"కాల్వినిజం" అని వెక్కిరింపుగా పిలవబడుతున్న "దేవుని సార్వభౌమత్వాన్ని" చాటిచెప్పే బోధ పై లేఖన అవగాహన లేని కొన్ని గుంపులవారు పదే పదే అపార్థపు ఆరోపణలు చెయ్యడం నేను గమనించాను. బైబిల్ బోధించే సిద్ధాంతాలపై కొన్ని గుంపులు ఇటువంటి అపార్థపు ఆరోపణలు చెయ్యడం సంఘానికి కొత్తేమీకాదు.
ఉదాహరణకు జన్మపాపం విషయంలో కూడా, కొన్ని అవాంతర శాఖలు , "పుట్టే పిల్లలు పాపంతో పుడుతుంటే దానిప్రకారం వారిని పుట్టిస్తున్న దేవుడే వారిపాపానికి కర్త ఔతాడని" ఆ సిద్ధాంతాన్ని వాక్యపరిధిలో అర్థం చేసుకోలేక దానిని బోధించేవారిపై నోరు పారేసుకుంటుంటారు.
ఇక విషయానికి వస్తే దేవుని సార్వభౌమత్వాన్ని విశ్వసించేవారు, ఈ సృష్టిలోని అన్నింటినీ దేవుడు తన నిర్ణయం (చిత్తం) చొప్పున జరిగిస్తున్నాడని బోధిస్తారు. ఆ బోధకు ఆధారాలుగా రాయబడిన వాక్యభాగాలలో కొన్నిటిని చూడండి.
ఎఫెసీయులకు 1:12 ఆయన తన చిత్తాను సారముగా చేసిన నిర్ణయము చొప్పున సమస్త కార్యములను జరిగించుచున్నాడు.
దానియేలు 4:35 ఆయన పరలోక సేనయెడలను భూనివాసులయెడలను తన చిత్తము చొప్పున జరిగించువాడు.
సామెతలు 19: 21 నరుని హృదయములో ఆలోచనలు అనేకములుగా పుట్టును యెహోవాయొక్క తీర్మానమే స్థిరము.
సామెతలు 21: 1 యెహోవా చేతిలో రాజు హృదయము నీటికాలువల వలెనున్నది. ఆయన తన చిత్తవృత్తిచొప్పున దాని త్రిప్పును.
సామెతలు 20: 24 ఒకని నడతలు యెహోవా వశము తనకు సంభవింపబోవునది యొకడెట్లు తెలిసికొన గలడు?
విలాపవాక్యములు 3:37,38 ప్రభువు సెలవులేనిది మాట యిచ్చి నెరవేర్చగలవాడెవడు? మహోన్నతుడైన దేవుని నోటనుండి కీడును మేలును బయలు వెళ్లునుగదా?
రోమీయులకు 11:36 ఆయన మూలమునను ఆయన ద్వారాను ఆయన నిమిత్తమును సమస్తము కలిగియున్నవి. యుగముల వరకు ఆయనకు మహిమ కలుగును గాక. ఆమేన్.
ఈ వచనాలన్నీ కూడా దేవుని సార్వభౌమత్వాన్ని చాటిచెప్పేవిగా ఉన్నాయి. అయితే ఈ విషయంలో కొందరు "ఈ బోధ మానవులు చేసే పాపాన్ని కూడా దేవుడే నిర్ణయించాడని ప్రకటిస్తుందని, దానిప్రకారం దేవుడే పాపానికి కర్త ఔతాడని, ఈవిధంగా కాల్వినిజం దేవుణ్ణి పాపానికి కర్తగా చూపిస్తుందని" విరుచుకుపడుతున్నారు. బైబిల్ గ్రంథం దేవుడు సార్వభౌముడని చెబుతూ, ఆయన పరిశుద్ధుడని కూడా చెబుతుంది కాబట్టి వాటిని అంతమట్టుకే తీసుకోకుండా, ఈ రెండు అంశాలనూ మానవ తర్కంతో సమతుల్యపరచాలని చూస్తే అటువంటి అపార్థాలే చోటుచేసుకుంటాయి.
ఎందుకంటే మానవ తర్కానికి అతీతమైన అంశాలు బైబిల్ లో మనకి కనిపిస్తాయి ఉదాహరణకు త్రిత్వాన్ని తీసుకోండి. బైబిల్ గ్రంథం దేవుడు ఒకడే అని చెబుతూ ముగ్గురు వ్యక్తులని మనకి పరిచయం చేస్తుంది. ఈ అంశాన్ని మానవ తర్కంతో మనం పూర్తిగా అర్థం చేసుకోలేము. అందుకే కొంతమంది త్రిత్వ సిద్ధాంతాన్ని తప్పుగా అర్థం చేసుకుని ఒకే దేవునిలో మూడు భాగాలున్నాయనీ, లేక ఒకే దేవుడు ముగ్గురిగా వేషాలు మార్చాడని, మరియు ముగ్గురు దేవుళ్ళు ఉన్నారని చెప్పే బోధలు తీసుకువచ్చారు.
ఒకవేళ కాల్వినిజ భావజాలాన్ని వ్యతిరేకరించేవారు చెబుతున్నట్టుగా మనిషి దేవుని నిర్ణయం లేకుండా తన స్వచిత్తంతోనే పాపాన్ని చేస్తున్నాడని భావించినప్పటికీ వారు కూడా దేవుణ్ణి పాపానికి కర్తగానే చూపిస్తున్నారు.
అదెలాగో చూడండి. ఇంతకూ మనిషికి ఫ్రీవిల్ ఇచ్చింది ఎవరు? దేవుడే కదా! ఆయనకు మానవుడు తనకివ్వబడిన ఫ్రీవిల్ తో పాపం చేస్తాడని (ఆజ్ఞను అతిక్రమిస్తాడని) ముందే తెలుసు కదా! అదంతా తెలిసినప్పటికీ కూడా మానవుడికి ఆయన ఫ్రీవిల్ ఇచ్చాడంటే పాపం చేసే అవకాశం అతనికి ఎవరు ఇచ్చినట్టు? దీనిప్రకారం ఈ సృష్టిలో పాపానికి కర్త ఫ్రీవిల్ ఇచ్చిన దేవుడే ఔతున్నాడు కదా!.
మానవ స్వేచ్ఛను గౌరవించే రాజ్యాంగం, చట్టం ఉన్న దేశంలో కూడా, ఒక వ్యక్తి నేరానికి పాల్పడతాడని పోలీసులకు ముందే తెలిస్తే అతడిని అదుపులోకి తీసుకుంటారు, దేవుడు ఎందుకలా చెయ్యలేదు. పైగా ఈ స్వేచ్ఛాసిద్ధాంతం ఎలా ఉంటుందంటే ఇందులో దేవుడు ఒక మనిషికి ఇచ్చిన స్వేచ్ఛను కొనసాగించడానికి మరొకరి స్వేచ్ఛను హరించివేస్తాడు. ఉదాహరణకు ఒక వ్యక్తి మరోవ్యక్తిని చంపడానికి అతనిపై దాడిచేయబోతున్నాడు; చంపేవాడికి స్వేచ్ఛ ఉంది కాబట్టి దేవుడు అతడిని అడ్డుకోడు, ఇక్కడ చంపబడే వ్యక్తికి కూడా స్వేచ్ఛ ఉంది; ఆ స్వేచ్ఛ చొప్పున అతను బ్రతకాలి అనుకుంటున్నాడు కానీ అది తనవల్ల కావడం లేదు. ఇది ఒకరి స్వేచ్ఛను కొనసాగించడానికి మరొకరి స్వేచ్ఛను హరించడం కాదా?
ఒకవేళ దేవుని నిర్ణయం లేకుండానే ఈ సృష్టిలో పాపం ప్రవేశించి రాజ్యమేలుతుందని ఎవరైనా భావిస్తే దేవుణ్ణి వారు పాపంకంటే శక్తిహీనుడని ప్రకటించడమే ఔతుంది ఎందుకంటే,
1) పాపం దేవుని సర్వశక్తిని అధిగమించి లోకంలో ప్రవేశించింది, ఆదాము హవ్వలనూ, మానవజాతంతటినీ ఆయనకి దూరం చేసింది. సృష్టిలో దేవుణ్ణి అధిగమించేది ఏదున్నా అదే సర్వశక్తిగలది ఔతుంది తప్ప దేవుడు కాదు.
