ్రాహాము కన్ను లెత్తి చూడగా పొదలో కొమ్ములుతగులుకొనియున్న ఒక పొట్టేలు వెనుక తట్టున కనబడెను. అబ్రాహాము వెళ్లి ఆ పొట్టేలును పట్టుకొని తన కుమారునికి మారుగా పెట్టి దహన బలిగా అర్పించెను. అబ్రాహాము ఆ చోటికి యెహోవా యీరే అను పేరు పెట్టెను. అందుచేత యెహోవా పర్వతము మీద చూచుకొనును అని నేటి వరకు చెప్పబడును.
ఈ సందర్భంలో దేవుని మాట ప్రకారం అబ్రాహాము తన కుమారుడైన ఇస్సాకును బలిగా అర్పించే తరుణంలో, యెహోవా దూత అతనిని అడ్డుకుంటూ, నువ్వు నీకుమారుడిని నాకు ఇవ్వడానికి వెనుతీయలేదని పలుకుతున్నాడు. దీనిప్రకారం అబ్రాహాము ఏ దేవునిమాట ప్రకారమైతే ఆయనకు ఇస్సాకును బలిగా అర్పించబోయాడో, ఆ దేవునిగా ఈ యెహోవా దూత ఇక్కడ మనకు బయలుపరచబడుతున్నాడు. అదేవిధంగా, ఆ ప్రదేశానికి అబ్రాహాము యెహోవా ఈరే అని పేరుపెట్టడం ద్వారా, అతనికి ప్రత్యక్షమైన యెహోవా దూత యెహోవాగా పిలవబడుతున్నట్టు మనకు మరోసారి స్పష్టం ఔతుంది.
తండ్రియైన యెహోవాతో పాటుగా మరొకరు కూడా అదే యెహోవా అనే నామంతో ఉనికిలో ఉన్నట్టుగా లేఖనాలు మనకు స్పష్టమైన ఆధారాలు ఇస్తున్నాయి. ఉదాహరణకు ఈ వాక్యభాగం చూడండి.
ఆదికాండము 19:24 అప్పుడు యెహోవా సొదొమమీదను గొమొఱ్ఱామీదను యెహోవాయొద్ద నుండి గంధకమును అగ్నిని ఆకాశమునుండి కురిపించి-
సందర్భంలో చాలా స్పష్టంగా ఒక యెహోవా, మరో యెహోవా యొద్దనుండి అగ్నినీ గంధకాన్ని కురిపించినట్టుగా రాయబడింది; ఇదేసందర్భం గురించి రాయబడిన మరోమాటను కూడా చూడండి;
ఆమోసు 4:11 దేవుడు సొదొమ గొమొఱ్ణాలను బోర్లదోసి నాశనము చేసినట్లు నేను మీలో కొందరిని నాశనముచేయగా మీరు మంటలోనుండి తీయబడిన కొరవులైనట్టు తప్పించు కొంటిరి; అయినను మీరు నా తట్టు తిరిగినవారు కారు; ఇదే యెహోవా వాక్కు.
ఈ సందర్భంలో యెహోవా దేవుడు మాట్లాడుతూ (అందుచేతనే చివరిలో తన మాటలు యెహోవా వాక్కు అని పలుకుతున్నాడు) దేవుడు సొదొమ గొమొఱ్ణాలను నాశనం చేసినట్టుగా నేను మీలో కొందరిని నాశనం చేసానని, అయినా మీరు నాతట్టు తిరగినవారు కాదని అంటున్నాడు. ఒకవేళ ఆ మాటలు పలుకుతుంది ప్రవక్త ఐతే, మీరు నాతట్టు తిరిగినవారు కాదని, నేను మీలో కొందరిని నాశనం చేసానని ఎలా అంటాడు?
ఒకసారి మనం ఆదికాండము 18వ అధ్యాయం నుండీ 19 వ అధ్యాయం వరకూ జరిగిన చరిత్రను పరిశీలిస్తే ఆ సందర్భంలో అబ్రాహాముకు మొదటిగా ముగ్గురు వ్యక్తులు ప్రత్యక్షం ఔతారు. ఆ ముగ్గురిలో ఒకరిని మాత్రమే అబ్రాహాము ప్రభువుగా సంబోధించి, వారికి ఆతిథ్యం చేస్తాడు, వారిలో ఒకరు యెహోవా, మిగిలిన ఇద్దరు దేవదూతలు.
వారు భోజనం చేసిన తరువాత అబ్రాహాము ఇంటినుండి ఆ ఇద్దరు దేవదూతలూ, సొదొమ గొమొఱ్ణాల పట్టణంలోని లోతు ఇంటికి వెళ్తే (ఆదికాండము 19:1), యెహోవా మాత్రం, అబ్రాహాము ఉన్న చోటికి సమీపంలోనే ఉండి అతనితో సంభాషిస్తాడు. అబ్రాహాముకూ ఆయనకూ మధ్య ఆ సంభాషణ ముగిసిన తర్వాత ఆయన సొదొమ గొమొఱ్ణా పట్టణాలను సమీపించి, దేవదూతలు ఆ పట్టణం నుండి బయటకు తీసుకుని వచ్చిన లోతుతో మాట్లాడి పైనున్న మరో యెహోవా యొద్దనుండి అగ్నినీ గంధకాన్నీ కురిపించి ఆ పట్టణాలను నాశనం చేస్తాడు.
దీనిప్రకారం, సొదొమ గొమొఱ్ణాలు నాశనమైన ఆ సందర్భంలో ఇద్దరు యెహోవాలు పనిచేసినట్టుగా లేఖనం మనకు స్పష్టంగా తెలియచేస్తుంది. ఈ ఇద్దరు యెహోవాలను గురించిన మరికొన్ని సందర్భాలు, యెషయా గ్రంథంలోనూ, జెకర్యా గ్రంథంలోనూ కూడా మనకు కనిపిస్తాయి వాటిని చివరిలో చూద్దాం.
ఆ విధంగా అబ్రాహాముకూ, హాగరుకూ ఈ యెహోవాయే, పై సందర్భాలలో యెహోవా దూతగా ప్రత్యక్షమై వారితో మాట్లాడాడు. ముఖ్యంగా పరిశుద్ధాత్మ ప్రేరణతో ఆ సంఘటనలను రాస్తున్న రచయితలు ఆయన దేవుడని నిర్థారించారు. ఇప్పుడు ఆయన యాకోబుకు ప్రత్యక్షమైన సందర్భాన్ని చూడండి;
ఆదికాండము 31:10-13 మందలు చూలుకట్టు కాలమున నేను స్వప్న మందు కన్నులెత్తి చూడగా గొఱ్ఱెలను దాటు పొట్టేళ్లు చారలైనను పొడలైనను మచ్చలైనను గలవై యుండెను. మరియు ఆ స్వప్నమందు దేవుని దూత యాకోబూ అని నన్ను పిలువగాచిత్తము ప్రభువా అని చెప్పితిని. అప్పుడు ఆయననీ కన్నులెత్తి చూడుము; గొఱ్ఱెలను దాటు చున్న పొట్టేళ్లన్నియు చారలైనను పొడలైనను మచ్చలైనను గలవి; ఏలయనగా లాబాను నీకు చేయుచున్నది యావత్తును చూచితిని నీ వెక్కడ స్తంభముమీద నూనె పోసితివో, యెక్కడ నాకు మ్రొక్కుబడి చేసితివో ఆ బేతేలు దేవుడను నేనే. ఇప్పుడు నీవు లేచి యీ దేశ ములోనుండి బయలుదేరి నీవు పుట్టిన దేశమునకు తిరిగి వెళ్లుమని నాతో చెప్పెననెను.
ఈ సందర్భంలో దేవుని దూత యాకోబుతో మాట్లాడుతూ, నీవు బేతేలులో నూనె పోసి మ్రొక్కుబడి చేసుకున్న దేవుడను నేనే అని చెబుతున్నాడు. ఇంతకూ బేతేలులో యాకోబుకు స్వప్నంలో కనిపించింది దూతనా లేక యెహోవానా ఒకసారి చూడండి.
ఆదికాండము 28:11-18 యాకోబు ఒకచోట చేరి ప్రొద్దు గ్రుంకినందున అక్కడ ఆ రాత్రి నిలిచిపోయి, ఆ చోటి రాళ్లలో ఒకటి తీసికొని తనకు తలగడగా చేసికొని, అక్కడ పండు కొనెను. అప్పుడతడు ఒక కల కనెను. అందులో ఒక నిచ్చెన భూమిమీద నిలుపబడియుండెను; దాని కొన ఆకాశమునంటెను; దానిమీద దేవుని దూతలు ఎక్కుచు దిగుచునుండిరి. మరియు యెహోవా దానికి పైగా నిలిచినేను నీ తండ్రియైన అబ్రాహాము దేవుడను ఇస్సాకు దేవుడైన యెహోవాను; నీవు పండుకొనియున్న యీ భూమిని నీకును నీ సంతానమునకును ఇచ్చెదను. నీ సంతానము భూమిమీద లెక్కకు ఇసుక రేణువులవలెనగును; నీవు పడమటి తట్టును తూర్పుతట్టును ఉత్తరపు తట్టును దక్షిణపు తట్టును వ్యాపించెదవు, భూమియొక్క వంశములన్నియు నీ మూలముగాను నీ సంతానము మూలముగాను ఆశీర్వదింపబడును. ఇదిగో నేను నీకు తోడై యుండి, నీవు వెళ్లు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరల రప్పించెదను; నేను నీతో చెప్పినది నెరవేర్చువరకు నిన్ను విడువనని చెప్పగా యాకోబు నిద్ర తెలిసినిశ్చయముగా యెహోవా ఈ స్థలమందున్నాడు; అది నాకు తెలియక పోయెననుకొని భయపడిఈ స్థలము ఎంతో భయంకరము. ఇది దేవుని మందిరమే గాని వేరొకటికాదు; పరలోకపు గవిని ఇదే అనుకొనెను. తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తలగడగా చేసికొనిన రాయితీసి దానిని స్తంభముగా నిలిపి దాని కొనమీద నూనె పోసెను.
ఈ సందర్భంలో యాకోబుకు స్వప్నంలో ప్రత్యక్షమైంది యెహోవా దేవుడు. దీనిప్రకారం యాకోబు తన మామయైన లాబాను ఇంటిదగ్గర ఉండగా ఏ దేవుని దూతయైతే అతనికి ప్రత్యక్షమై నీ తండ్రి ఇంటికి తిరిగివెళ్ళమని ఆజ్ఞాపిస్తున్నాడో, ఆయనే గతంలో బేతేలులో కూడా యాకోబుకు యెహోవాగా ప్రత్యక్షమయ్యాడు.
ఇక్కడ మరో విషయాన్ని కూడా మనం గుర్తించాలి ఇక్కడ యాకోబుకు ప్రత్యక్షమైన దేవుని దూత యెహోవా దూత ఒకరే. ఈయనే కొన్ని సందర్భాలలో దేవుని దూతగానే కాదు, దూతగా కూడా పిలువబడ్డాడు. ఉదాహరణకు ఈ వచనం చూడండి.
