విమర్శలకు జవాబు

రచయిత: కె విద్యా సాగర్

బైబిల్ గ్రంథంలో రాయబడిన సంఘటనలను అసంబద్ధాలుగా నిరూపించడానికి ప్రయత్నించిన, ప్రయత్నిస్తున్న బైబిల్ విమర్శకులు కోకొల్లలు. కానీ ఇంతవరకూ వారిలో ఏ ఒక్కరూ కూడా ఏ ఒక్క బైబిల్ సంఘటనను కూడా అసంబద్ధంగా నిరూపించి విజయం సాధించలేకపోయారు. ఎందుకంటే పరిశుద్ధాత్మ ప్రేరేపితమైన బైబిల్ గ్రంథంలో రాయబడిన ప్రతీ సంఘటనా సందర్భమూ సత్యమైనవి (యోహాను 17:17, కీర్తనలు 119:160). అందులో చాలామట్టుకు ఇంతవరకూ వెల్లడించబడిన (పరిశీలించబడిన) చరిత్ర పరంగానూ Science పరంగానూ కూడా తిరుగులేకుండా రుజువైనవి‌. అందుకే చరిత్రలో బైబిల్ విమర్శకుల ఆ ప్రయత్నాలన్నీ కేవలం మభ్యపెట్టేవిగానే మిగిలిపోయాయి.

అయినప్పటికీ "భక్తిహీనులు కదలుచున్న సముద్రమువంటివారు అది నిమ్మళింపనేరదు దాని జలములు బురదను మైలను పైకి వేయును" (యెషయా 57:20), "యన్నే, యంబ్రే అనువారు మోషేను ఎదిరించినట్టు వీరును చెడిన మనస్సు కలిగి విశ్వాస విషయములో భ్రష్టులై సత్యమును ఎదిరింతురు" (2తిమోతికి 3:8) అని రాయబడినట్టుగా భక్తిహీనులైన బైబిల్ విమర్శకులు బైబిల్ సంఘటనలను అసంబద్దాలుగా చూపించాలనే ప్రయత్నం నేటికీ చేస్తూనే ఉన్నారు. అందులో ఒకానొకటే నోవహు జలప్రళయం సంఘటనను పురాతన Clay Tablets (మట్టి పలకలు) లోని కథలను దొంగిలించి రాసుకున్నారు అని‌‌ వాదించే ప్రయత్నం. అయితే ఆ ప్రయత్నం కూడా బైబిల్ చరిత్ర ముందు‌ ఎంత సులభంగా విఫలమౌతుందో కేవలం మభ్యపెట్టేదిగా మాత్రమే మిగిలిపోతుందో ఆధారాలతో రుజువు చెయ్యడానికే ఈ వ్యాసం రాస్తున్నాను.

మొదటిగా నోవహు జలప్రళయం ఎప్పుడు సంభవించింది అనేది పరిశీలిద్దాం. బైబిల్ చరిత్రలో ఏయే సంఘటనలు ఎప్పుడు జరిగాయనే ప్రశ్నకు సమాధానం ఇవ్వడానికి కొందరు బైబిల్ పండితులు కాలక్రమ లెక్కలకు ప్రయత్నించారు. అందులో క్రీ.శ. 17వ శతాబ్దానికి చెందిన James Ussher అత్యంత ప్రసిద్ధమైన పండితుడు. ఆయన బైబిల్‌ లోని వంశావళులు, కచ్చితంగా రాయబడిన కాలాలు, యూదా రాజుల పరిపాలన సంవత్సరాలు, మరియు చరిత్రలో స్పష్టంగా రుజువైన సంఘటనల ఆధారంగా ఒక సమగ్ర కాలక్రమాన్ని రూపొందించాడు.

