అయితే సెరూయా కుమారుడైన యోవాబు నాకు చేసిన దానిని, ఇశ్రాయేలు సేనాధిపతులగు నేరు కుమారుడైన అబ్నేరు యెతెరు కుమారుడైన అమాశాయను వారిద్దరికి అతడు చేసినదానిని నీవెరుగుదువు; అతడు వారిని చంపి యుద్ధసమయమందైనట్లుగా సమాధానకాలమందు రక్తము చిందించి దానిని తన నడికట్టుమీదను తన పాదరక్షల మీదను పడజేసెను.
నీకు తోచినట్లు అతనికి చేయవచ్చును గాని అతని నెరసిన తలవెండ్రుకలను సమాధికి నెమ్మదిగా దిగనియ్యవద్దు.
యోవాబు అబ్షాలోము పక్షము అవలంబింపక పోయినను అదోనీయాపక్షము అవలంబించి యుండెను గనుక ఈ వర్తమానములు అతనికి రాగా అతడు పారిపోయి యెహోవా గుడారమునకు వచ్చి బలిపీఠపు కొమ్ములను పట్టుకొనెను.
యోవాబు పారిపోయి యెహోవా గుడారమునకు వచ్చి బలిపీఠమునొద్ద నున్నాడను సంగతి రాజగు సొలొమోనునకు వినబడగా సొలొమోను యెహోయాదా కుమారుడైన బెనాయాను పిలిపించి నీవు వెళ్లి వానిమీద పడుమని ఆజ్ఞ ఇచ్చినందున
బెనాయా యెహోవా గుడారమునకు వచ్చి రాజు నిన్ను బయటికి రమ్మని సెలవిచ్చెనని యోవాబుతో చెప్పెను. అతడు అదికాదు, నేనిక్కడనే చచ్చెద ననగా, బెనాయా తిరిగి రాజునొద్దకు వచ్చి యోవాబు తనతో చెప్పిన మాట రాజునకు తెలియజేసెను.
అందుకు రాజు ఇట్లనెను అతడు నీతో చెప్పినట్లుగా చేయుము; అతడు ధారపోసిన నిరపరాధుల రక్తమును నామట్టుకును నా తండ్రి కుటుంబికులమట్టుకును పరిహారము చేయుటకై అతని చంపి పాతిపెట్టుము.
నేరు కుమారుడును ఇశ్రాయేలు వారి సమూహాధిపతియునైన అబ్నేరును, యెతెరు కుమారుడును యూదావారి సేనాధిపతియునైన అమాశాయును అను తన కంటె నీతిపరులును యోగ్యులునగు ఈ ఇద్దరు మనుష్యులమీద పడి యోవాబు నా తండ్రియైన దావీదు ఎరుగకుండ కత్తిచేత వారిని చంపివేసెను గనుక అతడు ధారపోసిన రక్తము యెహోవా అతని తలమీదికే రప్పించును.
మరియు వీరు ప్రాణ దోషమునకు యోవాబును అతని సంతతివారును సదాకాలము ఉత్తరవాదులు గాని, దావీదునకును అతని సంతతికిని అతని కుటుంబికులకును అతని సింహాసనమునకును సమాధానము యెహోవావలన ఎన్నటెన్నటికిని కలిగి యుండును.
కాబట్టి యెహోయాదా కుమారుడైన బెనాయా వచ్చి అతనిమీద పడి అతని చంపగా అతడు అరణ్యమందుండు తన యింటిలో పాతిపెట్టబడెను.