ఆదికాండము 48:15,16 అతడు యోసేపును దీవించినా పితరులైన అబ్రాహాము ఇస్సాకులు ఎవనియెదుట నడుచుచుండిరో ఆ దేవుడు, నేను పుట్టినది మొదలుకొని నేటివరకును ఎవడు నన్ను పోషించెనో ఆ దేవుడు, అనగా సమస్తమైన కీడులలోనుండి నన్ను తప్పించిన దూత యీ పిల్లలను ఆశీర్వదించునుగాక; నా పేరును అబ్రాహాము ఇస్సాకు లను నా పితరుల పేరును వారికి పెట్టబడునుగాక; భూమియందు వారు బహుగా విస్తరించుదురుగాక అని చెప్పెను.
ఈ సందర్భంలో యాకోబు అతనికి తన మామ ఇంటిదగ్గర ఉండగా ప్రత్యక్షమైన దేవుని దూతను, బేతేలులో ప్రత్యక్షమైన యెహోవాను జ్ఞాపకం చేసుకుంటూ ఆయనను కేవలం దూతయని మాత్రమే సంబోధిస్తున్నాడు. దీనిప్రకారం, యాకోబుకు ప్రత్యక్షమైన దేవుని దూత, దూత ఒకరే. ఇప్పుడు ఈ దూత యెహోవా దూతయే అనడానికి ఆధారం చూడండి.
నిర్గమకాండము 23:20-23 ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరచిన చోటుకు నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను. ఆయన సన్నిధిని జాగ్రత్తగానుండి ఆయన మాట వినవలెను. ఆయన కోపము రేపవద్దు; మీ అతిక్రమములను ఆయన పరిహరింపడు, నా నామము ఆయనకున్నది. అయితే నీవు ఆయన మాటను జాగ్రత్తగా విని నేను చెప్పినది యావత్తు చేసినయెడల నేను నీ శత్రువులకు శత్రువును నీ విరోధులకు విరోధియునై యుందును. ఎట్లనగా నా దూత నీకు ముందుగావెళ్లుచు, అమోరీ యులు హిత్తీయులు పెరిజ్జీయులు కనా నీయులు హివ్వీయులు యెబూసీయులను వారున్న చోటుకు నిన్ను రప్పించును, నేను వారిని సంహరించెదను.
నిర్గమకాండము 33:2,3 నేను నీకు ముందుగా దూతను పంపి కనానీ యులను అమోరీయులను హిత్తీయులను పెరిజ్జీయులను హివ్వీయులను యెబూసీయులను వెళ్లగొట్టెదను. మీరు లోబడనొల్లని ప్రజలు గనుక నేను మీతో కూడ రాను; త్రోవలో మిమ్మును సంహరించెద నేమో అని మోషేతో చెప్పెను.
యెహోవా దేవునిగా పిలవబడుతున్న, ఏ దూత/దేవుని దూత గురించైతే యాకోబు పై సందర్భంలో జ్ఞాపకం చేసుకున్నాడో, అదే దూత గురించి ఈ సందర్భంలో తండ్రియైన యెహోవా దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ మనం ప్రాముఖ్యంగా గుర్తించవలసిన విషయం ఏమిటంటే, ఆ దూతకు దేవుని నామం ఉంది, అందుచేతనే ఆయన యెహోవాగా పిలవబడ్డాడు.
మనం పైన చూసిన తండ్రియైన దేవునిమాట ప్రకారంగా ఆ దూతయే, ఇశ్రాయేలీయులను ఐగుప్తునుండి విడిపించి కనానుకు నడిపించాడు. ఇప్పుడు ఆ దూత/దేవుని దూత ఎవరని రాయబడిందో చూడండి.
న్యాయాధిపతులు 2:1-3 యెహోవా దూత గిల్గాలునుండి బయలుదేరి బోకీము నకువచ్చి యీలాగు సెలవిచ్చెనునేను మిమ్మును ఐగుప్తులో నుండి రప్పించి, మీ పితరులకు ప్రమాణముచేసిన దేశము నకు మిమ్మును చేర్చినీతో చేసిన నిబంధన నేనెన్నడును మీరను. మీరు ఈ దేశనివాసులతో నిబంధన చేసి కొనకూడదు; వారి బలిపీఠములను విరుగగొట్టవలెనని ఆజ్ఞ ఇచ్చితిని గాని మీరు నా మాటను వినలేదు. మీరు చేసినపని యెట్టిది? కావున నేనుమీ యెదుటనుండి ఈ దేశనివాసులను వెళ్లగొట్టను, వారు మీ ప్రక్కలకు శూలములుగా నుందురు, వారి దేవతలు మీకు ఉరిగా నుందురని చెప్పుచున్నాను.
ఈ సందర్భంలో తండ్రియైన దేవుడు ఇశ్రాయేలీయులకు ముందుగా పంపినటువంటి, దూత/దేవుని దూత యెహోవా దూతగా సంబోధించబడ్డాడు. కాబట్టి యెహోవా దేవునిగా ప్రత్యక్షం ఔతున్న దేవునిదూత, దూత, యెహోవా దూత ఒకరే. దీనిగురించి క్రింద సందర్భాలలో కూడా మరలా జ్ఞాపకం చేసుకుందాం. ప్రస్తుతం ఈ యెహోవా దూత దేవుడని రుజువుచేసే మరికొన్ని సందర్భాలను కూడా చూద్దాం.
నిర్గమకాండము 3:1,2-6 మోషే మిద్యాను యాజకుడైన యిత్రో అను తన మామ మందను మేపుచు, ఆ మందను అరణ్యము అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చెను. ఒక పొద నడిమిని అగ్నిజ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను. గాని పొద కాలిపోలేదు. అప్పుడు మోషే ఆ పొద యేల కాలిపోలేదో నేను ఆ తట్టు వెళ్లి యీ గొప్పవింత చూచెదననుకొనెను. దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. దేవుడు ఆ పొద నడుమనుండిమోషే మోషే అని అతనిని పిలిచెను. అందుకతడుచిత్తము ప్రభువా అనెను. అందుకాయనదగ్గరకు రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులు విడువుము, నీవు నిలిచియున్న స్థలము పరిశుద్ధ ప్రదేశము అనెను. మరియు ఆయననేను నీ తండ్రి దేవుడను, అబ్రాహాము దేవుడను ఇస్సాకు దేవుడను యాకోబు దేవుడను అని చెప్పగా మోషే తన ముఖ మును కప్పుకొని దేవునివైపు చూడ వెరచెను.
ఈ సందర్భంలో మోషేకు యెహోవా దూత ప్రత్యక్షమై, తనను తాను దేవునిగా సంబోధించుకోవడం, ఆయన యెహోవా అని లేఖనంలో కూడా రాయబడడం మనకు కనిపిస్తుంది. ఇక్కడ తనకు కనిపించిన ఆ దూత గురించి తన చివరి దినాల్లో కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఆయన యెహోవా దేవుడని ఒప్పుకుంటున్నాడు.
ద్వితీయోపదేశకాండము 33:16 సంపూర్ణముగా ఫలించు భూమికి కలిగిన శ్రేష్ఠపదార్థ ములవలన యెహోవా అతని భూమిని దీవించును పొదలోనుండినవాని కటాక్షము యోసేపు తలమీదికి వచ్చును తన సహోదరులలో ప్రఖ్యాతినొందినవాని నడినెత్తి మీదికి అది వచ్చును.
ఆయన బిలాముకు ప్రత్యక్షమైన సందర్భం చూడండి;
సంఖ్యాకాండము 22:31-35 అంతలో యెహోవా బిలాము కన్నులు తెరచెను గనుక, దూసిన ఖడ్గము చేతపట్టుకొని త్రోవలో నిలిచియున్న యెహోవా దూతను అతడు చూచి తల వంచి సాష్టాంగ నమస్కారము చేయగా యెహోవా దూతయీ ముమ్మారు నీ గాడిదను నీవేల కొట్టితివి? ఇదిగో నా యెదుట నీ నడత విపరీతమైనది గనుక నేను నీకు విరోధినై బయలుదేరి వచ్చితిని. ఆ గాడిద నన్ను చూచి యీ ముమ్మారు నా యెదుటనుండి తొలిగెను; అది నా యెదుట నుండి తొలగని యెడల నిశ్చయముగా నేనప్పుడే నిన్ను చంపి దాని ప్రాణమును రక్షించి యుందునని అతనితో చెప్పెను. అందుకు బిలామునేను పాపముచేసితిని; నీవు నాకు ఎదురుగా త్రోవలో నిలుచుట నాకు తెలిసినది కాదు. కాబట్టి యీ పని నీ దృష్టికి చెడ్డదైతే నేను వెనుకకు వెళ్లెదనని యెహోవా దూతతో చెప్పగా యెహోవా దూతనీవు ఆ మనుష్యులతో కూడ వెళ్లుము. అయితే నేను నీతో చెప్పు మాటయేకాని మరేమియు పలుకకూడదని బిలాముతో చెప్పెను. అప్పుడు బిలాము బాలాకు అధికారులతో కూడ వెళ్లెను.
ఈ సందర్భంలో, యెహోవా దూత బిలాముతో, దేవునివలే మాట్లాడడం, బిలాము కూడ ఆయనను దేవునిగా గుర్తించి సాష్టాంగ నమస్కారం చేయడం మనకు కనిపిస్తుంది.
ఆయన గిద్యోనుకు ప్రత్యక్షమైన సందర్భాన్ని చూడండి;
న్యాయాధిపతులు 6:11-22 యెహోవా దూత వచ్చి అబీయెజ్రీయుడైన యోవాషునకు కలిగిన ఒఫ్రాలోని మస్తకివృక్షము క్రింద కూర్చుండెను. యోవాషు కుమారుడైన గిద్యోను మిద్యానీయులకు మరుగైయుండునట్లు గానుగ చాటున గోధుమలను దుళ్లగొట్టుచుండగా యెహోవా దూత అతనికి కనబడిపరాక్రమముగల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై యున్నాడని అతనితో అనగా గిద్యోనుచిత్తము నా యేలినవాడా, యెహోవా మాకు తోడైయుండినయెడల ఇదంతయు మాకేల సంభవిం చెను? యెహోవా ఐగుప్తులో నుండి మమ్మును రప్పించెనని చెప్పుచు, మా పితరులు మాకు వివరించిన ఆయన అద్భుతకార్యములన్నియు ఏ మాయెను? యెహోవా మమ్మును విడిచిపెట్టి మిద్యానీయుల చేతికి మమ్మును అప్పగించెనని అతనితో చెప్పెను. అంతట యెహోవా అతనితట్టు తిరిగిబలము తెచ్చుకొని వెళ్లి మిద్యానీయుల చేతిలోనుండి ఇశ్రాయేలీయులను రక్షింపుము, నిన్ను పంపినవాడను నేనే అని చెప్పగా అతడు చిత్తము నా యేలిన వాడా, దేని సహాయముచేత నేను ఇశ్రాయేలీయులను రక్షింపగలను? నా కుటుంబము మనష్షే గోత్రములో ఎన్నికలేనిదే. నా పితరుల కుటుంబములో నేను కనిష్ఠుడనై యున్నానని ఆయనతో చెప్పెను. అందుకు యెహోవా అయిన నేమి? నేను నీకు తోడై యుందును గనుక ఒకే మనుష్యుని హతము చేసినట్లు మిద్యానీయులను నీవు హతముచేయుదువని సెలవిచ్చెను. అందుకతడునాయెడల నీకు కటాక్షము కలిగినయెడల నాతో మాటలాడుచున్న వాడవు నీవే అని నేను తెలిసి కొనునట్లు ఒక సూచన కనుపరచుము. నేను నీయొద్దకు వచ్చి నా అర్పణమును బయటికి తెచ్చి నీ సన్నిధిని దానిని పెట్టువరకు ఇక్కడనుండి వెళ్లకుమీ అని వేడుకొనగా ఆయననీవు తిరిగి వచ్చువరకు నేను ఉండెదననెను. అప్పుడు గిద్యోను లోపలికి పోయి ఒక మేక పిల్లను తూమెడు పిండితో పొంగని భక్ష్యములను సిద్ధపరచి ఆ మాంసమును గంపలో ఉంచి అది వండిన నీళ్లను కుండలో పోసి ఆయనకొరకు ఆ మస్తకివృక్షముక్రిందికి దానిని తీసికొనివచ్చి దగ్గర ఉంచగా దేవుని దూత ఆ మాంస మును పొంగని భక్ష్యములను పట్టుకొని రాతి మీద పెట్టినీళ్లు పోయుమని అతనితో చెప్పెను. అతడాలాగు చేయగా యెహోవా దూత తన చేత నున్న కఱ్ఱను చాపి దాని కొనతో ఆ మాంసమును ఆ పొంగని భక్ష్యములను ముట్టినప్పుడు అగ్ని ఆ రాతిలోనుండి వెడలి ఆ మాంస మును పొంగని భక్ష్యములను కాల్చి వేసెను, అంతట యెహోవా దూత అతనికి అదృశ్య మాయెను. గిద్యోను ఆయన యెహోవా దూత అని తెలిసికొని అహహా నా యేలినవాడా, యెహోవా, ఇందుకే గదా నేను ముఖా ముఖిగా యెహోవా దూతను చూచితిననెను.
