అసంబద్ధాలు
ఏదిసత్యం? ఏదసత్యం?
1. జంతువులదా మనుష్యులదా? ఎవరి సృష్టి ముందు?
ఆదికాండము 1:25,26 దేవుడు ఆ యా జాతుల ప్రకారము అడవి జంతువులను, ఆ యా జాతుల ప్రకారము పశువులను, ఆ యా జాతుల ప్రకారము నేలను ప్రాకు ప్రతి పురుగును చేసెను. అదిమంచిదని దేవుడు చూచెను. దేవుడు మన స్వరూపమందు మన పోలికె చొప్పున నరులను చేయుదము; వారుసముద్రపు చేపలను ఆకాశ పక్షులను పశువులను సమస్త భూమిని భూమిమీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాకనియు పలికెను.
ఆదికాండము 2:18,19 మరియు దేవుడైన యెహోవానరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు; వానికి సాటియైన సహాయ మును వానికొరకు చేయుదుననుకొనెను. దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశపక్షిని నేలనుండి నిర్మించి, ఆదాము వాటికి ఏ పేరు పెట్టునో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించెను. జీవముగల ప్రతిదానికి ఆదాము ఏ పేరు పెట్టెనో ఆ పేరు దానికి కలిగెను.
ఆరోపణ: ఆదికాండము 1:25,26లో దేవుడు మొదటిగా జంతువులను చేసి, తర్వాత మనిషిని చేసినట్టు రాయబడితే ఆదికాండము 2:18,19లో ఆయన మనిషిని (ఆదామును) చేసిన తర్వాతనే "ప్రతి భూజంతువును ప్రతి ఆకాశపక్షిని నేలనుండి నిర్మించి" అతని దగ్గరకు తీసుకువచ్చినట్టు రాయబడింది. ఇది పరస్పర వైరుధ్యం అనేది ఎన్ వి బ్రహ్మం గారి ఆరోపణ.
జవాబు: బ్రహ్మం గారు కనుక కాస్త వివేచనతో ఈ వాక్యభాగాలను చదివుంటే ఇక్కడ ఎలాంటి వైరుధ్యమూ లేదని అర్థమైపోయేది. ఎందుకంటే ఆదికాండము మొదటి అధ్యాయంలో ఏది మొదట సృష్టించబడింది అనే క్రమం గురించి రాయబడి, రెండవ అధ్యాయంలో అవి ఎలా సృష్టించబడ్డాయి అనే వివరాలు రాయబడ్డాయి. క్రమం చెబుతున్నప్పుడు వరుస పాటించాలి కానీ వివరాలు చెబుతున్నప్పుడు అవసరం లేదు. ఆదికాండము 1:21-23 ప్రకారం నరులకంటే ముందే "ఆ యా జాతుల ప్రకారము అడవి జంతువులను, ఆ యా జాతుల ప్రకారము పశువులను, ఆ యా జాతుల ప్రకారము నేలను ప్రాకు ప్రతి పురుగులు" సృష్టించబడ్డాయి. ఆదికాండము 2:19లో ఆదాము సృష్టి వివరాల తర్వాత వాటి సృష్టి వివరాలు కూడా రాయబడ్డాయి. "దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశపక్షిని నేలనుండి నిర్మించి.." (ఆదికాండము 2:19). ఇంత సులభంగా అర్థమయ్యే విషయాన్ని కూడా ఎన్ వి బ్రహ్మం గారు వైరుధ్యంగా భావించాడంటే ఆయనకున్న అవగాహన సామర్థ్యం ఎంతగొప్ప స్థాయిలో ఉందో అర్థమౌతుంది కదా! ఇంతగొప్ప జ్ఞానంతోనే అయ్యగారు బైబిలే పలుకుతోంది అంటూ బయల్దేరాడు.
2. నరనారీ సృష్టిలో కాలకర్మాలకు పట్టిన గతి
ఆదికాండము 1:27 దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను; దేవుని స్వరూపమందు వాని సృజించెను; స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను.
ఆదికాండము 2:20-22 అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును సమస్త భూజంతువులకును పేరులు పెట్టెను. అయినను ఆదామునకు సాటియైన సహాయము అతనికి లేక పోయెను. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢనిద్ర కలుగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్క టముకలలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసముతో పూడ్చి వేసెను. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము నొద్దకు తీసికొనివచ్చెను.
ఆరోపణ: ఆదికాండము 1:27లో దేవుడు స్త్రీ పురుషులను ఒకేసారి సృజించినట్టు రాయబడితే ఆదికాండము 2:20-22లో ఆయన ఆదామును ముందుగా చేసి, అతను భూజంతువులకు పేర్లు పెట్టిన తర్వాతనే హవ్వను సృజించినట్టు రాయబడింది. ఇది పరస్పర వైరుధ్యం అనేది ఎన్ వి బ్రహ్మం గారి ఆరోపణ.
జవాబు: అయ్యగారి మొదటి ఆరోపణ వంటిదే ఇది కూడానూ. ఆదికాండము మొదటి అధ్యాయంలో దేవుడు ఏరోజున ఏమేం సృష్టించాడో క్రమబద్ధంగా రాయబడింది కాబట్టి, ఆరవరోజున సృష్టించబడిన స్త్రీ పురుషుల గురించి అక్కడ ప్రస్తావించబడింది (ఆదికాండము 1:26-31). రెండవ అధ్యాయంలో వారు ఎలా సృష్టించబడ్డారో వివరాలు తెలియచెయ్యబడ్డాయి కాబట్టి, ఆయన మొదటిగా ఆదామును సృష్టించాడని (ఆదికాండము 2:7), అతను భూజంతువులు పేర్లు పెట్టిన కొంతసేపటికి అతని "ప్రక్కటెముక ద్వారా" హవ్వ సృష్టించబడిందని (ఆదికాండము 2:21) రాయబడింది. వారిద్దరూ ఒకే ఆరవరోజున సృష్టించబడ్డారు అనేది వాస్తవం (ఆదికాండము 1:27, 5:1,2). అదేవిధంగా వారిద్దరి సృష్టి మధ్యలో కొంత సమయ వృత్యాసం ఉందనేది కూడా అంతే వాస్తవం (1 తిమోతీ 2:13). ఉదాహరణకు: ఆదాము ఉదయం సృష్టించబడితే హవ్వ అదేరోజు మధ్యాహ్నం తరువాత సృష్టించబడింది. ఇందులో వైరుధ్యమేముంది?
ఈ రెండవ ఆరోపణను బట్టి కూడా బ్రహ్మం గారికి దేనిని వైరుధ్యంగా భావించాలో అనే విషయం అసలు తెలియదని అర్థమైపోతుంది. ప్రస్తుతం ఆయన ప్రాణాలతో లేనప్పటికీ ఆయనను అనుసరించే శిష్యగణానికైనా ఈ విషయంలో అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఒక ఉదాహరణ చెబుతున్నాను చూడండి. "ఆదాము హవ్వలు ఇద్దరూ ఒకే సమయంలో (ఒకేరోజు కాదు) సృష్టించబడ్డారని ఒకచోట రాయబడి, మరో చోట వారిద్దరి సృష్టికీ మధ్యలో సమయ వ్యత్యాసం ఉన్నట్టుగా రాయబడితే" దానిని వైరుధ్యం అంటారు. అంతేతప్ప ఒకేరోజు సృష్టించబడిన ఆ ఇద్దరిగురించీ ఒకచోట పరిచయమాటలు రాయబడి, మరోచోట వారిద్దరూ ఎలా సృష్టించబడ్డారో (ఒకేరోజు) వివరాలు రాయబడితే దానిని వైరుధ్యం అనరు.
3. కొడుకా? మనుమడా?
ఆదికాండము 11:12 అర్పక్షదు ముప్పది యైదేండ్లు బ్రదికి షేలహును కనెను.
లూకా సువార్త 3:36 "షేలహు కేయినానుకు, కేయినాను అర్పక్షదుకు", అర్పక్షదు షేముకు, షేము నోవహుకు, నోవహు లెమెకుకు-
ఆరోపణ: ఆదికాండము 11:12లో అర్పక్షదు షేలహును కన్నట్టుగా రాయబడితే లూకా 3:36లో అర్పక్షదు కేయినాను కంటే ఆ కేయినాను షేలహును కన్నట్టుగా రాయబడింది. కాబట్టి బ్రహ్మం గారు ఈ రెండు వాక్యభాగాలలో వైరుధ్యముందని ఆరోపిస్తూ ఇంతకూ షేలహు అర్పక్షదుకు కొడుకా లేక మనువడా అని ప్రశ్నించారు.
