సువార్త

రచయిత: కె. నరసింహుడు

నరకాన్ని చూసి వచ్చిన మనుషులెవ్వరూ లేనప్పటికీ దాదాపు మత గ్రంధాలన్నీ నరకం గురించి మాట్లాడుతున్నాయి. ఏకైక దేవునివాక్య గ్రంథమైన బైబిల్ కూడా నరకం యొక్క ఉనికిని ప్రకటిస్తుంది. దాని గురించే ఈ వ్యాసంలో చూడబోతున్నాం. బైబిల్ గ్రంథంలో నమ్మదగిన వ్యక్తి ఒకరున్నారు. ఆయనే దేవుడైన యేసుక్రీస్తు. ఆయన అబద్ధం చెప్పినట్టు ఎక్కడా కనిపించదు. ప్రతిగా ఆయన అబద్ధాన్ని తీవ్రంగా ఖండించినట్టు మనం చదువుతాము. ఆయన తన బోధల్లో ఈ నరకం గురించి ప్రజలను ఎక్కువగా హెచ్చరించాడు.

నిజానికి నరకం అనేది ఎవ్వరికీ ఇష్టం లేని భయంకరమైన స్థలం. దాని గురించి మాట్లాడడానికి కూడా చాలా మందికి ఇష్టం ఉండదు. అయితే యేసుక్రీస్తు ఆ నరకం గురించి ఎక్కువగా మాట్లాడాడు. ఎందుకంటే ఆ నరకం గురించీ దానియొక్క భయంకరత్వం గురించీ ఆయనకు తెలిసినంతగా మరెవ్వరికీ తెలియదు అనేది ఒకటైతే మనుషులను ఆయనకంటే ఎక్కువగా ప్రేమించే వారెవ్వరూ ఉండరు అనేది రెండవ కారణం. ఆయన మనుషులను అంతగా ప్రేమించాడు కాబట్టే భయంకరమైన ఆ నరకానికి వెళ్ళకూడదని వారిని ఎక్కువగా హెచ్చరించాడు. ఉదాహరణకు; "అప్పుడాయన యెడమవైపున ఉండువారిని చూచి శపింపబడినవారలారా, నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి" (మత్తయి 25:41), "వీరు నిత్యశిక్షకును నీతిమంతులు నిత్యజీవమునకును పోవుదురు" (మత్తయి 25:46) అనే హెచ్చరికలు ఆయన చేసినవే.

గమనించండి; కొత్త నిబంధనలోనే కాదు పాత నిబంధనలో కూడా నరకం యొక్క ప్రస్తావన మనకు కనిపిస్తుంది. ఉదాహరణకు; "మరియు సమాధులలో నిద్రించు అనేకులు మేలుకొనెదరు. కొందరు నిత్య జీవము అనుభవించుటకును, కొందరు నిందపాలగుటకును నిత్యముగా హేయులగుటకును మేలుకొందురు" (దానియేలు 12:2) అని రాయబడింది.‌ కాబట్టి దేవుడున్నాడు అనేది ఎంత వాస్తవమో నిత్య నరకం ఉందనేది కూడా అంతే వాస్తవం. అబద్ద మాడనేరని దేవుడే చెప్పాడు కాబట్టి దీనిని దృవీకరించుకోవచ్చు. నరకం అనేది మన నమ్మకాన్ని బట్టి ఆధారపడి ఉండదు. అనగా నేను నమ్మితే ఉంటుంది నమ్మకపోతే ఉండదు అన్నట్టుగా ఉండదు. నమ్మినా నమ్మకపోయినా నరకం ఉందనేది తిరుగులేని వాస్తవం.

ఇంతకూ ఆ నరకానికి ఎవరు పాత్రులు?

హంతకులూ మరియు పెద్ద పెద్ద నేరాలు చేసిన వారు మాత్రమే నరకానికి వెళ్తారని, వెళ్ళినా అక్కడ కొంతకాలమే శిక్ష అనుభవిస్తారని చాలామంది అనుకుంటుంటారు. కానీ వాస్తవం ఏంటంటే ఆలోచనల ద్వారా కానీ క్రియల ద్వారా కానీ దేవునికి వ్యతిరేకంగా చెసే ఏ నేరమైనా అది మన దృష్టిలో చిన్నదైనా లేక పెద్దదైనా అది నిత్య నరకానికి అర్హత కలిగినవారిగా చేస్తుంది. ఆ నిత్యనరకం పాలవ్వడానికి ఒక్క నేరం సరిపోతుంది. దీనికి ఆధారంగా యేసుక్రీస్తు ప్రభువు పలికిన మాటలు చూడండి;

మత్తయి 5:22 నేను మీతో చెప్పునదేమనగాతన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును, తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పు వాడు మహా సభకు లోనగును; ద్రోహీ అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును.

మత్తయి 5:28 నేను మీతో చెప్పునదేమనగాఒక స్త్రీని మోహపుచూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసినవాడగును.

మత్తయి 5:29 నీ కుడికన్ను నిన్ను అభ్యంతర పరచినయెడల దాని పెరికి నీయొద్దనుండి పారవేయుము; నీ దేహ మంతయు నరకములో పడవేయబడకుండ నీ అవయవములలో నొకటి నశించుట నీకు ప్రయోజనకరముగదా.

