పాత నిబంధన

రచయిత: కె విద్యా సాగర్

విషయసూచిక:16:1, 16:2, 16:3 , 16:4, 16:5 , 16:6 ,16:7,8 , 16:9,10 , 16:11-15 , 16:16 , 16:17,18 , 16:19,20 , 16:21 , 16:22 ,16:23,24 , 16:25-30 , 16:31 , 16:32-34 , 16:35 , 16:36.

నిర్గమకాండము 16:1

తరువాత ఇశ్రాయేలీయుల సమాజమంతయును ఏలీమునుండి ప్రయాణమైపోయి, వారు ఐగుప్తు దేశములో నుండి బయలుదేరిన రెండవనెల పదునైదవ దినమున ఏలీమునకును సీనాయికిని మధ్యనున్న సీను అరణ్యమునకు వచ్చిరి. 
 
ఈ వచనంలో ఇశ్రాయేలీయులు ఎఱ్ఱ సముద్రం దాటాక ప్రవేశించిన ఏలీము అరణ్యం నుండి సీను అరణ్యానికి వచ్చినట్టు మనం చూస్తాం. 
 
సంఖ్యాకాండము 33:10,11  ఎఱ్ఱసముద్రము నొద్దనుండి బయలుదేరి సీను అరణ్యమందు దిగిరి. 
 
ఈ సీను అనేది ఐగుప్తు రాజ్యానికి చెందిన ప్రాముఖ్యమైన ప్రదేశం. 
 
యెహెజ్కేలు 30:15 ఐగుప్తునకు కోటగా నున్న సీనుమీద నా క్రోధము కుమ్మ రించెదను, నోలోని జనసమూహమును నిర్మూలము చేసెదను 
 
ఇక్కడ మనం ఒక ప్రాముఖ్యమైన ప్రశ్నకు సమాధానం చెప్పాలి. మోషే ఫరో ముందు నిలచినప్పుడు "మేము మూడు దినాలంత దూరం అరణ్యంలోకి ప్రయాణం చేసి మా దేవునికి బలి అర్పిస్తామని తెలియచేసాడు" నిర్గమకాండము 3:12 ప్రకారం; ఇశ్రాయేలీయులు దేవుణ్ణి సేవించింది సీనాయి పర్వతం దగ్గర. కానీ ఇశ్రాయేలీయులు ఐగుప్తునుండి‌ బయలుదేరిన నెల రోజులకు కూడా ఆ సీనాయి పర్వతం దగ్గరకు చేరుకోలేదు, ఇంకా సీను అరణ్యంలోనే ఉన్నారు. దీనిప్రకారం మోషే ఫరోతో అబద్ధం చెప్పాడు అనేది మనముందున్న ఆరోపణ. అయితే అక్కడ మోషే ఫరోతో "మేము మూడు దినాలంత దూరం ప్రయాణం చేసి మా దేవునికి‌ బలి అర్పిస్తామని చెప్పింది" ఐగుప్తునుండి సీనాయికి మధ్య ఉన్న దూరాన్ని తెలియచెయ్యడానికే తప్ప, ఇశ్రాయేలీయులు ఆ మూడు రోజుల్లో సీనాయికి చేరుకుంటారని కాదు. ఆరోజుల్లో ప్రయాణం చేసే దూరాన్ని మనలా కిలోమీటర్లు, మైళ్ళు అని కాకుండా ఏకదాటిగా ప్రయాణం చేస్తే ఎన్ని రోజుల్లో అక్కడికి చేరుకుంటామో ఆ సమయాన్ని బట్టి అంచనా వేసి చెప్పేవారు. అది ఏకదాటిగా ప్రయాణం చేస్తే పట్టే సమయం. ఇశ్రాయేలీయులు అలా సీనాయి వైపు ఏకదాటిగా ప్రయాణం చెయ్యలేదు, తమతో ఉన్న మందలు, పిల్లల కారణంగా విశ్రాంతి తీసుకుంటూ ప్రయాణం చేసారు. అందుకే ఇంకా సీనాయికి చేరుకోలేదు.
 
నిర్గమకాండము 16:2
ఆ అరణ్యములో ఇశ్రాయేలీయుల సమాజ మంతయు మోషే అహరోనులమీద సణిగెను. 
 
ఈ వచనంలో ఇశ్రాయేలీయులు మూడవ సారి దేవునిపై తిరుగుబాటు చెయ్యడం మనం చూస్తాం. దానికి కారణమేంటో క్రింది వచనంలో వివరించబడింది. 
 
