ఈ దేశముమీదికిని దీని నివాసుల మీదికిని చుట్టునున్న యీ జనులందరి మీదికిని వారిని రప్పించుచున్నాను; ఈ జనులను శాపగ్రస్తులగాను విస్మయాస్పదముగాను అపహాస్యాస్పదముగాను ఎప్పటికిని పాడుగాను ఉండజేసెదను.
ఉత్తరదేశమునుండి మహాజనముల సమూహమును నేను రేపుచున్నాను బబులోనునకు విరోధముగా దానిని రప్పించుచున్నాను ఆ జనులు దానిమీదికి యుద్ధపంక్తులు తీర్చుచున్నారు వారి మధ్యనుండియే ఆమె పట్టబడును ప్రజ్ఞగల బలాఢ్యులు దోపుడుసొమ్ము పట్టుకొనక మరలని రీతిగా వారి బాణములు అమోఘములై తిరిగి రాకుండును.
అక్కడ ఉత్తరదేశపు అధిపతు లందురును సీదోనీయు లందరును హతమైన వారితో దిగిపోయియున్నారు ; వారు పరాక్రమవంతులై భయము పుట్టించినను అవమానము నొందియున్నారు; సున్నతి లేనివారై కత్తిపాలైన వారిమధ్య పండుకొనియున్నారు ; గోతిలోనికి దిగిపోయిన వారితోపాటు వారును అవమానము నొందుదురు .
షేషకు పట్టబడెను జగత్ ప్రసిద్ధమైన పట్టణము పట్టబడెను బబులోను జనములకు విస్మయాస్పదమాయెను.
యెహోవా వాక్కు ఇదేడెబ్బది సంవత్సరములు గడచిన తరువాత వారి దోషములనుబట్టి నేను బబులోనురాజును ఆ జనులను కల్దీయుల దేశమును శిక్షింతును; ఆ దేశము ఎప్పుడు పాడుగనుండునట్లు నియమింతును.
బబులోనునుగూర్చియు కల్దీయుల దేశమునుగూర్చియు ప్రవక్తయైన యిర్మీయాద్వారా యెహోవా సెలవిచ్చిన వాక్కు
జనములలో ప్రకటించుడి సమాచారము తెలియజేయుడి ధ్వజమునెత్తి మరుగుచేయక చాటించుడి బబులోను పట్టబడును బేలు అవమానము నొందును మెరోదకు నేలపడవేయబడును బబులోను విగ్రహములు అవమానము నొందును దాని బొమ్మలు బోర్లద్రోయబడును
ఉత్తరదిక్కునుండి దానిమీదికి ఒక జనము వచ్చుచున్నది ఏ నివాసియు లేకుండ అది దాని దేశమును పాడుచేయును మనుష్యులేమి పశువులేమి అందరును పారిపోవుదురు అందరును తర్లిపోవుదురు.
ఆ కాలమున ఆనాటికి ఇశ్రాయేలువారును యూదావారును కూడి వచ్చెదరు ఏడ్చుచు సాగుచు తమ దేవుడైన యెహోవాయొద్ద విచారించుటకై వచ్చెదరు
ఎన్నటికిని మరువబడని నిత్యనిబంధన చేసికొని యెహోవాను కలిసికొందము రండని చెప్పుకొనుచు సీయోనుతట్టు అభిముఖులై ఆచ్చటికి వెళ్లు మార్గము ఏదని అడుగుచు వచ్చెదరు ఇదే యెహోవా వాక్కు.
నా ప్రజలు త్రోవతప్పిన గొఱ్ఱలుగా ఉన్నారు వారి కాపరులు కొండలమీదికి వారిని తోలుకొనిపోయి వారిని త్రోవ తప్పించిరి జనులు కొండకొండకు వెళ్లుచు తాము దిగవలసిన చోటు మరచిపోయిరి.
కనుగొనినవారందరు వారిని భక్షించుచు వచ్చిరి వారి శత్రువులుమేము అపరాధులము కాము వీరు న్యాయమునకు నివాసమును తమ పితరులకు నిరీక్షణాధారమునగు యెహోవామీద తిరుగుబాటు చేసినందున ఇది వారికి సంభవించెనని చెప్పుదురు.
బబులోనులోనుండి పారిపోవుడి కల్దీయులదేశములోనుండి బయలువెళ్లుడి మందలకు ముందు మేకపోతులు నడుచునట్లు ముందర నడువుడి.
ఉత్తరదేశమునుండి మహాజనముల సమూహమును నేను రేపుచున్నాను బబులోనునకు విరోధముగా దానిని రప్పించుచున్నాను ఆ జనులు దానిమీదికి యుద్ధపంక్తులు తీర్చుచున్నారు వారి మధ్యనుండియే ఆమె పట్టబడును ప్రజ్ఞగల బలాఢ్యులు దోపుడుసొమ్ము పట్టుకొనక మరలని రీతిగా వారి బాణములు అమోఘములై తిరిగి రాకుండును.
కల్దీయుల దేశము దోపుడుసొమ్మగును దాని దోచుకొను వారందరు సంతుష్టి నొందెదరు ఇదే యెహోవా వాక్కు.
నా స్వాస్థ్యమును దోచుకొనువారలారా, సంతోషించుచు ఉత్సహించుచు నురిపిడిచేయుచు పెయ్యవలె గంతులువేయుచు బలమైన గుఱ్ఱములవలె మీరు సకిలించుచున్నారే?