ప్రస్తుతం చాలామందిలానే అప్పటి యూదులు కూడా ఒక వ్యక్తిని చంపితేనే పాపం, వ్యబిచారం చేస్తేనే పాపం, కేవలం అలాంటి క్రియలే నరకపాత్రులుగా చేస్తాయని అనుకునేవారు. కానీ యేసుప్రభువు చెప్పినదాని ప్రకారం; అకారణంగా ఒక వ్యక్తిపై కోపగిస్తే చాలు, వ్యర్థుడా అంటే చాలు, ద్రోహి అంటే చాలు అది దేవుని తీర్పుకు మరియు నిత్య నరకానికి పాత్రులుగా చేస్తుంది. అలానే ఒక స్త్రీని లేదా పురుషుణ్ణి మోహపు చూపుతో చూస్తే చాలు అది నరకానికి అర్హత కలిగిన వారిగా చేస్తుంది. అంటే కేవలం క్రియల ద్వారా మాత్రమే కాదు ఆలోచనల్లో పాపమున్నా కూడా నరకానికి పాత్రులు.

అలానే దొంగతనం, డబ్బు మీద ఆశ, దుర్మార్గత, మోసం, కారణం లేకుండా కోపపడడం, అసూయ, దూషణ, హత్య, దుర్మార్గత,  గర్వం, దుష్టబుద్ధి, పోకిరి చేష్టలు, అల్లరితో కూడిన ఆటపాటలు, కొట్లాడడం, తిట్టడం, కొట్టడం, పగ పట్టడం, మత్సరపడడం, అపనింద వేయడం, మూర్ఖత్వం, చెడ్డ ఆలోచన, అవినీతి పని, అబద్ధాలు ఆడడం, అపకారం చెయ్యడం, తల్లిదండ్రుల మాట వినకపోవడం , మాట తప్పడం, దేవుణ్ణి ద్వేషించడం, చెడ్డవాటిని కల్పించడం, జాలి చూపకుండా ఉండడం, క్షమించకపోవడం, దయ చూపకుండా ఉండడం. కామవికారం, వ్యభిచారం, జారత్వం, లైంగిక ఆలోచన, పురుషులతో పురుషులు, స్త్రీలతో స్త్రీలు  అసహజమైన సంబంధం కలిగి ఉండడం. ఇలాంటి నేరం ఒక్కటి చేసినా అది నరకపాత్రులుగా చేస్తుంది.

గుర్తుంచుకోండి; ఇవన్నీ చేస్తేనే కాదు ఇందులో ఏ ఒక్కటి చేసినా అది నరకానికి తీసుకెళ్తుంది. ఒక మనిషి తన జీవితంలో అనగా తాను పుట్టినప్పటినుండి మరణించే వరకూ వీటిలో ఏ ఒక్కటి చేసినా అతను నరకనికే వెళ్తాడు. ఈ సత్యాన్ని అంగీకరించడం చాలా కష్టంగాను మరియు ఆశ్చర్యంగా ఉంది కదూ. ఎందుకంటే దేవుడు ఇంత చిన్న నేరానికి అంత పెద్ద శిక్ష వెయ్యడులే అనుకుంటుంటాం. మనం అలా అనుకోవడానికి కారణం; దేవుడు ఎలాంటి వాడు, ఆయన ఎలా తీర్పు తీరుస్తాడో తెలియకపోవడం ఒకటైతే మనం ఏ నియమాలైతే పెట్టుకున్నామో ఆ నియమాలకు లోబడే దేవుడు తీర్పు తీరుస్తాడు అనుకోవడం రెండవకారణం.‌

కానీ ఈ సృష్టిని ఎవరు సృష్టించారు? దేవుడు. అలాంటప్పుడు ఏ పని నరకానికి అర్హత కలుగచేస్తుంది ఏది కలుగచెయ్యదు అనే నియమం దేవుడు పెట్టాలా లేక మనం పెట్టాలా?. కచ్చితంగా దేవుడే పెట్టాలి. ఎందుకంటే ఈ సృష్టి ఆయనది కాబట్టి నియమాలు కూడా ఆయనే పెట్టాలి. కాబట్టి ఆయన పెట్టిన నియమాలను అనుసరించే ఆయన తీర్పు తీరుస్తాడు తప్ప మనిషి పెట్టుకున్న నియమాలను బట్టి కాదు. కాబట్టి ఆయన పెట్టిన నియమాలలో ఏ ఒక్కటి తప్పినా నరకమే. దేవుడు ఏమై ఉన్నాడో మనం తెలుసుకుంటే ఆ నియమాల గురించి కూడా కొంతవరకూ మనకు అవగాహన వస్తుంది.    

