న్యాయాధిపతులు 16వ అధ్యాయము
ఉద్దేశము
ప్రభువును ప్రేమించే వారు కూడా ఈ లోకములోని విషయాలకు ఆకర్షించబడి ఆయనకు దూరముగా వెళ్ళిపోయే అవకాశం ఉంది అని బోధించుట. అలా దూరంగా వెళ్లి పోయిన తరువాత వారు ఎన్నో కష్టాలు అనుభవించ వలసి వస్తుంది. కాని మనము నిజమైన క్రైస్తవులమైన యెడల, ఆయన మనలను తననుండి దూరముగా పోనివ్వడు. కాని మనము చేయవలసిన పని, మన పొరపాట్లను,పాపమును గ్రహించి దేవుని క్షమించమని అడగడం.
ముఖ్యాంశము
చాలాసార్లు ఎవరు ఎక్కువ బలవంతులు? అని తెలుసుకోవడానికి పోటీలు పెట్టి పరీక్షిస్తుంటారు. ఎవరు ఎక్కువ బరువు ఎత్తగలిగితే వారు బలవంతులు అని ఎంచుతారు. బైబిల్ లో సమ్సోను అందరికంటె ఎంతో బలవంతుడు అని వ్రాయబడింది. ప్రతి రోజు వ్యాయామం చేసినందువలన అతనికి అంతటి బలము కలుగలేదు. సమ్సోనుకు దేవుని వలన అంత బలం వచ్చింది. దేవుడు సమ్సోనుకు ఎందుకు అంత బలం ఇచ్చాడు, దానితో అతడు ఏమి చేశాడు అనే విషయాలు ఈ రోజు చూద్దాం.
గతవారము
ఇశ్రాయేలీయులు కనాను వారితో స్నేహం చేసి వారి దేవతలను పూజించగా, దేవుడు వారిని మిద్యానీయుల చేతికి అప్పగించినప్పుడు వారు పశ్చాత్తాపముతో ప్రార్థించారు. అప్పుడు దేవుడు గిద్యోనును న్యాయాధిపతిగా (నాయకుడుగా) నియమించాడు. గిద్యోను ఎంత మందిని తనతో యుద్ధానికి తీసుకొని వెళ్ళాడు? ఆ మూడు వందల మంది చేతులలో ఏమి ఉన్నాయి? వారు దివిటీలు వెలిగించి, కుండలు పగులగొట్టి, బూరలు ఊదగా రాత్రి సమయములో మిద్యానీయులు లేచి భయముతో వారిని వారు చంపు కొనసాగారు. వారు గిద్యోనుకు, అతనితో వచ్చిన మూడు వందల మందికి భయపడి వారి దేశమునకు పారిపోయారు.
దేవుడు గిద్యోను ద్వారా ఇశ్రాయేలీయులను కాపాడిన తరువాత వారు 40 సంవత్సరములు దేవునికి నమ్మకముగా జీవించారు. తరువాత తిరిగి వారు దేవునికి దూరమైపోయారు. ఇలా వారు అనేక మార్లు దేవునికి దూరమై పోవడం, ప్రార్థించడం, దేవుడు న్యాయాధిపతులను పంపించి వారిని రక్షించడం ఇలా జరుగుతూనే ఉంది, కాని ఇశ్రాయేలీయులు తమ జీవితాలను పూర్తిగా మార్చుకోలేక పోయారు. ఇశ్రాయేలీయులను ఫిలిష్తీయులు కష్టపెడుతున్న సమయములో దేవుడు సమ్సోను అనే వ్యక్తిని వారికి న్యాయాధిపతిగా పంపాడు.
