బైబిల్ పై బురద చల్లడమే పనిగా పెట్టుకున్న మతోన్మాది ఒకరు ఒక సందర్భంలో మాట్లాడుతూ, బైబిల్ దేవుడు ఇశ్రాయేలీయులకు మోషేకాలంలో ధర్మశాస్త్రాన్ని ఇచ్చి వారెలా జీవించాలో బోధించాడు తప్ప, మిగిలిన ప్రజలకు ఆవిధంగా బోధించలేదని, దీనిప్రకారం మిగిలిన జాతులవారు ఎలాంటి పాపంచేసినా దానికి ఆయన తీర్పుతీర్చడం న్యాయం కాదన్నట్టుగా వాదించాడు.
అతనిలా వాదించడానికి కేవలం అతని కపట పరిశీలన మాత్రమే కారణం కాదు కానీ, క్రైస్తవుల్లో కూడా కొంతమంది దేవుడు
మోషే ద్వారా ఇశ్రాయేలీయులకు ధర్మశాస్త్రం ఇవ్వకముందు అందులోని నైతిక విలువలను ప్రజలకు తెలియచేయలేదని అభిప్రాయపడుతుంటారు. ఈవిధంగా వారు అభిప్రాయపడడానికి కొన్ని లేఖనాలను అపార్థం చేసుకోవడమే కారణం. ఇటువంటి బోధ కారణంగా కూడా ఆ మతోన్మాది దేవునిన్యాయంపై అలా ఆరోపణ చేసాడు.
కానీ, బైబిల్ గ్రంథంలోని ఎన్నో సందర్భాలు మోషే ధర్మశాస్త్రానికి ముందు జీవించిన ప్రజలకు అందులో బోధించబడ్డ నైతికవిలువలు తెలుసని స్పష్టంగా రుజువు చేస్తున్నాయి (ధర్మశాస్త్రం తరువాత కూడా దాని క్రింద లేని అన్యజనులూ వాటిని ఎరిగే ఉన్నారు).
ఈ వ్యాసంలో, ఆ విధంగా రుజువు చేస్తున్న సందర్భాలను ముందుగా తెలియచేసి, తదుపరి మోషే ధర్మశాస్త్రానికి ముందున్న ప్రజలకు అందులోని ఆజ్ఞలు వర్తించవన్నట్టుగా అపార్థానికి గురైన లేఖనాల అసలు అర్థాన్ని వివరించే ప్రయత్నం చేస్తాం.
ఈ విషయం గురించి మనమెందుకు తెలుసుకోవాలంటే, పైన చెప్పినవిధంగా మతోన్మాదులు దీనిపై ఆరోపణ చేస్తున్న కారణం ఒకటైతే, రెండవదిగా దేవుని స్వభావానికి సంబంధించిన నైతిక విలువలను, ఆయన మానవుడు ఉనికిలోనికి వచ్చినప్పటి నుండీ బోధిస్తూనే ఉన్నాడు. ధర్మశాస్త్రం ముందటికాలంలో అయినా, తరువాతి కాలంలో అయినా అవి స్థిరంగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ధర్మశాస్త్రం నుండి విడిపించబడ్డ విశ్వాసులమైన మనం కూడా, దాని శాపం నుండీ, అందులోని విధిరూపకమైనవాటి (ఆచార సంబంధమైనవాటి) నుండి విడిపించబడ్డామే తప్ప నైతికవిలువల నుండి కాదు. నిబంధన ప్రజలు ఎప్పటికీ వీటిని అనుసరిస్తూనే జీవిస్తారు. నూతన నిబంధనలో అనేక వాక్యభాగాలు దీనిని రుజువుచేస్తున్నాయి (ఉదాహరణకు, వ్యభిచరించకూడదు, నరహత్య చేయకూడదు, పొరుగువానిది ఆశించకూడదు, అబద్ధం చెప్పకూడదు, ద్వేషించకూడదు, వరుసలు తప్పి ప్రవర్తించకూడదు, విగ్రహారాధన చేయకూడదు, దేవుణ్ణి మాత్రమే పూజించాలి). కాబట్టి మనం దీనిని తెలుసుకోవాలి.
అదేవిధంగా, రోమీయులకు 5:13వ వచనంలో (ఏలయనగా ధర్మ శాస్త్రము వచ్చిన దనుక పాపము లోకములో ఉండెను గాని ధర్మశాస్త్రము లేనప్పుడు పాపము ఆరోపింపబడదు), పౌలు, ధర్మశాస్త్రం లేనపుడు పాపం ఏ వ్యక్తి పైనా ఆరోపించబడదని చెబుతున్నాడు ఎందుకంటే వారేం చెయ్యాలో, ఏం చేయకూడదో వారికి తెలీదు. ఆయన ఈ మాటలు నైతికవిలువల గురించి కాకుండా, మిగిలిన ఆజ్ఞలున్న ధర్మశాస్త్రం గురించి మాట్లాడుతున్నప్పటికీ, ఈ కొలమానాన్ని మనం నైతికవిలువలపై కూడా ఆపాదించవచ్చు.
ఈవిధంగా, ఒకవేళ మోషే ధర్మశాస్త్రానికి ముందున్న ప్రజలకు అందులోని నైతిక ప్రమాణాలు దేవుని చేత బోధించబడకపోతే/తెలియకపోతే వారు చేసినవాటికి దేవుడు అన్యాయంగా వారిపై పాపాన్ని ఆరోపించి శిక్షను విధించాడనే అపార్థం చోటుచేసుకుంటుంది. ఇది ఎవరో మతోన్మాది చేసిన ఆరోపణగానే కాకుండా పౌలుమాటల ప్రకారంగా కూడా న్యాయబద్ధంగా ఆలోచిస్తే నిజమనిపిస్తుంది. కాబట్టి, మన దేవుని పరిశుద్ధతను చాటిచెప్పే బాధ్యతతో ఆయన న్యాయంపైనే ఆరోపణ చేసేవిధంగా ఉన్న ఆ అపార్థబోధను సంఘం నుండి తొలగించడానికి దీని గురించి మనం తెలుసుకోవాలి.
కీర్తనలు 119: 75 యెహోవా, నీ తీర్పులు న్యాయమైనవి.
మొదటిగా, ధర్మశాస్త్రానికి ముందు ప్రజలకు నైతికవిలువలు తెలుసని బైబిల్ ఇస్తున్న ఆధారాలు పరిశీలిద్దాం.
ఆదికాండము 4:10-13 అప్పుడాయన నీవు చేసిన పనియేమిటి? నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది. కావున నీ తమ్ముని రక్తమును నీ చేతిలోనుండి పుచ్చుకొనుటకు నోరు తెరచిన యీ నేలమీద ఉండకుండ, నీవు శపింపబడినవాడవు; నీవు నేలను సేద్యపరుచునప్పుడు అది తన సారమును ఇక మీదట నీకియ్యదు; నీవు భూమి మీద దిగులు పడుచు దేశదిమ్మరివై యుందువనెను. అందుకు కయీను నా దోషశిక్ష నేను భరింపలేనంత గొప్పది.
ఈ సందర్భంలో కయీను తన తమ్ముడిని చంపినపుడు దేవుడతనిపై ఆ పాపాన్ని ఆరోపించి, తగిన శిక్షను విధించినట్లు కనిపిస్తుంది. నరహత్య చేయకూడదనే ఆజ్ఞను మనం నోవాహు కాలంలోనూ (ఆదికాండము 9:6), మోషే ధర్మశాస్త్రంలోనూ (నిర్గమకాండము 20:13) దేవుడు తెలియచేసినట్టు కనిపిస్తుంది. కానీ, అంతకుముందున్న ప్రజలకు ఇది తెలియకపోతే, ఆదాము నుండి రెండవతరమైన కయీను అది చేసినపుడు దేవుడెందుకు శిక్షిస్తున్నాడు? కాబట్టి తప్పకుండా ఆ ఆజ్ఞ కయీనుకు తెలుసు. అది కయీను మాటల్లో కూడా మనకు స్పష్టమౌతుంది. ఒకవేళ అతనికి హత్య చేయడం పాపమనే విషయం తెలియకపోతే, దేవుని దగ్గర దానిని దాస్తూ 'నా తమ్ముడికి నేను కావలివాడనా' అంటూ మాట్లాడకపోదుడు; 'నేనే చంపాను, అందులో తప్పేంటి' అన్నట్టుగా ధైర్యంగా ఒప్పుకునేవాడు.
ఆదికాండము 6:11,12 భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయియుండెను; భూలోకము బలాత్కారముతో నిండియుండెను. దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయియుండెను; భూమిమీద సమస్తశరీరులు తమ మార్గమును చెరిపివేసుకొని యుండిరి.
ఈ సందర్భంలో దేవుడు నోవాహు కాలపు ప్రజల బలత్కారం నిమిత్తం సంతాపపడుతూ, వారు తమ మార్గాన్ని చెరిపివేసుకున్నారని పలకడం మనకు కనిపిస్తుంది. దీనిప్రకారం వారి ముందు ఆయన ఒక మార్గాన్ని ఉంచాడు కానీ వారు దానిని తప్పి ప్రవర్తించారు, కాబట్టే ఆయన వారిని నాశనం చేసి నిందారహితుడిగా ఆయనతో నడిచిన నోవాహునూ, అతని కుటుంబాన్నీ కాపాడుతున్నాడు. నోవాహు దేవుని ఎదుట నిందారహితుడిగా నడిచాడంటే, దానికి ఖచ్చితంగా అతనికి ఒక ప్రమాణం తెలియచేయబడి ఉండాలి.
ఆదికాండము 35:22 ఇశ్రాయేలు ఆ దేశములో నివసించుచున్నప్పుడు రూబేను వెళ్లి తన తండ్రి ఉప పత్నియైన బిల్హాతో శయనించెను; ఆ సంగతి ఇశ్రాయేలునకు వినబడెను.
ఈ సందర్భంలో యాకోబు కుమారుడైన రూబేను, తన తండ్రి ఉపపత్నితో శయనించినట్టు రాయబడింది.
ఆ విషయం తెలుసుకున్న యాకోబు ఆ సమయంలో మౌనంగా ఉన్నప్పటికీ తన మరణ సమయంలో దానిని జ్ఞాపకం చేసుకుంటూ రూబేనును శపించినట్టూ, అతనిని జేష్ఠత్వపు హక్కునుండి తొలగించినట్టూ మనకు కనిపిస్తుంది.
ఆదికాండము 49:3,4 రూబేనూ, నీవు నా పెద్ద కుమారుడవు నా శక్తియు నా బలముయొక్క ప్రథమఫలమును ఔన్నత్యాతిశయమును బలాతిశయమును నీవే. నీళ్లవలె చంచలుడవై నీవు అతిశయము పొందవు నీ తండ్రి మంచముమీది కెక్కితివి దానిని అపవిత్రము చేసితివి అతడు నా మంచముమీది కెక్కెను.
మొదటి దినవృత్తాంతములు5:1 ఇశ్రాయేలునకు తొలిచూలి కుమారుడైన రూబేను కుమారుల వివరము. ఇతడు జ్యేష్ఠుడై యుండెను గాని తన తండ్రి పరుపును తాను అంటుపరచినందున అతని జన్మ స్వాతంత్ర్యము ఇశ్రాయేలు కుమారుడైన యోసేపు కుమా రులకియ్యబడెను; అయితే వంశావళిలో యోసేపు జ్యేష్ఠుడుగా దాఖలుచేయబడలేదు.
వాస్తవానికి తన తండ్రి భార్యతో శయనించకూడదన్న నియమం కూడా మోషే ధర్మశాస్త్రంలోనే రాయబడింది.
ద్వితియోపదేశకాండము 22: 30 ఎవడును తన తండ్రిభార్యను పరిగ్రహింపకూడదు, తన తండ్రి విప్పతగిన కోకను విప్పకూడదు.
ద్వితియోపదేశకాండము 27: 20 తన తండ్రి భార్యతో శయనించువాడు తన తండ్రి కోకను విప్పినవాడు గనుక వాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరుఆమేన్ అనవలెను.
ఈ నియమం దీనికి ముందటి కాలపు ప్రజలకు తెలియకపోతే/వర్తించకపోతే, రూబేను చేసింది పాపమెలా ఔతుంది, దాని విషయంలో యాకోబు అతనిని ఎందుకు శపించాడు.
ఆదికాండము 38:26 యూదా వాటిని గురుతు పట్టి నేను నా కుమారుడైన షేలాను ఆమెకు ఇయ్యలేదు గనుక ఆమె నాకంటె నీతిమంతురాలని చెప్పి మరి యెప్పు డును ఆమెను కూడలేదు.
ఈ సందర్భంలో, యూదా తన కోడలిని వేశ్యగా భావించి శయనించాక, ఆమె అతని కోడలని తెలుసుకుని మరెప్పుడూ ఆమెతో కలుసుకోడు. కోడలితో శయనించకూడదనే ఆజ్ఞ మోషే ధర్మశాస్త్రంలోనే రాయబడింది.