ఈ సందర్భంలో, మొదటిగా గిద్యోనుకు యెహోవా దూత ప్రత్యక్షమైనట్టుగా, తర్వాత ఆ దూత అతనివైపు చూసినప్పుడు ఆయన యెహోవా అన్నట్టుగా స్పష్టంగా రాయబడింది. అదేవిధంగా ఇక్కడ ప్రత్యక్షమైన యెహోవా దూత, దేవుని దూతగా కూడా వర్ణించబడ్డాడు. దీనినిబట్టి పై సందర్భంలో యెహోవా దేవునిగా తన ఉనికిని చాటుకుంటున్న యెహోవా దూత, దేవుని దూత, దూత ఒకరే అని మనకు మరింత స్పష్టత లభించింది. కొంచెం ముందుకు వెళ్తే మరో సందర్భంలో కూడా ఇటువంటి స్పష్టతే మనకు మరలా కనిపిస్తుంది.
ఆయన సంసోను తల్లితండ్రులకు ప్రత్యక్షమైన సందర్భాన్ని చూడండి;
న్యాయాధిపతులు 13:19-22 అంతట మానోహ నైవేద్యముగా నొక మేకపిల్లను తీసికొని యొక రాతిమీద యెహోవాకు అర్పించెను. మానోహయు అతని భార్యయు చూచుచుండగా ఆ దూత యొక ఆశ్చర్య కార్యము చేసెను. ఎట్లనగా, జ్వాలలు బలిపీఠము మీదనుండి ఆకాశమునకు లేచుచుండగా యెహోవా దూత బలిపీఠముమీదనున్న ఆ జ్వాలలలో పరమునకు ఆరో హణమాయెను. మానోహయు అతని భార్యయు దానిని చూచి నేలకు సాగిలపడిరి. ఆ తరువాత యెహోవా దూత మరల మానోహకును అతని భార్యకును ఇక ప్రత్య క్షము కాలేదు. ఆయన యెహోవా దూత అని మానోహ తెలిసికొనిమనము దేవుని చూచితిమి గనుక మనము నిశ్చయముగా చనిపోదుమని తన భార్యతో అనగా-
ఈ సందర్భంలో యెహోవా దూత, సంసోను తల్లితండ్రులకు ప్రత్యక్షమైనట్టు మనకు కనిపిస్తుంది. ఈ సంఘటనలో, మనోహా తనకు ప్రత్యక్షమైన యెహోవా దూత, దేవుడు అని తెలుసుకుని, ఆయనను చూసినందువల్ల మనం చనిపోతామేమో అనే భయంతో తన భార్యతో మాట్లాడుతున్నాడు. అదేవిధంగా ఈ యెహోవా దూత, ఈ సందర్భంలో దూతగా ప్రస్తావించబడ్డాడు.
ఆయన దావీదుకు ప్రత్యక్షమైన సందర్భం చూడండి;
మొదటి దినవృత్తాంతములు 21:15-19 యెరూషలే మును నాశనము చేయుటకై దేవుడు ఒక దూతను పంపెను; అతడు నాశనము చేయబోవుచుండగా యెహోవా చూచి ఆ చేటు విషయమై సంతాపమొంది నాశనముచేయు దూతతోచాలును, ఇప్పుడు నీ చెయ్యి ఆపుమని సెల వియ్యగా ఆ దూత యెబూసీయుడైన ఒర్నాను కళ్లమునొద్ద నిలిచెను. దావీదు కన్నులెత్తి చూడగా, భూమ్యా కాశముల మధ్యను నిలుచుచు, వరదీసిన కత్తిచేత పట్టుకొని దానిని యెరూషలేముమీద చాపిన యెహోవా దూత కనబడెను. అప్పుడు దావీదును పెద్దలును గోనె పట్టలు కప్పుకొనినవారై సాష్టాంగపడగా దావీదుజనులను ఎంచుమని ఆజ్ఞ ఇచ్చినవాడను నేనేగదా? పాపము చేసి చెడుతనము జరిగించినవాడను నేనేగదా? గొఱ్ఱెలవంటివారగు వీరేమి చేసిరి? నా దేవుడవైన యెహోవా, బాధపెట్టు నీ చెయ్యి నీ జనులమీద నుండ కుండ నామీదను నా తండ్రి యింటివారిమీదను ఉండ నిమ్మని దేవునితో మనవిచేసెను. యెబూసీయుడైన ఒర్నాను కళ్లమునందు యెహోవాకు ఒక బలిపీఠమును కట్టించుటకై దావీదు అచ్చటికి వెళ్లవలెనని దావీదునకు ఆజ్ఞ నిమ్మని యెహోవా దూత గాదునకు సెలవియ్యగా యెహోవా నామమున గాదు పలికిన మాట ప్రకారము దావీదు వెళ్లెను.
ఈ సందర్భంలో, దావీదు చేసిన పాపం కారణంగా దేవుడు ఇశ్రాయేలీయుల ప్రజలపైకి కీడును రప్పించినప్పుడు యెహోవా దూత వారిని నాశనం చేసినట్టుగా మనకు కనిపిస్తుంది. ఇక్కడ జరిగినదానిని మనం జాగ్రతగా పరిశీలిస్తే, దావీదు ఆ దూతను గుర్తించి ఆయన ముందు సాష్టాంగపడి మనవి చేసినట్టు, ఆ మనవిని అతను దేవునితో చేసినట్టు, అప్పుడు యెహోవా దూత గాదుకు బలిపీఠం కట్టమని ఆజ్ఞాపించినట్లు రాయబడింది.
ఇప్పుడు ఇదే సందర్భం గురించి వివరించబడిన మరో రెండు లేఖనభాగాల్లో, దావీదుకు ఆ ప్రదేశంలో ఎవరు ప్రత్యక్షమయ్యారో, గాదునకు బలిపీఠం కట్టమని ఎవరు ఆజ్ఞాపించారో చూడండి.
రెండవ దినవృత్తాంతములు 3:1 తరువాత సొలొమోను యెరూషలేములో తన తండ్రియైన దావీదునకు యెహోవా ప్రత్యక్షమైనప్పుడు మోరీయా పర్వతమందు దావీదు సిద్ధపరచిన స్థలమున యెబూసీయుడైన ఒర్నాను కళ్లమందు దావీదు ఏర్పరచిన స్థలమున యెహోవాకు ఒక మందిరమును కట్టనారంభించెను.
రెండవ సమూయేలు 24:19 దావీదు గాదుచేత యెహోవా యిచ్చిన ఆజ్ఞచొప్పున పోయెను.
ఈ లేఖనభాగాల్లో, దావీదునకు ఆ ప్రదేశంలో ప్రత్యక్షమైంది యెహోవా దేవుడేయనీ, ఆయనే గాదుకు బలిపీఠం కట్టమని ఆజ్ఞాపించాడని స్పష్టంగా రాయబడింది. దీని ప్రకారం, యెహోవా దూత యెహోవా దేవుడేయని మరొకసారి మనకు స్పష్టం ఔతుంది. అదేవిధంగా, ఈ సందర్భంలో కూడా మరొకసారి యెహోవా దూత, దూతగా ప్రస్తావించబడ్డాడు చూడండి.
రెండవ సమూయేలు 24:16,17 అయితే దూత యెరూషలేము పైని హస్తము చాపి నాశనము చేయబోయినప్పుడు, యెహోవా ఆ కీడును గూర్చి సంతాపమొంది-అంతే చాలును, నీ చెయ్యి తీయుమని జనులను నాశనముచేయు దూతకు ఆజ్ఞ ఇచ్చెను.యెహోవా దూత యెబూసీయుడైన అరౌనా యొక్క కళ్లము దగ్గర ఉండగా దావీదు జనులను నాశనము చేసిన దూతను కనుగొని యెహోవాను ఈలాగు ప్రార్థించెను.
ఈ యెహోవా దూతను గురించిన సందర్భాలు మరికొన్ని కూడా బైబిల్ గ్రంథంలో మనకు కనిపిస్తున్నప్పటికీ ఇప్పటికే ఆయన దేవుడైన యెహోవా అని అనేకసార్లు మనకు స్పష్టత వచ్చింది కాబట్టి వాటిని ఇక ప్రస్తావించడం లేదు.
2 యెహోవా దూత యెహోవా దేవుడనే లేఖనాధారమైన బోధపై, వ్యతిరేక వాదనలు;
కొంతమంది ఈ యెహోవా దూత గురించి మాట్లాడుతూ, ఆయన వాస్తవంగా యెహోవా దేవుడు కాడనీ, ఆకాలంలో భక్తులు దేవదూతను చూసి తెలియక దేవుడని సంబోధించారనీ, అదేవిధంగా దూత యొక్క మాటలు దేవునివి కనుక లేఖనంలో ఆ దూత దేవుడని రాయబడిందనీ వాదన చేస్తుంటారు. దానికి అనుకూలంగా వారు నూతన నిబంధన నుండి ఒక వాక్యభాగాన్ని కూడా తీసుకుంటూ ఉంటారు అదేమిటో చూడండి.
అపొస్తలుల కార్యములు 7:30 నలువది ఏండ్లయిన పిమ్మట సీనాయి పర్వతారణ్యమందు ఒక పొదలోని అగ్నిజ్వాలలో ఒక దేవదూత అతనికగపడెను.
