సంఖ్యా. 13,14; ద్వితీ.1:19-46; కీర్తన 106:24-26; హెబ్రీ 3:7-19

ఉద్దేశము
అవిశ్వాసము ఎంత ప్రమాదకరమైనది అని బోధించుట.

ముఖ్యాంశము
వేగు చూచువారు అంటే ఎవరో తెలుసా? ఇతర దేశము లేదా ప్రాంతము గురించి రహస్య సమాచారం తెచ్చే వ్యక్తిని వేగు చూచువాడు అంటారు. అంటే డిటెక్టివ్ అనుకోండి. యుద్ధ సమయంలో చాలామంది శత్రు దేశపు సమాచారం రహస్యముగా తెలుసుకుని తమ దేశానికి అందిస్తారు. అలా చేయడం వలన దేశానికి విజయం సాధించడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి అని వారికి తెలుసు. ఈ రోజు కొందరు వేగులవారిని గురించి మనము తెలుసుకుందాము. వారికి అప్పగించబడిన పనిని వారు పూర్తి చేసి ఎటువంటి సమాచారం ఇచ్చారో తెలుసుకుందాం.

గతావారము
సీనాయి పర్వతం దగ్గర ఇశ్రాయేలీయులు ఒక సంవత్సరం పాటు ఉన్నారు. దేవుడు వారికి పది ఆజ్ఞలు వ్రాసిన పలకలను మోషే ద్వారా ఇచ్చాడు. మోషేకు దేవుడు చెప్పిన కొలతల ప్రకారం వారు ప్రత్యక్షపు గుడారాన్ని నిర్మించారు. ఇశ్రాయేలీయులు దేవుని ఆజ్ఞలు పాటించకుండా బంగారపు దూడను చేసుకొని పూజించినందుకు దేవుడు కోపగించి వారిలో కొందరిని చంపివేసినట్లు చూసాము. దేవుడు ఎంతో ఆగ్రహంతో ఇశ్రాయేలీయులను నశింప చేయాలని చూచినప్పుడు మోషే వారి కొరకు ప్రార్థించాడు. అప్పుడు దేవుడు వారిని నాశనము చేయకుండా అబ్రాహాము, ఇస్సాకు,యాకోబులకు తాను ప్రమాణము చేసిన వాగ్దాన దేశమునకు వారికి తోడుగా ఉండి నడిపిస్తాను అని చెప్పాడు (నిర్గమ 33:1-3).

కనాను దేశము( పొలిమేర) సరిహద్దు
ఇశ్రాయేలీయులు సీనాయి పర్వతం వదిలి ప్రయాణించవలసిన సమయం వచ్చింది. ఎప్పటివలె మేఘస్తంభము సాక్ష్యపు మందిరము మీద నుండి పైకెత్తబడగానే ఇశ్రాయేలీయులు తమ ప్రయాణం ప్రారంభించారు (సంఖ్యా. 10:11-12). వారు ఘోరమైన అరణ్యములో గుండా చాలా దినములు ప్రయాణించి దేవుడు వాగ్దానం చేసిన దేశపు సరిహద్దుకు చేరుకున్నారు (ద్వితీ 1:19). వారు చేరిన ప్రాంతము పేరు కాదేషు బర్నేయ. వారు తమకు ఎదురుగా ఉన్న కొండలను దాటితే వాగ్దాన దేశం ప్రవేశిస్తారు. ఆ కొండల అవతలి దేశము ఎలా ఉంటుంది అని ఇశ్రాయేలీయులు చాలా ఉత్సాహంగా ఎదురు చూస్తూ ఉండి ఉండవచ్చు. అప్పుడు మోషే ఇశ్రాయేలీయులను చూచి "ఇదిగో నీ దేవుడైన ప్రభువు ఈ దేశమును నీకు అప్పగించెను. నీ పితరుల దేవుడు నీతో సెలవిచ్చినట్లు దాని స్వాధీనపరచు కొనుము భయపడకుము అధైర్య పడకుము" అని చెప్పాడు.(ద్వితీ 1:21) ప్రభువు చెప్పిన మాటలను మోషే వారికి తెలియ చేశాడు కానీ వారు ముందుగా మనుష్యులను పంపి ఆ దేశపు సమాచారం తెలుసుకుని రావడం మంచిది అని సలహా ఇచ్చారు(ద్వితీ 1:22).

వేగు చూచువారిని పంపించుట
ఒక్కొక్క గోత్రం నుండి ఒకరిని ఎన్నుకొని 12 మందిని ఆ దేశమును చూచుటకు పంపారు. ఆ 12 మంది రహస్యముగా, జాగ్రత్తగా వెళ్లి ఆ దేశమును గురించిన సమాచారము తెలిసికొని తిరిగి వచ్చి వివరాలు తెలియపరచాలి. అది చాలా ప్రమాదకరమైన పని. వారిని ఎవరైనా పట్టుకుంటే చంపివేస్తారు. ఆ దేశము ఎటువంటిదో, దానిలో నివసించు జనులు బలవంతులో, బలహీనులో, వారు కొద్ది మందిగా ఉన్నారో లేదా విస్తారముగా ఉన్నారో , వారు నివసించు భూమి ఎట్టిదో అది మంచిదా చెడ్డదా, వారు నివసించు పట్టణములు ఎట్టివో వారు గుడారములలో నివసిస్తారో లేదు కోటలలో నివసిస్తారో, ఆ భూమి సారమైనదో, నిస్సారమైనదో, దానిలో చెట్లు ఉన్నవో లేదో చూచి ఆ దేశపు పండ్లలో కొన్ని తీసుకుని రావలసినదిగా మోషే ఆ 12 మందికి చెప్పి పంపించాడు.

వేగులవారు తిరిగివచ్చుట
వారు వేరువేరుగా విడిపోయి ఆ దేశంలోని అనేక ప్రాంతాలు పరిశీలించి ఉండవచ్చు . రహస్యముగా తెలిసికొన గలిగినంత సమాచారము వారు తెలుసుకున్నారు. వారు 40 దినములు ఆ దేశమును సంచరించి చూచిన తరువాత మోషే దగ్గరకు తిరిగి వచ్చారు. వారు మోషే దగ్గరకు రాగానే ఇశ్రాయేలీయుల సర్వసమాజము వారి దగ్గరకు ఎంతో ఉత్సాహముతో చేరుకున్నారు. వారు చెప్పబోయే సమాచారము వినడానికి సిద్ధంగా ఉన్నారు. అక్కడనుండి ద్రాక్ష గెలను ఇద్దరు మోసికొని తీసుకొని వచ్చారు. వారు కొన్ని దానిమ్మ పండ్లను కొన్ని అంజూరపు పండ్లను కూడా తీసుకుని వచ్చారు. వారు చూచిన విషయాలను అందరికీ చెప్పటానికి మొదలుపెట్టారు. మొదట మంచి సమాచారాన్ని చెప్పసాగారు. వారు మోషేతో, మిగిలిన వారితో -"నీవు పంపిన దేశమునకు వెళ్లితిమి. అది పాలు తేనెలు ప్రవహించు దేశమే" అని చెప్పారు. ఆ మాటలను బట్టి తినడానికి, త్రాగడానికి అవసరమైనవి అన్నీ అక్కడ ఉన్నాయి అని అర్థం చేసుకొనవచ్చు. అది అన్నీ మంచివాటితో నిండినదేశము. ఏమీ దొరకని ఎడారులు, అరణ్యప్రాంతముల గుండా వచ్చిన ఇశ్రాయేలీయులకు వారి మాటలు ఒక కల వలె అనిపించాయి. తన ప్రజలకు ప్రభువు వాగ్దానం చేసిన దేశం ఎంతో అందమైనది, సమృద్ధి గలది అని వారు గ్రహించారు.

చెడు సమాచారము
మంచి విషయాలు చెప్పిన తరువాత ఆ పన్నెండు మందిలో పదిమంది ఆ దేశం గురించి చెడ్డ సమాచారం చెప్పటం మొదలుపెట్టారు. వారు మోషేతో, మిగిలిన వారితో - "అయితే ఆ దేశములో నివసించు జనులు బలవంతులు. వారి పట్టణములు ప్రాకారముగలవి. అవి మిక్కిలి గొప్పవి మరియు అక్కడ అనాకీయులను చూచితిమి" అని చెప్పారు. 12 మందిలో ఒకడైన కాలేబు జనులను నెమ్మది పరచి - "మనము నిశ్చయముగా వెళ్ళుదుము దానిని స్వాధీనపరచు కొందుము. దాని జయించుటకు మన శక్తి చాలును" అని చెప్పాడు. కాని ఆ పది మంది తిరిగి - "ఆ మనుష్యులు ఆ జనులు మనకంటె బలవంతులు. మనము వారిమీదికి పోజాలము. మేము సంచ రించి చూచిన దేశము తన నివాసులను భక్షించు దేశము. దానిలో మాకు కనబడిన జనులందరు ఉన్నత దేహులు. మా దృష్టికి మేము మిడుతల వలె ఉంటిమి. వారి దృష్టికిని అట్లే ఉంటిమి" అని చెప్పారు. వారు చెప్పిన చెడు సమాచారము విని ఇశ్రాయేలీయులు ఆ దేశమునకు వెళ్ళకూడదని నిర్ణయించుకున్నారు.