లేవీయకాండము 18:15 నీ కోడలి మానాచ్ఛాదనమును తీయకూడదు; ఆమె నీ కుమారుని భార్య, ఆమె మానాచ్ఛాదనమును తీయకూడదు.
ఈ నియమం యూదాకు ముందే తెలుసు కాబట్టి, అప్పటికే తన భార్య చనిపోయినా, కోడలిని వేశ్యగా భావించి గర్భవతిని చేసినా ఆమెను వివాహం చేసుకుని కాపురం చెయ్యలేదు. ఆమెకు కూడా ఆ నియమం తెలుసు కాబట్టే తన మామ దగ్గరకు మారువేషంలో వెళ్ళింది తప్ప, ముఖాముఖిగా వెళ్ళి నీ కొడుకును నాకు ఇవ్వకపోతే నువ్వే నన్ను పెళ్ళి చేసుకో అని అడగలేకపోయింది.
ఆదికాండము 12:17-19 అయితే యెహోవా అబ్రాము భార్యయయిన శారయిని బట్టి ఫరోను అతని యింటివారిని మహావేదనల చేత బాధించెను. అప్పుడు ఫరో అబ్రామును పిలిపించి నీవు నాకు చేసినది యేమిటి? ఈమె నీ భార్య అని నాకెందుకు తెలుపలేదు? ఈమె నా సహోదరి అనియేల చెప్పితివి? నేనామెను నా భార్యగా చేసికొందునేమో అయితేనేమి, ఇదిగో నీ భార్య; ఈమెను తీసికొనిపొమ్మని చెప్పెను.
ఈ సందర్భంలో, అన్యరాజైన ఫరో, తనతో అబ్రాహాము శారాను తన చెల్లిగా చెప్పడాన్ని బట్టి గద్దిస్తూ, నువ్వలా చెప్పడం వల్ల నేను ఆమెను నా భార్యగా చేసుకుందునే అంటున్నాడు. అంటే పరాయివాని భార్యను తన భార్యగా చేసుకోకూడదనే నైతికనియమం అతనికి తెలుసు (దానిని పాటిస్తారా పాటించరా అనేది పక్కనపెడితే అలా చేయకూడదని మాత్రం వారికి తెలుసు).
ఇటువంటివే మరో రెండు సందర్భాలు చూడండి -
ఆదికాండము 20:2-5 అప్పుడు అబ్రాహాము తన భార్యయైన శారాను గూర్చి ఈమె నా చెల్లెలని చెప్పెను గనుక గెరారు రాజైన అబీమెలెకు శారాను పిలిపించి తన యింట చేర్చుకొనెను. అయినను రాత్రివేళ దేవుడు స్వప్నమందు అబీమెలెకునొద్దకు వచ్చి నీవు నీ యింట చేర్చుకొనిన స్త్రీ ఒక పురుషునికి భార్య గనుక ఆమె నిమిత్తము నీవు చచ్చినవాడవు సుమా అని చెప్పెను. అయితే అబీమెలెకు ఆమెతో పోలేదు గనుక అతడు ప్రభువా ఇట్టి నీతిగల జనమును హతము చేయుదువా? ఈమె నా చెల్లెలని అతడు నాతో చెప్పలేదా? మరియు ఆమె కూడ అతడు నా అన్న అనెను. నేను చేతులతో ఏ దోషము చేయక యథార్థ హృదయముతో ఈ పని చేసితిననెను.
ఆదికాండము 26:9-11 అప్పుడు అబీమెలెకు ఇస్సాకును పిలిపించి ఇదిగో ఆమె నీ భార్యయే ఆమె నా సహోదరి అని యేల చెప్పితివని అడుగగా ఇస్సాకు ఆమెను బట్టి నేను చనిపోవుదునేమో అనుకొంటినని అతనితో చెప్పెను. అందుకు అబీమెలెకు నీవు మాకు చేసిన యీ పనియేమి? ఈ జనులలో ఎవడైన ఆమెతో నిర్భయముగా శయనించవచ్చునే. అప్పుడు నీవు మా మీదికి పాతకము తెచ్చిపెట్టువాడవుగదా అనెను. అబీమెలెకు ఈ మనుష్యుని జోలికైనను ఇతని భార్య జోలికైనను వెళ్లువాడు నిశ్చయముగా మరణశిక్ష పొందునని తన ప్రజలకందరికి ఆజ్ఞాపింపగా
ఈ సందర్భాలలో, అబ్రాహామూ, ఇస్సాకూ గెరారు దేశాన్ని పాలించిన ఇద్దరు అబీమెలకుల దగ్గరా తమ భార్యలను చెల్లెళ్ళని చెప్పడం, తరువాత వారు ఆ పురుషులకు భార్యలని తెలిసి తిరిగి అప్పగించడం మనకు కనిపిస్తుంది. పరాయి పురుషుల భార్యలను ఆశించకూడదని మోషే ధర్మశాస్త్రంలో రాయబడ్డ నైతికనియమం (నిర్గమకాండము 20:17) వీరికి ముందే తెలియకపోతే ఆ విధంగా కంగారుపడి వారికి అప్పగించవలసిన అవసరం లేదు.
అదేవిధంగా, అబ్రాహాము ఇస్సాకులు తమ భార్యలైన శారా రిబ్కాలను ఆ రాజుల ముందు చెల్లెళ్ళని మాత్రమే ఎందుకు చెప్పారు? ఉదాహరణకు నేను ఒక స్త్రీని నా చెల్లెలు అని చెబితే ఆమెకూ నాకూ మధ్య లైంగిక సంబంధం ఉందని ఎవరూ ఊహించలేరు; ఎందుకంటే, అలా చేయడం పాపమని మన సమాజానికి తెలుసు. ఇదే అవగాహన వారికి కూడా ఉంది కాబట్టే వారు శారా రిబ్కాలను మా చెల్లెళ్ళని చెబితే ఆ దేశపు ప్రజలు వారి మధ్య లైంగిక సంబంధం ఉందేమో అని అనుమానించలేదు. ఇస్సాకు రిబ్కాతో సరసం ఆడడం చూసిన అబీమెలకుకు అన్నాచెల్లెళ్ళు అలా ఉండరని తెలియబట్టే 'నాతో ఎందుకు అబద్ధం చెప్పావు, ఈమె నీ చెల్లి కాదు భార్య' అంటూ అతనితో వాదిస్తున్నాడు. రక్తసంబంధికులతో లైంగిక సంబంధం కలిగి ఉండకూడదనే నియమం కూడా మోషే ధర్మశాస్త్రంలోనే రాయబడింది (లేవీకాండము 18:9), కానీ అది వీరికి ముందే తెలుసు.
మరో ప్రాముఖ్యమైన సందర్భాన్ని కూడా చూద్దాం -
లేవీయకాండము 18:24,25 వీటిలో దేనివలనను అపవిత్రత కలుగజేసికొనకూడదు. నేను మీ యెదుట నుండి వెళ్లగొట్టుచున్న జనములు వాటన్నిటి వలన అపవిత్రులైరి. ఆ దేశము అపవిత్రత కలది గనుక నేను దాని మీద దాని దోషశిక్షను మోపుచున్నాను. ఆ దేశమందు కాపురమున్నవారిని వెళ్లగ్రక్కి వేయుచున్నది.
ఈ వచనాలకు ముందున్నవచనాలన్నీ మనం చదివితే, కానానీయులు వావివరసలు లేకుండా లైంగికసంబంధాలు సాగించినట్టూ, స్వలింగసంపర్కం, జంతుశయనం వంటి హేయమైన కార్యాలు కూడా జరిగించినట్టూ కనిపిస్తుంది. ఆ కారణంగానూ, ఇతర హేయక్రియల కారణంగానూ కూడా దేవుడు వారిని నాశనం చేస్తున్నాడు. ఒకవేళ మోషే ధర్మశాస్త్రానికి ముందు ప్రజలకు దేవుని చేత నైతికనియమాలు బోధించబడకపోతే కానానీయులు చేసేది పాపమని ఎలా ఆరోపించబడుతుంది? సొదొమ గొమొర్రా పట్టణస్తులపై ఎలా ఆరోపించబడింది?
అలా చేయకూడదని ఆయన బోధించాడో లేదో ఈ వాక్యభాగం చూడండి -
ద్వితీయోపదేశకాండము 8:20 నీ యెదుటనుండకుండ యెహోవా నశింపజేయుచున్న జనములు వినకపోయినట్టు మీ దేవు డైన యెహోవా మాట మీరు వినకపోయినయెడల మీరును వారివలెనే నశించెదరు.
ఈ వచనం ప్రకారం వారందరికీ అలా చేయకూడదని దేవుడు బోధించాడు కానీ, వారు ఆయన మాట వినలేదు. ఇంతకూ ఆయన ఎలా బోధించాడంటే (కొన్ని అవాంతర శాఖలవారు చెబుతున్నట్టు వారి మతగ్రంథాలను కూడా ఆయనే రాయించి కాదు) -
1) మనస్సాక్షి ద్వారా దేవుడు ఆ నైతికవిలువలను మానవుడు ఉనికిలోకి వచ్చినప్పటి నుండీ బోధిస్తూ వచ్చాడు.
రోమీయులకు 2:14,15 ధర్మశాస్త్రము లేని అన్యజనులు స్వాభావికముగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను చేసినయెడల వారు ధర్మశాస్త్రము లేనివారైనను, తమకు తామే ధర్మశాస్త్రమైనట్టున్నారు. అట్టివారి మనస్సాక్షి కూడ సాక్ష్యమిచ్చుచుండగను, వారి తలంపులు ఒక దానిమీద ఒకటి తప్పు మోపుచు లేక తప్పులేదని చెప్పుచుండగను, ధర్మశాస్త్రసారము తమ హృదయములయందు వ్రాయబడినట్టు చూపుచున్నారు.
కాబట్టే, ప్రపంచంలోని మనుషులందరికీ అబద్ధం చెప్పడం నేరం, హత్య చేయడం నేరం, వ్యభిచరించడం నేరం, దొంగతనం చేయడం నేరమమే విషయాలు తెలుసు. వారి వ్యక్తిగత కాఠిన్యాన్ని బట్టి వాటిని అనుసరించకపోయినా, వారికి శరీరవాంఛలను బట్టి వాటిలో కొన్నినేరాలు కాదన్నట్టుగా దేశంలో చట్టాలు రూపొందించుకున్నా, వారి మనస్సాక్షికి మాత్రం అవి నేరమని తెలుసు (మనస్సాక్షి వాత వేయబడ్డప్పుడు మాత్రం వాటిని నేరంగా పట్టించుకోరు). దీనిప్రకారం ఏకాలంలో అయినా మానవుడు వాటిని తప్పి ప్రవర్తించినప్పుడు ఆయన శిక్షించడం న్యాయమే.
తరువాతి కాలంలో, ఆయన మానవుని మనస్సాక్షిలో ముందు నుండీ ఉన్న ఆ నైతికవిలువలనే గుర్తుచేస్తూ, తన ఆరాధనకు, మరికొన్ని ఆచారాలకు, వ్యక్తిగత శుభ్రతకు, ఆహారానికీ సంబంధించిన ఆజ్ఞలను కూడా కలిపి ధర్మశాస్త్రంగా రాయించి ఇచ్చాడు. వీటిలో కూడా కొన్ని భక్తులకు ముందు నుండీ తెలుసు (ఆరాధనకు సంబంధించిన ఈ విషయాలు ముందుగానే నోవాహు, హనోకు వంటి భక్తులకు ప్రత్యక్షత ద్వారా ఆయన బోధించాడు).
ఉదాహరణకు, దశమభాగం గురించిన కట్టడ మనకు మోషేధర్మశాస్త్రంలో రాయబడింది కానీ, అబ్రాహాము, యాకోబులు వాటిని ముందే పాటించినట్టు కనిపిస్తుంది.
ఆదికాండము 14:20 నీ శత్రువులను నీ చేతికప్పగించిన సర్వోన్నతుడగు దేవుడు స్తుతింపబడును గాక అనియు చెప్పెను. అప్పుడతడు అన్నిటిలో ఇతనికి పదియవవంతు ఇచ్చెను.
ఆదికాండము 28:22 మరియు స్తంభముగా నేను నిలిపిన యీ రాయి దేవుని మందిరమగును; మరియు నీవు నా కిచ్చు యావత్తులో పదియవవంతు నిశ్చయముగా నీకు చెల్లించెదనని మ్రొక్కుకొనెను.
అదేవిధంగా దేవునికి ఆయన పవిత్ర జంతువులుగా ఎంచినవాటిని మాత్రమే బలిగా అర్పించాలని మోషే ధర్మశాస్త్రంలో రాయబడింది. కానీ అంతకుముందే నోవాహు దానిని పాటించినట్టు మనం చూడగలం.
ఆదికాండము 8:20 అప్పుడు నోవహు యెహోవాకు బలిపీఠము కట్టి, పవిత్ర పశువులన్నిటిలోను పవిత్ర పక్షులన్నిటిలోను కొన్ని తీసికొని ఆ పీఠము మీద దహనబలి అర్పించెను.
2) నోవాహు జలప్రళయం తరువాత ప్రజలంతా ఒకే చోట నివసించారు, అక్కడి నుండే చెదరగొట్టబడి అనేక మతాలను స్థాపించుకున్నారు. ఆ సమయంలో నోవాహు కుమారులవంటి భక్తులు (మెస్సీయ జన్మించబోయే వంశంలోనివారు) వారి మధ్య ఉండి, వారికి దేవుని నైతిక ప్రమాణాలు బోధించి ఉండవచ్చు. కాబట్టే వారు చెదరిపోయినప్పటికీ వారివారి మతగ్రంథాలు కొన్నిటిలో వీటి గురించిన ప్రస్తావనలు మనకు కనిపిస్తాయి.
ఈ విధంగా మానవులందరికీ మోషే ధర్మశాస్త్రానికి పూర్వమే నైతిక నియమాలు తెలుసు. అలా తెలియవు, ధర్మశాస్తం లేనపుడు ఏం చేసినా పాపం ఆరోపించబడదనే అపార్థబోధ వల్ల చివరికి ఆదాము మొదటి తరమంతా వావివరుసలు తప్పి తమ రక్తసంబంధికులనే వివాహం చేసుకునేలా దేవుడు అనుమతించాడనే (దీనికి ఆధారంగా మరికొన్ని వాక్యభాగాలను కూడా వక్రీకరించారు), దేవునిచేత పిలవబడ్డ అబ్రాహాము కూడా తన తండ్రి కుమార్తెనే వివాహం చేసుకున్నాడనే దరిద్రపు బోధలు సంఘంలో చోటుచేసుకున్నాయి (అడికాండము 20 వ అధ్యాయపు వ్యాఖ్యానం చూడండి).
నూతననిబంధనలో ధర్మశాస్త్రం కొట్టివేయబడింది అన్నపుడూ, ధర్మశాస్త్రం లేనపుడు పాపం ఆరోపించబడదు అన్నపుడూ ధర్మశాస్త్రంలోని నైతిక నియమాల గురించి చెప్పబడడం లేదు. ఆచార సంబంధమైన విధుల గురించే చెప్పబడుతున్నాయి. వాటిని మానవులు తమ పతనస్వభావం కారణంగా ఒకటి కూడా తప్పిపోకుండా పాటించలేక శాపానికి గురౌతున్నారు; అందుకే క్రీస్తు వాటిని నెరవేర్చి తన సిలువ మరణంతో కొట్టివేసాడు.
ఎఫెసీయులకు 2:14 ఆయన మన సమాధానమైయుండి మీకును మాకును ఉండిన ద్వేషమును, అనగా విధిరూపకమైన ఆజ్ఞలుగల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్యగోడను పడగొట్టి, మన ఉభయులను ఏకము చేసెను.
రెండవ కొరింథీయులకు 3:14-16 మరియు వారి మనస్సులు కఠినములాయెను గనుక నేటివరకును పాత నిబంధన చదువబడునప్పుడు, అది క్రీస్తునందు కొట్టివేయబడెనని వారికి తేటపరచబడక, ఆ ముసుకే నిలిచియున్నది. నేటి వరకును మోషే గ్రంథము వారు చదువునప్పుడెల్ల ముసుకు వారి హృదయముల మీదనున్నది గాని వారి హృదయము ప్రభువు వైపునకు ఎప్పుడు తిరుగునో అప్పుడు ముసుకు తీసివేయబడును.
ఇప్పటిదాకా మనం చూసిన ఈ వాదనను కొందరు మరొక వచనం ఆధారంగా వ్యతిరేకించే ప్రయత్నం చేయొచ్చు; అది కూడా చూడండి -
కీర్తనల గ్రంథము 147:19,20 ఆయన తన వాక్యము యాకోబునకు తెలియజేసెను తన కట్టడలను తన న్యాయవిధులను ఇశ్రాయేలునకు తెలియజేసెను. ఏ జనమునకు ఆయన ఈలాగు చేసియుండలేదు ఆయన న్యాయవిధులు వారికి తెలియకయే యున్నవి. యెహోవాను స్తుతించుడి.
ఈ సందర్భంలో, దేవుని న్యాయవిధులు ఇశ్రాయేలీయులకు మాత్రమే తెలుసని, మరే జనానికీ ఆయన అలా తెలియచేయలేదని ఉంది. దీనిప్రకారం, మోషే ధర్మశాస్త్రానికి ముందున్న ప్రజలకు నైతికవిలువలు తెలియవని చెప్పే వాదనే సరిగానే కనిపిస్తుంది. అయితే అలా ఆలోచించే ముందు ఇశ్రాయేలీయులకు ముందున్న అబ్రాహాము, నోవాహు, హనోకులకు కూడా దేవుని న్యాయవిధులు తెలియవా? దేవుడు వారికి తెలియచేయలేదా అనే ప్రశ్న వేసుకోవలసి వస్తుంది. వాస్తవానికి ఈ సందర్భంలో భక్తుడు ఒక ప్రత్యేకమైన రీతిలో (ప్రత్యక్షతను అనుగ్రహించి) ఇశ్రాయేలీయులకు లిఖితపూర్వకంగా, నిబంధన ప్రకారం ధర్మశాస్త్రాన్ని ఇవ్వడం గురించి మాట్లాడుతున్నాడే తప్ప, అందులోని నైతికవిలువలు ముందుకానీ, తరువాత కానీ ఎవరికీ మనస్సాక్షి ద్వారా తెలియచేయలేదనే భావం ఇందులో లేదు.
మోషే ధర్మశాస్త్రంలో నైతికవిలువలతో పాటు వాటిని మీరినవారిని ఎలా శిక్షించాలో తెలియచేస్తూ న్యాయశాస్త్రాన్ని కూడా ఆయన రాయించాడు. అదేవిధంగా అందులో దేవుణ్ణి ఎలా ఆరాధించాలో (బలులు, ఆచారాలు) స్పష్టంగా, క్రమంగా రాయబడ్డాయి (ఇశ్రాయేలీయులకు పితరులైనవారిలో కొందరికి కూడా ఇవి ప్రత్యక్షత ద్వారా తెలియచేయబడ్డాయి). తరువాత కాలంలో కూడా ఇశ్రాయేలీయులకు ప్రవక్తల ద్వారా ఆ ధర్మశాస్త్ర సారాన్ని వివరిస్తూ మరెన్నో బోధలు చేయబడ్డాయి. ఆవిధంగా అన్యజనులకు ఆయన తన న్యాయవిధులను వాక్యప్రత్యక్షత ద్వారా తెలియచేయలేదు. ఆయన్ని ఎలా ఆరాధించాలో వారికి తెలియకుండానే ఉన్నారు.
దేవుడు కానానులో ప్రజలను నశింపచేసినా, సొదొమ పట్టణాలపై అగ్నిని కురిపించినా, నినెవేని నాశనం చేయబోతున్నానని యోనాతో ప్రకటింపచేసినా, మిగిలిన కొన్ని జాతులపై యుద్ధాన్ని ప్రకటించినా, వారికి ఆయన మనస్సాక్షి ద్వారా బోధించిన నైతికవిలువలను తప్పారనే కారణంతోనే తప్ప, మోషే ధర్మశాస్త్రంలోని విధిరూపకమైన ఆజ్ఞలు(ఆరాధనకు సంబంధించినవి, ఇతరమైనవి) పాటించలేదని కాదు. ఆయన వాటిని ఇశ్రాయేలీయులకు తెలియచేసినట్టు తెలియచేయలేదు కాబట్టే ఆ విషయంలో వారిని నాశనం చేయలేదు.
కాబట్టి, మోషేధర్మశాస్త్రానికి ముందు ప్రజలకు అందులోని నైతికవిలువలు తెలియవని కానీ, ధర్మశాస్త్రం నుండి విడిపించబడ్డ మనకు అందులో రాయబడ్డ నైతికవిలువలు వర్తించవని కానీ బోధించడం వాక్యవిరుద్ధం. నూతన నిబంధనలో నైతిక విలువలకు ఎలాంటి మార్పులూ చేయబడలేదు.
Copyright Notice
"ఈ వ్యాసం/పుస్తకం, 'హితబోధ కమ్యూనికేషన్స్'వారి అనుమతి ద్వారా ప్రచురించబడింది ©2021 www.hithabodha.com"
ఇందులో ఉపయోగించిన బైబిలు వచనాలన్నీ బైబిల్ సొసైటీవారు ప్రచురించిన పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఉపయోగించబడినవి.