పాత నిబంధన

రచయిత: కె విద్యా సాగర్

విషయసూచిక:- 11:1, 11:2, 11:3, 11:4, 11:5,6, 11:7,11:8, 11:9,10 .

 నిర్గమకాండము 11:1 మరియు యెహోవా మోషేతో ఇట్లనెను ఫరో మీదికిని ఐగుప్తుమీదికిని ఇంకొక తెగులును రప్పించెదను. అటు తరువాత అతడు ఇక్కడనుండి మిమ్మును పోనిచ్చును. అతడు మిమ్మును పోనిచ్చునప్పుడు ఇక్కడనుండి మిమ్మును బొత్తిగా వెళ్లగొట్టును.

ఈ వచనంలో దేవుడు మోషేకు ఐగుప్తుపైకి రాబోయే చివరి తెగులు గురించి ప్రకటించడం మనం చూస్తాం. ఆ తెగులు తర్వాత "నేను మిమ్మును పోనిచ్చెదనా" అని మోషేను గర్వంగా ప్రశ్నించిన ఫరో "పురుషులు మాత్రమే వెళ్ళుడి" (నిర్గమకాండము 10:10,11) "పశువులను విడిచిపెట్టి ప్రజలు మాత్రమే వెళ్ళుడి" (నిర్గమకాండము 10:24) అంటూ నియంత్రణలు విధించిన ఫరో ఇక ఎలాంటి నిర్బంధమూ లేకుండా ఇశ్రాయేలీయుల ప్రజలందరినీ వారి పశువులన్నింటినీ ఐగుప్తు నుండి పంపివేస్తాడు. అందుకే ఇక్కడ దేవుడు "అతడు మిమ్మును పోనిచ్చునప్పుడు బొత్తిగా వెళ్ళగొట్టును" అనే పదం ఉపయోగించాడు.

నిర్గమకాండము 11:2 కాబట్టి తన చెలికానియొద్ద ప్రతి పురుషుడును తన చెలి కత్తెయొద్ద ప్రతి స్త్రీయును వెండి నగలను బంగారు నగలను అడిగి తీసికొనుడని ప్రజలతో చెప్పుము.

ఈ వచనంలో దేవుడు ఇశ్రాయేలీయులను ఫరో ఐగుప్తు నుండి పంపివేసేటప్పుడు వారు ఆ జనుల దగ్గర నుండి బంగారు వెండి‌ నగలను తీసుకోవాలని ఆజ్ఞాపించడం మనం చూస్తాం. మోషేను ఫరో యొద్దకు మొదటిసారి పంపేటప్పుడు కూడా ఆయన ఈ మాటలు తెలియచేసాడు (నిర్గమకాండము 3:21,22 వ్యాఖ్యానం చూడండి). ఇలా ఎందుకు చెయ్యమంటున్నాడంటే‌ ఇంతవరకూ ఇశ్రాయేలీయులు ఐగుప్తీయులకు చేసిన కఠినసేవకు వారినుండి పొందుకున్న జీతం చాలా తక్కువ. ఆ బానిసత్వానికి ఇదే ఆఖరిరోజు కాబట్టి ఇశ్రాయేలీయుల కష్టానికి రావలసిన జీతాన్ని ఆయన వసూలు చేయిస్తున్నాడు. ఒక్కమాటలో చెప్పాలంటే ఇశ్రాయేలీయులకూ ఐగుప్తీయులకూ మధ్య ఉన్న లెక్కలన్నింటినీ ఇప్పుడు ఆయన సరి చేస్తున్నాడు. ఈలోకంలో చాలామంది తమ చేతుల కష్టం విషయంలో అన్యాయానికి గురౌతుంటారు. కానీ దేవుడు అందరికీ పైగా ఉండి, తగిన సమయంలో వారికి న్యాయం చేస్తాడు. దానికి మంచి నిదర్శనమే ఈ ఇశ్రాయేలీయుల సంఘటన.

ప్రసంగి 5: 8 ఒక రాజ్యమందు బీదలను బాధించుటయు, ధర్మమును న్యాయమును బలాత్కారముచేత మీరుటయు నీకు కనబడినయెడల దానికి ఆశ్చర్యపడకుము; అధికారము నొందినవారిమీద మరి ఎక్కువ అధికారము నొందినవారున్నారు; "మరియు మరి ఎక్కువైన అధికారము నొందిన వాడు వారికి పైగా నున్నాడు".