దేవుడు పరిశుద్దుడు అని బైబిల్ చెబుతుంది. పరిశుద్ధతలో పరిపూర్ణతా స్థితిలో దేవుడు ఉన్నాడు. అనగా అంతకంటే ఎక్కువ పరిశుద్ధత అనేది లేదు. దేవుడు అదే పరిశుద్ధతలో ఎప్పటికీ ఉంటాడు. అంటే భవిష్యత్తులో కూడా ఆయన అలానే ఉంటాడు. ఆయనకున్న పరిశుద్ధత పెరగడం కానీ తరగడం కానీ ఉండదు. ఆయన పరిశుద్ధుడు కాబట్టే మనకు నియమాలు ఇవ్వబడ్డాయి. అలానే ఆయన అనంత జ్ఞానియై ఉన్నాడు. అంటే ఆయనకు తెలియనిదంటూ ఏదీ లేదు. అందుకే "మాట నా నాలుకకు రాకమునుపే అది నీకు పూర్తిగా తెలిసియున్నది" (కీర్తనలు 139:4) అని‌ రాయబడడం చూస్తున్నాం. ఆయనకు మన మనసు ఎంతో తేటగా కనిపిస్తుంది. మనకు మతి మరుపు ఉన్నట్టు ఆయనకు అలాంటిదేమీ ఉండదు. అలానే ఆయన సర్వవ్యాపియై ఉన్నాడు. అనగా ఒకే సమయంలో అన్ని చోట్లా ఉండడం ఆయనకే సాధ్యం. ఈ కారణాన్ని బట్టి దేవుణ్ణి మనం చూడలేం. ఎందుకంటే మనం కాలానికీ ఒక స్థలానికీ పరిమితమైన వారం కానీ దేవుడు అలా కాదు ఆయన అనంతుడు, అంతటా ఆత్మగా వ్యాపించి ఉన్నవాడు. ఆయన లేని స్థలం అంటూ ఏదీ లేదు.  ఇదే విషయం "నీ ఆత్మయొద్దనుండి నేనెక్కడికి పోవుదును? నీ సన్నిధినుండి నేనెక్కడికి పారిపోవుదును? నేను ఆకాశమునకెక్కినను నీవు అక్కడను ఉన్నావు నేను పాతాళమందు పండుకొనినను నీవు అక్కడను ఉన్నావు" (కీర్తన139:7, 8) అని స్పష్టంగా రాయబడింది.

దేవుడు సర్వ శక్తిమంతుడై ఉన్నాడు. ఆయనను మించిన శక్తి అంటూ ఏదీ లేదు. ఆయనకు ఏమైనా చెయ్యగలిగే శక్తి ఉంది. ఎప్పుడూ కూడా ఆయన తనకు మాత్రమే ఉన్నటువంటి ఈ గుణాలను అనుసరించే తీర్పు తీరుస్తాడు. అందుకే ఆయన యొక్క తీర్పు ఎంతో కచ్చితమైనదిగా ఉంటుంది. ఆయన తీర్పు తీర్చేటప్పుడు సాక్ష్యాలు, రుజువులను అనుసరించి ఎంతో కచ్ఛితత్వంతో సత్యాన్ని అనుసరించి తీర్పు తీరుస్తాడు. ఆయనతో ఇంత కఠినమైన నియమాలు నా అనుమతి లేకుండా ఎందుకు పెట్టావు, నేను నరకానికి అర్హున్ని కాదు అని వ్యాజ్యం ఆడి లేదా వాదించి గెలవగలిగిన వ్యక్తి ఎవ్వరూ లేరు. మనం తీర్చే తీర్పుల్లో లోపాలు ఉండడం సహజం కానీ ఆయన తీర్పుల్లో లోపాలు ఉండే అవకాశం ఎంతమాత్రం ఉండదు.

కాబట్టి ఈ సృష్టిని దేవుడు చేశాడు. ఆయన కోసమే‌ చేసాడు. ఆయన కోసమే అనంటే ఆయన గుణాలను అనుసరించి అందులో నియమాలు కూడా పెట్టాడు. ఆయన అంత ఉన్నతమైన హోదాలో ఉన్నాడు కాబట్టి మనం చేసే ఈ చిన్న పాపమైనా మనల్ని ఆయన ఆగ్రహానికీ ఉగ్రతకూ గురి చేస్తుంది. మనం పాపం చేసిన ప్రతిసారీ దేవునితో పరోక్షంగా ఈవిధంగా చెబుతున్నాము “దేవా నీవు పరిశుద్దుడవు, గొప్ప వాడవు ఐతే నాకేంటి నేను లెక్క చెయ్యను”. ఈవిధంగా మనం చెసే ప్రతీపాపం దేవునికి వ్యతిరేకంగానే చేస్తున్నాము. మనం ఆయన స్వరూపంలో ఆయన పోలికలో సృష్టించబడ్డాము కాబట్టి ఆయన మన నుండి అంతే నీతిని, పరిశుద్ధతను ఆశిస్తున్నాడు. అందులో కొంచెం తక్కువైనా ఆయన సహించడు. అది ఏదైనా ఎంత చిన్నదైనా నిత్యుడైన దేవుని నుండి శాశ్వతంగా దూరం చేస్తుంది. దేవుడు ఏవిధంగా ఐతే ఎలాంటి పాపమూ లేకుండా పరిశుద్ధుడిగా ఉన్నాడో అలానే ఏ వ్యక్తి ఐతే ఆయన పెట్టిన నియమాలను అనుసరించి పుట్టినప్పటి నుండి మరణించే దాకా ఏ పాపమూ చెయ్యకుండా పరిశుద్ధుడిగా ఉంటాడో అలాంటి వ్యక్తి మాత్రమే దేవునితో ఉండగలడు. దీనిని బట్టి ఎవరు నరకానికి అర్హత కలిగిన వారుగా చెప్పవచ్చు? యాధార్థంగా ఆలోచిస్తే అందరూ అనే సమాధానం వస్తుంది. ఔను అందరూ నరకానికి పాత్రులే. ఇదే విషయాన్ని బైబిల్ నొక్కి మరీ చెబుతుంది. 

