పాత నిబంధన

రచయిత: కె విద్యా సాగర్

గ్ర‌ంథపరిచయం;,8:1,2, 8:3,4, 8:5,6 , 8:7 , 8:8 , 8:9 , 8:10,11 , 8:12,13 , 8:14 , 8:15 , 8:16,17 , 8:18,19 , 8:20,21 , 8:22,23 , 8:24, 8:25 , 8:26 , 8:27 , 8:28, 8:29 , 8:30-32

 

నిర్గమకాండము 8:1,2
తరువాత యెహోవా మోషేతో ఇట్లనెను నీవు ఫరో యొద్దకు వెళ్లి అతనితో నన్ను సేవించుటకు నా జనులను పోనిమ్ము; నీవు వారిని పోనియ్యనొల్లనియెడల ఇదిగో నేను నీ పొలి మేరలన్నిటిని కప్పలచేత బాధించెదను.

ఈ వచనాలలో దేవుడు, మోషేతో ఫరో యొద్దకు వెళ్ళి ఏమని హెచ్చరించాలో వివరించడం మనం చూస్తాం. ఈవిధంగా దేవుడు తాను చేయబోయేదానిని ఫరోకు ముందే హెచ్చరించడం ద్వారా తన‌ మనస్సు మార్చుకోవడానికి ఒక అవకాశం ఇస్తున్నాడు. ఎందుకంటే అప్పటివరకూ అతను జరిగించిన దుర్మార్గాన్ని బట్టి అతని హృదయం దేవునిచేతే కఠినపరచబడినప్పటికీ, దుష్టత్వాన్ని విడిచి మార్పు చెందాలనే మానవబాధ్యతను ఇది అతనికి గుర్తుచేస్తుంది. ఈ హెచ్చరిక/అవకాశం మార్పు చెందని ఆ వ్యక్తిని మరింత కఠినమైన తీర్పుకు గురిచేస్తుంది‌. సువార్త ప్రకటనలో కూడా, "అందరూ మారుమనస్సు పొందాలనే పిలుపు" ( అపో.కార్యములు 17:30) కఠినులైన దుష్టుల పట్ల దేవుడు వెల్లడించే తీర్పుకు సాధనంగా ఉంటుంది. ఫరోకు దేవుడు చేస్తున్న ఈ హెచ్చరికలో మనం అర్థం చేసుకోవలసిన మరొక కోణం ఏంటంటే, అతను ఆ తెగులును చూసినప్పుడు అది ఇశ్రాయేలీయుల దేవుడే చేసిన కార్యమని స్పష్టంగా గ్రహించగలుగుతాడు.

అదేవిధంగా దేవుడు ఐగుప్తీయులకు తీర్పుతీర్చడానికి పెద్దపెద్ద క్రూరజంతువులను కానీ, విషసర్పాలను కానీ వాడుకోవడం లేదు. చాలా పిరికి జీవులైన కప్పలను వాడుకుంటున్నాడు, సాధారణంగా ఈ కప్పలు ఎవరికీ హాని చేసే జంతువులు కావు, అలాంటి వాటిని కూడా దేవుడు ఇక్కడ ప్రమాదకరమైన సాధనాలుగా వాడుకుంటున్నాడు. కాబట్టి ఈ సృష్టిలో ఉన్న ప్రతిజీవినీ ఆయన తన చిత్తాన్ని నెరవేర్చే సైన్యంగా వాడుకుంటాడని మనం గమనించాలి, ఆయన తన‌ మహిమను ప్రదర్శించడానికి బలమైన వాటినే ఉపయోగించుకోవలసిన అవసరం లేదు, అత్యంత బలహీనమైన వాటి ద్వారా కూడా ఆయన తన మహిమను ప్రదర్శించుకుంటాడు. అందుకే ఆయనకు సైన్యములకు అధిపతి అనే పేరు, మహాశక్తివంతులైన దేవదూతలను ఉద్దేశించే కాకుండా చిన్నచిన్న జీవులను ఉద్దేశించి కూడా వాడబడింది.

యోవేలు 2: 25 మీరు కడుపార తిని తృప్తిపొంది మీకొరకు వింత కార్య ములను జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించునట్లు నేను పంపిన మిడుతలును గొంగళి పురుగులును పసరు పురుగులును చీడపురుగులును అను "నా మహా సైన్యము" తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరల నిత్తును.

ఇక్కడ దేవుడు క్రూరజంతువులను కానీ విషసర్పాలను కానీ కాకుండా కప్పలు, పేలు, మిడతలు ఇటువంటి అల్పజీవులను వాడుకోవడంలో ఆయన ఉద్దేశం, ఐగుప్తీయులను సమూలంగా నాశనం చెయ్యకుండా వారికి ఆయనను గురించిన సందేశాలు ఇవ్వడమే. ఎందుకంటే ఐగుప్తీయులు ఈ తెగుళ్ళవల్ల యెహోవా దేవుడు ఈ సృష్టిలో అల్పమైన జీవులను కూడా ప్రమాదకరంగా వాడుకోగల సర్వసృష్టిపై నియంత్రణ కలిగినవాడని, అంతేకాకుండా వారు ఇంతకాలం పూజించిన దేవుళ్ళు ఆయన చేతినుండి తమను కాపాడలేని అసమర్థులనీ, ఆయన తలచుకుంటే వారు దేవతలుగా పూజించిన జీవులతోనే వారికి ప్రమాదం కలిగించగలడని గుర్తిస్తారు.

ఎందుకంటే ఐగుప్తీయులు ఈ కప్పలను (ఆ రూపాన్ని) హెక్ట్ (heket) అనే ప్రత్యుత్పత్తి కలిగించే దేవతగా పూజించేవారు. దేవుడు ఐగుప్తు దేవతలకు తీర్పు తీర్చే క్రమంలో నైలునదిని రక్తంగా మార్చడంతో పాటు, కప్పలను రప్పించడం ద్వారా నేను పైన జ్ఞాపకం చేసినట్టుగా ఐగుప్తీయులందరూ తాము పూజించే దేవతలు (జీవులు) కూడా యెహోవా దేవుని నియంత్రణ క్రిందే పనిచేస్తాయని, ఆయన తలచుకుంటే వాటిద్వారానే తమపైకి ప్రమాదాలను రప్పించగలడని బాగా గుర్తిస్తారు.

నిర్గమకాండము 8:3,4
ఏటిలో కప్పలు విస్తారముగా పుట్టును; అవి నీ యింట నీ పడకగదిలోనికి నీ మంచముమీదికి నీ సేవకుల యిండ్లలోనికి నీ జనులమీదికి నీ పొయిలలోనికి నీ పిండి పిసుకు తొట్లలోనికి ఎక్కి వచ్చును; ఆ కప్పలు నీ మీదికి నీ జనుల మీదికి నీ సేవకులందరిమీదికి వచ్చునని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పుమనెను.