ఆ కాలక్రమ లెక్కలో ముఖ్యమైనది యెరూషలేము పతనం. బబులోను రాజైన Nebuchadnezzar II 586 BC లో యెరూషలేమును నాశనం చేసాడని చరిత్ర స్పష్టంగా చెబుతుంది (2 రాజులు 25:8-10). అందుకే James Ussher మొదటిగా ఆ తేదీని ప్రామాణికంగా తీసుకుని అక్కడి నుండి బైబిల్‌ లోని యూదా రాజుల పరిపాలన సంవత్సరాలను వెనక్కు లెక్కించాడు. ఆ లెక్క ప్రకారం ఇశ్రాయేలు రాజైన సొలొమోను కాలంలో యెరూషలేము దేవాలయ నిర్మాణం సుమారు 1012 BC లో ప్రారంభమైనట్టు వస్తుంది. ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి బయలుదేరి వచ్చిన 480 సంవత్సరాల తర్వాత ఆ ఆలయ నిర్మాణం ప్రారంభమైందని బైబిల్‌లో చెప్పబడింది (1 రాజులు 6:1). అందువల్ల ఈ 480 సంవత్సరాలను వెనక్కు లెక్కిస్తే నిర్గమకాండము (Exodus) జరిగిన కాలం సుమారు 1491 BC గా వస్తుంది. ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నివసించిన కాలం 430 సంవత్సరాలు (నిర్గమకాండము 12:40). అందువల్ల నిర్గమకాండము జరిగిన 1491 BC నుండి వెనక్కు లెక్కిస్తే యాకోబు కుటుంబం ఐగుప్తులో ప్రవేశించిన కాలం 1876 BC గా వస్తుంది (ఇక్కడ Ussher పూర్తి 430 సంవత్సరాలూ తీసుకోలేదు, ఒక ప్రశ్నకు జవాబు కోసం 385 సంవత్సరాలనే తీసుకున్నాడు). ఆ సమయంలో యాకోబు వయస్సు 130 సంవత్సరాలు (ఆదికాండము 47:9). అంటే యాకోబు జననం సుమారు 2006 BC లో జరిగింది. యాకోబును ఇస్సాకు 60 సంవత్సరాల వయస్సులో కన్నాడు (ఆదికాండము 25:26). అంటే ఇస్సాకు జననం 2066 BC లో జరిగింది. ఇస్సాకును అబ్రాహాము 100 సంవత్సరాల వయస్సులో కన్నాడు (ఆదికాండము 21:5). ఈ లెక్క ప్రకారం అబ్రాహాము జననం 2166 BC లో జరిగింది. 2066 + 100 = 2166 BC.

అయితే ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నివసించింది James Ussher లెక్కించినట్టు 385 సంవత్సరాలు కాదు, 430 సంవత్సరాలు కూడా కాదు, కేవలం 215 సంవత్సరాలే. నిర్గమకాండము 12:40 వాక్యభాగం అబ్రాహాము కనానులో ప్రవేశించినప్పటి నుండి లెక్కించి 430 అని చెబుతుంది (గలతీ 3:17) దానికి సంబంధించిన ఆధారం ఈ వ్యాసం చివరిలో సూచిస్తాను. అలా ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నివసించిన కాలం 430 సంవత్సరాలు కాదు, 215 సంవత్సరాలే అని తీసుకుంటే అబ్రహాము జననం లెక్క మారుతుంది. ఎలాగంటే; నిర్గమకాండము జరిగిన 1491 BC నుండి 215 సంవత్సరాలు వెనక్కు లెక్కిస్తే యాకోబు కుటుంబం ఐగుప్తులో ప్రవేశించిన కాలం 1706 BC గా వస్తుంది. ఆ సమయంలో యాకోబు వయస్సు 130 సంవత్సరాలు (ఆదికాండము 47:9). అంటే యాకోబు జననం 1836 BC లో జరిగింది. యాకోబును ఇస్సాకు 60 సంవత్సరాల వయస్సులో కన్నాడు (ఆదికాండము 25:26). అంటే ఇస్సాకు జననం 1896 BC లో జరిగింది. ఇస్సాకును అబ్రాహాము 100 సంవత్సరాల వయస్సులో కన్నాడు (ఆదికాండము 21:5). ఈ లెక్క ప్రకారం అబ్రాహాము జననం 1996 BC లో జరిగింది. 1896 + 100 = 1996 BC.