ఈ వచనంలో, నిర్గమకాండం 3వ అధ్యాయంలో, మోషేకు కనిపించిన యెహోవా దూత, దేవదూత అని రాయబడింది, దీని ఆధారంగానే వారు యెహోవా దూత దేవుడు కాదనీ, సాధారణ దేవదూతనేయని చెప్పే ప్రయత్నం చేస్తారు.
ఇప్పుడు ఈ వాదనలకు సమాధానం చూద్దాం; మొదటిగా, యెహోవా దూతను చూసిన భక్తులకు, సాధారణమైన దేవదూతలకూ, దేవుడైన ఈ దూతకూ తేడా తెలుసని బైబిల్ స్పష్టంగా చెబుతుంది, చూడండి.
ఆదికాండము 32:1,2 యాకోబు తన త్రోవను వెళ్లుచుండగా దేవదూతలు అతనిని ఎదుర్కొనిరి. యాకోబు వారిని చూచిఇది దేవుని సేన అని చెప్పి ఆ చోటికి మహనయీము అను పేరు పెట్టెను.
ఈ సందర్భంలో యాకోబు, తనకు ఎదురుపడిన దేవదూతలను చూసినప్పుడు అతనికి సాధారణ దూతలకూ యెహోవా దూతకూ తేడా తెలుసు కాబట్టే వారిని ఇక్కడ దేవుని సేనగా గుర్తించాడు. కానీ ఇదే యాకోబు తనకు లాబాను ఇంటిదగ్గర కనిపించిన యెహోవా దూతను/దేవుని దూతను, దేవునిగా యెహోవాగా గుర్తించాడు.
న్యాయాధిపతులు 13:20-23 ఎట్లనగా, జ్వాలలు బలిపీఠము మీదనుండి ఆకాశమునకు లేచుచుండగా యెహోవా దూత బలిపీఠముమీదనున్న ఆ జ్వాలలలో పరమునకు ఆరో హణమాయెను. మానోహయు అతని భార్యయు దానిని చూచి నేలకు సాగిలపడిరి. ఆ తరువాత యెహోవా దూత మరల మానోహకును అతని భార్యకును ఇక ప్రత్య క్షము కాలేదు. ఆయన యెహోవా దూత అని మానోహ తెలిసికొనిమనము దేవుని చూచితిమి గనుక మనము నిశ్చయముగా చనిపోదుమని తన భార్యతో అనగా అతని భార్యయెహోవా మనలను చంపగోరినయెడల ఆయన దహనబలిని నైవేద్యమును మనచేత అంగీకరింపడు, ఈ సంగతులన్నిటిని మనకు చూపింపడు, ఈ కాలమున ఇట్టి సంగతులను మనకు వినిపింపడని అతనితో చెప్పెను.
ఈ సందర్భంలో సంసోను తండ్రికి కూడా సాధారణ దేవదూతలకూ, దేవుడైన యెహోవా దూతకూ తేడా తెలుసు కాబట్టే, అతనికి కనిపించింది యెహోవా దూత అని తెలుసుకుని దేవుణ్ణి చూసిన కారణం చేత తాము చనిపోతామని భయపడ్డాడు. ఆ దూత సాధారణ దేవదూతయే అయితే మనోహకు చనిపోతామని భయపడవలసిన అవసరం లేదు.
నూతన నిబంధనలో కూడా, యోహాను తండ్రియైన జెకర్యా, యేసుక్రీస్తు తల్లియైన మరియ, యోసేపులు వారికి ఒక దూత ప్రత్యక్షమైనపుడు భయానికి లోనయ్యారు, అయితే ఆ సందర్భంలో వారు చనిపోతామనే కారణంతో అలా భయానికి లోనవ్వలేదు కానీ, ఆ దూత తీసుకు వచ్చిన సమాచారం నిమిత్తమే అలా స్పందించారు.
లూకా 1: 12 జెకర్యా అతని చూచి, తొందరపడి భయపడిన వాడాయెను.
లూకా 1:28-30 ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచిదయాప్రాప్తురాలా నీకు శుభము; ప్రభువు నీకు తోడైయున్నాడని చెప్పెను. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనమేమిటో అని ఆలోచించు కొనుచుండగా దూత మరియా,భయపడకుము; దేవునివలన నీవు కృపపొందితివి.
కానీ, మనం పైన చూసిన సందర్భాలలోని పాతనిబంధన భక్తులు ఇలా దూత తీసుకువచ్చిన సమాచారం నిమిత్తం భయపడలేదు ఆ దూత దేవుడు కాబట్టి ఆయనను చూసినందుకు చనిపోతామనే భయపడ్డారు.
న్యాయాధిపతులు 6:22,23 గిద్యోను ఆయన యెహోవా దూత అని తెలిసికొని అహహా నా యేలినవాడా, యెహోవా, ఇందుకే గదా నేను ముఖా ముఖిగా యెహోవా దూతను చూచితిననెను. అప్పుడు యెహోవానీకు సమాధానము, భయపడకుము, నీవు చావవని అతనితో సెలవిచ్చెను.
ఈ సందర్భంలో గిద్యోను కూడా యెహోవా దూతను ముఖాముఖిగా చూసానని అనుకుంటున్నప్పుడు, యెహోవా అతనితో నీవు చావవని చెబుతూ ధైర్యాన్నిస్తున్నాడు. గిద్యోనుకు ప్రత్యక్షమైన యెహోవా దూత సాధారణ దూతయే ఐతే, అతను ఆ మాటలు పలుకవలసిన అవసరం లేదు. దీనినిబట్టి, పాతనిబంధన భక్తులకు సాధారణ దేవదూతలకూ, దేవునికీ తేడా తెలుసనీ, వారికి కనిపించిన యెహోవా దూత దేవుడు కాబట్టే వారు ఆయనను దేవునిగా గుర్తించారని మనకు అర్థం ఔతుంది.
ఒకవేళ ఇక్కడ నేను చూపించిన వచనాలను కాసేపు పక్కన పెట్టి, వాదనకోసం ఆ భక్తులు సాధారణ దేవదూతనే చూసి దేవుడని భ్రమపడ్డారు అనుకున్నప్పటికీ, మనం ఈ యెహోవా దూత గురించి చూసిన సందర్భాలలో ఆయన దేవుడని భక్తులు మాత్రమే కాదు, పరిశుద్ధాత్మ ప్రేరణతో ఆ చరిత్రను రాస్తున్న రచయితలు కూడా దానిని ఒప్పుకుంటూ ఆయన దేవుడనీ, యెహోవాయనీ, స్పష్టంగా రాయడం మనం చూసాం.
ఒకవేళ దీనిపై మరికొందరు వాదిస్తున్నట్లుగా, దూత మాట్లాడిన మాటలు దేవునివి కాబట్టి ఆవిధంగా రాయబడిందని అనుకుంటే, మిగిలిన సందర్భాలలో సాధారణ దేవదూతలు మాట్లాడినప్పుడు అక్కడ మాట్లాడుతుంది దేవుడని ఎందుకు రాయబడలేదు? ఆ దూతలు కనిపించినప్పుడు కూడా దేవుడని ఎందుకు రాయబడలేదు. భక్తులు కూడా వారిని దేవుడని ఎందుకు సంబోధించలేదనే ప్రశ్నలకు సమాధానం ఇవ్వవలసి వస్తుంది.
ఉదాహరణకు, యోహాను తండ్రియైన జెకర్యాకూ, యేసు తల్లియైన మరియకూ, ప్రకటన గ్రంథం రాసిన యోహానుకూ, పేతురుకూ, కొర్నేలికీ దేవదూతలు కనిపించిన ఆ సందర్భాలలో, వారు దేవుడని రచయిత రాయలేదు. వారు కూడా ఆ దూతల్ని దేవునిగా గుర్తించలేదు; ఒకవేళ ఆ దూతలు పలికిన మాటలు దేవునివి కావా? ఈ వాదన చేసేవారే సమాధానం ఇవ్వాలి. లేఖనాలు దేవుని స్థానాన్నీ, నామాన్నీ దేవదూతలకు ఆపాదించే అవకాశం ఎట్టిపరిస్థితుల్లోనూ లేదు. అది దేవదూషణ ఔతుందని ప్రారంభంలోనే తెలియచేసాము.
ఇప్పుడు స్తెఫను తన మాటల్లో మోషేకు కనిపించిన దేవుడైన యెహోవా దూతను దేవదూతయని ఎందుకు ప్రస్తావించాడో చూద్దాం.
1. యెహోవా దూతగా, దూతగా, దేవుని దూతగా పిలవబడిన వ్యక్తి, దేవుడు అయినప్పటికీ యెహోవా నామాన్ని కలిగినప్పటికీ, భక్తులయొద్దకు సమాచారం తీసుకువచ్చిన కారణంతో దూతగా పిలువబడ్డాడు ఎందుకంటే సమాచారాన్ని తీసుకువచ్చే వారిని దూతలు అని పిలవడం సహజంగానే జరుగుతుంది.
మనమిక్కడ యెహోవా దూతగా పిలవబడిన వ్యక్తిని ఆ పదప్రయోగాన్ని బట్టి దేవునిగా గుర్తించడం లేదు, అదే యెహోవా దూత, దూతగానూ, దేవుని దూతగానూ ఎలాగైతే పిలవబడ్డాడో అదేవిధంగా స్తెఫను కూడా తన మాటల్లో ఆయనను దేవదూతగా ప్రస్తావించాడు. అదే స్తెఫను ఆ దేవదూత గురించి పలికిన మిగిలిన మాటలు కూడా చూడండి.
అపొస్తలుల కార్యములు 7:30-34 నలువది ఏండ్లయిన పిమ్మట సీనాయి పర్వతారణ్యమందు ఒక పొదలోని అగ్నిజ్వాలలో ఒక దేవదూత అతనికగపడెను. మోషే చూచి ఆ దర్శనమునకు ఆశ్చర్యపడి దాని నిదానించి చూచుటకు దగ్గరకు రాగా నేను నీ పితరుల దేవుడను, అబ్రాహాము ఇస్సాకు యాకోబుల దేవుడను అని ప్రభువు వాక్కు వినబడెను గనుక మోషే వణకి, నిదానించి చూచుటకు తెగింప లేదు. అందుకు ప్రభువునీ చెప్పులు విడువుము; నీవు నిలిచియున్నచోటు పరిశుద్ధభూమి. ఐగుప్తులో నున్న నా ప్రజల దురవస్థను నేను నిదానించి చూచితిని; వారి మూలుగు వింటిని; వారిని విడిపించుటకు దిగివచ్చి యున్నాను; రమ్ము, నేనిప్పుడు నిన్ను ఐగుప్తునకు పంపుదునని అతనితో చెప్పెను.
నిర్గమకాండంలో ఏవిధంగానైతే మోషేకు యెహోవా దూత ప్రత్యక్షమైనప్పుడు, ఆ దూత యెహోవాగా, దేవునిగా వర్ణించబడ్డాడో దానిని ఇక్కడ స్తెఫను ఉన్నది ఉన్నట్టుగానే ప్రస్తావిస్తున్నాడు. అయితే స్తెఫను ఇక్కడ కేవలం యెహోవా దూతకు బదులు దేవదూత అని పలికాడు. దూతగా వచ్చిన దేవుణ్ణి దేవదూత అని సంబోధించినప్పటికీ అందులో ఎటువంటి ఇబ్బందీలేదని అతనికి తెలుసు.