2) తన చిత్తంలో లేకుండానే ఆదాము హవ్వల్లో పాపం ప్రవేశించినప్పటికీ, అప్పటినుండి మానవజాతంటిలోనూ వ్యాపిస్తున్నప్పటికీ దేవుడు దానిని ఆపలేకపోయాడు. దీనిప్రకారం ఆయన తన సృష్టిలో తన చిత్తంకానిది జరుగుతున్నప్పటికీ దానిని ఆపలేనంత అసమర్థుడు (తీర్పుదినాన లోకం నుండి పాపాన్ని తీసివేస్తాడనుకున్నప్పటికీ అప్పటివరకూ ఆ పాపం వల్ల జరుగుతున్న పర్యవసానం సంగతేంటి).
మేమైతే దేవుణ్ణి ఈవిధంగా పాపంకంటే శక్తిహీనుడని చెప్పే దయనీయ బోధను, ఆయనను అసమర్థునిగా చూపే దౌర్భాగ్యపు బోధను విశ్వసించము. మేము లేఖనాధారంగా దేవుడు సార్వభౌముడనీ, సర్వశక్తిమంతుడని, మనం ఊహించలేని ఆయన రహస్య చిత్తమేదో పాపాన్ని లోకంలో అనుమతించిందని నమ్మిబోధిస్తున్నాము. అనంతుడైన దేవునిలో ఉన్న ఆ చిత్తమేమిటో పరిమితి కలిగిన మనం చెప్పలేము, ఎందుకంటే
1) మనం పరిమితి కలిగినవారం
2) వాక్యం దానిని రహస్యంగా ఉంచి మనకి వివరించలేదు
ద్వితీయోపదేశకాండము 29:29 రహస్యములు మన దేవుడైన యెహోవాకు చెందును. అయితే మనము ఈ ధర్మ శాస్త్ర వాక్యములన్నిటి ననుసరించి నడుచుకొనునట్లు బయలుపరచబడినవి యెల్లప్పుడు మనవియు మన సంతతి వారివియునగునని చెప్పుదురు.
విచిత్రమేమిటంటే, ఫ్రీవిల్ సిద్ధాంతాన్ని నమ్మేవారు దేవుని భవిష్యత్తు జ్ఞానం గురించి ఎక్కువగా మాట్లాడుతుంటారు. ఆయన తన Foreknowledgeలో అన్నిటినీ చూశాడని చెబుతుంటారు, ఇంతకూ ఆయన సృష్టికి ముందే ఆదాము హవ్వల పతనాన్నీ, మానవజాతి పాపాన్నీ చూశాడా లేదా అంటే వారు చూశాడనే అంటారు. చూసి దానిని అనుమతించాడా, లేదా అంటే వారు అనుమతించాడనే అంటారు. మరి ఆయన ఉద్దేశపూర్వకంగానే దానిని అనుమతించాడా లేక ఏ ఉద్దేశమూ లేకుండా అనుమతించాడా? ఉద్దేశం లేకుండా దేవుడు ఏదీ చేయడు. ఇంతకూ ఆ ఉద్దేశం ఆయనలో అప్పటికప్పుడు పుడుతుందా లేక అనాది సంకల్పమా? ముస్లింల దేవుడిలా ఆయనకు ఎప్పటికప్పుడు మెరుగైన ఆలోచనలు పుడుతుంటాయా? మేమైతే అలా నమ్మము.
