విమర్శలకు జవాబు

రచయిత: కె విద్యా సాగర్

ఆడియో

దేవుడు అనగానే, మంచివాడై ఉండాలి; ఆయనలో ఎటువంటి వివక్ష, పక్షపాతం ఉండకూడదనే కనీస అవగాహన దాదాపుగా అందరికీ ఉంటుంది. ఈ అవగాహనతో ఆధునిక ప్రపంచం అభివృద్ధి చెందాక ప్రపంచంలో దేవుళ్ళుగా కొలవబడుతున్న ఎందరిపైనో ఆయా భావజాలాలకు సంబంధించినవారి నుండి ఎన్నో విమర్శలు సంధించబడ్డాయి. వారిపైన చేయబడ్డ విమర్శలను పక్కనపెడితే, బైబిల్ గ్రంథం పరిశుద్ధుడిగా, అన్యాయం చెయ్యని న్యాయవంతుడిగా ప్రకటిస్తున్న త్రియేక దేవునిపైన కూడా మిగిలిన దేవుళ్ళుగా చలామణి ఔతున్నవారిపై మించిన  విమర్శలు చేయబడ్డాయి, చేయబడుతున్నాయి.

ఈ తరుణంలో, క్రైస్తవసంఘం ప్రతీవిమర్శనూ పరిశుద్ధాత్మ శక్తితో ఎదుర్కొంటూ, బైబిల్ దేవుని పరిశుద్ధతనూ, న్యాయాన్నీ చాటిచెప్పింది, చెబుతూనే ఉంది. న్యాయబద్ధంగా విమర్శించడాన్ని క్రైస్తవ సంఘం ఎప్పుడూ చులకనగా చూడలేదు, వాటినుండి తప్పించుకోనూ లేదు. ఎందుకంటే, హేతువు అడిగే ప్రతీవారికీ సమాధానం చెప్పమని సంఘానికి (మనకు)  బైబిల్ ఆజ్ఞాపిస్తుంది (1 పేతురు 3:15). అదేవిధంగా సందేహపడేవారిపై కనికరం చూపవలసిన బాధ్యత కూడా మనపై ఉంది (యూదా 1:22).

అలా అని, వారికి అనుకూలంగా లేని ప్రతీదీ తప్పు ఐనట్టుగా, కొందరు చేసే విమర్శలను మనం పట్టించుకోవలసిన అవసరం లేదు. ఉదాహరణకు, మన సమాజంలో స్త్రీవాదులుగా పిలవబడే ఒక గుంపు గురించి మనకు తెలుసు. వీరు పైకి మేము స్త్రీలహక్కుల కోసం పోరాడేవారమని చెబుతుంటారు కానీ వీరి లోపలి ఉద్దేశం వేరే ఉండి, సమయం వచ్చినపుడల్లా దానిని బయటపెడుతుంటారు. వాస్తవానికి స్త్రీలకు అన్యాయం జరుగుతుంటే వారి తరపున పోరాడడం మన బాధ్యత, ఎందుకంటే వారు కూడా దేవుని పోలిక, దేవుని స్వరూపంలో చేయబడ్డ మనుషులే కాబట్టి.

అదేవిధంగా, 1 కొరింథీయులు 11:11 వాక్యభాగంలో 'అయితే ప్రభువునందు స్త్రీకి వేరుగా పురుషుడు లేడు పురుషునికి వేరుగా స్త్రీలేదు' అని స్పష్టంగా రాయబడి ఉండడం మనకు కనిపిస్తుంది.

కానీ ఈ స్త్రీవాదులు చేసే పోరాటాలూ, విమర్శలు అలా ఉండవు. వారు కేవలం తమ జెండర్ ను మాత్రమే ఉన్నతంగా చూపుకుంటూ, అదే దేవుని పోలిక, దేవుని స్వరూపంలో చేయబడిన పురుషులను మాత్రం చిన్నచూపు చూస్తుంటారు, వారిని విపరీతంగా ద్వేషిస్తారు. చివరికి కొందరు స్త్రీలు పురుషులపై చేస్తున్న దాడులను కూడా ఏవో కారణాలను చెబుతూ దుర్మార్గంగా సమర్థిస్తుంటారు. అవే కారణాలను పురుషులు చేసే దాడులకు మాత్రం ఆపాదించరు.

ఎందుకంటే స్త్రీ నేరస్తులకు పురుషులతో పాటుగా సమాన శిక్షలు పడితే వీరు ఎంతమాత్రం సహించలేరు. అందుకే స్త్రీలు చేస్తున్న నేరాలగురించి నోరు మెదపకుండా, ఒకవేళ వాటిగురించి మాట్లాడినా ఏదోలా వాటిని సమర్థించుకుంటూ, మొత్తంమీద స్త్రీలపై మాత్రమే దాడులు జరుగుతున్నట్టుగా హడావుడి చేస్తుంటారు. ఒకవైపు మేము పురుషులతో పాటు సమానహక్కుల కోసం పోరాడుతున్నామని అంటూనే, పురుషులతో పాటు సమాన బాధ్యతలు, సమాన శిక్షలు తీసుకోకుండా చివరికి మేమే దైవాలమని కూడా ప్రకటించుకుంటుంటారు. వీరి ప్రగల్భాలూ, ప్రవర్తనలూ చూస్తుంటే నాకు తూరు రాజు, పురుగులు పడి చచ్చిన హేరోదులు జ్ఞాపకం వస్తుంటారు.

యెహెజ్కేలు 28:2 - నరపుత్రుడా, తూరు అధిపతితో ఈలాగు ప్రకటింపుము ప్రభువగు యెహోవా సెలవిచ్చునదేమనగా గర్విష్ఠుడవై నేనొక దేవతను, దేవతనైనట్టు సముద్రము మధ్యను నేను ఆసీనుడనైయున్నాను అని నీవనుకొనుచున్నావు; నీవు దేవుడవు కాక మానవుడవైయుండియు దేవునికి తగినంత అభిప్రాయము కలిగియున్నావు.

అపొ. కార్యములు 12:21-23 - నియమింపబడిన దినమందు హేరోదు రాజవస్త్రములు ధరించుకొని న్యాయపీఠము మీద కూర్చుండి వారి యెదుట ఉపన్యాసము చేయగా జనులు ఇది దైవస్వరమే కాని మానవస్వరము కాదని కేకలు వేసిరి. అతడు దేవుని మహిమపరచనందున వెంటనే ప్రభువు దూత అతని మొత్తెను గనుక పురుగులు పడి ప్రాణము విడిచెను. 

ఈవిధంగా మనుషులమని మర్చిపోతూ దుర్మార్గంగా స్త్రీల నేరాలను సమర్థించుకుంటూ, పురుషులపై విరుచుకుపడే వీరు కూడా బైబిల్ పైన కొన్ని చొప్పదంటు ఆరోపణలు చేస్తుంటారు (వీరిని సంతోషపెట్టడానికి మరికొందరు కూడా అలా చేస్తుంటారు). ఉదాహరణకు వీరిలో కొందరు దేవుడు కనాను ప్రాంతపు ప్రజలను నాశనం చెయ్యమని ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించినప్పుడు అక్కడున్న స్త్రీలను కూడా చంపేయమన్నాడు. ఇది స్త్రీలపై వివక్ష కాదా అంటూ వాపోతారు. ఆయన ఆ సందర్భంలో కేవలం స్త్రీలను మాత్రమే చంపమంటే, ఆవిధంగా ఆలోచించే అవకాశం ఉందేమో కానీ అక్కడ ఆయన పురుషులతో పాటుగా స్త్రీలనూ చంపమని చెబుతున్నాడు (వారిలో ఎవరూ కూడా నిర్దోషులు లేరు - లేవీకాండము 18:25). దీనిని‌ బట్టి ఆ విమర్శలో ఎంత కుయుక్తి దాగుందో మీరే గ్రహించండి.

బహుశా వీరు దానికోసం అంతగా వాపోతున్నారంటే వీరు పోరాడుతున్నట్టుగా స్త్రీ పురుషుడికి సమానం కాదేమో? అందుకే పురుషుడితో పాటుగా సమానంగా శిక్షించకుండా జాలి చూపించాలేమో? (సమానత్వం ముసుగులో వారి మనసులో కొలువైన కుయుక్తి  మనకిక్కడ అర్థమౌతుంది). కానీ, బైబిల్ దేవుడు ఇద్దరినీ, వారు చేసే నేరాలనీ సమానంగా చూసాడు‌ కాబట్టి అలా చంపేయమన్నాడు (శిక్షించమన్నాడు).

అదేవిధంగా పౌలు, భార్యలారా మీ భర్తలకు లోబడి ఉండమని చెప్పడం ఎఫెసీ 5:22 వాక్యభాగంలో మనకు కనిపిస్తుంది. వీరిలో కొందరు దీనిని కూడా పట్టుకుని ఇదేదో స్త్రీని బానిసగా మార్చేలా ఉందన్నట్టు పౌలుపై విరుచుకు పడుతుంటారు. పౌలు ఆ సందర్భంలో లోబడడం అంటే అర్థం ఏమిటో క్రీస్తుతో  పోలుస్తూ వివరిస్తున్నాడు. ఒకవేళ ఆ పోలికను పక్కన పెట్టి చూసినా అదే పౌలు ఆ క్రింది వచనాలలోనే మీ భార్యలను మీ శరీరంవలే ప్రేమించండి, క్రీస్తువలే వారికోసం ప్రాణం పెట్టండని పురుషులకు కూడా చెబుతున్నాడు. భర్తకు లోబడమని చెప్పడం స్త్రీని బానిసగా మార్చడమే అయితే, నీ భార్యను నీ శరీరం‌వలే ప్రేమించమనడం, ఆమెకోసం క్రీస్తువలే ప్రాణం పెట్టమనడం ఏమౌతుంది? భర్తకు లోబడని భార్య కోసం ప్రాణం పెట్టేంతలా ప్రేమించే అవసరం అతనికేముంది?

వీరు బైబిల్ పై చేసే విమర్శలు చాలామట్టుకు ఈవిధంగానే కుయుక్తిగా సగం‌ సగం పట్టుకుని వ్రేలాడేవిలా ఉంటాయి. ఇటువంటి పనికిమాలిన విమర్శల‌ విషయంలో మనం ఏమాత్రం మన సమయం వృథా చేసుకోకుండా వాటిని చెత్తకుండీలోకి నెట్టేయ్యొచ్చు. అయితే, వీరిలో కొందరు  బైబిల్ గ్రంథంలో స్త్రీలపై వివక్ష చూపబడినట్టుగా కనిపించే కొన్ని వాక్యభాగాల ఆధారంగా కనుక అటువంటి విమర్శలు‌చేస్తే వారలా చెయ్యడంలో ఉద్దేశం ఏమైనప్పటికీ, వాటికి తప్పకుండా మనం జవాబుదారులుగా ఉండాలి.

మనమలా ఉండడం వల్ల వారి నోర్లను మూయించడమే కాదు, వారి మాటల వల్ల సందేహానికి గురయ్యే మరికొందరికి కూడా వివరణ ఇచ్చి సహాయం చేసినవారం ఔతాము. (కేవలం స్త్రీలపైన మాత్రమే కాదు, ఇటువంటి విమర్శలు ఎవరి విషయంలో చేయబడ్డా వాటికి మనం స్పందించాలి. ఎందుకంటే వివక్ష కేవలం స్త్రీలపై చూపినపుడు  మాత్రమే అన్యాయం కాదు, అది ఎవరిపట్ల జరిగినా అన్యాయమే). అటువంటివాటిలో ఒక విమర్శను మనమిక్కడ చూద్దాం -

ద్వితీయోపదేశకాండము 22:13-17 - ఒకడు స్త్రీని పెండ్లి చేసికొని ఆమెను కూడిన తరువాత ఆమెను ఒల్లక ఆమె మీద అవమాన క్రియలు మోపి ఆమె చెడ్డదని ప్రచురపరచి ఈ స్త్రీని నేను పరిగ్రహించి యీమె దగ్గరకు వచ్చినప్పుడు ఈమెయందు కన్యాత్వము నాకు కనబడలేదని చెప్పిన యెడల ఆ చిన్నదాని తలిదండ్రులు ద్వారమందున్న ఆ ఊరిపెద్దల యొద్దకు ఆ చిన్నదాని కన్యాత్వలక్షణములను తీసికొని రావలెను. అప్పుడు ఆ చిన్నదాని తండ్రి నా కుమార్తెను ఈ మనుష్యునికి పెండ్లి చేయగా ఇదిగో ఇతడీమె నొల్లకనీ కుమార్తెయందు కన్యాత్వము నాకు కనబడలేదనియు అవమానక్రియలు చేసినదనియు ఆమెమీద నింద మోపెను; అయితే నా కుమార్తె కన్యాత్వమునకు గురుతులివే అని పెద్దలతో చెప్పి పట్టణపుపెద్దల యెదుట ఆ బట్టను పరచవలెను.  

ఈ సందర్భంలో, ఒక భర్త తన భార్యను ద్వేషించి ఆమె శీలంపై ఆరోపణ చేస్తున్నట్టు ఆ ఆరోపణను నిర్వీర్యం చేయడానికి ఆమె తల్లితండ్రులు వారు తొలిరాత్రి కలిసినప్పటి రక్తపు మరకలున్న వస్త్రాన్ని తీసుకువచ్చి పెద్దలముందు సాక్ష్యంగా చూపించి అతడిని ఒప్పిస్తున్నట్టు కనిపిస్తుంది. ప్రస్తుతం మనమున్న సామాజిక పరిస్థితులను బట్టి చూస్తే ఈ పద్ధతి స్త్రీలను అవమానించేట్టుగానే ఉంది, అంతమాత్రమే కాకుండా ఈ పద్ధతి ద్వారా దేవుడు, భార్య శీలంపై ఆరోపించే అవకాశం భర్తకు కల్పించినట్టు, భర్త శీలంపై ఆరోపించే అవకాశం భార్యకు కల్పించడం లేదు.

మరొక ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే, కొందరు స్త్రీలు పెళ్ళికి ముందు పురుషసంయోగం ఎరుగకున్నా, భారమైన పనులు చేసినపుడూ, ఏదైనా తీవ్రమైన భయానికి లోనైనపుడూ, వారి కండరాల్లో జరిగే మార్పుల వల్ల మొదటిరాత్రి వారికి రక్తస్రావం అవ్వకపోవచ్చు. ఆవిధమైన అనుభవాలు కలిగిన స్త్రీలు పైన మనం చూసిన పద్ధతిలో చెప్పబడినట్టుగా తమ కన్యాత్వానికి రుజువులు చూపించలేరు. కాబట్టి భర్త చేసిన ఆ ఆరోపణ కారణంగా 21వ వచనం ప్రకారం రాళ్ళతో కొట్టబడి అన్యాయంగా చంపబడతారు. ఇటువంటి ఒక పద్ధతిని దేవుడు మోషే ధర్మశాస్త్రంలో రాయించాడు కాబట్టి దీని ప్రకారం బైబిల్ లో స్త్రీపై లింగవివక్ష చూపబడింది అనేదే మనముందున్న ఆరోపణ. దీనికి వరుసగా సమాధానం చూద్దాం.

కొందరు బోధకులు దీనికి సమాధానం చెబుతూ, ఇది క్రొత్తగా దేవుడు ప్రవేశపెట్టింది కాదనీ, చుట్టుపక్కల ప్రాంతాలలో అప్పటికే అమలులో ఉందని వివరణ ఇచ్చారు. అది వాస్తవమే అయినప్పటికీ దానిని మన దేవుడు కూడా ఎందుకు అనుమతించాడో, ఎటువంటి పరిధులతో అనుమతించాడో లేఖనాల ఆధారంగా మరింత వివరణ ఇవ్వవలసిన అవసరం‌ ఉంది కాబట్టే నేను దీనిని రాస్తున్నాను.

1. ఈ పద్ధతిద్వారా భార్య శీలంపై ఆరోపణ చేసే అవకాశం భర్తకు ఉన్నట్టు భర్త శీలంపై ఆరోపణ చేసే అవకాశం భార్యకు ఎందుకు లేదంటే, అప్పటి సమాజ పరిస్థితులను బట్టి దేవుడు దీనిని స్త్రీలకే భద్రతగా అనుమతించాడు (దీనిపై ఉత్పన్నమయ్యే మరో‌ ప్రశ్నకు క్రింద సమాధానం చూద్దాం). వాస్తవానికి మోషే ధర్మశాస్త్రంలో భార్యలకు శీలపరీక్ష చేసే ఒక పద్ధతి ఉంది కాబట్టి, భర్తలు అనుమానానికి లోనై దానిని‌ ఆశ్రయించడం లేదు. కొందరు భర్తలలో సాధారణంగా కలిగే ఆ అనుమానాన్ని తొలగించడానికే ఆయన దీనిని అనుమతించాడు. దీనిగురించి ముందు ముందు మరింత‌ వివరంగా చూద్దాం.

అలాగని పురుషుడి శీలానికి ప్రాముఖ్యత లేదా అంటే ఖచ్చితంగా ఉంది కాబట్టే ఇదే మోషే ధర్మశాస్త్రంలో వ్యభిచరించినవారిని రాళ్ళతో కొట్టి చంపమని ఆయన ఆజ్ఞాపించాడు. ఎందుకంటే;

1 కోరింథీయులకు 7:4 భర్తకేగాని భార్యకు తన దేహముపైని అధికారము లేదు; ఆలాగున భార్యకే గాని భర్తకు తన దేహముపైని అధికారము లేదు.

ఒకవేళ పురుషుడి శీలానికి ప్రాముఖ్యతే లేకపోతే వ్యభిచారం చేసిన పురుషుడిని చంపవలసిన అవసరత లేదు, స్త్రీని మాత్రమే చంపితే సరిపోతుంది. కాబట్టి పెళ్ళికి ముందు పురుషుడు తన శీలాన్ని కోల్పోయినా శిక్షించబడతాడు లేక, పెళ్ళి తరువాతైనా తన భార్య వేరేవిధంగా దానిని నిరూపించగలిగితే అతనికి శిక్ష తప్పదు. ఇశ్రాయేలీయుల‌ జాతికి చెందిన ఒక స్త్రీ తన భర్త శీలంపై అనుమానం కలిగితే అతనిని కూడా ఎలా పరీక్షించగలదో క్రింద చూద్దాం.

2. మోషే ధర్మశాస్త్రంలోని ఈ పద్ధతి విషయంలో మనం ప్రాముఖ్యంగా గుర్తించవలసిన విషయం ఏమిటంటే, దీనిని దేవుడు ప్రతీ పురుషుడూ తన భార్య విషయంలో తప్పనిసరిగా అనుసరించవలసిన క్రమంగా అనుమతించలేదు. కేవలం ఏ భర్తయైతే అనుమానపు వైఖరి కలిగి ప్రవర్తిస్తుంటాడో అతని గురించి మాత్రమే దీనిని అనుమతించాడు. ఉదాహరణకు ఈ వచనం చూడండి -

మత్తయి సువార్త 19:7,8 - అందుకు వారు ఆలాగైతే పరిత్యాగ పత్రికనిచ్చి ఆమెను విడనాడుమని మోషే యెందుకు ఆజ్ఞాపించెనని వారాయనను అడుగగా ఆయన మీ హృదయకాఠిన్యమును బట్టి మీ భార్యలను విడనాడ మోషే సెలవిచ్చెను గాని ఆది నుండి ఆలాగు జరుగలేదు.

ఈ సందర్భంలో యేసుక్రీస్తు మాటల ప్రకారం మోషే ధర్మశాస్త్రంలోని పరిత్యాగ పద్ధతిని దేవుడు ఇశ్రాయేలీయుల హృదయకాఠిన్యం (క్షమించలేనితనం) బట్టి అనుమతించాడే తప్ప, భార్యాభర్తలు విడిపోవడం ఆయనకు ఇష్టం కాదు (ద్వితీయోపదేశ కాండము 24-1‌). ఇందులో కూడా ఊరికే భార్యను విడిచిపెట్టే అవకాశం లేదు, కచ్చితంగా ఆమెలో‌ ఏదైనా పొరపాటు ఉండి దానివల్ల ఆ భర్తకు ఆమెపై ఇష్టంపోతే మాత్రమే ఆమెను విడిచిపెట్టమన్నాడు.

అప్పటి కొందరు భర్తల్లో తమ భార్యల శీలంపై ఉండే అనుమానపు వైఖరిని బట్టి, అతను ఆ విషయంలో సత్యాన్ని తెలుసుకుని తన భార్యతో రాజీపడకపోతే, అదే అనుమానంతో ఆమెను పదేపదే ఇబ్బంది పెడతాడు లేదా ఆమెను విడిచిపెట్టి ఒంటరిని చేస్తాడు. కాబట్టే దేవుడు శీలపరీక్ష పద్ధతిని కూడా మోషే ధర్మశాస్త్రంలో అనుమతించి అతని అనుమానాన్ని నిర్వీర్యం చేస్తున్నాడు. ఈ రోజుల్లో ఎంతమంది భార్యలు అనుమానంతో తమ భర్తలను వేధించడం లేదు? ఆ భర్తలు కూడా ఇటువంటి అనుమానపు పిశాచులే. అందుకే ఆయన ఈ పద్ధతిని స్త్రీకి భద్రతగా అనుమతించాడని పైన జ్ఞాపకం చేసాను.

ఇప్పుడు మీకు, స్త్రీకి‌ భద్రత కల్పించాలన్నదే బైబిల్ దేవుని‌ ఉద్దేశమైతే, ఇలాంటి పద్ధతిని అనుమతించడం ఎందుకు, మీ భార్యలను అనుమానించవద్దని చెప్పి అలా చేసినవారికి శిక్ష విధిస్తే సరిపోతుందిగా అనిపించవచ్చు. ప్రతీ పురుషుడూ అమాయకురాలైన భార్యనే అనుమానిస్తుంటే ఆయన ఇలాగే చేసేవాడేమో కానీ కొన్నిసార్లు అవతలివారి ప్రవర్తనను బట్టి కూడా అనుమానం కలుగుతుంది. అప్పుడు కూడా ఆ భర్త అనుమానించకుండా ఉండాలా మరి? అలా అయితే కొందరు స్త్రీలు అమాయకులపై కూడా గృహహింస, లైంగిక వేధింపుల కేసులు పెడుతున్నారు కాబట్టి, ఆ చట్టాలను కూడా తీసెయ్యాలి మరి.

కాబట్టి ఈ పద్ధతిని మనం అమాయకురాలైన స్త్రీకి భద్రతనిచ్చేదిగా, శీలాన్ని కోల్పోయిన భార్యకు శిక్ష విధించేదిగా అర్థం చేసుకోవాలి. ఈ పద్ధతిని దేవుడు స్త్రీకి భద్రతగా అనుమతించాడు కాబట్టే నిర్దోషియైన భార్యతో ఇకపై జాగ్రతగా నడుచుకోవాలని ఆజ్ఞాపిస్తున్నాడు.

ద్వితీయోపదేశ కాండము 22:19 - అతడు తాను బ్రదుకు దినములన్నిటను ఆమెను విడువకూడదు.

అంతమాత్రమే కాదు దోషం చెయ్యని ఆమెను అలా అనుమానించి, అవమానించినందుకు ఆ భర్తకు శిక్షను కూడా విధిస్తున్నాడు.

ద్వితీయోపదేశ కాండము 22:18,19 - అప్పుడు ఆ ఊరిపెద్దలు ఆ మనుష్యుని పట్టుకొని శిక్షించి నూరు వెండి రూకలు అపరాధముగా వానియొద్ద తీసికొని ఆ చిన్నదాని తండ్రికియ్యవలెను. ఏలయనగా అతడు ఇశ్రాయేలీయురాలైన కన్యకను అవమానపరచియున్నాడు.

దీనిప్రకారం, నిర్దోషి అయిన భార్యను ఒక భర్త అనుమానించి, అవమానించినందుకు అతనిపై శిక్ష మరియు నష్టపరిహారం మోపబడింది. ఇది దోషం చెయ్యని స్త్రీలకు భద్రత కాదా?. ఇప్పుడు స్త్రీవాదులకు ఒక ప్రశ్న ప్రస్తుతం గృహహింస కేసుల్లో ఎంతోమంది భార్యలు నిర్దోషి అయిన భర్తలను దోషులుగా ఆరోపించి ఇరికిస్తున్నారు, అవమానిస్తున్నారు. అలా చేసినవారికి ఏమన్నా శిక్షలు పడుతున్నాయా? మీరెందుకని వీటిపై పోరాడరు?

వారిద్దరూ, భార్యాభర్తలుగా మళ్ళీ కలసి జీవించాలి కాబట్టి, దేవుడు ఆ అనుమానపు భర్తకు కేవలం ఏదో ఒక శిక్ష, నష్టపరిహారంతో సరిపెట్టాడు కానీ, అదే బయటి వ్యక్తి కనుక మరొకరిపై ఉద్దేశపూర్వకంగా అబద్ధపు ఆరోపణ చేస్తే, ఆ వ్యక్తి నిజంగా నేరం చేస్తే ఏ శిక్షపడుతుందో, ఆ అబద్ధపు ఆరోపణ చేసిన వ్యక్తికీ అదే శిక్ష విధించమని ధర్మశాస్త్రంలో తన న్యాయాన్ని కనపరిచాడు.

ద్వితీయోపదేశకాండము 19:16-19 - అన్యాయపు సాక్ష్యము ఒకని మీద చెప్పుటకు ఒకడు నిలువబడి నేరము మోపుటకై అబద్ధమాడినయెడల ఆ వివాదముగల ఇద్దరు మనుష్యులు యెహోవా సన్నిధిని, అనగా ఆ కాలములోనున్న యాజకుల యెదుటను న్యాయాధిపతుల యెదుటను నిలువవలెను. ఆ న్యాయాధిపతులు బాగుగా విమర్శించిన తరువాత వాని సాక్ష్యము అబద్ధసాక్ష్యమై తన సహోదరుని మీద వాడు అబద్ధసాక్ష్యము చెప్పిన సంగతి వెల్లడియైన యెడల, వాడు తన సహోదరునికి చేయ తలంచినట్లే వానికి చేయవలెను. అట్లు మీ మధ్య నుండి ఆ చెడుతనమును పరిహరించుదురు.

ప్రస్తుత సమాజంలో కొందరు స్త్రీలు పురుషులపై అన్యాయంగా చేసే లైంగికవేధింపులు, గృహహింస ఆరోపణలకు కనుక ఈ నియమాన్ని ఆపాదించి చూస్తే, అవి నిజంగా చేసినవారు ఏవిధంగా శిక్షించబడాలో, అన్యాయంగా ఆరోపణలు మోపినందుకు వారు కూడా అదేవిధంగా శిక్షించబడాలి‌. ఇది స్త్రీవాదులకు సమ్మతమేనా? లేక ఇటువంటి నిష్పక్షపాత న్యాయాన్ని కనపరుస్తున్న దేవునిపై ఈ కారణంతో కూడా మరికొన్ని విమర్శలు చేయడానికి సిద్ధపడతారా?.

3. భార్య శీలం విషయంలో అనుమానం కలిగిన భర్త మోషే ధర్మశాస్త్రంలో దేవుడు అనుమతించిన ఆ పద్ధతిని ఆశ్రయించి నివృత్తి చేసుకున్నట్టు, ఒక భార్యకు తన భర్త శీలంపై అనుమానం కలిగితే ఏవిధంగానూ నివృత్తి చేసుకోలేదా అని మనం పరిశీలిస్తే, ఆమె కూడా తన భర్త శీలాన్ని మరికొన్ని‌ విధాలుగా పరీక్షించి తన అనుమానం తీర్చుకోవచ్చు. ఎందుకంటే, అది ఆమెపట్ల అతను చేసిన ద్రోహంగానే పరిగణించబడుతుంది.

1 కోరింథీయులకు 7: 4 - భర్తకేగాని భార్యకు తన దేహముపైని అధికారము లేదు; ఆలాగున భార్యకే గాని భర్తకు తన దేహముపైని అధికారము లేదు.

మోషే ధర్మశాస్త్రం ప్రకారం, ఇశ్రాయేలీయులు‌ వారికి మరొక వ్యక్తి వల్ల ఏదైనా ద్రోహం జరిగితే వారు వెంటనే దేవుణ్ణి ఆశ్రయించవచ్చు. దేవుణ్ణి ఆశ్రయించడమంటే, ఇంట్లోకి వెళ్ళి ప్రార్థన చెయ్యడం కాదు, ఇది యాజకుడి/న్యాయాధిపతి సమక్షంలో జరిగే విచారణ.

నిర్గమకాండము 22:9 - ప్రతి విధమైన ద్రోహమును గూర్చి, అనగా ఎద్దునుగూర్చి గాడిదనుగూర్చి గొఱ్ఱెనుగూర్చి బట్టనుగూర్చి పోయినదానినొకడు చూచి యిది నాదని చెప్పిన దానిగూర్చి ఆ యిద్దరి వ్యాజ్యెము దేవుని యొద్దకు తేబడవలెను.

(ఈ కట్టడ 'ప్రతీవిధమైన ద్రోహమును గూర్చి' అని చెప్పబడుతుంది కాబట్టి తరువాతి మాటల్లో దొంగతనాల గురించి ప్రస్తావించినా ఇది కేవలం వాటికి మాత్రమే పరిమితం కాదు)

ఈ కట్టడను అనుసరించి‌ తన భర్త శీలంపై అనుమానం‌ కలిగిన భార్య దేవుణ్ణి ఆశ్రయించవచ్చు, దేవుడు అతని‌ నేరాన్ని రుజువు చేస్తాడు ఎందుకంటే అప్పటికి ఆయన వారి విషయాల్లో స్వయంగా ప్రమేయాన్ని చూపుతున్నాడు (యాజకుడి దగ్గర ఊరీము, తుమ్మీము అనేవి న్యాయాన్ని నిర్ణయిస్తాయి).

ఇశ్రాయేలీయుల్లో ఒకరికి ఒకరికి మధ్య ఏ వివాదం తలెత్తినా వారు న్యాయాధిపతుల/యాజకుడి సమక్షంలో యెహోవా నామం పేరిట ప్రమాణం చేసి దానిని పరిష్కరించుకుంటారు.

ద్వితియోపదేశకాండము 10:20 - నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయనను సేవించి ఆయనను హత్తుకొని ఆయన నామమున ప్రమాణము చేయవలెను.

ద్వితియోపదేశకాండము 6:13 - నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయనను సేవించి ఆయన పేరట ప్రమాణము చేయవలెను.

హెబ్రీయులకు 6:16 - మనుష్యులు తమకంటె గొప్పవాని తోడు అని ప్రమాణము చేతురు; వారి ప్రతి వివాదములోను వివాదాంశమును పరిష్కారము చేయునది ప్రమాణమే.

దేవుని పేరుతో ప్రమాణం చేయడమనేది అప్పటి ఇశ్రాయేలీయులకు అంత సామాన్యమైన విషయమేమీ కాదు, తేడా వస్తే పరిస్థితి చాలా కఠినంగా ఉంటుందని వారికి తెలుసు. దీనిప్రకారం భర్త శీలంపై అనుమానం కలిగిన భార్య దేవుణ్ణి ఆశ్రయించి ఈ ప్రమాణాన్ని అతని చేత చేయించొచ్చు. ఇలా ఎవరైనా చేసారా లేదా అనేది పక్కనపెడితే భర్తకు వలే భార్యకు కూడా భర్త శీలం విషయంలో అనుమానం కలిగినప్పుడు అది నివృత్తి చేసుకునే అవకాశం‌ ఆమెకు ఉందని మాత్రం ఈ ఆధారాలు రుజువు చేస్తున్నాయి. ఒకవేళ అలా చూసుకుంటే, ధర్మశాస్త్ర కాలంలో రక్తపు మరకల పద్ధతిని అనుసరించి ఎంతమంది భర్తలు వారి భార్యలకు శీలపరీక్షలు చేసారో దానిపై ఆరోపణ చేసేవారు లెక్కపెట్టి వచ్చారా?

ఒకవేళ వారు అలా కాదు, మాకు భార్యల విషయంలో శీలపరీక్ష గురించి ప్రత్యేకంగా చెప్పినట్టే, భర్తల విషయంలో కూడా ఆయన ప్రత్యేకంగా చెప్పినట్టు చూపించాలి అప్పుడు మాత్రమే అది భార్యల గురించని భావిస్తాం లేదంటే లింగవివక్షే అనుకుంటాం అంటే, ఒకసారి ఈ వచనాన్ని చూడండి.

మత్తయి సువార్త 5:28 - నేను మీతో చెప్పునదేమనగా ఒక స్త్రీని మోహపుచూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసినవాడగును.

ఈ సందర్భంలో యేసుక్రీస్తు ప్రభువు మోహపు చూపు గురించి హెచ్చరిస్తూ, ఒక 'స్త్రీని' అని ప్రస్తావిస్తున్నాడు, పురుషుడిని అనడం లేదు.
కానీ ఈ నియమం మోహపుచూపు‌ చూసే స్త్రీ పురుషులు ఇద్దరికీ వర్తిస్తుంది.

అదేవిధంగా, లేవీకాండము 18 వ అధ్యాయం 6-17 వచనాలలో దేవుడు ఏ వరస అయ్యే స్త్రీలను వివాహం చేసుకోకూడదో పురుషులకు ఆజ్ఞాపిస్తున్నాడు.‌
కానీ ఆ నియమం స్త్రీలకు కూడా వర్తిస్తుంది.

ఒకవేళ వీటిపై స్త్రీవాదులు ఆ కాలంలో ఆడవాళ్ళు అలాంటిపనులు చేసేవారు కాదు కాబట్టే ఈ సందర్భాలలో పురుషులగురించే రాయబడియుండవచ్చని వాదిస్తే, అయితే ఈ కాలంలో ఆడవాళ్ళు అలాంటి పనులు చేస్తున్నారని ఒప్పుకుంటారా? వాటిగురించి ఎమైనా పోరాటాలు చేస్తారా?

ఏ కాలంలో అయినా మానవుల్లో మంచీ చెడు లక్షణాలు కలిగిన రెండు గుంపులు‌ తప్పకుండా ఉంటాయి. అవకాశాన్ని‌ బట్టి ఒక గుంపు తమ నేరస్వభావాన్ని కనపరుస్తారు. దీనికి ప్రపంచ చరిత్రలో స్త్రీ నేరస్తులకు ఆయా దేశీయ చట్టాలు విధించిన శిక్షలు (బైబిల్ లో దేవుడు విధించినవి) కూడా సాక్ష్యంగా ఉన్నాయి.

కాబట్టి బైబిల్ లోని కొన్ని సందర్భాలలో, దేవుడు పురుషులను ప్రస్తావిస్తూ మాట్లాడినా స్త్రీలను ప్రస్తావిస్తూ మాట్లాడినా అందులో ఉన్న ప్రమాణాలు ఇద్దరికీ వర్తిస్తాయి.

4. ఒకవేళ శీలపరీక్షలో స్త్రీ నిర్దోషి అని రుజువై, ఆరోపణ చేసిన భర్తను శిక్షించినా అప్పటికే ఆమెకు కలిగిన అవమానం మాసిపోతుందా అని ఎవరైనా ప్రశ్నిస్తే, కొంచెం common senseతో ఆలోచించినా ఇందులో వివక్ష ఏమాత్రం కనిపించదు. ఒకవేళ ఇదే కొలమానాన్ని తీసుకుంటే, ప్రతీరోజూ ఎంతోమంది ఎన్నో ఆరోపణలతో జైలుకు వెళ్తున్నారు; తరువాత అందులోని కొందరు నిర్దోషులని రుజువు చేయబడుతున్నారు. వారందరికీ కూడా అవమానమే కలుగుతుంది. కాబట్టి దీనికి కారణం లింగవివక్ష కాదు మానవుడిలోని అబద్ధపు స్వభావం మాత్రమేయని మనం అర్థం చేసుకోవాలి.
ఇంకొక విషయం ఏమిటంటే, ఇక్కడ ఆ స్త్రీని అలా అవమానానికి గురిచేసినందుకు తన భర్తకు శిక్ష పడింది, నష్టపరిహారం విధించబడింది. స్త్రీలు పెట్టే అన్యాయపు గృహహింస కేసుల్లో, లైంగికవేధింపుల కేసుల్లో ఇలాంటి శిక్షలు ఏమైనా ఉన్నాయా?

నష్టపరిహారం చెల్లించినా, శిక్ష విధించినా ఆమెకు కలిగిన అవమానం పోదు కాబట్టి, అసలు ఆ పద్ధతిని ప్రవేశపెట్టడమే తప్పు అంటే, కనీసం ఇక్కడ అవమానించబడ్డ భార్యకు ఈ వెసులబాటైనా ఉంది. స్త్రీలు పెట్టే అన్యాయపు కేసుల్లో ఇది కూడా సరిగా కనిపించడం లేదు కదా? ఆ కేసుల్లో ఇరుక్కున్న అమాయకులకు అవమానంతో పాటు, ఎంతో ధనం, సమయం వృథా ఔతున్నాయి. కాబట్టి అత్యాచారాల విషయంలోనూ, గృహహింస విషయంలోనూ చట్టాన్ని ఆశ్రయించేలా స్త్రీలకు కల్పించబడ్డ పద్ధతిని కూడా తప్పుపడదామా?

ఇక్కడ గుర్తించవలసిన మరోవిషయం ఏమిటంటే, అక్కడ అవమానం కేవలం ఆ స్త్రీకి మాత్రమే కలగడం లేదు, తన భార్యను అన్యాయంగా బయటపెట్టిన ఆ పురుషుడు కూడా ప్రజల మధ్యలో అవమానించబడుతున్నాడు. అదే ప్రజలు ఆమెపై సానుభూతిని చూపిస్తారు. అందుకే ఈ పద్ధతిని దేవుడు స్త్రీకి భద్రతగా అనుమతించాడని చెప్పడం జరిగింది.

ఆ పద్ధతి ద్వారా ఆయన శీలాన్ని కోల్పోయిన భార్యలను శిక్షించడమే కాదు, ఊరికే అనుమానంతో వేధించే భర్తలకు కుడా అవమానం మరియు శిక్ష కలుగచేసి మరెవ్వరూ అలా చేయకుండా గుణపాఠం నేర్పుతున్నాడు (ఒకవేళ ఆ అనుమానం కనుక అవతలివారి ప్రవర్తన మూలంగా కలిగితే దానిని నైతికత ఉన్న ఎవరూ కూడా తప్పు పట్టలేరు).

మీకా 2:7 యథార్థముగా ప్రవర్తించువానికి నా మాటలు క్షేమసాధనములు కావా?

5. ఇది ఈ అంశంలో చివరి భాగం మరియు ప్రాముఖ్యమైన భాగం. శీలపరీక్షను దేవుడు అనుమతించడం ద్వారా స్త్రీపై ఆయన వివక్షను చూపించాడని కొందరు విమర్శించడానికి ఇదే ప్రధానమైన కారణం కావొచ్చు. కొందరు స్త్రీలకు పెళ్ళికి ముందు మరో పురుషుడితో శారీరక సంబంధం లేకున్నప్పటికీ, భారమైన పనులు చేసినప్పుడూ, తీవ్రమైన భయానికి లోనైనపుడూ వారి కండరాల్లో జరిగే మార్పులవల్ల తొలిరాత్రి వారికి రక్తస్రావం అయ్యే అవకాశం లేదని ప్రారంభంలో మనం ప్రస్తావించుకున్నాం. అటువంటి పరిస్థితికి లోనైన భార్యను కనుక తన భర్త అనుమానించి ధర్మశాస్త్రం చెప్పిన పద్ధతిలో శీలపరీక్షకు సిద్ధపడితే ఆమె తల్లిదండ్రులు రక్తపు మరకలున్న బట్టను చూపించి ఆమె శీలాన్ని రుజువు చెయ్యలేరు కాబట్టి ఆమె రాళ్ళతో కొట్టబడి అన్యాయంగా చనిపోతుంది. దీనంతటికీ కారణం, దేవుడు ఆ పద్ధతిని అనుమతించడమే కదా అనేది మనముందు మన దేవునిపై ఉన్న విమర్శ. ఒకవేళ ఆ సందర్భాన్ని అంతమట్టుకు మాత్రమే చదివితే మనం కూడా అంతవరకే గ్రహించి స్త్రీవాదుల ఆరోపణతో ఏకీభవించే పరిస్థితి‌ నెలకొంటుంది. కానీ, వాక్యం అంతటితో ఆగిపోలేదు, ఇంకా ముందుకు కొనసాగింది.

వాస్తవానికి మోషే ధర్మశాస్త్రంలో స్త్రీ శీలపరీక్షకు ఆ రక్తపుస్రావం మాత్రమే అంతిమ రుజువు కాదు. ఒకవేళ ఆమె ఆ రుజువును చూపించలేకపోయినా ఆమె ఆ విషయంలో దోషం చెయ్యని నిర్దోషి అయితే ఆమె ముందు మరికొన్ని ప్రత్యామ్నాయాలు తప్పకుండా ఉన్నాయి. అవేంటో తెలుసుకోడానికి ముందు, మోషే ధర్మశాస్త్రాన్ని దేవుడేదో ఒక పేపర్ పై రాసిచ్చేసి వారినలా వదిలేయలేదని మనం గుర్తుంచుకోవాలి. ఆ కాలంలో ఆయనే స్వయంగా వారి నిర్వహణల్లో ప్రమేయం చూపుతూ ఉండేవాడు, ఎన్నో అద్భుతాలు చేసేవాడు. ఉదాహరణకు, ఆకాలంలో దేవుని దృష్టికి వ్యతిరేఖంగా ప్రవర్తించినవారిని ఆయనే అద్భుతమైన రీతిలో శిక్ష విధించిన సందర్భాలు మనకు పాతనిబంధనలో కనిపిస్తాయి.

ఆయన ఆవిధంగా ప్రమేయం చూపుతున్నంతవరకే ధర్మశాస్త్రంలోని శిక్షలు అమలు జరిగాయి. తరువాతి కాలంలో ఇశ్రాయేలీయుల కఠినత్వాన్ని బట్టి ఆయన ఆయా రాజ్యాలకు బానిసలుగా అప్పగించినప్పుడు వాటిలోని కఠినమైన శిక్షలను (మరణశిక్షను) అమలుచేసే అవకాశం వారికి లేకుండా పోయింది. అందుకే యేసుక్రీస్తును వారే చంపకుండా రోమా అధిపతైన పిలాతుకు అప్పగించారు (యోహాను 18:32). అందుకే వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని మోషే చెప్పినట్టు చంపకుండా యేసుక్రీస్తు దగ్గరకు తీసుకువచ్చి ఆయనను శోధించారు. ఆ సమయంలో ఆయన చంపమన్నా కూడా వారు ఆమెను చంపలేదు. అదేవిధంగా మరియ పరిశుద్ధాత్మ వల్ల గర్భవతి అయినప్పుడు యేసేపు కూడా అది బయటపెడితే ఆమె అందరిలోనూ అవమానించడుతుందని ఆలోచించాడే తప్ప, చంపుతారని కాదు (మత్తయి 1:19).

దేవుడు అద్భుతాల ద్వారా ఇశ్రాయేలీయుల మధ్యలో తన ప్రమేయాన్ని చూపని కాలంలో (దానిని చీకటికాలం అంటారు), వారు తమ జీవితాలనే శత్రుభయంతో దినదిన గండంగా గడుపుతుంటే వారి భార్యలను తీసుకెళ్ళి శీలపరీక్షలు చేయిస్తారా?

ఈ ప్రకారంగా ఆలోచిస్తే, అన్యాయానికి గురైనవారి పక్షంగా తన తీర్పును కనపరిచే న్యాయవంతుడైన దేవుడు, తాను‌ అద్భుతాలు చేసి ప్రమేయాన్ని చూపించే కాలంలో తాను అనుమతించిన పద్ధతి వల్ల ఒక నిర్దోషి అయిన భార్య చంపబడుతుంటే చూస్తూ ఉంటాడా? కాబట్టి దేవుడు అద్భుతాల ద్వారా తన ప్రమేయం చూపుతున్న కాలంలో ధర్మశాస్త్రంలోని పద్ధతుల ద్వారా ఒక నిర్దోషికి అన్యాయంగా శిక్షపడే అవకాశం లేదు (నాబోతు గురించి క్రింద చూద్దాం).

ఇప్పుడు శీలపరీక్ష గురించే ఆలోచిస్తే, నిర్దోషి అయిన భార్యను తన భర్త అనుమానించినప్పుడు ఆమె కన్యాత్వానికి రుజువుగా, రక్తపు మరకలున్న వస్త్రాన్ని చూపించలేకపోయినప్పటికీ, నేను పైన భర్తల విషయంలో చెప్పినట్టుగా ఇశ్రాయేలీయులు భయపడే దేవుని నామం పేరిట ప్రమాణం చేసి తన నిర్దోషత్వాన్ని రుజువు చేసుకోవచ్చు (దేవుడు ప్రమేయం చూపుతున్న ఆ సమయంలో అబద్ధప్రమాణం చేస్తే చస్తారు, లేదా శాపగ్రస్తులు ఔతారు). ఆ కాలంలో, దేవునితో మాట్లాడే ప్రవక్తలు కూడా ఉన్నారు, చాలామంది వారిదగ్గరకు వెళ్ళి విషయాలను‌ తెలుసుకోవడం, యాజకుల దగ్గరకు వెళ్ళి విచారణ చెయ్యడం మనకు కనిపిస్తుంది.

అదేవిధంగా దేవుడు చేసే మరో అద్భుతం ద్వారా కూడా ఆమె తన నిర్దోషత్వాన్ని నిరూపించుకోవచ్చు. మీరు సంఖ్యాకాండము 5:12-31 వచనాలను చదివితే, ఒక భర్త తన భార్యను అవమానించినప్పుడు దానికి రుజువులు లేనప్పుడు, అతను ఆమెను యాజకుడి దగ్గరకు తీసుకువస్తాడు. యాజకుడు ఆమె చేత ప్రమాణం చేయించి, ఒక రకమైన చేదునీటిని త్రాగిస్తాడు. ఒకవేళ ఆమె నిర్దోషి అయితే గర్భవతి ఔతుంది, కాకపోతే రోగిష్ఠిది ఔతుంది. ఇది దేవుడే స్వయంగా అద్భుతం ద్వారా రుజువు చేస్తున్నాడు. కాబట్టి కన్యాత్వం విషయంలో రక్తపు మరకలున్న వస్త్రాన్ని రుజువుగా చూపలేని స్త్రీ, ఆమె నిర్దోషి అయితే ఈ మార్గాన్ని కూడా ఎంచుకోవచ్చు (ఇది వివాహం తరువాత జరిగే వ్యభిచారం గురించనిరాయబడినప్పటికీ, శీలపరీక్ష విషయంలో వర్తించదని చెప్పలేము, ఎందుకంటే ఇది భర్తకు పుట్టే రోషాన్ని నివృత్తి చేసే పద్ధతిగా ప్రవేశపెట్టబడింది).

ఈ పద్ధతిలో కూడా, 31వ వచనాన్ని మనం చదివితే, ఆ భర్త ఆమె విషయంలో మోపిన నేరం రుజువైతే ఆమె శిక్షించబడి ఆ భర్త నిర్దోషి ఔతాడని రాయబడింది. ఒకవేళ ఆమె నేరం రుజువు కాని నిర్దోషి అయితే దేవునిముందు ఆ భర్తే దోషిగా నిలబడతాడు. దీనిప్రకారం ప్రతీ భర్త తన భార్యను ఊరికే శీలపరీక్షకు తీసుకుపోడు. ఎందుకంటే ఆమె నిర్దోషే అయితే దోషి అయ్యేది ఆ భర్తే. (ఇటువంటి రెండు కోణాలు కలిగిన చట్టాలు మన సమాజంలో లేకపోవడం వల్లే అబద్ధపు గృహహింస, లైంగిక వేధింపుల కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి)

పైన ప్రస్తావించుకున్న నాబోతు గురించి పరిశీలిస్తే, 1 రాజులు‌ 21:13 వచనంలో ఈ వ్యక్తిని ఆహాబు రాజు తన భార్యప్రేరణతో అబద్ధసాక్షులను నిలబెట్టించి అన్యాయంగా చంపినట్టు కనిపిస్తుంది. మరి ఇక్కడెందుకని దేవుడు తన ప్రమేయాన్ని చూపి ఆ అమాయకుడిని రక్షించలేదనే అనుమానం మీకు రావచ్చు. నాబోతు విషయంలో రాజే అతనిని చంపాలని కుయుక్తితో అదంతా చేయిస్తున్నాడు కాబట్టి అతనికి వేరేవిధంగా తన నిర్దోషత్వాన్ని నిరూపించుకునే అవకాశం దక్కలేదు. నూతన నిబంధనలో స్తెఫెనును చంపినట్టే వారంతా దొమ్మీగా దాడిచేసి అతనిని చంపేసారు. అదేవిధంగా, ఇక్కడ దేవుడు తన ప్రమేయాన్ని చూపుతున్నాడు కాబట్టే అది జరిగిన వెంటనే ఆ అమాయకుడిని‌ చంపినందుకు ఏం జరగబోతుందో ప్రవక్త ద్వారా ఆహాబుకు తెలియచేసాడు (1 రాజులు 21:19).

తరువాతి కాలంలో కూడా న్యాయాధిపతులు లంచాలు తీసుకుని నిర్దోషులను దోషులని తీర్పుతీర్చినందుకు ఆయన ప్రవక్తల ద్వారా తాను విధించబోయే శిక్షను తెలియచేసాడు. ఆయన తన సార్వభౌమ నిర్ణయం చొప్పున నిర్దోషుల మరణాలకు అనుమతించినా వారి తరపున పగ తీర్చుకున్నాడు (ఇది దేవుని సార్వభౌమత్వానికి సంబంధించిన విషయం).

ఇది స్త్రీల శీలపరీక్ష విషయంలో ఆపాదించడం సాధ్యం కాదు ఎందుకంటే అక్కడ దేవుడు చేసే అద్భుతం కూడా ఆమె‌ నిజాయితీని రుజువు చేస్తుంది.

వాదనకోసం ఈ ఆధారాలన్నీ కాసేపు పక్కన పెట్టి ధర్మశాస్త్రంలో ఆ పద్ధతివల్ల స్త్రీలు అన్యాయంగా చంపబడే అవకాశం ఉందని భావించినా ఇది లింగవివక్షగా రుజువు చెయ్యడం సాధ్యపడదు. ఎందుకంటే ఇదే ధర్మశాస్త్రంలో అత్యాచారం‌ చేసిన వాడిని కూడా రాళ్ళతో‌‌ కొట్టి చంపాలని రాయబడింది. దీనిప్రకారం ఎవరైన స్త్రీ ఒక పురుషుడిపై అత్యాచార ఆరోపణ మోపి అబద్ధసాక్షులను పెట్టుకుంటే అతడిని కూడా చంపుతారుగా.
దాని ప్రకారం ఆయన పురుషులపై కూడా వివక్షతోనే అలాంటి కట్టడలను చేసాడా?

చివరిగా, బైబిల్ గ్రంథాన్ని చదివేటపుడు ప్రాముఖ్యంగా గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే, ఆ సంఘటనలు జరిగిన కాలానికీ, ఇప్పుడు మనమున్న కాలానికీ మధ్యలో వేల సంవత్సరాల వృత్యాసం ఉంది. మనం ఇప్పుడున్న సామాజిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని దాని వెనుక కారణాలు ఏమున్నప్పటికీ శీలపరీక్ష వివక్షే అనుకుంటే, ఆ కాలంలో జరిగిన యుద్ధాలలో ఎంతోమంది చంపబడేవారు, పట్టణాలు పట్టణాలనే సమూలంగా చంపిపడేసేవారు; అది క్రూరత్వమని భావించవలసి వస్తుంది కదా?

అదేవిధంగా, బైబిల్ దేవుడు ఇశ్రాయేలీయుల చేత కొన్ని దేశాలపై యుద్ధాలను చేయించినప్పుడు వారిలో పురుషులను మాత్రమే చంపించాడు, స్త్రీలను మినహాయించాడు.

ద్వితీయోపదేశకాండము 20:12-14 - అది మీతో సమాధానపడక యుద్ధమే మంచిదని యెంచినయెడల దాని ముట్టడివేయుడి. నీ దేవుడైన యెహోవా దాని నీ చేతి కప్పగించునప్పుడు దానిలోని మగవారినందరిని కత్తివాత హతము చేయవలెను. అయితే స్త్రీలను చిన్నవారిని పశు వులను ఆ పురములో నున్నది యావత్తును దాని కొల్ల సొమ్మంతటిని నీవు తీసికొనవచ్చును; నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన నీ శత్రువుల కొల్లసొమ్మును నీవు అనుభవించు దువు.

దీనిని బట్టి ఆయన పురుషులపై‌ వివక్షను‌ చూపించాడని భావించాలా? లేక పురుషులకుండే శారీరక బలం‌ వల్ల యుద్ధాలలో వారే పాల్గొంటారు కాబట్టి, వారిని మాత్రమే చంపమన్నాడా?. ఆయన మరికొందరు రాజులపై ఆగ్రహించి వారిని నాశనం‌ చేసేటప్పుడు ఆ రాజువంశంలోని మగపిల్లలను మాత్రమే చంపించాడు, ఆడపిల్లలను మినహాయించాడు.

1రాజులు 21:21 - అందుకు యెహోవా ఈలాగు సెలవిచ్చెను - నేను నీ మీదికి అపాయము రప్పించెదను; నీ సంతతివారిని నాశము చేతును; అల్పులేమి ఘనులేమి ఇశ్రాయేలువారిలో అహాబు పక్షమున ఎవరును లేకుండ పురుషులనందరిని నిర్మూలము చేతును.

దీనినిబట్టి కూడా ఆయన పురుషులపై వివక్షను చూపించి మగపిల్లలను మాత్రమే చంపించాడని భావించాలా? లేక వంశవృక్షం పురుషుల నుండే అభివృద్ధి చెందుతుంది కాబట్టి, వారిని మాత్రమే‌ చంపి ఆ ఆధిక్యత లేని స్త్రీలను మినహాయించాడని భావించాలా? అందుకే  ప్రతీదానినీ వివక్షతో ముడిపెట్టేముందు కాస్త నిజాయితీతో ముందు వెనుక ఆలోచించుకోవాలి.

బైబిల్ ప్రకారం కొన్ని విషయాలలో పురుషుడికి ఆధిక్యత ఇవ్వబడింది, కొన్నిటిలో స్త్రీకి‌ మినహాయింపు ఇవ్వబడింది. వీటిని వివక్ష పరిధిలో చూడకూడదు. శీలపరీక్ష విషయంలో కూడా పైన నేనిచ్చిన వివరణ అంతా పక్కనపెట్టి ఈ విధంగానే పురుషుడికి ఆధిక్యత, స్త్రీకి మినహాయింపుగా ఎందుకు ఆలోచించకూడదు?.

కొందరు క్రైస్తవబోధకులు కూడా స్త్రీవాదుల విమర్శలకు సమాధానం ఇచ్చేటపుడు వారిని సంతోషపెట్టడానికి ఏదేదో చెబుతుంటారు, ఉన్నదానిని మార్చేస్తారు, కానీ వారికి ఆవిధంగా సమాధానం ఇవ్వకూడదు.

సామెతలు 26:5 - వాని మూఢతచొప్పున మూర్ఖునికి ప్రత్యుత్తరమిమ్ము ఆలాగు చేయనియెడల వాడు తన దృష్టికి తాను జ్ఞానిననుకొనును.

ఆ విధంగానే ఇవ్వాలనుకుంటే, స్త్రీవాదులకు స్త్రీలను సమానంగా శిక్షించడం కూడా ఇష్టం ఉండదు మరి, బహుశా బైబిల్ దేవుడు స్త్రీపురుషులను సమానంగా శిక్షించడం జీర్ణించుకోలేక కూడా వారు ఆయనపై ఆరోపణలు చేస్తుండవచ్చు. దీనిని బట్టి వారిలో ఎవరైనా యేసుక్రీస్తు అవిధేయులైనవారిని నరకంలో వేస్తానంటున్నాడు. అందులో స్త్రీలు కూడా ఉంటారని విమర్శిస్తే, లేదు లేదు అలా ఏం చేయడు, వారిని పరలోకంలో కూర్చోబెట్టి దేవదూతల చేత భజన చేయిస్తాడని చెబుతారా?

అదేవిధంగా, బైబిల్ గ్రంథం పురుషుడినీ, స్త్రీనీ దేవుడు తన పోలిక స్వరూపంలో (సమానంగా) చేసాడని చెబుతూనే బాధ్యతల విషయంలో పురుషుడికి ఎక్కువ ఆధిక్యతను ఆపాదిస్తుంది (వాటిలో కొన్ని పైన చూసాం). అందుకే స్త్రీకి పురుషుడు ఏలిక మరియు ప్రతినిధి అయ్యాడు. ఒకవేళ దీనిని కూడా వారు విమర్శిస్తే అలాంటిదేమీ లేదు వాస్తవానికి స్త్రీకి పురుషుడు ఏలికా, ప్రతినిధి కాదు బానిస అని చెబుతారా? కాబట్టి ఎవరు విమర్శించినా ఉన్నదానిని జవాబుగా చెప్పండి, వినేవారు వింటారు విననివారు నాశనానికి పోతారు. ఒకరు బైబిల్ దేవుణ్ణి నమ్మకపోవడం‌ వల్ల ఆయనకు వచ్చే నష్టం ఏమీ లేదు.

హొషేయ 14:9 జ్ఞానులు ఈ సంగతులు వివేచింతురు, బుద్ధిమంతులు వాటిని గ్రహింతురు; ఏలయనగా యెహోవా మార్గములు చక్కనివి, నీతిమంతులు దాని ననుసరించి నడచుకొందురు గాని తిరుగుబాటు చేయువారి దారికి అది అడ్డము గనుక వారు తొట్రిల్లుదురు.

(ఈ వ్యాసంలో నేను ప్రస్తావించిన స్త్రీవాదులూ, స్త్రీలు ఒకటి కాదు, స్త్రీవాదులలో స్త్రీలు ఉంటారు కానీ స్త్రీలందరూ స్త్రీవాదులు కాదు. ఉదాహరణకు టెర్రరిస్టులంతా మనుషులే కానీ, మనుషులంతా టెర్రరిస్టులు కాదు కదా! కాబట్టి ఇందులో నేను స్త్రీవాదుల నైజంగా బయటపెట్టిన నిజాలు స్త్రీలందరికీ వర్తించవు)

గలతియులకు 1:10 - ఇప్పుడు నేను మనుష్యుల దయను సంపాదించుకొనజూచుచున్నానా దేవుని దయను సంపాదించుకొనజూచుచున్నానా? నేను మనుష్యులను సంతోషపెట్టగోరుచున్నానా? నేనిప్పటికిని మనుష్యులను సంతోషపెట్టువాడనైతే క్రీస్తుదాసుడను కాకయేపోవుదును.

 బైబిల్ దేవుడు స్త్రీలపై వివక్షచూపించాడని బైబిల్ విమర్శకులు ఆరోపిస్తున్న మరో మూడు సందర్భాల గురించి ఈ క్రింది లింక్ ద్వారా సూచించబడిన వ్యాసం చదవండి.

(మోషే ధర్మశాస్త్రంలో రుతుస్రావం అపవిత్రమని ఎందుకు రాయబడింది? స్త్రీ సంఘంలో మౌనంగా ఎందుకు ఉండాలి? బిడ్డను కన్నతల్లి కడగా ఉండవలసిన‌ కాలంలో మగపిల్లాడికి 33 రోజులు ఆడపిల్లకు 66 రోజూలు ఈ బేధం ఎందుకు?)

బైబిల్ దేవుడికి‌ స్త్రీలపై వివక్ష వాస్తవమా లేక ఆరోపణా?

 

Add comment

Security code
Refresh

 

హితబోధ అనే ఈ వెబ్ సైట్ తెలుగు క్రైస్తవ జనులకు ఆధ్యాత్మిక, అనుసరణీయ, ప్రశ్నల నివృత్తిని కలిగించేలా నిర్మించబడినది. అంతేగాక, దుర్బోధలకు ధీటైన సమాధానాలను మరియు జీవితంలో అనేక చిక్కు ప్రశ్నలకు సరైన సమాధానాలను అనేక ప్రఖ్యాతగాంచిన దైవజనుల చేత ఇప్పించడం జరిగింది.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : హితబోధ ఎప్పుడూ, ఎవ్వరినీ ఆర్థిక సహాయం కోరదు; ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.