సమ్సోను బలము
న్యాయాధిపతులందరిలో సమ్సోనుకు ఒక ప్రత్యేకత ఉంది. ఫిలిష్తీయులను ఎవరి సహాయం లేకుండా, సైన్యం లేకుండా సమ్సోను ఎదుర్కొనగలిగాడు. దేవుడు సమ్సోనుకు ప్రత్యేకమైన బలము ఇచ్చాడు. సమ్సోను ఒంటరిగా ఒక్కసారి 1000 మంది ఫిలిష్తీయులను చంపివేశాడు. అతని దగ్గర ఎటువంటి ఆయుధము లేనందువలన అక్కడ ఉన్న గాడిద దవడ ఎముకతో వారిని చంపివేశాడు. సమ్సోను బలము చూచి ఇశ్రాయేలీయులు దేవుడు తమకు బలమైన వ్యక్తిని న్యాయాధిపతిగా నియమించినందుకు సంతోషించారు.
సమ్సోను బలము గురించి వివరించే మరికొన్ని సంఘటనలు చూద్దాము. సమ్సోను ఒకసారి ప్రయాణిస్తున్నప్పుడు ఒక కొదమ సింహం అతని ఎదుటకు వచ్చింది. ప్రభువు ఆత్మ అతనిని ప్రేరేపించగా అతని చేతిలో ఏమీ లేకపోయినను మేకపిల్లను చీల్చినట్లు అతడు దానిని చీల్చి వేశాడు. సింహమును ముక్కలుగా చేయగలిగిన సమ్సోను ఎంత బలవంతుడు!
సమ్సోను ఒకసారి ఫిలిష్తీయుల పట్టణమునకు వెళ్ళినప్పుడు అక్కడి వారు అతనిని పట్టుకొనవలెనని పట్టణపు ద్వారాములను మూసివేశారు. సమ్సోను మధ్య రాత్రి వరకు పండుకొని మధ్యరాత్రి లేచి పట్టణపు తలుపులను వాటి రెండు ద్వారబంధములను పట్టుకొని వాటి అడ్డ కర్రతో వాటిని ఊడబెరికి తన భుజముల మీద పెట్టుకుని కొండ చివరకు వాటిని తీసుకొని పోయాడు. ఫిలిష్తీయుల నుండి సమ్సోను తనకు తానే తప్పించుకున్నాడు. ఫిలిష్తీయులు ఎలాగైనా సరే సమ్సోనును బందించాలని ఉపాయము వెదుకుతున్నారు.
సమ్సోను రహస్యము
సమ్సోను పుట్టకముందు ప్రభువు అతని తల్లిదండ్రులకు ప్రత్యక్షమై మీకు కుమారుడు పుట్టబోతున్నాడు అని చెప్పాడు. ఆ బాలుడు ప్రభువుకు నాజీరు (ప్రతిష్ట) చేయబడిన వాడై పెరుగుతాడు అని చెప్పాడు. నాజీరు అనగా ఎప్పుడూ జుట్టు కత్తిరించు కొనకుండా, ద్రాక్షారసము త్రాగకుండా, చనిపోయిన వారిని తాకకుండా పెరగాలి. సమ్సోను తల్లిదండ్రులు దేవుని ప్రేమించే వారు గనుక ఆయన ఆజ్ఞలను అన్నింటిని అనుసరించి సమ్సోనును పెంచి పెద్ద చేశారు. దేవుడు సమ్సోనుకు అసాధారణమైన బలమును ఇచ్చాడు. తమ శత్రువులైన ఫిలిష్తీయులతో యుద్ధము చేయుటకు దేవుడు సమ్సోనుకు అంత బలాన్ని అనుగ్రహించాడు. కాని సమ్సోను తన జుట్టును కత్తిరించుకొనిన వెంటనే అతని బలము అతని నుండి తొలగిపోతుంది అని దేవుడు చెప్పాడు.
మరొక మాటలో చెప్పాలంటే సమ్సోను దేవుని మాటలను నిర్లక్ష్య పెట్టి నాజీరు చేయబడిన వాడిగా ఉండకుండా ప్రవర్తిస్తాడో వెంటనే అతడు తన బలాన్ని పోగొట్టుకుంటాడు.