వాస్తవానికి భవిష్యత్తుజ్ఞానం అంటే వారు చెబుతున్నట్టుగా ముందుకు తొంగిచూసి జరగబోయే దేనినో తెలుసుకోవడం కాదు, అదే నిజమైతే ఆయనకు అంతకుముందు తెలియనివాటిని ముందుకు తొంగిచూసి 'తెలుసుకుంటున్నాడని' అర్థం. అప్పుడు ఆయన ముందునుంచీ సర్వజ్ఞాని ఎలా ఔతాడు? భవిష్యత్తును బట్టి తెలుసుకునేవాడూ, నేర్చుకునేవాడూ ఔతాడు. కాబట్టి ఆయన చేసిన నిర్ణయమే/సంకల్పమే ఆయన భవిష్యత్తు జ్ఞానం, ఆయన నిర్ణయం కానిదేదీ భవిష్యత్తు జ్ఞానంలో ఆయనకు కొత్తగా కనిపించదు. దేవుని గురించి ఈ మాట వాడినప్పుడు ఈవిధంగానే మనం అర్థం చేసుకోవాలి. ఇది నేనేదో లాజికల్ గా చెప్పేది మాత్రమే కాదు, వాక్యం ఆయన్ని సర్వజ్ఞాననీ, సమస్తాన్నీ నిర్ణయించినవాడనీ చెబుతుంది కాబట్టే దాని ఆధారంగా ఈవిధంగా చెబుతున్నాను.
అదేవిధంగా పేరున్న గ్రీకు డిక్షనరీస్ Lexicons,UBSలు కూడా అపో. 2:23, 1 పేతురు 1:1,2లలో వాడబడ్డ భవిష్యత్తు జ్ఞానం (προγνώσει)అనే పదానికి Predetermination అనే అర్థాన్ని కూడా ఇస్తున్నాయి, నూతన నిబంధన గ్రీకు Scholars అక్కడ ఈ అర్థమే సరైనదని వెల్లడించారు.
ఈవిధంగా అన్నీ ఆయన నిర్ణయం/అనుమతి ప్రకారమే జరుగుతాయి. అయినప్పటికీ వాక్యపరిధిలో ఆయన పాపానికి కర్త కాదు. బైబిల్ మనకి ఆయన పరిశుద్ధుడని పదేపదే జ్ఞాపకంచేస్తుంది. దానితో పాటుగా ఆయన సార్వభౌమునిగా అన్నిటినీ నిర్ణయించినవాడనీ, తన సృష్టిలో తన చిత్తప్రకారమే అన్నిటినీ (పాపంతో సహా) అనుమతించినవాడనీ చెబుతుంది. (ఏదేనులోకి సాతాను ఆయన అనుమతి లేకుండా ప్రవేశిస్తే, ఆయన సృష్టిలో ఆయన అనుమతిలేకుండా ప్రవేశించగలిగిన సాతానే ఆయనకంటే శక్తిగలవాడవుతాడు) కాబట్టి మనం మానవ తర్కంతో ఈ రెండింటినీ సమతుల్యపరచలేము.
ఒకవేళ సమతుల్యపరచాలని చూస్తే ఏమౌతుందో ఈ ఉదాహరణ చూడండి.
కీర్తనల గ్రంథము 5:4-6 నీవు దుష్టత్వమును చూచి ఆనందించు దేవుడవు కావు చెడుతనమునకు నీయొద్ద చోటులేదు. డాంబికులు నీ సన్నిధిని నిలువలేరు పాపము చేయువారందరు నీకసహ్యులు అబద్ధమాడువారిని నీవు నశింపజేయుదువు కపటము చూపి నరహత్య జరిగించువారు యెహోవాకు అసహ్యులు.
ఈ వచనాల్లో కీర్తనాకారుడు, ఆయన పరిశుద్ధ సన్నిధిలో పాపం చేసేవారు నిలువలేరనీ, అబద్ధాలు చెప్పేవారు, కపటంగా ప్రవర్తించేవారు ఆయనకు అసహ్యులని చెబుతున్నాడు.
ఇప్పుడు మరో సందర్భాన్ని చూడండి.
మొదటి రాజులు 22:19-23 మీకాయా యిట్లనెను - యెహోవా సెలవిచ్చిన మాట ఆలకించుము; యెహోవా సింహాసనాసీనుడై యుండగా పరలోకసైన్యమంతయు ఆయన కుడి పార్శ్వమునను ఎడమపార్శ్వమునను నిలిచి యుండుట నేను చూచితిని. అహాబు రామోత్గిలాదుమీదికి పోయి అక్కడ ఓడిపోవునట్లుగా ఎవడు అతనిని ప్రేరేపించునని యెహోవా సెలవియ్యగా, ఒకడు ఈ విధముగాను మరియొకడు ఆ విధముగాను యోచన చెప్పుచుండిరి. అంతలో ఒక ఆత్మ యెదుటికి వచ్చి యెహోవా సన్నిధిని నిలువబడి-నేను అతనిని ప్రేరేపించెదననగా యెహోవా-ఏ ప్రకారము నీవతని ప్రేరేపించుదువని అతని నడిగెను. అందుకతడు-నేను బయలుదేరి అతని ప్రవక్తల నోట అబద్ధమాడు ఆత్మగా ఉందునని చెప్పగా ఆయన-నీవు అతని ప్రేరేపించి జయము నొందుదువు; పోయి ఆ ప్రకారము చేయుమని అతనికి సెలవిచ్చెను. యెహోవా నిన్ను గూర్చి కీడు యోచించి నీ ప్రవక్తల నోట అబద్ధమాడు ఆత్మను ఉంచియున్నాడు.
ఈ సందర్భంలో దేవుని దగ్గరనుండే (ఆయన అనుమతితో) ఆహాబు ప్రవక్తల ద్వారా అబద్ధాన్ని పలికించి కపటంగా అతన్ని హత్యచేసే ఆత్మ వచ్చినట్టు రాయబడింది. మనం పైన చూసిన కీర్తనలులో అబద్ధం చెప్పేవారు, కపటంగా ప్రవర్తించేవారు ఆయనకు అసహ్యులన్న మాటలతో కలిపి ఈ సందర్భాన్ని మానవ తర్కంతో ఎలా సమతుల్యపరుస్తారు? ఎందుకంటే ఆయనకు అసహ్యమైన అబద్ధాలు చెప్పేవారినీ కపటంగా హత్యచేసేవారినీ (ఆత్మను) ఆయన అనుమతించి ఆహాబును నాశనం చేయబోతున్నాడు. అంటే ఆయన తనకు అసహ్యులైన వారిని కూడా తనచిత్తాన్ని నెరవేర్చుకోవడానికి అనుమతించి వాడుకుంటాడా? అలా అనుమతించినప్పుడు వారి అబద్ధం, కపటంలో ఆయన పాలిబాగస్తుడు ఎందుకు కాడు?
మేమైతే వాక్యం చెప్పేదాని పరిధిలో అన్నీ (సాతాను కూడా) ఆయన సర్వశక్తి, సార్వభౌమత్వం క్రిందనే పనిచేస్తాయని నమ్ముతాము, కాబట్టి మాకిక్కడ ఏ సమస్యాలేదు.
1) వాక్యం చెబుతున్నట్టుగా ఆయనకి అబద్ధాలు చెప్పేవారు, కపటం చూపేవారు ఆయనకి అసహ్యులు.
2) వారిని కూడా దేవుడు తన చిత్తాన్ని నెరవేర్చుకునేందుకు అనుమతించి వాడుకుంటాడు అయినప్పటికీ వారి అబద్ధం, కపటంతో ఆయనకు సంబంధం లేదు.
ఇంతకూ సాతాను యోబును శోధించేటప్పుడు దేవుని అనుమతితోనే ఆయనదగ్గరకు వెళ్ళాడా లేక, మనం అత్తారింటికి చెప్పకుండా వెళ్ళివచ్చేట్టు పరలోకం వెళ్ళి వస్తుంటాడా?
అదేవిధంగా, ప్రతీమానవుడి జనన మరణాలు దేవుని వశంలో ఉన్నాయని బైబిల్ బోధిస్తుంది. ఇది క్రైస్తవులేకాదు, ఆస్తికులందరూ ఒప్పుకునే సత్యం. కాబట్టి ఈప్రపంచంలో ఒకమనిషి చనిపోవాలి అంటే, దేవుడు ఆ వ్యక్తి అలానే చనిపోవాలని నిర్ణయించి ఉండాలి.
ప్రకటన గ్రంథం 1: 18 మరియు మరణముయొక్కయు పాతాళలోకము యొక్కయు తాళపుచెవులు నా స్వాధీనములో ఉన్నవి.
కీర్తనల గ్రంథము 90:3 నీవు మనుష్యులను మంటికి మార్చుచున్నావు నరులారా, తిరిగి రండని నీవు సెలవిచ్చుచున్నావు.
మొదటి సమూయేలు 2:6 జనులను సజీవులనుగాను మృతులనుగాను చేయువాడు యెహోవాయే పాతాళమునకు పంపుచు అందులో నుండి రప్పించు చుండువాడు ఆయనే.
లేఖనాలు చెప్పే ఈ సత్యాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రపంచంలో జరుగుతున్న మానవుల మరణాలను పరిశీలిద్దాం. ప్రతీరోజూ ఎంతోమంది హత్య చేయబడుతున్నారు (పసిపిల్లలతో సహా). మరెందరో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు, దీనిప్రకారం అందరి మరణాలనూ నిర్ణయించిన దేవుడు హంతకుడు ఔతాడా? అన్నిటినీ దేవుడే నిర్ణయిస్తే సృష్టిలో జరుగుతున్న పాపానికి కూడా ఆయనే కర్త ఔతాడని "దేవుని సార్వభౌమత్వానికి" భాష్యం చెప్పేవారి కొలమానం ప్రకారం దేవుడే హంతకుడు అవ్వాలి మరి. కానీ లేఖనాల ప్రకారం ఆ హత్యలు చేసిన మనుషులే హంతకులౌతూ, ఆత్మహత్యలకు పాల్పడినవారే దానికి బాధ్యులౌతూ, దేవుని ముందు దోషులుగా నిలబడుతున్నారు.
అయితే నేను ప్రారంభంలో చెప్పినట్టుగా దేవుని సార్వభౌమత్వం, మానవబాధ్యతను గురించిన ఈ బోధను మనకున్న పరిమిత జ్ఞానంతోనూ, తర్కంతోనూ "సంపూర్ణంగా" గ్రహించలేము. కానీ ఇది లేఖనాలు చెప్పే సత్యం కనుక విశ్వసించక తప్పదు (విశ్వసించనివాడు క్రైస్తవుడు కాలేడు).
అందుకే మేము ఈ విషయంలో వాక్యం ఎంతవరకూ చెబుతుందో అంతవరకే తీసుకుని సత్యాన్ని తెలుసుకుందామని పిలుపునిస్తుంటే, కొందరు ససేమిరా, జాన్ పైపర్ అలా అన్నాడు, జాన్ కాల్విన్ ఇలా అన్నాడని పిచ్చి ప్రేలాపనలు పేలుతూ, వారికున్న తర్కాన్ని ఉపయోగించి, మేము దేవుణ్ణి పాపానికి కర్తగా చూపిస్తున్నామంటూ నిందలు వేస్తున్నారు. వాస్తవానికి వారి ఫ్రీవిల్ తర్కాన్ని వారిపైనే పెట్టుకుని చూసుకుంటే దేవుణ్ణి పాపానికి కర్తగానూ, హంతకుడిగానూ చూపిస్తుంది వాళ్ళే....మేము కాదు.
దేవుని సార్వభౌమత్వం మరియు మానవ బాధ్యతలపై మరింత వివరణ కొరకు ఈ క్రింది లింకుల ద్వారా సూచించబడ్డ వ్యాసాలను చదవండి.
దేవుని సార్వభౌమత్వం ( ఆర్థర్ డబ్ల్యు పింక్ )
ఏర్పాటునందు దేవుని సార్వభౌమత్వం
దేవుని సార్వభౌమత్వం మరియు ప్రార్థన
Copyright Notice
"ఈ వ్యాసం/పుస్తకం, 'హితబోధ కమ్యూనికేషన్స్'వారి అనుమతి ద్వారా ప్రచురించబడింది ©2021 www.hithabodha.com"
ఇందులో ఉపయోగించిన బైబిలు వచనాలన్నీ బైబిల్ సొసైటీవారు ప్రచురించిన పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఉపయోగించబడినవి.