నిర్దోషమైన యేడాది మగపిల్లను తీసికొనవలెను. గొఱ్ఱలలోనుండియైనను మేకలలోనుండియైనను దాని తీసికొనవచ్చును.
ఈ నెల పదునాలుగవ దినమువరకు మీరు దాని నుంచుకొనవలెను; తరువాత ఇశ్రాయేలీయుల సమాజపువారందరు తమ తమ కూటములలో సాయంకాలమందు దాని చంపి దాని రక్తము కొంచెము తీసి, తాము దాని తిని యిండ్లద్వారబంధపు రెండు నిలువు కమ్ములమీదను పై కమ్మి మీదను చల్లి
ఆ రాత్రియే వారు అగ్నిచేత కాల్చబడిన ఆ మాంసమును పొంగని రొట్టెలను తినవలెను. చేదుకూరలతో దాని తినవలెను
దాని తలను దాని కాళ్లను దాని ఆంత్రములను అగ్నితో కాల్చి దాని తినవలెను;
దానిలో ఉడికి ఉడకనిదైనను నీళ్లతో వండబడినదైనను తిననే తినకూడదు; ఉదయకాలమువరకు దానిలోనిదేదియు మిగిలింపకూడదు. ఉదయకాలమువరకు దానిలో మిగిలినది అగ్నితో కాల్చివేయవలెను.
మీరు దానిని తినవలసిన విధమేదనగా, మీ నడుము కట్టుకొని మీ చెప్పులు తొడుగుకొని మీ కఱ్ఱలు చేత పట్టుకొని, త్వరపడుచు దాని తినవలెను; అది యెహోవాకు పస్కాబలి.
ఆ రాత్రి నేను ఐగుప్తుదేశమందు సంచరించి, ఐగుప్తుదేశమందలి మనుష్యులలోనేగాని జంతువులలోనేగాని తొలిసంతతియంతయు హతముచేసి, ఐగుప్తు దేవతలకందరికిని తీర్పు తీర్చెదను; నేను యెహోవాను.
మీరున్న యిండ్లమీద ఆ రక్తము మీకు గురుతుగా ఉండును. నేను ఆ రక్తమును చూచి మిమ్మును నశింపచేయక దాటిపోయెదను. నేను ఐగుప్తుదేశమును పాడు చేయుచుండగా మిమ్ము సంహరించుటకు తెగులు మీ మీదికి రాదు.
కాబట్టి యీ దినము మీకు జ్ఞాపకార్థమైనదగును. మీరు యెహోవాకు పండుగగా దాని నాచరింపవలెను; తరతరములకు నిత్యమైనకట్టడగా దాని నాచరింపవలెను.
ఏడుదినములు పులియని రొట్టెలను తినవలెను. మొదటిదినమున మీ యిండ్ల లోనుండి పొంగినది పారవేయవలెను. మొదటి దినము మొదలుకొని యేడవ దినము వరకు పులిసినదానిని తిను ప్రతిమనుష్యుడు ఇశ్రాయేలీయులలోనుండి కొట్టివేయబడును.
ఆ మొదటి దినమున మీరు పరిశుద్ధ సంఘముగాను, ఏడవ దినమున పరిశుద్ధ సంఘముగాను కూడుకొనవలెను. ఆ దినములయందు ప్రతివాడు తినవలసినది మాత్రమే మీరు సిద్ధపరచవచ్చును; అదియు గాక మరి ఏ పనియు చేయకూడదు.
పులియని రొట్టెల పండుగను మీరు ఆచరింపవలెను. ఈ దినమందే నేను మీ సమూహములను ఐగుప్తు దేశములోనుండి వెలుపలికి రప్పించితిని గనుక మీరు మీ తరములన్నిటిలో ఈ దినము నాచరింపవలెను; ఇది మీకు నిత్యమైన కట్టడగా ఉండును.
మొదటి నెల పదునాలుగవదినము సాయంకాలము మొదలుకొని ఆ నెల యిరువది యొకటవదినము సాయంకాలమువరకు మీరు పులియనిరొట్టెలను తినవలెను.
ఏడు దినములు మీ యిండ్లలో పొంగినదేదియును ఉండకూడదు, పులిసినదానిని తినువాడు అన్యుడేగాని దేశములో పుట్టినవాడేగాని ఇశ్రాయేలీయుల సమాజములోనుండక కొట్టివేయబడును.
మీరు పులిసినదేదియు తినక మీ నివాసములన్నిటిలోను పులియనివాటినే తినవలెనని చెప్పుమనెను.
కాబట్టి మోషే ఇశ్రాయేలీయుల పెద్దలనందరిని పిలిపించి వారితో ఇట్లనెను మీరు మీ కుటుంబముల చొప్పున మందలోనుండి పిల్లను తీసికొని పస్కా పశువును వధించుడి.
మరియు హిస్సోపు కుంచె తీసికొని పళ్లెములోనున్న రక్తములో దాని ముంచి, ద్వారబంధపు పైకమ్మికిని రెండు నిలువు కమ్ములకును పళ్లెములోని రక్తమును తాకింపవలెను. తరువాత మీలోనెవరును ఉదయమువరకు తన యింటి ద్వారమునుండి బయలువెళ్లకూడదు.
యెహోవా ఐగుప్తీయులను హతము చేయుటకు దేశసంచారము చేయుచు, ద్వారబంధపు పైకమ్మిమీదను రెండు నిలువు కమ్ములమీదను ఉన్న రక్తమును చూచి యెహోవా ఆ తలుపును దాటిపోవును; మిమ్ము హతముచేయుటకు మీ యిండ్లలోనికి సంహారకుని చొరనియ్యడు.
కాబట్టి మీరు నిరంతరము మీకును మీ కుమారులకును దీనిని కట్టడగా ఆచరింపవలెను.
యెహోవా తాను సెలవిచ్చినట్లు మీ కిచ్చుచున్న దేశమందు మీరు ప్రవేశించిన తరువాత మీరు దీని నాచరింపవలెను.
మరియు మీకుమారులు మీరు ఆచరించు ఈ ఆచారమేమిటని మిమ్ము నడుగునప్పుడు
మీరు ఇది యెహోవాకు పస్కాబలి; ఆయన ఐగుప్తీయులను హతము చేయుచు మన యిండ్లను కాచినప్పుడు ఆయన ఐగుప్తులోనున్న ఇశ్రాయేలీయుల యిండ్లను విడిచిపెట్టెను అనవలెనని చెప్పెను. అప్పుడు ప్రజలు తలలు వంచి నమస్కారముచేసిరి.
అప్పుడు ఇశ్రాయేలీయులు వెళ్లి ఆలాగుచేసిరి; యెహోవా మోషే అహరోనులకు ఆజ్ఞాపించినట్లే చేసిరి.
అర్ధరాత్రివేళ జరిగినదేమనగా, సింహాసనముమీద కూర్చున్న ఫరో మొదలుకొని చెరసాలలోనున్న ఖైదీయొక్క తొలిపిల్ల వరకు ఐగుప్తుదేశమందలి తొలిపిల్లలనందరిని పశువుల తొలిపిల్లలనన్నిటిని యెహోవా హతముచేసెను.
ఆ రాత్రి ఫరోయు అతని సేవకులందరును ఐగుప్తీయులందరును లేచినప్పుడు శవములేని ఇల్లు ఒకటైన లేకపోయినందున ఐగుప్తులో మహాఘోష పుట్టెను.
ఆ రాత్రివేళ ఫరో మోషే అహరోనులను పిలిపించి వారితో మీరును ఇశ్రాయేలీయులును లేచి నా ప్రజల మధ్యనుండి బయలువెళ్లుడి, మీరు చెప్పినట్లు పోయి యెహోవాను సేవించుడి.
మీరు చెప్పినట్లు మీ మందలను మీ పశువులను తీసికొనిపోవుడి; నన్ను దీవించుడని చెప్పెను.
ఐగుప్తీయులు మనమందరము చచ్చినవారమనుకొని, తమ దేశములోనుండి ప్రజలను పంపుటకు త్వరపడి వారిని బలవంతముచేసిరి.
కాబట్టి ప్రజలు తమ పిండిముద్దను తీసికొని, అది పులియక మునుపే పిండి పిసుకు తొట్లతో దానిని మూటకట్టుకొని, తమ భుజములమీద పెట్టుకొనిపోయిరి.
ఇశ్రాయేలీయులు మోషే మాటచొప్పునచేసి ఐగుప్తీయులయొద్ద వెండి నగలను బంగారు నగలను వస్త్రములను అడిగి తీసికొనిరి.
యెహోవా ప్రజలయెడల ఐగుప్తీయులకు కటాక్షము కలుగజేసెను గనుక వారు వారికి కావలసిన వాటిని ఇచ్చిరి. అట్లు వారు ఐగుప్తీయులను దోచుకొనిరి.
ఇశ్రాయేలీయులు గిల్గాలులో దిగి ఆ నెల పదు నాలుగవ తేదిని సాయంకాలమున యెరికో మైదానములో పస్కాపండుగను ఆచరించిరి.
మరియు హిజ్కియా ఇశ్రాయేలీయుల దేవుడైన... యెహోవాకు పస్కాపండుగ ఆచరించుటకై యెరూషలేములోనున్న యెహోవా మందిరమునకు రావలసినదని ఇశ్రాయేలువారికందరికిని యూదావారికందరికిని వర్తమానములను, ఎఫ్రాయిమీయులకును మనష్షేవారికిని పత్రికలను పంపెను.
సేవకు చాలినంతమంది యాజకులు తమ్మును తాము ప్రతిష్ఠించుకొనకుండుటచేతను, జనులు యెరూషలేములో కూడుకొనకుండుటచేతను, మొదటినెలయందు పస్కాపండుగ జరుగకపోగా
రాజును అతని అధిపతులును యెరూషలేములోనున్న సమాజపువారందరును దానిని రెండవ నెలలో ఆచరింపవలెనని యోచనచేసిరి.
ఈ సంగతి రాజుకును సమాజపువారికందరికిని అనుకూలమాయెను.
కావున బహుకాలమునుండి వారు వ్రాయబడిన ప్రకారము ఇంత ఘనముగా నాచరింపకుండుట చూచి, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాకు యెరూషలేములో పస్కాపండుగ ఆచరించుటకై రావలసినదని బెయేర్షెబా మొదలుకొని దాను వరకు ఇశ్రాయేలీయులుండు దేశమంతటను చాటింపవలెనని వారు నిర్ణయముచేసిరి.
కావున అంచెవాండ్రు రాజునొద్దను అతని అధిపతులయొద్దను తాకీదులు తీసికొని, యూదా ఇశ్రాయేలు దేశములందంతట సంచరించి రాజాజ్ఞను ఈలాగు ప్రచురము చేసిరి ఇశ్రాయేలువారలారా, అబ్రాహాము ఇస్సాకు ఇశ్రాయేలుల దేవుడైన యెహోవావైపు తిరుగుడి; మీరు తిరిగినయెడల మీలో అష్షూరురాజుల చేతిలోనుండి తప్పించుకొని శేషించినవారివైపు ఆయన తిరుగును.
తమ పితరుల దేవుడైన యెహోవాయెడల ద్రోహముగా ప్రవర్తించిన మీ పితరులవలెను మీ సహోదరులవలెను మీరు ప్రవర్తింపకుడి. వారి ప్రవర్తన ఎట్టిదొ మీకు అగపరచవలెనని ఆయన వారిని వినాశమునకు అప్పగించెను.
మీ పితరులవలె మీరు అవిధేయులుగాక యెహోవాకు లోబడి, ఆయన శాశ్వతముగా పరిశుద్ధపరచిన ఆయన పరిశుద్ధమందిరములో ప్రవేశించి, మీ దేవుడైన యెహోవా మహోగ్రత మీ మీదినుండి తొలగిపోవునట్లు ఆయనను సేవించుడి.
మీరు యెహోవావైపు తిరిగినయెడల మీ సహోదరులయెడలను మీ పిల్లల యెడలను చెరతీసికొనిపోయిన వారికి కనికరము పుట్టును, వారు ఈ దేశమునకు తిరిగి వచ్చెదరు. మీ దేవుడైన యెహోవా కరుణాకటాక్షములు గలవాడు గనుక మీరు ఆయనవైపు తిరిగినయెడల ఆయన మీయందు ప్రసన్నుడగును.
అంచెవాండ్రు జెబూలూను దేశమువరకును, ఎఫ్రాయిము మనష్షేల దేశములలోనున్న ప్రతి పట్టణమునకును పోయిరి గాని అచ్చటివారు ఎగతాళిచేసి వారిని అపహసించిరి.
అయినను ఆషేరు మనష్షే జెబూలూను దేశముల వారిలోనుండి కొందరు కృంగిన మనస్సుతో యెరూషలేమునకు వచ్చిరి.
యెహోవా ఆజ్ఞనుబట్టి రాజును అధిపతులును చేసిన నిర్ణయమును నెరవేర్చునట్లు యూదాలోనివారికి మనస్సు ఏకముచేయుటకై దేవుని హస్తము వారికి తోడ్పడెను.
