యెహోషువ 6:17-19 మరియు 7వ అధ్యాయము
ఉద్దేశము
దొంగిలించుట పాపము అని చూపించుట. దేవుని కన్నులకు మరుగైనది ఏదియు లేదు. మానవులు ఆయన ఆజ్ఞలను అతిక్రమించి నప్పుడు దేవుడు కోపగించుకుంటాడు అని బోధించుట.
ముఖ్యాంశము
మీ తల్లిదండ్రులకు మీరు ఎప్పుడైనా అవిధేయత చూపించారా? వారి మాట విననప్పుడు మీ తల్లిదండ్రులకు మీపై కోపము వచ్చిందా? వారికి చెప్పకుండా బయటకు వెళ్లి స్నేహితులతో ఎక్కువసేపు ఆడుకోవద్దు అని చెప్పి ఉండవచ్చు, కానీ మీరు వారి మాటలను పట్టించుకోకుండా, చెప్పకుండానే బయటకు వెళ్లి ఆడుకుని వస్తే వారికి తప్పకుండా కోపం వస్తుంది. మిమ్మల్ని కోప్పడి, అలాగే చేస్తూ ఉంటే కొట్టవచ్చు కూడా!
ఈరోజు దేవుని ఆజ్ఞను పాటించకుండా అవిధేయత చూపిన వ్యక్తిపై దేవుడు కోపగించి ఏ విధముగా శిక్షించాడో చూద్దాము.
గతవారము
యెరికో గోడలు, ప్రాకారము ఏ విధముగా కూలిపోయినది గతవారం చూశాము. ఆరు రోజుల పాటు ఇశ్రాయేలీయులు యెరికో ప్రాకారము చుట్టూ ఎన్నిసార్లు తిరిగారు? రోజుకు ఒక్కసారి మాత్రమే. ఏడవ దినమున ఎన్నిమార్లు తిరిగారు? ఏడు సార్లు. జనులు బిగ్గరగా కేకలు వేసినప్పుడు ఏమి జరిగింది? యెరికో గోడలు కూలిపోయాయి. ఎవరి ఇల్లు పడిపోకుండా అలాగే నిలిచి ఉంది? రాహాబు ఇల్లు కూలి పోలేదు. రాహాబు తన ఇంటి కిటికీ కి ఏమి కట్టింది? రాహాబును ఆమె ఇంటి వారినందరిని ఆ ఇంటిలో నుండి తీసుకుని వచ్చి పాళెములో గుడారముల దగ్గరకు తీసుకుని వెళ్ళమని యెహోషువ వేగుల వారికి చెప్పాడు
యెరికో పట్టణములో రాహాబు కుటుంబము మాత్రమే ఎందుకు రక్షించబడింది? రాహాబు నిజమైన, జీవము గలిగిన దేవుని విశ్వసించింది. ప్రభువు యెరికో పట్టణమును నాశనము చేసినప్పుడు తనను తన కుటుంబమును ఆయన తప్పకుండా కాపాడుతాడు అని నమ్మింది(హెబ్రీ11 :31). ఇశ్రాయేలీయులు యెరికో పట్టణముతో పాటు అందులో ఉన్న సమస్తమును అగ్నితో కాల్చి వేశారు.
దేవుని ఆజ్ఞలు
యెరికో పట్టణము పై ప్రభువు ఇశ్రాయేలీయులకు గొప్ప విజయాన్ని కలుగ జేశాడు. యెరికో పట్టణముతో పాటు కనాను దేశమంతటిని స్వాస్థ్యముగా ఇశ్రాయేలీయులకు ఇవ్వడానికి దేవుడు వారిని సిద్ధం చేస్తున్నాడు. యెరికో పట్టణము పై యుద్ధమునకు వెళ్ళుటకు ముందు దేవుడు యెహోషువకు, ఇశ్రాయేలీయులందరికి కొన్ని ముఖ్యమైన ఆజ్ఞ లు వివరించాడు. వారు యెరికో పట్టణమును ఆక్రమించుకున్న తరువాత అందులో ఏమీ మిగలకుండా సమస్తము నాశనము చేయాలి అని చెప్పాడు. ఆ పట్టణములోని సమస్తము శపించబడినది గనుక ఎవరు కొంచెమైనను, దేనినైనను తీసుకొనరాదు అని ఆజ్ఞాపించాడు. తమ కన్నులకు అందముగా కనిపించిన దానిని ఎవరైనా తీసుకొనిన ఎడల వారు తమతో పాటు ఇశ్రాయేలీయులకందరికి శాపము, బాధ కలుగజేస్తారు అని హెచ్చరించాడు. వెండి, బంగారు, ఇత్తడి పాత్రలు, ఇనుప పాత్రలను తీసుకుని వాటిని ప్రభువుకు ప్రతిష్టించి ప్రభువు ధనాగారములో ఉంచవలెను అని చెప్పాడు. దేవుడు ఇశ్రాయేలీయులలో ప్రతి ఒక్కరు వినులాగున ఎంతో స్పష్టంగా తన ఆజ్ఞలను వివరించాడు.