నిర్గమకాండము 11:3 యెహోవా ప్రజలయెడల ఐగుప్తీయులకు కటాక్షము కలుగజేసెను; అదిగాక ఐగుప్తుదేశములో మోషే అను మనుష్యుడు ఫరో సేవకుల దృష్టికిని ప్రజల దృష్టికిని మిక్కిలి గొప్పవాడాయెను.

దీనికి పై వచనంలో ఇశ్రాయేలీయులు ఐగుప్తీయులను వెండి, బంగారు నగలను అడిగి తీసుకోవాలని ఆజ్ఞాపించినట్టు రాయబడితే ఈ వచనంలో ఆ ఐగుప్తీయులు ఇశ్రాయేలీయులు అడిగినవాటిని ఇచ్చేలా యెహోవా వారికి కటాక్షం కలుగచేసినట్టు మనం చూస్తాం. చివరి తెగులు సంభవించిన తర్వాత జరిగినదానిని మోషే ఇక్కడ నమోదు చేస్తున్నాడు‌ (నిర్గమకాండము 12:36). ఇక్కడ మన దేవుడు మానవహృదయాలను తన చిత్తానుసారంగా నియంత్రించగలవాడని స్పష్టంగా అర్థమౌతుంది. నేటి సంఘాలలో చాలామంది ఈ విషయాన్ని తిరస్కరించడం చాలా విచారకరం. ఆయన తన చిత్తాన్ని నెరవేర్చుకోవడానికి ఎవరి హృదయాన్నైనా నియంత్రించగలడు, తనకు అనుకూలమైన మనస్సును పుట్టించగలడు. ఉదాహరణకు (ఎజ్రా 1:1,5, 6:22సామెతలు 21: 1). ఈరోజు విశ్వాసులమైన మనందరమూ ఆయనకు అనుకూలంగా నడుచుకోవడానికి, ఆయన సువార్తను అంగీకరించడానికి కూడా మన స్వచిత్తం కాదు, ఆయన మనలో పుట్టించిన నూతనస్వభావమే (మనస్సు) కారణం (యెహెజ్కేలు 36:26,27, యెహేజ్కేలు 11: 19 , తీతుకు 3: 5). లేదంటే మనం కూడా ఈ లోకస్తుల్లానే దేవునిదృష్టికి భయంకరంగా ప్రవర్తించేవారం (ఎఫెసీ 2: 3). ఎందుకంటే మన స్వచిత్తం, మన పతన స్వభావం మనల్ని ఆ దిశగానే ప్రేరేపిస్తుంది (రోమా 8: 7). కాబట్టి సువార్తను అంగీకరించి, ఆ సువార్త ప్రకారం జీవించే ఆత్మస్వభావాన్ని (నూతనమనస్సును) మనకు మనకిచ్చినందుకు ఆయనను ఎంతగానో స్తుతించేవారంగా ఉండాలి.
 
అదేవిధంగా ఇక్కడ "ఐగుప్తుదేశములో మోషే అను మనుష్యుడు ఫరో సేవకుల దృష్టికిని ప్రజల దృష్టికిని మిక్కిలి గొప్పవాడైనట్టు" మనం చూస్తాం. ఇదంతా పదవ తెగులు సంభవించిన తర్వాత జరుగుతున్న చరిత్ర. ఇక మోషే ఇంతకాలం ఫరో చేత, అతని సేవకుల చేత ఎన్నో‌ అవమానాలను, బెదిరింపులను కూడా ఎదుర్కొన్నాడు. కానీ ఇప్పుడు అతను వారందరి దృష్టికీ గొప్పవాడిగా ఎంచబడుతున్నాడు. కాబట్టి దేవుని పిల్లలు దేవుని నామాన్ని బట్టి లోకంచేత అవమానాలు, బెదిరింపులు ఎదుర్కొన్నప్పటికీ ఆయన తగిన సమయంలో వారిని హెచ్చిస్తాడు. అందుకే "మీ యవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు" (యెషయా 61: 7), "నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీమీద అబద్ధముగా చెడ్డమాటలెల్ల పలుకునప్పుడు మీరు ధన్యులు. సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును" (మత్తయి 5: 11,12) అని రాయబడింది.

నిర్గమకాండము 11:4 మోషే ఫరోతో ఇట్లనెను యెహోవా సెలవిచ్చినదేమనగా మధ్యరాత్రి నేను ఐగుప్తుదేశములోనికి బయలు వెళ్లెదను.