తర్వాత James Ussher అబ్రాహాము నుండి వెనక్కు వెళ్ళి నోవహు జలప్రళయాన్ని లెక్కించడానికి ‌ఆదికాండము 11లో ఉన్న వంశావళి సంఖ్యలను ఉపయోగించాడు. దాని ప్రకారం; జలప్రళయం తర్వాత రెండు సంవత్సరాలకు షేము అర్పక్షదును కన్నాడు (ఆదికాండము 11:10). తర్వాత అర్పక్షదు 35 సంవత్సరాల వయస్సులో షేలహును కన్నాడు (ఆదికాండము 11:12), షేలహు 30 సంవత్సరాల వయస్సులో ఏబెరును కన్నాడు (ఆదికాండము 11:14), ఏబెరు 34 సంవత్సరాల వయస్సులో పెలెగును కన్నాడు (ఆదికాండము 11:16), పెలెగు 30 సంవత్సరాల వయస్సులో రేయూను కన్నాడు (ఆదికాండము 11:18), రయూ 32 సంవత్సరాల వయస్సులో సెరూగును కన్నాడు (ఆదికాండము 11:20), సెరూగు 30 సంవత్సరాల వయస్సులో నాహోరును కన్నాడు (ఆదికాండము 11:22), నాహోరు 29 సంవత్సరాల వయస్సులో తెరహును కన్నాడు (ఆదికాండము 11:24). అంటే జలప్రళయం నుండి తెరహు జననం వరకు మొత్తం 222 సంవత్సరాలు వస్తుంది. 2+35+30+34+30+32+30+29 = 222తెరహు 70 సంవత్సరాల వయస్సులో అబ్రాహామును కన్నాడు (ఆదికాండము 11:26). ఈ 70 సంవత్సరాలను 222 సంవత్సరాలకు కలిపితే జలప్రళయం నుండి అబ్రాహాము జననం వరకు మొత్తం 292 సంవత్సరాలు ఔతుంది. ముందు చూసినట్టుగా అబ్రాహాము జననం 1996 BC అనుకుంటే 292+1996 జలప్రళయం 2288 BC లో జరిగినట్టు వస్తుంది. కానీ James Ussher తెరహుకు అబ్రాహాము 70వ యేట కాదు 130వ యేట జన్మించాడనే వాదన తీసుకుని జలప్రళయం 2348 BC లో సంభవించిందని నిర్థారించాడు. 1996+222+130 = 2348 BC.

అంటే James ussar లెక్క ప్రకారం జలప్రళయం సంభవించింది 2348 BC‌ లో. కానీ ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నివసించింది 430 సంవత్సరాలు కాదు, 215 సంవత్సరాలే మరియు అబ్రాహాము తెరహుకు 130వ యేట కాదు ఆదికాండము 11:26లో రాయబడినట్టుగా 70వ యేటే జన్మించాడని లెక్కిస్తే జలప్రళయం సంభవించింది 2288 BC లో. మరికొందరు బైబిల్ పండితులు జలప్రళయం సంభవించింది 2458 BC గా కూడా లెక్కించారు. కానీ అందులో నాకున్న సమస్యలను బట్టి ఆ లెక్కను విడిచిపెడుతున్నాను.

ఇప్పుడు అసలు సమస్య ఏంటంటే; బైబిల్ లో రాయబడిన జలప్రళయం సంఘటన తరహాలోనే మరికొన్ని సంస్కృతుల్లో కూడా Cuneiform లిపిలో జలప్రళయం గురించి రాయబడిన Tablets మనకు లభించాయి. అందులో ప్రాచీనమైనది "Sumerian King List" అనే Tablet. ఇది సుమారు 2100 BC కి చెందిందిగా భావించబడుతుంది. అయితే ఈ Tablet జలప్రళయం యొక్క పూర్తి కథను మనకు వివరించదు, కేవలం "ఆ తర్వాత జలప్రళయం దేశాన్ని కప్పేసింది" అంటూ జలప్రళయం జరిగిన సంఘటనను మాత్రమే సూచిస్తుంది.

కానీ పూర్తి జలప్రళయం కథగా మనకు దొరికిన అత్యంత ప్రాచీనమైన Tablet "Eridu Genesis". ఇది 1893 AD లో ఇరాక్‌ లోని nippur ప్రాంతంలో కనుగొనబడింది. అవ్వడానికి ఈ Tablet సుమారు 1600 BC కి చెందిందే అయినప్పటికీ అందులోని కథ యొక్క మూలం 2300 BC నుండి 2000 BC మధ్య కాలంలో ఏర్పడిందని పురాతత్వ శాస్త్రవేత్తలు వెల్లడించారు. తర్వాత ఈ సంప్రదాయం అక్కాడియన్ భాషలో అభివృద్ధి చెంది మరో కథగా కనిపిస్తుంది. ఈ కథను "Atrahasis Epic" అని పిలుస్తారు. ఇది సుమారు 1650 BC కి చెందిన Tablets లో కనిపిస్తుంది. ఇందులో దేవతలు మనుష్యుల సంఖ్య ఎక్కువగా పెరిగి వారి శబ్దం ఇబ్బంది కలిగిస్తుందని భావించి వారిని నాశనం చెయ్యాలని నిర్ణయిస్తారు. దేవుడు Enlil ఈ నిర్ణయం తీసుకుంటాడు. అయితే ఆ విషయంలో Enki అనబడే మరో దేవుడు నీతిమంతుడైన Atrahasis అనే మనిషిని రహస్యంగా హెచ్చరించి ఒక పెద్ద పడవ నిర్మించమని చెబుతాడు. అతను పడవ నిర్మించి తన కుటుంబాన్నీ మరియు జంతువులనూ పడవలోకి తీసుకుంటాడు. తర్వాత భారీ జలప్రళయం వచ్చి భూమిని కప్పేస్తుంది.

ఈ కథ తర్వాత Mesopotamia సాహిత్యంలో అత్యంత ప్రసిద్ధి చెందిన Gilgamesh ఇతిహాసంలో కూడా కనిపిస్తుంది. ఈ ఇతిహాసాన్ని "Epic of Gilgamesh" అని పిలుస్తారు. ఈ కథ యొక్క మూలం సుమారు 2100 BC కి వెళ్తుంది. కానీ మనకు దొరికిన దీని ప్రసిద్ధ Tablets కాపీలు క్రీ.పూ. 7వ శతాబ్దానికి మాత్రమే చెందినవి. ఈ కథలో Utnapishtim అనే వ్యక్తి Gilgamesh కు జలప్రళయం కథను చెబుతాడు. అది దాదాపుగా నోవహు జలప్రళయం సంఘటనను పోలియుంటుంది. ఉదాహరణకు; జలప్రళయం తర్వాత భూమి ఎండిందో లేదో తెలుసుకోవడానికి అతను కాకినీ పావురాన్నీ స్వాలో పక్షిని కూడా పంపడం, ఓడ నుండి బయటకు వచ్చి బలి అర్పించడం వంటి పోలికలు.

వీటి ఆధారంగానే కొందరు బైబిల్ విమర్శకులు "Eridu Genesis" మూలంగా నిర్మాణమైన "Epic of Gilgamesh" జలప్రళయం కథను దొంగిలించే (Eridu Genesis - Atrahasis Epic - Epic of Gilgamesh) బైబిల్ లో నోవహు జలప్రళయం కథను రాసుకున్నారని ఆరోపిస్తున్నారు. ఎందుకంటే; James Ussher లెక్క ప్రకారం నోవహు జలప్రళయం సంభవించింది 2348 BC అనుకుంటే 2300 BC కి చెందిన Eridu Genesis మూలంగా నిర్మాణమైన Epic of Gilgamesh జలప్రళయం కథ ఆ సమయానికి చాలా దగ్గరగా ఉంది. 2288 BC అనుకుంటే నోవహు జలప్రళయానికి 12 సంవత్సరాల ముందే అది రాయబడింది, అందుకే అలా ఆరోపిస్తున్నారు.

యూదా 1:10 వీరైతే తాము గ్రహింపని విషయములను గూర్చి దూషించువారై, వివేక శూన్యములగు మృగముల వలె వేటిని స్వాభావికముగా ఎరుగుదురో వాటివలన తమ్మును తాము నాశనము చేసికొనుచున్నారు.