రోమీయులకు 3:10-12 నీతిమంతుడు లేడు , ఒక్కడును లేడు. గ్రహించువాడెవడును లేడు దేవుని వెదకువాడెవడును లేడు. అందరును త్రోవ తప్పి యేకముగా పనికిమాలినవారైరి.

రోమీయులకు 3:23 ఏ భేదమును లేదు ; అందరును పాపముచేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేక పోవుచున్నారు.

నరకంలో శిక్షలు ఎలా ఉంటాయి ?

వాస్తవానికి నరకంలో ఉండే శిక్షలను, బాధను మనం వివరించలేము. అది ఎంతో భయంకరమైన ప్రదేశంగా చెప్పబడింది. అయితే దేవుడు ఆ శిక్షలను మనం అర్థం చేసుకోగలిగే పదాలతో వర్ణించాడు. ఈ లోకంలో మనం ఏదైనా నేరం చేసినప్పుడు ఆయా దేశాల నియమాలను బట్టి శిక్షలు ఉంటాయి. చేసింది ఒకే నేరమైనా అది ఎవరికి విరోధం చేశాము అనే దానిని బట్టి శిక్షలు ఉంటాయి. ఉదాహరణకు ఒక సాధారణ పౌరున్ని కొడితే ఒక శిక్ష, ఒక ప్రభుత్వ పదవిలో ఉన్న వ్యక్తిని కొడితే ఒక శిక్ష, ప్రధానమంత్రిని కొడితే ఒక శిక్ష ఉంటుంది. ఇక్కడ నేరం ఒక్కటే అయినా అమలు చెసే శిక్షల్లో మాత్రం తేడా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఏ నేరం చేసాము అనే దానికంటే ఎవరికి విరోధంగా చేశాం అనేదానిని బట్టి శిక్షలు మారుతూ ఉన్నాయి. అంటే అవతలి వ్యక్తి స్థాయి పెరిగే కొలది శిక్ష కూడా పెరుగుతూ పోతుంది. కేవలం ఈ లోకంలో విధించే శిక్షలే అవతలి వ్యక్తి స్థాయిని బట్టి ఉంటే అత్యున్నతమైన హోదాలో ఉన్న దేవునికి విరోధంగా చేసే పాపానికి మరింత కఠినమైన శిక్ష ఉంటుదనడంలో ఆశ్చర్యం లేదు. 

మనం చేసే ప్రతీ పాపం ఆ నిత్యుడైన దేవునికి విరోధంగా చేస్తున్నాము కాబట్టి పాపానికి దేవుడు వేసే శిక్ష నిత్య నరకం. చిన్న పాపమైనా పెద్ద పాపమైనా కొన్ని చేసినా ఎక్కువగా చేసినా కొంత కాలమే చేసినా ఎక్కువ కాలం చేసినా అందరూ కూడా నిత్య నరకంలో బాధించబడుతూ ఉంటారు. ఈ స్థితి ఎప్పటికీ మారదు. మన యొక్క నిజమైన జీవితం మనం చనిపోయిన తర్వాత ప్రారంభం ఔతుంది. నిత్యత్వంతో పోలిస్తే ఈ జీవిత కాలం రెప్ప పాటుతో సమానం. అందుకే యేసు ప్రభువు "మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపువారికి భయపడకుడి గాని, ఆత్మను దేహమునుకూడ నరకములో నశింపజేయగలవానికి మిక్కిలి భయపడుడి." (మత్తయి 10:28) అని అన్నారు. 

ఈ లోకంలో మనల్ని బాధించే వ్యక్తి మహా ఐతే చంపగలడు కాని తర్వాత అతను ఇంక ఏమీ చెయ్యలేడు. అయితే దేవుడు చనిపోయిన తర్వాత కూడా అంటే ఆత్మనూ దేహాన్నీ రెండింటిని కూడా నరకంలో బాధించగలడు. కాబట్టి మనుష్యుల కంటే ఎక్కువగా దేవునికే భయపడమని ప్రభువు హెచ్చరించాడు. నరకానికి వెళ్ళే వ్యక్తి చనిపోయిన వెంటనే అతను పాతాళంలో ప్రత్యక్షమౌతాడు. ఇక్కడ కళ్ళు మూసిన వెంటనే కొన్ని వేల రెట్ల బాధతో పాతాళంలో బాధించబడుతూ అక్కడ కళ్ళు తెరుస్తాడు. 

బైబిల్ గ్రంథం నరకాన్ని ఈవిధంగా వివరిస్తుంది.

