Hits: 278
Print

ఆదికాండము 39:20-23;40 వ అధ్యాయము

ఉద్దేశము
మనము కష్టాలలో ఉన్నప్పటికి, ఇతరుల అవసరాలను గూర్చి శ్రద్ధ కలిగి ఉండాలి అని బోధించుట.

ముఖ్యాంశము
చెరసాలలో ఉండుట - జైలులో ఉండడం ఎంత భయంకరంగా ఉంటుందో మీకు తెలుసా? మనకు ఇష్టము వచ్చినట్లు ఉండడానికి వీలుపడదు. 24 గంటలు జైలు అధికారులు మనలను చూస్తుంటారు. జైలులో ఎటువంటి స్వతంత్రత ఉండదు.

గతవారము
యోసేపుకు ఎదురైన భయంకరమైన పరిస్థితిని గురించి మనము గత వారం చూసాము. పోతీఫరు భార్య తన భర్తకు యోసేపును గురించి అబద్ధాలు చెప్పినప్పుడు, పోతీఫరు తన భార్య మాటలు విని ఆగ్రహముతో నిండిన వాడై యోసేపును చెరసాలలో వేయించాడు. యోసేపు ఎటువంటి శిక్ష పొందవలసిన అవసరం లేనప్పటికి అన్యాయంగా జైలులో వేయబడ్డాడు.

చెరసాలలో యోసేపు
యోసేపు చెరసాలలో ఉన్నప్పటికి తన పరిస్థితికి కృంగిపోయి ఒంటరిగా కూర్చొనలేదు. దేవుడు యోసేపునకు తోడైయుండి, అతనియందు కనికరపడి, అతనిమీద ఆ చెరసాల యొక్క అధిపతికి కటాక్షము కలుగునట్లు చేశాడు. ఆ చెరసాలలో ఉన్న ఖైదీల నందరిని యోసేపు చేతికి అప్పగించాడు. వారక్కడ ఏమి చేయాలో అది అంతా యోసేపు చేయించేవాడు. మిగిలిన ఖైదీల కంటె యోసేపు ప్రవర్తన ఎంతో ప్రత్యేకమైనదిగా ఉండి ఉండవచ్చు. అందుకే ఆ చెరసాల అధిపతికి యోసేపుపై కటాక్షము, నమ్మకము కలిగింది. యోసేపు చెరసాలలో ఉన్నప్పటికి దేవుడు యోసేపును మరచిపోలేదు. దేవుడు తనకు తోడుగా ఉన్నందున యోసేపు చెరసాలలో కూడా సంతోషంగా ఉంటూ అందరితో మాట్లాడుతూ సహాయం చేస్తూ ఉండేవాడు. పరిస్థితులన్నీ తనకు వ్యతిరేకంగా ఉన్నా ప్రభువు తనతో ఉన్నాడు అనే ధైర్యం యోసేపును ఎంతగానో బలపరుస్తుండేది. దేవుడు ఒక గొప్ప ప్రణాళికతోనే తనను చెరసాలలో వేయించాడు అని యోసేపు విశ్వసించాడు.

పోతీఫరు తన ఇంటిలోని సమస్తము యోసేపుకు అప్పగించిన విధముగానే, చెరసాల అధిపతి కూడా చెరసాలలోని ఖైదీల నందరిని యోసేపుకు అప్పగించాడు. ఆ చెరసాల అధిపతి యోసేపు పై ఎంతో నమ్మకం ఉంచాడు. అందుకే యోసేపు చేతికి అప్పగింపబడిన దేనిని గూర్చి విచారణ చేయలేదు. ఖైదీల విషయాలన్నింటిని యోసేపు చూసుకునేవాడు. ఎంత అద్భుతమైన సంగతి! యోసేపు తమతో మాట్లాడుతూ సహాయపడుతున్నందుకు చెరసాలలోని ఖైదీలు అందరూ ఎంతో సంతోషంగా ఉండి ఉండవచ్చు.

పానదాయకుల అధిపతి - భక్ష్యకారుల అధిపతి
ఒక రోజు ఇద్దరు ఖైదీలు చెరసాలలోకి కొత్తగా వచ్చారు. వారిరువురు ఐగుప్తు రాజైన ఫరో దగ్గర పనిచేసేవారు, కానీ వారు చేసిన ఒక పొరపాటు వలన రాజు కోపపడి వారిని చెరసాలలో ఉంచుటకు రాజసంరక్షక సేనాధిపతికి అప్పగించాడు. వారిలో ఒక వ్యక్తి పానదాయకుల అధిపతి, అంటే -

రాజుకు ద్రాక్షారసము అందించేవాడు. మరొక వ్యక్తి భక్ష్యకారుల అధిపతి - అంటే రాజు భుజించే భోజనప దార్థాలు అన్నింటిని పర్యవేక్షించే వాడు. ఆ చెరసాల అధిపతి వారిద్దరిని యోసేపుకు అప్పగించగా యోసేపు వారికి పరిచారము చేయసాగాడు. ముందురోజు రాజు సముఖములో ఉన్న వారిద్దరు, ఆ రోజు చెరసాలలో ఉండడం వారికి ఎంతో దుఃఖాన్ని కలిగించింది. ఎంత దుఃఖకరమైన మార్పు!

తరువాత వారిరువురూ ఒకే రోజు రాత్రి కలలుగన్నారు, కానీ ఆ కలలు వేరువేరుగా ఉన్నాయి. తెల్లవారినప్పుడు యోసేపు వారి యొద్దకు వచ్చి వారిని చూడగా వారు విచారంగా కూర్చుని కనిపించారు. యోసేపు వారి విచారానికి కారణము అడిగినప్పుడు వారు - "మేము కలలు కంటిమి వాటి భావము చెప్పగలవారెవరును లేరు" అని చెప్పారు. అప్పుడు యోసేపు - "మీరు దయచేసి ఆ కలలు నాకు వివరించి చెప్పండి భావములు చెప్పుట దేవుని ఆధీనమే గదా" అని వారితో చెప్పాడు.

యోసేపు వారి కలలకు అర్థము వివరించుట
ముందుగా పానదాయకుల అధిపతి తన కలను యోసేపుకు వివరించాడు. అతడు యోసేపుతో - "నా కలలో ఒక ద్రాక్షావల్లి నా యెదుట ఉండెను. ద్రాక్షావల్లికి మూడుతీగెలు ఉండెను. అది చిగురించినట్టు ఉండెను. దాని పువ్వులు వికసించెను దాని గెలలు పండి ద్రాక్ష ఫలము లాయెను. మరియు ఫరో గిన్నె నా చేతిలో ఉండెను. ఆ ద్రాక్ష ఫలములు నేను పట్టుకుని ఫరో గిన్నెలో వాటిని పిండి ఆ గిన్నె ఫరో చేతికి ఇచ్చితిని" అని తన కలను వివరించి చెప్పాడు. దేవుని సహాయము వలన యోసేపు ఆ కల భావమును గ్రహించగలిగాడు.

ఆ పానదాయకుల అధిపతిని చూచి యోసేపు - "దాని భావము ఇదే ఆ మూడు తీగెలు మూడు దినములు. ఇక మూడు దినములలో ఫరో నీ తలను పైకెత్తి నీ ఉద్యోగము నీకు మరల ఇప్పించును నీవు అతనికి పానదాయకుడవై యున్న నాటి మర్యాద చొప్పున ఫరో గిన్నెను అతని చేతికి అప్పగించెదవు" అని కలను గురించి వివరించాడు. ఆ కల భావమును వినిన తరువాత పానదాయకుల అధిపతి ముఖము ఎంతో సంతోషంతో, నవ్వుతో నిండిపోయి ఉండవచ్చు.

యోసేపు ఆ పానదాయకుల అధిపతిని ఒక కోరిక కోరాడు. యోసేపు అతనితో - "నీకు క్షేమము కలిగినప్పుడు నన్ను జ్ఞాపకము చేసికొని నా యందు కరుణించి ఫరోతో నన్ను గూర్చి మాటలాడి ఈ ఇంటిలో నుండి నన్ను బయటికి రప్పించుము. నేను హెబ్రీయుల దేశములోనుండి దొంగిలబడితిని. అది నిశ్చయము, మరియు ఈ చెరసాలలో నన్ను వేయుటకు ఇక్కడ సహా నేనేమియు చేయలేదు." అని చెప్పాడు. అక్కడ నుండి బయటపడటానికి అది మంచి అవకాశము అని యోసేపు తలంచాడు.

తరువాత యోసేపు తెలిపిన భావము మంచిదని చూచి భక్ష్యకారుల అధిపతి కూడా తన కలను యోసేపుకు వివరించాడు. అతడు యోసేపుతో - " నేనును కలగంటిని ఇదిగో తెల్లని పిండి వంటలు గల మూడు గంపలు నా తల మీద ఉండెను. మీది గంపలో ఫరో నిమిత్తము సమస్త విధములైన పిండివంటలు ఉండెను. పక్షులు నా తల మీదనున్న ఆ గంపలో నుండి వాటిని తీసికొని తినుచుండెను" అని చెప్పాడు.

ఆ కల మొదటి కల వలె మంచి వార్తను అందించేది కాదని యోసేపు దేవుని సహాయము వలన గ్రహించాడు. నిజానికి అది చాలా దుఃఖం కలిగించేదిగా ఉంది. చాలా బాధగా అనిపించినప్పటికి యోసేపు ఆ కలను గురించి వివరించక తప్పలేదు.

యోసేపు భక్ష్యకారుల అధిపతితో - "ఆ మూడు గంపలు మూడు దినములు ఇక మూడు దినములలోగా ఫరో నీ మీద నుండి నీ తలను పైకెత్తి మ్రానుమీద నిన్ను వ్రేలాడదీయించును. అప్పుడు పక్షులు నీ మీద నుండి నీ మాంసమును తినివేయును" అని చెప్పాడు. ఆ కల విని భక్ష్యకారుల అధిపతి ఎంతగానో క్రుంగిపోయి ఉండవచ్చు.

కలలు నెరవేరుట
యోసేపు వివరించిన విధముగా వారిరువురి కలలు నెరవేరాయి అనుకుంటున్నారా? యోసేపు సరిగానే కలల భావము వివరించాడా? అవును, దేవుడు తోడై యుండుటవలన యోసేపు ఆ కలలను వాటి భావముతో వివరించగలిగాడు. మూడు రోజుల తరువాత ఫరో జన్మదినం వచ్చింది. అప్పుడు అతడు తన సేవకులకు అందరికి విందు చేయించి పానదాయకుల అధిపతికి అతని ఉద్యోగము మరల ఇప్పించాడు. భక్ష్యకారుల అధిపతిని చంపించాడు. ఆవిధముగా యోసేపు చెప్పిన కలల భావము నెరవేర్చబడింది.

తన ఉద్యోగము తిరిగి వచ్చినందుకు, తనను చంపనందుకు పానదాయకుల అధిపతి ఎంతగానో సంతోషంతో ఉండి ఉండవచ్చు. యోసేపు సహాయము చేయమని అడిగిన విషయము ఫరోతో మాట్లాడి ఉండవచ్చు, కాని ఆ పానదాయకుల అధిపతి యోసేపును జ్ఞాపకము చేసి కొనకుండా మరిచిపోయాడు. యోసేపును చెరసాలలో నుండి విడిపించుమని అతడు ఫరోను అడగలేదు. యోసేపు ఎంతో

ఆశతో తనను విడిపిస్తారు అని ఎదురు చూస్తూ ఉండి ఉండవచ్చు. కొన్నిరోజుల తరువాత పాన దాయకుల అధిపతి తన మనవిని మరిచిపోయి ఉంటాడు అని యోసేపుకు అర్ధమైంది. ఇక తనకు చెరసాల నుండి వెలుపలికి వచ్చే అవకాశం లేదు అని నిరాశ పడి ఉండవచ్చు.