ఆకాను అవిధేయత చూపించుట
దేవుని ఆజ్ఞలను ఇశ్రాయేలీయులలో నుండి ఒక వ్యక్తి అతిక్రమించాడు. అతని పేరు ఆకాను. యెరికో పట్టణమును దానిలోనున్న సమస్తమును నాశనము చేయుమని యెహోషువ ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించుట ఆకాను కూడా విన్నాడు. అది దేవుని ఆజ్ఞ అని కూడా ఆకానుకు తెలుసు. కాని ఆకాను యెరికో పట్టణములో ప్రవేశించినప్పుడు తనకు ఎంతో ఆనందాన్ని కలిగించిన వస్తువులను చూసాడు. ఒక మంచి ఖరీదైన షీనారు పై వస్త్రమును, రెండు వందల తులముల వెండిని, ఏబది తులముల బంగారు కమ్మిని చూచి ఎంతో ఆశతో వాటిని పొందాలని ఆశించాడు. వాటిని చూసిన ఆకాను దేవుని మాటలను నిర్లక్ష్యపెట్టి తన ఆశను తీర్చుకున్నాడు. అతడు వాటిని తీసుకుని తన గుడారము మధ్య గుంట త్రవ్వి అందులో దాచి పెట్టుకున్నాడు. ఎంతో రహస్యంగా తాను ఆ పనిని చేశాడు గనుక ఎవరికీ తెలియదు అని ధైర్యంగా ఉన్నాడు. కాని దేవుడు ప్రతి క్షణం ప్రతి ఒక్కరిని చూస్తున్నాడు అనే విషయం మరచిపోయాడు. దేవుడు ఆకాను చేసిన పనులన్నింటిని చూచాడు. దేవుడు తాను చెప్పిన విధముగానే ఆకాను చేసిన పనిని బట్టి ఆగ్రహంతో ఇశ్రాయేలీయులందరిని శిక్షించ బోతున్నాడు.
హాయి వారి చేతిలో ఓడిపోవుట
యెరికోను జయించిన తరువాత దగ్గరలోనే హాయి అనే చిన్న పట్టణం ఉంది. హాయి పట్టణము గురించిన వివరాలు తెలుసుకొనుటకు యెహోషువ వేగుల వారిని పంపించాడు.
వారు వెళ్లి హాయి పట్టణమును వేగు చూచి యెహోషువతో - "జనులందరిని వెళ్ళనీయకుము రెండు లేక మూడు వేల మంది వెళ్లి హాయిని పట్టు కొనవచ్చును. జనులందరు ప్రయాసపడి అక్కడికి వెళ్లనేల? హాయి వారు కొద్దిగానున్నారు కదా" అని చెప్పారు. అప్పుడు యెహోషువ 3000 మందిని హాయి పట్టణము మీదికి పంపాడు, కాని ఇశ్రాయేలీయులు హాయి వారి ఎదుట నిలువలేక పారిపోయారు. వారు ఇశ్రాయేలీయులలో 36 మందిని చంపివేశారు.షేబారీము వరకు ఇశ్రాయేలీయులను తరిమికొట్టారు. ఈ వార్త విని యెహోషువ, జనులు ఎంతో దుఃఖించారు. యెరికో వంటి పెద్ద పట్టణముపై విజయాన్ని సాధించిన తరువాత, హాయి వంటి చిన్న పట్టణపు వారి చేతిలో ఓడిపోవడం వారికి ఎంతో భయాన్ని పుట్టించింది. ప్రభువు తమ సేనలతో రావడం మానుకున్నాడేమో అని సందేహించారు. యెహోషువ, ఇశ్రాయేలీయుల పెద్దలతో కలిసి తన బట్టలు చింపుకొని, దేవుని మందసము ఎదుట నేలమీద ముఖములు మోపుకొని దేవునికి ప్రార్ధించాడు. ఇశ్రాయేలీయులు ఎందుకు ఓడిపోయారో తెలియజేయునట్లు ప్రభువుకు ప్రార్థించాడు. యుద్ధములో ఓడిపోయినందువలన దేవుని ఘనమైన నామమునకు అవమానము కలుగుతుంది కదా అని దేవుని వేడుకున్నాడు. కనానీయులు, ఆ దేశ నివాసులందరు వారు ఓడిపోయిన వార్త విని, చుట్టుకుని ఇశ్రాయేలీయుల పేరు భూమి మీద ఉండకుండా తుడిచి వేస్తారు అని దేవునికి విన్నవించాడు.