దేహం మరియు ఆత్మ నరకంలో నశింప చెయ్యబడడం

మత్తయి 10:28 ప్రకారం; నరకానికి వెళ్ళే వ్యక్తికి ఎల్లప్పుడూ ఉండే శరీరం ఇవ్వబడుతుంది. అది ఈ లోకం లో ఉన్న దేహంలా అగ్నిలో కరిగిపోదు. ఆ దేహం మరియు ఆత్మ రెండూ కూడా నిరంతరం అగ్నిలో కాలిపోతూ ఉంటాయి.

ఏడ్చుట, పండ్లు కొరుకుట:

మత్తయి 8:12 అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు నుండునని మీతో చెప్పుచున్నాననెను.

అక్కడ నిరంతరం ఏడుస్తూనే ఉంటారు. ఆ ఏడుపుకు ఓదార్పు ఉండదు. అగ్నిలో ఒక వ్యక్తి బాధించబడుతూ ఉన్నప్పుడు వారు విపరీతమైన బాధను అనుభవిస్తారు కాబట్టి ఆ బాధతో పండ్లు కోరుకుతూ ఉంటారు. 

అగ్నిగుండము:

మత్తయి 13:41 మనుష్యకుమారుడు తన దూతలను పంపును; వారాయన రాజ్యములోనుండి ఆటంకములగు సకలమైనవాటిని దుర్నీతిపరులను సమకూర్చి అగ్నిగుండములో పడవేయుదురు.

ఒక వ్యక్తి ఈ లోకంలో అగ్నిలో పడినప్పుడు ఎంతగా బాధ అనుభవిస్తాడో అంతకంటే ఎన్నో రెట్లు ఎక్కువగా నరకంలో అలాంటి బాధనే అనుభవిస్తాడు. 

వెలుపటి చీకటి:

మత్తయి 8:12 రాజ్య సంబంధులు వెలుపటి చీకటిలోనికి త్రోయబడుదురు.

మత్తయి 22:13 అంతట రాజువీని కాళ్లు చేతులు కట్టి వెలుపటి చీకటిలోనికి త్రోసివేయుడి.

ఒకవైపు అగ్నిలో బాధించబడుతూ ఉంటారు అదేవిధంగా మానసిక బాధను కూడా అనుభవిస్తారు. ఈ చీకటి మానసిక బాధను సూచిస్తుంది. చాలా మందికి చీకటి అంటే భయంగా ఉంటుంది. ఆ భయం నరకంలో ఎన్నో రెట్లు ఉంటుంది. చాలామంది నరకంలో అందరూ ఒకే స్థలంలో ప్రక్కప్రక్కనే ఉంచబడి ఒక సమూహంగా బాధించబడుతూ ఉంటారని అనుకుంటారు. కానీ దానికి భిన్నంగా చీకటి అనుభవిస్తూ ఉంటారు అని రాయబడింది. అంటే అక్కడికి పోయినవారు ఒంటరితనం అనుభవిస్తూ ఉంటారు. అభద్రతతోనూ దారి తప్పిన భావనతోనూ మరియు దిక్కుతోచని స్థితిలోనూ అక్కడ ఒంటరిగా బాధ అనుభవిస్తూ ఉంటారు.

నిందపాలగుట, నిత్యముగా హేయులగుట, పరిశుద్ధ దూతల ఎదుట బాదింపబడుట:

దానియేలు 12:2 మరియు సమాధులలో నిద్రించు అనేకులు మేలుకొనెదరు ; కొందరు నిత్య జీవము అనుభవించుటకును, కొందరు నిందపాలగుటకును నిత్యముగా హేయులగుటకును మేలుకొందురు.

ప్రకటన 14:10 ఏమియు కలపబడకుండ దేవుని ఉగ్రతపాత్రలో పోయబడిన దేవుని కోపమను మద్యమును వాడు త్రాగును. పరిశుద్ధ దూతల యెదుటను గొఱ్ఱెపిల్ల యెదుటను అగ్నిగంధకములచేత వాడు బాధింపబడును.

సాధారణంగా ఈలోకంలో మనుష్యులు ఎవ్వరికీ కనబడకుండా రహస్యంగా పాపాలు చేస్తూ ఉంటారు. ఎందుకంటే వారి యొక్క రహస్య జీవితం ఇతరులకు తెలిస్తే వారు అసహ్యించుకుంటారని, అవమానం కలుగుతుందని భయం. అయితే నరకంలో వారు చేసిన రహస్య పాపాలు అందరికీ తేటగా తెలుస్తాయి. కాబట్టి వారు ఘోరమైన అవమానాన్ని నిత్యత్వమంతా అనుభవిస్తూనే ఉంటారు. అందరూ వీరిని అసహ్యించుకుంటారు. ఈ లోకంలో జీవించినంతకాలం వారు వారి రహస్య పాపాన్ని ఎవ్వరికీ కనపడకుండా ఎంతో గౌరవంగా హూందాగా బ్రతికి ఉండవచ్చు. అయితే నరకంలో వారి యొక్క నిజస్థితి తెలుస్తుంది. వారు నరకంలో బాధించబడడం పరిశుద్ధదూతలందరూ చూస్తారు. ఇక్కడైతే ప్రభుత్వ నియమాలు, ఇరుగు పొరుగువారు ఏమనుకుంటారు అనే భయాలు పాపం చెయ్యకుండా ఉండడానికి అడ్డుగా ఉంటాయి. నరకంలో ఇలాంటి పరిమితులేమీ ఉండవు. 