జవాబు: ఆదికాండము 11:12లో రాయబడినట్టుగా షేలహు అర్పక్షదుకు కొడుకే. 1దినవృత్తాంతములు 1:18లో అదే విషయం స్పష్టమౌతుంది. అంతే కాదు "Samaritan Pentateuch" అని పిలవబడే మోషే పంచకాండాల పురాతన వ్రాతప్రతిలోనూ యూదాచరిత్ర కారుడైన జోసెఫెస్ రచనల్లో కూడా షేలాహు అర్పక్షదుకు కొడుకే అని రాయబడింది. మరి లూకా సువార్త 3:36లో అర్పక్షదు కేయినానును కన్నట్టుగా ఆ కేయినాను షేలహును కన్నట్టుగా ఎందుకు రాయబడిందంటే పాతనిబంధనను మొట్టమొదటిసారిగా గ్రీకులో తర్జుమా చేసినప్పుడు (LXX/Septuagint) ఆ తర్జుమా దారులు పొరపాటుగా అర్పక్షదు కేయినానును కన్నట్టుగా రాసారు. తర్వాత కాలంలో సంఘం లూకా సువార్తకు ప్రతులు రాసేటప్పుడు ఆ LXX/Septuagintలో ఉన్న వంశావళిని ఆధారంగా చేసుకుని తమదగ్గర ఉన్న లూకాసువార్త ప్రతిలో ఆ పేరు పొరపాటున తొలగించబడిందని భావించి ఆ కేయినాను అనే పేరును చేర్చారు.
పరిశుద్ధాత్మ ప్రేరణతో లూకా తన సువార్తను రాస్తున్నపుడు మాత్రం ఆ కేయినాను గురించి ఏమీ రాయలేదు. దీనికి ఆధారంగా మనం క్రీస్తుశకం 175-225 కాలానికి చెందిన లూకా సువార్త పురాతన వ్రాతప్రతి (Papyrus 75) ను పరిశీలించవచ్చు. ఇందులో అసలు కేయినాను అనే పేరే లేకుండా ఆదికాండము 11:12, 1దినవృత్తాంతములు 1:18లో రాయబడినట్టే అర్పక్షదు షేలహును కన్నాడని ఉంటుంది.
గమనించండి; బైబిల్ గ్రంథకర్తలు పరిశుద్ధాత్మ ప్రేరణతో రాస్తున్నపుడు అందులో ఎలాంటి వైరుధ్యం జరిగే అవకాశం లేదు. కానీ ముద్రణాయంత్రాలు లేని ఆ సమయంలో ఆ లేఖనాలకు చేవ్రాత ప్రతులు రాస్తున్నపుడు ఇలాంటి పేర్లకు సంబంధించిన లేదా సంఖ్యాపరమైన పొరపాట్లు జరగడం సహజం. పురాతన పుస్తకాల విషయంలో కనీస అవగాహన ఉన్న ఎవరికైనా ఇది అర్థమౌతుంది. ప్రస్తుతం ముద్రణయంత్రాలు ఉన్నప్పటికీ కూడా అలాంటి పొరపాట్లను మనం చూస్తుంటాం. దానికి మంచి ఉదాహరణ ఏంటంటే ఇక్కడ బ్రహ్మం గారు "అర్పక్షదు ముప్పది యైదేండ్లు బ్రదికి షేలహును కన్నాడని" ప్రస్తావించిన వాక్యభాగం "ఆదికాండము 11:12 లో రాయబడితే ఆయన పుస్తకంలో ఆ వాక్యభాగపు సంఖ్య "ఆదికాండము 11:2" గా ప్రస్తావించబడింది. ఇది ముద్రణయంత్రం చేసినపొరపాటో లేక బైబిల్ లో ఎలాగైనా వైరుధ్యాలు చూపించాలనే తపనలో బ్రహ్మంగారే అసలు Reference మరచిపోయి వేరేది రాసారో ఆయనకే తెలియాలి. వైరుధ్యం అంటే ఏంటో మళ్ళీ వివరిస్తున్నాను, రెండు వాక్యభాగాల మధ్య వ్యత్యాసం చూపించి అదిగో వైరుధ్యం అన్నంతమాత్రాన అది వైరుధ్యం అయిపోదు. ఆ సమస్యను పరిష్కరించడానికి ఇక ఏ మార్గమూ లేనప్పుడే అది వైరుధ్యంగా నిర్థారించబడుతుంది. చదువరులు ఈ పుస్తకమంతటిలో ఈ విషయం బాగా గుర్తుంచుకోవాలి. బ్రహ్మం గారికి ఈ ఒక్క విషయం అర్థమైనా చేతులు వణికే ఆ వయసులో "బైబిలే పలుకుతోంది" అనే వృధాప్రయాస పుస్తకానికి పూనుకునేవాడు కాడు పాపం.
4. 75 లేక కనీసం 135 - ఏది ఖాయం?
ఆదికాండము 12:4 అబ్రాము హారానునుండి బయలుదేరినప్పుడు డెబ్బదియైదేండ్ల యీడు గలవాడు.
ఆదికాండము 11:26,32 తెరహు డెబ్బది యేండ్లు బ్రదికి అబ్రామును నాహో రును హారానును కనెను. తెరహు బ్రదికిన దినములు రెండువందల యైదేండ్లు. తెరహు హారానులో మృతి బొందెను.
అపొస్తలుల కార్యములు 7:4 అతని తండ్రి చనిపోయిన తరువాత, అక్కడ నుండి మీరిప్పుడు కాపురమున్న యీ దేశమందు నివసించుటకై దేవుడతని తీసికొనివచ్చెను.
ఆరోపణ: ఆదికాండము 11:26-32లో తెరహు అబ్రాహామును 70వ యేట కని 205వ యేట మరణించాడని రాయబడింది. దీనిప్రకారం తెరహు చనిపోయేసరికి అబ్రాహాము వయస్సు 135 సంవత్సరాలు ఔతుంది. అపో.కార్యములు 7:4 ప్రకారం అబ్రాహాము "తన తండ్రియైన తెరహు చనిపోయిన తర్వాతే" హారాను నుండి కనాను దేశానికి పయానమయ్యాడు. అంటే అప్పటికి అబ్రాహాము వయస్సు 135 ఔతుండగా ఆదికాండము 12:4లో మాత్రం అతను హారాను నుండి కనానుకు బయలుదేరేసరికి 75 యేండ్లవాడని రాయబడింది. ఇది పరస్పర వైరుధ్యం అనేది ఎన్ వి బ్రహ్మం గారి ఆరోపణ.
జవాబు: ఏదైనా పురాతన గ్రంథంపైన ఆరోపణ చేసేముందు, ఆ గ్రంథం రాయబడిన మూలబాషలనూ ఆ గ్రంథపు ప్రాచీనప్రతులనూ పరిశీలించడం చాలా అవసరం. లేదా కనీసం ఆ ఆరోపణల విషయంలో ఆ గ్రంథానికి చెందిన పండితులు ఏం వివరణ చెబుతున్నారో దానినైనా పరిశీలించాలి. కానీ బ్రహ్మం గారు అలాంటి నిజాయితీని అనుసరిస్తూ ఈ పుస్తకం రాయలేదని చాలా స్పష్టంగా అర్థమౌతుంది. ఎందుకంటే ఈ పుస్తకంలో అతను బైబిల్ పైన చేసిన ఆరోపణలు చాలామట్టుకు బైబిల్ రాయబడిన మూలబాషలనూ ప్రాచీనప్రతులనూ పరిశీలించిప్పుడు వీగిపోగా మరికొన్ని ఆరోపణలు ఆ వాక్యభాగాలను సందర్భానుసారంగా ఇతర వాక్యభాగాలతో కలపి అర్థం చేసుకున్నపుడు అక్కడ అలాంటి ఆరోపణలకు తావులేదని రుజువౌతుంది. అయినా "ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా" అన్నట్టుగా బ్రహ్మం గారు ఎవరి పుస్తకాలనైతే కాపీ చేసి, ఎవరినైతే ఆదర్శంగా తీసుకుని ఈ పుస్తకం రాసారో వారికే ఈ నిజాయితీ లేనప్పుడు బ్రహ్మం గారికి మాత్రం అది ఎలా ఉంటుందిలెండి.
ఇక మనముందున్న ఆరోపణ దగ్గరకు వస్తే కొంతమంది బోధకులు దీనికి సమాధానంగా నోవహు కుమారుల గురించిన రాయబడిన వరుసక్రమాన్ని తీసుకుని, అబ్రాహాము తెరహుకు 70వ యేట పుట్టలేదని 130వ యేట పుట్టాడని దానిప్రకారం ఇక్కడ ఎలాంటి వైరుధ్యం లేదని చెబుతుంటారు. కానీ ఈ సమాధానంలో ఒక ప్రధానమైన లోపముంది. దానిగురించి ఇప్పటికే ఆదికాండము 11వ అధ్యాయపు వ్యాఖ్యానంలో నేను వివరించాను. మరి దీనికి సమాధానం ఏంటంటే మన బైబిళ్ళు తర్జుమా చెయ్యబడిన Masoretic వ్రాతప్రతుల్లో (హీబ్రూ) ఆదికాండము 11వ అధ్యాయంలో ప్రస్తావించబడిన చాలామంది వ్యక్తుల వయస్సు విషయంలో పొరపాటులు చోటుచేసుకున్నాయి. అందుకే మన తెలుగు, ఇంగ్లీష్ మరియు ఇతర బాషల బైబిళ్ళలో అవే సంఖ్యాపరమైన పొరపాట్లు మనకు కనిపిస్తుంటాయి. కానీ మనం "Masoretic" వ్రాతప్రతులకంటే పురాతన వ్రాతప్రతులైన "Samaritan Pentateuch" ను పరిశీలించినప్పుడు చాలా విషయాల్లో మనకు పరిష్కారం లభిస్తుంది. అందులో ఈ తెరహు జీవించిన కాలం కూడా 205 కాదు 145 అనే మనం చూడగలం. కాబట్టి తెరహు జీవించింది 205 సంవత్సరాలు కాదు, 145 సంవత్సరాలు. తెరహు అబ్రాహామును 70వ యేట కని, 145 యేట మరణించాడు. ఆ సమయానికి అబ్రాహాము వయస్సు 75 సంవత్సరాలు. అపోస్తలుల కార్యములు 7:4 లో చెప్పబడినట్టుగా తెరహు చనిపోయిన అదే సంవత్సరంలో (తన 75వ యేట) అతను హరాను నుండి కనానుకు ప్రయాణమయ్యాడు. ఇక్కడ ఎలాంటి వైరుధ్యం లేదు. ఉన్నదల్లా బైబిల్ ప్రతులపై బ్రహ్మం గారికి అవగాహనారాహిత్యం మాత్రమే.
5.స్వాస్థ్యమా? స్వాధీనమా? ఏదీ కాదా?
ఆదికాండము 17:8 నీకును నీ తరువాత నీ సంతతికిని నీవు పరదేశివైయున్న దేశమును, అనగా కనానను దేశమంతటిని నిత్యస్వాస్థ్యముగా ఇచ్చి వారికి దేవుడనై యుందునని అతనితో చెప్పెను.
అపొస్తలుల కార్యములు 7:5 ఆయన ఇందులో అతనికి పాదము పట్టునంత భూమినైనను స్వాస్థ్యముగా ఇయ్యక, అతనికి కుమారుడు లేనప్పుడు అతనికిని, అతని తరువాత అతని సంతానమునకును దీనిని స్వాధీనపరతునని అతనికి వాగ్దానము చేసెను.
హెబ్రీయులకు 11:13 వీరందరు ఆ వాగ్దానముల ఫలము అనుభవింపక పోయినను, దూరమునుండి చూచి వందనముచేసి, తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమునై యున్నామని ఒప్పకొని, విశ్వాసముగలవారై మృతినొందిరి.
ఆరోపణ: ఆదికాండము 17:8లో కనాను దేశం అబ్రాహాముకు కూడా స్వాస్థ్యంగా ఇవ్వబడినట్టు "నీకునూ" అని రాయబడింది. కానీ మిగిలిన రెండు సందర్భాలలో ఆ దేశం అబ్రాహాముకు కానీ ఇస్సాకు యాకోబులకు కానీ స్వాస్థ్యంగా ఇవ్వబడలేదని, వారి సంతానానికి మాత్రమే అది స్వాధీనం చెయ్యబడుతుందని రాయబడింది. ఇది పరస్పర వైరుధ్యం అనేది బ్రహ్మం గారి ఆరోపణ.
జవాబు: దేవుడు అబ్రాహాముతో మాత్రమే కాదు, యాకోబుతో కూడా ఇలాంటి మాటలే పలికాడు (ఆదికాండము 28:13). బ్రహ్మంగారు బైబిల్ చదవకుండా వేరేవాళ్ళ పుస్తకాలను మాత్రమే కాపీ చెయ్యబట్టి ఆ ప్రస్తావన తీసుకురాలేకపోయాడు అనుకుంటా. విషయానికి వస్తే లేఖన సారాంశంపై కానీ లేఖనాలలో వాడబడిన బాషపై కానీ అవగాహన లేని బ్రహ్మం గారి లాంటివారికి, ఇదేదో వైరుధ్యంలా అనిపించవచ్చు కానీ దేవుడు అబ్రాహాముతో కనాను దేశం గురించి మాట్లాడిన మొత్తం సందర్భాన్ని మనం పరిశీలించినప్పుడు, అది అతని నాలుగవ తరం వారికి మాత్రమే స్వాధీనం చెయ్యబడుతుందని స్పష్టంగా ప్రకటించబడింది (ఆదికాండము 15:16).
అందుకే ఆయన ఇస్సాకుకు కూడా ప్రత్యక్షమై కనాను దేశంలో పరదేశిగా సంచరించమన్నాడు (ఆదికాండము 26:2-4). కాబట్టి ఆ భూమి అబ్రాహాము ఇస్సాకు యాకోబులకు స్వాస్థ్యంగా ఇవ్వబడింది అన్నపుడు "అది ప్రమాణం చెయ్యబడడంగా" "వారి సంతానం ఆ దేశాన్ని స్వాధీనపరచుకున్నప్పుడు ఆ ప్రమాణం నెరవేర్చబడడంగా" మనం అర్థం చేసుకోవాలి. ఈ విషయం అబ్రాహాము ఇస్సాకు యాకోబులకు అర్థమైంది కాబట్టే కనాను దేశంలో పరదేశులుగానే జీవించారు (హెబ్రీ 11:9,13). ఆ భూమిని తాము కాదు తమ సంతానం మాత్రమే స్వాధీనం చేసుకుంటుందని ఆలోచించారు (ఆదికాండము 28:3,4). అందుకే తమ భార్యలు చనిపోయినప్పుడు వారిని పాతిపెట్టడానికి కూడా ఆ భూమిని వెలపెట్టి కొనుక్కున్నారు (ఆదికాండము 23).
నిర్గమకాండము 6:4 మరియు వారు పరవాసము చేసిన దేశమగు కనానుదేశమును వారికిచ్చుటకు నా నిబంధనను వారితో స్థిరపరచితిని.
6. యాకోబు సంతానం ఎందరు?
ఆదికాండము 46:26,27 యాకోబు కోడండ్రను వినాయించి అతని గర్భవాసమున పుట్టి యాకోబుతో ఐగుప్తునకు వచ్చిన వారందరు అరువది ఆరుగురు. ఐగుప్తులో అతనికి పుట్టిన యోసేపు కుమారులిద్దరు; ఐగుప్తు నకు వచ్చిన యాకోబు కుటుంబపు వారందరు డెబ్బది మంది.
అపొస్తలుల కార్యములు 7:14 యోసేపు తన తండ్రియైన యాకోబును తన స్వజనులందరిని పిలువనంపెను; వారు డెబ్బదియయిదుగురు.
నిర్గమకాండము 1:4,5 యాకోబు గర్భమున పుట్టినవారందరు డెబ్బదిమంది. అప్పటికి యోసేపు ఐగుప్తులో ఉండెను.
ఆరోపణ: ఆదికాండము 46:26లో యాకోబు సంతానం 66 మందనీ తర్వాత వచనంలో 70 మందనీ రాయబడింది. అపో.కార్యములు 7:14 లోనైతే వారు 75 మందని రాయబడింది. మరలా నిర్గమకాండము 1:4,5 వచనాలలో యాకోబు గర్భమున పుట్టినవారంతా 70 మందని రాయబడింది. కాబట్టి బ్రహ్మం గారు ఇక్కడ ఒకటి కంటే ఎక్కువ వైరుధ్యాలు ఉన్నాయని ఆరోపిస్తూ "యాకోబు సంతానం ఎందరు" అంటూ ప్రశ్నించారు.
జవాబు: ఇంగ్లీష్ వాళ్ళ పుస్తకాలు కాపీ చేసి పుస్తకం రాసుకున్న బ్రహ్మంగారు, అదే ఇంగ్లీష్ బైబిల్ పండితుల వ్యాఖ్యానాలను కూడా కొంచెం పరిశీలించియుంటే ఈ ఆరోపణకు అప్పుడే సమాధానం లభించేది. ఎందుకంటే "డా. జాన్ గిల్" వంటి బైబిల్ పండితులు 17వ శతాబ్దంలోనే ఇలాంటి ఎన్నో ఆరోపణలకు చక్కని సమాధానాలు తమ వ్యాఖ్యానాలలో పొందుపరిచారు. కానీ బ్రహ్మం గారి ధ్యేయం ఎలాగైనా బైబిల్ లో వైరుధ్యాలున్నాయని చూపించడమే తప్ప, వాటిని నిజాయితీగా అర్థం చేసుకోవడం కాదు కాబట్టి అలా చెయ్యలేకపోయారు. విషయంలోకి వెళ్తే ఆదికాండము 46:26వ వచనంలో "యాకోబు 'కోడండ్రను వినాయించి' అతని గర్భవాసమున పుట్టి యాకోబుతో ఐగుప్తునకు వచ్చిన వారందరు అరువది ఆరుగురు" అని స్పష్టంగా రాయబడియుంది. 27వ వచనం ప్రకారం యోసేపునూ అతని ఇద్దరు కుమారులనూ ఆ 66 మందికి జతచేస్తే అక్కడికి 69 ఔతుంది. ఇప్పుడు ఆ 69 మందికీ యాకోబును కూడా జత చేస్తే 70 ఔతుంది. ఇంతటితో ఆదికాండము 46:26,27 లో ప్రస్తావించబడిన 66 మంది 70 మందిని గురించిన ఆరోపణ సమసిపోయింది.
మరి అపో.కార్యములు 7:14లో "వారు డెబ్బదియయిదుగురు" అని ఎందుకు రాయబడిందంటే అక్కడ స్తెఫను ఆదికాండము 46:26లో "యాకోబు కోడళ్ళను మినహాయించి" చెప్పబడిన 66మందికి ఆ కోడళ్లను కూడా జతచేసి వారు 75మందని చెబుతున్నాడు. అందుకే ఆ వచనంలో వారందరూ యాకోబు సంతానం అని కాకుండా "స్వజనులు" అనే పదం ఉపయోగించబడింది. ఎందుకంటే యాకోబు కోడళ్ళు యాకోబు సంతానం కానేరరు.
అపొస్తలుల కార్యములు 7:14 యోసేపు తన తండ్రియైన యాకోబును "తన స్వజనులందరిని" పిలువనంపెను. వారు డెబ్బదియయిదుగురు.
ఇక్కడ మనం గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే ఈ 75 మందిలో యోసేపు, అతని ఇద్దరు కుమారులు, యాకోబు చేర్చబడలేదు. ఎందుకంటే అక్కడ స్తెఫను; యోసేపు "తన తండ్రితో పాటుగా ఐగుప్తుకు రప్పించినవారి సంఖ్యను మాత్రమే చెబుతున్నాడు". కానీ ఆదికాండము 46:27 లో యాకోబు కోడళ్ళు మినహాయించబడి, ఐగుప్తులో అతనితో పాటు పరదేశులుగా ప్రవేశించిన అతని సంతానం మొత్తాన్ని ఉద్దేశించి (యోసేపు & ఇద్దరు కుమారులుతో సహా) వారు 70 మందని రాయబడింది (66+3+1-70). ఇంతటితో స్తెఫను "వారు డెబ్బదియయిదుగురు" అని ఎందుకు ప్రస్తావించాడో కూడా సమాధానం లభించింది.
చివరిగా నిర్గమకాండము 1:4లో "యాకోబు గర్భమున పుట్టినవారందరు డెబ్బదిమంది" అని ఎందుకు రాయబడిందో కూడా చూద్దాం. ఇప్పటికే మనం ఈ 70మంది సంఖ్య విషయంలో పరిష్కారం పొందుకున్నప్పటికీ ఆ 70మందిలో యాకోబు కూడా ఉన్నాడు కాబట్టి "మరలా అతని గర్భమున పుట్టినవారు 70మంది అనేది వైరుధ్యంలా అనిపిస్తుంటుంది" అందుకే బ్రహ్మం గారు కూడా దీనిని ప్రత్యేకంగా ఎత్తి చూపించారు. కానీ ఆదికాండము 46:27 లో చెప్పబడినవిధంగా ఇక్కడ కూడా యాకోబుతో కలిపే ఈ సంఖ్య చెప్పడింది. దీనికి మరో స్పష్టమైన ఆధారం ఏంటంటే;
ద్వితియోపదేశకాండము 10:22 నీ పితరులు డెబ్బది మందియై ఐగుప్తునకు వెళ్లిరి. ఇప్పుడు నీ దేవుడైన యెహోవా ఆకాశనక్షత్రములవలె నిన్ను విస్తరింపజేసి యున్నాడు.
ఈ వాక్యభాగంలో మోషే ఇశ్రాయేలీయులతో " నీ పితరులు 70మందియై" ఐగుప్తుకు వెళ్ళారని చెప్పడం మనం చూస్తాం. ఒకవేళ నిర్గమకాండము 1:4 లో చెప్పబడిన 70 మంది, అక్కడ వాడబడిన భాషను బట్టి, యాకోబు కాకుండా అతని సంతానమే (గర్భానపుట్టినవారు) అని మనం భావిస్తే ఇక్కడ అదే మోషే యాకోబుతో కలపి 71మంది అని చెప్పేవాడు. ఎందుకంటే ఐగుప్తుకు వెళ్ళిన ఇశ్రాయేలీయుల పితరుల్లో యాకోబు కూడా ఉండి అక్కడ 17 సంవత్సరాలు జీవించాడు. కాబట్టి నాలుగవ వచనంలో 70 మంది అన్నప్పుడు యాకోబుతో కలిపి మొత్తంగా ఆ సంఖ్య చెప్పబడిందని మనం అర్థం చేసుకోవాలి.
ఇలాంటి భాష లేఖనాలలో మనకు సాధారణంగా కనిపిస్తుంటుంది. ఉదాహరణకు ఈ మాటలు చూడండి.
ఆదికాండము 35:23-26 యాకోబు కుమారులు పండ్రెండుగురు, యాకోబు జ్యేష్ఠకుమారుడగు రూబేను, షిమ్యోను, లేవి, యూదా, ఇశ్శాఖారు, జెబూలూను; వీరు లేయా కుమారులు. రాహేలు కుమారులు యోసేపు, బెన్యామీను. రాహేలు దాసియైన బిల్హా కుమారులు దాను, నఫ్తాలి. లేయా దాసియైన జిల్పా కుమారులు గాదు, ఆషేరు వీరు పద్దనరాములో యాకోబునకు పుట్టిన కుమారులు.
ఈ వాక్యభాగంలో యాకోబు కుమారులు పన్నెండుమందీ అతనికి పద్దనరాములో పుట్టినట్టు రాయబడింది. కానీ యాకోబుకు పద్దనరాములో పుట్టింది పదకొండుమంది మాత్రమే. బెన్యామీను ఎఫ్రాతామార్గం (కనాను దేశం) లో జన్మించాడు (ఆదికాండము 35:16-20). కానీ మోషే ఇక్కడ ఎక్కువమంది కుమారులు పుట్టిన పద్దనరామునే ప్రస్తావిస్తూ అక్కడ పుట్టినవారిలో బెన్యామీనును కూడా కలిపేసి మొత్తంగా వివరించాడు. బెన్యామీను ఎక్కడ పుట్టాడో అప్పటికే అతను వివరణ ఇచ్చాడు కాబట్టి, అతనికోసం మరలా ప్రత్యేకంగా ప్రస్తావించలేదు. యాకోబు సంతానం విషయంలో కూడా మోషే ఆదికాండము 46వ అధ్యాయంలో 69 మందని వివరించాడు కాబట్టి, ఇక్కడ యాకోబును వారికి విడిగా ప్రస్తావించకుండా మొత్తంగా 70 మందని రాస్తున్నాడు. కాబట్టి బ్రహ్మం గారు "యాకోబు సంతానం ఎంతమంది" అనే ప్రశ్నకు నా సమాధానం: యోసేపు పిలిపించగా ఐగుప్తుకు అతనితోపాటు వచ్చిన సంతానం 66 మంది. వారికి యోసేపునూ అతని ఇద్దరు పిల్లలనూ జతచేస్తే 69 మంది. బ్రహ్మంగారు యాకోబు సంతానం ఎంతమంది అని మాత్రమే ప్రశ్నించారు కాబట్టి నేను అంతవరకే చెబుతున్నాను. ఒకవేళ ఐగుప్తులో ప్రవేశించిన ఇశ్రాయేలీయులు మొత్తం ఎంతమందని ప్రశ్నించియుంటే యాకోబు మరియు అతని కోడళ్ళతో కలపి చెప్పేవాడిని. ఆ వివరాలు ఇప్పటికే నేను వెల్లడించాను.
ఇక్కడ మరో విషయానికి స్పష్టత ఇవ్వదలిచాను. ఆదికాండము 46:26లో యాకోబుతో పాటు అతని గర్భమున పుట్టి/(సంతానం) ఐగుప్తుకు వచ్చిన వారు 66 మంది అనీ అందులో యాకోబునూ యోసేపునూ అతని ఇద్దరి కుమారులనూ చేర్చలేదనీ స్తెఫను ఆ 66 మందికీ యాకోబు కోడళ్ళను కూడా జతచేసి 75 మందని చెబుతున్నాడని ఇప్పటికే వివరించాను. దాని ప్రకారం యాకోబుతో పాటుగా ఐగుప్తుకు వచ్చిన అతని కోడళ్ళు 9 మందే ఔతున్నారు. ఇందువల్ల యాకోబు కుమారుల మిగిలిన భార్యలు ఏమయ్యారనే ప్రశ్న ఇక్కడ తలెత్తుతుంది. ఎందుకంటే యాకోబు కుమారుల సంఖ్యకు ఆ భార్యల సంఖ్య సరిపోవడం లేదు. దీనికి నేనిచ్చే సమాధానం: మిగిలిన కొందరు కోడళ్ళు యూదా భార్యవలే చనిపోయుండవచ్చు (ఆదికాండము 38:12).
7. సమాధి ఎక్కడ? స్థలమెవరిది?
ఆదికాండము 50:13 అతని కుమారులు కనాను దేశమునకు అతని శవమును తీసికొనిపోయి మక్పేలా పొలమందున్న గుహలో పాతి పెట్టిరి. దానిని ఆ పొలమును అబ్రాహాము తనకు శ్మశా నముకొరకు స్వాస్థ్యముగానుండు నిమిత్తము మమ్రేయెదుట హిత్తీయుడైన ఎఫ్రోనుయొద్ద కొనెను.
అపొస్తలుల కార్యములు 7:15,16 యాకోబు ఐగుప్తునకు వెళ్లెను; అక్కడ అతడును మన పితరులును చనిపోయి అక్కడ నుండి షెకెమునకు తేబడి, షెకెములోని హమోరు కుమారులయొద్ద అబ్రాహాము వెలయిచ్చికొనిన సమాధిలో ఉంచబడిరి.
ఆరోపణ: ఆదికాండము 50:13లో యాకోబును మక్పేలా పొలమందున్న గుహలో పాతిపెట్టినట్టు, ఆ భూమిని అబ్రాహాము హిత్తీయుడైన ఎఫ్రోను దగ్గర కొన్నట్టు రాయబడింది. అపో. కార్యములు 7:15,16లో మాత్రం యాకోబు చనిపోయినప్పుడు షెకెముకు తేబడి అక్కడ పాతిపెట్టబడినట్టు, ఆ భూమిని అబ్రాహాము హమోరు కుమారుల దగ్గర కొన్నట్టు రాయబడింది. ఇది పరస్పర వైరుధ్యం అనేది బ్రహ్మం గారి ఆరోపణ.
జవాబు: స్తెఫను కాలంలో యూదులు మాట్లాడే పద్ధతుల గురించి మనం తెలుసుకున్నప్పుడు ఇక్కడ ఎలాంటి వైరుధ్యమూ కనిపించదు. విషయంలోకి వెళ్తే; హమోరు కుమారుల దగ్గర పొలాన్ని కొన్నది అబ్రాహాము కాదు అతని మనువడైన యాకోబు. ఈ వాక్యభాగాలు చూడండి.
ఆదికాండము 33:18,19 అట్లు యాకోబు పద్దనరాములో నుండి వచ్చిన తరువాత కనాను దేశములోనున్న షెకెమను ఊరికి సురక్షితముగా వచ్చి ఆ ఊరిముందర తన గుడారములు వేసెను. మరియు అతడు తన గుడారములు వేసిన పొలముయొక్క భాగమును షెకెము తండ్రియైన హమోరు కుమారులయొద్ద నూరు వరహాలకు కొని-
యెహోషువ 24:32 ఇశ్రాయేలీయులు ఐగుప్తులోనుండి తెచ్చిన యోసేపు ఎముకలను షెకెములో, అనగా యాకోబు నూరు వరహాలకు షెకెము తండ్రియైన హమోరు కుమారులయొద్ద కొనిన చేని భాగములో వారు పాతిపెట్టిరి. అవి యోసేపు పుత్రులకు ఒక స్వాస్థ్యముగా ఉండెను.
ఈ రెండు సందర్భాలలో కూడా హమోరు కుమారుల దగ్గర స్థలాన్ని కొన్నది యాకోబు అని స్పష్టంగా రాయబడింది. అదేవిధంగా ఆ ప్రాంతంలో స్తెఫను చెబుతున్నట్టుగా యాకోబు సమాధి చెయ్యబడలేదు. యెహోషువ కాలంలో ఆ భాగం యోసేపు సంతతికి లభించింది కాబట్టి అతడిని మాత్రమే అక్కడ సమాధి చేసారు. అబ్రాహాము ఇస్సాకు యాకోబులు (వారి భార్యలతో సహా) అబ్రాహాము ఎఫ్రోను దగ్గరకొన్న పొలంలోనే సమాధి చెయ్యబడ్డారు (ఆదికాండము 49:29-32).
మరి స్తెఫను ఆవిధంగా ఎందుకు మాట్లాడుతున్నాడంటే అబ్రాహాము, ఇస్సాకు యాకోబులు వారి భార్యలతో సహా సమాధి చెయ్యబడ్డ ప్రాంతం అబ్రాహాము ఎఫ్రోను దగ్గర కొన్నదైతే తర్వాత కాలంలో యాకోబు హమోరు కుమారుల దగ్గర కొన్నదానిలో కూడా తన సంతానపు స్వాస్థ్యభాగం చొప్పున "పితరుడైన యోసేపు" సమాధి చెయ్యబడ్డాడు. దీనిప్రకారం అబ్రాహాము మరియు యాకోబు ఇద్దరూ వేరువేరు వ్యక్తుల దగ్గర కనాను ప్రాంతంలో పొలాన్ని కొన్నారు, అక్కడ ఇశ్రాయేలీయుల పితరులు సమాధి చెయ్యబడ్డారు.
స్తెఫను ఆ సందర్భంలో యూదులతో మాట్లాడుతున్నాడు, వారిలో గ్రీకు భాష వాడే హెల్లెనిస్టులు కూడా ఉన్నారు. వీరు కొన్నిసార్లు రెండు మూడు సంగతులను కలపి (బాగా తెలిసిన చరిత్రను) ఒకేమాటలో చెప్పే పద్ధతిని అనుసరించేవారు. దానినే "Telescoping" (దూరంగా ఉన్నదానిని దగ్గరగా చూపడం) అంటారు. స్తెఫను అక్కడ అదే పద్ధతిని అనుసరిస్తూ మొదటిగా; వారి సమాధుల కోసం పొలాన్ని కొన్న అబ్రాహాము పేరును, రెండవదిగా; మరొక పొలాన్ని యాకోబు ఎవరి దగ్గరనుండైతే కొన్నాడో ఆ హమోరు కుమారులను ప్రస్తావించి అందులో పితరులు సమాధి చెయ్యబడ్డట్టు చెబుతున్నాడు. ఈవిధంగా ఒకేలాంటి వేరువేరు సందర్భాలను కలపి మాట్లాడుకోవడం అక్కడున్న యూదులకు బాగా అలవాటు కాబట్టే వారు స్తెఫను వైరుధ్యంగా (తప్పుగా) మాట్లాడుతున్నాడని ఆరోపించలేకపోయారు.
అదేవిధంగా యాకోబు మాటల్లో (ఆదికాండము 49-29-32) అబ్రాహాము ఆ పొలాన్ని హేతుకుమారుల దగ్గర కొన్నట్టు కనిపిస్తుంది, మరలా ఆ పొలం ఎఫ్రోను దగ్గర కొన్నట్టు కూడా కనిపిస్తుంది. ఇది కూడా వైరుధ్యం కాదు, అబ్రాహాము ఆ పొలాన్ని ఎఫ్రోను దగ్గర కొన్నప్పటికీ ఆ లావాదేవీలకు పెద్దమనుషులుగా హేతుకుమారులు వ్యవహరించి, వారిచేతుల మీదుగా అబ్రాహాముకు ఆ పొలాన్ని అప్పగించారు అందుచేతనే యాకోబు వారిని ప్రస్తావించాడు.
8. అహరోను మరణించింది ఎక్కడ?
సంఖ్యాకాండము 33:37,38 కాదేషులోనుండి బయలుదేరి ఎదోము దేశముకడనున్న హోరుకొండ దగ్గర దిగిరి. యెహోవా సెలవిచ్చిన ప్రకారము యాజకుడైన అహరోను హోరు కొండనెక్కి, ఇశ్రాయేలీయులు ఐగుప్తుదేశములోనుండి బయలుదేరి వచ్చిన నలువదియవ సంవత్సరమున అయిదవ నెల మొదటి దినమున అక్కడ మృతినొందెను.
ద్వితీయోపదేశకాండము 10:6,7 ఇశ్రాయేలీయులు యహకానీయులదైన బెయేరోతునుండి బయలుదేరి మోసేరుకు వచ్చినప్పుడు అక్కడ అహరోను చనిపోయి పాతిపెట్టబడెను. అతని కుమారుడైన ఎలియాజరు అతనికి ప్రతిగాయాజకు డాయెను. అక్కడనుండి వారు గుద్గోదకును గుద్గోద నుండి నీటివాగులు గల దేశమైన యొత్బాతాకును ప్రయాణము చేసిరి.
ఆరోపణ: సంఖ్యాకాండము 33:37,38లో అహరోను మరణించింది హోరుకొండపైన అని రాయబడితే ద్వితీయోపదేశకాండము 10:6,7లో మాత్రం మోసేరులో మరణించాడని రాయబడింది. ఇది పరస్పర వైరుధ్యం అనేది ఎన్ వి బ్రహ్మం గారి ఆరోపణ.
జవాబు: ఈయనగారు తన పుస్తకంలో చాలామట్టుకు ఇలాంటివి చూపించి ఇదిగో వైరుధ్యం అదిగో వైరుధ్యం అని సంభరపడడం తప్ప ఉద్దరించిందంటూ ఏమీ లేదు. అహరోను మృతి విషయంలో కూడా ఇలానే చెసాడు. మోషే ఒకచోట అతను చనిపోయిన కొండపేరు ప్రస్తావించాడు. మరోచోట ఆ కొండ ఉన్న ప్రాంతం పేరు ప్రస్తావించాడు.
ఇది ఇంకా బాగా అర్థం కావడానికి మరో ఉదాహరణ చెబుతాను. ఎన్ వి బ్రహ్మం అనేవాడు ఎవరెస్ట్ పర్వతం ఎక్కుదామని బయల్దేరి ఆ పర్వతం మధ్యలోనే చనిపోయాడు అనుకుందాం. అతని మృతి గురించి ఒక చరిత్రకారుడేమో ఆ పర్వతం పేరు ప్రస్తావిస్తే మరో చరిత్రకారుడేమో ఎన్ వి బ్రహ్మం నేపాల్ లో చనిపోయాడని రాసాడు. అంటే ఇప్పుడు ఎన్ వి బ్రహ్మం అనేవాడు చరిత్రలో లేనట్టేనా? కానీ ఆ పర్వతం నేపాల్ సరిహద్దులో ఉంది కాబట్టి ఒకరు అలా రాసినప్పటికీ ఎన్ వి బ్రహ్మం ఎవరెస్ట్ ఎక్కుదామని ఆశపడి ఆ పర్వతంపైనే చనిపోయాడు అనేది వాస్తవం. ఇది వైరుధ్యం అని వాదించాలంటే ముందుగా ఎవరెస్ట్ నేపాల్ సరిహద్దులో లేదని నిరూపించాలి. బ్రహ్మం గారు అహరోను మృతి ఆరోపణ తరహాలోనే కొండను త్రవ్వి ఎలుకను పట్టినా బావున్ను. కానీ ఆయన ప్రతీ ఆరోపణ విషయంలోనూ ఇలానే ఎలుక ఈకను పట్టుకుని సంభరపడ్డాడు పాపం.
9. యెహోవా పేరు తెలియకపోతే?
నిర్గమకాండము 6:2,3 మరియు దేవుడు మోషేతో ఇట్లనెనునేనే యెహోవాను; నేను సర్వశక్తిగల దేవుడను పేరున అబ్రాహాము ఇస్సాకు యాకోబులకు ప్రత్యక్షమైతిని కాని, యెహోవా అను నా నామమున నేను వారికి తెలియబడలేదు.
ఆదికాండము 22:14 అబ్రాహాము ఆ చోటికి యెహోవా యీరే అను పేరు పెట్టెను. అందుచేతయెహోవా పర్వతము మీద చూచుకొనును అని నేటి వరకు చెప్పబడును.
ఆరోపణ: నిర్గమకాండము 6:2,3లో అబ్రాహాము ఇస్సాకు యాకోబులకు దేవుని పేరు "యెహోవా" అని తెలియబడనట్టు రాయబడింది. కానీ ఆదికాండము 22:14లో అబ్రాహాము ఇస్సాకును బలిగా అర్పించబోయిన స్థలానికి "యెహోవా" యీరే అని పేరుపెట్టినట్టు రాయబడింది. పితరులకు యెహోవా అనే పేరు తెలియకపోతే అబ్రాహాము ఆ పేరును ఆ స్థలానికి ఎలా పెడతాడు? ఇది పరస్పర వైరుధ్యం అనేది బ్రహ్మం గారి ఆరోపణ.
జవాబు: బ్రహ్మం గారు కనుక యెహోవా అనే పేరుకు ఉన్నటువంటి అర్థాలు ఏంటో దేవుడు మోషేతో మాట్లాడుతున్న ఆ సందర్భం ఏంటో కాస్త తెలుసుకుని ఉంటే ఇలాంటి ఆరోపణ చెయ్యకపోదుడు. కానీ ఒక బైబిల్ విమర్శకులు అలాంటి పద్ధతిని ఎందుకు అనుసరిస్తాడు? "ఏ పనికిమాలిన చెట్టు అయినా మంచి ఫలాలను ఫలించదు కదా" (మత్తయి 7:18). విషయంలోకి వెళ్తే అబ్రాహాము ఇస్సాకును బలిగా అర్పించబోయిన ప్రదేశం దగ్గరే కాదు, అంతకుముందు కూడా యెహోవా అనే పేరును ప్రస్తావించాడు (ఆదికాండము 12:8, ఆదికాండము 21: 33). బైబిల్ చరిత్ర ప్రారంభంలోనే యెహోవా అనేపేరు భక్తులకు తెలిసినట్టుగా మనకు రుజువులున్నాయి (ఆదికాండము 4: 26).
మరి పితరులకు యెహోవా అనే పేరు ముందే తెలిసినప్పటికీ ఆయన మరలా మోషేతో "యెహోవా అను నా నామమున నేను వారికి తెలియబడలేదు" అని ఎందుకు అంటున్నాడంటే; బైబిల్ గ్రంథంలో మనం "యెహోవా నామము" అన్నప్పుడు, దానిని అన్ని సందర్భాలలోనూ పేరు (sound) గా భావించకూడదు.
ఉదాహరణకు:
నిర్గమకాండము 34:5 మేఘములో యెహోవా దిగి అక్కడ అతనితో నిలిచి యెహోవా అను నామమును ప్రకటించెను.
ఈ సందర్భంలో దేవుడు మేఘములో దిగి మోషేకు యెహోవా అనే తన నామాన్ని ప్రకటించినట్టు రాయబడింది. అయితే అప్పటికే మోషేకు యెహోవా అనే నామం తెలుసు. మరి తెలిసిన నామాన్నే ఆయన మరలా ఎందుకు ప్రకటిస్తున్నట్టు? అందుకే ఆ క్రింది వచనాలను మనం పరిశీలించినప్పుడు, ఆయన తన గుణ లక్షణాలను అతనికి ప్రకటిస్తున్నట్టు కనిపిస్తుంది (నిర్గమకాండము 34:6,7).
మరో సందర్భాన్ని కూడా చూడండి;
యోహాను 17:26 నీవు నాయందు ఉంచిన ప్రేమ వారియందు ఉండునట్లును, నేను వారియందు ఉండునట్లును, వారికి నీ నామమును తెలియజేసితిని, ఇంకను తెలియజేసెదనని చెప్పెను.
ఈ సందర్భంలో ప్రభువైన యేసుక్రీస్తు తన శిష్యులకు దేవుని నామాన్ని తెలియచేసానని ప్రార్థిస్తున్నాడు అని అంటూనే ఇంకా తెలియచేస్తాను అంటున్నాడు.
యేసుక్రీస్తు గురించి బైబిల్ లో రాయబడినంతమట్టుకు ఆయన ఎక్కడా కూడా యెహోవా అనే పేరును ప్రకటించలేదు.
ఎందుకంటే ఆయన కాలానికి యూదులు "యెహోవా అనే నామాన్ని వ్యర్థంగా ఉచ్చరించకూడదన్న ఆజ్ఞను దృష్టిలో పెట్టుకుని (ద్వితీయోపదేశకాండము 5:11)" ఆ పేరును ఉపయోగించడం మానేసారు. దానికి బదులు వారు దేవుణ్ణి "ఏలోహీం, అదోనాయ్" (ప్రభువు) అని పిలిచేవారు. శిష్యులకు ఈ చరిత్ర గురించీ యెహోవా అనే పేరు గురించీ బాగా తెలుసు. మరి యేసుక్రీస్తు తన శిష్యులకు ప్రకటించిన తండ్రి నామం ఏంటి? ఆయన తన పరిచర్యలో తండ్రియొక్క గుణ లక్షణాలను తన శిష్యులకూ ప్రజలకూ నిర్విరామంగా ప్రకటించాడు. ఆ గుణలక్షణాలనే ఆయన తన ప్రార్థనలో తండ్రి నామంగా ప్రస్తావించాడు.
మనం చూసిన ఈ రెండు ఆధారాలను బట్టి, దేవుని నామము అన్నప్పుడు ఆయన గుణలక్షణాలను కూడా తెలియచేస్తుందని అర్థమౌతుంది.