నిర్గమకాండము 16:3
ఇశ్రాయేలీయులుమేము మాంసము వండుకొను కుండలయొద్ద కూర్చుండి తృప్తిగా ఆహారము తినునప్పుడు యెహోవా చేతివలన ఏల చావక పోతిమి? ఈ సర్వసమాజమును ఆకలిచేత చంపుటకు ఈ అరణ్యములోనికి మమ్మును అక్కడ నుండి తోడుకొనివచ్చితిరని వారితోననగా-
 
ఈ వచనంలో ఇశ్రాయేలీయులు ఆహారం నిమిత్తం మోషే అహరోనులపై తిరుగుబాటు చెయ్యడం  మనం చూస్తాం. వారు మొదటినెల (ఆబీబు) పదిహేనవ తారీఖున ఐగుప్తునుండి బయటకు వస్తే ప్రస్తుతం వారు సీను అరణ్యానికి రెండవ నెల పదిహేనవ తారీఖుకు చేరుకున్నారు. ఈ నెలరోజులూ వారు ఐగుప్తునుండి తెచ్చుకున్న ఆహారం (పిండి), ఎఱ్ఱసముద్రం దగ్గర నివసించినప్పుడు అందులోని చేపలు తింటూ కాలం గడిపియుండవచ్చు. ప్రస్తుతం సీను అరణ్యంలో అవేమీ లేకపోయేసరికి వారు ఈవిధంగా తిరుగుబాటు చేస్తున్నారు. వారు ఐగుప్తులో మాంసము వండుకుని తమ కుండల దగ్గర తృప్తిగా తిన్నారు అనేది వాస్తవమే కానీ, వారు అక్కడ ఎలాంటి పనిచేస్తే అలాంటి ఆహారం వచ్చేదో ఆ విషయం మరచిపోయి మాట్లాడుతున్నారు. ఐగుప్తులో కఠినమైన పని చేసి సంపాదించుకున్న ఆహారాన్ని తలచుకుంటున్న వీరు, వీరి పక్షంగా దేవుడు చేసిన అద్భుతాలను, మేఘస్థంభం క్రింది వీరు పొందుకున్న ఆయన కనికరాన్నీ కాపుదలను మాత్రం తలచుకోలేకపోతున్నారు. వీరికి దేవుని విమోచన మార్గంలో పయనించడం కంటే, శత్రువుల చేతిలో చావడమే మంచిగా ఉందంట. అలా అని వీరు తినడానికి ఏమీ లేదా అంటే, వీరితోపాటుగా గొప్ప పశువుల మందలు ఉన్నాయి, కావాలనుకుంటే వాటిని చంపుకుని తినే అవకాశం వీరికి ఉండింది. అయినప్పటికీ వీరిలోని తిరుగుబాటునైజం వల్ల అలాంటి ప్రత్యామ్నాయాలను వెదకకుండా, పోని ఆహారం దయచెయ్యమని ప్రార్థన కూడా చెయ్యకుండా ఐగుప్తులో తిన్న ఆహారాన్ని తలచుకుని రోదిస్తున్నారు. దీనినిబట్టి ఒకవేళ దేవుడు కనుక ఐగుప్తులో గొప్ప అద్భుతాలను జరిగించి వీరిని విడిపించకపోతే వీరు ఐగుప్తును వదలిరాడానికి ఏమాత్రం ఇష్టపడేవారు కాదని అర్థమౌతుంది.
 
మానవ పతనస్వభావానికి ఇది మరో కచ్చితమైన ఆధారం. పతనస్వభావియైన మనిషి పాపాన్ని ప్రేమిస్తూ దానివల్ల తన జీవితానికి ఎటువంటి నష్టాలు జరుగుతున్నప్పటికీ దానిని తనంతట తానుగా విడిచిపెట్టడానికి అంగీకరించడు. దేవుడే గొప్ప అద్బుతం చేసి అతనిని పాపపు బానిసత్వం నుండి విడిపించాలి. ప్రస్తుతం మనందరి రక్షణలో జరిగింది ఇదే. ఆయనే మనల్ని పాపమనే బానిసత్వం నుండి విడిపించి (రోమా 6:18) రక్షణ మార్గంలో ప్రవేశపెట్టాడు (ఎఫెసీ 2:1-10). ఆ మార్గంలో మనం నమ్మదగినవారం కాకపోయినప్పటికీ ఆయన నమ్మదగినవాడిగా ఉంటూ మనల్ని నడిపిస్తున్నాడు (2తిమోతీ 2:13, హెబ్రీ 10:23). లేదంటే ఇశ్రాయేలీయులు ఫరో సైన్యాన్ని చూసినప్పుడు మరలా ఐగుప్తు బానిసత్వానికి సిద్ధపడినట్టుగా  మనం కూడా ఎప్పుడో లోకంలో కలసిపోయేవారం. లేదా వారు ఐగుప్తులో తమ కుండలదగ్గర తృప్తిగా తిన్న మాంసాన్ని తలచుకుని రోదిస్తున్నట్టుగా లోకసంబంధులుగా ఉండగా మనం అనుభవించిన పాపభోగాలను తలచుకుని దేవుని కృపా కనికరాలపై తిరుగుబాటు చేసేవారం.
 
నిర్గమకాండము 16:4
యెహోవా మోషేను చూచి ఇదిగో నేను ఆకాశము నుండి మీ కొరకు ఆహారమును కురిపించెదను; వారు నా ధర్మశాస్త్రము ననుసరించి నడుతురో లేదో అని నేను వారిని పరీక్షించునట్లు ఈ ప్రజలు వెళ్లి ఏనాటి బత్తెము ఆనాడే కూర్చుకొనవలెను. 
 