దేవుని చేత విడిచి పెట్టబడుట:

2 థెస్సలొనీకయులకు 1:10 ఆయన సముఖము నుండియు ఆయన ప్రభావమందలి మహిమనుండియు పారదోలబడి, నిత్యనాశనమను దండన పొందుదురు.

వారు నిత్యుడైన దేవుని సన్నిధి నుండి పారద్రోలబడతారు. ఇక ఎప్పటికీ దేవుని నుండి ఎలాంటి దయను కాని, కరుణను కాని పొందుకోలేనివిధంగా దూరమైపోతారు. 

రాత్రింబగళ్లు అగ్నిజ్వాలలో యాతనపడుచూ, తీరని దాహంతో నెమ్మది లేనివారై యుండుట:

ప్రకటన 14:11 వారి బాధసంబంధమైన పొగ యుగయుగములు లేచును; ఆ క్రూరమృగమునకు గాని దాని ప్రతిమకు గాని నమస్కారముచేయువారును, దాని పేరుగల ముద్ర ఎవడైనను వేయించుకొనినయెడల వాడును రాత్రింబగళ్లు నెమ్మది లేనివారై యుందురు.

లూకా 16:24 తండ్రివైన అబ్రాహామా నాయందు కనికర పడి, తన వ్రేలి కొనను నీళ్లలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము. నేను ఈ అగ్నిజ్వాలలో యాతనపడుచున్నానని కేకలువేసి చెప్పెను .

ఈ లోకంలో జీవితం కొంతకాలమే ఉంటుంది. అయితే నరకం ఎప్పటికీ ఉంటుంది. అందులో ముగింపు అనేది ఉండదు. ఒక్కసారి అందులో ప్రవేశిస్తే ఇక నిరంతరం అక్కడ ఉండాల్సిందే. ఇక్కడ ఉన్నటువంటి స్వేచ్చ అక్కడ ఉండదు. వాస్తవానికి అక్కడ ఎలాంటి స్వేచ్చా ఉండదు. నిరంతరమూ రాత్రి పగలు అనే తేడా లేకుండా నెమ్మది లేనివారుగా ఉంటారు. లూకా 16:24 ప్రకారం; దనవంతుడు అగ్నిజ్వాలలో యాతనపడుతూ తీవ్రమైన దాహంతో ఒక చుక్క నీటి కోసం ఆశిస్తూ ఉన్నాడు కాని అదికూడా అతనికి దొరకడం లేదు. మనమైతే దాహంతో ఉన్నప్పుడు కనీసం ఒక గ్లాస్ అయినా లేదా అంతకంటే ఎక్కువ పరిమాణంలో అయినా నీళ్ళు అడుగుతాము. అయితే ఇక్కడ ఇతను కేవలం ఒక చుక్క మాత్రమే చాలు, నాకు నిత్యత్వమంతా అక్కర్లేదు కేవలం ఒక్క క్షణం నెమ్మది చాలు, దానితోనే నేను తృప్తి చెందుతాను అంటున్నాడు. దీనిని బట్టి నరకం ఎంత భయంకరంగా ఉంటుందో ఊహించుకోవచ్చు. అక్కడ ఒక్క క్షణం నెమ్మది కూడా దొరకదు. కొంతమంది ఈ లోకంలో పడే బాధలు తట్టుకోలేక, మానసికంగా కృశించిపోయి, జీవితం మీద విరక్తి చెంది విషం త్రాగో పైనుండి దూకో ఊరి వేసుకునో మరేదైనా మార్గం ద్వారానో ఆత్మహత్య చేసుకోవాలి అనుకుంటారు. వారు ఏమనుకుంటారంటే చనిపోయే సమయంలో బాధ కేవలం ఒక్క క్షణమే, చనిపోయిన తర్వాత ఇక ఏమీ ఉండదు అనుకుని ఆత్మహత్య చేసుకుంటారు. అయితే వారికి తెలియని విషయం ఏంటంటే అది ఒక్క క్షణంతో ఆగిపోదు. అంతకంటే ఎక్కువ వేధన, బాధతో నరకంలో ప్రత్యక్షమౌతారు. ఇక్కడైతే నొప్పి నుండి ఉపశమనం పొందదానికి నొప్పి మాత్రలు, మద్యం, మత్తు పదార్థాలు వంటివి ఉన్నాయి. నరకంలో అలాంటి సదుపాయమేమీ ఉండదు. ఆ బాధ నుండి తప్పించుకోవాలని చనిపోదామన్నా చనిపోలేరు. ఇక నిరంతరమూ నెమ్మది లేకుండా ఆ అగ్నిజ్వాలలో బాధ పడాల్సిందే. అక్కడ ఎలాంటి నిరీక్షణ ఉండదు. నరకంలో పాపులు నిస్సహాయులుగా నిరీక్షణ లేని వారుగా శక్తి హీనులుగా ఉంటారు.