అదేవిధంగా నూతన నిబంధన కాలంలో యూదులు ఎవరూ సాధారణంగా యెహోవా అనే నామాన్ని తమనోటితో ఉచ్చరించేవారు కాదు. ఈ కారణం చేత కూడా స్తెఫను తన మాటల్లో యెహోవాకు బదులు ప్రభువు అనీ, యెహోవా దూతకు బదులు దేవదూత అనీ ప్రస్తావించాడు.
ఈవిధంగా యెహోవా దూత, దేవదూతగా కేవలం స్తెఫను మాటల్లో మాత్రమే ప్రస్తావించబడలేదు కానీ, పాతనిబంధనలో మరోచోట కూడా ఆయనను దేవదూత అని ప్రస్తావించారు చూడండి.
మొదటి రాజులు 19:5-8 అతడు బదరీవృక్షము క్రింద పరుండి నిద్రించుచుండగా ఒక దేవదూత వచ్చి అతని ముట్టి-నీవు లేచి భోజనము చేయుమని చెప్పెను. అతడు చూచినంతలో అతని తలదగ్గర నిప్పుల మీద కాల్చబడిన అప్పమును నీళ్ల బుడ్డియు కనబడెను గనుక అతడు భోజనముచేసి తిరిగి పరుండెను. అయితే యెహోవా దూత రెండవమారు వచ్చి అతని ముట్టి-నీ శక్తికి మించిన ప్రయాణము నీకు సిద్ధమై యున్నది, నీవు లేచి భోజనము చేయుమని చెప్పినప్పుడు అతడు లేచి భోజనముచేసి, ఆ భోజనపు బలముచేత నలువది రాత్రింబగళ్లు ప్రయాణముచేసి, దేవుని పర్వతమని పేరుపెట్టబడిన హోరేబునకు వచ్చి-
ఈ సందర్భంలో ఏలియాకు కలిగిన ప్రత్యక్షతలో ఆయన మొదట దేవదూతయనీ, తరువాత యెహోవా దూతయనీ రాయబడింది. దీనినిబట్టి మనం దేవదూత, యెహోవా దూత, దేవుని దూత అనే పదప్రయోగాన్ని బట్టి కాకుండా అక్కడ లేఖనం చెప్పినదానినీ, భక్తులు గుర్తించినదానినీ బట్టి వారికి కనిపించింది ఎవరు అనేది అర్థం చేసుకోవాలి.
అదేవిధంగా బైబిల్ లోని కొన్ని సందర్భాలలో సాధారణ దేవదూతలనూ మరియు యాజకులను ఉద్దేశించి కూడా వారు యెహోవా దూతలనీ పదప్రయోగం చేయడం జరిగింది. కానీ ఆ సందర్భాలను మనం పరిశీలిస్తే వారు సాధారణ దేవదూతలు మరియు మానవులే అని మనకు అర్థం ఔతుంది.
2. యెహోవా దూత, దేవుడు అయినప్పటికీ, ఆయన భక్తులకు ప్రత్యక్షమైనప్పుడు ఆయన వారికి కనిపించిన విధానం బట్టి వారు ఆయనను అదేవిధంగా సంబోధించడం జరిగింది. ఆయన వారికి దూతగా కనిపించాడు కాబట్టి వారు ఆయనను దూత, యెహోవా దూత, దేవదూత, దేవుని దూత అని సంబోధించారు. లేఖనాలు కూడా మనకు ఆ సందర్భాలలో ఆయనను మొదట ఆ విధంగానే పరిచయం చేసి, తర్వాత ఆయన దేవుడనే స్పష్టతను ఇస్తాయి. ఉదాహరణకు ఈ సందర్భం చూడండి;
ఆదికాండము 32:24-30 యాకోబు ఒక్కడు మిగిలి పోయెను; ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. తాను అతని గెలువకుండుట చూచి తొడగూటిమీద అతనిని కొట్టెను. అప్పుడతడు ఆయనతో పెనుగులాడుటవలన యాకోబు తొడ గూడువసిలెను. ఆయనతెల్లవారు చున్నది గనుక నన్ను పోనిమ్మనగా అతడునీవు నన్ను ఆశీర్వ దించితేనే గాని నిన్ను పోనియ్యననెను. ఆయననీ పేరేమని యడుగగా అతడుయాకోబు అని చెప్పెను. అప్పుడు ఆయననీవు దేవునితోను మనుష్యులతోను పోరాడి గెలిచితివి గనుక ఇకమీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదని చెప్పెను. అప్పుడు యాకోబునీ పేరు దయచేసి తెలుపుమనెను. అందు కాయననీవు ఎందునిమిత్తము నా పేరు అడిగితివని చెప్పి అక్కడ అతని నాశీర్వదించెను. యాకోబునేను ముఖా ముఖిగా దేవుని చూచితిని అయినను నా ప్రాణము దక్కినదని ఆ స్థలమునకు పెనూయేలు అను పేరు పెట్టెను.
ఈ సందర్భంలో యాకోబుతో పెనుగులాడిన వ్యక్తి మొదటిగా నరుడు అని పరిచయం చేయబడతాడు. కానీ, ఆయన దేవుడని ఆ క్రింది వచనాల్లో మనకు స్పష్టం చేయబడుతుంది. యాకోబుతో పెనుగులాడిన వ్యక్తి దేవుడు అయినప్పటికీ, ఆయన నరుడిలా అతని దగ్గరకు వచ్చాడు కాబట్టి లేఖనం ఆయనను మొదట ఆవిధంగానే మనకు పరిచయం చేసి, చివరిగా ఆయన దేవుడని స్పష్టం చేస్తుంది. ఇదే సందర్భం గురించి మరొక భాగం చూడండి;
హొషేయ 12:3,4,5 తల్లి గర్భమందు యాకోబు తన సహోదరుని మడిమెను పట్టుకొనెను, మగసిరి కలవాడై అతడు దేవునితో పోరాడెను. అతడు దూతతో పోరాడి జయమొందెను, అతడు కన్నీరు విడిచి అతని బతిమాలెను బేతేలులో ఆయన అతనికి ప్రత్యక్షమాయెను, అక్కడ ఆయన మనతో మాటలాడెను; యెహోవా అని, సైన్యములకధిపతియగు యెహోవా అని, ఆయనకు జ్ఞాపకార్థనామము.
ఈ సందర్భంలో యాకోబుతో పెనుగులాడినప్పుడు, నరునిగా కనిపించిన దేవుడు, దూత/యెహోవా దూతయని రాయబడింది. దీనినిబట్టి యెహోవా దూతగా ప్రత్యక్షమౌతున్న దేవుడు తాను ప్రత్యక్షమైన విధానాన్ని తెలియచెయ్యడానికే ఆయన దూతయనీ, నరుడనీ పిలవబడ్డాడు. అందుకే స్తెఫను మాటల్లోనూ, ఏలియా సందర్భంలోనూ ఆయనను దేవదూతగా వర్ణించారు తప్ప ఆయన సాధారణమైన దేవదూతయని కాదు.
ఇప్పుడు, యెహోవా దూత దేవుడు కాదని వాదించేవారు తీసుకువచ్చే మరొక వాదన చూడండి. బైబిల్ గ్రంథంలో ఎన్నోచోట్ల, దేవుడైన యెహోవా సీనాయి పర్వతంపై మోషేకు ధర్మశాస్త్రాన్ని ఇచ్చినట్టు రాయబడింది (నిర్గమకాండము 19,20 అధ్యాయాలు).
నెహెమ్యా 9:13,14 సీనాయి పర్వతము మీదికి దిగి వచ్చి ఆకాశమునుండి వారితో మాటలాడి, వారికి నీతియుక్తమైన విధులను సత్యమైన ఆజ్ఞలను మేలు కరములైన కట్టడలను ధర్మములను నీవు దయచేసితివి. వారికి నీ పరిశుద్ధమైన విశ్రాంతి దినమును ఆచరింప నాజ్ఞ ఇచ్చి నీ దాసుడైన మోషేద్వారా ఆజ్ఞలను కట్టడలను ధర్మశాస్త్రమును వారికి నియమించితివి.
అయితే నూతన నిబంధనలోని మూడు సందర్భాలలో ఈ ధర్మశాస్త్రాన్ని మోషేకు దేవదూతలు ఇచ్చినట్టుగా రాయబడింది, చూడండి;
గలతియులకు 3:19 ఆలాగైతే ధర్మశాస్త్ర మెందుకు? ఎవనికి ఆ వాగ్దానము చేయబడెనో ఆ సంతానము వచ్చువరకు అది అతి క్రమములనుబట్టి దానికి తరువాత ఇయ్యబడెను; అది మధ్యవర్తి చేత దేవదూతల ద్వారా నియమింపబడెను.
అపొస్తలుల కార్యములు 7:53 దేవదూతల ద్వారా నియమింపబడిన ధర్మశాస్త్రమును మీరు పొందితిరిగాని దానిని గైకొనలేదని చెప్పెను.
హెబ్రీయులకు 2: 2 ఎందుకనగా దేవదూతల ద్వారా పలుకబడిన వాక్యము స్థిరపరచబడినందున, ప్రతి అతిక్రమమును అవిధేయతయు న్యాయమైన ప్రతిఫలము పొందియుండగా-
ఇప్పుడు యెహోవా దూత, దేవుడైన యెహోవా కాదని చెప్పేవారు వీటినన్నిటినీ చూపించి, పాతనిబంధనలో మోషేకు దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చినట్టుగా రాయబడింది, కానీ కొత్తనిబంధనలో ఆ ధర్మశాస్త్రాన్ని దేవదూతలే ఇచ్చారని రాయబడింది. దీనిప్రకారం ధర్మశాస్త్రాన్ని దేవదూతలే ఇచ్చినప్పటికీ, ఆ ప్రజలకు అర్థం కావడానికీ దేవుడని రాయబడిందనీ, ఇదేవిధంగా పాతనిబంధనలో యెహోవా దూత ప్రత్యక్షమైనప్పుడు కూడా అతను సాధారణమైన దేవదూతయే అయినప్పటికీ, ఆ ప్రజలకు అర్థం కావడానికే దేవుడనీ, యెహోవాయనీ రాయబడిందని చెబుతారు.
కానీ పాత నిబంధనలో మోషేకు ధర్మశాస్త్రాన్ని ఇచ్చింది దేవుడైతే , నూతన నిబంధనలో దానిని దేవదూతలు ఇచ్చినట్టుగా ఎందుకు రాయబడిందో ఈ వచనాలను పరిశీలించండి.
ద్వితీయోపదేశకాండము 33:2-4 శేయీరులోనుండి వారికి ఉదయించెను ఆయన పారాను కొండనుండి ప్రకాశించెను వేవేల పరిశుద్ద సమూహముల మధ్యనుండి ఆయన వచ్చెను ఆయన కుడిపార్శ్వమున అగ్నిజ్వాలలు మెరియు చుండెను. ఆయన జనములను ప్రేమించును ఆయన పరిశుద్ధులందరు నీ వశమున నుందురు వారు నీ పాదములయొద్ద సాగిలపడుదురు నీ ఉపదేశమును అంగీకరింతురు.మోషే మనకు ధర్మశాస్త్రమును విధించెను అది యాకోబు సమాజ స్వాస్థ్యము.