ఇశ్రాయేలీయులు ఆ రాత్రి అంతా గట్టిగా ఏడ్చారు. వారు మోషే అహరోనుల మీద సణుగుటకు మొదలుపెట్టారు. వారందరు మోషే అహరోనులతో - "అయ్యో ఐగుప్తులో మేమేల చావలేదు? ఈ అరణ్యమందు మేమేల చావలేదు? మేము కత్తివాత పడునట్లు దేవుడు మమ్మును ఈ దేశములోనికి ఏల తీసికొని వచ్చెను? మా భార్యలు మా పిల్లలు కొల్ల పోవుదురు. తిరిగి ఐగుప్తుకు వెళ్ళుట మాకు మేలుకాదా" అని అన్నారు. వారు నాయకుని ఒకని నియమించుకొని ఐగుప్తుకు తిరిగి వెళ్ళిపోదాము అని ఒకరితో ఒకరు మాట్లాడుకున్నారు, ఎంత భయంకరం? వారు దేవుడు అప్పటివరకు తమకు చేసిన ఉపకారములన్నింటిని, సూచక క్రియలను మరచిపోయి వాగ్ధాన భూమిని స్వాధీనపరచుకోకుండా తిరిగి వెళ్లాలి అనుకోవడం ఎంత భాధకరం! మోషే అహరోనులతో పాటు 12 మందిలో ఇద్దరు అయిన యెహోషువ కాలేబులు కూడా వారి ప్రవర్తనను బట్టి ఎంతో బాధ పడ్డారు. వారు ఇరువురు ఇశ్రాయేలీయులతో - "మేము సంచరించి చూచిన దేశము మంచిదేశము. ఆ దేశ ప్రజలకు మీరు భయపడకుడి. ప్రభువు మనయందు ఆనందించిన ఎడల ఆ దేశంలో మనలను చేర్చి దానిని మనకిచ్చును" అని చెప్పారు. కాని ఇశ్రాయేలీయులు ఆ మాటలు వినకుండా వారిని రాళ్లతో కొట్టి చంపాలి అని అనుకున్నారు. ఆ సమయములో అకస్మాత్తుగా ప్రత్యక్షపు గుడారములో ప్రభువు మహిమను ఇశ్రాయేలీయులు అందరూ చూశారు.

దేవుని శిక్ష
ఇశ్రాయేలీయుల మాటలకు దేవుడు ఎలా స్పందించి ఉంటాడు?