నరకం యొక్క ఆ వర్ణనలన్నీ కలిపి చూస్తే బాధ, భయం, నష్టం, కోపం, ఎడబాటు మరియు నిరాశను తెలియచేస్తాయి. ఈ వేదన శాశ్వతంగా ఉంటుంది. 

శిక్షలో తీవ్రత:

చిన్న పాపమైనా పెద్ద పాపమైనా కొన్ని చేసినా ఎక్కువగా చేసినా కొంతకాలమే చేసినా ఎక్కువకాలం చేసినా అందరూ కూడా పైన చెప్పిన విధంగా ఒకే నరకంలో బాదించబడుతూ ఉంటారు. అందరికీ ఒక్కటే నరకం అయినప్పటికీ అందరికీ ఒకే స్థాయిలో శిక్ష అనేది ఉండదు. శిక్షలో తీవ్రత ఒక్కో పాపానికి ఒక్కోవిధంగా ఉంటుంది. అందరికీ బాధ ఉంటుంది ఐతే ఆ బాధ తీవ్రతలో తేడా ఉంటుంది. ఉదాహరణకు ఏ ఒక్కరినీ చంపని వ్యక్తి, అనేక మంది యూదులను చంపిన హిట్లర్ ఒకే స్థాయిలో బాదించబడరు. దేవుని యొక్క తీర్పు చేసిన పాపాన్ని అనుసరించి ఉంటుంది. 

రోమీయులకు 2:6 ప్రతివానికి వాని వాని క్రియల చొప్పున ప్రతిఫలమిచ్చును .

ప్రకటన 20:13  వారిలో ప్రతివాడు తన క్రియల చొప్పున తీర్పుపొందెను.

చేసిన క్రియలను బట్టి శిక్షలు ఉంటాయి ఐతే శిక్ష తీవ్రతలో అంతగా తేడా ఉండకపోవచ్చు. కానీ ఒకరకమైన పాపం చేస్తే మాత్రం తీవ్రతలో చాలా తేడా ఉంటుంది. ఆ పాపమేంటో యేసు ప్రభువు మాటల్లోనే చూడండి. 

మత్తయి 11:23,24 కపెర్నహూమా, ఆకాశము మట్టునకు హెచ్చింపబడెదవా? నీవు పాతాళమువరకు దిగి పోయెదవు. నీలో చేయబడిన అద్భుతములు సొదొమలో చేయబడిన యెడల అది నేటివరకు నిలిచియుండును. విమర్శదినమందు నీ గతికంటె సొదొమ దేశపువారి గతి ఓర్వతగినదై యుండునని మీతో చెప్పుచున్నాననెను.

ఇక్కడ రెండు గుంపుల ప్రజలను చూస్తున్నాం. ఒకరేమో కపెర్నహూము ప్రజలు, ఇంకో గుంపేమో సొదొమ దేశపు ప్రజలు. సొదమ దేశపు ప్రజలు ఎంత ఘోరమైన పాపాల్లో జీవించేవారో మనందరికీ తెలుసు. వారి పాపాన్ని బట్టి దేవుడే అగ్ని గంధకాలు కురిపించి ఇక ఆ పట్టణమే లేకుండా చేశాడు. అయితే కపెర్నహూము ప్రజలు ఇంత ఘోరమైన పాపాలు చెయ్యలేదు. అయినా సరే కపెర్నహూము ప్రజల కంటే సొదొమ దేశపు ప్రజలే దేవుని తీర్పులో తక్కువగా శిక్షించబడతారు అని యేసు ప్రభువు చెబుతున్నారు. దేవుడు మనం అనుకున్నట్టుగా తీర్పుతీర్చడని ఇక్కడ మనకు స్పష్టంగా అర్థమౌతుంది. అసలు కపెర్నహూము ప్రజలు చేసిన పాపమేంటి? యేసు ప్రభువు వారి మధ్యలో జీవించి, అనేకమైన అద్బుతాలు చేసి వారికి సువార్త ప్రకటించాడు. అయితే కపెర్నహూము వారు ఆయనను తిరస్కరించారు. దీనిని బట్టి వ్యభిచారం, నరహత్య, బలాత్కారం, అసహజమైన లైంగిక పాపాల కంటే సువార్తను వ్యతిరేకిస్తేనే ఎక్కువ తీర్పులోకి వస్తారని అర్థమౌతుంది. కాబట్టి సువార్త అనేది నమ్మే వారికి నిత్య జీవాన్ని ఇస్తుంది కానీ నమ్మని వారికి అది చాలా ప్రమాదకరమైనది. సువార్త విని తెలిసి కూడా తిరస్కరిస్తే చాలా ప్రమాదకరమైనది. వీరు మరింతగా తీవ్రమైన స్థాయిలో నరకంలో శిక్షించబడతారు. అందుకే "తన యజమానుని చిత్త మెరిగి యుండియు సిద్ధపడక, అతని చిత్తముచొప్పున జరిగింపక ఉండు దాసునికి అనేకమైన దెబ్బలు తగులును. అయితే తెలియక దెబ్బలకు తగిన పనులు చేసినవానికి కొద్ది దెబ్బలే తగులును" (లూకా 12:47,48) అని రాయబడింది.