అప్పుడు ప్రభువు యెహోషువ తో - "లెమ్ము, నీ వేల ఇక్కడ ముఖము నేల మోపికొందువు? ఇశ్రాయేలీయులు పాపము చేసి ఉన్నారు. నేను వారితో చేసిన నిబంధనను వారు మీరియున్నారు. శపితమైన దాని కొంత తీసుకుని, దొంగిలి బొంకి తమ సామాను లో దాని ఉంచుకొని ఉన్నారు. కాబట్టి ఇశ్రాయేలీయులు శాపగ్రస్తులై తమ శత్రువుల యెదుట నిలువలేక వెనుకకు తిరిగిరి. శాపగ్రస్తులైన వారు మీ మధ్యనుండకుండా మీరు వారిని నిర్మూలము చేసితేనే తప్ప నేను మీకు తోడైయుండను" అని చెప్పాడు.
ఆకాను పట్టుబడుట
మరుసటి దినము ఉదయము గోత్రముల వరుసను బట్టి ఇశ్రాయేలీయులు కూడుకున్నారు. వారు 12 గోత్రముల ప్రకారము వరుసగా నిలువబడ్డారు. అప్పుడు యూదా గోత్రము పట్టబడింది. యూదా గోత్రములో జెరహీయుల వంశము, జెరహీయుల వంశములో జబ్ది పట్టబడ్డాడు. చివరగా జబ్ది మనుమడు కర్మీ కుమారుడైన ఆకాను పట్టబడ్డాడు. ఇశ్రాయేలీయులందరు ఆకానును చూస్తున్నారు. ఆకాను తన పేరు రాకుండా ఉండాలి అని ఆశ పడి ఉండవచ్చు. పట్టబడిన తర్వాత ఎంతగానో భయపడి ఉంటాడు. యెహోషువ ఆకానును పిలిచి అతనితో - "నా కుమారుడా, నీవు చేసిన దానిని మరుగు చేయక నాకు తెలుపుమని నిన్ను వేడుకొనుచున్నాను" అని చెప్పాడు. అప్పుడు ఆకాను యెహోషువతో - "ఇశ్రాయేలీయుల దేవుడైన ప్రభువుకు విరోధముగా నేను పాపము చేసినది నిజము. దోపుడు సొమ్ములో ఒక మంచి షీనారు పై వస్త్రమును, రెండు వందల తులముల వెండిని, ఏబది తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూచి వాటిని ఆశించి తీసికొంటిని. అదిగో నా డేరా మధ్య అవి భూమిలో దాచబడి ఉన్నవి" అని ఒప్పుకున్నాడు.
ఆకాను శిక్షించబడుట
యెహోషువ మనుష్యులను పంపి ఆకాను గుడారములో నుండి ఆ వస్తువులను తెప్పించాడు. వారు ఆ వస్తువులను తీసుకుని యెహోషువ యొద్దకును ఇశ్రాయేలీయుల యొద్దకును తెచ్చి ప్రభువు సన్నిధిలో ఉంచారు.
ఆకాను చూపిన అవిధేయత ను బట్టి ప్రభువు తో కోపముతో నిండి పోయాడు. అప్పుడు ఇశ్రాయేలీయులు ఆకాను ను ఆ వస్తువులను, అతని కుమార్తెలను, కుమారులను, ఎద్దులను, గాడిదలను మందను డేరాను సమస్తమును తీసుకొని ఆకోరు లోయ అనే ప్రాంతమునకు తీసుకొని వచ్చారు. ఆకాను చేసిన పనిని అతని కుటుంబపు వారు కూడా అంగీకరించి ఉండవచ్చు. అందువలన వారు కూడా నశించ వలసి వచ్చింది. అప్పుడు ఇశ్రాయేలీయులందరు వారిని రాళ్లతో కొట్టి చంపారు. ఆకాను ఉద్దేశపూర్వకంగా దేవునికి అవిధేయత చూపినందువలన తన కుటుంబంతో కూడా మరణించ వలసి వచ్చింది.
ఆకాను చనిపోయిన తరువాత ప్రభువు తిరిగి యెహోషువతో - "భయపడకుము జడియకుము, యుద్ధ సన్నద్ధులైన వారినందరిని తోడుకొని హాయి మీదికి పొమ్ము. నేను హాయి రాజును అతని జనులను అతని పట్టణమును అతని దేశమును నీ చేతికి అప్పగించు చున్నాను" అని చెప్పాడు. వారు తిరిగి హాయి మీదకు వెళ్లి దానిని జయించి పట్టుకున్నారు. దేవుడు వారికి గొప్ప విజయము కలుగ జేశాడు. అది చూచిన తరువాత దేవుని మాటలు వినుట ఎంత ముఖ్యము అనేది యెహోషువ, ఇశ్రాయేలీయులు గ్రహించ గలిగారు.
సందేశము
ఆకాను అవిధేయుడై యెరికో పట్టణములోని వస్తువులు దొంగిలించాడు.
తాను చేసిన పనిని ఎవరూ చూడలేదు అని తలంచాడు. ఎంత జ్ఞానము లేని వాడు! కాని దేవుడు నిరంతరము చూస్తున్నాడు అని మరచి పోయాడు. ఆకాను దొంగిలించే సమయములో కూడా దేవుడు గమనిస్తున్నాడు. ఆకాను తన గుడారములో వాటిని దాచిపెట్టినప్పుడు కూడా దేవుడు చూశాడు. ఆకాను చేసిన పాపమును బట్టి దేవుడు అతనిని శిక్షించాడు.
అన్వయింపు
ఈ సంఘటనను తెలుసుకొనిన తరువాత దొంగిలించుట పాపము అని మనము గుర్తించాలి. దేవుని పది ఆజ్ఞలలో ``దొంగిలకూడదు'' అనేది కూడా ఒక ఆజ్ఞ. మీరు ఎప్పుడైనా వేరే వాళ్ళ వస్తువులను తీసికొనడానికి ప్రయత్నించారా? అలా చేస్తూ మమ్మల్ని ఎవరూ చూడటం లేదు గనుక ఫరవాలేదు అని అనుకుంటున్నారా? ఎవరూ చూడకపోయినా దేవుడు చూస్తున్నాడు అనే విషయాన్ని మరచిపోకండి. మన పనులు మాత్రమే కాదు మన మనస్సు లోని ఆలోచనలు కూడా ఆయనకు తెలుసు. దేవుడు మనము చేసిన పనులను కొంతకాలం తరువాత మరచిపోతాడు అని అనుకుంటున్నారా? కాని ఆయన యెదుట మన కార్యములు ఎంతో స్పష్టంగా కనిపిస్తుంటాయి. మనము వాటిని చేయలేదు అని చెప్పడానికి వీలు పడదు. మనము చేసిన పాపములన్నింటికి ఒక దినము దేవునికి లెక్క అప్పగించాలి. మన పాపముల కొరకు పశ్చాత్తాపముతో దేవుని క్షమాపణను అడగకపోతే ఆయన మనలను తప్పక శిక్షిస్తాడు. ప్రభువైన యేసు మన పాపములను కడిగి వేయగలడు. ఆయన సన్నిధిలో ప్రార్ధించి మన పాపములన్నింటిని అంగీకరించాలి. మన పాపములను మనము ఒప్పుకొని నట్లయితే ఆయన మనలను క్షమిస్తాడు అని బైబిల్ బోధిస్తుంది (1 యోహాను1:9). క్రైస్తవులమైన తరువాత యేసును వెంబడించుట కు కావలసిన శక్తిని ఆయనే మనకు అనుగ్రహిస్తాడు. అప్పుడు మనము సంపూర్ణ విధేయతతో ఆయనను వెంబడించ గలుగుతాము.
కంఠతవాక్యము
ప్రభువు కన్నులు ప్రతి స్థలము మీద నుండును. చెడ్డవారిని మంచి వారిని అవి చూచుచుండును. (సామెతలు 15:3)
ఆక్టివిటీస్ డౌన్లోడ్ PDF