ఈ సందర్భంలో సీనాయి కొండపైన దేవుడు ధర్మ శాస్త్రాన్ని ఇచ్చేటప్పుడు, జరిగిన దానిగురించి మోషే రాస్తున్నాడు. ఆ సమయంలో ఆయనతో పాటుగా పరిశుద్ధ సమూహములు (దేవదూతలు) కూడా ఉన్నట్లుగా ఈ మాటల్లో స్పష్టం ఔతుంది. దీనిగురించి మరో సందర్భం చూడండి;
కీర్తనల గ్రంథము 68:17 దేవుని రథములు సహస్రములు సహస్రసహస్రములు ప్రభువు వాటిలో నున్నాడు సీనాయి పరిశుద్ధమైనట్టు ఆ కొండ పరిశుద్ధమాయెను.
ఇక్కడ కూడా, సీనాయి కొండపైన దేవుడు తన సైన్యంతో దిగినట్టు, ఇదే వచనాన్ని ఇంగ్లీషు భాషలో మనం చదివితే, ఆ సైన్యంలో వేలకొలదీ దేవదూతలు ఉన్నట్టు రాయబడింది.
Psalm 68: 17 The chariots of God are twenty thousand, even thousands of angels: the Lord is among them, as in Sinai, in the holy place.
దీనిప్రకారం దేవుడు మోషేకు ధర్మశాస్త్రాన్ని ఇచ్చేటప్పుడు ఆయనతో పాటుగా దేవదూతలు కూడా ఉన్నారు. కాబట్టి దేవుడు మోషేకు ధర్మ శాస్త్రాన్ని ఇచ్చేటప్పుడు దేవదూతలు కూడా ప్రమేయాన్ని కలిగియున్నారు; అందుకే నూతన నిబంధన నుండి మనం చూసిన లేఖనభాగాల్లో మోషేకు వారే ధర్మశాస్త్రాన్ని ఇచ్చినట్టు రాయబడింది.
ఒకవేళ ఇది తప్పని చెప్పేవారి వాదన ప్రకారం చూసినప్పటికీ, పాతనిబంధనలో దేవుడు మోషేకు ధర్మశాస్త్రాన్ని ఇచ్చిన సమయంలో, దేవుడు అని ఉన్నది తప్ప, దేవుళ్ళు అని లేదు. ఆ దేవుడు వీరు చెబుతున్నట్లుగా ఒక దేవదూతయే ఐతే, ప్రజలకు అర్థం అవ్వడానికే ఆ దేవదూతను దేవుడని రచయిత రాసుంటే, దానికి ఆధారంగా వారు చూపిస్తున్న కొత్తనిబంధన లేఖనాల్లో కూడా దేవదూత మోషేకు ధర్మశాస్త్రాన్ని ఇచ్చినట్టు, పలికినట్టు రాయబడలే తప్ప, "దేవదూతలు అని బహువచనం" ఎందుకు ప్రయోగించబడింది?
అపో. కార్యములు 7:53, గలతీ 3:19లో ధర్మశాస్త్రాన్ని ఇచ్చింది దేవదూతలు అని బహువచనం ప్రయోగించబడడం మనం చూసాం, దీనికి వారు సమాధానం చెప్పాలి.
ఇప్పుడు హెబ్రీ పత్రిక 2:2 లో, దేవదూతల ద్వారా పలుకబడిన వాక్యం అంటే అర్థం ఏంటో చూద్దాం.
దానికంటే ముందుగా మనం పైన సమాధానం చూసిన వాదనకు కొనసాగింపుగా వారు, నూతన నిబంధనలో, దేవుణ్ణి ఎవరూ చూడలేదు, ఆయన స్వరాన్ని ఎవరూ వినలేదనే లేఖనాలను చూపించి, దానిప్రకారం కూడా, మోషేకు ప్రత్యక్షమై ధర్మశాస్త్రం ఇచ్చింది దేవుడు కాదు దేవదూతలే అనీ, యెహోవా దూత కూడా సాధారణమైన దేవదూతయేయనీ మాట్లాడుతుంటారు; దానికి కూడా సమాధానం చూద్దాం.
యోహాను 1:18, యోహాను 5:37, 1యోహాను 4:12, ఈ వచనాలలో మనకు దేవుణ్ణి ఎవరూ చూడలేదనే వాక్యభాగాలు కనిపిస్తాయి. అయితే, దేవుడు తన భక్తులకు ప్రత్యక్షమైనట్టుగా స్పష్టంగా రాయబడిన సందర్భాలు కూడా చూడండి.
యెషయా గ్రంథము 6:1-3 రాజైన ఉజ్జియా మృతినొందిన సంవత్సరమున అత్యు న్నతమైన సింహాసనమందు ప్రభువు ఆసీనుడైయుండగా నేను చూచితిని; ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనెను. ఆయనకు పైగా సెరా పులు నిలిచియుండిరి; ఒక్కొక్కరికి ఆరేసి రెక్క లుండెను. ప్రతివాడు రెండు రెక్కలతో తన ముఖ మును రెంటితో తన కాళ్లను కప్పుకొనుచు రెంటితో ఎగురు చుండెను. వారుసైన్యముల కధిపతియగు యెహోవా, పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు; సర్వలోకము ఆయన మహిమతో నిండియున్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి.
దానియేలు 7:9,10 ఇంక సింహాసనములను వేయుట చూచితిని; మహా వృద్ధుడొకడు కూర్చుండెను. ఆయన వస్త్రము హిమము వలె ధవళముగాను, ఆయన తలవెండ్రుకలు శుద్ధమైన గొఱ్ఱెబొచ్చువలె తెల్లగాను ఉండెను. ఆయన సింహాసనము అగ్నిజ్వాలలవలె మండుచుండెను; దాని చక్రములు అగ్నివలె ఉండెను. అగ్నివంటి ప్రవాహము ఆయనయొద్దనుండి ప్రవహించుచుండెను. వేవేలకొలది ఆయనకు పరిచారకులుండిరి; కోట్లకొలది మనుష్యులు ఆయనయెదుట నిలిచిరి, తీర్పుతీర్చుటకై గ్రంథములు తెరువబడెను.
యెహెజ్కేలు 1:26-28 వాటి తలల పైనున్న ఆ మండలముపైన నీల కాంతమయమైన సింహాసనమువంటి దొకటి కనబడెను; మరియు ఆ సింహాసనమువంటి దానిమీద నరస్వరూపి యగు ఒకడు ఆసీనుడైయుండెను. చుట్టు దాని లోపట కరుగుచున్న యిత్తడియు అగ్నియు నున్నట్టు నాకు కనబడెను. నడుము మొదలుకొని మీదికిని నడుము మొదలు కొని దిగువకును ఆయన అగ్నిస్వరూపముగా నాకు కనబడెను, చుట్టును తేజోమయముగా కనబడెను. వర్ష కాలమున కనబడు ఇంద్ర ధనుస్సుయొక్క తేజస్సువలె దాని చుట్టునున్న తేజస్సు కనబడెను. ఇది యెహోవా ప్రభావ స్వరూప దర్శనము. నేను చూచి సాగిలపడగా నాతో మాటలాడు ఒకని స్వరము నాకు వినబడెను.
ఈ సందర్భాలలోనూ, మరికొన్ని సందర్భాలలోనూ యెహోవా దేవుడు తన భక్తులకు ప్రత్యక్షమైనట్టు తన స్వరాన్ని వారికి వినిపించినట్టు స్పష్టంగా రాయబడింది.
అలాంటప్పుడు, పైన మనం చూసిన లేఖనభాగాల్లో దేవుణ్ణి ఎవరూ చూడలేదనీ, ఆయన స్వరాన్ని ఎవరూ వినలేదని ఎందుకు రాయబడిందంటే, ఒకసారి దేవునిగురించి లేఖనం చెప్పేమాటను చూడండి;
యోహాను సువార్త 4:24 దేవుడు ఆత్మగనుక ఆయనను ఆరాధించు వారు ఆత్మతోను సత్యముతోను ఆరాధింపవలెననెను.
ఈ వచనం ప్రకారం, దేవుడు ఆత్మ, అదేవిధంగా ఆయన అనంతుడు. అనంతుడైన, ఆత్మయైన దేవుణ్ణి పరిమితి కలిగిన, శరీరంతో ఉన్న మానవుడు చూడలేడు, ఆయన స్వరాన్ని వినలేడు; అందుచేతనే దేవుణ్ణి ఎవరూ చూడలేదనీ, ఆయన స్వరాన్ని ఎవరూ వినలేదని రాయబడింది.
అయితే, ఆ దేవుడు మానవులకు అర్థమయ్యే విధంగా తనను తాను ప్రత్యక్షపరచుకున్నపుడు భక్తులు ఆయనను చూసారు, ఆయన స్వరాన్ని విన్నారు. అందుకే దేవుడు ప్రత్యక్షమైనట్టుగా మనం చూసిన పై సందర్భాలలో ఆయనకు మనవలే దేహం ఉన్నట్టుగా రాయబడింది. ఈ విధంగా రాయబడడాన్ని, 'anthropomorphism' అంటారు.
దీనిప్రకారం, దేవుణ్ణి ఎవరూ చూడలేదు అని రాయబడింది వాస్తవమే ఎందుకంటే, ఆత్మ, అనంతుడైన దేవుణ్ణి ఆ విధంగా ఎవరూ చూడలేదు. అదేవిధంగా, దేవుణ్ణి చూసారని రాయబడింది కూడా వాస్తవమే, ఆయన మానవులకు అర్థమయ్యే విధంగా ప్రత్యక్షమైనప్పుడు, ఆ రూపాన్ని భక్తులు చూసి ఆయన స్వరాన్ని విన్నారు.
ఇది మరింత స్పష్టంగా అర్థం అయ్యేందుకు ఒక ఉదాహరణ చూద్దాం. ప్రభువైన యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచాక, ఆయన తన శిష్యులకు ప్రత్యక్షమైనట్టుగా, వారు ఆయనను చూసినట్టుగా అనేక సందర్భాలలో మనకు కనిపిస్తుంది. అదేవిధంగా అపో. కార్యములు 9:4 లో ఆయనను సౌలు/పౌలు చూసాడు, అదే అధ్యాయం 10వ వచనంలో అననీయ చూసాడు. మరలా అపో. కార్యములు 22:17లో పౌలు చూసాడు, ఇలా చెప్పుకుంటూ వెళ్తే, యోహాను, స్తెఫను కూడా ఆయనను చూసారు. ఇప్పుడు యేసుక్రీస్తు గురించి రాయబడిన మాటలు చూడండి;
మొదటి తిమోతికి 6:14-16 మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షమగు వరకు నీవు నిష్కళంకముగాను అనింద్యముగాను ఈ ఆజ్ఞను గైకొన వలెనని నీకు ఆజ్ఞాపించుచున్నాను. శ్రీమంతుడును అద్వితీయుడునగు సర్వాధిపతి యుక్తకాలములయందు ఆ ప్రత్యక్షతను కనుపరచును. ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభువులకు ప్రభువునైయున్నాడు. సమీపింపరా
ఈ సందర్భమంతా తండ్రియైన దేవునిగురించి కాదు, యేసుక్రీస్తు గురించే రాయబడింది. మనం ఎదురుచూసేది ఆయన ప్రత్యక్షత కొరకేకదా. కానీ ఈమాటల్లో, ఆ యేసుక్రీస్తును ఎవరూ చూడలేదనీ, చూడలేరని పౌలు చెబుతున్నాడు. దీనిప్రకారం శిష్యులు చూసిందీ, పౌలు చూసిందీ, యోహాను, స్తెఫనులు చూసింది యేసుక్రీస్తును కాదా? దేవదూతనా? కాదు కదా, వారు చూసింది యేసుక్రీస్తునే.
మరి పౌలు ఎందుకిలా రాస్తున్నాడని మనం పరిశీలిస్తే, యేసుక్రీస్తు త్రిత్వంలో రెండవ వ్యక్తిగా ఉన్నటువంటి దేవుడు, ఆయన కూడా ఆత్మ, అనంతుడైయున్నాడు. దీనివల్ల ఆయనను కూడా ఎవరూ చూడలేదు, చూడలేరన్నది వాస్తవం. అయితే ఆయన శరీరధారిగా జీవించి చనిపోయి తిరిగిలేచిన తరువాత భక్తులకు కనిపించినప్పుడు మహిమ శరీరంతో ఉన్న ఆయనను వారు చూసారు.
ఈ విధంగానే తండ్రియైన దేవుడు తాను అనుకున్నట్టుగా భక్తులకు ప్రత్యక్షమైనప్పుడు వారు ఆయనను చూసారు తప్ప, దేవదూతను చూసి దేవుడనుకోలేదు. ఇంతటితో ,పాతనిబంధనలో ప్రత్యక్షమైంది దేవుడు కాదు దేవదూతలే అనే వాదనకు సమాధానం ముగిసింది.
(మరికొందరైతే పాతనిబంధనలో యెహోవాగా ప్రత్యక్షమైంది మొత్తం కుమారుడైన యెహోవానే అంటారు కానీ, ఈ వాక్యభాగాలు చూడండి. "రాత్రి కలిగిన దర్శనములను నేనింక చూచుచుండగా, ఆకాశమేఘారూఢుడై "మనుష్య కుమారుని పోలిన" యొకడు వచ్చి, ఆ మహావృద్ధుడగువాని సన్నిధిని ప్రవేశించి, ఆయన సముఖమునకు తేబడెను. సకల జనులును రాష్ట్రములును ఆయా భాషలు మాటలాడువారును ఆయనను సేవించునట్లు ప్రభుత్వమును మహిమయు ఆధిపత్యమును ఆయన కీయబడెను. ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది అదెన్నటికిని తొలగిపోదు; ఆయన రాజ్యము ఎప్పుడును లయముకాదు". దానియేలు 7:13,14. ఈ సందర్భంలో కుమారుడు (మనుష్యకుమారుడు) వేరుగా తండ్రియైన దేవుడు వేరుగా ప్రత్యక్షమవ్వడం మనం చూస్తాం. అదేవిధంగా "ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరచిన చోటుకు నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను ఆయన సన్నిధిని జాగ్రత్తగానుండి ఆయన మాట వినవలెను. ఆయన కోపము రేపవద్దు మీ అతిక్రమములను ఆయన పరిహరింపడు, నా నామము ఆయనకున్నది" నిర్గమకాండము 23:20,21. ఈ సందర్భంలో మోషేతో తండ్రియైన యెహోవానే మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఆయన పంపబోతున్న దూత మరెవరో కాదు కుమారుడైన యెహోవానే. దీనిగురించి ఇప్పటికే నేను స్పస్టతను ఇచ్చాను. ఒకవేళ ఇక్కడ మోషేతో మాట్లాడుతుంది తండ్రియైన యెహోవా కాకుండా కుమారుడైన యెహోవానే ఐతే ఇశ్రాయేలీయులకు ముందుగా "దూతను పంపబోతున్నట్టు ఆయనగురించి ఆయనే ప్రకటించుకోవడం" సాధ్యం కాదు, ఆ మాటలు అర్థరహితం)
ఇప్పుడు హెబ్రీపత్రికలో రాయబడిన 'దేవదూతల ద్వారా పలుకబడిన వాక్యం' అనే మాటలకు అర్థం చూద్దాం. మరోసారి ఆ మాటలను పరిశీలించండి.
హెబ్రీయులకు 2:1-4 కావున మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టు కొనిపోకుండునట్లు వాటియందు మరి విశేష జాగ్రత్త కలిగియుండవలెను. ఎందుకనగా దేవదూతల ద్వారా పలుకబడిన వాక్యము స్థిరపరచబడినందున, ప్రతి అతిక్రమమును అవిధేయతయు న్యాయమైన ప్రతిఫలము పొందియుండగా ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యముచేసినయెడల ఏలాగు తప్పించుకొందుము? అట్టి రక్షణ ప్రభువు భోధించుటచేత ఆరంభమై, దేవుడు తన చిత్తానుసారముగా సూచకక్రియలచేతను, మహత్కార్య ములచేతను,నానావిధములైన అద్భుతములచేతను, వివిధము లైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించుటచేతను, వారితో కూడ సాక్ష్యమిచ్చుచుండగా వినినవారిచేత మనకు దృఢ పరచబడెను.
ఈ సందర్భమంతటినీ మనం పరిశీలిస్తే హెబ్రీగ్రంథ కర్త గతంలో దేవదూతలు పలికిన మాటలను అతిక్రమించినవారే న్యాయమైన ప్రతిఫలం పొందుకున్నారు కాబట్టి, నేరుగా ప్రభువు చెప్పిన మాటలనే, మీరితే మనం మరింత ప్రతిఫలం పొందుకుంటామని విశ్వాసులను హెచ్చరిస్తున్నాడు. ఇక్కడ ఆయన ఉద్దేశం ప్రభువు బోధించడం చేత ఆరంభమైన రక్షణను ఉన్నతంగా చూపించడమే.
ఇందులో "దేవదూతలు పలికిన మాటలు" అని ప్రస్తావించబడిన దాని గురించి మనం రెండు విధాలుగా అర్థం చేసుకోవచ్చు.
1 మోషేకు దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చినప్పుడు అందులో దేవదూతల ప్రమేయం కూడా ఉందని మనం పైభాగంలో చూసాం. ఆవిధంగా మరి కొన్ని సందర్భాలలో కూడా భక్తులకు ఆయన దేవదూతల ద్వారా తన మాటలను చేరవేసాడని దీని అర్థం.
2 హెబ్రీ పత్రికలో రాయబడిన ఈమాటల క్రింద సందర్భంలో దేవదూతల గురించిన ప్రస్తావన ఉన్నంతమాత్రాన, మనం చూసిన వచనంలోని దేవదూతలు, వారే అని మనం భావించవలసిన అవసరం లేదు. బైబిల్ గ్రంథంలో, దూతలు అనే పదప్రయోగాన్ని ప్రవక్తలకు కూడా వాడినట్టు మనకు కనిపిస్తుంది. ఉదాహరణకు;
హగ్గయి 1:13 అప్పుడు యెహోవా దూతయైన హగ్గయి యెహోవా తెలియజేసిన వార్తనుబట్టి జనులకు ప్రకటించినదేమనగా నేను మీకు తోడుగా ఉన్నాను; ఇదే యెహోవా వాక్కు.
ఈ సందర్భంలో ప్రవక్తయైన హగ్గయి దూతగా సంబోధించబడ్డాడు.
(నూతన నిబంధనలో యెహోవా అనే నామాన్ని యూదులు ఉచ్చరించని కారణంగా యెహోవా దూతకు ముందున్న యెహోవాను తీసివేసి దేవదూతగా ప్రస్తావించారని స్తెఫను మాటల వివరణలో మనం చూసాం)
అదేవిధంగా,
మలాకీ 3:1 ఇదిగో నాకు ముందుగా మార్గము సిద్ధపరచుటకై నేను నా దూతను పంపుచున్నాను.
ఈ సందర్భంలో బాప్టీస్మమిచ్చు యోహాను దూతగా సంబోధించబడ్డాడు. అదేవిధంగా,
మలాకీ 2: 7 యాజకులు సైన్యములకు అధిపతియగు యెహోవా దూతలు గనుక జనులు వారినోట ధర్మశాస్త్రవిధులను నేర్చుకొందురు, వారు జ్ఞాన మునుబట్టి బోధింపవలెను.
(నూతన నిబంధనలో యెహోవా అనే నామాన్ని యూదులు ఉచ్చరించని కారణంగా యెహోవా దూతకు ముందున్న యెహోవాను తీసివేసి దేవదూతగా ప్రస్తావించారని స్తెఫను మాటల వివరణలో మనం చూసాం)
2 దినవృత్తాంతములు 36 :15,16 వారి పితరుల దేవుడైన యెహోవా తన జనులయందును తన నివాసస్థలమందును కటాక్షము గలవాడై వారియొద్దకు తన దూతలద్వారా వర్తమానము పంపుచు వచ్చెను. ఆయన పెందలకడ లేచి పంపుచు వచ్చినను వారు దేవుని దూతలను ఎగతాళిచేయుచు, ఆయన వాక్యములను తృణీకరిం చుచు, ఆయన ప్రవక్తలను హింసించుచు రాగా, నివారింప శక్యముకాకుండ యెహోవా కోపము ఆయన జనుల మీదికి వచ్చెను.
ఈ సందర్భాలలో కూడా, యాజకులను, ప్రవక్తలను ఉద్దేశించి యెహోవా(దేవ)దూతలనే పదప్రయోగాన్ని చేసినట్టు మనం చూడగలం. ప్రవక్తలు, యాజకులు దేవుని ధర్మశాస్త్రాన్ని, ఆయన మాటలనూ పలుకుతూ ఉంటారు. వారి మాటలు వినని ఇశ్రాయేలీయులు, దేవునిచేత న్యాయమైన ప్రతిఫలం పొందడం పాతనిబంధనలో అనేకసార్లు మనకు కనిపిస్తుంది. కాబట్టి హెబ్రీ గ్రంథకర్త దీనిగురించే అక్కడ ప్రస్తావిస్తున్నాడని మనం భావించవచ్చు.
దీనిప్రకారం, అదేవిధంగా పైన చూసిన వివరణల ప్రకారం, ధర్మశాస్త్రాన్ని మోషేకు దేవుడే అనుగ్రహించాడనీ, దేవదూతలను పాతనిబంధనలో దేవునిగా, యెహోవాగా పరిశుద్ధాత్ముడు రాయించలేదని స్పష్టం ఔతుంది.
3 యెహోవా దూత, యేసుక్రీస్తు;
ఈ దూత గురంచి యెహోవా దేవుడు చెప్పిన మాటలను మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం;
నిర్గమకాండము 23:20-23 ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరచిన చోటుకు నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను. ఆయన సన్నిధిని జాగ్రత్తగానుండి ఆయన మాట వినవలెను. ఆయన కోపము రేపవద్దు; మీ అతిక్రమములను ఆయన పరిహరింపడు, "నా నామము ఆయనకున్నది". అయితే నీవు ఆయన మాటను జాగ్రత్తగా విని నేను చెప్పినది యావత్తు చేసినయెడల నేను నీ శత్రువులకు శత్రువును నీ విరోధులకు విరోధియునై యుందును. ఎట్లనగా నా దూత నీకు ముందుగావెళ్లుచు, అమోరీ యులు హిత్తీయులు పెరిజ్జీయులు కనా నీయులు హివ్వీయులు యెబూసీయులను వారున్న చోటుకు నిన్ను రప్పించును, నేను వారిని సంహరించెదను.
ఈ సందర్భంలో యెహోవా దేవుడు, యెహోవా దూతగా, దేవుని దూతగా, దూతగా, యెహోవా దేవునిగా పిలవబడిన దూతగురించి మాట్లాడుతూ ఆయనకు "నా నామం" ఉందని తెలియచేస్తున్నాడు. ఈకారణం చేతనే ఆయన యెహోవా అని పిలువబడ్డాడని మనం పైన చూసాం. దీనిప్రకారం, ఇశ్రాయేలీయులను ఐగుప్తునుండి కనానుకు నడిపించిన దేవుడు ఆ దూతయే అని మనకి అర్థం ఔతుంది, ఆ ప్రయాణంలో ఇశ్రాయేలీయులు తమను నడిపించిన దేవుణ్ణి ఎంతగానో శోధించినట్టుగా బైబిల్ మనకు సాక్ష్యమిస్తుంది.
కీర్తనలు 78: 18 వారు తమ ఆశకొలది ఆహారము నడుగుచు తమ హృదయములలో దేవుని శోధించిరి.
కీర్తనలు 78: 41 మాటిమాటికి వారు దేవుని శోధించిరి మాటిమాటికి ఇశ్రాయేలు పరిశుద్ధ దేవునికి సంతాపము కలిగించిరి.
కీర్తనలు 106: 14 అరణ్యములో వారు బహుగా ఆశించిరి ఎడారిలో దేవుని శోధించిరి.
ఈ వచనాల ప్రకారం, ఇశ్రాయేలీయులకు కనానుకు పంపేందుకు దేవుడు వారికి ముందుగా పంపినటువంటి దేవుడైన దూతను వారు శోధించారు. పౌలు మాటల్లో వారు శోధించింది ఎవరినో చూడండి.
మొదటి కొరింథీయులకు 10:8,9 మరియు వారివలె మనము వ్యభిచరింపక యుందము; వారిలో కొందరు వ్యభిచరించి నందున ఒక్కదినముననే యిరువది మూడువేలమంది కూలిరి. మనము ప్రభువును (కొన్నిప్రాచీన ప్రతులలో-క్రీస్తును అని పాఠాంతరము) శోధింపక యుందము; వారిలో కొందరు శోధించి సర్పముల వలన నశించిరి.
ఈ సందర్భంలో, పౌలు మనం ప్రభువును శోధించకూడదనీ ఇశ్రాయేలీయులు ఆయనను శోధించి నశించారని చెబుతున్నాడు. ప్రాచీన ప్రతులలో అక్కడ క్రీస్తు అని ఉండడం గమనించండి దీని ప్రకారం ఆ దూత త్రిత్వంలో రెండవ వ్యక్తిగా ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువే అని మనకు అర్థం ఔతుంది. దీనిగురుంచి మరికొన్ని సందర్భాలు చూడండి;
యోహాను 5: 43 నేను నా తండ్రి నామమున వచ్చియున్నాను.
పైభాగంలో, దేవుడు తన దూతకు ఆయన నామం ఉందని చెప్పినమాటలను మనం చూసాం. ఈ సందర్భంలో యేసుక్రీస్తు తండ్రి నామాన్ని ఆయన కలిగియున్నట్లు తనగురించి సాక్షమిస్తున్నాడు.
మలాకీ 3:1 ఇదిగో నాకు ముందుగా మార్గము సిద్ధపరచుటకై నేను నా దూతను పంపుచున్నాను; మీరు వెదకుచున్న ప్రభువు, అనగా మీరు కోరు నిబంధన దూత, తన ఆలయమునకు హఠాత్తుగా వచ్చును; ఇదిగో ఆయన వచ్చుచున్నాడని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు.
ఈ సందర్భంలో బాప్టీస్మమిచ్చు యోహాను గురుంచీ, ప్రభువైన యేసుక్రీస్తు గురించీ ప్రవచనాలు రాయబడ్డాయి, వచన ప్రారంభంలో చెప్పబడిన దూత యోహాను ఐతే, తదుపరి చెప్పబడిన నిబంధన దూత యేసుక్రీస్తు ప్రభువు. ఈ సందర్భంలో ఆయన దూతగా పిలవబడడం మనం చూస్తాం. దీనిప్రకారంగా యెహోవా దూత త్రిత్వంలో రెండవ వ్యక్తిగా ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువేయని మరింత స్పష్టంగా అర్థం ఔతుంది.
ఆయన ఈ విధంగా పాతనిబంధనలో తనను తాను యెహోవా దూతగా ప్రత్యక్షపరచుకున్న విధానం గురించి రాయబడిన ఈ మాటలను చూడండి.
మీకా 5:2 బేత్లెహేము ఎఫ్రాతా, యూదావారి కుటుంబములలో నీవు స్వల్పగ్రామమైనను నాకొరకు ఇశ్రాయేలీయులను ఏలబోవువాడు నీలోనుండి వచ్చును; పురాతన కాలము మొదలుకొని శాశ్వతకాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను.
ఇంతటితో, యెహోవా దూత యేసుక్రీస్తు ప్రభువే అని కూడా మనకు స్పష్టత లభించింది. ఆయన యెహోవాగా కూడా సంబోధించబడ్డాడని ఇప్పటికే మనం చూశాం. ఇప్పుడు మరింత స్పష్టత కోసం ఈ రెండు సందర్భాలు కూడా చూడండి.
జెకర్యా 2:5-11 "నేను దానిచుట్టు అగ్ని ప్రాకారముగా ఉందును, నేను దాని మధ్యను నివాసినై మహిమకు కారణముగా ఉందును ఇదే యెహోవా వాక్కు". ఉత్తర దేశములో ఉన్నవారలారా, తప్పించుకొని రండి "ఆకాశపు నాలుగు వాయువులంత విశాలముగా నేను మిమ్మును వ్యాపింపజేసియున్నాను ఇదే యెహోవా వాక్కు". బబులోను దేశములో నివాసివగు సీయోనూ, అచ్చట నుండి తప్పించుకొని పొమ్ము ఇదే యెహోవా వాక్కు. "సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చునదేమనగా" మిమ్మును ముట్టినవాడు తన కనుగుడ్డును ముట్టినవాడని యెంచి తనకు ఘనత తెచ్చుకొనదలచి, మిమ్మును దోచుకొనిన అన్యజనులయొద్దకు ఆయన నన్ను పంపియున్నాడు. నేను నా చేతిని వారిమీద ఆడించగా వారు తమ దాసులకు దోపుడు సొమ్మగుదురు "అప్పుడు సైన్యములకు అధిపతియగు యెహోవా నన్ను పంపియున్నాడని మీరు తెలిసికొందురు". సీయోను నివాసులారా, నేను వచ్చి మీ మధ్యను నివాసముచేతును; సంతోషముగా నుండి పాటలు పాడుడి; ఇదే యెహోవా వాక్కు. 'ఆ దినమున అన్యజనులనేకులు యెహోవాను హత్తుకొని నాకు జనులగుదురు, నేను మీ మధ్య నివాసముచేతును; అప్పుడు యెహోవా నన్ను మీ యొద్దకు పంపియున్నాడని మీరు తెలిసికొందురు.
ఈ వచనాలలో యెహోవా మాట్లాడుతూ (నేను దానిచుట్టు అగ్ని ప్రాకారముగా ఉందును..), అన్యజనులు అనేకులు యెహోవాను హత్తుకుని ఆయనను జనులౌతారని, యెహోవా తనను పంపాడని వారు తెలుసుకుంటారని అంటున్నాడు. మనమధ్యకు వచ్చి నివాసం చేసిందీ (హెబ్రీ 2:14-16, ఫిలిప్పీ 2:6-8) అన్యజనులు తండ్రియైన యెహోవాను హత్తుకునేలా చేసిందీ (రాజ్యంగా - ప్రకటన 5:9,10) ప్రభువైన యేసుక్రీస్తే కదా!
యెషయా గ్రంథము 48:11-17 నా నిమిత్తము నా నిమిత్తమే ఆలాగు చేసెదను నా నామము అపవిత్రపరచబడనేల? నా మహిమను మరి ఎవరికిని నేనిచ్చువాడను కాను. యాకోబూ, నేను పిలిచిన ఇశ్రాయేలూ, నాకు చెవి యొగ్గి వినుము. "నేనే ఆయనను నేను మొదటివాడను కడపటివాడను నా హస్తము భూమి పునాదివేసెను నా కుడిచెయ్యి ఆకాశవైశాల్యములను వ్యాపింపజేసెను నేను వాటిని పిలువగా ఒకటి తప్పకుండ అవన్నియు నిలుచును". ఆదినుండి నేను రహస్యముగా మాటలాడినవాడను కాను అది పుట్టినకాలము మొదలుకొని నేను అక్కడనున్నవాడను "ఇప్పుడు ప్రభువగు యెహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపెను". "నీ విమోచకుడును ఇశ్రాయేలు పరిశుద్ధదేవుడునైన యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు" నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడనైన యెహోవానగు నేనే నీకు ఉపదేశము చేయుదును నీవు నడవవలసిన త్రోవను నిన్ను నడిపించుదును.
ఈ వచనాలలో కూడా ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడైన యెహోవా మాట్లాడుతూ, ఆయనను మరొక యెహోవా, ఆయన ఆత్మ కలసి పంపినట్టుగా చెబుతున్నాడు. తండ్రియైన యెహోవా నిర్ణయం చొప్పున (గలతీ 4:4, 1 యోహాను 4:9,10), పరిశుద్ధాత్ముడి అద్భుతం కారణంగా (లూకా 1:35, యెషయా 11:1,2) ఈ భూమిపైకి దైవమానవునిగా విచ్చేసింది (పంపబడింది) యేసుక్రీస్తు ప్రభువే కదా!
ఈ వ్యాసంలో ప్రస్తావించబడిన త్రిత్వ సిద్ధాంతం గురించి తెలుసుకోడానికి ఈ వ్యాసం చదవండి.
మరికొన్ని అవాంతర శాఖలవారు యేసుక్రీస్తు నిత్యుడు కాదని ఆయన దేవుని చేత పరలోకంలో సృష్టించబడినవాడని బోధిస్తుంటారు ఆ దుర్భోధకు సమాధానం తెలుసుకోవడానికి ఈ వ్యాసం కూడా చదవండి.
యేసుక్రీస్తు నిత్యుడు కాదా? పరలోకంలో పుట్టినవాడా?
Copyright Notice
"ఈ వ్యాసం/పుస్తకం, 'హితబోధ కమ్యూనికేషన్స్'వారి అనుమతి ద్వారా ప్రచురించబడింది ©2021 www.hithabodha.com"
ఇందులో ఉపయోగించిన బైబిలు వచనాలన్నీ బైబిల్ సొసైటీవారు ప్రచురించిన పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఉపయోగించబడినవి.
Comments