నరకానికి ఎవరు వెళ్తారు?

యోహాను 9:41 అందుకు యేసు మీరు గ్రుడ్డివారైతే మీకు పాపము లేక పోవును గాని చూచుచున్నామని మీరిప్పుడు చెప్పుకొనుచున్నారు గనుక మీ పాపము నిలిచియున్నదని చెప్పెను.

లూకా 13:3-5 మీరు మారుమనస్సు పొందనియెడల మీరందరును ఆలాగే నశింతురు.

ఎవరైతే వారు పాపులని గ్రహించక, వారి పాపాల విషయమై మారు మనస్సు పొందకుండా పాపాలు క్షమించబడడానికి ఏకైక మార్గమైన యేసు ప్రభువు నందు విశ్వాసముంచరో వారి పాపాలు అలానే నిలిచియుంటాయి కాబట్టి ఆ పాపాలను బట్టి నిరంతరమూ ఆ నిత్య నరకంలో ఆరని అగ్ని గుండంలో బాధించబడుతూ ఉంటారు. 

తప్పించుకోవడం ఎలా ?

అందరూ నరకానికే పాత్రులైనప్పటికీ అందరూ నరకానికి వెళ్ళరు ఎందుకంటే నరకాన్ని తప్పించుకునే ఏకైక మార్గాన్ని దేవుడే నియమించాడు. దేవుడు న్యాయవంతుడు కాబట్టి పాపానికి న్యాయమైన శిక్ష విధించకుండా పాపిని క్షమించలేడు. అందుకే జగత్తు పునాది వెయ్యబడక ముందే ఆయన తాను ఏర్పాటు చేసుకున్న ప్రజల రక్షణకు ప్రణాళిక చేశాడు. అందుకే పాపం చేసిన మనిషి దేవుణ్ణి సమీపించడానికి తాత్కాలికంగా జంతుబలులను ప్రవేశపెట్టాడు. ఆ బలులన్నీ రాబోయే మెస్సియా అనగా యేసుక్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నాయి. అలా మనిషికి బదులుగా మనిషే శిక్షించబడతాడని, చనిపోతాడని ప్రవక్తయైన యెషయా ఆయన గురించి ముందే ప్రవచించాడు.

యెషయా 53:5-11 మన యతిక్రమక్రియలనుబట్టి అతడు గాయపరచబడెను మన దోషములనుబట్టి నలుగగొట్టబడెను మన సమాధానార్థమైన శిక్ష అతనిమీద పడెను అతడు పొందిన దెబ్బలచేత మనకు స్వస్థత కలుగు చున్నది. మనమందరము గొఱ్ఱెలవలె త్రోవ తప్పిపోతివిు మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలిగెను యెహోవా మన యందరి దోషమును అతనిమీద మోపెను. అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తినొందును. నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి తనకున్న అనుభవజ్ఞానము చేత అనేకులను నిర్దోషులుగా చేయును.

దేవుడు పాత నిబంధనలో వాగ్దానం చేసినట్టే యేసుప్రభువు కన్యయైన మరియ ద్వారా ఈ లోకానికి వచ్చాడు. దేవుని యొక్క అన్ని లక్షణాలను పరిపూర్ణంగా వ్యక్తపరిచాడు. ఎలాంటి పాపం లేకుండా జీవించాడు. నాలో పాపముందని ఎవరైనా నిరూపించగలరా అని సవాలు విసిరాడు. ఎన్నో అద్బుతాలు చేశాడు, చనిపోయిన వారిని సైతం బ్రతికించాడు. కృపాసత్యాల వల్ల మాత్రమే పాపానికి ప్రాయశ్చిత్తం కలుగుతుంది కాబట్టి ఆవిధంగా జీవించి లేఖనంలో రాయబడినట్టు తాను ఏర్పాటు చేసుకున్న ప్రజల ప్రతి పాపానికీ ప్రతి ఆవిధేయతకీ శిక్షను భరించాడు. సిలువలో మరణించి, సమాధి చెయ్యబడి, మూడవ దినాన తిరిగి లేచాడు. ఇది చరిత్రలో జరిగిన వాస్తవం (యోహాను 1:14, 1:17, 1:29, సామెతలు 16:6). ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత 40 రోజుల వరకూ తన శిష్యులకు కనిపించాడు. చివరిగా ఆరోహణం ఔతూ "మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును; నమ్మని వానికి శిక్ష విధింపబడును" అని పలికాడు.

కాబట్టి ఎవరైతే తాము పాపులమని గ్రహించి, మారు మనస్సు పొంది, వారికి బదులుగా యేసు ప్రభువు శిక్షను భరించాడని, వారి స్థానంలో ఆయన మరణించాడని విశ్వసిస్తారో వారి పాపాలు క్షమించబడతాయి. వారు రాబోయే దేవుని ఉగ్రత నుండి, నిత్య నరకం నుండి రక్షించబడతారు (అపొ. కార్యములు 16:31, రోమీయులకు 3:24).

Add comment

Security code
Refresh

 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.