ఈ వచనాలలో దేవుడు ప్రకటించిన తెగులు ఐగుప్తు ప్రజలపైకి ఎలా రాబోతుందో వివరించబడడం మనం చూస్తాం. అప్పటికే ఐగుప్తు ఏటిలో కప్పలు‌ ఉన్నప్పటికీ అవి ఆ దేశం మొత్తాన్ని కమ్మివేసేంత విస్తారంగా ఉండవు, అందుకే దేవుడు ఆ ఏటిలో విస్తారమైన కప్పలను పుట్టించబోతున్నట్టు చెబుతున్నాడు. నేను పై వచనాలలో వివరించినట్టుగా ఈ కప్పలు చాలా పిరికిజీవులు, కానీ ఇప్పుడు అవి ఫరో ఇంటిలో సహా ఐగుప్తీయుల అందరి ఇళ్ళలోకి విస్తారంగా రావడం వల్ల అది దేవుని తీర్పుగా ఫరో గమనిస్తాడు. ఈ పరిస్థితి ఐగుప్తీయులకు ఎంత దారుణంగా ఉంటుందంటే, అవి వారి శరీరంపైకి ఎక్కిరావడమే కాకుండా కనీసం వారు ఆహారం తయారు చేసుకోవడానికి కూడా అవకాశం లేకుండా చేస్తాయి. వాటి వాసన, స్పర్శ వల్ల ఆ జనులందరూ తీవ్రమైన విసుగుకు లోనౌతారు.

నిర్గమకాండము 8:5,6
మరియు యెహోవా మోషేతో ఇట్లనెను నీవు అహరోనును చూచినీ కఱ్ఱ పట్టుకొని యేటిపాయల మీదను కాలువలమీదను చెరువుల మీదను నీ చెయ్యి చాపి ఐగుప్తు దేశముమీదికి కప్పలను రాజేయుమని అతనితో చెప్పుమనగా అహరోను ఐగుప్తు జలములమీద తన చెయ్యి చాపెను; అప్పుడు కప్పలు ఎక్కివచ్చి ఐగుప్తు దేశమును కప్పెను.

ఈ వచనాలలో దేవుడు, ఫరోను హెచ్చరించినట్టుగానే అహరోను తన కఱ్ఱను ఐగుప్తు నదులవైపు చాచినప్పుడు కప్పలు వచ్చి ఆ దేశమంతా కప్పివెయ్యడం మనం చూస్తాం. ఫరో కనుక మోషే హెచ్చరించినప్పుడు తన మనసు‌ మార్చుకుని ఉంటే ఇటువంటి పరిస్థితి రాకపోవును, దీనిని బట్టి నేను ప్రారంభంలో వివరించినట్టుగా కఠినపరచబడినవారికి కూడా దేవుడు అవకాశం ఇస్తాడనీ, అయినప్పటికీ వారు తమ మనసు మార్చుకోకుండా ఆయన ప్రకటించిన తీర్పుకు లోనౌతారని మనం గమనించాలి.

కీర్తనల గ్రంథము 7:11,12 న్యాయమునుబట్టి ఆయన తీర్పు తీర్చును ఆయన ప్రతిదినము కోపపడు దేవుడు. ఒకడును మళ్లనియెడల, ఆయన తన ఖడ్గమును పదును పెట్టునుతన విల్లు ఎక్కు పెట్టి దానిని సిద్ధపరచి యున్నాడు.

అదేవిధంగా ఇటువంటి పరిస్థితి ఐగుప్తులో సంభవించినట్టు అన్యరచనల్లో కూడా లిఖితమైందని డాక్టర్ జాన్ గిల్ గారు తన వ్యాఖ్యానంలో వివరించారు.

నిర్గమకాండము 8:7
శకునగాండ్రు కూడ తమ మంత్రములవలన అలాగు చేసి ఐగుప్తు దేశము మీదికి కప్పలను రాజేసిరి.

ఈ వచనంలో ఐగుప్తు శకునగాండ్రు, మాకు కూడా ఇటువంటి శక్తి ఉన్నదని రుజువు చెయ్యడానికి ఆ దేశం మీదకు కప్పలను రప్పించడం మనం చూస్తాం. వీరికి ఈ శక్తి ఎలా వచ్చిందో నీటిని రక్తంగా మార్చిన సందర్భంలో వివరించాను (నిర్గమకాండము 7:22 వ్యాఖ్యానం చూడండి). ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏమిటంటే, ఈ శకునగాండ్రు ఇలా చెయ్యడంలో ఉన్న ఉద్దేశం మోషే అహరోనుల ముందు మీ దేవునికే కాదు, మాకు కూడా శక్తులు ఉన్నాయని ఆయనతో పోటీ పడి చూపించడమే. కానీ ఆ క్రమంలో వీరు దేవుడు రప్పిస్తున్న తీర్పుకే సహకారులు ఔతూ ఆ తీర్పును అధికం చేస్తున్నారు. ఎలా అంటే, అప్పటికే ఐగుప్తు దేశమంతా కప్పలు నిండి వారిని ఇబ్బంది పెడుతుంటే, వీరు ఏటిలో నిలచిపోయిన మరికొన్ని కప్పలను కూడా లోపలికి రప్పించి ఆ ప్రజలను మరింత ఇబ్బందికి గురిచేసారు. దేవునితో పోటీపడాలనుకునేవారి పరిస్థితి ఇలానే ఉంటుంది. వారు ఆయనను ఎదిరించాలని అలా చేస్తుంటారు కానీ చివరికి ఆయన సార్వభౌమ నిర్ణయాన్ని నెరవేర్చడంలో సహకారులు ఔతుంటారు. సాతాను చేస్తుంది కూడా ఇదే. వాడు చేసే కుట్రలన్నిటిలోనూ దీనిని మనం అన్వయించుకోవచ్చు. ఉదాహరణకు వాడు హవ్వను ప్రేరేపించి దేవుని సృష్టిని పాడుచెయ్యాలి అనుకున్నాడు, కానీ దానివల్ల తన కుమారుడిని లోక రక్షకుడిగా బయలుపరచాలనే దేవుని నిర్ణయమే నెరవేరింది. ఎందుకంటే దేవుడు యేసుక్రీస్తును ఈ సృష్టిని చెయ్యడానికి ముందే ఈ లోకానికి రక్షకుడిగా నియమించాడు (1పేతురు1:20). కొందరు భావిస్తున్నట్టుగా ఈ నిర్ణయం దేవుడు భవిష్యత్తులోకి తొంగిచూసి చేసింది కాదు, ఆయన ఆ విధంగా భవిష్యత్తులోకి తొంగి చూసి నిర్ణయాలు చెయ్యడు కానీ, ఆయన ముందుగా నిర్ణయించిందే (సంకల్పమే) భవిష్యత్తులో సంభవిస్తుంది ( అపో.కార్యములు 2:23).

