సౌలు జీవితము - మరణము
ఉద్దేశము
సౌలు జీవితము నుండి గమనించి నేర్చుకొనవలసిన విషయములు గమనించుట.
ముఖ్యాంశము
మీ స్కూల్ లో చాలా అల్లరి చేసే పిల్లలు ఉన్నారా? టీచర్ పాఠాలు చెప్తుంటే అల్లరి చేస్తూ ఉండవచ్చు అందరి దగ్గరకు వెళ్లి వారు వినకుండా ఇబ్బంది పెట్టవచ్చు లేదా క్లాస్ లో ఆడుకుంటూ అందరిని విసిగించవచ్చు. ఇంకా ఎక్కువ అల్లరి చేయడం మొదలు పెట్టి ఉండవచ్చు. అప్పుడు ఏమి జరుగుతుంది? టీచర్ కోపముతో ఆ విద్యార్థిని స్కూల్ నుండి బయటకు పంపి వేయవచ్చు. అలా చేసినందుకు ఎవరు టీచర్ తప్పు చేశారు అని చెప్పలేము. ఆ విద్యార్థికి సరియైన శిక్ష పడింది అని అనుకుంటారు.
నేపధ్యము
గత కొన్ని వారాలు సౌలు,దావీదు గురించి చూసాము. దావీదు ఎందుకు అరణ్యములో దాగు కొనవలసి వచ్చింది? సౌలు దావీదును చంపాలి అనుకున్నాడు గనుక దావీదు అరణ్యములో, కొండలలో, గుహలలో తిరుగవలసి వచ్చింది. సౌలు రాను రాను ఎంత చెడుస్థితికి దిగజారి పోయాడు, దానివలన ఎటువంటి పరిణామాలు ఎదుర్కొనవలసి వచ్చింది చూద్దాం.
దేవుని యెడల సౌలు రాజు యొక్క అవిధేయత (1 సమూయేలు 13:8-14; 15:10-26)
ఇశ్రాయేలీయులు తమకు రాజు కావాలి అని కోరుకున్న విషయము గుర్తుంది కదూ! వారు తమ చుట్టూ ఉన్న దేశములను చూచి వారి వలె తమకు రాజు కావాలి అని అడిగారు. వారి కోరిక దేవునికి అంగీకారముగా లేదని సమూయేలు చెప్పినప్పటికీ వారు పట్టుదలతో రాజు కావాలి అని అడిగారు. సౌలు వారికి మొదటి రాజు. సౌలు అందరికంటే ఎంతో ఎత్తుగా ఉండే అందమైన యౌవనస్థుడు. ప్రజలు కోరుకునే వాడు ఎలా ఉండాలో అలాగే సౌలు ఉన్నాడు, కానీ అతని హృదయము చెడుతనముతో నిండి ఉన్నది. సౌలు దేవుని ఆజ్ఞలను త్రోసి పుచ్చేవాడు. దేవుని మాటలు వినకుండా తనకు ఇష్టమైన రీతిలో నడిచేవాడు. సౌలు ప్రవర్తన ప్రభువుకు ఎంతో కోపం కలిగించింది. సమూయేలు సౌలు దగ్గరకు వెళ్లి - "నీవు దేవుని మాటలను త్రోసివేసితివి గనుక దేవుడు రాజుగా ఉండకుండా నిన్నుత్రోసి వేశాడు" అని చెప్పాడు. దేవుడు ఇశ్రాయేలీయుల మీద రాజుగా ఉండుటకు దావీదును ఎన్నుకున్నాడు. దేవుడు సమూయేలును బేత్లెహేమునకు పంపి దావీదును రాజుగా అభిషేకించమని ఆజ్ఞాపించాడు. అప్పటికి దావీదు చిన్నవాడు గనుక గొర్రెలను మేపేవాడు. ఇశ్రాయేలీయులకు రాజగుటకు దావీదు సౌలు మరణించువరకు వేచి ఉండవలసి వచ్చింది.
సౌలు దావీదు పై అసూయ పడుట (1 సమూయేలు 16:14-23; 18:6-9)
సౌలు అవిధేయతను బట్టి దేవుడు సౌలును విడిచి పెట్టాడు అని వ్రాయబడింది. సౌలు తనకు ఇష్టమైన మార్గాలలో ముందుకు సాగాడు గనుక దేవుని దయకు, ప్రేమకు పాత్రుడు కాడు. అతడు కారణము లేకుండా కోపము తెచ్చుకునే వాడు. దురాత్మ అతనిలో ప్రవేశించినప్పుడు దావీదు సితారను వాయించినప్పుడు సౌలు నెమ్మది పొందేవాడు.
సౌలు దావీదు పట్ల అసూయతో నిండిపోయాడు. దావీదు ఫిలిష్తీయుడైన గొల్యాతును చంపినందువలన ఇశ్రాయేలీయులందరూ అతనిని ఎంతగానో హెచ్చించి పొగడ సాగారు. దావీదు ఫిలిష్తీయుల నుండి ఇశ్రాయేలీయులను కాపాడినందుకు సౌలు మొదట సంతోషించాడు. కానీ స్త్రీలు నాట్యమాడుచు సౌలు వేల కొలది దావీదు పదివేల కొలది శత్రువులను చంపారు అని పాడుట విని సౌలు మనస్సు మారిపోయింది. దావీదును ద్వేషించుట మొదలుపెట్టాడు. తనకు బదులుగా వారు దావీదును పొగడటం సౌలుకు ఎంత మాత్రము నచ్చలేదు. ఇశ్రాయేలీయులు తనను రాజుగా ఉండకుండా తీసివేసి దావీదును తమకు రాజుగా చేసుకుంటారు అని సౌలు భయపడ్డాడు. సౌలు ఎలాగైనా దావీదును చంపాలి అని నిశ్చయించుకున్నాడు.
సౌలు దావీదును చంపుటకు ప్రయత్నించుట (1 సమూయేలు 18:10-11)
రోజు రోజుకు సౌలుకు దావీదు పట్ల ఈర్ష్య పెరిగిపోసాగింది. ఒకరోజు సౌలుకు దురాత్మ పట్టినప్పుడు దావీదు వచ్చి వాయిద్యము వాయించుచుండగా సౌలు తన ఈటను తీసి దావీదు పై విసిరాడు. దావీదు అక్కడ నుండి తప్పించుకొని పారిపోయాడు. మరొకసారి కూడా సౌలు అదే విధంగా చేశాడు. సౌలు తనను ఖచ్చితముగా చంపుతాడు అని దావీదు అర్థము చేసుకున్నాడు. సౌలు చంపక ముందే అక్కడ నుండి పారిపొమ్మని దావీదు భార్య అయిన మీకాలు, స్నేహితుడైన యోనాతాను బలవంత పెట్టారు. దావీదు తప్పించుకొనుటకు వారు ఇరువురు సహాయము చేశారు. దావీదు ఎటువంటి తప్పు చేయకపోయినా చంపాలి అనుకోవడం సౌలు యొక్క చెడుతనాన్ని చూపిస్తుంది. దావీదు తన ప్రాణము కాపాడుకోవడం కోసం పారిపోయి అరణ్యములో, కొండలలో,గుహలలో తిరుగవలసి వచ్చింది.
సౌలు దేవుని ప్రవక్తలను చంపించుట (1 సమూయేలు 22:9-18)
సౌలు దావీదును వెదకుచు అనేక ప్రాంతాలు తిరిగాడు నోబు లో ఉన్న అహీమెలెకు అను యాజకుని దగ్గరకు దావీదు వెళ్లాడు అని సౌలుకు సమాచారం వచ్చింది. అహీమెలెకు దావీదును ఎంతో దయతో తన దగ్గరకు వచ్చినప్పుడు రొట్టెలు మరియు దావీదుకు అవసరమైన కొన్ని వస్తువులు ఇచ్చాడు. ఈ విషయము తెలిసిన సౌలు అహీమెలెకును అతని కుటుంబపు వారిని, ఇంకను 85 మంది యాజకులను చంపించాడు. ఎటువంటి పొరపాటు చేయని వారిని చంపించటం సౌలులోని చెడుతనాన్ని మనకు స్పష్టంగా చూపుతుంది. ప్రభువును ప్రేమించి ఆయన మార్గాలను ప్రజలకు బోధించేవారైన యాజకులను చంపించటం ఎంత భయంకరం! కానీ సౌలు మనస్సులో ఈ విషయాలేవీ లేవు కానీ సౌలుకు ఉన్న ఒకే ఒక ఆలోచన దావీదును చంపడం. దావీదుకు సహాయము చేసిన వారెవరైనా తనకు శత్రువులే అని సౌలు భావించాడు. సౌలు హృదయములోని పాపము రోజురోజుకు పెరుగుతూనే ఉంది. సౌలు తన యాజకులను చంపుట దేవునికి ఎంతగానో కోపము కలిగించింది.