మీ తల్లి బహుగా సిగ్గుపడును మిమ్మును కన్నది తెల్లబోవును ఇదిగో అది జనములన్నిటిలో అతినీచ జనమగును అది యెడారియు ఎండినభూమియు అడవియునగును.
యెహోవా రౌద్రమునుబట్టి అది నిర్జనమగును అది కేవలము పాడైపోవును బబులోను మార్గమున పోవువారందరు ఆశ్చర్యపడి దాని తెగుళ్లన్నియు చూచి--ఆహా నీకీగతి పట్టినదా? అందురు
ఆమె యెహోవాకు విరోధముగా పాపముచేసినది. విల్లు త్రొక్కువారలారా, మీరందరు బబులోనునకు విరోధముగా దాని చుట్టు యుద్ధపంక్తులు తీర్చుడి ఎడతెగక దానిమీద బాణములు వేయుడి
చుట్టు కూడి దానిని బట్టి కేకలువేయుడి అది లోబడ నొప్పుకొనుచున్నది దాని బురుజులు పడిపోవుచున్నవి దాని ప్రాకారములు విరుగగొట్టబడుచున్నవి ఇది యెహోవా చేయు ప్రతికారము.దానిమీద పగతీర్చుకొనుడి అది చేసినట్టే దానికి చేయుడి.
బబులోనులో నుండకుండ విత్తువారిని నిర్మూలము చేయుడి కోతకాలమున కొడవలి పట్టుకొనువారిని నిర్మూలము చేయుడి క్రూరమైన ఖడ్గమునకు భయపడి వారందరు తమ ప్రజలయొద్దకు వెళ్లుచున్నారు తమ తమ దేశములకు పారిపోవుచున్నారు.
ఇశ్రాయేలువారు చెదిరిపోయిన గొఱ్ఱలు సింహములు వారిని తొలగగొట్టెను మొదట అష్షూరురాజు వారిని భక్షించెను కడపట బబులోను రాజైన యీ నెబుకద్రెజరు వారి యెముకలను నలుగగొట్టుచున్నాడు.
కావున ఇశ్రాయేలు దేవుడును సైన్యముల కధిపతియునగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు అష్షూరు రాజును నేను దండించినట్లు బబులోనురాజును అతని దేశమును దండించెదను.
ఇశ్రాయేలువారిని తమ మేతస్థలమునకు నేను తిరిగి రప్పించెదను వారు కర్మెలుమీదను బాషానుమీదను మేయుదురు ఎఫ్రాయిము కొండలమీదను గిలాదులోను మేయుచు సంతుష్టినొందును.
ఆ కాలమున ఆ నాటికి ఇశ్రాయేలు దోషమును వెదకినను అది కనబడకుండును. యూదా పాపములు వెదకిను అవి దొరుకవు శేషింపజేసినవారిని నేను క్షమించెదను ఇదే యెహోవా వాక్కు.
దండెత్తి మెరాతయీయుల దేశముమీదికి పొమ్ము పెకోదీయుల దేశముమీదికి పొమ్ము వారిని హతముచేయుము వారు శాపగ్రస్తులని ప్రకటించుము నేను మీకిచ్చిన ఆజ్ఞ అంతటినిబట్టి చేయుము.
ఆలకించుడి, దేశములో యుద్ధధ్వని వినబడుచున్నది అధిక నాశనధ్వని వినబడుచున్నది
సర్వభూమిని కొట్టుచున్న సమ్మెట తెగి బొత్తిగా విరుగగొట్టబడెను అన్యజనులలో బబులోను బొత్తిగా పాడైపోయెను.
బబులోనూ, నిన్ను పట్టుకొనుటకై బోను పెట్టియున్నాను తెలియకయే నీవు పట్టబడియున్నావు యెహోవాతో నీవు యుద్ధముచేయ బూనుకొంటివి నీవు చిక్కుపడి పట్టబడియున్నావు.
కల్దీయులదేశములో ప్రభువును సైన్యములకధిపతియునగు యెహోవాకు పనియున్నది యెహోవా తన ఆయుధశాలను తెరచి కోపముతీర్చు తన ఆయుధములను వెలుపలికి తెచ్చుచున్నాడు.
నలుదిక్కులనుండి వచ్చి దానిమీద పడుడి దాని ధాన్యపుకొట్లను విప్పుడి కసవు కుప్పలువేసినట్లు దానిని కుప్పలువేయుడి శేషమేమియు లేకుండ నాశనము చేయుడి
దాని యెడ్లన్నిటిని వధించుడి అవి వధకు పోవలెను అయ్యో, వారికి శ్రమ వారి దినము ఆసన్నమాయెను వారి దండనకాలము వచ్చెను.
ఆలకించుడి, పారిపోయి బబులోను దేశములోనుండి తప్పించుకొని వచ్చుచున్నవారి శబ్దము వినబడుచున్నది మన దేవుడగు యెహోవా చేయు ప్రతికార సమాచారమును తన ఆలయము విషయమై ఆయన చేయు ప్రతికార సమాచారమును సీయోనులో ప్రకటించుడి. వారు వచ్చుచున్నారు.
బబులోనునకు రండని విలుకాండ్రమ పిలువుడి విల్లు త్రొక్కువారలారా, మీరందరు దానిచుట్టు దిగుడి. అది యెహోవామీద గర్వపడినది ఇశ్రాయేలు పరిశుద్ధునిమీద గర్వపడినది దానిలో నొకడును తప్పించుకొనకూడదు దాని క్రియలనుబట్టి దానికి ప్రతికారము చేయుడి అది చేసిన పనియంతటినిబట్టి దానికి ప్రతికారము చేయుడి.
కావున ఆ దినమున దాని ¸యవనస్థులు దాని వీధులలో కూలుదురు దాని యోధులందరు తుడిచివేయబడుదురు ఇదే యెహోవా వాక్కు.
ప్రభువును సైన్యములకధిపతియునగు యెహోవా వాక్కు ఇదే గర్విష్ఠుడా, నేను నీకు విరోధినైయున్నాను నీ దినము వచ్చుచున్నది నేను నిన్ను శిక్షించుకాలము వచ్చుచున్నది
గర్విష్ఠుడు తొట్రిల్లి కూలును అతని లేవనెత్తువాడెవడును లేకపోవును నేనతని పురములలో అగ్ని రాజబెట్టెదను అది అతని చుట్టుపట్టులన్నిటిని కాల్చివేయును.
సైన్యములకధిపతియగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు ఒకడును తప్పకుండ ఇశ్రాయేలువారును యూదావారును బాధింపబడిరి వారిని చెరపెట్టినవారందరు వారిని గట్టిగా పట్టుకొనుచున్నారు వారిని పోనిచ్చుటకు సమ్మతింపరు.
వారి విమోచకుడు బలవంతుడు సైన్యములకధిపతియగు యెహోవా అని ఆయనకు పేరు భూమికి విశ్రాంతి కలుగజేయుటకును బబులోను నివాసులను కలవరపరచుటకును ఆయన బాగుగా వాదించి వారి వ్యాజ్యెమును కడముట్టించును.
యెహోవా మాట యిదే కల్దీయులును బబులోను నివాసులును దాని అధిపతులును జ్ఞానులును కత్తిపాలగుదురు
ప్రగల్భములు పలుకువారు ఖడ్గవశులై పిచ్చివాండ్రగుదురు. బలాఢ్యులు నిర్మూలమగువరకు ఖడ్గము వారిమీద పడును
ఖడ్గము వారి గుఱ్ఱములమీద పడును వారి రథముల మీద పడును ఖడ్గము వారిమీదికి దిగుటచేత దానిలోనున్న పరదేశులు స్త్రీలవంటివారగుదురు అది దాని నిధులమీద పడగా అవి దోచుకొనబడును.
నీళ్లకు ఎద్దడి తగులును అవి ఇంకిపోవును అది చెక్కబడిన విగ్రహములుగల దేశము జనులు భీకరప్రతిమలనుబట్టి పిచ్చిచేష్టలు చేయుదురు.
అందుచేతను అడవిపిల్లులును నక్కలును అక్కడ నివసించును నిప్పుకోళ్లును దానిలో నివాసముచేయును ఇకమీదట అది ఎన్నడును నివాసస్థలము కాకపోవును తరతరములు దానిలో ఎవరును కాపురముండరు.
యెహోవా వాక్కు ఇదే సొదొమను గొమొఱ్ఱాను వాటి సమీపపట్టణములను దేవుడు నాశనము చేసినప్పుడు జరిగిన రీతిగా ఎవడును అక్కడ కాపురముండకపోవును ఏ నరుడును దానిలో బసచేయడు.
జనులు ఉత్తరదిక్కునుండి వచ్చుచున్నారు మహాజనమును అనేక రాజులును భూదిగంతములనుండి రేపబడెదరు.
వారు వింటిని ఈటెను పట్టుకొని వచ్చెదరు వారు క్రూరులు జాలిపడనివారు వారి స్వరము సముద్రఘోషవలె ఉన్నది వారు గుఱ్ఱములను ఎక్కువారు బబులోను కుమారీ, ఒకడు యుద్ధపంక్తులు తీర్చు రీతిగా వారందరు నీమీద పంక్తులు తీర్చుచున్నారు.
బబులోనురాజు వారి సమాచారము విని దుర్బలుడాయెను అతనికి బాధ కలిగెను ప్రసవ స్త్రీ వేదనవంటి వేదన అతనికి సంభవించెను.
చిరకాల నివాసమును పట్టుకొనవలెనని శత్రువులు యొర్దాను ప్రవాహములో నుండి సింహమువలె వచ్చుచున్నారు నిమిషములోనే నేను వారిని దానియొద్దనుండి తోలివేయుదును నేనెవని ఏర్పరతునో వానిని దానిమీద నియమించెదను నన్ను పోలియున్నవాడై నన్ను ఆక్షేపణచేయువాడేడి?నన్ను ఎదిరింపగల కాపరి ఏడి?
బబులోనునుగూర్చి యెహోవా చేసిన ఆలోచన వినుడి కల్దీయుల దేశమునుగూర్చి ఆయన ఉద్దేశించినది వినుడి నిశ్చయముగా మందలోని అల్పులైనవారిని వారు లాగుదురు నిశ్చయముగా వారినిబట్టి వారి నివాసస్థలము విస్మయమొందును.
బబులోను పట్టబడుచున్నదను సమాచారము విని భూమి కంపించుచున్నది జనములలో అంగలార్పు వినబడుచున్నది.
ఆమోజు కుమారుడైన యెషయాకు బబులోనుగూర్చి ప్రత్యక్షమైన దేవోక్తి
జనులు ప్రధానుల ద్వారములలో ప్రవేశించుటకు చెట్లులేని కొండమీద ధ్వజము నిలువబెట్టుడి ఎలుగెత్తి వారిని పిలువుడి సంజ్ఞ చేయుడి.
నాకు ప్రతిష్ఠితులైనవారికి నేను ఆజ్ఞ ఇచ్చియున్నాను నా కోపము తీర్చుకొనవలెనని నా పరాక్రమశాలురను పిలిపించియున్నాను నా ప్రభావమునుబట్టి హర్షించువారిని పిలిపించియున్నాను.
బహుజనుల ఘోషవలె కొండలలోని జనసమూహమువలన కలుగు శబ్దము వినుడి కూడుకొను రాజ్యముల జనములు చేయు అల్లరి శబ్దము వినుడి సైన్యముల కధిపతియగు యెహోవా యుద్ధమునకై తన సేనను వ్యూహక్రమముగా ఏర్పరచుచున్నాడు
సర్వలోకమును పాడుచేయుటకై ఆయన దూరదేశమునుండి ఆకాశ దిగంతములనుండి యెహోవాయును ఆయన క్రోధము తీర్చు ఆయుధములును వచ్చుచున్నారు.
యెహోవా దినము వచ్చుచున్నది ఘోషించుడి అది ప్రళయమువలె సర్వశక్తుడగు దేవుని యొద్దనుండి వచ్చును.
అందుచేత బాహువులన్నియు దుర్బలములగును ప్రతివాని గుండె కరగిపోవును
జనులు విభ్రాంతినొందుదురు వేదనలు దుఃఖములు వారికి కలుగును ప్రసవవేదన పడుదానివలె వారు వేదనపడెదరు ఒకరినొకరు తేరి చూతురు వారి ముఖములు జ్వాలలవలె ఎఱ్ఱబారును.
యెహోవా దినము వచ్చుచున్నది. దేశమును పాడుచేయుటకును పాపులను బొత్తిగా దానిలోనుండకుండ నశింపజేయుటకును క్రూరమైన ఉగ్రతతోను ప్రచండమైన కోపముతోను అది వచ్చును.
ఆకాశ నక్షత్రములును నక్షత్రరాసులును తమ వెలుగు ప్రకాశింపనియ్యవు ఉదయకాలమున సూర్యుని చీకటి కమ్మును చంద్రుడు ప్రకాశింపడు.
లోకుల చెడుతనమునుబట్టియు దుష్టుల దోషమునుబట్టియు నేను వారిని శిక్షింపబోవుచున్నాను అహంకారుల అతిశయమును మాన్పించెదను బలాత్కారుల గర్వమును అణచివేసెదను.
బంగారుకంటె మనుష్యులును ఓఫీరు దేశపు సువర్ణముకంటె నరులును అరుదుగా ఉండజేసెదను.
సైన్యములకధిపతియగు యెహోవా ఉగ్రతకును ఆయన కోపాగ్ని దినమునకును ఆకాశము వణకునట్లును భూమి తన స్థానము తప్పునట్లును నేను చేసెదను.
అప్పుడు తరుమబడుచున్న జింకవలెను పోగుచేయని గొఱ్ఱలవలెను జనులు తమ తమ స్వజనులతట్టు తిరుగుదురు తమ తమ స్వదేశములకు పారిపోవుదురు.
కన్యకయైన బబులోనూ, క్రిందికి దిగి మంటిలో కూర్చుండుము కల్దీయుల కుమారీ, సింహాసనము లేకయే నేలమీద కూర్చుండుము నీవు మృదువువనియైనను సుకుమారివనియైనను జనులు ఇకమీదట చెప్పరు.
తిరుగటిదిమ్మలు తీసికొని పిండి విసరుము నీ ముసుకు పారవేయుము కాలిమీద జీరాడు వస్త్రము తీసివేయుము కాలిమీది బట్ట తీసి నదులు దాటుము.
నీ కోకయు తీసివేయబడును నీకు కలిగిన యవమానము వెల్లడియగును నేను ప్రతిదండన చేయుచు నరులను మన్నింపను.
సైన్యములకధిపతియు ఇశ్రాయేలుయొక్క పరిశుద్ధ దేవుడునగు యెహోవా అని మా విమోచకునికి పేరు.
కల్దీయుల కుమారీ, మౌనముగా నుండి చీకటిలోనికి పొమ్ము రాజ్యములకు దొరసానియని యికమీదట జనులు నిన్నుగూర్చి చెప్పరు .
నా జనులమీద కోపపడి నా స్వాస్థ్యము నపవిత్ర పరచి వారిని నీ చేతికి అప్పగించితిని నీవు వారియందు కనికర పడక వృద్దుల మీద నీ కాడి మ్రానును మిక్కిలి బరువుగా మోపితివి .
నేను సర్వదా దొరసానినై యుందునని నీవనుకొని వీటిని ఆలోచింప కపోతివి వాటి ఫలమేమవునో మనస్సునకు తెచ్చుకొనకపోతివి .
కాబట్టి సుఖాసక్తురాలవై నిర్భయముగా నివసించుచు నేనే ఉన్నాను నేను తప్ప మరి ఎవరును లేరు నేను విధవరాలనై కూర్చుండను పుత్రశోకము నేను చూ డనని అనుకొనుచున్నదానా , ఈ మాటను వినుము
ఒక్క దినములోగా ఒక్క నిమిషముననే పుత్ర శోకమును వైధవ్యమును ఈ రెండును నీకు సంభవించును . నీవు అధికముగా శకునము చూచినను అత్యధికమైన కర్ణపిశాచ తంత్రములను నీవు ఆధారముగా చేసికొనినను ఆ యపాయములు నీమీదికి సంపూర్తిగా వచ్చును .
నీ చెడుతనమును నీవు ఆధారము చేసికొని యెవడును నన్ను చూడడని అనుకొంటివి నేనున్నాను నేను తప్ప మరి ఎవరును లేరని నీవనుకొనునట్లుగా నీ విద్యయు నీ జ్ఞానమును నిన్ను చెరిపివేసెను .
కీడు నీమీదికి వచ్చును నీవు మంత్రించి దాని పోగొట్ట జాలవు ఆ కీడు నీమీద పడును దానిని నీవు నివారించ లేవు నీకు తెలి యని నాశనము నీమీదికి ఆకస్మికముగా వచ్చును .
నీ బాల్యమునుండి నీవు ప్రయాసపడి అభ్యసించిన నీ కర్ణపిశాచ తంత్రములను నీ విస్తారమైన శకునములను చూపుటకు నిలువుము ఒకవేళ అవి నీకు ప్రయోజనము లగునేమో ఒకవేళ నీవు మనుష్యులను బెదరింతు వేమో
నీ విస్తారమైన యోచనలవలన నీవు అలసియున్నావు జ్యోతిష్కులు నక్షత్రసూచకులు మాసచర్య చెప్పువారు నిలువబడి నీమీదికి వచ్చునవి రాకుండ నిన్ను తప్పించి రక్షించుదురేమో ఆలోచించుము.
వారు కొయ్యకాలు వలెనైరి అగ్ని వారిని కాల్చివేయుచున్నది జ్వాలయొక్క బలమునుండి తమ్ముతాము తప్పించుకొన లేక యున్నారు అది కాచుకొనుటకు నిప్పు కాదు ఎదుట కూర్చుండి కాచుకొనదగినది కాదు.
నీవు ఎవరికొరకు ప్రయాసపడి అలసితివో వారికి ఆలాగే జరుగుచున్నది నీ బాల్యము మొదలుకొని నీతో వ్యాపారము చేయు వారు తమ తమ చోట్లకు వెళ్లిపోవుచున్నారు నిన్ను రక్షించువాడొకడైన నుండడు .
రాజగు బెల్షస్సరు తన యధిపతులలో వెయ్యిమందికి గొప్ప విందు చేయించి , ఆ వెయ్యి మందితో కలిసికొని ద్రాక్షారసము త్రాగుచుండెను .
బెల్షస్సరు ద్రాక్షారసము త్రాగుచుండగా తానును తన యధిపతులును తన రాణులును తన ఉపపత్నులును వాటిలో ద్రాక్షారసము పోసి త్రాగునట్లు , తన తండ్రియగు నెబుకద్నెజరు యెరూషలేములోని యాలయములోనుండి తెచ్చిన వెండి బంగారు పాత్రలను తెమ్మని ఆజ్ఞ ఇచ్చెను.
అందుకు వారు యెరూషలేములోని దేవుని నివాసమగు ఆలయములోనుండి తీసికొన్న సువర్ణో పకరణములను తెచ్చి యుంచగా, రాజును అతని యధిపతులును అతని రాణులును అతని ఉపపత్నులును వాటిలో ద్రాక్షారసము పోసి త్రాగిరి .
వారు బంగారు వెండి యిత్తడి యినుము కఱ్ఱ రాయి అను వాటితో చేసిన దేవతలను స్తుతించుచు ద్రాక్షారసము త్రాగుచుండగా
ఆ గడియలోనే మానవ హస్తపు వ్రేళ్లు కనబడి, దీపము దగ్గర రాజుయొక్క నగరు గోడ పూత మీద ఏదో యొక వ్రాత వ్రాయుచున్నట్టుండెను . రాజు ఆ హస్తము వ్రాయుట చూడగా
అతని ముఖము వికారమాయెను , అతడు మనస్సునందు కలవరపడగా అతని నడుము కీళ్లు వదలి అతని మోకాళ్లు గడగడ వణకుచు కొట్టుకొనుచుండెను .
రాజు గారడీవిద్యగలవారిని కల్దీయులను జ్యోతిష్యులను పిలువ నంపుడని ఆతురముగా ఆజ్ఞ ఇచ్చి, బబులోనులోని జ్ఞానులు రాగానే ఇట్లనెను -ఈ వ్రాతను చదివి దీని భావమును నాకు తెలియజెప్పు వాడెవడో వాడు ఊదా రంగు వస్త్రము కట్టుకొని తన మెడను సువర్ణమయమైన కంఠభూషణము ధరింపబడినవాడై రాజ్యములో మూడవ యధిపతిగా ఏలును.
రాజు నియమించిన జ్ఞాను లందరు అతని సముఖమునకు వచ్చిరి గాని ఆ వ్రాత చదువుటయైనను దాని భావము తెలియజెప్పుటయైనను వారివల్ల కాకపోయెను .
అందుకు రాజగు బెల్షస్సరు మిగుల భయాక్రాంతుడై తన యధిపతులు విస్మయమొందునట్లుగా ముఖ వికారముగలవాడాయెను .
రాజునకును అతని యధిపతులకును జరిగిన సంగతి రాణి తెలిసికొని విందు గృహమునకు వచ్చి ఇట్లనెను -రాజు చిరకాలము జీవించునుగాక , నీ తలంపులు నిన్ను కలవరపరచ నియ్యకుము , నీ మనస్సు నిబ్బరముగా ఉండనిమ్ము.
నీ రాజ్యములో ఒక మనుష్యు డున్నాడు . అతడు పరిశుద్ధ దేవతల ఆత్మగలవాడు ; నీ తండ్రి కాలములో అతడు దైవ జ్ఞానమువంటి జ్ఞానమును బుద్ధియు తెలివియు గలవాడై యుండుట నీ తండ్రి కనుగొనెను గనుక నీ తండ్రియైన రాజగు నెబుకద్నెజరు శకునగాండ్రకును గారడీవిద్యగల వారికిని కల్దీయులకును జ్యోతిష్యులకును పై యధిపతిగా అతని నియమించెను .
ఈ దానియేలు శ్రేష్ఠమైన బుద్ధిగలవాడై కలలు తెలియజేయుటకును , మర్మములు బయలుపరచుటకును , కఠినమైన ప్రశ్నల కుత్తరమిచ్చుటకును జ్ఞానమును తెలివియుగలవాడుగా కనబడెను గనుక ఆ రాజు అతనికి బెల్తెషాజరు అను పేరు పెట్టెను. ఈ దానియేలును పిలువనంపుము , అతడు దీని భావము నీకు తెలియజెప్పును .
అప్పుడు వారు దానియేలును పిలువనంపించిరి . అతడు రాగా రాజు ఇట్లనెను -రాజగు నా తండ్రి యూదయలో నుండి ఇక్కడికి తీసికొనివచ్చిన చెర సంబంధమగు యూదులలోనుండు దానియేలు నీవే గదా?
దేవతల ఆత్మయు వివేకమును బుద్ధియు విశేష జ్ఞానమును నీయందున్నవని నిన్నుగూర్చి వింటిని .
ఈ వ్రాత చదివి దాని భావము తెలియజెప్పవలెనని జ్ఞానులను గారడీవిద్యగల వారిని పిలిపించితిని గాని వారు ఈ సంగతియొక్క భావమును తెలుప లేక పోయిరి.
అంతర్భావములను బయలుపరచుటకును కఠినమైన ప్రశ్నలకు ఉత్తరమిచ్చుటకును నీవు సమర్ధుడవని నిన్నుగూర్చి వినియున్నాను గనుక ఈ వ్రాతను చదువుటకును దాని భావమును తెలియజెప్పుటకును నీకు శక్యమైన యెడల నీవు ఊదారంగు వస్త్రము కట్టుకొని మెడను సువర్ణ కంఠభూషణము ధరించుకొని రాజ్యములో మూడవ యధిపతివిగా ఏలుదువు.
అందుకు దానియేలు ఇట్లనెను -నీ దానములు నీయొద్ద నుంచుకొనుము , నీ బహుమానములు మరి ఎవనికైన నిమ్ము ; అయితే నేను ఈ వ్రాతను చదివి దాని భావమును రాజునకు తెలియజెప్పెదను .
రాజా చిత్తగించుము; మహోన్నతుడగు దేవుడు మహర్దశను రాజ్యమును ప్రభావమును ఘనతను నీ తండ్రియగు నెబుకద్నెజరునకు ఇచ్చెను .
దేవుడు అతనికిట్టి మహర్దశ ఇచ్చి నందున తానెవరిని చంపగోరెనో వారిని చంపెను ; ఎవరిని రక్షింపగోరెనో వారిని రక్షించెను , ఎవరిని హెచ్చింపగోరెనో వారిని హెచ్చించెను ; ఎవరిని పడ వేయగోరెనో వారిని పడవేసెను . కాబట్టి సకల రాష్ట్రములును జనులును ఆ యా భాషలు మాటలాడు వారును అతనికి భయపడుచు అతని యెదుట వణకుచు నుండిరి.
అయితే అతడు మనస్సున అతిశయించి , బలాత్కారము చేయుటకు అతని హృదయమును కఠినము చేసికొనగా దేవుడు అతని ప్రభుత్వము నతనియొద్దనుండి తీసివేసి అతని ఘనతను పోగొట్టెను .
అప్పుడతడు మానవుల యొద్దనుండి తరమబడి పశువుల వంటి మనస్సు గలవాడాయెను . మహోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యములలో ఏలుచు , ఎవరిని స్థాపింపగోరునో వారిని స్థాపించునని అతడు తెలిసికొను వరకు అతడు అడవి గాడిదలమధ్య నివసించుచు పశువులవలె గడ్డి మేయుచు ఆకాశపు మంచు చేత తడిసిన శరీరము గలవాడాయెను.
బెల్షస్సరూ , అతని కుమారుడవగు నీవు ఈ సంగతియంతయు ఎరిగియుండియు , నీ మనస్సును అణచు కొనక , పరలోకమందున్న ప్రభువు మీద నిన్ను నీవే హెచ్చించుకొంటివి .
ఎట్లనగా నీవును నీ యధిపతులును నీ రాణులును నీ ఉపపత్నులును దేవుని ఆలయసంబంధమగు ఉపకరణములలో ద్రాక్షారసము పోసి త్రాగవలెనని వాటిని తెచ్చి యుంచుకొని వాటితో త్రాగుచు , చూడ నైనను విన నైనను గ్రహింప నైనను చేతకాని వెండి బంగారు ఇత్తడి ఇనుము కఱ్ఱ రాయి అను వాటితో చేయబడిన దేవతలను స్తుతించితిరి గాని, నీ ప్రాణమును నీ సకల మార్గములును ఏ దేవుని వశమున ఉన్నవో ఆయనను నీవు ఘనపరచ లేదు .
కావున ఆయన యెదుటనుండి ఈ యరచేయి వచ్చి ఈ వ్రాతను వ్రాసెను ; వ్రాసిన శాసనమేదనగా, మెనే మెనే టెకేల్ ఉఫార్సీన్ .
ఈ వాక్య భావమేమనగా , మినే అనగా దేవుడు నీ ప్రభుత్వవిషయములో లెక్కచూచి దాని ముగించెను .
టెకేల్ అనగా ఆయన నిన్ను త్రాసులో తూచగా నీవు తక్కువగా కనబడితివి .
ఫెరేన్ అనగా నీ రాజ్యము నీయొద్దనుండి విభాగింపబడి మాదీయులకును పారసీకులకును ఇయ్యబడును .
బెల్షస్సరు ఆజ్ఞ ఇయ్యగా వారు దానియేలునకు ఊదారంగు వస్త్రము తొడిగించి యతని
మెడను బంగారపు హారమువేసి ప్రభుత్వము చేయుటలో నతడు మూడవ యధికారియని చాటించిరి .
ఆ రాత్రియందే కల్దీయుల రాజగు బెల్షస్సరు హతుడాయెను .
మాదీయుడగు దర్యావేషు అరువది రెండు సంవత్సరముల వాడై సింహాసనము నెక్కెను .
ఘనతకు మారుగా అవమానముతో నిండియున్నావు; నీవును త్రాగి నీ మానము కనుపరచు కొందువు. యెహోవా కుడిచేతిలోని పాత్ర నీకియ్య బడును, అవమానకరమైన వమనము నీ ఘనతమీదపడును.
అటుతరువాత మహాధికారముగల వేరొక దూత పరలోకమునుండి దిగివచ్చుట చూచితిని. అతని మహిమ చేత భూమి ప్రకాశించెను.
అతడు గొప్ప స్వరముతో అర్భటించి యిట్లనెను -మహాబబులోను కూలిపోయెను కూలిపోయెను. అది దయ్యములకు నివాసస్థలమును, ప్రతి అపవిత్రాత్మకు ఉనికిపట్టును, అపవిత్రమును అసహ్యమునైన ప్రతి పక్షికి ఉనికిపట్టును ఆయెను.
ఏలయనగా సమస్తమైన జనములు మోహోద్రేకముతో కూడిన దాని వ్యభిచార మద్యమును త్రాగి పడిపోయిరి, భూరాజులు దానితో వ్యభిచరించిరి, భూలోకమందలి వర్తకులు దాని సుఖభోగములవలన ధనవంతులైరి.
మరియు ఇంకొక స్వరము పరలోకములోనుండి ఈలాగు చెప్పగా వింటిని నా -ప్రజలారా, మీరు దాని పాపములలో పాలివారు కాకుండునట్లును, దాని తెగుళ్లలో ఏదియు మీకు ప్రాప్తింపకుండునట్లును దానిని విడిచి రండి.
దాని పాపములు ఆకాశమునంటుచున్నవి, దాని నేరములను దేవుడు జ్ఞాపకము చేసికొనియున్నాడు.
అది యిచ్చినప్రకారము దానికి ఇయ్యుడి; దాని క్రియల చొప్పున దానికి రెట్టింపు చేయుడి; అది కలిపిన పాత్రలో దానికొరకు రెండంతలు కలిపి పెట్టుడి.
అది -నేను రాణినిగా కూర్చుండుదానను, నేను విధవరాలను కాను, దుఃఖము చూడనే చూడనని తన మనస్సులో అనుకొనెను గనుక, అది తన్నుతాను ఎంతగా గొప్ప చేసికొని సుఖభోగములను అనుభవించెనో అంతగా వేదనను దుఃఖమును దానికి కలుగజేయుడి.
అందుచేత ఒక్క దినముననే దాని తెగుళ్లు, అనగా మరణమును దుఃఖమును కరవును వచ్చును; దానికి తీర్పుతీర్చుచున్న దేవుడైన ప్రభువు బలిష్ఠుడు గనుక అది అగ్నిచేత బొత్తిగా కాల్చివేయబడును.
దానితో వ్యభిచారముచేసి సుఖభోగములను అనుభవించిన భూరాజులు దాని బాధ చూచి భయాక్రాంతులై దూరమున నిలువబడి దాని దహనధూమమును చూచునప్పుడు
దాని విషయమై రొమ్ము కొట్టుకొనుచు ఏడ్చుచు--అయ్యో, అయ్యో, బబులోను మహాపట్టణమా, బలమైన పట్టణమా, ఒక్క గడియలోనే నీకు తీర్పువచ్చెను గదా అని చెప్పుకొందురు.
లోకములోని వర్తకులును, ఆ పట్టణమును చూచి యేడ్చుచు, తమ సరకులను, అనగా బంగారు వెండి రత్నములు ముత్యములు సన్నపు నార బట్టలు ఊదారంగుబట్టలు పట్టుబట్టలు రక్తవర్ణపుబట్టలు మొదలైన సరకులను,
ప్రతివిధమైన దబ్బమ్రానును ప్రతి విధమైన దంతపు వస్తువులను, మిక్కిలి విలువగల కఱ్ఱ యిత్తడి యినుము చలువరాళ్లు మొదలైనవాటితో చేయబడిన ప్రతివిధమైన వస్తువులను,
దాల్చినిచెక్క ఓమము ధూపద్రవ్యములు అత్తరు సాంబ్రాణి ద్రాక్షారసము నూనె మెత్తనిపిండి గోదుమలు పశువులు గొఱ్ఱెలు మొదలగు వాటిని, గుఱ్ఱములను రథములను దాసులను మనుష్యుల ప్రాణములను ఇకమీదట ఎవడును కొనడు;
నీ ప్రాణమునకు ఇష్టమైన ఫలములు నిన్ను విడిచిపోయెను, రుచ్యమైనవన్నియు దివ్యమైనవన్నియు నీకు దొరకకుండ నశించిపోయినవి, అవి యికమీదట కనబడనే కనబడవని చెప్పుకొనుచు, దానిగూర్చి దుఃఖపడుదురు.
ఆ పట్టణముచేత ధనవంతులైన యీ సరకుల వర్తకులు ఏడ్చుచు దుఃఖపడుచు
అయ్యో, అయ్యో, సన్నపు నారబట్టలను ధూమ్రరక్తవర్ణపు వస్త్రములను ధరించుకొని, బంగారముతోను రత్నములతోను ముత్యములతోను అలంకరింపబడిన మహాపట్టణమా, యింత ఐశ్వర్యము ఒక్క గడియలోనే పాడైపోయెనే అని చెప్పుకొనుచు, దాని బాధను చూచి భయాక్రాంతులై దూరముగా నిలుచుందురు.
ప్రతి నావికుడును, ఎక్కడికైనను సబురుచేయు ప్రతివాడును, ఓడవారును, సముద్రముమీద పనిచేసి జీవనముచేయు వారందరును దూరముగా నిలిచి దాని దహన ధూమమును చూచి
ఈ మహాపట్టణముతో సమానమైనదేది అని చెప్పుకొనుచు కేకలువేసి
తమ తలలమీద దుమ్ముపోసికొని యేడ్చుచు దుఃఖించుచు అయ్యో, అయ్యో, ఆ మహాపట్టణము; అందులో సముద్రముమీద ఓడలుగల వారందరు, దానియందలి అధిక వ్యయముచేత ధనవంతులైరి; అది ఒక్క గడియలో పాడైపోయెనే అని చెప్పుకొనుచు కేకలు వేయుచుండిరి.
పరలోకమా, పరిశుద్ధులారా, అపొస్తలులారా, ప్రవక్తలారా, దానిగూర్చి ఆనందించుడి, ఏలయనగా దానిచేత మీకు కలిగిన తీర్పుకు ప్రతిగా దేవుడు ఆ పట్టణమునకు తీర్పు తీర్చియున్నాడు.
తరువాత బలిష్ఠుడైన యొక దూత గొప్ప తిరుగటి రాతివంటి రాయి యెత్తి సముద్రములో పడవేసి -ఈలాగు మహాపట్టణమైన బబులోను వేగముగా పడద్రోయబడి ఇక ఎన్నటికిని కనబడకపోవును.
నీ వర్తకులు భూమిమీద గొప్ప ప్రభువులై యుండిరి; జనములన్నియు నీ మాయమంత్రములచేత మోసపోయిరి; కావున వైణికులయొక్కయు, గాయకులయొక్కయు, పిల్లనగ్రోవి ఊదువారియొక్కయు బూరలు ఊదువారియొక్కయు శబ్దము ఇక ఎన్నడును నీలో వినబడదు. మరి ఏ శిల్పమైన చేయు శిల్పి యెవడును నీలో ఎంతమాత్రమును కనబడడు, తిరుగటిధ్వని యిక ఎన్నడును నీలో వినబడదు,
దీపపు వెలుగు నీలో ఇకను ప్రకాశింపనే ప్రకాశింపదు, పెండ్లికుమారుని స్వరమును పెండ్లికుమార్తె స్వరమును నీలో ఇక ఎన్నడును వినబడవు అని చెప్పెను.
మరియు ప్రవక్తల యొక్కయు, పరిశుద్ధులయొక్కయు, భూమిమీద వధింపబడినవారందరియొక్కయు రక్తము ఆ పట్టణములో కనబడెననెను.