దీనిగురించి మరింత వివరంగా తెలుసుకోవడానికి ఈ క్రింది లింక్ ద్వారా సూచించిన వ్యాసం చదవండి.

దేవుణ్ణి పాపానికి కర్తగా చూపిస్తుంది ఎవరు?

నిజంగా ఐగుప్తు శకునగాండ్రకు కానీ వారిని నడిపిస్తున్న సాతానుడికి కానీ దేవునితో పోటీపడి ఆయన ప్రకటించినతీర్పును (నిర్ణయాన్ని) ఎదిరించే శక్తే ఉండుంటే, వారు మోషే నైలునదిని రక్తంగా మార్చడం వల్ల ఐగుప్తీయులు ఇబ్బందిపడుతున్నపుడు ఆ రక్తాన్ని మరలా నీటిగా మార్చి చూపించాలి, కానీ వారు అలా చెయ్యకుండా ఉన్న నీటిని కూడా రక్తంగా మార్చేసారు. మోషే కప్పలను రప్పించినప్పుడు ఐగుప్తీయులు వాటి వల్ల విసుగుచెందుతుంటే వాటిని తొలగించి చూపించాలి కానీ, మరొకొన్ని కప్పలను రప్పించి ఆ ప్రజలకు ఇంకా విసుగు కలిగించారు.

రోమీయులకు 9: 19 ఆయన చిత్తమును ఎదిరించిన వాడెవడు?

నిర్గమకాండము 8:8
అప్పుడు ఫరో మోషే అహరోనులను పిలిపించినా యొద్దనుండి నా జనులయొద్ద నుండి ఈ కప్పలను తొలగించుమని యెహోవాను వేడుకొనుడి, అప్పుడు యెహోవాకు బలి అర్పించుటకు ఈ ప్రజలను అగత్యముగా పొనిచ్చెదననెను.

ఈ వచనంలో ఫరో, మోషే అహరోనులను పిలిపించి వారు ఐగుప్తుపైకి రప్పించిన కప్పల విషయంలో యెహోవాను వేడుకోమనడం, అప్పుడు ఇశ్రాయేలీయుల ప్రజలను బలి అర్పించడానికి పోనిస్తాననడం మనం చూస్తాం. ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏమిటంటే "యెహోవా ఎవరు? నేను ఆయన మాట విని ఈజనులను పోనిచ్చుటను యెహోవా ఎవడు?" అని గర్వంగా పలికిన ఫరో ఇక్కడ మొదటిసారిగా ఒక మెట్టు దిగివచ్చి "యెహోవాను వేడుకొనుడి" అంటున్నాడు. దేవుని తీర్పులు ఈవిధంగానే ఆయన విరోధులను కూడా ఆయనముందు తగ్గించుకునేలా (మోకరించేలా) చేస్తాయి. వారు మారుమనస్సు పొంది, పశ్చాత్తాపంతో అలా చేయకపోయినప్పటికీ భయంతో అయినా అలా చెయ్యకతప్పదు. క్రీస్తు రాకడలో ఆయన విరోధులందరి విషయంలోనూ ఇటువంటి పరిస్థితినే మనం గమనిస్తాం.

ఫిలిప్పీయులకు 2:9-11 అందుచేతను పరలోకమందున్న వారిలో గాని, భూమి మీద ఉన్నవారిలో గాని, భూమి క్రింద ఉన్నవారిలో గాని, ప్రతివాని మోకాలును యేసునామమున వంగునట్లును, ప్రతివాని నాలుకయు తండ్రియైన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకొనునట్లును, దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి, ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను.

ప్రకటన గ్రంథము 5:13 అంతట పరలోకమందును భూలోకమందును భూమి క్రిందను సముద్రములోను ఉన్న ప్రతి సృష్టము, అనగా వాటిలోనున్న సర్వమును సింహాసనాసీనుడై యున్నవానికిని గొఱ్ఱెపిల్లకును స్తోత్రమును ఘనతయు మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాకని చెప్పుట వింటిని.

నిర్గమకాండము 8:9
అందుకు మోషేనన్ను గెలిచినట్టుగా నీవు అతిశయింపవచ్చును, ఈ కప్పల శేషము ఏటిలోనే ఉండునట్లును అవి నీ మీదను నీ యిండ్లలోను ఉండకుండ చంపబడునట్లును నీ కొరకును నీ సేవకులకొరకును నీ ప్రజలకొరకును నేనెప్పుడు వేడుకొనవలెనో చెప్పుమని ఫరోను అడుగగా అతడు రేపే అనెను.

ఈ వచనంలో ఫరో వేడుకోలుకు మోషే సానుకూలంగా స్పందించడం మనం చూస్తాం. ఇక్కడ మోషే నువ్వు చెప్పినదానిని నేను వింటాను అనే భావంలో "నన్ను గెలిచినట్టుగా నీవు అతిశయింపవచ్చును" అంటున్నాడు. అందుకే ఆ కప్పల విషయంలో దేవుణ్ణి ఎప్పుడు వేడుకోవాలో ఆ సమయాన్ని నిర్ణయించే అవకాశం ఫరోకే ఇస్తున్నాడు. ఇక్కడ మోషే యొక్క తగ్గింపును మనం చూస్తున్నాం, అతనికి కావలసింది ఇశ్రాయేలీయుల ప్రజలు ఐగుప్తునుండి బయటకు పంపబడడమే తప్ప, ఫరోపైన గెలవడం కాదు. ఫరో ఇక్కడ వారిని పంపించేస్తానని మాట ఇస్తున్నాడు కాబట్టి, మోషే తాను రప్పించిన కప్పల‌ విషయంలో రాజీపడుతూ ఈమాటలు చెబుతున్నాడు.

(ఇక్కడ వాడబడిన పదజాలం విషయంలో కొంచెం తికమక అయితే ఉండింది. కానీ సందర్భానుసారంగా ఈమాటలు చదివినప్పుడు ఈ వివరణే నాకు సత్యంగా అనిపించింది కాబట్టి, దానినే ఇక్కడ ప్రస్తావించాను)

ఇక కప్పల శేషం ఏటిలోనే ఉంటాయి అన్నపుడు, నేను పైన వివరించినట్టుగా ఏటిలో సాధారణ సంఖ్యలో ఉండే కప్పలే కాకుండా దేవుడు మరిన్ని కప్పలను పుట్టించి ఐగుప్తుపైకి పంపించాడు కాబట్టి, వాటన్నిటినీ వెనక్కు పంపిస్తే ఆ నదులన్నీ వాటితోనే నిండిపోయి, నీటిపరంగా ఇబ్బందిని కలిగిస్తాయి‌. అందువల్ల అధనంగా పుట్టించబడిన కప్పలు చనిపోయి, సాధారణ సంఖ్యలో ఉన్న కప్పలు (శేషము) మాత్రమే ఆ ఏటిలోకి తిరిగిపోయేలా చేస్తాడని అర్థం.