ఈ వచనంలో మోషే ఫరోతో ఐగుప్తుపైకి రాబోయే పదవ తెగులు గురించి పరిచయం చేస్తూ "యెహోవా మధ్యరాత్రి ఐగుప్తు దేశంలోకి బయలువెళ్తాడని చెప్పడం మనం చూస్తాం". ఇది ఫరోకు ఇప్పటివరకూ చేసిన హెచ్చరికలకంటే అత్యంత భయంకరమైన హెచ్చరిక. ఎందుకంటే ఇప్పటివరకూ ఐగుప్తుపైకి వచ్చిన తెగుళ్ళు మోషే అహరోనులు తమ చేతిని చాచగానో కర్రతో నేలను కొట్టగానో లేక దేవుని మాటప్రకారంగానో వచ్చాయి. ఆ తెగుళ్ళే చాలా తీవ్రమైన నష్టాన్ని కలుగచేసాయి. అలాంటిది ఈసారి స్వయంగా దేవుడే ఐగుప్తులో సంచరించబోతున్నాడంటే దాని తీవ్రత మరెంతో అధికంగా ఉండబోతుంది. అందుకే మోషే ఆ మాటలను ప్రత్యేకంగా చెబుతున్నాడు.

హెబ్రీయులకు 10: 31 జీవముగల దేవుని చేతిలో పడుట భయంకరము.

నిర్గమకాండము 11:5,6 అప్పుడు సింహాసనము మీద కూర్చున్న ఫరో తొలిపిల్ల మొదలుకొని తిరగలి విసురు దాసి తొలిపిల్లవరకు ఐగుప్తుదేశమందలి తొలిపిల్లలందరును చచ్చెదరు; జంతువులలోను తొలిపిల్లలన్నియు చచ్చును. అప్పుడు ఐగుప్తు దేశమందంతట మహా ఘోష పుట్టును. అట్టి ఘోష అంతకుముందు పుట్టలేదు, అట్టిది ఇకమీదట పుట్టదు.

ఈ వచనాలలో మోషే యెహోవా దేవుడు ఐగుప్తులో సంచరించి ఏం చెయ్యబోతున్నాడో ఫరోను హెచ్చరించడం మనం చూస్తాం. ఇలాంటి పరిస్థితి ఐగుప్తులో ఎప్పుడూ సంభవించలేదు కాబట్టి "అట్టి ఘోష అంతకుముందు పుట్టలేదు, అట్టిది ఇకమీదట పుట్టదు" అని ప్రత్యేకంగా చెప్పబడింది. దీనికి కారణమేంటంటే గతంలో ఫరో ఇశ్రాయేలీయుల మగపిల్లలను మంత్రసానుల ద్వారా చంపించడానికి ప్రయత్నించి, అది విఫలమయ్యేసరికి వారిని నీటిలో‌ పడవేసి చంపమన్నాడు. దానికి ప్రతీకారంగానే ఇక్కడ దేవుడు ఐగుప్తీయుల తొలిచూలు పిల్లలను, వారి పశువులతో సహా సంహరించబోతున్నాడు. దీనికారణంగా పసిపిల్లలే కాదు, ప్రతీ కుటుంబంలోనూ ప్రధమసంతానమైన ప్రతీవాడూ చంపబడతాడు. అయితే ఇక్కడ ఫరో క్రూరత్వాన్ని బట్టి ఇశ్రాయేలీయుల పసిపిల్లలు చంపబడితే దేవుడు మొత్తం ఐగుప్తీయులపై పగతీర్చుకోవడమేంటనే ప్రశ్న రావొచ్చు. ఒకవేళ ఫరో కనుక వేరే కారణాలతో ఐగుప్తీయుల పసిపిల్లలనే చంపమంటే వారంతా ఇశ్రాయేలీయుల విషయంలో మౌనం వహించినట్టు మౌనం వహించేవారా? తప్పకుండా ఫరోపై తిరుగుబాటు చేసేవారు కదా!