కానీ గమనించండి; Eridu Genesis జలప్రళయం కథ కచ్చితంగా 2300 BC అని తేల్చబడలేదు. కేవలం‌ 2300 BC నుండి 2000 BC మధ్య కాలానికి చెందిందని మాత్రమే చెప్పబడుతుంది. అది ఎంతవరకూ వాస్తవమో తెలియదు. ఒకవేళ ఈ Eridu Genesis మూలంగా నిర్మాణమైన Atrahasis Epic, Epic of Gilgamesh లోని జలప్రళయం కథలు 2300 BC వి కాదు, 2500 BC వి అయినప్పటికీ ఆ కథలను దొంగిలించే బైబిల్ లో నోవహు జలప్రళయం సంఘటనను కల్పించుకున్నారని బైబిల్ విమర్శకులు రుజువు‌ చెయ్యలేరు. పైగా వారి Logic ప్రకారం బైబిల్ లోని జలప్రళయం సంఘటన ఆధారంగానే ఆ‌ కథలన్నీ కల్పించబడ్డాయని ఒప్పుకుని తీరాలి. Its my lifetime challenge.

ఎందుకంటే; బైబిల్ కాలక్రమం ప్రకారం నోవహు జలప్రళయం సంభవించింది James Ussher లెక్కించినట్టు 2348 BC లోనూ కాదు, 2288 BC లోనూ కాదు, 2458 BC లో కూడా కాదు. మరెప్పుడో తెలియాలంటే మొదట ఆదికాండము 11వ అధ్యాయపు వంశావళిలో చోటు చేసుకున్న సంఖ్యాపరమైన పొరపాట్ల గురించి తెలుసుకోవాలి. ఆ అధ్యాయంలో అర్పక్షదు నుండి నాహోరు వరకూ (ఆదికాండము 11:12-24) వారు కుమారులను కన్నారని రాయబడిన వయస్సులు 35,30,34,30,32,30,29 కాదు. మన బైబిళ్ళు ఏ హీబ్రూ ప్రతి ఆధారంగా తర్జుమా చెయ్యబడ్డాయో ఆ Masoretic ప్రతిలో అక్కడ సంఖ్యాపరమైన పొరపాట్లు జరిగాయి. ఆదికాండము 5వ అధ్యాయపు వంశావళిలో కూడా ఆ సమస్య ఉంది (ఆదికాండము 5:3 వ్యాఖ్యానం‌). చేతులతో ప్రతులు చేసేటప్పుడు అలాంటివి సహజం. మనం Masoretic ప్రతి కంటే పురాతనమైన అధికారిక గ్రీకు తర్జుమా Septuagint (LXX) నూ మరియు Samaritan Pentateuch ప్రతినీ మనం పరిశీలించినప్పుడు వారు కుమారులను కన్నారని రాయబడిన వయస్సులకు మరో వందేసి (నాహోరు విషయంలో యాభై) సంవత్సరాలు అదనంగా ఉంటుంది. అంటే అర్పక్షదు షేలాహును కన్నది 35 యేళ్ళకు కాదు 135 యేళ్ళకు, షేలాహు ఏబెరును కన్నది 30 యేళ్ళకు కాదు 130 యేళ్ళకు, ఏబెరు పెలెగును కన్నది 34 యేళ్ళకు కాదు 134 యేళ్ళకు, పెలెగు రెయూను కన్నది 30 యేళ్ళకు కాదు 130 యేళ్ళకు, రెయూ సేరూగును కన్నది 32 యేళ్ళకు కాదు 132 యేళ్ళకు, సేరూగు నాహోరును కన్నది 30 యేళ్ళకు కాదు 130 యేళ్ళకు, నాహోరు తెరహును కన్నది 29 యేళ్ళకు కాదు 79 యేళ్ళకు. గుర్తుంచుకోండి; ఈ సంఖ్యలన్నీ నేను క్రీ.పూ 3వ శతాబ్దానికి‌ చెందిన అధికారిక గ్రీకు తర్జుమా Septuagint (LXX) నుండి తీసుకున్నాను. అంతేకాదు అధనపు ఆధారంగా Semaritan Pentateuch ను కూడా పరిశీలించాను.‌ అంటే ఈ వయస్సులు కాదనలేని సత్యం. దానిప్రకారం; మన బైబిళ్ళలో ఆదికాండము 11 లోని ఈ వంశావళికి మనం అదనంగా మరో 650 సంవత్సరాలను కలిపి లెక్కించుకోవాలి. అలా లెక్కిస్తే James Ussher పాతలెక్క 2348 మరియు 650 జలప్రళయం 2348+6502998 BC లో సంభవించింది. ఆ సంఖ్యను ప్రక్కనపెట్టి, నేను నిజాయితీగా లెక్కించిన తక్కువ సంఖ్య 2288 BC నే ప్రామాణికంగా తీసుకున్నప్పటికీ జలప్రళయం సంభవించింది 2288+650 = 2938 BC లో. అంటే బైబిల్ కాలక్రమం ప్రకారం నోవహు జలప్రళయం గడిచిపోయిన కొన్ని‌ వందల సంవత్సరాల తర్వాతనే ఆ కథలన్నీ రాయబడ్డాయి.

కొందరు క్రైస్తవ ప్రబుద్ధులు బైబిల్ విమర్శకులు సంధిస్తున్న ఈ ఆరోపణకు ఇలా ప్రతులను పరిశీలించి సమాధానం చెప్పలేక ఆదికాండము 11 లోది Skip Genealogy అంటూ దాటవెయ్యబోతున్నారు. కానీ ఆదికాండము 11 లోనూ 5 లోనూ Skip Genealogy ఉన్నట్టు ఏవిధంగానూ రుజువు చెయ్యలేము, ఎందుకంటే అక్కడ స్పష్టంగా ఎవరు ఎవర్ని ఎప్పుడు కన్నారో చాలా వివరంగా రాయబడింది. ఒకవేళ లూకా 3:36 ప్రకారం; అర్పక్షదుకూ షేలహుకూ మధ్య కెయినాను ఉన్నాడుగా అంటే ఆ పేరు లూకా సువార్తకు సంఘం ప్రతులు రాస్తున్నప్పుడు Septuagint ను బట్టి చేర్చబడిందిగానే కొందరు బైబిల్ పండితులు భావిస్తారు. ఎందుకంటే మన బైబిళ్ళలో ఆదికాండము 11 లోనే కాదు, 1 దినవృత్తాంతములు 1 లోని వంశావళిలో కూడా ఆ పేరు మనకు కనిపించదు. యూదా చరిత్రకారుడైన ప్లేవియస్ జోసెఫస్ కూడా అతను చరిత్రలో ఉన్న వ్యక్తిగా తన వంశావళిలో ప్రస్తావించలేదు.

ఇప్పుడు విమర్శకులు లేవనెత్తుతున్న మరో సమస్య ఏంటంటే "Sumerian King List" Tablet లోని సుమేరియా రాజుల వంశావళితో పోల్చినప్పుడు నోవహు జలప్రళయ కాలక్రమం సరిపోవట్లేదు, ఆ జలప్రళయం నిజంగానే సంభవించియుంటే ఈజిప్టు రాజుల వంశావళిలో అంతరాయం ఎందుకు కలగలేదు అనేది.

మొదటిగా; "Sumerian King List" Tablet రాయబడిన కాలం సుమారు 2100 BC లో. అంటే బైబిల్ కాలక్రమం ప్రకారం నోవహు జలప్రళయం సంభవించిన సుమారు 800 సంవత్సరాల తర్వాత అది రాయబడింది. అందువల్ల ఆ Tablet లోని జలప్రళయానికి సంబంధించిన మాటలు 2900 BC - 3000 BC మధ్యవి అని రాయబడినప్పటికీ నోవహు జలప్రళయానికి ముందే ఆ కథ రాయబడిందని రుజువు చెయ్యడం సాధ్యపడదు. ఎందుకంటే ఆ Tablet రాయబడింది సుమారు 2100 BC లో. ఈ వాదన ప్రక్కనపెట్టి ఆ Tablet లో జలప్రళయం జరిగిందని ప్రస్తావించబడిన మొదటి సంఖ్య 2900 BC ని పరిగణలోకి తీసుకున్నప్పటికీ ఆ కాలానికి 38 సంవత్సరాలు ముందే నోవహు జలప్రళయం జరిగిపోయింది. ఎందుకంటే బైబిల్ ప్రకారం జలప్రళయం సంభవించింది 2938 BC లో.