అదేవిధంగా ఇక్కడ మోషే నీమాట చొప్పున ఈ కప్పలు వెనక్కుపోయేలా మా దేవుణ్ణి ఎప్పుడు వేడుకోవాలని అడిగినప్పుడు ఫరో రేపు అనడం మనం చూస్తాం, అవి కలిగిస్తున్న ఇబ్బందిని బట్టి వెంటనే చెయ్యమని అనడం లేదు. ఇక్కడ ఫరో మనసులో అవివేకం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఈలోపు తన శకునగాండ్రు ఆ కప్పలబాధకు ఏదైనా పరిష్కారం సూచిస్తారేమో అనే నమ్మకంతోనే అతను ఇలా అంటుండవచ్చు. కఠినపరచబడిన వ్యక్తి ఈవిధంగానే దేవునిశక్తిని కళ్ళారా చూపినప్పటికీ, ముందుగా తన స్వంత మార్గాల్లో సమస్యకు పరిష్కారం కనుగొనాలని ఆలోచిస్తుంటాడు.

నిర్గమకాండము 8:10,11
అందుకతడు మా దేవుడైన యెహోవా వంటి వారెవరును లేరు అని నీవు తెలిసికొనునట్లు నీ మాట చొప్పున జరుగును; అనగా కప్పలు నీ యొద్ద నుండియు నీ యిండ్లలో నుండియు నీ సేవకుల యొద్ద నుండియు నీ ప్రజలయొద్దనుండియు తొలగి పోవును; అవి యేటిలోనే ఉండుననెను.

ఈ వచనాలలో మోషే కప్పల విషయమై ఫరోకు ఇస్తున్న బదులును మనం చూస్తాం. ఇక్కడ మనం ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని గుర్తించాలి. గత వచనంలో మోషే "నీవు నన్ను గెలిచినట్టుగా అతిశయించవచ్చు" అంటూ అతను ఆ కప్పలగురించి ఎప్పుడు వేడుకోవాలో సమయాన్ని నిర్ణయించే అవకాశం ఫరోకే ఇస్తూ తన తగ్గింపును చాటుకున్నాడు. ఎందుకంటే అతనికి కావలసింది ఫరో ఇశ్రాయేలీయులను బయటకు పంపించడమే తప్ప ఫరోపైన గెలవడం కాదు. అప్పుడు అలా చేసిన మోషే ఇక్కడ మాత్రం "మా దేవుడైన యెహోవా వంటి వారెవరును లేరు అని నీవు తెలిసికొనునట్లు నీ మాట చొప్పున జరుగును" అంటూ ఆయన గొప్పతనాన్ని ప్రకటిస్తున్నాడు. కాబట్టి మన తగ్గింపు దేవుని నామాన్ని చులకన చేసేదిగా ఉండకుండా జాగ్రత‌ వహించాలి.‌ మనం మన స్థాయి విషయంలో తగ్గించుకోవాలి, అది కూడా దేవుని‌ మహిమ కోసమే. అదే సమయంలో దేవుని గొప్పతనాన్ని మరింత అధికంగా చాటేవారిగా కూడా ఉండాలి.

నిర్గమకాండము 8:12,13
మోషే అహరోనులు ఫరో యొద్దనుండి బయలు వెళ్లినప్పుడు యెహోవా ఫరో మీదికి రాజేసిన కప్పల విషయములో మోషే అతనికొరకు మొఱ పెట్టగా యెహోవా మోషే మాటచొప్పున చేసెను గనుక ఇండ్లలో నేమి వెలుపల నేమి పొలములలో నేమి కప్పలు ఉండకుండ చచ్చిపోయెను.

ఈ వచనాలలో మోషే ఫరోకు ఇచ్చినమాట చొప్పున దేవునికి మొరపెట్టినపుడు, ఆయన మోషే ప్రార్థన ఆలకించి, ఏటిలో విస్తారంగా పుట్టుకొచ్చి ఐగుప్తీయులపైకి విజృంభించిన కప్పలు చనిపోవడం ముందటి వచనాల ప్రకారం శేషం మాత్రమే తిరిగి ఏటిలోకి పోవడం మనం‌ చూస్తాం. ఇక్కడ "యెహోవా మోషే మాటచొప్పున చేసెను" అన్నపుడు మోషే చేసిన ప్రార్థనకు బదులివ్వడంగా మనం అర్థం చేసుకోవాలే తప్ప, మనిషి చేసిన ప్రార్థనను బట్టి దేవుడు నిర్ణయాలు తీసుకుంటాడని కాదు. ఎందుకంటే నేటి క్రైస్తవ సంఘాలలో చాలామంది ప్రార్థన అనగానే అది దేవుని మనస్సును మార్చేదిగా తప్పుడు అభిప్రాయం కలిగుంటున్నారు. దీనివల్ల దేవుడు సార్వభౌముడు కాదని అర్థం వస్తుంది. దేవుడు సార్వభౌముడైతే ఆయన మన ప్రార్థనలను బట్టి మనసు మార్చుకుని కొత్తకొత్త నిర్ణయాలు తీసుకోడు. ఆయన ముందుగా ఏం నిర్ణయించాడో దానినే జరిగిస్తాడు. లేఖనాలు మన దేవుని‌గురించి ఈ విషయాన్నే స్పష్టంగా ప్రకటిస్తున్నాయి. ఉదాహరణకు ఈమాటలు చూడండి.

దానియేలు 4: 35 భూనివాసులందరు ఆయన దృష్టికి ఎన్నికకు రానివారు; ఆయన పరలోక సేనయెడలను భూనివాసులయెడలను తన చిత్తము చొప్పున జరిగించువాడు; ఆయన చేయి పట్టుకొని నీవేమి చేయుచున్నావని ఆయనతో చెప్పుటకు ఎవడును సమర్థుడుకాడు.

ఎఫెసీయులకు 1: 12 ఆయన తన చిత్తాను సారముగా చేసిన నిర్ణయము చొప్పున సమస్త కార్యములను జరిగించుచున్నాడు.

సామెతలు 19: 21 నరుని హృదయములో ఆలోచనలు అనేకములుగా పుట్టును యెహోవాయొక్క తీర్మానమే స్థిరము.

మరి ప్రార్థన యొక్క ఉద్దేశం ఏంటి? దేవుడు తాను ముందుగా నిర్ణయించిన కార్యాలను తగిన సమయంలో జరిగించడానికి వాడుకునే సాధనమే ప్రార్థన. ఉదాహరణకు; దేవుడు మోషేను ఫరోయొద్దకు మొదటిసారి పంపినప్పుడు అతను మోషే మాట వినడని, చివరికి ఆయన ఐగుప్తుపై గొప్ప తీర్పులు తీర్చి వారికి బుద్ధి చెబుతానని తెలియచేసాడు (నిర్గమకాండము 3:19,20). ఆ క్రమంలో ఆయన ఈ కప్పల‌ ద్వారా జరిగించింది కేవలం రెండవ అద్భుతం మాత్రమే, ఈ తీర్పులు ఐగుప్తీయుల తొలిచూలు పిల్లల వధవరకూ ఆయన నిర్ణయించాడు, దానిని ముందే ప్రకటించాడు (నిర్గమకాండము 4:22,23). ఈవిధంగా దేవుడు ముందుగా నిర్ణయించిన తెగుళ్ళన్నీ ఐగుప్తుపైకి రప్పించాలంటే, ముందు ఈ కప్పల తెగులు తొలగిపోవాలి. అందుకే దేవుడు ఇక్కడ మోషే ప్రార్థనను సాధనంగా వాడుకుని ఆ పని జరిగిస్తున్నాడు. కాబట్టి లేఖనాలలో దేవుడు తన భక్తుల ప్రార్థనను ఆలకించి, వారికి మేలు చేసినప్పుడు కానీ, లేక ఆయన అప్పటివరకూ జరిగించిన కీడును/జరిగిస్తానన్న ఉపసంహరించుకున్నపుడు కానీ మనం ఇదేవిధంగా అర్థం చేసుకోవాలి. ప్రార్థన దేవుని కార్యానికి సాధనమే తప్ప ఆయన మనసును మార్చేదో లేక ఆయనకు కొత్త ఆలోచనలు రప్పించేదో కాదని గుర్తించాలి.

ఈ అంశం గురించి మరింత వివరంగా తెలుసుకోవడానికి ఈ క్రింది‌ లింకుల ద్వారా సూచించిన వ్యాసాలు  చదవండి.

దేవుని సార్వభౌమత్వం మరియు ప్రార్థన

"దేవుని సార్వభౌమ నిర్ణయానికి సాధనమే ప్రార్థన"

 

నిర్గమకాండము 8:14
జనులు వాటిని కుప్పలుగా చేసినప్పుడు భూమి కంపుకొట్టెను.

ఈ వచనంలో చనిపోయిన కప్పలను ఐగుప్తీయులు కుప్పలుగా పారబోసినట్టు మనం చూస్తాం. ఈవిధంగా దేవుడు ఇంతకాలం వారు ఏ జీవులనైతే తమ ప్రత్యుత్పత్తి దేవత (heket) యొక్క ప్రతిరూపాలుగా పూజించారో వాటిని కుప్పలుగా పారబోసారు. దేవుడు తన తీర్పులను తీర్చడం మొదలుపెడితే ఇలానే ఉంటుంది.

నిర్గమకాండము 8:15
ఫరో ఉపశమనము కలుగుట చూచి యెహోవా సెలవిచ్చినట్టు తన హృదయమును కఠినపరచుకొని వారి మాట వినక పోయెను.

ఈ వచనంలో ఫరో మోషేకు ఇచ్చినమాటను తప్పుతూ ప్రవర్తించడం మనం చూస్తాం. కఠినపరచబడినవారి పరిస్థితి ఇలానే‌ ఉంటుంది, వారు దేవుని ఉగ్రతను చూసినప్పుడు భయంతో కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు కానీ, ఆ నిర్ణయాలను/ప్రమాణాలను మాత్రం నెరవేర్చుకోలేరు. ఎందుకంటే "నాశనమే వారి అంతం". దీనికి మంచి ఉదాహరణగా ఏలీ కుమారుల విషయంలో జరిగినదానిని మమం తీసుకోవచ్చు.

1సమూయేలు 2: 25 ​నరునికి నరుడు తప్పుచేసినయెడల దేవుడు విమర్శచేయును గాని యెవరైన యెహోవా విషయములో పాపము చేసినయెడల వానికొరకు ఎవడు విజ్ఞాపనము చేయును? అనెను. "అయితే యెహోవా వారిని చంపదలచి యుండెను గనుక వారు తమ తండ్రి యొక్క మొఱ్ఱను వినకపోయిరి".

అదేవిధంగా వారు దేవుడు కలిగించే ఉపసమనాలను కూడా ఆ దేవుని తీర్పులను చులకనగా చూడడానికి, తమ హృదయాన్ని మరింతగా కఠినపరచుకోవడానికి వాడుకుంటారు. ఈమాటలను మనస్సులో పెట్టుకుని ప్రపంచ పరిస్థితిని మనం ఆలోచిస్తే " ఆయన సెలవు లేకుండా భోజనం చేసి తృప్తిపొందడం ఎవరికీ సాధ్యం కాదని" బైబిల్ బోధిస్తుంది (ప్రసంగి 2:25). అయినప్పటికీ మనుష్యులు దేవుణ్ణి గుర్తించడం లేదు. కొందరు ఆయనకు ప్రతిగా విగ్రహాలను తయారుచేసుకోవడం, మరికొందరు దేవుడే లేడనడం ప్రతీరోజూ ప్రతీచోటా మనం చూస్తూనే ఉన్నాం (నిర్గమకందము 7:22 వ్యాఖ్యానం చూడండి). 

నిర్గమకాండము 8:16,17
అందుకు యెహోవా మోషేతో నీవు నీ కఱ్ఱ చాపి యీ దేశపు ధూళిని కొట్టుము. అది ఐగుప్తు దేశమందంత టను పేలగునని అహరోనుతో చెప్పుమనగా వారు అట్లు చేసిరి. అహరోను తన కఱ్ఱను పట్టుకొని చెయ్యి చాపి ఆ దేశపు ధూళిని కొట్టినప్పుడు పేలు మనుష్యులమీదను జంతువులమీదను ఉండెను; ఐగుప్తు దేశమందంతటను ఆ దేశపు ధూళి అంతయు పేలాయెను.

ఈ వచనాలలో దేవుడు ఐగుప్తుపై తాను నిర్ణయించిన మూడవ తెగులును రప్పించడం మనం చూస్తాం. నేను పైన‌ చెప్పినట్టుగా ఇక్కడ కూడా దేవుడు చిన్నచిన్న పేలనే తన సైన్యంగా వాడుకుంటున్నాడు. అయితే ఈ పేలు కప్పలకంటే దారుణమైన పరిస్థితిని కలిగిస్తాయి. ఎందుకంటే ఇవి మనుషుల/జంతువుల రక్తాన్ని పీల్చుకుని బ్రతికే జీవులు. దేవుడు ఈ పేలను ఐగుప్తు దేశపు ధూలినుండి‌ పుట్టించడం ద్వారా ఆయన నిర్జీవమైనదానినుండి, చివరికి శూన్యం నుండి కూడా జీవాన్ని సృష్టించగల సమర్థుడని మనకు మరోసారి రుజువౌతుంది.

అదేవిధంగా ఐగుప్తీయులు సెబు (seb) అనే దేవుడ్ని భూదేవుడిగా పూజించేవారు. అందుకే ఇక్కడ దేవుడు ఆ దేశపు ధూళి (భూమి) నుండే పేలను సృష్టించి వారికి బుద్ధి చెబుతున్నాడు. అయితే, ఇక్కడ తెలుగులో పేలు అని తర్జుమా చేసినచోట హీబ్రూలో వాడబడిన పదానికి పేలు, ఈగలు, దోమలు అనే అర్థం కూడా వస్తుందని బాషా పండితులు అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనప్పటికీ అవి ధూళినుండే పుట్టించబడుతున్నాయి కాబట్టి, నేను పైన చెప్పినట్టుగా ఐగుప్తీయుల భూదేవుడి ద్వారానే వారిని ఇబ్బంది పెడుతున్నాడు.

అవి ఐగుప్తీయులను ఎంతగా ఇబ్బంది పెట్టాయో కీర్తనాకారుడు కూడా ప్రత్యేకంగా వివరించడం మనం చూస్తాం.

కీర్తనల గ్రంథము 78:45 ఆయన వారి మీదికి జోరీగలను గుంపుగా విడిచెను. అవి వారిని తినివేసెను.

ఇక్కడ అవి వారిని తినివేసాయి అంటే, వారికి ప్రాణాధారమైన రక్తాన్ని పీల్చివేసాయని, ప్రాణాధారమైన ఆహారాన్ని పాడు చేసాయని భావం ( లేవీకాండము 26:26).

నిర్గమకాండము 8:18,19
శకునగాండ్రు కూడ పేలను పుట్టించవలెనని తమ మంత్రములచేత అట్లు చేసిరి గాని అది వారివలన కాకపోయెను. పేలు మను ష్యులమీదను జంతువులమీదను ఉండగా శకునగాండ్రు ఇది దైవశక్తి అని ఫరోతో చెప్పిరి. అయితే యెహోవా చెప్పినట్టు ఫరో హృదయము కఠినమాయెను, అతడు వారిమాట వినకపోయెను.

ఈ వచనాలలో ఐగుప్తు శకునగాండ్రు, మోషే నీటిని రక్తంగా మార్చిన విషయంలోనూ, కప్పలను రప్పించిన విషయంలో చేసినట్టు, ఈ పేల విషయంలో కూడా చెయ్యాలని ప్రయత్నించి విఫలమవ్వడం మనం చూస్తాం. ఇక్కడ అపవాదికీ, వాడి అనుచరులకూ ఆయన‌ అనుమతించిన శక్తి విషయంలో పరిమితిని మనం గమనిస్తున్నాం. దేవునిశక్తి ముందు సాతాను శక్తి ఎప్పటికీ పోటీకానేరదు. అందుకే ఐగుప్తు శకునగాండ్రు తమ శక్తితో అలా చెయ్యలేకపోయినప్పుడు "అది దేవునిశక్తియని" ఒప్పుకుంటున్నారు. తరువాత సందర్భాలలో మరెక్కడా కూడా వారు మోషేతో పోటిపడే సాహసం‌ చెయ్యలేదు.

అదేవిధంగా తన శకునగాండ్రు ఇది దేవునిశక్తియని హెచ్చరించినప్పటికీ ఫరో తన కఠినత్వాన్ని ప్రదర్శిస్తున్నాడు. నేను ముందునుండీ చెబుతున్నట్టుగా దేవునిచేత కఠినపరచబడినవాడు నాశనం వరకూ అదే కఠినత్వంలో కొనసాగుతాడు.

నిర్గమకాండము 8:20,21
కాబట్టి యెహోవా మోషేతో నీవు ప్రొద్దున లేచి ఫరో యెదుట నిలువుము, ఇదిగో అతడు ఏటియొద్దకు పోవును. నీవు అతని చూచినన్ను సేవించుటకు నా ప్రజలను పోనిమ్ము. నీవు నా ప్రజలను పోనియ్యని యెడల చూడుము నేను నీ మీదికిని నీ సేవకుల మీదికిని నీ ప్రజలమీదికిని నీ యిండ్లలోనికి ఈగల గుంపులను పంపెదను; ఐగుప్తీయుల యిండ్లును వారున్న ప్రదేశమును ఈగల గుంపులతో నిండియుండును.

ఈ వచనాలలో దేవుడు, ఫరోకు ఐగుప్తు మీదికి రాబోయే ఈగల గుంపుల గురించి హెచ్చరించమని మోషేకు సెలవివ్వడం మనం చూస్తాం. ఇక్కడ ఆయన ఐగుప్తీయుల నాలుగవ దేవతపై తీర్పు తీర్చబోతున్నాడు. ఐగుప్తీయులు ఈగ/పురుగు (scarab) ముఖంతో కెఫెరా (khephera/khepri) అనే దేవుణ్ణి పూజించేవారు. అతను‌ ఉదయించే సూర్యుడి ప్రతిరూపం అనీ, అతను సృష్టి, మరియు జీవితం యొక్క పునరుద్ధరణను కూడా సూచిస్తాడని వారు విశ్వసించేవారు. అందుకే ఇక్కడ దేవుడు వారు ఏ ముఖంగల దేవుడినైతే పూజిస్తున్నారో ఆ ఈగల ద్వారా వారిని బాధిస్తున్నాడు.

నిర్గమకాండము 8:22,23
మరియు భూలోకములో నేనే యెహోవాను అని నీవు తెలిసికొనునట్లు, ఆ దినమున నేను నా ప్రజలు నివసించుచున్న గోషెనుదేశమును వినాయించెదను, అక్కడ ఈగల‌ గుంపులుండవు. నా ప్రజలను నీ ప్రజలనుండి ప్రత్యేకపరచెదను, రేపు ఈ సూచక క్రియ జరుగునని యెహోవా సెలవిచ్చినట్టు నీవు చెప్పవలెననెను.

ఈ వచనాలలో దేవుడు, ఆయన మాత్రమే నిజమైన దేవుడు, ఏకైన దేవుడు అనేందుకు సూచనగా ఈగలగుంపుల తెగులు నుండి ఇశ్రాయేలీయులు నివసిస్తున్న గోషెను ప్రాంతాన్ని మినహాయిస్తున్నట్టు ఫరోకు ప్రకటించడం మనం చూస్తాం. దీనిప్రకారం ఇంతవరకూ సంభవించిన మూడు తెగుళ్ళ ద్వారా ఇశ్రాయేలీయులు నివసిస్తున్న గోషెను ప్రాంతం కూడా ఎంతోకొంత ఆ ప్రభావానికి లోనైంది. కేవలం ఈ తెగులు విషయంలో మాత్రమే గోషెను ప్రాంతం మినహాయించబడుతుంది. ఇశ్రాయేలీయులు కూడా నీతిమంతులేమీ కాదు కాబట్టి, వారిలో కూడా కొందరు ఐగుప్తీయులను అనుసరిస్తున్న విగ్రహారాధికులు ఉన్నారు కాబట్టి (అమోసు 5:25,26) ఆ మూడు తెగుళ్ళ ద్వారా వారిని కూడా క్రమశిక్షణ చెయ్యడానికే ఆయన అలా చేసాడు. దానివల్ల వారు కూడా దేవుని తీర్పుల యొక్క భయంకరత్వాన్ని గుర్తిస్తారు.

నిర్గమకాండము 8:24
యెహోవా ఆలాగు చేసెను. బాధకరమైన ఈగలగుంపులు ఫరో యింటిలోకిని అతని సేవకుల యిండ్లలోకిని వచ్చి ఐగుప్తు దేశమంతట వ్యాపించెను. ఆ దేశము ఈగల గుంపులవలన చెడిపోయెను‌.

ఈ వచనంలో దేవుడు ముందుగా హెచ్చరించిన ప్రకారంగానే ఐగుప్తుపైకి ఈగల గుంపులు పంపి ఆ దేశాన్ని పాడుచెయ్యడం మనం చూస్తాం. అయితే ఇక్కడ అహరోను తన‌ చేతిని చాచికానీ, కర్రతో కొట్టి కానీ ఈ‌ తెగులును రప్పించినట్టు మనం‌ చూడము. కానీ‌ ఈ తెగుళ్ళ విషయంలో మొదటినుండి జరుగుతూ వచ్చిన ప్రక్రియనే మనం ఇక్కడ కూడా పరిగణలోకి తీసుకోవాలి, ఎందుకంటే లేఖనంలో కొన్నిసార్లు‌ అప్పటికే వివరించబడిన ప్రక్రియను ప్రతీసారీ విడమరచి చెప్పవలసిన అవసరం లేదు.

నిర్గమకాండము 8:25
అప్పుడు ఫరో మోషే అహరోనులను పిలిపించిమీరు వెళ్లి ఈ దేశములో మీ దేవునికి బలి అర్పించుడని వారితో చెప్పగా-

ఈ వచనంలో ఈగల గుంపులవల్ల విసిగిపోయిన ఫరో, మోషే అహరోనులను పిలిపించి ఈ దేశంలోనే మీ దేవునికి బలి అర్పించుకోమని అవకాశం ఇవ్వడం మనం చూస్తాం. దేవుని తీర్పులు ఐగుప్తుపై అమలౌతున్నకొద్దీ ఫరో ఇలా ఒకో మెట్టూ దిగుతున్నట్టు మనకు కనిపిస్తుంటుంది. చివరికి అతను దేవుడు సెలవిచ్చినట్టుగానే ఇశ్రాయేలీయులను ఐగుప్తునుండి పంపిచేసాడు. దేవుని తీర్పుల ప్రభావం ఇలానే కఠినాత్ములను కూడా ఆయన ఆదేశం ముందు కృంగిపోయేలా చేస్తుంది.

నిర్గమకాండము 8:26
మోషే అట్లు చేయతగదు; మా దేవుడైన యెహోవాకు మేము అర్పించవలసిన బలి ఐగుప్తీయులకు హేయము. ఇదిగో మేము ఐగుప్తీయులకు హేయమైన బలిని వారి కన్నుల యెదుట అర్పించిన యెడల వారు మమ్ము రాళ్లతో కొట్టి చంపుదురు గదా.

ఈ వచనంలో‌ మోషే ఫరో మాట వినకుండా అభ్యంతరం చెప్పడం‌ మనం చూస్తాం. ఐగుప్తీయులు చాలా జంతువులను తమ దేవతల ప్రతిరూపాలుగా పూజించేవారు కాబట్టి, వారి కళ్ళముందు వాటిని‌ చంపి బలిగా అర్పించినప్పుడు వారి మనోభావాలు దెబ్బతిని (హేయంగా భావించి) ఇశ్రాయేలీయులపై దాడిచేసే అవకాశం‌ తప్పకుండా ఉంది. ప్రజలంతా తమ‌ మనోభావాలు దెబ్బతిని ఏకమైనప్పుడు వారిని‌ ఫరో కూడా ఆపలేడు కదా! అందుకే మోషే ఇక్కడ ఫరోకు ఈవిధంగా సమాధానం చెబుతున్నాడు. ఇక్కడ అతను‌ చెబుతున్న అబద్ధమేమీ లేదు. అలా అని ఫరోకు తన మనసులో ఉన్న మొత్తం విడమరచి చెప్పవలసిన అవసరం కూడా అతనికి లేదు.

ఇక్కడ మనం గుర్తించవలసిన ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే, దేవుడు తన పిల్లలకు నియమించే కట్టడలు ఈవిధంగానే అన్యులకు హేయంగా అనిపిస్తుంటాయి. ఇశ్రాయేలీయులు అర్పించబోతున్న బలి వారిపాప పరిహారార్థమై క్రీస్తు బలియాగానికి ఛాయగా ఉంది. ఆ విషయం ఐగుప్తీయులు గ్రహించలేరు కాబట్టి, దానిని హేయంగా భావిస్తున్నారు. ఈరోజు క్రీస్తు బలియాగం యొక్క ప్రాముఖ్యత తెలియని వారు కూడా దానిని అదేవిధంగా ఎగతాళిగా, అవమానకరంగా దూషిస్తున్నారు.

1కోరింథీయులకు 1: 18 సిలువను గూర్చిన వార్త, నశించుచున్న వారికి వెఱ్ఱి తనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి.

నిర్గమకాండము 8:27
మేము అరణ్యములోనికి మూడు దినముల ప్రయాణమంత దూరముపోయి మా దేవుడైన యెహోవా మాకు సెలవిచ్చినట్లు ఆయనకు బలి నర్పించుదుమనెను.

ఈ వచనంలో మోషే, దేవునికి బలి అర్పించడానికి ఐగుప్తునుండి ఎన్నిరోజుల దూరం వెళ్ళబోతున్నారో ఫరోకు తెలియచెయ్యడం మనం చూస్తాం. దేవునిమాట చొప్పున ఇదే సంగతిని మోషే గతంలో కూడా అతనికి తెలియచేసాడు (నిర్గమకాండము 3:18, 5:3). అయితే ఇక్కడ మోషే ఫరోకు అబద్ధమేమీ చెప్పడం లేదు, దేవునిమాట చొప్పున నిజంగానే ఇశ్రాయేలీయులు సీనాయి పర్వతం దగ్గరకు చేరి ఆయనను సేవించారు. అయితే మోషే మేము మూడుదినాల ప్రయాణంత దూరం వెళ్ళి మా దేవునికి బలి అర్పిస్తాము అనే అంటున్నాడు తప్ప ఆ బలి ముగిసాక తిరిగివస్తామని మాత్రం ఎక్కడా చెప్పలేదు. ఇక్కడ మోషే ఫరోకు ఎంతవరకూ చెప్పాలో అంతవరకే చెబుతున్నాడు. ఫరోకు కూడా మోషే చెప్పినమాటలు ఇశ్రాయేలీయులు ఇంక వెనక్కు తిరిగిరారు అనే అర్థమైంది. అందుకే వారిని ఏదోలా నిలువరించడానికి ప్రయత్నించాడు. చివరి తెగులు సంభవించినప్పుడు వారిని తొందరపెట్టి మరీ ఐగుప్తునుండి పంపివేసాడు.

నిర్గమకాండము 8:28
అందుకు ఫరో మీరు అరణ్యములో మీ దేవుడైన యెహోవాకు బలి నర్పించుటకు మిమ్మును పోనిచ్చెదను గాని దూరము పోవద్దు; మరియు నాకొరకు వేడుకొనుడనెను.

ఈ వచనంలో మోషే మాటలకు ఫరో ప్రత్యుత్తరం మనం చూస్తాం. నేను పైన చెప్పినట్టుగా "మోషే మేము అరణ్యంలోకి మూడు దినాలంత దూరం వెళ్ళి దేవునికి బలి అర్పిస్తామని చెప్పిన మాటలు ఫరోకు వారిక తిరిగిరారు అని అర్థమైంది కాబట్టే" ఇక్కడ దూరం పోవద్దు అని నిలువరించే ప్రయత్నం చేస్తున్నాడు. గమనించండి, ఇక్కడ మోషే సరే నీమాట చొప్పున దూరమేమీ పోమని ప్రమాణం చెయ్యడం లేదు.

నిర్గమకాండము 8:29
అందుకు మోషేనేను నీ యొద్దనుండి వెళ్లి రేపు ఈ యీగల గుంపులు ఫరో యొద్దనుండియు అతని సేవకుల యొద్దనుండియు అతని జనుల యొద్ద నుండియు తొలగి పోవునట్లు యెహోవాను వేడుకొందును గాని, యెహోవాకు బలి అర్పించుటకు ఫరో జనులను పోనియ్యక ఇకను వంచన చేయకూడదని చెప్పి-

ఈ వచనంలో మోషే ఫరో అభ్యర్థనను స్వీకరిస్తూ ఐగుప్తీయులను ఇబ్బంది పెడుతున్న ఈగల గుంపుల తొలగిపోయేలా దేవుణ్ణి వేడుకోవడానికి సిద్ధపడడం మనం చూస్తాం. ఇక్కడ అతను "యెహోవాకు బలి అర్పించుటకు ఫరో జనులను పోనియ్యక ఇకను వంచన చేయకూడదని" హెచ్చరిక చేస్తున్నాడు. వాస్తవానికి ఈసారి కూడా ఫరో వంచన చేస్తాడని‌ మోషేకు తెలుసు, ఆ విషయం దేవుడు ముందే చెప్పాడు. అయినప్పటికీ ఇక్కడ అలా ఎందుకు అంటున్నాడంటే, అవతలి వ్యక్తి మార్పు చెందడని తెలిసినప్పటికీ అతడిని ఇలా హెచ్చరించడం సేవకుడిగా తన బాధ్యత. మనం కూడా అవకాశం ఉన్నపుడల్లా అందర్నీ హెచ్చరించేవారిగా ఉండాలి.

యెహేజ్కేలు 2: 5,8 వారు గనుక వారు వినినను వినకపోయినను తమ మధ్య ప్రవక్తయున్నాడని వారు తెలిసికొనునట్లుప్రభువగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడని నీవు వారికి ప్రకటింపవలెను. వారు తిరుగు బాటు చేయువారు గనుక వారు వినినను వినకపోయినను నేను సెలవిచ్చిన మాటను నీవు వారికి తెలియజేయుము.

నిర్గమకాండము 8:30-32
ఫరో యొద్దనుండి బయలువెళ్లి యెహోవాను వేడుకొనెను. యెహోవా మోషే మాట చొప్పున చేయగా ఈగల గుంపులు ఫరో యొద్ద నుండియు అతని సేవకుల యొద్ద నుండియు అతని ప్రజల యొద్దనుండియు తొలగిపోయెను; ఒక్కటియైనను నిలువలేదు. అయితే ఫరో ఆ సమయమున కూడ తన హృదయమును కఠినపరచుకొని జనులను పోనియ్యడాయెను.

ఈ వచనాలలో ఫరో మాట చొప్పున మోషే దేవుణ్ణి వేడుకుని‌ ఈగలగుంపులు తొలగిపోయేలా చెయ్యడం, అయినప్పటికీ ఫరో తన హృదయాన్ని‌ కఠినపరచుకోవడం మనం చూస్తాం. దేవుని సార్వభౌమత్వాన్ని తృణీకరించే కొంతమంది, దేవుడు ముందే ఎటువంటి ప్రణాళికా చేసుకోకుండా మానవుల క్రియలను బట్టి నిర్ణయాలు తీసుకుంటాడని, వారి మార్పుకు అవకాశాలు ఇచ్చి ఎప్పుడెప్పుడు మారతారా అని ఎదురుచూస్తుంటాడని బోధిస్తుంటారు. కానీ ఇక్కడ ఫరో విషయంలో జరుగుతున్న దానిని బట్టి సమస్తమూ దేవుని నియంత్రణ క్రిందే ఉన్నట్టు మనకు స్పష్టంగా అర్థమౌతుంది. ఫరోకు శిక్షవిధించాలని, ఐగుప్తీయుల తొలిచూలు పిల్లల వధవరకూ వారిపై తెగుళ్ళు రప్పించాలని దేవుడు నిర్ణయించాడు. అప్పటివరకూ ఫరో హృదయం కఠినపరచబడుతూనే ఉంటుంది.

 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.