ఇప్పుడు దీనిని దృష్టిలో పెట్టుకుని, ఆయన మోషేతో నీ పితరులకు "యెహోవా అనే నా నామం తెలియబడలేదని" పలికిన మాటలను ఆలోచిస్తే, యెహోవా అనే నామానికి ఉన్నవాడని మరియు మాట ఇచ్చి నెరవేర్చేవాడని అర్థం (యిర్మీయా 33:2). ఆయన అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులకు ప్రత్యక్షమైనపుడు సర్వశక్తిమంతుడిగా వారికి అగుపించి, వారి సంతానానికి కనాను దేశాన్ని స్వాస్థ్యంగా ఇస్తానని వాగ్దానం చేసాడు. కానీ ఆ నెరవేర్పును (మాట ఇచ్చి నెరవేర్చు యెహోవా) వారు చూడలేదు. దానిని కేవలం మోషే/అతని తరం వారు మాత్రమే చూస్తున్నారు. దీని గురించే ఆయన మోషేతో యెహోవా అనే నా నామం (మాట ఇచ్చి నెరవేర్చువాడను) వారికి తెలియబడలేదని ఆ సందర్భంలో చెబుతున్నాడు.
10. విచారణ జరిగిందా లేదా?
1 సమూయేలు 28:5,6 సౌలు ఫిలిష్తీయుల దండును చూచి మనస్సునందు భయ కంపము నొంది యెహోవా యొద్ద విచారణచేయగా యెహోవా స్వప్నముద్వారా నైనను ఊరీముద్వారా నైనను ప్రవక్తలద్వారానైనను ఏమియు సెలవియ్యకుండెను.
1 దినవృత్తాంతములు 10:13 ఈ ప్రకారము యెహోవా ఆజ్ఞగైకొనక ఆయన దృష్టి యెదుట ద్రోహము చేసినందుకును, యెహోవాయొద్ద విచారణచేయక కర్ణపిశాచముల యొద్ద విచారణచేయుదానిని వెదకినందుకును సౌలు హత మాయెను.
ఆరోపణ: 1 సమూయేలు 28:5,6లో సౌలు యెహోవా యొద్ద విచారణ చేసాడని రాయబడితే 1దినవృత్తాంతములు 10:13లో అతను విచారణే చెయ్యలేదని రాయబడింది. ఇది పరస్పర వైరుధ్యం అనేది ఎన్ వి బ్రహ్మం గారి ఆరోపణ.
జవాబు: ఇంతకూ సౌలు యెహోవా యొద్ద విచారణ చేసినప్పటికీ ఎందుకని ఆయన "స్వప్నముద్వారా నైనను ఊరీముద్వారా నైనను ప్రవక్తలద్వారానైనను ఏమియు సెలవియ్యకుండెను?". సౌలు జీవితాన్ని పరిశీలిస్తే అతను యెహోవా యొద్ద విచారణ చెయ్యకుండా చేసిన పాపాలు చాలానే ఉన్నాయి.
1 సమూయేలు 28:5,6లో రాయబడిన విచారణ కూడా అతను భక్తితో చెయ్యలేదు ఫిలిష్తీయుల వల్ల కలిగిన ప్రాణభయంతో చేసాడు "సౌలు ఫిలిష్తీయుల దండును చూచి మనస్సునందు భయ కంపము నొంది" (1సమూయేలు 28:5). అందుకే అతని మనసు తెలిసిన దేవుడు "స్వప్నముద్వారా నైనను ఊరీముద్వారా నైనను ప్రవక్తలద్వారానైనను ఏమియు సెలవియ్యకుండెను".
అతను భక్తితోనే ఆ విచారణ చేసుంటే దేవుడు స్పందించేవరకూ ఏదో ప్రయత్నం చేస్తూనే ఉండేవాడు. లేదా స్వతహాగా యుద్దానికి పోయేవాడు తప్ప ధర్మశాస్త్రంలో నిషేధించబడిన కర్ణపిశాచి దగ్గరకు పోయేవాడు కాదు (ద్వితీయోపదేశకాండము 18:17).
సామెతలు 28:9 ధర్మశాస్త్రము వినబడకుండ చెవిని తొలగించుకొనువాని ప్రార్థన హేయము.
హోషేయా 7:14 హృదయ పూర్వకముగా నన్ను బతిమాలుకొనక శయ్యలమీద పరుండి కేకలు వేయుదురు; నన్ను విసర్జించి ధాన్య మద్యములు కావలెనని వారు గుంపులు కూడుదురు.
ఈ వాక్యభాగాల ప్రకారం సౌలు అక్కడ విచారణ చేసినా దేవుని దృష్టిలో చెయ్యనట్టే. ఆయన హృదయపూర్వకమైన విచారణలను మాత్రమే లెక్కలోకి తీసుకునే దేవుడు. దినవృత్తాంతములు గ్రంథకర్త దీనిని పరిగణలోకి తీసుకునే అతను విచారణ చెయ్యలేదని రాసాడు. ఇందులో వైరుధ్యం లేదు దేవుని ఉద్దేశం అర్థం చేసుకోని ఎన్ వి బ్రహ్మం వంకరబుద్ధి తప్ప.
11. యెష్షయి సంతానం ఏడో ఎనిమిదో?
1 దినవృత్తాంతములు 2:13-15 యెష్షయి తన జ్యేష్ఠ కుమారుడైన ఏలీయాబును రెండవవాడైన అబీనాదాబును మూడవవాడైన షమ్మాను నాలుగవవాడైన నెతనేలును, అయిదవవాడైన రద్దయిని ఆరవవాడైన ఓజెమును ఏడవ వాడైన దావీదును కనెను.
1 సమూయేలు 16:10,11 యెష్షయి తన యేడుగురు కుమారులను సమూయేలు ఎదుటికి పిలువగా సమూయేలు-యెహోవా వీరిని కోరుకొనలేదని చెప్పి నీ కుమారులందరు ఇక్కడనున్నారా అని యెష్షయిని అడుగగా అతడు-ఇంకను కడసారివాడున్నాడు. అయితే వాడు గొఱ్ఱెలను కాయుచున్నాడని చెప్పెను.
ఆరోపణ: 1 దినవృత్తాంతములు 2:13-15లో దావీదు యెష్షయికి ఏడవ కుమారుడు అని రాయబడింది. కానీ 1 సమూయేలు 16:10,11 ప్రకారం అప్పటికే సమూయేలు ముందుకు ఏడుగురు కుమారులు వచ్చేసారు కడసరివాడైన దావీదు రావలసియుంది. అంటే దావీదు యెష్షయికి ఎనిమిదవ సంతానం. అందుకే ఎన్ వి బ్రహ్మం గారు యెష్షయి సంతానం ఏడో ఎనిమిదో?. ఇది వైరుధ్యం అని ఆరోపించారు.
జవాబు: వైరుధ్యం అంటే ఆ సమస్యకు ఏవిధమైన పరిష్కారమూ లేనప్పుడే అది వైరుధ్యంగా నిర్థారణ ఔతుందని, అలా కాకుండా దానికి వేరే పరిష్కారాలు చూపగలిగినప్పుడు (బైబిల్ నుండే) దానిని వైరుధ్యంగా భావించకూడదని ఇప్పటికే 2,3 ప్రశ్నలలో వివరించాను. ఇక్కడ కూడా అదే నియమం వర్తిస్తుంది. 1 సమూయేలు 16:10,11లో జరుగుతున్న చరిత్ర రాయబడింది. అప్పటికే యెష్షయి యొక్క ఏడుగురు కుమారులు సమూయేలు ముందుకు వచ్చారు, ఇంకా కడసరివాడైన దావీదు రావలసియున్నాడు అన్నప్పుడు, ఆ ఏడుగురు కుమారులూ యెష్షయికి పుట్టినవారే అని భావించక్కర్లేదు. ఎందుకంటే 1 దినవృత్తాంతములు 2:13-15లో వాడబడిన బాషను చూడండి. అక్కడ రాయబడినట్టుగా "ఏడవ వాడైన దావీదును కనెను" అనే పదప్రయోగం 1 సమూయేలు 16:10,11 సందర్భంలో మనకు కనిపించదు. కాబట్టి సమూయేలు ముందుకు వచ్చిన యెష్షయి ఏడుగురు కుమారులలో ఒకడు అతనికి దత్తపుత్రుడు. అతని ప్రస్తావన 1 దినవృత్తాంతముల గ్రంథకర్త విడిచిపెట్టాడు. ఈ మాటలు నేనేదో ఊహించుకుని చెబుతున్నవి కావు. నేను చెబుతున్నదానికి ఆధారంగా అక్కడ వాడబడిన పదప్రయోగాన్ని చూపిస్తున్నాను. ప్రాముఖ్యంగా 1 దినవృత్తాంతములు 1-8 అధ్యాయాలు ఎవరు ఎవరికి పుట్టారు ఎవరిది ఏ వంశం అనే వంశనిర్థారణ గురించి రాయబడ్డాయి.