కావున రెండవ నెలయందు పులియని రొట్టెలపండుగ ఆచరించుటకై అతివిస్తారమైన సమాజముగా బహు జనులు యెరూషలేములో కూడిరి.
వారు దాని చేపట్టి యెరూషలేములోనున్న బలిపీఠములను ధూపపీఠములను తీసివేసి, కిద్రోను వాగులో వాటిని పారవేసిరి.
రెండవ నెల పదునాల్గవ దినమున వారు పస్కాపశువును వధించిరి; యాజకులును లేవీయులును సిగ్గునొంది, తమ్మును ప్రతిష్ఠించుకొని దహనబలి పశువులను యెహోవా మందిరములోనికి తీసికొని వచ్చిరి.
దైవజనుడైన మోషే నియమించిన ధర్మశాస్త్రములోని విధినిబట్టి వారు తమ స్థలమందు నిలువబడగా, యాజకులు లేవీయుల చేతిలోనుండి రక్తమును తీసికొని దానిని ప్రోక్షించిరి.
సమాజకులలో తమ్మును ప్రతిష్ఠించుకొనని వారనేకులుండుటచేత యెహోవాకు ప్రతిష్ఠించుటకై ప్రతిష్ఠించుకొనని ప్రతివాని నిమిత్తము పస్కాపశువులను వధించుపని లేవీయుల కప్పగింపబడెను.
ఎఫ్రాయిము మనష్షే ఇశ్శాఖారు జెబూలూను దేశములనుండి వచ్చిన జనులలో చాలామంది తమ్మునుతాము ప్రతిష్ఠించుకొనకయే విధివిరుద్ధముగా పస్కాను భుజింపగా హిజ్కియా
పరిశుద్ధస్థలముయొక్క శుద్ధీకరణముచొప్పున తన్ను పవిత్రపరచుకొనకయే తన పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయింప మనస్సు నిలుపుకొనిన ప్రతివాని నిమిత్తము దయగల యెహోవా ప్రాయశ్చిత్తము చేయునుగాక అని ప్రార్థింపగా
యెహోవా హిజ్కియా చేసిన ప్రార్థన అంగీకరించి జనులను స్వస్థపరచెను.
యెరూషలేములోనున్న ఇశ్రాయేలువారు బహు సంతోషభరితులై పులియని రొట్టెల పండుగను ఏడు దినములు ఆచరించిరి. లేవీయులును యాజకులును యెహోవాను ఘనపరచుచు గొప్ప నాదముగల వాద్యములతో ప్రతి దినము ఆయనను స్తుతించుచు ఉండిరి.
యెహోవా సేవయందు మంచి నేర్పరులైన లేవీయులందరితో హిజ్కియా ప్రీతిగా మాటలాడెను; వారు సమాధానబలులు అర్పించుచు, తమ పితరుల దేవుడైన యెహోవా దేవుడని యొప్పుకొనుచు ఏడు దినములు పండుగ ఆచరించిరి.
యూదా రాజైన హిజ్కియా సమాజపువారికి బలియర్పణల నిమిత్తము వెయ్యి కోడెలను ఏడువేల గొఱ్ఱల నిచ్చుటయు, అధిపతులు వెయ్యి కోడెలను పదివేల గొఱ్ఱల నిచ్చుటయు, బహుమంది యాజకులు తమ్మును తాము ప్రతిష్ఠించుకొనుటయు
సమాజపు వారందరును చూచినప్పుడు, మరి ఏడు దినములు పండుగ ఆచరింపవలెనని యోచనచేసికొని మరి ఏడు దినములు సంతోషముగా దాని ఆచరించిరి.
అప్పుడు యాజకులును లేవీయులును యూదావారిలోనుండియు ఇశ్రాయేలువారిలోనుండియు వచ్చిన సమాజపువారందరును, ఇశ్రాయేలు దేశములోనుండి వచ్చి యూదాలో కాపురమున్న అన్యులును సంతోషించిరి.
యెరూషలేము కాపురస్థులకు మిక్కిలి ఆనందము కలిగెను. ఇశ్రాయేలురాజును దావీదు కుమారుడునైన సొలొమోను కాలమునకు తరువాత ఈలాగున జరిగియుండలేదు.
అప్పుడు లేవీయులైన యాజకులు లేచి జనులను దీవింపగా వారిమాటలు వినబడెను; వారి ప్రార్థన ఆకాశముననున్న పరిశుద్ధ నివాసమునకు చేరెను.