మరి ఇశ్రాయేలీయుల విషయంలో మాత్రం ఎందుకు అలా చెయ్యలేకపోయారు? కనీసం మాతృత్వపు ప్రేమ తెలిసిన స్త్రీలు కూడా ఆ విషయంలో స్పందించలేదు. ఎందుకంటే వారందరూ ఇశ్రాయేలీయుల పట్ల అసహ్యభావంతో ఉన్నారు, వారు మా జాతి కాదు మాకెందుకులే అనుకున్నారు. అందుకే వారి పసిపిల్లలు చంపబడుతుంటే మౌనం వహించారు/సంతోషించారు. చివరికి పిల్లలను కోల్పోయి వేదనలో ఉన్న తల్లితండ్రుల చేత కూడా ఎలాంటి సానుభూతీ లేకుండా కఠినసేవ చేయించుకున్నారు. అందుకే ఇప్పుడు వారి వంతు వచ్చింది. మనిషిపై మరో‌ మనిషికి నైతికబాధ్యత ఉంటుంది, ఆ బాధ్యతను తప్పుతూ మరో మనిషిపై అసహ్యం పెంచుకుని, లేదా బేధం చూపించి, వారు బాధపడుతున్నప్పుడు స్పందించకుండా మౌనం వహించినా లేక వారి కష్టాన్ని చూసి సంతోషించినా దేవుడు దానిని తీవ్రమైన నేరంగానే పరిగణిస్తాడు. అదే పర్యవసానం ఎదుర్కొనేలా చేస్తాడు.

ఓబద్యా 1:15 యెహోవా దినము అన్యజనులందరి మీదికి వచ్చుచున్నది. అప్పుడు నీవు చేసినట్టే నీకును చేయబడును, నీవు చేసినదే నీ నెత్తిమీదికి వచ్చును.

అందుకే "నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమించుము" అని ఆజ్ఞాపించబడింది. ఈ ఆజ్ఞలో నీకు కష్టం, నష్టం కలిగితే ఎలా స్పందిస్తావో ఇతరులకు అలాంటి పరిస్థితి సంభవించినా అంతే తీవ్రంగా స్పందించాలనే నైతికబాధ్యత దాగియుంది.

అదేవిధంగా ఈ సంఘటనను బట్టి, దేవుడు; పెద్దవారు చేసిన పాపాలను బట్టి పసిపిల్లలను చంపెయ్యడం ఎంతవరకూ సమంజసం అనే ప్రశ్న కూడా రావొచ్చు. ఈ ప్రశ్నకు నేను ఇప్పటికే దేవుడు సొదొమ పట్టణాలను నాశనం చేసిన సందర్భంలో సమాధానం ఇచ్చాను (ఆదికాండము 19వ అధ్యాయపు వ్యాఖ్యానం చూడండి). ఇక దేవుడు ఐగుప్తీయుల దేవతలకు తీర్పుతీర్చే క్రమంలో ఈ తొలిచూలు పిల్లల వధ "టా" Ptah అనే దేవునిపై కుమ్మరించబడిన తీర్పుగా మనం అర్థం చేసుకోవాలి. ఐగుప్తీయులు ఈ దేవుణ్ణి తమ‌ జీవదేవునిగా పూజించేవారు. ఇక్కడ మన దేవుడు ఐగుప్తీయుల తొలిచూలు పిల్లలను వధించి జీవాన్ని అనుగ్రహించేవాడు, దానిని తీసివేసేవాడు ఆయన మాత్రమేయని రుజువుచేసుకున్నాడు.

1 సమూయేలు 2: 6 జనులను సజీవులనుగాను మృతులనుగాను చేయువాడు యెహోవాయే.

నిర్గమకాండము 11:7 యెహోవా ఐగుప్తీయులను ఇశ్రాయేలీయులను వేరుపరచు నని మీకు తెలియబడునట్లు, మనుష్యులమీదగాని జంతువులమీదగాని ఇశ్రాయేలీయులలో ఎవరిమీదనైనను ఒక కుక్కయు తన నాలుక ఆడించదు.

ఈ వచనంలో మోషే ఐగుప్తుపైకి రాబోతున్న తెగులునుంచి దేవుడు ఇశ్రాయేలీయులను వేరుచేస్తున్నట్టు ప్రకటించడం మనం చూస్తాం. ఇక్కడ "మనుష్యులమీదగాని జంతువులమీదగాని ఇశ్రాయేలీయులలో ఎవరిమీదనైనను ఒక కుక్కయు తన నాలుక ఆడించదు" అనేమాటలు ఐగుప్తీయుల ఇళ్ళల్లో శవాలు లేస్తుంటే వారి పశువులు కూడా చచ్చిపడుతుంటే "ఇశ్రాయేలీయులకూ వారి పశువులకూ మాత్రం ఒక కుక్క కూడా హాని చెయ్యదు" అనే భావంలో అలంకారంగా చెప్పబడ్డాయి.