సందేశము
యోసేపు ఎంతో అద్భుతమైన యౌవనస్థుడు. ఎవరూ తెలియని దేశములో చెరసాలలో ఉన్నప్పటికి క్రుంగిపోలేదు గాని అక్కడ ఉన్న వారందరితో మాట్లాడుతూ, వారిని చూసుకుంటూ సంతోషంగా కాలం గడిపాడు. చెరసాలలో ఉన్న అధికారులు ఇద్దరికి వారి వారి కలల భావము వివరించాడు. అతడు తన కష్టం కంటె ఇతరుల అవసరాల పట్ల శ్రద్ధను చూపించాడు. ప్రభువైన యేసు కూడా తాను సిలువపై ఘోరమైన బాధను అనుభవిస్తూ ఉన్నప్పటికి, ప్రక్కనే ఉన్న బందిపోటు దొంగతో, తల్లి అయిన మరియతో, ఎంతో దయగా మాట్లాడాడు (లూకా 23 :43; యోహాను 19:26). తమ సొంత కార్యములను మాత్రమే గాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను అని ఫిలిప్పి 2:4 లో వ్రాయబడిన విధముగా ప్రతి క్రైస్తవ విశ్వాసి ఇతరుల పట్ల శ్రద్ధ కలిగి ఉండాలి. యోసేపు క్రైస్తవులకు చక్కటి మాదిరిగా ఉన్నాడు.

ఉదాహరణ
రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో కొర్రీ టెన్ బూమ్ తన సోదరితో కలిసి హాలెండ్ లో యూదా శరణార్ధులను జర్మనీ (నాజీ) సైనికుల నుండి దాచిపెట్టి కాపాడుతుండేది. కొర్రీ టెన్ బూమ్ ని, ఆమె సోదరిని సైనికులు అరెస్టు చేసి జైలుకు పంపించారు. తమ కుటుంబానికి దూరంగా భయంకరమైన పరిస్థితులలో వారిద్దరూ ఉన్నారు. వారిని ఎప్పుడైనా చంపి వేయవచ్చు అనే పరిస్థితులు ఉండేవి.

కొర్రీ సోదరి అనారోగ్యంతో జైలులో చనిపోయింది.

కాని వారిరువురూ దేవునియందు గొప్ప విశ్వాసము గలవారు. జైలులో ఉన్నప్పుడు అందరికి ధైర్యం చెబుతూ సహాయం చేస్తూ ఉండేవారు. అక్కడ ఖైదీలు అనారోగ్యంతో ఉంటే పరిచర్య చేస్తూ తమ ఆహారాన్ని వారితో పంచుకునేవారు. వారితో బైబిల్ గురించి, దేవుని గురించి మాట్లాడుతూ ఉండేవారు. యోసేపు ఏ విధముగా చెరసాలలో కృంగిపోకుండా, అందరికీ సహాయపడే వాడో అదే విధముగా కొర్రీ, ఆమె సహోదరి కూడా అందరికీ సహాయపడేవారు. వారు దేవుని తెలుసుకున్నారు గనుక త్యాగము కలిగి ఇతరుల పట్ల శ్రద్ధ కలిగి ఉండేవారు.

అన్వయింపు
యోసేపు మనకు మంచి మాదిరిని చూపాడు. మనము ఎన్నో కష్టాలలో ఉండి ఎవరూ మనలను ఆదరించడం లేదు అని అనుకోవచ్చు. స్కూల్ లో ఎవరూ స్నేహితులు లేకపోవచ్చు, స్కూల్ లో మిమ్మల్ని ఏడిపించే వాళ్ళు ఉండవచ్చు, లేదా మీ ఆరోగ్యం బాగా లేక చదవడం చాలా కష్టంగా అనిపించవచ్చు. ఇలాంటి సమస్యలు ఎంతో దుఃఖం కలిగిస్తాయి. మీరు ఏమి చేయలేని పరిస్థితులు మీకు ఎదురై ఉండవచ్చు. యోసేపు వలె మనము కూడా ప్రభువు నందు విశ్వాసముంచి ముందుకు సాగాలి. మన పాపములను క్షమించి మనతో ఉండమని దేవుని అడగాలి. అలా చేస్తే మన కష్టాల గురించి ఎప్పుడూ బాధపడకుండా, ఇతరుల అవసరాలను గుర్తించి యోసేపు వలె సహాయం చేసే మనస్సును దేవుడు మనకు కూడా ఇవ్వగలడు.

కంఠతవాక్యము
మనకు సమయము దొరికిన కొలది అందరి యెడల మేలు చేయుదము (గలతి. 6:10)

ఆక్టివిటీస్ డౌన్లోడ్ PDF