మీ శవములు ఈ అరణ్యములోనే రాలును; మీ లెక్కమొత్తము చొప్పున మీలో లెక్కింపబడినవారందరు, అనగా ఇరువది ఏండ్లు మొదలుకొని పైప్రాయము గలిగి నాకు విరోధముగా సణగినవారందరు రాలిపోవుదురు.
ఇది యెహోవా అను నేను చెప్పిన మాట నాకు విరోధముగా కూడిన చెడ్డదగు ఈ సర్వ సమాజమునకు నిశ్చయముగా దీని చేసెదను. ఈ అరణ్యములో వారు క్షీణించిపోవుదురు; ఇక్కడనే చనిపోవుదురు అనెను.
మోషే అహరోనులు సీనాయి అరణ్యములో ఇశ్రాయేలీయుల సంఖ్యను చేసినప్పుడు లెక్కింపబడినవారిలో ఒక్కడైనను వీరిలో ఉండలేదు.
ఏలయనగా వారు నిశ్చయముగా అరణ్యములో చనిపోవుదురని యెహోవా వారినిగూర్చి సెలవిచ్చెను. యెపున్నె కుమారుడైన కాలేబును నూను కుమారుడైన యెహోషువయు తప్ప వారిలో ఒక్కడైనను మిగిలి యుండలేదు.
మనము కాదేషుబర్నేయలోనుండి బయలుదేరి జెరెదు ఏరుదాటువరకు, అనగా యెహోవా వారిని గూర్చి ప్రమాణము చేసినట్లు సైనికులైన ఆ మనుష్యుల తరమువారందరు సేనలోనుండకుండ నశించువరకు మనము నడిచిన కాలము ముప్పది యెనిమిది సంవత్సరములు. అంతేకాదు, వారు నశించువరకు
సేన మధ్యనుండి వారిని సంహరించుటకు యెహోవా బాహువు వారికి విరోధముగా నుండెను.
సైనికులైన వారందరు ప్రజలలోనుండి లయమైపోయిన తరువాత యెహోవా నాకు ఈలాగు సెలవిచ్చెను.
ఆయన స్త్రీతో నీ ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించెదను; వేదనతో పిల్లలను కందువు; నీ భర్తయెడల నీకు వాంఛ కలుగును; అతడు నిన్ను ఏలునని చెప్పెను.
ఆయన ఆదాముతో నీవు నీ భార్యమాట విని తినవద్దని నేను నీ కాజ్ఞాపించిన వృక్షఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపింపబడియున్నది; ప్రయాసముతోనే నీవు బ్రదుకు దినములన్నియు దాని పంట తిందువు;
అది ముండ్ల తుప్పలను గచ్చపొదలను నీకు మొలిపించును; పొలములోని పంట తిందువు;
నీవు నేలకు తిరిగి చేరువరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారము తిందువు; ఏలయనగా నేలనుండి నీవు తీయబడితివి; నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోదువని చెప్పెను.
శ్రమ ధూళిలోనుండి పుట్టదు.బాధ భూమిలోనుండి మొలవదు.
నిప్పురవ్వలు పైకి ఎగురునట్లు నరులు శ్రమానుభవమునకే పుట్టుచున్నారు.
స్త్రీ కనిన నరుడు కొద్ది దినములవాడై మిక్కిలిబాధనొందును.
వ్యర్థము వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు, వ్యర్థము వ్యర్థము సమస్తము వ్యర్థమే.
ఆకాశముక్రింద జరుగునది అంతటిని జ్ఞానముచేత విచారించి గ్రహించుటకై నా మనస్సు నిలిపితిని; వారు దీనిచేత అభ్యాసము నొందవలెనని దేవుడు మానవులకు ఏర్పాటుచేసిన ప్రయాసము బహు కఠినమైనది.
సూర్యునిక్రింద జరుగుచున్న క్రియలనన్నిటిని నేను చూచితిని; అవి అన్నియు వ్యర్థములే, అవి యొకడు గాలికై ప్రయాసపడినట్టున్నవి.
సమస్తము వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు సమస్తము వ్వర్థము.
ఇదంతయు వినిన తరువాత తేలిన ఫలితార్థమిదే; దేవునియందు భయభక్తులు కలిగియుండి ఆయన కట్టడల ననుసరించి నడుచుచుండవలెను, మానవకోటికి ఇదియే విధి.
గూఢమైన ప్రతి యంశమునుగూర్చి దేవుడు విమర్శచేయునప్పుడు ఆయన ప్రతిక్రియను అది మంచిదే గాని చెడ్డదే గాని, తీర్పులోనికి తెచ్చును.