అవును, దేవుడు ఎంతో ఆగ్రహంతో నిండిపోయాడు. దేవుడు అప్పటివరకు వారి యెడల చూపిన అపారమైన ప్రేమను మరచి, దేవుడు మాకు సహాయము చేయడు అని వారు ఎలా అనుకున్నారు? అరణ్యములో తాను ఇశ్రాయేలీయులకు చేసిన గొప్ప కార్యములు వారు మరచి వారు పదేపదే తిరుగుబాటు చేయడం దేవునికి ఆగ్రహాన్ని కలిగించింది. అంతకుముందు వలె వారిని నాశనం చేయకుండా క్షమించమని మోషే ప్రార్ధించాడు. దేవుడు వారిని నాశనం చేయలేదు గాని వారిలో ఒక్కరు కూడా వాగ్దాన దేశము చూడనే చూడరు అని చెప్పాడు. తిరిగి ఎర్ర సముద్రపు మార్గములో అరణ్యమునకు ప్రయాణమై వెళ్లుమని దేవుడు వారికి చెప్పాడు. ఆ అరణ్యములో 40 సంవత్సరములు వారు తిరుగులాడు చుందురు అని కూడా చెప్పాడు. 25 సంవత్సరముల కంటె తక్కువ వయస్సు గల వారు మాత్రమే బ్రతుకుతారు, వారు మాత్రమే వాగ్దాన దేశములొ ప్రవేశిస్తారు అని దేవుడు చెప్పాడు. దేవుని పూర్ణ మనస్సుతో అనుసరించి నందున కాలేబు, యెహోషువ మాత్రమే వాగ్దాన దేశంలో ప్రవేశిస్తారు అని దేవుడు వారికి చెప్పాడు. ఈ మాటలన్నింటిని మోషే ఇశ్రాయేలీయులకు చెప్పినప్పుడు వారు చాలా దుఃఖించారు. కాని వారిలో కొందరు అవిధేయులైన చెడ్డవారు ఉదయమున లేచి ప్రభువు మాటలకు విరోధముగా కనాను దేశము వెళ్ళుటకు మొదలుపెట్టారు.అప్పుడు ఆ కొండమీదనున్న అమాలేకీయులు కనానీయులు దిగివచ్చి వారిని కొట్టి తరిమి చంపివేసారు. ప్రభువు వారితో లేనందువలన వారు మరణించవలసి వచ్చింది. ఇశ్రాయేలీయులలో వేగు చూచిన పదిమంది యొక్క అవిశ్వాసము బట్టి వారు తెగులుతో చనిపోయారు.

సందేశము
ప్రభువు మాటలను విశ్వసించకుండా ఇశ్రాయేలీయులు శిక్షను పొందడం మనం చూశాము. ఎంత విచారకరం! దేవుడు ఇశ్రాయేలీయులకు పాలు తేనెలు ప్రవహించు కనాను దేశము స్వాస్థ్యముగా ఇస్తాను అని వాగ్దానం చేశాడు. వారు దేవుని మాటలు నమ్మకుండా పదిమంది వేగులవారి మాటలను నమ్మారు. వారి అవిశ్వాసం చూచి దేవునికి ఎంతో కోపము కలిగింది. దేవుడు వారికొరకు ఐగుప్తీయుల మీదకు తెగుళ్లు పంపి, ఎర్ర సముద్రమును పాయలుగా చేసి, మన్నాను కురిపించి, నీటిని అనుగ్రహించిన విషయాలను అన్నింటిని మరిచిపోయారు. దేవుడు యుద్ధముల న్నింటిలో తోడుగా ఉండి తమను వాగ్దాన దేశములోనికి నడిపిస్తాడు అని వీరు నమ్మవలసింది కానీ వారు అలా నమ్మనందుకు శిక్షను పొందవలసి వచ్చింది. రు మరి ఎన్నడూ వాగ్దాన భూమిలో ప్రవేశించ లేరు

అన్వయింపు
ఇశ్రాయేలీయులు ఎంతో చెడ్డవారు అని మీకు అనిపిస్తుంది కదూ! దేవుడు ఎన్నో ఉపకారాలు చేసినప్పటికీ వారికి కృతజ్ఞత లేదు. వారు విధేయతతో కనాను దేశము స్వతంత్రించుకొనవలసింది అని మనము అనుకుంటాము. కానీ మనం కూడా చాలాసార్లు ఇశ్రాయేలీయుల వలె ప్రవర్తిస్తుంటాము. ప్రతి దినము బైబిల్ ద్వారా దేవుని మాటలు వింటాము. దేవుడు ఎంతో గొప్పవాడని, మన పాపములు కడిగి వేయబడి నిత్యజీవము పొందునట్లు యేసును అనుగ్రహించాడు అని తెలుసుకుంటాము, కాని ఆ మాటలను అనుసరించి నడవడానికి ఇష్టపడము.

పాప క్షమాపణ నిమిత్తము యేసుకు ప్రార్ధన చేయకపోతే మనము కూడా ఇశ్రాయేలీయుల వలె అవిధేయులముగా ఎంచబడతాము. దేవుడు మనలను ఎంతో ప్రేమిస్తున్నాడు కనుక మనము ఆయన పిల్లలుగా ఉం డాలని ఇష్టపడుతున్నాడు. యేసును విశ్వసించి విధేయత చూపుటకు సహాయం చేయుమని ప్రార్ధించడానికి ఇష్టపడుతున్నారా?

కంఠతవాక్యము
అరణ్యములో శోధన దినమందు కోపము పుట్టించినప్పటివలె మీ హృదయములను కఠిన పరచుకొనకుడి (హెబ్రీ. 3:7,8)

ఆక్టివిటీస్ డౌన్లోడ్ PDF

 

సిరీస్ 1 - సృష్టి నుండి బాబెలు

  1. సృష్టికర్తయైన దేవుడు
  2. ఆరు దినముల సృష్టి క్రమము
  3. దేవుడు మానవుని సృజించుట
  4. దేవుడు సృష్టి కార్యమును పూర్తి చేయుట
  5. ఆదాము - హవ్వ
  6. మానవుని పతనము - పర్యవసానములు (ఫలితము)
  7. కయీను - హేబెలు
  8. నోవహు ఓడను నిర్మించుట
  9. నోవహు ఓడలోనికి వెళ్ళుట
  10. నోవహు కృతజ్ఞతార్పణ చెల్లించుట
  11. బాబెలు గోపురము

సిరీస్ 2 - అబ్రాహాము, ఇస్సాకు మరియు యాకోబు

  1. అబ్రాహాము దేవునికి విధేయత చూపుట
  2. అబ్రాహాము, లోతు - వారి ఎంపిక
  3. శారా యొక్క అవిశ్వాసము
  4. సొదొమ పట్టణములో లోతు
  5. అబ్రాహాము అబద్ధమాడుట
  6. అబ్రాహాముకు దేవుని వాగ్దానము
  7. హాగరు - ఇష్మాయేలు
  8. అబ్రాహాము విశ్వాసము పరిశోధించబడుట
  9. ఇస్సాకు వివాహము చేసికొనుట
  10. యాకోబు ఇస్సాకును మోసము చేయుట
  11. యాకోబు - నిచ్చెన
  12. యాకోబు వివాహము
  13. యాకోబు తిరిగి తన దేశమునకు వెళ్ళుట

సిరీస్ 3 - యోసేపును గురించి మరియు మోషే పుట్టుక

  1. యోసేపు స్వప్నములు
  2. యోసేపు విచిత్రపు నిలువుటంగీ
  3. పోతీఫరు గృహములో యోసేపు
  4. యోసేపు - పానదాయకుల అధిపతి, భక్ష్యకారుల అధిపతి
  5. చెరసాలలో నుండి అధికారము లోనికి
  6. యోసేపు స్వప్నములు నెరవేరుట
  7. యోసేపు తన సహోదరులను పరీక్షించుట
  8. ఐగుప్తులో యోసేపు కుటుంబము
  9. ఇశ్రాయేలు వంశము ఐగుప్తునందు అభివృద్ధి చెందుట
  10. మోషే జన్మించుట
  11. మోషే నిర్ణయము (ఎంపిక)
  12. మోషేకు దేవుని పిలుపు

సిరీస్ 4 - మోషే, ఇశ్రాయేలీయుల చరిత్ర

  1. మోషే తన పని ప్రారంభించుట
  2. ఐగుప్తు దేశము మీద తెగుళ్ళు
  3. పస్కా పండుగ
  4. ఇశ్రాయేలీయులు ఎర్రసముద్రమును దాటుట
  5. దేవుడు మన్నా కురిపించుట
  6. దేవుడు ఇశ్రాయేలీయులకు నీటిని సమకూర్చుట
  7. సీనాయి పర్వతం
  8. పది ఆజ్ఞలు
  9. బంగారు దూడ
  10. వేగులవారి సమాచారము
  11. ఇత్తడి సర్పము
  12. మోషే మరణము

సిరీస్ 5 - యెహోషువ, సమూయేలు

  1. యెహోషువ - క్రొత్త నాయకుడు
  2. జ్ఞాపక సూచకమైన రాళ్ళు
  3. రాహాబు విశ్వాసము
  4. యెరికో పట్టణము కూలిపోవుట
  5. ఆకాను పాపము
  6. గిబియోనీయులు మోసగించుట
  7. యెహోషువ వీడ్కోలు - న్యాయాధిపతుల కాలము
  8. గిద్యోను సిద్దపడుట
  9. గిద్యోను విజయము
  10. సమ్సోను
  11. సమూయేలు జన్మించుట
  12. సమూయేలును దేవుడు పిలుచుట
 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.