సౌలు దావీదును తరుముట(1 సమూయేలు 23:14- 24; 22; 26 అధ్యాయాలు)
దావీదు అరణ్యములో పర్వతములలో దాగి ఉన్నాడని సౌలు తెలుసుకొని అక్కడకు వెళ్లాడు. ఏ విధముగానైనను సరే దావీదును పట్టుకొనవలననే సంకల్పముతో సౌలు మూడువేల మంది సైనికులను వెంటబెట్టుకొని వెళ్ళాడు. దావీదు, తాను సౌలు చేతిలో మరణము కాబోతున్నాను అని అనేక మారులు భయపడేవాడు, కానీ ప్రభువు అతనికి తోడుగా ఉండి కాపాడేవాడు.
అటువంటి కష్టమైన పరిస్థితులలో దేవుని యందు విశ్వాసముంచుటకు దావీదు నేర్చుకున్నాడు. సౌలును చంపుటకు దావీదుకు రెండుసార్లు అవకాశము కలిగింది. ఒకసారి సైనికులు ఎవరూ సౌలు దగ్గర లేనప్పుడు, రెండవసారి సౌలు రాత్రివేళ నిద్రిస్తున్నప్పుడు. కానీ దేవుడు అభిషేకించిన వానికి కీడు చేయకూడదు అని దావీదు తలంచి సౌలును ముట్టుకొనలేదు. ఆ రెండు సమయాలలో సౌలు పశ్చాత్తాప పడినట్లు నటించాడు కానీ అది మాటలలోనే గానీ సౌలు హృదయములో ఎటువంటి మార్పు రాలేదు. దావీదు సౌలును తప్పించుకొనుటకు వేరొక దేశమునకు పారిపోయి అక్కడ నివసించ సాగాడు. సౌలు దావీదును తరుమలేక తిరిగి తన ఇంటికి వెళ్లిపోయాడు.
సౌలు కర్ణపిశాచి గల స్త్రీ యొద్దకు వెళ్ళుట (1 సమూయేలు 28:7-25)
కొంత కాలము తరువాత ఫిలిష్తీయులు మరలా ఇశ్రాయేలు దేశము మీదికి యుద్ధమునకు రాగా సౌలు తన సైన్యముతో యుద్ధమునకు సిద్ధపడసాగాడు. సౌలు యుద్ధము గురించిన భయముతో ఏమి జరగబోతున్నది తెలుసుకోవాలి అనుకున్నాడు. దేవుని దగ్గరకు వెళ్లి ఎంతగా విచారించినా దేవుడు ప్రత్యుత్తరమీయలేదు. అన్ని విషయాలలో దేవునికి వ్యతిరేకంగా నడచిన సౌలు దేవుని దగ్గర విచారించడం ఎంతో హాస్యాస్పదం.
సౌలు తరువాత ఒక చెడ్డ పని చేయుటకు పూనుకున్నాడు. రాజు వలె కాక ఒక సామాన్యుని వలె మారువేషముతో కర్ణపిశాచము గల స్త్రీ దగ్గరకు వెళ్ళాడు. శకునములు చూచి తనకు ఏమి జరగబోతున్నది తెలియచేయుమని ఆ స్త్రీని అడిగాడు. శకునములు చూచుట కర్ణపిశాచి గల వారి వద్దకు వెళ్లి అడుగుట పాపము అని దేవుడు స్పష్టముగా తెలిపాడు. కానీ సౌలు ఎప్పటి వలె దేవుని మాటలకు అవిధేయత చూపాడు. ఆమె శకునముల ద్వారా చెప్పిన మాటలు విని సౌలు ఎంతగానో భయపడిపోయాడు. ఆ మరుసటి దినము యుద్ధములో సౌలు మరణిస్తాడు అని ఆ స్త్రీ చెప్పింది. సౌలు తన పాపములోనే జీవిస్తూ, దేవునికి ఎంతో దూరంగా వెళ్లిపోయాడు. ఎటువంటి ఆశ లేని పరిస్థితులలో మిగిలిపోయాడు.
సౌలు మరణించుట (1 సమూయేలు 31:1-5)
సౌలు తన సైన్యముతో ఫిలిష్తీయులపై యుద్ధానికి వెళ్ళాడు. అందులో ఇశ్రాయేలు సైనికులు చాలామంది చనిపోయారు. సౌలు బహుగా గాయపరచబడి, తనను చంపుమని ఆయుధములు మోయు వానిని అడిగాడు. కానీ అతడు దానికి ఒప్పుకొనలేదు. అప్పుడు సౌలు తన కత్తి పట్టుకొని దాని మీద పడినప్పుడు అతడు మరణించాడు. సౌలు భయంకరంగా జీవించాడు, భయంకరంగా మరణించాడు.