1దినవృత్తాంతములు 9:1 ఈ ప్రకారము ఇశ్రాయేలీయులందరును "తమ వంశములచొప్పున సరిచూడబడినమీదట" వారి పేళ్లు ఇశ్రాయేలురాజుల గ్రంథమందు వ్రాయబడెను.
అలాంటప్పుడు ఆ గ్రంథకర్త యెష్షయి యొక్క దత్తపుత్రుడి ప్రస్తావన తీసుకురావడం సాధ్యపడదు. అందుకే అతను యెష్షయికి పుట్టిన ఏడుగురు కుమారుల పేర్లే ప్రస్తావించి దావీదు ఏడవవాడని రాసాడు. ఆ ఏడుగురిని బట్టే యెష్షయి యొక్క వంశం నిర్థారించబడుతుంది కనుక అలానే రాసి తీరాలి. కాబట్టి యెష్షయి సంతానం ఏడో ఎనిమిదో? అని ఆరోపిస్తే అతనికి పుట్టిన సంతానం ఏడే. ఇందులో వైరుధ్యం ఏమీలేదు. మొదటినుండీ చెబుతున్నట్టుగా బ్రహ్మం గారి అవగాహనా లోపం తప్ప.
12. సౌలు దావీదును ఎరుగునా? ఎరుగడా?
1 సమూయేలు 16:19-21 సౌలు - యెష్షయి యొద్దకు దూతలను పంపి, గొఱ్ఱెలయొద్ద నున్న నీ కుమారుడైన దావీదును నాయొద్దకు పంపు మనెను. అప్పుడు యెష్షయి ఒక గార్దభము మీద రొట్టెలను ద్రాక్షారసపు తిత్తిని ఒక మేకపిల్లను వేయించి తన కుమారుడైన దావీదుచేత సౌలునొద్దకు పంపెను. దావీదు సౌలు దగ్గరకువచ్చి అతనియెదుట నిలువబడగా అతనియందు సౌలునకు బహు ఇష్టము పుట్టెను, అతడు సౌలు ఆయుధములను మోయువాడాయెను.
1 సమూయేలు 17:57,58 దావీదు ఫిలిష్తీయుని చంపి తిరిగి వచ్చినప్పుడు అబ్నేరు అతని పిలుచుకొనిపోయి ఫిలిష్తీయుని తల చేతనుండగా అతని సౌలు దగ్గరకు తోడుకొనివచ్చెను. సౌలు అతనిని చూచి-చిన్నవాడా, నీవెవని కుమారుడవని అడుగగా దావీదు-నేను బేత్లెహేమీయుడైన యెష్షయి అను నీ దాసుని కుమారుడనని ప్రత్యుత్తరమిచ్చెను.
ఆరోపణ: 1 సమూయేలు 16:19-21లో సౌలుకు దావీదు ఎవరి కుమారుడో తెలుసన్నట్టు రాయబడింది. కానీ 1 సమూయేలు 17:57,58లో అతను దావీదును మళ్ళీ తన తండ్రికోసం ప్రశ్నిస్తున్నట్టు రాయబడింది. ఇది వైరుధ్యం అనేది బ్రహ్మం గారి ఆరోపణ.
జవాబు: రెండు సందర్భాలలోనూ ఆత్మపూర్ణుడైన గ్రంథకర్త తన మాటలుగా అక్కడేమీ రాయలేదు. చరిత్రకోణంలో సౌలు పలికిన మాటలను ఉన్నవి ఉన్నట్టుగా నమోదు చేసాడు. బైబిల్ లో ఉన్నంతమాత్రాన అది బైబిల్ వైరుధ్యం అయిపోదు. అక్కడ మాట్లాడుతుంది ఆత్మపూర్ణుడైన గ్రంథకర్త లేదా దేవుడు లేదా ఆయన చెప్పమన్నదే చెబుతున్న ప్రవక్త అయినప్పుడు మాత్రమే అది బైబిల్ వైరుధ్యంగా నిరూపించబడుతుంది.
ఇది బాగా అర్థం కావడానికి ఈ ఉదాహరణ చెబుతున్నాను. బ్రహ్మం గారికి దెయ్యం పట్టింది అనుకుందాం, క్షమించాలి నాస్తికుడైన ఈయన దెయ్యాలను నమ్మడు కడా. అందుకని పిచ్చి పట్టింది అనుకుందాం, ఆ సమయంలో ఇతనికి వైద్యం చేసిన వైద్యుడి గురించి అంతా తెలిసినప్పటికీ మరలా పిచ్చి ముదరగానే ఆ వైద్యుడ్ని నువ్వెవరు అని అడిగాడు. ఇతని పిచ్చి ప్రపంచానికి తెలియచెయ్యాలనే ఉద్దేశంతో నాలాంటివాడు ఎవరో ఆ చరిత్రను రాస్తూ ఆ మాటలన్నీ నమోదు చేసాడు. ఇప్పుడు చెప్పండి, నేను రాసింది వైరుధ్యం అని ఎవరైనా నిరూపించగలరా? కుదరదు. ఎందుకంటే ఆ
చరిత్రను రాయడంలో భాగంగా ఆ మాటలన్నీ నమోదు చేసాను. సౌలు విషయంలో కూడా జరిగింది ఇదే. కాదంటే అతనికి దెయ్యం పట్టింది. పదేపదే పడుతూనే ఉంది.
1 సమూయేలు 16:23 దేవుని యొద్ద నుండి దురాత్మ వచ్చి సౌలును పట్టినప్పుడెల్ల దావీదు సితారా చేతపట్టుకొని వాయింపగా దురాత్మ అతనిని విడిచిపోయెను, అతడు సేదదీరి బాగాయెను.
అలాంటప్పుడు సౌలు దావీదు తెలియదు అన్నట్టుగా ప్రశ్నించినంతమాత్రాన అది బైబిల్ వైరుధ్యమెలా ఔద్ది? పదేపదే దెయ్యం పట్టడం వల్ల అతని జ్ఞాపకశక్తి క్షీణించడం ఔతుంది. సౌలు చరిత్రలో ఇదే చూస్తాం. అప్పుడే దావీదును నాయనా అని ఏడుస్తున్నాడు (1 సమూయేలు 24:16). అదంతా మర్చిపోయి మళ్ళీ అతన్ని చంపాలని ప్రయత్నిస్తుంటాడు (1 సమూయేలు 26). అయ్యగారికి ఈజ్ఞానం కూడా లేకపోయే. బైబిల్ ను తప్పుపట్టాలనే ఆవేశంలో వచ్చిన తిప్పలు ఇవన్నీ. అందుకే సొలొమోను "అన్యాయము చేయుటవలన జ్ఞానులు తమ బుద్ధిని కోలుపోవుదురు" (ప్రసంగి 7:7) అని రాస్తున్నాడు.
Free Free Free
MEDIUM OF INSTRUCTION: English, Telugu, Tamil
PAUL SCHOOL OF Kannada MISSIONS
152/1 Capernaum, Grace gardens, Keel Krishnapuram, Oorgaumpet post, KGF
563121
(A UNIT OF PAUL MINISTRIES®)
We are happy to inform you that the next batch of students enrolment will be taken from July 2024, for three months of intensive training on Advanced Missions to reach the Unreached People groups. It is exclusively residential
training
QUALIFICATIONS REQUIRED: 1. Pastors and Lay pastors, 2. Born-again Christians interested in doing Lord's ministry,
their language,5. Preferably Men and married couples. SUBJECTS TAUGHT: 1. Missiology
TEACHERS ARE WELL-QUALIFIED THEOLOGIANS WITH PRACTICAL KNOWLEDGE AND FIELD EXPERIENCE.
WE REQUEST THE PASTORS,
ASSISTANT PASTORS, EVANGELISTS, AND YOUTHS TO UTILIZE THIS PROGRAM AND WELL EQUIP FOR THE MINISTRY.
పరిశుద్ధాత్మ వరాల పేరుతో నేటి క్రైస్తవ సంఘాన్ని మోసగిస్తున్న మరియొక ఆత్మను వాక్యపు వెలుగులో వివేచించడానికి అవసరమైన అనేక అంశాలను గురించి ఈ సదస్సులో చర్చించుకోబోతున్నాము.
వీటి విషయమై తలెత్తే అనేక సందేహాలను నివృత్తి చేసుకోవడానికి ఇదొక సదవకాశం. తెలిసో తెలీకో అనేకులు గురైన ఈ మోసం నుండి తప్పించుకోవడానికి ఈ సదస్సులో తప్పక పాల్గొనండి. 'సత్యము మిమ్మును స్వతంత్రులనుగా చేస్తుంది'
https://forms.gle/5uQJQSjp9GXCSy5X6
© 2024. ఈ వెబ్ సైట్ యొక్క సర్వ హక్కులు హితబోధ.కామ్ నకు చెందినవి.