
ఆ దినమే సాయంకాలమైనప్పుడు ఆయన–అద్దరికి పోవుదమని వారితో చెప్పగా,
ఆయన అద్దరినున్న గదరేనీయుల దేశము చేరగా దయ్యములు పట్టిన యిద్దరు మనుష్యులు సమాధులలో నుండి బయలుదేరి ఆయనకు ఎదురుగా వచ్చిరి. వారు మిగుల ఉగ్రులైనందున ఎవడును ఆ మార్గమున వెళ్లలేకపోయెను.
వారు–ఇదిగో దేవుని కుమారుడా, నీతో మాకేమి? కాలము రాకమునుపే మమ్మును బాధించుటకు ఇక్కడికి వచ్చితివా? అని కేకలువేసిరి.
వారికి దూరమున గొప్ప పందుల మంద మేయుచుండగా
ఆ దయ్యములు–నీవు మమ్మును వెళ్ల గొట్టినయెడల ఆ పందుల మందలోనికి పోనిమ్మని ఆయనను వేడుకొనెను.
ఆయన వాటిని పొమ్మనగా అవి ఆ మనుష్యులను వదలిపెట్టి ఆ పందుల లోనికి పోయెను; ఇదిగో ఆ మందంతయు ప్రపాతము నుండి సముద్రములోనికి వడిగా పరుగెత్తికొనిపోయి నీళ్లలో పడిచచ్చెను.
వాటిని మేపుచున్నవారు పారిపోయి పట్టణములోనికి వెళ్లి జరిగిన కార్యములన్నియు దయ్యములు పట్టినవారి సంగతియు తెలిపిరి.
ఇదిగో ఆ పట్టణస్థులందరు యేసును ఎదుర్కొనవచ్చి ఆయనను చూచి తమ ప్రాంతములను విడిచి పొమ్మని ఆయనను వేడుకొనిరి.
వారు గలిలయకు ఎదురుగా ఉండు గెరసీనీయుల దేశమునకు వచ్చిరి .
ఆయన ఒడ్డున దిగినప్పుడు ఆ ఊరివాడొకడు ఆయనకు ఎదురుగావచ్చెను . వాడు దయ్యములుపట్టినవాడై , బహుకాలమునుండి బట్టలు కట్టుకొనక , సమాధులలోనేగాని యింటిలో ఉండువాడు కాడు .
వాడు యేసును చూచి , కేకలువేసి ఆయన యెదుట సాగిలపడి–యేసూ , సర్వోన్నతుడైన దేవుని కుమారుడా , నాతో నీకేమి ? నన్ను బాధపరచకుమని నిన్ను వేడుకొనుచున్నాను అని కేకలువేసి చెప్పెను .
ఏలయనగా ఆయన–ఆ మనుష్యుని విడిచి వెలుపలికి రమ్మని ఆ అపవిత్రాత్మకు ఆజ్ఞాపించెను . అది అనేక పర్యాయములు వానిని పట్టుచువచ్చెను గనుక వానిని గొలుసులతోను కాలిసంకెళ్లతోను కట్టి కావలియందుంచిరి గాని, వాడు బంధకములను తెంపగా దయ్యము వానిని అడవిలోనికి తరుముకొని పోయెను .
యేసు–నీ పేరేమని వాని నడుగగా , చాల దయ్యములు వానిలో చొచ్చి యుండెను గనుక,
వాడు తన పేరు సేన అని చెప్పి , పాతాళములోనికి పోవుటకు తమకు ఆజ్ఞాపింపవద్దని ఆయనను వేడుకొనెను .
అక్కడ విస్తారమైన పందుల మంద కొండమీద మేయుచుండెను గనుక, వాటిలో చొచ్చుటకు తమకు సెలవిమ్మని ఆయనను వేడుకొనగా ఆయన సెలవిచ్చెను .
అప్పుడు దయ్యములు ఆ మనుష్యుని విడిచిపోయి పందులలో చొచ్చెను గనుక, ఆ మంద ప్రపాతమునుండి సరస్సులోనికి వడిగా పరుగెత్తి ఊపిరి తిరుగక చచ్చెను .
మేపుచున్నవారు జరిగినదానిని చూచి , పారిపోయి ఆ పట్టణములోను గ్రామములలోను ఆ సంగతి తెలియజేసిరి .
జనులు జరిగినదానిని చూడవెళ్లి , యేసునొద్దకు వచ్చి , దయ్యములు వదలిపోయిన మనుష్యుడు బట్టలు కట్టుకొని , స్వస్థచిత్తుడై యేసు పాదములయొద్ద కూర్చుండుట చూచి భయపడిరి .
అది చూచినవారు దయ్యములు పట్టినవాడేలాగు స్వస్థతపొందెనో జనులకు తెలియజేయగా
గెరసీనీయుల ప్రాంతములలోనుండు జనులందరు బహు భయాక్రాంతులైరి గనుక తమ్మును విడిచిపొమ్మని ఆయనను వేడుకొనిరి . ఆయన దోనె యెక్కి తిరిగి వెళ్లుచుండగా , దయ్యములు వదలిపోయిన మనుష్యుడు , ఆయనతో కూడ తన్ను ఉండనిమ్మని ఆయనను వేడుకొనెను .
అయితే ఆయన–నీవు నీ యింటికి తిరిగి వెళ్లి , దేవుడు నీకెట్టి గొప్పకార్యములు చేసెనో తెలియ జేయుమని వానితో చెప్పి వానిని పంపివేసెను ; వాడు వెళ్లి యేసు తనకెట్టి గొప్పకార్యములు చెసెనో ఆ పట్టణ మందంతటను ప్రకటించేను .
జనసమూహము ఆయనకొరకు ఎదురుచూచుచుండెను గనుక యేసు తిరిగివచ్చినప్పుడు వారు ఆయనను చేర్చుకొనిరి .