రెండవదిగా; ఈజిప్టు రాజుల దగ్గరకు వద్దాం. ఆధునిక ఈజిప్టు అధ్యయన శాస్త్రం (Egyptology) ప్రకారం 2600 BC తర్వాత డైనేస్టీలే కచ్చితమైనవని చెబుతుంది. ఎందుకంటే ఆ కాలం నుంచే ఈజిప్టు చరిత్రకు బలమైన ఆధారాలు (నిర్మాణాలు) లభించాయి. ముందటి Early Dynastic Period గా చెప్పబడుతున్న 3100 BC–2600 BC కాలం కేవలం అంచనా మాత్రమే, ఆ కాలానికి కచ్చితమైన ఆధారాలు లేవు. కాబట్టి ఆ కాలానికి చెందిన డైనేస్టీలను ఆధారంగా చేసుకుని నోవహు జలప్రళయాన్ని ప్రశ్నించడం వీలుపడదు. 2600 BC తర్వాత డైనెస్టీలు బైబిల్ ప్రకారం నోవహు జలప్రళయం గతించిపోయిన (2938 BC) తర్వాతటి కాలానికి చెందినవి. అలాంటప్పుడు ఆ డైనెస్టీలలో జలప్రళయం కారణంగా అంతరాయం ఎందుకు కలుగుతుంది?

గమనించండి; ఈజిప్టు ప్రజలైనా సుమేరియా ప్రజలైనా నోవహు జలప్రళయం తర్వాత అతని కుమారుల సంతతి నుండే ఉనికిలోకి వచ్చారు. హాము కుమారుడైన మిస్రాయిము సంతతే ఈజిప్షియన్లు (ఆదికాండము 10:6). జలప్రళయానికి ముందు ఈజిప్టూ లేదు, సుమేరియా నూ లేదు. ఇక వాటికి రాజ వంశాలు ఎక్కడుంటాయి?. అవన్నీ జలప్రళయం గతించిపోయిన 2938 BC తర్వాత నోవహు కుమారుల సంతానం నుండి ఏర్పడినవే.

ఆదికాండము 10:32 వారివారి జనములలో వారివారి సంతతుల ప్రకారము, నోవహు కుమారుల వంశములు ఇవే. జలప్రవాహము గతించిన తరువాత వీరిలో నుండి జనములు భూమిమీద వ్యాపించెను.

ఈవిధంగా నోవహు కుమారుల సంతానం ద్వారానే భూమిపై జాతులు‌ విస్తరించాయి కాబట్టి వారు తర్వాత కాలంలో విగ్రహారాధికులుగా మారినప్పుడు ఆ జలప్రళయాన్ని తమ దేవుళ్ళ పేర్లతో మరియు తమకు తగ్గట్టుగా మార్పులు చేసుకుని కథలుగా రాసుకున్నారు. మరలా చెబుతున్నాను; ఆ కథలన్నీ‌ నోవహు జలప్రళయం మాదిరిగానే ఎందుకు ఉన్నాయంటే బాబేలు గోపురం వద్ద చెదరిపోయిన నోవహు సంతానమే అవి రాసుకున్నారు కాబట్టి అవి నోవహు జలప్రళయానికి దగ్గరగా ఉన్నాయి.

చివరిగా; బైబిల్ విమర్శకులు లేవనెత్తుతున్న మరో రెండు సమస్యలకు సమాధానం చెప్పి ఈ వ్యాసాన్ని ముగిస్తాను.

1. నోవహు జలప్రళయం Eridu Genesis, Epic of Gilgamesh వంటి కథలకు ముందే జరిగినప్పటికీ మోషే నోవహు జలప్రళయం సంఘటనను వాటి తర్వాతనే ఆదికాండములో రాసాడుగా? అలాంటప్పుడు మోషే వాటిని copy చేసి రాసాడని ఎందుకు అనుకోకూడదు?