సమ్సోను బుద్ధిహీనత
సమ్సోనుకు పెండ్లి వయస్సు వచ్చినప్పుడు ఫిలిష్తీయుల కుమార్తెలలో ఒకరిని వివాహం చేసికొనుటకు నిర్ణయించుకున్నాడు. సమ్సోను నిర్ణయము అతని తల్లిదండ్రులకు ఎంతో విచారము కలిగించింది. ఇశ్రాయేలీయుల కుమార్తెలలో ఒకరిని వివాహము చేసుకొనుమని ఎంతగానో బ్రతిమాలారు. దేవుడు కూడా ఇశ్రాయేలీయులు కాని వారిని వివాహమాడరాదు అని ఆజ్ఞాపించాడు. కాని సమ్సోను ఉద్దేశపూర్వకంగానే దేవుని ఆజ్ఞను అతిక్రమిస్తున్నాడు. సమ్సోను తన తల్లిదండ్రుల మాటలు వినలేదు. అతడు తాను ఎంచుకొనిన మార్గము లోనే ముందుకు వెళ్ళుటకు సిద్ధపడ్డాడు. అతడు ఫిలిష్తీయులలో ఒక స్త్రీని వివాహము చేసుకున్నాడు, కాని కొద్ది రోజులలోనే సమ్సోను తన భార్యతో విడిపోయాడు. మరలా కూడా సమ్సోను ఫిలిష్తీయులలోనే వివాహం చేసుకోవాలి అనుకున్నాడు. చివరకు దెలీలా అనే ఫిలిష్తీయురాలితో స్నేహము చేసి ఆమెతో కలిసి ఉండసాగాడు. దెలీలా ఎంతో చెడ్డ స్త్రీ. సమ్సోనును ప్రేమిస్తున్నట్లు నటించి అతనిని మోసం చేసింది.
సమ్సోను తన బలమును గురించిన రహస్యము చెప్పుట
ఫిలిష్తీయుల అధికారులు సమ్సోనును చంపవలెనని ఎన్నో ఆలోచనలు చేసినప్పటికి సమ్సోను బలము వలన అతనిని పట్టుకొన లేకపోయారు. వారు ఒక ఆలోచన చేశారు. వారు దెలీలా దగ్గరకు వెళ్లి - "అతని గొప్ప బలము దేనిలో నున్నదో, మేమేలాగు అతని గెలువవచ్చునో తెలిసికొనుము మేము అతని
బంధించి అతని గర్వము అణుచుదుము. అప్పుడు మాలో ప్రతివాడును 1100 వెండి నాణెములను నీకు ఇచ్చెదము" అని చెప్పారు. దెలీలా ధనాపేక్ష కలిగి వారి మాటలు అంగీకరించింది. దెలీలా సమ్సోనుతో - "నీ మహాబలం దేనిలో ఉన్నదో, నిన్ను దేని చేత కట్టి బాధింప వచ్చునో నాకు దయచేసి తెలుపుము" అని అడుగగా సమ్సోను - "ఏడు నిరవంజి చువ్వలతో నన్ను బంధించిన యెడల నేను బలహీనుడై సామాన్య మనుష్యులలో ఒకని వలె అవునుదును" అని దెలీలాతో చెప్పాడు. అలా చేసినప్పటికి సమ్సోను బలము తగ్గి పోలేదు గనుక అది అబద్ధం అని తెలిసింది. దెలీలా తిరిగి సమ్సోనును అడుగగా కొత్త తాళ్లతో తనను బంధిస్తే బలహీనుడనవుతాను అని చెప్పాడు. అప్పుడు దెలీలా కొత్త తాళ్లతో సమ్సోనును బంధించి ఫిలిష్తీయులు నీ మీదకు వచ్చారు అని కేకలు వేసింది. అప్పుడు సమ్సోను ఆ త్రాళ్లను నూలు పోగుల వలె తెంపి వేసాడు. మూడవసారి తన తల జడలు ఏడు అల్లి నట్లయితే తన బలము పోతుంది అని చెప్పాడు. కానీ ఫిలిష్తీయులు వచ్చినప్పుడు అతడు లేచి వెళ్ళిపోయాడు.
