ఏడవ సంవత్సరమందు యెహోయాదా కావలికాయువారిమీదను రాజదేహ సంరక్షకులమీదను ఏర్పడియున్న శతా ధిపతులను పిలువనంపించి , యెహోవా మందిరములోనికి వారిని తీసికొని పోయి , యెహోవా మందిరమందు వారిచేత ప్రమాణము చేయించి వారితో నిబంధన చేసి , వారికి ఆ రాజు కుమారుని కనుపరచి యీలాగు ఆజ్ఞాపించెను
యోషీయా యేలనారంభించినప్పుడు ఎనిమిదేండ్లవాడై యెరూషలేమునందు ముప్పదియొక సంవత్సరములు ఏలెను, అతని తల్లి బొస్కతు ఊరి వాడగు అదాయాకు కుమార్తెయైన యెదీదా.
యోవాషు ఏలనారంభించినప్పుడు ఏడు సంవత్సరముల యీడుగలవాడై యెరూషలేములో నలువది ఏండ్లు ఏలెను; అతని తల్లి బెయేర్షెబా కాపురస్థురాలైన జిబ్యా.
యాజకుడైన యెహోయాదా బ్రదికిన దినములన్నియు యోవాషు యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను.
యెహోయాదా అతనికి యిద్దరు భార్యలను పెండ్లి చేసెను; అతడు కుమారులను కుమార్తెలను కనెను.
అంతట యెహోవా మందిరమును బాగుచేయవలెనని యోవాషునకు తాత్పర్యము పుట్టెను గనుక
అతడు యాజకులను లేవీయులను సమకూర్చి మీరు యూదా పట్టణములకు పోయి మీ దేవుని మందిరము బాగుచేయుటకై ఇశ్రాయేలీయులందరియొద్దనుండి ధనమును ఏటేట సమకూర్చుచు, ఈ కార్యమును మీరు త్వరపెట్టవలెనని వారికాజ్ఞ ఇచ్చెను. వారు దానిని త్వరగా చేయకపోయినందున
రాజు ప్రధానయాజకుడగు యెహోయాదాను పిలిచి ఆ దుర్మార్గురాలైన అతల్యా కుమారులు దేవుని మందిరమును పాడుచేసి, యెహోవా మందిర సంబంధమైన ప్రతిష్ఠోపకరణములనన్నిటిని బయలుదేవతపూజకు ఉపయోగించిరి.
సాక్ష్యపు గుడారమును బాగుచేయుటకై యూదాలోనుండియు యెరూషలేములోనుండియు ఇశ్రాయేలీయుల సమాజకులచేత యెహోవా సేవకుడైన మోషే నిర్ణయించిన కానుకను లేవీయులతో నీ వెందుకు చెప్పి తెప్పించలేదని యడిగెను.
కాబట్టి రాజు ఆజ్ఞ చొప్పున వారు ఒక పెట్టెను చేయించి యెహోవా మందిరద్వారము బయట ఉంచిరి.
మరియు దేవుని సేవకుడైన మోషే అరణ్యమందు ఇశ్రాయేలీయులకు నిర్ణయించిన కానుకను యెహోవాయొద్దకు జనులు తేవలెనని యూదాలోను యెరూషలేములోను వారు చాటించిరి.
కాగా అధిపతులందరును జనులందరును సంతోషముగా కానుకలను తీసికొని వచ్చి చాలినంతమట్టుకు పెట్టెలో వేసిరి.
లేవీయులు ఆ పెట్టెను రాజు విమర్శించు స్థలమునకు తెచ్చుచు వచ్చిరి; అందులో ద్రవ్యము విస్తారముగా నున్నట్టు కనబడినప్పుడెల్ల, రాజుయొక్క ప్రధాన మంత్రియు ప్రధాన యాజకుడు నియమించిన పై విచారణకర్తయు వచ్చి, పెట్టెలోనున్న ద్రవ్యమును తీసి యథా స్థానమందు దానిని ఉంచుచు వచ్చిరి; వారీచొప్పున పలుమారు చేయుటచేత విస్తారమైన ద్రవ్యము సమకూర్చబడెను.
అప్పుడు రాజును యెహోయాదాయును యెహోవా మందిరపు పనిచేయువారికి దానినిచ్చి, యెహోవా మందిరమును బాగుచేయుటకై కాసెవారిని వడ్లవారిని, యెహోవా మందిరమును బలపరచుటకు ఇనుపపని యిత్తడిపని చేయువారిని కూలికి కుదిర్చిరి.
ఈలాగున పనివారు పని జరిగించి సంపూర్తి చేసిరి. వారు దేవుని మందిరమును దాని యథాస్థితికి తెచ్చి దాని బలపరచిరి.
అది సిద్ధమైన తరువాత మిగిలిన ద్రవ్యమును రాజునొద్దకును యెహోయాదా యొద్దకును తీసికొనిరాగా వారు దాని చేత యెహోవా మందిరపు సేవయందు ఉపయోగపడునట్లును, దహనబలుల నర్పించుటయందు ఉపయోగపడునట్లును, ఉపకరణములను గరిటెలను వెండి బంగారముల ఉపకరణములను చేయించిరి. యెహోయాదాయున్న యన్నిదినములు యెహోవా మందిరములో దహనబలులు నిత్యమును అర్పింపబడెను.