A. నిజమే; మోషే జలప్రళయం సంఘటన ఉన్న ఆదికాండము గ్రంథాన్ని 1400 BC - 1500 BC మధ్యకాలంలోనే రాసాడు. అంటే ఆ Tablets లోని జలప్రళయం కథ రాయబడిన తర్వాతనే మోషే రాసాడు. అయినప్పటికీ మోషే వాటిని copy చేసే రాసాడని రుజువు చెయ్యడం సాధ్యం కాదు. ఎందుకంటే ఒక సంఘటన జరిగిన తర్వాత అది వేర్వేరు ప్రాంతాల్లో వేర్వేరు కాలాల్లో రాయబడుతుంది. కాబట్టి ముందుగా రాయబడిందే అసలైనది తర్వాతది దాని copy అని అర్థం కాదు. మోషే పరిశుద్ధాత్మ ప్రేరణతో ఆ సంఘటనను రాసాడు కాబట్టే దానికి సంబంధించి స్పష్టమైన, తర్కబద్ధమైన, నైతికపరమైన వివరాలనూ కారణాలనూ అతను తెలియచేసాడు. అలాంటివి ఆ కథల్లో మనకు కనిపించవు, ప్రతిగా epic of Gilgamesh కథ చివరిలో దేవతలు Utnapishtim కూ అతని భార్యకూ అమరత్వం ప్రసాదించినట్టు అసంబద్ధాలు ఉంటాయి.

2. జలప్రళయం నిజంగానే సంభవించియుంటే అంత నీరు ఎక్కడి నుండి వచ్చింది, భూమిలో అంత నీరు ఇంకిపోయినట్టు ఆధారం ఏముంది?

A. ఆ జలప్రళయం ఆకాశం నుండి కురిసే ప్రచండ వర్షంతో పాటు భూమి యొక్క అగాధ ఊటలు కూడా తెరవబడడం వల్ల సంభవించిందని బైబిల్ చెబుతుంది (ఆదికాండము 7:11,12, 8:2). 40 పగళ్ళు, రాత్రులు అవి అలానే భీకరంగా కొనసాగబట్టి పర్వతాలు సైతం మునిగిపోయేంత (అప్పటి కొలతలో) జలప్రళయం చోటు చేసుకుంది. అదేమీ అసంభవమైన విషయం కాదు. ఉదాహరణకు ఉన్నపాటుగా సముద్రంలోని నీరంతా భూమిపైకి వస్తే ఏమౌతుంది? అలానే ఆ జలప్రళయపు నీరు దేవుడు తన అద్భుతం ద్వారా వాయువును విసిరింపచెయ్యబట్టి తగ్గిపోయినట్టు రాయబడింది (ఆదికాండము 8:1). అంటే ఆ‌ నీరు భూమిలోకి ఇంకిపోవడం వల్ల కాదు ఆయన అద్భుతంగా గాలిని‌ విసిరింపచెయ్యబట్టి తగ్గిపోయింది. అందుకే Global flood జరిగిందని నిర్ధారించే "Uniform sediment layer" కి సంబంధించిన ఆధారాలు మనకు ఇంకా దొరకలేదు. అయినప్పటికీ Global flood జరిగినట్టుగా పర్వత శిఖరాలపై సముద్రజీవుల అవశేషాలు (Marine fossils) మనకు చాలానే లభించాయి.

కీర్తనలు 8:1 యెహోవా మా ప్రభువా ఆకాశములలో నీ మహిమను కనుపరచువాడా భూమియందంతట నీ నామము ఎంత ప్రభావము గలది.

ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నివసించింది‌ కేవలం 215 సంవత్సరాలే అనే నా లెక్కకు ఆధారం తెలుసుకోవడానికి ఈ వ్యాసం చదవండి.

ఇశ్రాయేలీయులు‌ ఐగుప్తులో ఎంతకాలం నివశించారు? 400/430/215?

అబ్రాహాము తెరహుకు 130వ యేట కాదు, 70వ యేటనే‌‌ జన్మించాడనే నా వాదనకు ఆధారం తెలుసుకోవడానికి ఈ వ్యాఖ్యానం చదవండి.

ఆదికాండము 11:32 వ్యాఖ్యానం

ఆదికాండము 5వ అధ్యాయంలోని వంశావళి సంవత్సరాలలో కూడా వందల సంవత్సరాలపైన వ్యత్యాసం ఉంటుంది, ఆ వివరాలు తెలుసుకోవడానికి ఈ వ్యాఖ్యానం చదవండి.

ఆదికాండము 5:3 వ్యాఖ్యానం‌

Add comment

Security code
Refresh

 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.