
ఎలీషా గిల్గాలునకు తిరిగి రాగా ఆ దేశమందు క్షామము కలిగియుండెను. ప్రవక్తల శిష్యులు అతని సమక్షమునందు కూర్చుండి యుండగా అతడు తన పనివానిని పిలిచి పెద్ద కుండ పొయిమీద పెట్టి ప్రవక్తల శిష్యులకు కూర వంటచేయుమని సెలవిచ్చెను.
అయితే ఒకడు కూరాకులు ఏరుటకు పొలము లోనికి పోయి వెఱ్ఱి ద్రాక్షచెట్టును చూచి, దాని గుణమెరుగక దాని తీగెలు తెంపి ఒడి నిండ కోసికొని వచ్చి, వాటిని తరిగి కూర కుండలో వేసెను.
వాడు పందులు తిను పొట్టుతో తన కడుపు నింపుకొన అశపడెను గాని యెవడును వాని కేమియు ఇయ్యలేదు.