నిర్గమకాండము 11:8 అప్పుడు నీ సేవకులైన వీరందరు నా యొద్దకు వచ్చి నాకు నమస్కారము చేసినీవును, నిన్ను ఆశ్రయించియున్న యీ ప్రజలంద రును బయలు వెళ్లుడని చెప్పుదురు. ఆ తరువాత నేను వెళ్లుదుననెను. మెషే అలాగు చెప్పి ఫరో యొద్దనుండి అత్యాగ్రహముతో వెళ్లిపోయెను.

ఈ వచనంలో మోషే ఐగుప్తీయుల తొలిచూలు పిల్లలవధ తర్వాత ఏం జరగబోతుందో ముందే ఫరోకు ప్రవచించడం మనం చూస్తాం. ఇంతవరకూ మోషేను చులకనగా చూసి, అతడిని కించపరిచినవారు ఆ సమయంలో‌ అతనికి నమస్కారం చేసి మరీ ఐగుప్తునుండి సాగనంపుతారు. దేవునిపై ఆధారపడి, ఆయనకోసం నిందలనూ శ్రమలనూ అనుభవించిన సేవకులకు ఆయన కలిగించే ఘనత ఈవిధంగానే ఉంటుంది. త్వరలో ఈ ఘనత మనకు కూడా కలగబోతుంది (ప్రకటన 3:8,9).

అదేవిధంగా ఇక్కడ‌ మోషే ఫరోకు హెచ్చరిక చెయ్యడం ముగిసిన తర్వాత "అక్కడినుండి అత్యాగ్రహముతో వెళ్ళిపోయినట్టు" మనం చూస్తాం. ఎందుకంటే ఫరో ఈ హెచ్చరికను కూడా ఖాతరు చెయ్యకుండా ఇంకా దేవునిపై, ఆయన ప్రజలపై అతిశయపడడం "భూమిపై ఉన్నవారందరిలోనూ మిక్కిలి సాత్వికుడైన మోషేకు అత్యాగ్రహం కలిగించింది". ఇలా నిజంగా దేవుణ్ణి ప్రేమించేవారు తమ విషయంలో సాత్వికం ప్రదర్శించగలరు కానీ దేవుని‌ కార్యాలకు అడ్డంకులు కలిగిస్తున్నవారి విషయంలో ఆగ్రహానికే గురౌతారు. ఒకవేళ వారికి అలాంటి ఆగ్రహమేమీ కలగకుంటే దేవునిపై వారికున్న ప్రేమలో ప్రధానమైన లోపముందని అర్థం చేసుకోవాలి. అయితే దైవవిరోధులపై ఆగ్రహం కలగడం వేరు, ఆ ఆగ్రహంతో ఆ దైవనియమాలను మీరుతూ ప్రవర్తించడం వేరు. ఉదాహరణకు; దాడులు చెయ్యడం వంటివి. ఇక్కడ మోషేకు ఆగ్రహం‌ కలిగింది, యూదులపై పౌలుకు కూడా అదే ఆగ్రహం కలిగింది. కానీ వారు "పగతీర్చువాడు దేవుడే" అనే మాటలను విడిచిపెట్టి ఎలాంటి తొందరపాటు చర్యలకూ పాల్పడలేదు.

నిర్గమకాండము 11:9,10 అప్పుడు యెహోవాఐగుప్తుదేశములో నా మహ త్కార్యములు విస్తారమగునట్లు ఫరో మీ మాట వినడని మోషేతో చెప్పెను. మోషే అహరోనులు ఫరో యెదుట ఈ మహత్కార్యములను చేసిరి. అయినను యెహోవా ఫరో హృదయమును కఠినపరపగా అతడు తన దేశములోనుండి ఇశ్రాయేలీయులను పోనియ్య డాయెను.

ఈ వచనాలలో మోషే మొదటినుండీ ఇంతవరకూ జరిగినదానిని మరలా జ్ఞాపకం చేస్తున్నాడు. ఎందుకంటే ఈ ఆఖరి తెగులుతో ఇశ్రాయేలీయులకు విడుదల లభించబోతుంది కాబట్టి, దేవుడు చెప్పినట్టుగానే ఇదంతా జరిగిందని అతను ఈ మాటలు మరలా ప్రస్తావించాడు. ఈ సంఘటన జరగాలనే దేవుడు ఫరో హృదయాన్ని కఠినపరచుకుంటూ వచ్చాడు. ఈ కఠినపరచడం గురించి ఇప్పటికే ఆ మాటలు రాయబడిన ప్రతీ సందర్భంలోనూ నేను వివరణ ఇచ్చాను.

 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.