సందేశము
బైబిల్ లో వ్రాయబడిన దుష్ట హృదయం గల వారిలో సౌలు ఒకడు. ప్రభువైన యేసు సమయములో కూడా ఒక చెడుతనము గల వ్యక్తి ఉన్నాడు. అతడే ఇస్కరియోతు యూదా. ఇస్కరియోతు యూదా యేసును యూదా అధికారులకు అప్పగించి వారి దగ్గర ధనము తీసుకున్నాడు. యూదా కూడా సౌలు వలె తనను తాను చంపుకొని ప్రాణము విడిచాడు.
ప్రారంభములో సౌలు అన్ని కలిగి ఉన్నాడు కానీ దేవుని పట్ల కృతజ్ఞత లేకపోగా, ఎంతో అవిధేయుడుగా జీవించాడు. ఎన్నడూ తనను క్షమించి, తన హృదయము మార్చమని దేవుని అడుగలేదు. అతని హృదయము అసూయ, ద్వేషము, క్రూరత్వముతో నిండిపోయింది. కర్ణపిశాచము గల స్త్రీని దర్శించుట ద్వారా సాతాను క్రియలు చేయువాడిగా ఎంచబడ్డాడు. చివరకు తనను తాను చంపుకున్నాడు. సౌలు మరణించాడు కానీ ఒక దినము ప్రభువు యొక్క తీర్పును ఎదుర్కొనవలసిన వాడై ఉన్నాడు. ప్రతివాడు తన గ్రంథములలో వ్రాయబడిన విధముగా తన క్రియలకు ప్రతిఫలము పొందును( ప్రకటన20:12) అని బైబిల్ లో వ్రాయబడింది.
అన్వయింపు
సౌలు వలె ఉండాలి అని మనలో ఎవరు ఆశపడరు కదా! మనము చిన్న వయస్సులోనే ప్రభువుకు విధేయత చూపుట నేర్చుకోవాలి. సౌలు వలె దేవుని ఆజ్ఞలు అతిక్రమించకూడదు. మన హృదయములోని పాపమును నిర్లక్ష్యము చేస్తే అది పెరుగుతూ పెరుగుతూ మనలను దేవునికి దూరము చేస్తుంది.
సందీప్ ప్రతివారము సండే స్కూల్ కి వెళ్లేవాడు. ఒకసారి సండే స్కూల్ లో పెన్ను దొంగిలిస్తూ దొరికిపోయాడు. అప్పుడు టీచర్ సందీప్ చేసిన పొరపాటుకు దేవుని క్షమాపణ అడగమని చెప్పింది. కానీ సందీప్ టీచర్ మాటలు పట్టించుకోకుండా తనకు ఇష్టము వచ్చినట్లు ఉండేవాడు. 18 సంవత్సరముల వయస్సులో సందీప్ ఒక పెద్ద దొంగతనం చేస్తూ దొరికిపోయి జైలుకు వెళ్ళవలసి వచ్చింది. మనము పాపము చేసినప్పుడు క్షమించమని దేవుని అడగాలి. మనము నిజముగా పశ్చాత్తాప పడి యదార్థముగా క్షమించమని అడిగినప్పుడు ప్రభువైన యేసు మనలను తప్పక క్షమిస్తాడు. మన పాప క్షమాపణ కొరకు యేసు సిలువలో తన ప్రాణము పెట్టాడు. ఆయనను ప్రేమించి లోబడునట్లుగా మనకు నూతన హృదయాలను యేసు ఇవ్వగలడు.
పాపమునకు, సాతానుకు మనము లోబడకుండా ఆయన మనలను కాపాడగలడు. మనము క్రైస్తవులమైన తరువాత పరలోకములో ప్రభువైన యేసుతో కలిసి ఉండే దినము కొరకు ఎంతో సంతోషంగా ఎదురు చూస్తుంటాము. సౌలు వలె జీవించి దేవునికి దూరమైపోకుండునట్లు మనము జాగ్రత్తపడాలి.
కంఠతవాక్యము
పాపము పరిపక్వమై మరణమును కనును (యాకోబు 1:15)
ఆక్టివిటీస్ డౌన్లోడ్ PDF