ఈ వచనంలో ఇశ్రాయేలీయుల‌ సణుగులు విన్న దేవుడు వారిని శిక్షించకుండా, తన కనికరం చొప్పున ఆకాశం నుండి ఆహారాన్ని దయచేస్తానని సెలవివ్వడం మనం చూస్తాం. ఐతే ఆ ప్రజలు దేవుని మాటకు లోబడుతూ ఆ ఆహారాన్ని ఏరోజుకు ఆరోజే సమకూర్చుకోవాలి. ఈ నియమం ప్రతీదినం మన ఆహారంకోసం ఆయనపై ఆధారపడాలని మనకు నేర్పిస్తుంది. అందుకే ప్రభువు "మా అనుదిన ఆహారం మాకు దయచెయ్యమని ప్రార్థించడం నేర్పించాడు", "రేపటిగురించి చింతించవద్దని" బోధించాడు. ఒకవేళ మన తొట్టిలో‌ పిండి సమృద్ధిగా ఉన్నప్పటికీ ఆయన సెలవులేకుండా మనం దానిని తిని తృప్తిపొందలేము కాబట్టి (ప్రసంగి 2:25) ఆహారం తినే ఆయుష్షు ఆరోగ్యం ఆయనే మనకు అనుగ్రహించాలి కాబట్టి ప్రతీదినం దానికోసం తప్పక ప్రార్థించాలి.
 
అదేవిధంగా ఇశ్రాయేలీయుల ప్రజలు ఏరోజు ఆహారం ఆరోజే కూర్చుకోవాలని ఆజ్ఞాపించబడుతున్నప్పుడు, ఆహారాన్ని అనుగ్రహిస్తుంది దేవుడే అయినప్పటికీ, ప్రజలు కూడా సోమరులుగా గుడారాల దగ్గర ఉండిపోకుండా ఆ ఆహారాన్ని వెదకి కూర్చుకోవాలనే బాధ్యతను కలిగియున్నారని మనకు అర్థమౌతుంది. వారు కూర్చుకోకపోతే తినుండేవారు కాదు. మనం కూడా, ఆహారాన్ని ఆశీర్వాదాన్ని ఆయనే అనుగ్రహిస్తాడులే అనుకుంటూ సోమరులుగా ఉండిపోకుండా ఆయనపై ఆధారపడుతూనే వాటికోసం కష్టపడేవారిగా ఉండాలి.
 
నిర్గమకాండము 16:5
మరియు ఆరవ దినమున వారు తెచ్చుకొనినదానిని సిద్ధపరచుకొనవలెను. వారు దినదినమున కూర్చుకొనుదానికంటె అది రెండంతలై యుండవలెననెను. 
 
ఈ వచనంలో దేవుడు ఇశ్రాయేలీయులు విశ్రాంతి దినం పాటించేటట్టుగా ఆరోజు బయటకు వెళ్ళకుండా ఆరవదినాన్నే రెండంతల ఆహారం కూర్చుకోవాలని ఆజ్ఞాపించడం‌ మనం చూస్తాం. ఈవిధంగా దేవుడు విశ్రాంతి దినాన ఎప్పటిలా ఆహారం నిమిత్తం కష్టపడకుండా తీరికగా ఉంటూ ఆయన సన్నిధిలో గడపాలనే క్రమాన్ని వారికి నేర్పించుకుంటూ వచ్చాడు.
 
నిర్గమకాండము 16:6
అప్పుడు మోషే అహరోనులు ఇశ్రా యేలీయులందరితో యెహోవా ఐగుప్తు దేశ ములోనుండి మిమ్మును బయటికి రప్పించెనని సాయంకాలమందు మీకు తెలియబడును. 
 
ఈ వచనంలో మోషే ఇశ్రాయేలీయులతో మిమ్మల్ని ఐగుప్తునుండి బయటకు తీసుకువచ్చింది దేవుడేయని ఆయన చేసే అద్భుతం కారణంగా తెలుస్తుందని పలకడం మనం చూస్తాం. ఎందుకంటే పై సందర్భంలో ఇశ్రాయేలీయులు "ఈ సర్వసమాజమును ఆకలిచేత చంపుటకు ఈ అరణ్యములోనికి మమ్మును అక్కడ నుండి తోడుకొనివచ్చితిరని" మోషే అహరోనులను‌ నిందించారు కాబట్టి మిమ్మల్ని తీసుకువచ్చింది మేము కాదు దేవుడేయని చెప్పడానికి అతనిలా మాట్లాడుతున్నాడు. 
 
నిర్గమకాండము 16:7,8
యెహోవామీద మీరు సణిగిన సణుగులను ఆయన వినుచున్నాడు; ఉదయమున మీరు యెహోవా మహిమను చూచెదరు, మేము ఏపాటి వారము? మామీద సణుగనేల అనిరి. మరియు మోషేమీరు తినుటకై సాయంకాలమున మాంసమును ఉదయ మున చాలినంత ఆహారమును యెహోవా మీకియ్యగాను, మీరు ఆయనమీద సణుగు మీ సణుగులను యెహోవాయే వినుచుండగాను, మేము ఏపాటివారము? మీ సణుగుట యెహోవా మీదనేగాని మామీద కాదనెను.
 