సమ్సోను అబద్ధం చెప్పడం చూచినప్పుడు దెలీలా ప్రతి దినము మాటల చేత అతని బాధించి తొందర పెట్టగా సమ్సోను విసిగి పోయాడు. అతడు దెలీలాతో - "నా తల్లి గర్భం నుండి పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడైయున్నాను. నా తల మీదికి మంగలకత్తి రాలేదు.
నాకు క్షౌరము చేసిన యెడల నా బలము నాలో నుండి తొలగిపోయి ఇతర మనుష్యుల వలె అవుదును'' అని చెప్పాడు. దెలీలా సమ్సోను నిజం చెప్పాడు అని గ్రహించి, ఫిలిష్తీయుల సర్దారులను పిలిపించగా వారు డబ్బు తీసుకుని ఆమె దగ్గరకు వచ్చారు. దెలీలా సమ్సోను నిద్రించిన తరువాత ఒక మనుష్యుని పిలిపించి అతని చేత సమ్సోను తల మీద ఉన్న 7 జడలు క్షౌరము చేయించింది. వెంటనే సమ్సోను బలము అతనిలో నుండి తొలగిపోయింది. ఫిలిష్తీయులు పట్టుకొనుటకు ప్రయత్నించగా సమ్సోను వారిని ఎదిరించలేక వారికి బందీగా చిక్కాడు.
సమ్సోనును బందీ గృహములో ఉంచుట
ఫిలిష్తీయులు సమ్సోనును పట్టుకొని అతని కన్నులను ఊడ దీసి ఇత్తడి సంకెళ్ళతో బందించి బందీ గృహములో ఉంచారు. అతడిని బందీ గృహములో తిరగలి విసరు వానిగా పెట్టారు. దేవునికి ప్రతిష్టింపబడిన వాడు బందీ గృహములో గ్రుడ్డివానిగా తిరుగలి విసరటం ఎంత విచారకరం! సమ్సోను దేవునికి వ్యతిరేకముగా తాను చేసిన పనులను గూర్చి పశ్చాత్తాప పడి ఉండవచ్చు. కొద్దిరోజుల తర్వాత సమ్సోను వెంట్రుకలు తిరిగి పెరగడం మొదలైంది. తన బలం తిరిగి వస్తున్నట్లు సమ్సోను గ్రహించి, ఇకనుండి తన బలమును ప్రభువు కొరకు వాడాలి అని అనుకొని ఉండవచ్చు.
సమ్సోనును బంధించ గలిగినందుకు ఫిలిష్తీయులు ఎంతో సంతోషంతో ఉన్నారు. తమ దేవత అయిన దాగోను సమ్సోనును తమకు అప్పగించింది అని వారు విశ్వసించారు. అందుచేత తమ దేవత అయిన దాగోనుకు మహాబలిని అర్పించుటకు,
పండుగ ఆచరించుటకు దేవాలయములో చేరుకున్నారు. ఆ గుడిలో స్రీలు, పురుషులు, ఫిలిష్తీయుల సర్దారులు అందరు కలిసి 3000 మంది ఉన్నారు. వారు ఎగతాళి చేయుటకు సమ్సోనును బందీ గృహము నుండి విడిపించి గుడికి తీసుకొని వచ్చారు. సమ్సోనుకు కళ్ళు కనబడవు గనుక వారు అతనిని పట్టుకొని గుడి స్తంభముల మధ్య నిలుచుండబెట్టి ఎగతాళి చేయసాగారు. సమ్సోను తన చేతిని పట్టుకొనిన దాసునితో - "ఈ గుడికి ఆధారముగా నున్న స్తంభములను నన్ను తడవనిచ్చి విడువుము, నేను వాటి మీద ఆనుకొందును" అని అడిగాడు. అప్పుడు సమ్సోను దేవునికి -"ప్రభువా, దయచేసి నన్ను జ్ఞాపకము చేసికొనుము. దేవా దయచేసి ఈ సారి మాత్రమే నన్ను బలపరచుము. నా రెండు కన్నుల నిమిత్తము ఫిలిష్తీయులను ఒక్కమారే వధించి పగ తీర్చు కొననిమ్ము" అని మొరపెట్టాడు. అప్పుడు ఆ గుడికి ఆధారముగా నున్న రెండు మధ్య స్తంభములలో ఒక దానిని కుడి చేతను ఒకదానిని ఎడమ చేతను పట్టుకొని - "నేనును ఫిలిష్తీయులును చనిపోదుము గాక" అని చెప్పి సమ్సోను బలముతో వంగాడు. ఆ గుడి జనుల మీదను సర్దారులందరి మీదను పడిపోయింది. ఆ గుడిలో ఉన్నవారందరు, వారితో పాటు సమ్సోను కూడా చనిపోయాడు.
సందేశము
ఎంత విచారకరమైన కథను మనము చూసాము. దేవుడు సమ్సోనుకు అధిక బలాన్ని, ఆశీర్వాదాలను, ఉపకారములను అనుగ్రహించాడు కాని సమ్సోను జ్ఞానము లేని వాడు. సమ్సోను తల్లిదండ్రులు చెప్పిన మాటలను కూడా వినలేదు. దేవుని ఆజ్ఞను వ్యతిరేకించి ఫిలిష్తీయుల స్త్రీని వివాహమాడాడు.
20 సంవత్సరములు ఇశ్రాయేలీయులకు సమ్సోను న్యాయాధిపతిగా ఉన్నాడు. తన వివాహం విచ్చిన్నమైపోయింది. మరల దెలీలా అనే ఫిలిష్తీయురాలితో స్నేహం చేశాడు. ఆమె మాటలకు విసిగి తన బలము పోగొట్టుకున్నాడు. గ్రుడ్డివాడుగా బందీ గృహములో తిరుగలి విసరు వాడుగా ఉండిపోయాడు. ఎంత బాధాకరం! కానీ సమ్సోను ఆఖరి కోరికను దేవుడు ఎంతో దయతో అంగీకరించి ఫిలిష్తీయులను చంపునట్లు చేశాడు.
అన్వయింపు
సమ్సోనుకు వలె మనకు కూడా దేవుడు ఆశీర్వాదాలను, తలాంతులను ఇచ్చాడు. దేవుని గురించి సండే స్కూల్ ద్వారా, బైబిల్ ద్వారా, తెలుసుకునే అవకాశం కూడా ఇచ్చాడు. వాటితో మనము ఏమి చేస్తున్నాము అనేది ఎంతో ముఖ్యము. ప్రభువు కోసము వాటిని ఉపయోగించగలుగు తున్నామా అని పరీక్షించు కోవాలి.
తల్లిదండ్రుల మాటలకు పిల్లలు విధేయత చూపించడం ఎంతో అవసరము. సమ్సోను తన తల్లిదండ్రుల మాటలు విని ఉంటే అతని జీవితం అంత భయంకరంగా ఉండేది కాదు. పిల్లలు తల్లిదండ్రులకు విధేయత చూపించుట దేవునికి ఇష్టం అని బైబిల్ వివరిస్తుంది. ప్రభువైన యేసు మనకు మాదిరిగా జీవించాడు. పిల్లలు తల్లిదండ్రుల మాటలు వినకుండా అవిధేయులుగా ఉండడం దేవుని ఆజ్ఞను అతిక్రమించడమే. ప్రభువు మాట వినకుండా మన దారిలో మనము వెళ్తే ఎన్నో సమస్యలు ఎదుర్కొన వలసి వస్తుంది. మనము మన ప్రయాణములో దేవుని ప్రేమను ఎన్నడూ మరచి పోకూడదు. కనుక ప్రభువు ఆజ్ఞలను, తల్లిదండ్రుల మాటలను విని విధేయత చూపించడం నేర్చుకోవాలి.
కంఠతవాక్యము
మీకు క్షేమము కలుగునట్లు నేను మీకాజ్ఞాపించుచున్నమార్గమంతటి యందు మీరు నడుచుకొనుడి (యిర్మియా 7:23).
ఆక్టివిటీస్ డౌన్లోడ్ PDF