ఈ వచనాలలో‌ మోషే ఇశ్రాయేలీయుల సణుగులను బట్టి కొంచెం ఆవేదనతో మాట్లాడడం మనం చూస్తాం. ఐతే ఇక్కడ అతను ఇశ్రాయేలీయుల విడుదల విషయంలో, వారికి అనుగ్రహించబడే ఆహారం విషయంలో ఎటువంటి ఘనతను తనకు ఆపాదించుకోకుండా మీకు అవన్నీ చేసింది దేవుడే కాబట్టి మీ సణుగులు కూడా మాపైన కాదు ఆయనపైనే అంటూ ప్రజలను హెచ్చరిస్తున్నాడు. మంచి దైవజనుడు ఈవిధంగా అన్ని విషయాలలో దేవుణ్ణే ఘనపరుస్తూ ఆయనను హెచ్చించేవాడిగా ఉంటాడు. అతనిపై ప్రజలు అన్యాయంగా వేసే నిందల విషయంలో కూడా ధైర్యంగా ప్రజలను హెచ్చరించేవాడిగా ఉంటాడు. ఎందుకంటే నిజాయితీగా ప్రభువు పనిచేసే వారిపై (ఆయన పిల్లలపై) జరిగే దాడులు, తిరస్కరణలు దేవుని విషయంలో జరుగుతున్నట్టే. అందుకే ప్రభువు సౌలును దర్శించినప్పుడు "నేను నీవు హింసించుచున్న యేసును" అంటూ పరిచయం చేసుకున్నాడు (అపో.కార్యములు 9:5).
 
1థెస్సలొనికయులకు 4: 8 కాబట్టి ఉపేక్షించువాడు మనుష్యుని ఉపేక్షింపడు గాని మీకు తన పరిశుద్ధాత్మను అనుగ్రహించిన దేవునినే ఉపేక్షించుచున్నాడు.
 
లూకా సువార్త 10:16 మీ మాట వినువాడు నా మాట వినును, మిమ్మును నిరాకరించువాడు నన్ను నిరాకరించును, నన్ను నిరాకరించువాడు నన్ను పంపినవానిని నిరాకరించుననెను. 
 
నిర్గమకాండము 16:9,10
అంతట మోషే అహరోనుతో యెహోవా సన్నిధికి సమీపించుడి; ఆయన మీ సణుగులను వినెనని నీవు ఇశ్రాయేలీయుల సర్వసమాజముతో చెప్పుమనెను. అట్లు అహరోను ఇశ్రాయేలీయుల సర్వసమాజముతో మాటలాడుచుండగా వారు అరణ్యమువైపు చూచిరి, అప్పుడు యెహోవా మహిమ ఆ మేఘములో వారికి కనబడెను. 
 
ఈ వచనాలలో అహరోను మోషే మాటలను ప్రజలకు తెలియచేస్తున్నప్పుడు వారు తమను వెంబడిస్తున్న మేఘంలో దేవుని మహిమను చూడడం మనం చూస్తాం. అప్పటికి ఇంకా మందిరం (గుడారం) నిర్మించబడలేదు కాబట్టి, ఆయన వారికి‌ మేఘంలోనే తన‌ మహిమను ప్రదర్శించాడు. 
 
నిర్గమకాండము 16:11-15
అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను నేను ఇశ్రాయేలీయుల సణుగులను వింటిని నీవుసాయంకాలమున మీరు మాంసము తిందురు, ఉదయమున ఆహారముచేత తృప్తిపొందుదురు, అప్పుడు మీ దేవుడనైన యెహోవాను నేనే అని మీరు తెలిసికొందురని వారితో చెప్పుమనెను. కాగా సాయంకాలమున పూరేడులువచ్చి వారి పాళెమును కప్పెను, ఉదయమున మంచువారి పాళెముచుట్టు పడియుండెను. పడిన ఆ మంచు ఇగిరిపోయిన తరువాత నూగుమంచువలె సన్నని కణములు అరణ్యపు భూమిమీద కనబడెను. ఇశ్రాయేలీయులు దాని చూచినప్పుడు అది ఏమైనది తెలియక ఇదేమి అని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి.
 
ఈ వచనాలలో దేవుడు ఇశ్రాయేలీయులకు పూరేడు పిట్టలనూ అలానే నూగుమంచు వంటి సన్నని కణాల ఆహారాన్నీ అనుగ్రహించడం మనం చూస్తాం. ఇశ్రాయేలీయులు మాంసము కావాలని కోరుకున్నారు కాబట్టి ఆయన వారికి పూరేడు పిట్టలను అనుగ్రహించాడు, ఈ పూరేడు పిట్టలు వలసపక్షులు, అందుకే అవి దేవుని అద్భుతం ప్రకారం ఇశ్రాయేలీయులు నివసిస్తున్న ప్రాంతంలో విస్తారంగా నిలచిపోయాయి. ఐతే ఈ పూరేడు పిట్టలను ప్రతీరోజూ ఆయన అనుగ్రహించదలచుకోలేదు, అందుకే ఆయన ఇశ్రాయేలీయులు ప్రతీరోజూ తినడానికి వేరొక ఆహారాన్ని నియమించాడు, అది "నూగుమంచువలె సన్నని కణాలలా" ఉంది. ఇశ్రాయేలీయులు దానిని చూసి "ఇదేంటి" అనుకున్న కారణం చేత దానికి "మన్నా" అనే పేరు వచ్చింది. మన్నా అంటే "ఇదేంటి" అని అర్థం.
 
ఆకాశం నుండి కురిసిన ఈ మన్నాను దృష్టిలో పెట్టుకునే ప్రభువైన యేసుక్రీస్తు తనను తాను పరలోకం నుండి దిగివచ్చిన జీవాహారంగా సంబోధించుకున్నారు. 
 
యోహాను సువార్త 6:49,50,51 మీ పితరులు అరణ్యములో మన్నాను తినినను చనిపోయిరి. దీనిని తినువాడు చావ కుండునట్లు పరలోకము నుండి దిగివచ్చిన ఆహారమిదే. పరలోకమునుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే. ఎవడైనను ఈ ఆహారము భుజించితే వాడెల్లప్పుడును జీవించును; మరియు నేనిచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాననెను. 
 
మన్నా ఏ విధంగా అయితే ఐగుప్తునుండి కనానుకు ప్రయాణిస్తున్న ఇశ్రాయేలీయులకు మాత్రమే లభించిందో,  ఇక మరెవ్వరికీ దానిని తినే అవకాశం ఎలా అయితే దక్కలేదో (ద్వితీ. 8:3,16) అలానే యేసుక్రీస్తు అనే జీవాహారం కూడా ఆయనను విశ్వసించిన ప్రజలకు మాత్రమే దక్కుతుంది. ఆ జీవాహారానికి వెలుపల రక్షణకు మరో ప్రత్యామ్నాయమేదీ లేదు. 
 
నిర్గమకాండము 16:16
మోషే ఇది తినుటకు యెహోవా మీకిచ్చిన ఆహారము. యెహోవా ఆజ్ఞాపించిన దేమనగాప్రతివాడును తనవారి భోజనమునకు, ప్రతివాడు తన కుటుంబములోని తలకు ఒక్కొక్క ఓమెరుచొప్పున దాని కూర్చుకొనవలెను, ఒక్కొక్కడు తన గుడారములో నున్నవారికొరకు కూర్చుకొనవ లెననెను. 
 
ఈ వచనంలో మోషే ఇశ్రాయేలీయులు ఇదేంటి? అని ఆశ్చర్యపడుతున్న మన్నాను వారికి దేవుడు అనుగ్రహించిన ఆహారంగా పరిచయం చేసి దానిని కుటుంబ సభ్యుల లెక్కచొప్పున కూర్చుకోవాలని ఆజ్ఞాపించడం మనం చూస్తాం. 4వ వచనం ప్రకారం ఇశ్రాయేలీయులు దేవునిమాట ప్రకారం నడుచుకుంటారో లేదో పరీక్షించడానికే ఆయన ప్రతీరోజు అలా కొలతల చొప్పున దానిని కూర్చుకోవాలని నియమించాడు. ఇక ఓమెరు అంటే తూము లో పదవభాగం. తూమును "పుట్టి" అని కూడా అంటారు. 
 
నిర్గమకాండము 16:17,18
ఇశ్రాయేలీయులు అట్లు చేయగా కొందరు హెచ్చుగాను కొందరు తక్కువగాను కూర్చు కొనిరి. వారు ఓమెరుతో కొలిచినప్పుడు హెచ్చుగా కూర్చు కొనినవానికి ఎక్కువగా మిగులలేదు తక్కువగా కూర్చుకొనినవానికి తక్కువకాలేదు. వారు తమ తమ యింటివారి భోజనమునకు సరిగా కూర్చుకొనియుండిరి. 
 
ఈ వచనాలలో ఇశ్రాయేలీయులు  ఆ మన్నాను ఎంతగా కూర్చుకున్నప్పటికీ అది అందరికీ సమానంగానే ఉండడం మనం చూస్తాం. ఇది దేవుడు చేసిన అద్భుతం. పౌలు ఇదే సంఘటనను ఆధారం చేసుకుని సంఘంలో ఒకరికి ఒకరు సహాయం చేసుకోవాలనే నియమాన్ని నేర్పించాడు.
 
రెండవ కొరింథీయులకు 8:14,15 హెచ్చుగా కూర్చుకొనినవానికి ఎక్కువ మిగులలేదనియు తక్కువగా కూర్చుకొనినవానికి తక్కువ కాలేదనియు వ్రాయబడిన ప్రకారము అందరికి సమానముగా ఉండు నిమిత్తము, ప్రస్తుతమందు మీ సమృద్ధి వారి అక్కరకును మరియొకప్పుడు వారి సమృద్ధి మీ యక్కరకును సహాయమై యుండవలెనని ఈలాగు చెప్పుచున్నాను. 
 
నిర్గమకాండము 16:19,20
మరియు మోషేదీనిలో ఏమియు ఉదయమువరకు ఎవరును మిగుల్చు కొనకూడదని వారితో చెప్పెను. అయితే వారు మోషే మాట వినక కొందరు ఉదయము వరకు దానిలో కొంచెము మిగుల్చుకొనగా అది పురుగుపట్టి కంపు కొట్టెను. మోషే వారిమీద కోపపడగా- 
 
ఈ వచనాలలో మోషే ఆ మన్నాను ఉదయం వరకూ మిగల్చకూడదని ఇశ్రాయేలీయులకు బోధించడం, అయినప్పటికీ కొందరు అలా మిగుల్చుకున్నప్పుడు అది పాడైపోవడం మనం చూస్తాం. ఐతే విశ్రాంతి దినానికి ముందు రోజు కూర్చుకున్న రెండింతల మన్నా అలా పాడైపోలేదు (23, 24 వచనాలు). అలాగే ఇశ్రాయేలీయులకు జ్ఞాపకార్థంగా ఉండడానికి భద్రపరచిన మన్నా (తరువాత కాలంలో‌ ఈ మన్నా పాత్రను మందసంలో పెట్టారు) ఎన్ని సంవత్సరాలు గడచినా పాడైపోలేదు (32-34 వచనాలు. హెబ్రీ 9:4). ఇది దేవుడు చేసిన అద్భుతం. 
 
అదేవిధంగా దేవుని మాటకు విరుద్ధంగా పోగుచేసుకున్నది ఏదైనా సరే అది ఇశ్రాయేలీయులు మోషేమాటకు విరోధంగా పోగుచేసుకున్న మన్నాలానే పాడైపోక తప్పదని మనం గ్రహించాలి. ఇక్కడ దేవునిమాటకు విరుద్ధంగా మన్నాను మరుసటిరోజుకు ఉంచుకున్నవారు బహుశా తమ చుట్టూ ఉన్న ప్రజలకంటే జ్ఞానవంతులంగా భావించుకుని, మరుసటి దినానికి ఏమీలేకుండా చేసుకున్నవారిని మూర్ఖులుగా పరిగణించి అలా దాచుకునియుండవచ్చు. రేపు మరలా ఆ ఆహారం లభిస్తుందో లేదో అన్నది వారికున్న సందేహం. కానీ దేవుడు ఆజ్ఞాపించినప్పుడు అలాంటి తెలివితేటలకు తావుండకూడదు. అందుకే చివరికి వారు పూర్తిగా తినకుండా దాచుకున్న ఆహారం పాడైపోయి చుట్టూ ఉన్న ప్రజలదృష్టిలో అవివేకులుగా గుర్తించబడ్డారు. వారు అలా చెయ్యకుండా ఉండుంటే ఆ ముందురోజు తృప్తిగా భోజనం చేసుండేవారు. 
 
నిర్గమకాండము 16:21
వారు అనుదినము ఉదయమున ఒక్కొక్కడు తన యింటివారి భోజనమునకు తగినట్టుగా కూర్చుకొనిరి. ఎండ వేడిమికి అది కరిగెను. 
 
ఈ వచనంలో ఆ మన్నా ఎండ వేడికి కరుగుతున్నట్టు మనం చూస్తాం. కాబట్టి ఇశ్రాయేలీయులు ఎండ ఎక్కువకాకముందే దానిని కూర్చుకోవాలి. ఇశ్రాయేలీయులు సమయక్రమాన్ని పాటిస్తూ దానిని సేకరించుకోవాలనే ఉద్దేశంతోనే దేవుడు ఆ మన్నాను ఎండకు కరిగేలా చేసాడు. సాధారణంగా ఆ మన్నా రోటిలో వేసి దంచేంత గట్టితనం గలది (సంఖ్యాకాండము 11:8), అది ఎండకు కరిగిపోవడమంటే అద్భుతమే. 
 
నిర్గమకాండము 16:22
ఆరవ దినమున వారు ఒక్కొక్కనికి రెండేసి ఓమెరుల చొప్పున రెండంతలు ఆహారము కూర్చు కొనినప్పుడు సమాజముయొక్క అధికారులందరు వచ్చి అది మోషేకు తెలిపిరి. 
 
అంతకుముందు రోజుల్లో ఎక్కువ కూర్చుకున్నవాడికి ఎక్కువగా కాకుండా తక్కువ కూర్చుకున్నవాడికి తక్కువగా కాకుండా సమానంగా ఉన్న మన్నా ఆరవదినాన కూర్చుకున్నప్పుడు మాత్రం రెట్టింపుగా ఉండడం, అది చూసి ఆశ్చర్యపడిన ఇశ్రాయేలీయుల అధికారులు ఆ విషయం మోషేకు తెలియచెయ్యడం ఈ వచనంలో మనం చూస్తాం. విశ్రాంతి దినమైన ఏడవరోజు అది ఆకాశం నుండి కురియదు కాబట్టి (25వ వచనం) ఆ విధంగా జరిగింది. 
 
నిర్గమకాండము 16:23,24
అందుకు అతడుయెహోవా చెప్పినమాట యిది; రేపు విశ్రాంతిదినము, అది యెహో వాకు పరిశుద్ధమైన విశ్రాంతిదినము, మీరు కాల్చుకొన వలసినది కాల్చుకొనుడి, మీరు వండుకొనవలసినది వండుకొనుడి, ఉదయము వరకు మిగిలినదంతయు మీకొరకు ఉంచుకొనుడని వారితో చెప్పెను. మోషే ఆజ్ఞాపించినట్లు వారు ఉదయము వరకు దానిని ఉంచుకొనిరి, అది కంపుకొట్టలేదు, దానికి పురుగు పట్టలేదు. 
 
ఈ వచనంలో విశ్రాంతి దినం రోజుకు మిగిలిన మన్నా పాడైపోకుండా ఉన్నట్టు మనం చూస్తాం. ఎందుకంటే ఇశ్రాయేలీయులు దేవుని మాట ప్రకారం విశ్రాంతి దినం పాటించాలి కాబట్టి, ఆయనే అలాంటి అద్భుతం జరిగిస్తున్నాడు. దేవుని ఆజ్ఞలను పాటించాలనే ఆసక్తి మనలో ఉంటే, మనం వాటి విషయంలో తప్పిపోకుండా ఆయనే దానికి తగిన పరిస్థితులను కలుగచేస్తాడు. 
 
అదేవిధంగా ఇక్కడ మోషే ఆ మన్నాను "మీరు కాల్చుకొన వలసినది కాల్చుకొనుడి, మీరు వండుకొనవలసినది వండుకొనుడి" అని ఇశ్రాయేలీయులతో పలకడం మనం చూస్తాం. ఎంత రుచికరమైన ఆహారమైనా ప్రతీరోజూ ఒకేవిధంగా తినడానికి ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి, మన్నా విషయంలో ఇశ్రాయేలీయులకు ఇటువంటి అవకాశాలు లభించాయి. వారు దానిని వట్టిదే తినవచ్చు, లేదా రొట్టెలుగా చేసుకొనైనా, అన్నంలా వండుకునైనా తినవచ్చు. 
 
నిర్గమకాండము 16:25-30
మోషే నేడు దాని తినుడి, నేటి దినము యెహోవాకు విశ్రాంతిదినము, నేడు అది బయట దొరకదు. ఆరు దినములు దాని కూర్చుకొనవలెను, విశ్రాంతి దినమున అనగా ఏడవ దినమున అది దొరకదనెను. అట్లు జరిగెను; ప్రజలలో కొందరు ఏడవ దినమున దాని కూర్చుకొన వెళ్లగా వారికేమియు దొరకక పోయెను. అందుకు యెహోవా మోషేతో ఇట్లనెనుమీరు ఎన్నాళ్లవరకు నా ఆజ్ఞలను నా ధర్మ శాస్త్ర మును అనుసరించి నడువనొల్లరు? చూడుడి నిశ్చయముగా యెహోవా ఈ విశ్రాంతిదినమును ఆచరించుటకు సెలవిచ్చెను గనుక ఆరవ దినమున రెండు దినముల ఆహా రము మీ కనుగ్రహించుచున్నాడు. ప్రతివాడును తన తన చోట నిలిచి యుండవలెను. ఏడవ దినమున ఎవడును తన చోటనుండి బయలు వెళ్లకూడదనెను. 
కాబట్టి యేడవ దినమున ప్రజలు విశ్రమించిరి. 
 
ఈ వచనాలలో ఇశ్రాయేలీయులు మోషే మాట లెక్కచెయ్యకుండా ఏడవరోజు కూడా మన్నాకోసం బయటవెదకడం, దేవుడు ఆ విషయంలో వారిని తీవ్రంగా గద్దించడం, చివరికి వారు విశ్రాంతి దినాన్ని పాటించడం మనం చూస్తాం. ఈవిధంగా దేవుడు తన ఆజ్ఞల విషయంలో చిన్న అవిధేయతను కూడా సహించడు. విశ్రాంతి దినాన ఆహారాన్ని‌ వెదకడానికి వెళ్ళడమే పాపమైతే, ఈరోజు చాలామంది క్రైస్తవులు ప్రభువుదినం రోజు ఆయన సన్నిధిలో గడపకుండా అనేకమైన పనులు పెట్టుకుంటున్నారు, కుటుంబంతో కలసి షికార్లు చెయ్యాలనుకుంటున్నారు, అది మరెంత పాపంగా పరిగణించబడుతుందో ఆలోచించండి. 
 
ఇక్కడ మోషే పలికిన "ప్రతివాడును తన తన చోట నిలిచి యుండవలెను" అనే మాటలను బట్టే విశ్రాంతి దినాన ఎక్కువదూరం ప్రయాణం చెయ్యకూడదనే ఆచారం నియమించబడిందని బైబిల్ పండితులు భావిస్తున్నారు. యూదులు మోషే పలికిన ఆ మాటను తామున్న ప్రదేశం నుండి ఇతర స్థలాలకు ప్రయాణం చెయ్యకూడదని కూడా అర్థం చేసుకున్నారంట. ఆవిధంగా వారు విశ్రాంతి‌ దినాన ఎక్కువ దూరం ప్రయాణించకూడదనే ఆచారం గురించి మనకు అపో.కార్యములు 1:12 లో కనిపిస్తుంది. సంఖ్యాకాండము 35:4వ వచనం ప్రకారం ఆ ప్రయాణదూరం వెయ్యి మూరలు అంట. 
 
నిర్గమకాండము 16:31
ఇశ్రాయేలీయులు దానికి మన్నా అను పేరు పెట్టిరి. అది తెల్లని కొతి మెరగింజవలె నుండెను. దాని రుచి తేనెతో కలిపిన అపూపములవలె నుండెను. 
 
ఈ వచనంలో మన్నాయొక్క రూపం (shape) దాని రుచి గురించి వివరించబడడం మనం చూస్తాం. అది చూడడానికి కొత్తిమీరగింజ (ధనియాలు) లా గుండ్రంగా పైన ఒకరకమైన రూపకల్పనతో ఉంది కానీ తెల్లరంగులో‌‌ ఉంది. రంగు తెలుపు, రూపమేమో ధనియాలు. ఇక రుచి విషయానికి వస్తే తేనెతో కలిపిన అపూపము (పిండివంటకం) లా ఉంది. యూదులు దీని రుచిగురించి దానికి తయారు చేసుకునే విధానాన్ని బట్టి ఒకోలా ఉండేదని రాసారు, ఉదాహరణకు రొట్టెలుగా చేసుకుంటే ఒకవిధమైన రుచి, వట్టిది తింటే మరోవిధమైన రుచి. అందుకే సంఖ్యాకాండంలో దాని రుచిగురించి ఇలా రాయబడింది.
 
సంఖ్యాకాండము 11:8 జనులు తిరుగుచు దానిని గూర్చుకొని తిరుగట విసిరి లేక రోట దంచి పెనము మీద కాల్చి రొట్టెలు చేసిరి; దాని రుచి క్రొత్త నూనె రుచివలె ఉండెను. 
 
నిర్గమకాండము16:32-34
మరియు మోషే ఇట్లనెను యెహోవా ఆజ్ఞాపించినదే మనగానేను ఐగుప్తుదేశము నుండి మిమ్మును బయటికి రప్పించినప్పుడు అరణ్యములో తినుటకు నేను మీకిచ్చిన ఆహారమును మీ వంశస్థులు చూచునట్లు, వారు తమయొద్ద ఉంచుకొనుటకు దానితో ఒక ఓమెరు పట్టు పాత్రను నింపుడనెను. కాబట్టి మోషే అహరోనుతో నీవు ఒక గిన్నెను తీసికొని, దానిలో ఒక ఓమెరు మన్నాను పోసి, మీ వంశస్థులు తమ యొద్ద ఉంచుకొనుటకు యెహోవా సన్నిధిలో దాని ఉంచుమనెను. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఉంచబడుటకు సాక్ష్యపు మందసము ఎదుట అహరోను దాని పెట్టెను. 
 
ఈ వచనాలలో అహరోను దేవుని‌మాట ప్రకారం; ఆయనే ఇశ్రాయేలీయులను అరణ్యంలో మన్నాతో పోషించాడు అనడానికి గుర్తుగా ఆ మన్నాను ఒక పాత్రలో దాచి మందసంలో పెట్టడం మనం చూస్తాం. అయితే మొదటిగా మన్నా కురిసే సమయానికి ఇంకా మందసం‌ తయారు చెయ్యబడలేదు కాబట్టి ప్రస్తుతం అది మోషే అహరోనులు భద్రం చేసి తరువాత మందసంలో పెట్టియుండవచ్చు. మోషే అదంతా జరిగిపోయిన తరువాత ఈ చరిత్రను రాస్తున్నాడు కాబట్టి ఈవిధంగా పేర్కొన్నాడు. 
 
నిర్గమకాండము 16:35
ఇశ్రాయేలీయులు నివసింపవలసిన దేశము నకు తాము వచ్చు నలుబది యేండ్లు మన్నానే తిను చుండిరి; వారు కనానుదేశపు పొలిమేరలు చేరువరకు మన్నాను తినిరి. 
 
ఈ వచనంలో ఇశ్రాయేలీయులు కనాను సరిహద్దులకు చేరేంతవరకూ అనగా నలభై సంవత్సరాలు మన్నానే తిన్నట్టు రాయబడడం మనం చూస్తాం. వారు కనానుకు చేరాక  ఆ దేశంలో పండే పంటను తినగలరు కాబట్టి ఇక ఆయన దానిని కురిపించలేదు. ఇక్కడ దేవుడు చేసే అద్భుతానికి ఒక కారణం ఉంటున్నట్టు (అరణ్యంలో ఆకలి తీర్చాలి), ఆ కారణం‌ నెరవేరగానే (వేరే ప్రత్యామ్నాయం సిద్ధపడగానే) ఇక ఆ అద్భుతానికి తావులేనట్టు మనం గమనిస్తున్నాం. దైవప్రత్యక్షత విషయంలో కూడా మనం ఇదేవిధంగా అర్థం చేసుకోవాలి. వాక్యం సంపూర్తి చెయ్యబడడానికీ మరియు వాక్యం సంపూర్ణంగా లేని సమయంలో తన ప్రజలను నడిపించడానికీ ఆయన ప్రత్యక్షతలను (కలలను), అనుగ్రహించాడు. ఎప్పుడైతే అరవైఆరు గ్రంధాల సంపూర్ణ వాక్యం మన చేతికి వచ్చిందో ఇక ఆ ప్రత్యక్షతలు అవసరం లేదు. ఆయన తన వాక్యం ద్వారా మనల్ని నడిపిస్తున్నాడు. 
 
2థెస్సలొనికయులకు 2: 15 కాబట్టి సహోదరులారా, నిలుకడగా ఉండి మా నోటిమాటవలననైనను మా పత్రిక వలననైనను మీకు బోధింపబడిన విధులను చేపట్టుడి.
 
నిర్గమకాండము 16:36
ఓమెరు అనగా ఏపాలో దశమ భాగము.
 
ఏపాలో అంటే "తూము" అని అర్థం. దీనినే "పుట్టి" అని కూడా అంటారు. ఇశ్రాయేలీయులు ఒక్కో సభ్యుని లెక్కచొప్పున పోగుచేసుకున్న మన్నా ఆ "తూములో" పదవ వంతు. ఓమెరు అంటే అదే.

 

 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.